breaking news
story writing
-
వాట్సప్ జానపదం
‘తోడేలు వచ్చింది’ అని అరిచిన కుర్రాడి కథ మనకు తెలుసు. ఆ అబద్ధం మొదటిసారి ఊరిని నవ్వించింది. రెండోసారి ఊరికి అలవాటు అయ్యింది. మూడోసారి నిజంగానే తోడేలు వచ్చినప్పుడు ఊరు నిద్రపోయింది. గొర్రెలు పోయాయి. కుర్రాడి మాటకు శాశ్వతంగా విలువ పోయింది. అది జానపదం మనకు నేర్పిన మొదటి పాఠం. అబద్ధానికి కాళ్లు ఉండవు. ఉన్నా ఎక్కువ దూరం నడవవు. కానీ, ఈరోజు ఆ కుర్రాడు మనలోని ప్రతిఒక్కరి జేబులో ఉన్నాడు. ప్రతి గ్రూపులో ఉన్నాడు. ప్రతి ఫార్వర్డ్లో ఉన్నాడు. వాట్సాప్ ఇప్పుడు కొత్త జానపద వేదిక అయింది. కానీ ఇక్కడున్నది అమ్మమ్మ చెప్పిన కమ్మని కథ కాదు. ఇది భయం కథ, ద్వేషం కథ, అనుమానం కథ. చదివిన వెంటనే గుండె కొట్టుకునేలా చేసి చివర్లో ‘పదిమందికి పంపు’ అని ఆజ్ఞాపించే బెదిరింపు కథ. ఇది జానపదం కాదు, అబద్ధాల జానపదం.మనం సులభాన్ని ఎంచుకున్నాం. ఫలితంగా మన మెదడు అనే కండరం క్షీణించి పోతోంది. ఏది పడితే అది నమ్మే బలహీనమైన మనస్తత్త్వంగా కుంగిపోతోంది. అబద్ధాలతో భయపడేవాడు ప్రశ్నించడు. ప్రశ్నించనివాడు బానిస అవుతాడు. ఒకప్పటి జానపదం ‘భయపడకు... చివరికి మంచే గెలుస్తుంది’ అని ధైర్యం చెప్పేది. ఈ కొత్త జానపదం ‘భయపడు... నువ్వు ఒంటరివి’ అని విషం ఎక్కిస్తోంది. దీంతోపాటు డిజిటల్ ప్రపంచంలో గుర్తింపు కోసం ఆరాటపడే మానసిక పేదల బెడద ఒకటి. నిజజీవితంలో కనీసం మాట విననివాడు గ్రూపులో అడ్మిన్ కావాలని చూస్తున్నాడు. ‘నేను అందరికంటే ముందు పంపాను’ అనే చిన్న కామెంట్ కోసం ఆత్మను తాకట్టు పెడుతున్నాడు. ఇక్కడ సత్యం కంటే స్పందన (రియాక్షన్) ముఖ్యం అయింది. ఒక అబద్ధం పదివేల లైక్స్ తెస్తే ఒక నిజం పది లైక్స్కు కూడా నోచుకోవడం లేదు. మనం సంఖ్యలకు అలవాటు పడ్డాం. ఆత్మగౌరవాన్ని సోషల్ మీడియా మెట్రిక్స్కు అమ్మేశాం.‘అబద్ధాలకోరుకు శిక్ష ఏమిటంటే అతను నిజం చెప్పినా ఎవరూ నమ్మరు’ అని ఆఫ్రికా సామెత. ఒకసారి నమ్మకం పోతే మళ్లీ తిరిగిరాదు. అదే పడాల్సిన శిక్ష. కానీ శిక్ష అక్కడితో ఆగడం లేదు. ఈ అబద్ధాల జానపదంలో నిత్యమునకలు వేసేవాడి మానసిక ఆరోగ్యం పూర్తిగా దెబ్బతింటోంది. మొదట అనుమానం... తర్వాత కోపం... ఆ తర్వాత వాస్తవానికి క్రమంగా దూరమవుతాడు. ఆపై డాక్టర్ చెప్పినా, సైన్ ్స నిరూపించినా ‘వాట్సాప్లో వేరేగా ఉంది’ అని వాదించే మొండితనం హెచ్చురిల్లుతుంది. రాత్రులు నిద్ర పట్టదు, ఎందుకంటే మెదడు ఎప్పుడూ అలర్ట్ మోడ్లోనే ఉంటుంది. ఆఖరిగా నైతికత మొద్దుబారుతుంది. ‘అందరూ పంపుతున్నారు కదా’ అనే సమాధానం లోపలి గిల్ట్ను చంపేస్తుంది.