breaking news
Star Wars
-
ఈసారి ‘జెడి’ ట్రంప్!
వాషింగ్టన్: ‘స్టార్వార్స్ డే’ సందర్భంగా కృత్రిమ మేధతో రూపొందించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో ఫొటోను అధ్యక్ష భవనం ఆదివారం విడుదల చేసింది. ఈసారి, హాలీవుడ్ సినిమా ‘స్టార్ వార్స్ యూనివర్స్’లోని కండలు తిరిగిన ‘జెడి’ అవతారంలో ట్రంప్ దర్శనమిచ్చారు. రెండు రోజుల క్రితమే దివంగత పోప్ ఫ్రాన్సిస్ ఫొటోతో కనిపించిన ట్రంప్పై ఆన్లైన్లో తీవ్ర విమర్శలు వ్యక్తమవడం తెల్సిందే. తాజాగా, జెడి ఫొటోను సైతం జనం వదల్లేదు. చౌకబారు రాజకీయ ప్రచారంగా ఎత్తిపొడిచారు. ఆ సినిమాలో శత్రువుల దగ్గర మాత్రమే ఉండే ఎర్ర లైట్ సాబెర్ను ట్రంప్ పట్టుకోవడాన్ని తప్పుబట్టారు. గద్దలు, అమెరికా జెండాలు వెనుక కనిపిస్తుండగా జెడి వేషధారణతో కండలు తిరిగిన దేహంతో ట్రంప్ కనిస్తున్న ఫొటోను వైట్హౌస్ సోషల్ మీడియా వేదికపై షేర్ చేసింది. -
శత్రు దేశాల ఉపగ్రహాల పాలిట డెత్స్టార్.. ‘స్టార్ వార్స్’తరహాలో సూపర్ వెపన్!
హాలీవుడ్ సైన్స్ ఫిక్షన్ ఫ్రాంచైజీ ‘స్టార్ వార్స్’చూశారా? అందులో సూపర్ వెపన్ అయిన ‘డెత్ స్టార్’ అనే అంతరిక్ష కేంద్రం భారీ లేజర్ కిరణాలతో ఏకంగాగ్రహాలనే నామరూపాల్లేకుండా చేయడం గుర్తుందా? అచ్చం అలాగే అంతరిక్షంలోని శత్రు దేశాల ఉపగ్రహాలను నిర్వీర్యం చేసే నిజమైన ‘డెత్ స్టార్’ను చైనా శాస్త్రవేత్తలు రూపొందించారు! ఈ దిశగా ప్రయోగాలను కూడా విజయవంతంగా పూర్తిచేశారు!! ఈ అత్యాధునిక ఆయుధానికి సంబంధించిన వివరాలను అత్యంత గోప్యంగా ఉంచినప్పటికీ అంతరిక్షంలో ఉపయోగించేందుకే ఈ తరహా ఆయుధాల అభివృద్ధి జరుగుతున్నట్లుపలు చైనా జర్నల్స్ చెబుతున్నాయి.ఇంతకీ దాన్ని ఎలా రూపొందించారు..అందులో వాడే టెక్నాలజీ ఏమిటి?ఎలా పనిచేస్తుందంటే..సౌత్ చైనా మారి్నంగ్ పోస్ట్ కథనం ప్రకారం ఈ సూపర్ వెపన్.. మైక్రోవేవ్ ఎనర్జీ (ఒక రకమైన ఎలక్ట్రోమ్యాగ్నెటిక్ రేడియేషన్)ని ప్రసరించే ఏడు ‘యంత్రాలను’ ఉపయోగిస్తుంది. అంతరిక్షంలో దూరదూరంగా ఉండే ఈ ఏడు యంత్రాలు ఫైబర్ ఆప్టిక్స్ ద్వారా అనుసంధానమై ఉంఆయి. ఒక్కో యంత్రం ఒకే ఒక్క శక్తివంతమైన ఎలక్ట్రో మ్యాగ్నెటిక్వేవ్ను శత్రు లక్ష్యంపై విడుదల చేస్తుంది. ఇలా ఏడు యంత్రాల నుంచి ఏకకాలంలో ఏడు తరంగాలు విడుదలై నిర్దేశిత లక్ష్యాన్ని నాశనం చేస్తాయి. అయితే ఇలా ఏకకాలంలో లక్ష్యాన్ని ఢీకొట్టాలంటే ఆ యంత్రాల నుంచి తరంగాలు కచ్చితంగా ఒకే సమయానికి విడుదల కావాలి.