లోక జననీ నమస్తే!
తిరుచానూరు: తిరుచానూరులో కొలువైన లక్ష్మీ స్వరూపిణియైన శ్రీపద్మావతి అమ్మవారి ఆలయంలో శుక్రవారం వరలక్ష్మీవ్రతం వేడుకగా జరిగింది. ప్రతి ఏటా శ్రావణ పూర్ణిమకు ముందుగా వచ్చే శుక్రవారం వరలక్ష్మీ వ్రతాన్ని నోచుకోవడం సంప్రదాయం. పరమశివుడు పార్వతీదేవికి ఉపదేశించిన వరలక్ష్మీ వ్రతాన్ని నోచుకోవడం వల్ల శుభం కలుగుతుందని పురాణాల ద్వారా తెలుస్తోంది. అందులోనూ వరాలు ప్రసాదించే వరప్రదాయిని, సిరులతల్లి లక్ష్మీదేవి స్వరూపిణి, నిండు ముత్తయిదువైన శ్రీవారి ధర్మపత్ని పద్మావతీ అమ్మవారి చెంత వ్రతం నోచుకుంటే సిరిసంపదలు, దీర్ఘసుమంగళి, సత్సాంతానం కలుగుతుందన్నది భక్తుల నమ్మకం.
ఇందులోభాగంగా అమ్మవారిని వేకువజామున 1.30 గంటలకు సుప్రభాతంతో మేల్కొల్పి నిత్యకైంకర్యాలు నిర్వహించారు. 3.30 గంటలకు అమ్మవారి మూలవర్లు, ఉత్సవర్లకు ఆలయ అర్చకులు అభిషేకం నిర్వహించారు. అనంతరం అమ్మవారిని వజ్రవైఢూర్య ఆభరణాలతో అలంకరించి, ఉదయం 8 గంటలకు సన్నిధి నుంచి ఆస్థాన మండపంలోని వ్రతమండపానికి వేంచేపుగా తీసుకొచ్చి కొలువుదీర్చారు.
తరువాత అమ్మవారి ఎదుట కలశాన్ని ఉంచి అందులో నారికేళాన్ని ప్రతిష్టించారు. దానికి చెవులు, కన్ను, ముక్కు ఏర్పాటు చేశారు. అనంతరం పాంచరాత్య్ర ఆగమ శాస్త్రోక్తంగా ఆలయ అర్చకులు కలశంలోకి వరలక్ష్మీని ఆవాహనం చేసి, షోడశోపచార పూజలు నిర్వహించారు. రక్షకట్టిన తరువాత పసుపు, కుంకుమ, పూలతో వ్రతం నిర్వహించి, వ్రత మహత్యాన్ని తెలిపే కథను వినిపించారు. అధిక సంఖ్యలో దంపతులు పాల్గొన్నారు. వరలక్ష్మి వ్రతం సందర్భంగా ఆలయం, పరిసర ప్రాంతాల్లో భక్తుల రద్దీతో ఏర్పడింది.
గత అనుభవాల దృష్ట్యా ఈ ఏడాది ఆస్థాన మండపం వద్ద ప్రత్యేక బారీకేడ్లు ఏర్పాటు చేయడంతో తోపులాటలు జరగలేదు. ఈ కార్యక్రమంలో టీటీడీ చైర్మన్ కనుమూరి బాపిరాజు, ఈవో ఎంజీ.గోపాల్, తిరుపతి జేఈవో పోలా భాస్కర్, ఆలయ స్పెషల్గ్రేడ్ డెప్యూటీ ఈవో భాస్కర్రెడ్డి, ఏఈవో నాగరత్న, సూపరింటెండెట్లు కేపీ.వెంకటరత్నం, వరప్రసాద్ పాల్గొన్నారు.