ఒకప్పటి జానపదం మనల్ని కలిపింది. ఒకే వెన్నెల్లో రాజు కొడుకు, రైతు కొడుకు కూర్చుని ఒకే కథ విన్నారు. ఒకే పాటకు కన్నీరు పెట్టుకున్నారు. అది సమానత్వ వేదిక. కానీ ఈ అబద్ధాల జానపదం మనల్ని చీలుస్తోంది. ఒకే ఇంట్లో తండ్రి ఒక గ్రూపు, కొడుకు ఒక గ్రూపుగా విడిపోతున్నారు. ఇద్దరూ వేర్వేరు అబద్ధాలు నమ్మి పరస్పరం శత్రువులు అవుతున్నారు. ఇంతకంటే పెద్ద మానసిక, సామాజిక పతనం ఇంకేముంటుంది? దీనికి పరిష్కారం వాట్సాప్ను పూర్తిగా చెరిపేయడం కాదు. మన వేలుకు మెదడును అతికించడం. ఒక మెసేజ్ ఫార్వర్డ్ చేయడానికి ముందు మనల్ని మనం ప్రశ్నించుకోవడం. భయం పుట్టించే ప్రచారాలను అక్కడికక్కడే బ్లాక్ చేయడం. లోకంలోని మంచిని స్వయంగా జానపదం చేయడం. మనిషి ఉన్నంత కాలం కథ ఉంటుంది. కథ ఉన్నంత కాలం మనిషి బతుకుతాడు. రాయి నుండి తాళపత్రానికి, తాళపత్రం నుండి పుస్తకానికి, పుస్తకం నుండి స్క్రీన్ కు వచ్చినట్లే... ఇప్పుడు ఆ కథను స్క్రీన్ నుండి మళ్లీ మనిషి గుండెల్లోకి తీసుకెళ్లాల్సిన సమయం వచ్చింది. మనమే కొత్త కథకులం కావాలి. మానవీయ జానపదం రాయాలి. గుర్తుంచుకోండి, మీరు ఫార్వర్డ్ చేస్తున్నది కేవలం ఒక సందేశం కాదు. అది ఒక తరం మనసు, ఒక జాతి భవిష్యత్తు! బటన్ మీ చేతిలోనే ఉంది. కొత్త కథను మీరే రాయాలి! -
నాలోని ప్రపంచాన్ని రాశా!
ఓ తమిళ చిత్రానికి కథ రాస్తున్నట్లు ఇటీవల శ్రుతీహాసన్ చెప్పారు. ఇప్పుడు ఓ మ్యూజిక్ వీడియోను విడుదల చేసే పని మీద ఉన్నారు. నిజానికి ఈ పాటను బ్రిటన్లో ఓ వేదిక మీద ప్రేక్షకులకు వినిపించారు. ఈ పాట రాసింది ఆమే. ‘‘అక్కడి శ్రోతలు పాటను బాగా ఎంజాయ్ చేశారు. ఈ పాటనే కొంచెం కొత్త రకంగా మలచి విడుదల చేయనున్నాను’’ అన్నారు శ్రుతీహాసన్. ఒకవైపు ఈ పనులు చేయడంతో పాటు నటిగా రెండు మూడు సినిమాలతో బిజీగా ఉన్నారామె. అయినప్పటికీ కవితల పుస్తకాన్ని కూడా విడుదల చేయాలనుకుంటున్నారు. ‘‘నా పదో ఏట నుంచే కవితలు రాస్తున్నాను. ఈ మధ్య నా ఫ్రెండ్స్ కొందరు ఆ కవితలన్నింటినీ బుక్ రూపంలో తీసుకురావొచ్చు కదా అన్నారు. ఆ ఐడియా నచ్చింది. ఒక నటిగా నేను బయటి ప్రపంచంలోనే ఎక్కువ టైమ్ గడుపుతుంటాను. కానీ నా లోపలి ప్రపంచం ఒకటి ఉంటుంది కదా. ఆ ప్రపంచం గురించే కవితలు రాశాను’’ అన్నారు శ్రుతీహాసన్. -