ఎంత కచ్చితత్వంతో అంటే అవి ఒక సెకనులో 170 లక్షల కోట్లవ వంతు కాలంలో విడుదల కావాలన్నమాట!! ప్రస్తుతం అత్యాధునిక జీపీఎస్ శాటిలైట్లలోని అటామిక్ గడియారాలు కొన్ని వందల కోట్ల ఏళ్లలో ఒకే ఒక్క సెకనును మాత్రమే మిస్ అవుతున్నాయి. వాటికన్నా ఎన్నో రెట్ల కచ్చితమైన కాలాన్ని లెక్కించడం అసాధ్యమని ఇప్పటివరకు భావిస్తుండగా చైనా శాస్త్రవేత్తలు ఈ అడ్డంకిని కూడా అధిగమించారు. గతేడాదే వారు సుమారు 1,800 కిలోమీటర్ల పరిధి నుంచి ఒక సెకనులో 10 లక్షల కోట్లవ వంతు కాలానికి సమానమైన కచ్చితత్వాన్ని సాధించారు. నిర్దేశిత లక్ష్యంలోని ఒకే భాగాన్ని ఎలక్ట్రోమ్యాగ్నెటిక్ రేడియేషన్ తాకేందుకు ఈ ఆయుధంలో లేజర్ పొజిషనింగ్ పరికరాలు కూడా ఉన్నాయి. లక్ష్యం ఉన్న దూరం, దాన్ని ఢీకొట్టేందుకు అవసరమైన కచ్చితత్వంతో కూడిన సమయాన్ని లెక్కించాక మొబైల్ కమాండ్ సెంటర్ నుంచి దాడి చేయాలని సంకేతం పంపగానే ఆయుధంలోని యంత్రాలు వాటి పని కానిస్తాయి. కేవలం ఒక గిగావాట్ శక్తిని విడుదల చేసే సామర్థ్యంగల ఒక ఆయుధం ద్వారా భూమికి సమీపంలోని ఉపగ్రహాలను నాశనం చేయడం సాధ్యమవుతుందని ఇప్పటికే పలు అధ్యయనాలు తేల్చాయి.కమ్యూనికేషన్ నిర్వీర్యమే ఉద్దేశంమైక్రోవేవ్ ఆయుధాలు నిర్దేశిత లక్ష్యాలను పేల్చేసే బదులు శక్తివంతమైన ఎలక్ట్రోమ్యాగ్నెటిక్ రేడియేషన్ను విడుదల చేయడం ద్వారా ఆయా లక్ష్యాల్లో ఉండే ఎలక్ట్రికల్/ఎలక్ట్రానిక్ సర్క్యూట్లను దెబ్బతీస్తాయి. దీంతో ఉపగ్రహాల వంటి సమాచార వ్యవస్థల్లో గ్రౌండ్ సెంటర్లతో కమ్యూనికేషన్ నిలిచిపోతుంది. డ్రోన్ల వంటి చిన్న లక్ష్యాలపై ఈ తరహా ఆయుధాలు సమర్థంగా పనిచేసినట్లు ఇప్పటికే పలు ప్రయోగాల్లో తేలింది. అమెరికా ఎయిర్ఫోర్స్ రీసెర్చ్ ల్యాబ్ అభివృద్ధి చేసిన థోర్ (ద టాక్టికల్ హైపవర్ ఆపరేషనల్ రెస్పాండర్) కొన్ని వందల డ్రోన్లను ఏకకాలంలో నిరీ్వర్యం చేయగలదు. అగ్రరాజ్యం గత నెలలోనే రష్యా లేదా చైనా శాటిలైట్ సిగ్నళ్లను నిలువరించగల మెడోలాండ్స్ అనే జామర్ ఆయుధాన్ని సమకూర్చుకుంది. మరోవైపు యూకే సైతం డ్రాగన్ఫ్లై లేజర్ వెపన్ను అభివృద్ధి చేసింది. గాల్లో ఎగిరే డ్రోన్లను కూల్చేసే సామర్థ్యాన్ని దీనికి ఉంది. అలాగే ఏకంగా 1.5 కి.మీ. దూరం నుంచే ఒక నాణెం సైజులో ఉండే లక్ష్యాన్ని కూడా కచ్చితత్వంతో దాడి చేయగల సామర్థ్యం దీని సొంతం.- సాక్షి సెంట్రల్ డెస్క్ -
