State Cabinet expansion
-
ఉగాదికి అటు ఇటుగా!
సాక్షి, న్యూఢిల్లీ: ఎన్నో నెలలుగా ఊరిస్తున్న రాష్ట్ర మంత్రివర్గ విస్తరణకు సమయం సమీపించింది. ఉగాదికి కొంచెం అటు ఇటుగా కొత్త మంత్రులతో ప్రమాణ స్వీకారం చేయించాలని కాంగ్రెస్ అధిష్టానం, రాష్ట్ర పెద్దలు నిర్ణయించినట్లు సమాచారం. అయితే ఎంతమందికి అవకాశం దక్కుతుందన్న దానిపై మాత్రం ఇంకా స్పష్టత రాలేదు. నలుగురా? లేక ఐదుగురా? అన్నది తేలాల్సి ఉంది. ఏఐసీసీ వర్గాలు, రాష్ట్ర నేతలు అందిస్తున్న సమాచారం మేరకు.. సీనియర్ నేతలు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, గడ్డం వివేక్, వాకిటి శ్రీహరి పేర్లు ఖరారైనట్లు తెలుస్తుండగా, మిగతా పేర్లపై నేడో, రేపో స్పష్టత వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. విస్తృత చర్చలు..అనేక కోణాల్లో పరిశీలన ప్రస్తుతం ఆరు కేబినెట్ స్థానాలు ఖాళీ ఉండగా, వీటి భర్తీపై గత కొన్ని నెలలుగా విస్తృత కసరత్తు జరిగింది. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, సీనియర్ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్ గౌడ్లు పలుమార్లు హైకమాండ్తో చర్చలు జరిపినా వివిధ కారణాలతో వాయిదా పడుతూ వస్తోంది. అయితే ప్రస్తుతం కీలకమైన కులగణన పూర్తికావడం, దానికి చట్టబద్ధత కల్పించే బిల్లుతో పాటు ఎస్సీ వర్గీకరణ బిల్లు ఆమోదం పొందడం, మరికొద్ది రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాల్సి ఉన్న నేపథ్యంలో మంత్రివర్గ విస్తరణపై అధిష్టానం దృష్టి సారించింది. ఈ నేపథ్యంలో సోమవారం ఢిల్లీకి వచ్చిన రేవంత్, భట్టి, ఉత్తమ్, మహేశ్గౌడ్లు పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్గాందీ, పార్టీ సంస్థాగత వ్యవహారాల ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్లతో ఇందిరా భవన్లో భేటీ అయ్యారు. సుమారు గంటన్నర పాటు జరిగిన చర్చల్లో జిల్లాల ప్రాతినిధ్యం, సామాజిక వర్గాలు, పారీ్టలో పనిచేసిన అనుభవం, సీనియార్టీ ఆధారంగా కొత్త మంత్రుల ఎంపికపై చర్చించినట్లు తెలిసింది. పార్టీ బీ–ఫామ్ల మీద గెలిచిన ఎమ్మెల్యేలకే మంత్రివర్గంలో చోటు కల్పించాలని, కాంగ్రెస్లో చేరిన ఇతర పారీ్టల ఎమ్మెల్యేలకు అవకాశం ఇవ్వరాదని అధిష్టానం నిర్ణయించినట్లు తెలిసింది. దీంతో బీఆర్ఎస్ నుంచి వచ్చిన నేతలెవరికీ పదవులు దక్కే అవకాశం లేదని పారీ్టవర్గాలు చెబుతున్నాయి. గుర్తించిన నేతలపై విస్తృత చర్చ సోమవారం నాటి భేటీలో మంత్రివర్గంలోకి తీసుకునేందుకు ఇదివరకే గుర్తించిన పేర్లపై మరోమారు చర్చించారు. ఇందులో మహబూబ్నగర్ జిల్లా నుంచి వాకిటి శ్రీహరి, నిజామాబాద్ జిల్లా నుంచి పి.సుదర్శన్రెడ్డి, నల్లగొండ జిల్లా నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి, బాలూనాయక్, రంగారెడ్డి జిల్లా నుంచి మల్రెడ్డి రంగారెడ్డి, టి.