సాహిత్యంతో సద్గుణాలు అలవడుతాయి
కేంద్ర సాహిత్య అకాడమీ సంచాలకులు ఆచార్య ఎన్.గోపి సిరిసిల్ల: బాలసాహిత్యంతో పిల్లల్లో సద్గుణాలు అలవడుతాయని, బాలల మనోవికాసానికి సాహిత్యం ఎంతో అవసరమని కేంద్ర సాహిత్య అకాడమీ తెలుగు సలహా మండలి సంచాలకులు ఎన్.గోపి అన్నారు. పఠనాసక్తి తగ్గిపోయిన ఈ రోజుల్లో సాహిత్యంపై పిల్లలకు అవగాహన లేకుండా పోతోందని, ఇలాంటి శిబిరాల ద్వారా పిల్లలకు సాహిత్యంపై ఆసక్తిని పెంచవచ్చని అన్నారు. పద్నాలుగేళ్ల వరకు బాలసాహిత్యంపై పిల్లలకు ఆసక్తిని కలిగిస్తే.. మానవీయ విలువలు, కరుణ, ప్రేమ, క్రమశిక్షణతో కూడిన జీవితాన్ని సాగిస్తారని వివరించారు. బాలసాహిత్యం రాయాలంటే తల్లివంటి ప్రేమ ఉండాలన్నారు. సాహిత్య అకాడమీ యాభై ఏళ్లలో ఆరువందల పుస్తకాలు ముద్రిస్తే.. గత రెండేళ్లలోనే రెండువందల పుస్తకాలు ముద్రించిందన్నారు. సమావేశంలో నేషనల్ బుక్ట్రస్ట్ అసిస్టెంట్ ఎడిటర్ డాక్టర్ పత్తిపాక మోహన్, రంగినేని సుజాత మోహన్రావు ట్రస్ట్ వ్యవస్థాపకుడు రంగినేని మోహన్రావు, ప్రముఖ కవులు జూకంటి జగన్నాథం, డాక్టర్ నలిమెల భాస్కర్, పెద్దింటి అశోక్కుమార్, మద్దికుంట లక్ష్మణ్, బాలసాహితీవేత్తలు వాసాల నర్సయ్య, భూపాల్, చొక్కాపు వెంకటరమణ, కందేపి రాణీప్రసాద్, దాసరి వెంకటరమణ, తిరునగరి వేదాంతసూరి, ఆకేళ్ల వెంకటసుబ్బలక్ష్మీ, పెండెం జగధీశ్వర్, ఎస్.కె.అబ్దుల్ హకీం జాని, పైడిమర్రి రామకృష్ణ, మలయశ్రీ, వి.ఆర్.శర్మ, దార్ల బుజ్జిబాబు, ఎస్.రఘు, పెందోట వెంకటేశ్వర్లు, వాసరవేణి పర్శరాములు, రంగినేని నవీన్, తూడి వెంకట్రావు, గరిపెల్లి అశోక్, డాక్టర్ జనపాల శంకరయ్య తదితరులు పాల్గొన్నారు. -
కొడెక్కైనాల్ లో కథ రాస్తున్న మణిరత్నం
ప్రఖ్యాత దర్శకుడు మణిరత్నం తన తాజా చిత్రానికి కొడెక్కైనాల్లో కథను వండుతున్నారు.కడల్ చిత్రం వరకూ కాస్త ఒడిదుడుకులను ఎదుర్కొన్న ఈ దర్శక రత్నం ఒరు కాదల్ కణ్మణి చిత్రంతో మళ్లీ విజయాల బాట పట్టారు. అయితే ఆ తదుపరి చిత్రానికి పలుమార్లు ప్రయత్నించినా సెట్ కాలేదు. ఒరు కాదల్ కణ్మణి చిత్రం తరువాత మణిరత్నం ఒక భారీ మల్టీస్టారర్ చిత్రానికి సిద్ధమయ్యారు.