అంతరిక్షం నుంచి ఐక్యతా గీతం
అంతరిక్షంలో తొలి ప్రైవేట్ స్పేస్ వాక్ చేసిన వ్యోమగాముల్లో ఒకరిగా చరిత్ర సృష్టించిన స్పేస్ ఎక్స్ ఇంజనీర్ సారా గిలిస్ మరో ఘనతను సొంతం చేసుకున్నారు. సూపర్హిట్ హాలీవుడ్ సినిమా ‘స్టార్వార్స్: ద ఫోర్సెస్ అవేకెన్స్’లోని ప్రఖ్యాత ‘రేస్ థీమ్’ను అంతరిక్షం నుంచే పర్ఫామ్ చేసి అందరినీ మంత్రముగ్ధులను చేశారు. పొలారిస్ డాన్ ప్రైవేట్ ప్రాజెక్టులో భాగంగా ఐఎస్ఎస్కు ప్రయాణించిన స్పేస్ ఎక్స్కు చెందిన డ్రాగన్ వ్యోమనౌక నుంచే ఆమె ఈ మ్యూజికల్ ట్రిబ్యూట్లో పాల్గొన్నారు. సోలో వయోలిన్ను సారా వాయించగా పూర్తిస్థాయి ఆర్కెస్ట్రా బృందం భూమి నుంచి ఆమెకు వాద్య సహకారం అందించింది. ఇందుకు సంబంధించిన వీడియోను ‘హార్మనీ ఆఫ్ రెసీలియన్స్’ పేరిట పొలారిస్ ప్రోగ్రాం బృందం శుక్రవారం ఎక్స్లో పోస్ట్ చేసింది. ‘‘విశ్వభాష అయిన సంగీతమే ఈ వీడియోకు స్ఫూర్తి. అలాగే బాలల్లో క్యాన్సర్ తదితర మహమ్మారులపై పోరాటం కూడా. చుక్కలనంటే ఉన్నత ఆశయాలను నిర్దేశించుకునేలా తర్వాతి తరాన్ని ప్రేరేపించడమే దీని ఉద్దేశం’’ అంటూ ఆ పోస్ట్లో పేర్కొంది. ‘అందమైన మన పుడమి చుట్టూ చక్కర్లు కొడుతున్న ఈ ఆనంద క్షణాలను సంగీతమయంగా మార్చి మీ అందరితో పంచుకునేందుకు చేసిన ఓ చిన్న ప్రయత్నమిది’ అంటూ సారా గొంతుతో వీడియో ముగుస్తుంది. ‘‘మానవాళి ఐక్యతకు, మెరుగైన ప్రపంచపు ఆకాంక్షలకు ఈ ప్రయత్నం ఓ ప్రతీక. బాలల్లో నిబిడీకృతమై ఉండే అనంతమైన ప్రతిభా పాటవాలకు ఇది అంకితం’’ అని సారా పేర్కొన్నారు. పొలారిస్ డాన్ మిషన్ కమాండర్ జరేద్ ఐజాక్మ్యాన్తో పాటు సారా గురువారం స్పేస్ వాక్ చేయడం తెలిసిందే. ఈ ఘనత సాధించిన తొలి నాన్ ప్రొఫెషనల్ వ్యోమగాములుగా వారు నిలిచారు. ఈ వీడియో తయారీలో సెయింట్ జూడ్ చి్రల్డన్స్ రీసెర్చ్ హాస్పిటల్ కూడా పాలుపంచుకుంది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
రామ్ చరణ్ - అల్లు అర్జున్ మధ్య స్టార్ వార్
-
గుట్టలెక్కగలదు.. ఈ హ్యుందాయ్ మెట్లనెక్కగలదు..