రామ్మోహన్ రెడ్డి, ఆదిలాబాద్ జిల్లా నుంచి ప్రేమ్సాగర్రావు, వివేక్, కరీంనగర్ జిల్లా నుంచి ఆది శ్రీనివాస్, మైనార్టీ కోటాలో షబ్బీర్ అలీ, ఆమేర్ అలీఖాన్ల పేర్లు ఉన్నాయి. అలాగే మహిళా కోటాలో ఎమ్మెల్సీ విజయశాంతి పేరును కూడా పరిశీలించినట్టు సమాచారం. ఆమెను ఎమ్మెల్సీగా ప్రకటించినప్పుడే కేబినెట్లోకి కూడా తీసుకుంటారనే ప్రచారం జరిగింది. నిజామాబాద్ జిల్లా నుంచి ప్రాతినిధ్యం లేనందున సుదర్శన్రెడ్డికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెబుతున్నారు. ప్రేమ్సాగర్ వైపు భట్టి మొగ్గు వెలమ సామాజిక వర్గం నుంచి మంత్రి పదవికి పోటీ ఎక్కువగా ఉంది. ఈ సామాజిక వర్గం నుంచి ముగ్గురు ఎమ్మెల్యేలు ప్రేమ్సాగర్ రావు, మదన్మోహన్, మైనంపల్లి రోహిత్తో పాటు ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ల మధ్య పోటీ నెలకొంది. అయితే ఈ సామాజిక వర్గం నుంచి ఇప్పటికే జూపల్లి కష్ణారావు ఉన్నందున మరొకరికి అవకాశం ఇవ్వాలా? లేదా? అన్న దానిపై చర్చలు జరుగుతున్నాయి. ప్రేమ్సాగర్రావుకు అవకాశం ఇవ్వాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సూచించినట్టు తెలిసింది. మదన్మోహన్కు పార్టీ పెద్దలు, రోహిత్కు సీఎం ఆశీస్సులు! మదన్మోహన్ పార్టీ పెద్దల నుంచి ఒత్తిళ్లు తెస్తుండగా, రోహిత్కు ముఖ్యమంత్రి మద్దతిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక బీఆర్ఎస్ నుంచి పారీ్టలో చేరిన ఎమ్మెల్యేలు దానం నాగేందర్, పోచారం శ్రీనివాస్రెడ్డి, తెల్లం వెంకట్రావ్, కాలె యాదయ్య, సంజయ్కుమార్లలో ఒకరికి మంత్రి పదవి ఇవ్వాలనే డిమాండ్ ఉన్నా, తాజా నిర్ణయం నేపథ్యంలో వారికి అవకాశం లేదని తెలిసింది. నల్లగొండ జిల్లా నుంచి ఇప్పటికే ఎస్టీ (లంబాడా) కోటాలో శంకర్నాయక్ను ఎమ్మెల్సీగా చేసినందున, బాలూనాయక్ను కేబినెట్లోకి తీసుకోకుండా డిప్యూటీ స్పీకర్గా చేయాలన్న ప్రతిపాదనలపై చర్చలు జరిగాయి. త్వరలో కార్యవర్గం! పీసీసీ కార్యవర్గ ప్రకటన కూడా త్వరలో వెలువడే అవకాశం ఉంది. ఏఐసీసీ పెద్దలతో భేటీలో ఈ అంశం కూడా చర్చకు రాగా ముందుగా నలుగురు వర్కింగ్ ప్రెసిడెంట్లు, 20 మందికి పైగా వైస్ ప్రెసిడెంట్లను ప్రకటించేందుకు నిర్ణయం జరిగినట్లు తెలిసింది. కొన్ని నామినేటెడ్ పోస్టుల భర్తీపై సైతం చర్చించినట్లు చెబుతున్నారు. అలాగూ కులగణనపై ప్రజలు ఎలాంటి అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు? ఎస్సీ వర్గీకరణపై ఏమనుకుంటున్నారు? స్థానిక సంస్థల ఎన్నికల్లో వీటి ప్రభావం ఎంతవరకు ఉంటుందనే అంశాలపై కూడా చర్చించినట్లు తెలుస్తోంది. మంత్రుల శాఖల్లో మార్పులు?కొత్తగా నలుగురిని లేక ఐదుగురిని మంత్రివర్గంలోకి తీసుకుంటే ముఖ్యమంత్రి వద్ద ఉన్న ఏయే శాఖలు వారికి కేటాయించాలి, కొంతమంది మంత్రుల శాఖల్లో మార్పులు చేయాలా? కొందరికి కీలక శాఖలు అప్పగించాలా? అన్న దానిపైనా చర్చ జరిగింది. ముఖ్యమంత్రి వద్ద ఉన్న మున్సిపల్, హోం, విద్యా శాఖలను సీనియర్ మంత్రులకు ఇవ్వాలన్న చర్చ జరిగింది. ఈ నేపథ్యంలో పాత మంత్రుల శాఖలు కొన్ని మార్చే అవకాశం ఉందని ఏఐసీసీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. -
ముహూర్తం ఖరారు