అయితే అనివార్య కారణాల వల్ల ఆ ప్రయత్నం ఫలించలేదు. అదే కథను కార్తీ,దుల్కర్ సల్మాన్, నిత్యామీనన్లతో చేయాలనుకున్నా అదీ జరగలేదు.ఇక మల్టీస్టారర్ చిత్రం ప్రయత్నాన్ని పక్కన పెట్టి తాజాగా ఫ్రెష్గా కార్తీ, సాయిపల్లవిల కోసం ఒక కథను తయారు చేస్తున్నారు. ఇదీ విభిన్న ప్రేమ కథా చిత్రమేనని తెలిసింది. ప్రస్తుతం కొడెక్కైనాల్లో ఈ కథకు మెరుగులు దిద్దుతున్న మణి మరో పది రోజుల వరకూ అక్కడే మకాం పెట్టి స్క్రిప్ట్ను రెడీ చేసి చెన్నైకి తిరిగిరానున్నట్టు తెలిసింది. తదుపరి చిత్ర సంగీతం,తదిరత ఫ్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలకు ఉపక్రమించనున్నట్లు సమాచారం. దీనికి మణిరత్నం ఆస్థాన సంగీత దర్శకుడు ఏఆర్.రెహ్మాన్ బాణీలు అందించనున్న విషయం తెలిసిందే. నటుడు కార్తీ కూడా తన గురువు మణిరత్నం దర్శకత్వంలో నటించడానికి ఆతృతగా ఎదురుచూస్తున్నట్లు ఇటీవలే అన్నారు.ప్రస్తుతం ఆయన నయనతార, నిత్యామీనన్లతో కలిసి కాష్మోరా చిత్రాన్ని పూర్తి చేసే పనితో ఉన్నారన్నది గమనార్హం. తదుపరి ఆయన నటించేది మణిరత్నం చిత్రంలోనేనన్నమాట. -
కథ రాయడం చాలా కష్టం
అభిప్రాయం కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత, గుండెను తడి చేసే కథలు రాసిన పెద్దిభొట్ల సుబ్బరామయ్య కథ గురించి, కథ రాయడంలోని కష్టం గురించి ‘సాక్షి’తో సంభాషించారు.. కథ రాయాలంటే... కేవలం ఇతరుల రచనలు చదవడమే కాకుండా, లోకజ్ఞానం కోసం అనేక ప్రాంతాలు సందర్శించినప్పుడే మంచి కథలు వస్తాయి. తలుపులు మూసుకు కూర్చుంటే ఉత్తమ కథలు రావు. అనేక జీవితాలను పరిశీలించాలి. ఒక వింతైన మాట, వింతైన దృశ్యం కథ అవుతుంది. అయితే దాన్ని పట్టించుకోవాలి. అది మనసులో బీజంలా నాటుకోవాలి. అప్పుడు అది మనకు తెలియకుండానే మనలో పెరిగిపెరిగి మాను అవుతుంది. అప్రయత్నంగా కథరూపంలా బయటకు వస్తుంది. అయితే, కథ రాసేవారికి బయటి నుంచీ ఏవీ సహకరించవు. రచయిత చూసినవి, రచయిత స్వానుభవం మాత్రమే కథలో ఉంటాయి. కథ రాయడానికి మనిషి మానసికంగా బాధ పడాలి, అనుభూతి చెందాలి. ఉత్తమకథ అంగవైకల్యం లేని శిశువులా బయటకు వస్తుంది. చిన్న కథ పుట్టుక... ‘చిన్న కథ’ గోదావరి, కృష్ణా తీర ప్రాంతాలలో పుట్టి పెరిగింది. అయితే, ఇప్పుడు కోస్తా జిల్లాల నుంచి కథలు రావట్లేదు. రాయలసీమ, తెలంగాణ ప్రాంతాల నుంచి మంచి కథలు వస్తున్నాయి. అక్కడ మనిషికి భూమితో ఇంకా సంబంధం తెగిపోలేదు. భూమి పండితే సంతోషం, ఎండితే దుఃఖం. వారి కథలలో భూమి, మనిషి కథాంశాలు. వీరు కూడా రచించారు... ప్రక్రియలన్నిటిలో కూడా కథానిక ప్రత్యేకమైనది. ఇది పాశ్చాత్య ప్రక్రియ. పాఠకులకు ఒక జీవిత శకలాన్ని చూపించే సాధనం కథ. ఉత్తమ కథానికలో ఒక్క అక్షరం కూడా వృథాపోదు. కథలో సాధారణ మానవుడి జీవితాన్ని సాధారణమైన పద్ధతిలో ఉన్నది ఉన్నట్టు చెప్పొచ్చు. కృష్ణశాస్త్రి, విశ్వనాథ, వేలూరి వంటి పద్యకావ్య రచయితలు సైతం కథానికలు రాశారు. వారు కథను ప్రేమించారు. వాటి గొప్పదనాన్ని గుర్తించారు. ‘ముసురు’ కథ... ఒక శవం పక్కన ఒక తమిళ అమ్మాయి కూర్చున్న దృశ్యం నన్ను ఆకర్షించింది. ఏం జరిగిందని పక్కన వాళ్లను అడిగితే, వారిద్దరూ ప్రేమికులనీ, లేచిపోయి వచ్చారనీ, చిన్న చిన్న పనులు చేసి జీవనం సాగిస్తున్నారనీ, అతడు చనిపోయాడనీ, ఆ అమ్మాయికి మన భాష రాదనీ చెప్పారు. ఆ దృశ్యం చూశాక అంతర్మథన పడ్డాను. అందులో నుంచి వ చ్చిన కథే ‘ముసురు’. ‘ఇంగువ’ గురించి... నా బాల్యమిత్రుడు ‘ఇంగువ అంటే ఏంటి?’ అని అడిగాడు. ఆ తరవాత కొన్నాళ్లకి చనిపోయాడు. ఇంతకీ అతడు ఈ విషయం తెలుసుకుని పోయాడా, తెలుసుకోకుండా పోయాడా అనుకున్నాను. జీవితంలో తెలుసుకునేవి తక్కువ, తెలియని విషయాలు ఎక్కువ. ఆ ఆలోచన నుంచి పుట్టిందే ‘ఇంగువ’ కథ. ఇలా ఎన్నో కథలు నేను ఎన్నో జీవితాలను పరిశీలించి రాసినవే. పినాకిని ఎక్స్ప్రెస్లో రైలు తుడవ డానికి ఎక్కే నలుగురు కుర్రాళ్ల జీవితాల మీద నాలుగు కథలు రాశాను. వారిలోనూ అద్భుతమైన జీవితం ఉంటుంది. వాళ్లకి ఆ స్టేషనే జన్మస్థలం, పడక, పక్క అన్నీ! వాళ్లు అక్కడ నుంచి బయటకు వెళ్లలేకపోతారు. వెళ్లాలంటే భయం. విమర్శలు... చాలామంది నా కథలు ఏడుపు కథలన్నారు. కరుణ అనేది సున్నితమైన సూత్రం. అది తెగితే జుగుప్స. నేను అచ్చంగా చూసిన జీవితాన్ని చూసినట్టు రాశాను. అలాగే, మనిషిలో అసంతృప్తి అనే లక్షణం ఉంటుంది. ఆ అసంతృప్తే నా కథలకు ప్రధాన వస్తువు. సరిగ్గా పరిశీలించి అర్థం చేసుకునేవారికి, మన చుట్టూ ఉన్నవన్నీ కథా వస్తువులే. అయితే, కథలు చదవడానికి కూడా ఒక కల్చర్ ఉండాలి. ఇంకించుకునేవారు ఉత్తమ పాఠకులు. - డా. పురాణపండ వైజయంతి సాక్షి ఫీచర్స్ ప్రతినిధి, విజయవాడ ఫొటో: వీరభగవాన్ తెలగరెడ్డి