పక్కన చిత్రం చూస్తుంటే... స్టార్వార్స్లో వాకింగ్ కార్ (ఆల్ టెరైన్ ఆర్మర్డ్ ట్రాన్స్పోర్ట్) నేరుగా నడిచొస్తున్నట్టు ఉంది కదూ. ఇది అలాంటి కారే.. కానీ నిజమైనది. దీనిని తయారు చేయడానికి సిద్ధమవుతోంది ప్రముఖ కార్ల కంపెనీ హ్యుందాయ్. స్టార్వార్స్లో సెల్యులాయిడ్పై కనిపించిన నడిచేకారును నేలమీదకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తోంది. 2019లో కన్జూమర్ ఎలక్ట్రానిక్స్ షోలో ఆ కారు డిజైన్స్ను ప్రదర్శించిన ఆ సంస్థ... తయారీకోసం దాదాపు రూ.154 కోట్లతో మోంటానాలో అభివృద్ధి కేంద్రం (న్యూ హారిజాన్ స్టూడియో)ని ఇటీవలే ఏర్పాటు చేసింది. ఆ కారు ప్రత్యేకత ఏంటంటే.. ఎలాంటి ఉపరితలం మీదైనా ఇట్టే ప్రయాణించగలదు. మెట్లను సులభంగా ఎక్కగలిగే ఈ కారును ట్యాక్సీలా వాడితే.. వీల్చైర్ ఉపయోగించే వారు సులభంగా ట్రావెల్ చేయొచ్చు. భూకంపాల్లాంటి ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు అక్కడినుంచి గాయపడినవారిని తరలించడం కష్టమవుతుంది. అలాంటప్పుడు ఇది అంబులెన్స్లా పనిచేస్తుంది. రాళ్లు రప్పలు, గుట్టలు, మంచు గడ్డలు... ఉపరితలాన్ని బట్టి మోడ్ను మార్చుకుంటుంది. ఉన్నపళంగా ఏ దిశలోనైనా పోగలగడం దీని ప్రత్యేకత. అయితే... ఈ కారు ప్రజలకు అందుబాటులోకి వస్తుందా? రాదా? ధర ఎంత? అనే విషయాలేవీ ఈ సంస్థ ప్రకటించలేదు. -
రష్మిక, పూజా హెగ్డే.. ఎవరు టాలీవుడ్ నెంబర్ 1?
రష్మిక మందన్నా, పూజా హెగ్డే.. ప్రస్తుతం టాలీవుడ్లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్లు వీళ్లే. తెలుగులో ఇప్పుడు వీరిదే హవా. దాదాపు పెద్ద సినిమాలన్నింటినీ తమ ఖాతాలో వేసుకుంటున్నీ ముద్దుగుమ్మలు నెంబర్ వన్ పొజీషన్ కోసం పోటీ పడుతున్నారు. సీనియర్ స్టార్ హీరోయిన్ల హవా తగ్గడం ఈ బ్యూటీస్కు మరింత కలిసొచ్చింది. యూత్లోనూ ఈ ఇద్దరు హీరోయిన్లకు సూపర్ క్రేజ్ ఉండటంతో దాదాపు బడా సినిమాలన్నింటిలోనూ వీళ్లే డైరెక్టర్ల ఫస్ట్ ఛాయిస్గా మరిపోయారు. గతేడాది సరిలేరు నీకెవ్వరు వంటి బ్లాక్ బస్టర్ హిట్తో స్టార్ హీరోయిన్గా మారిపోయింది రష్మిక మందన్నా. ప్రస్తుతం ఈ అమ్మడు చేతిలో పుష్ప, ఆడవాళ్లు మీకు జోహార్లు వంటి సినిమాలు ఉన్నాయి. ఈ ఏడాది కార్తీ సరసన సుల్తాన్ మూవీతో తమిళంలో ఎంట్రీ ఇచ్చేసింది. అంతేకాకుండా బాలీవుడ్లో ఏకకాలంలో రెండు సినిమాలు