జలగంకు సహాయ మంత్రి హోదాతో పార్లమెంటరీ సెక్రటరీ పదవి కేబినెట్లో కీలకం కానున్న ఖమ్మం పార్టీ శ్రేణుల్లో హర్షాతిరేకాలు మంత్రివర్గంలో టీఆర్ఎస్ నేత తుమ్మలకు చాన్స్ సాక్షి ప్రతినిధి, ఖమ్మం: ఆరు నెలల పాటు ఎదురుచూసిన జిల్లా ప్రజల కల ఎట్టకేలకు సాకారం కానుంది. రాష్ట్ర మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం ఖరారు కావడంతో మంత్రివర్గంలో జిల్లాకు స్థానం లభించడం ఖాయమైంది. అధికార పార్టీ శ్రేణులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న మంత్రివర్గ విస్తరణకు ముఖ్యమంత్రి కేసీఆర్ పచ్చజెండా ఊపారు. దీంతో ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గంలో ప్రాతినిధ్యానికి నోచుకోని జిల్లాల్లో ఒకటైన ఖమ్మానికి ఆలోటు తీరనుంది. జిల్లానుంచి మాజీమంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు మంత్రివర్గంలో అవకాశం దక్కడం దాదాపు ఖాయమైంది. అలాగే టీఆర్ఎస్ నుంచి కొత్తగూడెం ఎమ్మెల్యేగా గెలిచిన జలగం వెంకట్రావుకు సైతం సహాయ మంత్రి హోదా కలిగిన పార్లమెంటరీ కార్యదర్శి పదవి ఖరారైంది. ఇక అధికారికంగా ప్రకటించడమే తరువాయి అని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి జిల్లాకు మంత్రి వర్గంలో స్థానం లేకపోవడంతో పాలనా పరంగా, పార్టీ పరంగా కొంత నిస్తేజం అలుముకుంది. అయితే ఈ మూడు నెలల్లోనే జిల్లాలో అనూహ్య రాజకీయ పరిణామాలు సంభవించి వివిధ పార్టీలకు చెందిన పలువురు ప్రముఖులు టీఆర్ఎస్లో చేరారు. టీడీపీలో అగ్రనేతగా ఉన్న తుమ్మల నాగేశ్వరరావుకు కేసీఆర్తో ఉన్న సాన్నిహిత్యంతో గత సెప్టెంబర్లో తన అనుచరులతో టీఆర్ఎస్లోకి వెళ్లారు. అప్పటి నుంచి ఆయనకు మంత్రివర్గంలో ప్రాతినిధ్యం లభిస్తుందనే ప్రచారం జోరందుకుంది. కేసీఆర్ అదృష్ట సంఖ్యలుగా భావించే 6, 15, 24 తేదీల్లో మంత్రివర్గ విస్తరణ ఉంటుందని టీఆర్ఎస్ శ్రేణులు ప్రతినెలా ఎదురుచూశాయి. మంత్రివర్గంలో ఒక్కరికే ప్రాతినిధ్యం లభిస్తుందని మొదటి నుంచి అనుకుంటున్నా అనూహ్యంగా సహాయ మంత్రి హోదా కలిగిన మరో పదవిని సైతం కొత్తగూడెం ఎమ్మెల్యే వెంకట్రావుకు కేటాయిస్తుండటంతో తెలంగాణ ప్రభుత్వంలో జిల్లాకు అత్యధిక ప్రాధాన్యం ఇచ్చినట్లు రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. కేసీఆర్ రాష్ట్రస్థాయిలో పరిమితంగా భర్తీ చేసిన కార్పొరేషన్ చైర్మన్ పదవుల్లోనూ మన జిల్లాకు చెందిన విద్యార్థి ఉద్యమ నేత, గార్ల నివాసి పిడమర్తి రవికి ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పదవిని అప్పగించి జిల్లాకు తాను ఇచ్చే ప్రాధాన్యతను చాటి చెప్పారని టీఆర్ఎస్ శ్రేణులు అభిప్రాయపడుతున్నాయి. అయితే తుమ్మలకు కీలక బాధ్యతలు అప్పగిస్తారనే ప్రచారం కూడా జరుగుతోంది. 1978లో అప్పటి సీఎం మర్రి చెన్నారెడ్డి ఇద్దరికి సహాయ మంత్రి హోదా కలిగిన కేబినెట్ కార్యదర్శి పదవులను అప్పగించారు. ఆ తర్వాత అలాంటి సంప్రదాయం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఏ ప్రభుత్వంలోనూ కొనసాగలేదు. మళ్లీ కేసీఆర్ పార్లమెంటరీ సెక్రటరీ పదవులను అప్పగించడంతో 36 సంవత్సరాల తర్వాత రాష్ట్రానికి సహాయ మంత్రుల హోదా కలిగిన ఈ పదవులు రానున్నాయి. ఇందులో ఒకటి జలగం వెంకట్రావును వరిస్తుండటంతో పార్టీ శ్రేణుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఈనెల 16న జరగనున్న మంత్రివర్గ విస్తరణలో తుమ్మల మంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారన్న ఆనందంతో ఆ క్షణం కోసం ఎదురు చూస్తున్న ఆయన అనుచరులు, పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున రాజధానికి తరలి వెళ్లేందుకు ఏర్పాట్లు చేస్తున్నాయి. సుదీర్ఘ కాలంగా జిల్లా రాజకీయాల్లో చక్రం తిప్పిన నేతగా పేరున్న తుమ్మల నాగేశ్వరరావుకు తెలంగాణ మంత్రి వర్గంలో కీలకశాఖ వరించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఆయనకు హోం, ఆర్అండ్బీ, విద్యుత్ వంటి కీలక శాఖలను అప్పగించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు ఆనంద పడుతున్నాయి. 1983లో సత్తుపల్లి నియోజకవర్గం నుంచి టీడీపీ తరుపున ఎమ్మెల్యేగా పోటీ చేయడం ద్వారా క్రియాశీలక రాజకీయాల్లోకి వచ్చిన తుమ్మల 1985లో తొలిసారిగా సత్తుపల్లి ఎమ్మెల్యేగా గెలిచి అప్పటి ఉమ్మడి రాష్ట్రంలో ఎన్టి రామారావు మంత్రివర్గంలో చిన్ననీటి పారుదలశాఖా మంత్రిగా తొలి బాధ్యతలు నెరవేర్చారు. కొంతకాలం వరంగల్ రీజియన్ ఆర్టీసీ చైర్మన్గా సైతం పనిచేశారు. 1989లో ఓటమి చవిచూసిన తుమ్మల 94, 99లో తిరిగి సత్తుపల్లి నుంచే ఎమ్మెల్యేగా విజయం సాధించి అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు మంత్రివర్గంలోనూ కీలకమైన భారీ నీటిపారుదల, రహదారులు భవనాలు, ఎక్సైజ్ వంటి శాఖలు నిర్వహించారు. 2009లో నియోజకవర్గాల పునర్ వ్యవస్థీకరణలో భాగంగా ఖమ్మం అసెంబ్లీ స్థానం నుంచి టీడీపీ తరుపున పోటీ చేసిన తుమ్మల అప్పుడు కాంగ్రెస్ రెబల్ అభ్యర్థిగా పోటీ చేసిన జలగం వెంకట్రావుపై విజయం సాధించారు. దాదాపు 10 సంవత్సరాల తర్వాత తుమ్మల మళ్లీ మంత్రి అవుతున్నారు. తుమ్మలకు మంత్రివర్గంలో స్థానం లభించడం, జలగం వెంకట్రావుకు సహాయమంత్రి హోదా కలిగిన పదవి లభిస్తుండటంతో జిల్లా రాజకీయాలు మరింత వేగవంతమైన పరిణామాలు చోటుచేసుకునే అవకాశం కనపడుతోంది. 2004లో రాజకీయ అరంగేట్రం చేసిన జలగం వెంకట్రావు సత్తుపల్లి నియోజకవర్గంలో కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి మాజీమంత్రి తుమ్మలపై విజయం సాధించారు. అనంతరం 2009లో కాంగ్రెస్ టికెట్ రాకపోవడంతో ఖమ్మం నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అనంతరం 2014లో టీఆర్ఎస్లో చేరి కొత్తగూడెం నియోజకవర్గ ఎమ్మెల్యేగా గెలుపొందారు. అయితే అనంతర పరిణామాలతో కాంగ్రెస్ నుంచి గెలిచిన ఇల్లెందు శాసనసభ్యుడు కోరం కనకయ్య, వైఎస్సార్సీపీ నుంచి గెలిచిన వైరా ఎమ్మెల్యే బానోతు మదన్లాల్ టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకోవడంతో ఆ పార్టీ శాసనసభ్యుల సంఖ్య మూడుకు చేరింది. జిల్లాలో ఇప్పటి వరకు రాజకీయంగా అధికార పార్టీలో నెలకొన్న కొంత స్తబ్ధత మంత్రివర్గ విస్తరణ అనంతరం తొలగనుంది. అలాగే పాలనా వ్యవహారాల్లోనూ జిల్లాకు అధికార పార్టీ ముద్ర పెద్దగా కనిపించకపోవడంతో తెలంగాణ ఉద్యమంలో కష్టించి పనిచేసిన వారిలో, టీఆర్ఎస్ శ్రేణుల్లో నిరుత్సాహం నెలకొంది. ఇప్పుడు కేబినెట్లో చోటు లభించడం ఖాయం కావడంతో అభివృద్ధి పరంగా జిల్లా రూపురేఖలు మారనున్నాయని పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి.