అంతా రహస్యమే
సాక్షి, చెన్నై: డీఎండీకే అధినేత విజయకాంత్ మంగళవారం మలేషియా వెళ్లారు. ఆయన పర్యటన అత్యంత రహస్యంగా సాగడం చర్చనీయూంశమైంది. దీని వెనుక ఆంతర్యమేమిటోనని పలువురు చెవులు కొరుక్కున్నారు. అయితే తనయుడు షణ్ముగ పాండియన్ శతాబ్దం చిత్రం షూటింగ్ కోసమే ఆయన వెళ్లినట్టు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. రాష్ట్రంలో లోక్సభ ఎన్నికల మంతనాలు వేడెక్కాయి. ఈ నేపథ్యంలో డీఎండీకే అధినేత విజయకాంత్ గతంలో మలేషియాకు చెక్కేశారు. బీజేపీతో కలసి పనిచేయడం లక్ష్యంగా అక్కడున్న తన సన్నిహితులతో మంతనాల నిమిత్తం ఆయన వెళ్లినట్టు అప్పట్లో ప్రచారం సాగింది. అలాగే మలేషియా వేదికగా రాజకీయ పందేరాలు సాగినట్టు తమిళ మీడియా కోడై కూసింది. మలేషియా నుంచి వచ్చీరాగానే బీజేపీతో పొత్తుకు ఆయన జై.. కొట్టడం మీడియా కథనాలకు బలం చేకూరినట్టయింది.
ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్న సమయంలో తన మలేషియా పర్యటనపై సాగుతున్న ప్రచారానికి ముగింపు పలుకుతూ విజయకాంత్ కొన్ని వ్యాఖ్యలు చేశారు. తన కుమారుడి చిత్ర షూటింగ్ నిమిత్తం మలేషియా వెళ్లినట్టు వివరణ ఇచ్చుకున్నారు. తాను ఈ చిత్రంలో కనిపించబోతున్నట్టు ప్రకటించి అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపారు. అదే సమయంలో ఎన్నికల బిజీలో షూటింగ్లు ఏమిటో... అన్న అంశంపై చర్చకూడా సాగింది. ఎన్ని వివరణలు ఇచ్చుకున్నా చివరకు లోక్సభ ఎన్నికల్లో విజయకాంత్ పార్టీ డిపాజిట్లు గల్లంతయ్యాయి. కేంద్రంలో తమ పార్టీకి మంత్రి పదవి దక్కుతుందని ఎదురు చూసినా ఫలితం శూన్యం. చివరకు పార్టీ వర్గాలతో ఓటమిపై సమీక్షలు ముగించడంతోపాటు వలసలు బయలు దేరకుండా ముందు జాగ్రత్త చర్యగా నేతలకు ఉపదేశాలు ఇచ్చిన విజయకాంత్ హఠత్తుగా మంగళవారం మలేషియాకు చెక్కేశారు.
మలేషియా పయనం : తన మలేషియా పర్యటన వివరాల్ని అత్యంత గోప్యంగా విజయకాంత్ ఉంచడం చర్చనీయాంశంగా మారింది. వీఐపీలు వస్తున్న సమయంలో మీనంబాక్కం విమానాశ్రయంలో భద్రతా సిబ్బంది ప్రత్యేక ఏర్పాట్లు చేయడం సహజం. అయితే ఈ సారి అలాంటి ఏర్పాట్లు కూడా లేదు. అలాగే విదేశాలకు వెళ్లే ప్రయాణికులు మూడు గంటలు ముందుగానే విమానాశ్రయం చేరుకోవాల్సి ఉంటుంది. బోర్డింగ్ పాస్ తీసుకున్న అనంతరం అర గంట ముందుగా విమానంలోకి పంపుతారు. ఇందుకు భిన్నంగా విజయకాంత్ అత్యంత రహస్యంగా విమానాశ్రయానికి రావడం గమనార్హం. 11.30 గంటలకు విమానం బయలు దేరాల్సి ఉండగా, సరిగ్గా 11.05కు ఆయన విమానాశ్రయూనికి చేరుకున్నారు. అప్పటికే అక్కడి అధికారులు ఆయనకు బోర్డింగ్ పాస్ సిద్ధం చేయడంతో మీడియా కంట పడకుండా మలేషియాకు చెక్కేశారు. ఆయన వెంట సతీమని ప్రేమలత కూడా వెళ్లారు.
షూటింగ్ నిమిత్తమే: విజయకాంత్ రహస్య పయనం మీడియాల్లో హల్చల్ చేయడంతో డీఎండీకే వర్గాలు మేల్కొన్నాయి. తమ అధినేత విజయకాంత్ కేవలం షూటింగ్ నిమిత్తం మలేషియా వెళ్లారని వివరణ ఇచ్చే పనిలో పడ్డారు. తమ నేత వారసుడు షణ్ముగ పాండియన్ హీరోగా శతాబ్దం పేరుతో సినిమా రూపుదిద్దుకుంటున్న విషయాన్ని గుర్తుచేస్తున్నారు. ఆ చిత్రంలో విజయకాంత్ అతిథి పాత్రలో కనిపించనున్నారని, ఆ చిత్ర షూటింగ్ మలేషియా, కౌలాలంపూర్ల్లో జరగనున్నదని, అందు వల్లే ఆయన విదేశీ పయనాన్ని రహస్యంగా ఉంచుకున్నట్టు చెబుతున్నారు. పది, పదిహేను రోజులు ఈ షూటింగ్ ఉంటుందని, ఆ తర్వాత ఆయన ఇక్కడికి రావొచ్చని వెల్లడించారు.