చేసేస్తోంది. సిద్దార్థ్ మల్హోత్రాతో మిషన్ మజ్నులో నటిస్తూనే, బిగ్బి అమితాబ్తో కలిసి గుడ్ బాయ్ అనే సినిమాలో నటిస్తుంది ఈ కన్నడ బ్యూటీ. మరోవైపు శంకర్- రామ్చరణ్ కాంబినేషన్లో వస్తోన్న సినిమాలోనూ రష్మికనే తీసుకున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఇక అల వైకుంఠపురములో సినిమాతో బిగ్గెస్ట్ హిట్ను ఖాతాలో వేసుకుంది పూజా హెగ్డే. కెరీర్ మొదట్లో అపజయాలు పలకరించినా ఇప్పుడు మాత్రం జెడ్ స్పీడుతో దూసుకుపోతుంది. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి ఆచార్య సినిమాలో నటిస్తూనే, ప్రభాస్ సరసన రాధేశ్యామ్తో జతకట్టనుంది. మరోవైపు యంగ్ హీరో అఖిల్ సరసన బ్యాలిలర్ సినిమా చేస్తోంది. అంతేకాకుండా త్వరలోనే యంగ్ టైగర్ యన్టీఆర్- త్రివిక్రమ్ కాంబినేషన్లో వస్తున్న ఓ సినిమాలోనూ పూజా నటించనున్నట్లు తెలుస్తోంది. మహేష్ సరసన మరోసారి నటించేందుకు రెడీ అయ్యిందట ఈ పొడుగు కాళ్ల సుందరి. త్వరలోనే దీనికి సంబంధించిన అప్డేట్ రావాల్సి ఉంది. ఇలా చేతినిండా సినిమాలతో వచ్చే రెండు, మూడేళ్ల వరకు వీరి క్యాలెండర్ ఫుల్ బిజీగా మారిపోయింది. రెమ్యునరేషన్ విషయంలో ఈ ఇద్దరికీ పోటీ నెలకొంది. ప్రస్తుతం రష్మిక 2 కోట్లు డిమాండ్ చేస్తుండగా, పూజా మాత్రం 2.5-3 కోట్ల వరకు అందుకుంటున్నట్లు టాక్ వినిపిస్తోంది. చదవండి : కరోనా వల్ల మేకప్మెన్గా మారిన ప్రముఖ నటుడు అందుకే ఆ హీరోతో నటించలేదు : రష్మిక -
తేదీలు తారుమారు
కరోనా వల్ల ఏర్పడ్డ అయోమయం ఇంకా కొనసాగుతూనే ఉంది. థియేటర్ల తాళం ఎప్పుడు తీస్తారో తెలియదు. రిలీజ్ డేట్ దగ్గరకు వచ్చేకొద్దీ సినిమాలు మరింత దూరం జరుగుతున్నాయి. ఈ ఏడాది రెండో భాగం కళకళలాడుతుంది అనుకున్న హాలీవుడ్ వెలవెలబోయింది. భారీ సినిమాలన్నీ మరోసారి విడుదల తేదీలు తారుమారు అయ్యాయి. అంతరాయాల అవతార్ 2009లో వచ్చిన ప్రపంచ బ్లాక్ బస్టర్‘అవతార్’కి ఒకటి కాదు నాలుగు సీక్వెల్స్ తెరకెక్కిస్తున్నారు దర్శకుడు జేమ్స్ కేమరూన్. 2020, 2021, 2022.. ఇలా ఒక్కో సీక్వెల్ని ఒక్కో ఏడాది విడుదల చేయాలనుకున్నారు. సీక్వెల్స్ చిత్రీకరణ ప్రారంభించినప్పటి నుంచి విడుదల ఏదో ఒక కారణంగా వాయిదా పడుతూనే ఉంది. లాక్ డౌన్ తర్వాత షూటింగ్ మొదలుపెట్టిన మొదటి భారీ చిత్రం కూడా ఇదే. అనుకున్న సమయానికే వస్తాం అని నమ్మకం కూడా వ్యక్తం చేశారు. అయితే లాస్ ఏంజెల్స్లో పోస్ట్ ప్రొడక్షన్ పని కుదిరేలా లేదని, వాయిదా అనివార్యం అయిందని చిత్రబృందం తెలిపింది. దీంతో ముందుగా అనుకున్న సీక్వెల్స్ విడుదల తేదీలన్నీ ఓ ఏడాదికి వాయిదా పడ్డాయి. స్టార్వార్స్ ఇప్పట్లో లేనట్టే బ్లాక్బస్టర్ హిట్ సిరీస్ స్టార్ వార్స్ ఫ్రాంచైజీలో మరో మూడు సినిమాలను ప్రకటించింది నిర్మాణ సంస్థ డిస్నీ. అయితే ఈ చిత్రాలు కుడా అనుకున్న తేదీ కంటే ఓ ఏడాది వెనక్కి వెళ్లాయి. స్టార్ వార్స్ కొత్త సిరీస్ చిత్రాలకు పేర్లు ఇంకా ప్రకటించలేదు. వాయిదాల జాబితాలో... ఈ ఏడాది వేసవిలో టామ్ క్రూజ్ నటించిన ‘టాప్ గన్ – మావరిక్’ విడుదల కావాల్సింది. కానీ కాలేదు. ఇంకా ‘ఏ క్వైట్ ప్లేస్’ సీక్వెల్ కూడా విడుదల కావాల్సి ఉంది. ఇది కూడా వాయిదా పడింది. యాక్షన్ చిత్రం ‘మూలాన్’, క్రిస్టోఫర్ నోలన్ దర్శకత్వం వహించిన ‘టెనెట్’, వెస్ యాండర్ సన్ తెరకెక్కించిన ‘ఫ్రెంచ్ డిస్పాచ్’ చిత్రాలు వాయిదా పడ్డాయి. చెప్పిన తేదీకి రావడం లేదంటున్న ఈ చిత్రాల నిర్మాతలు వాయిదా వేసిన తేదీని మాత్రం చెప్పలేదు. మరి.. థియేటర్లు ఎప్పుడు రీ ఓపెన్ అవుతాయో తెలియదు.. తెరిచాక ప్రేక్షకులు వస్తారా? లేదా అనే విషయంలో స్పష్టత లేదు. ఇక విడుదల తేదీ విషయంలో ఏం క్లారిటీ ఇవ్వగలం అంటున్నారు. జేమ్స్ బాండ్ ‘నో టైమ్ టు డై’ని గత ఏడాది నవంబర్లో విడుదల చేయాలనుకున్నారు. వాయిదా పడింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో అనుకున్నారు టైమ్ కి రాలేదు. ఫిబ్రవరిలోనే ఏప్రిల్ కి వచ్చేస్తాం అన్నారు.. అప్పటికి థియేటర్లు మూతపడ్డాయి. ఈ ఏడాది నవంబర్కి వస్తాం అంటున్నారు. కానీ పరిస్థితులను చూస్తుంటే మళ్లీ టైమ్ తప్పేట్లు ఉంది. -
‘స్టార్ వార్స్’ నటుడు కరోనాతో మృతి
కరోనాతో మరో హాలీవుడ్ నటుడు మరణించారు. ఇటీవలే మార్క్ బ్లమ్ అనే నటుడు కరోనా సోకి మరణించారు. తాజాగా ‘స్టార్ వార్స్’ ఫేమ్ ఆండ్రూ జాక్ (76) కూడా కోవిడ్ –19 కారణంగానే చనిపోయారు. కరోనా పాజిటివ్ అని తేలిన రెండు రోజుల్లోనే ఆండ్రూ మరణించారని సమాచారం. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారాయన. ‘మెన్ ఇన్ బ్లాక్’, ‘లార్డ్ అఫ్ ది రింగ్స్’, ‘థార్’ తదితర సినిమాల్లో నటించారాయన. -
కరోనా: మరో ప్రముఖ నటుడు మృతి
ప్రముఖ నటుడు, స్టార్ వార్స్ ఫేమ్ ఆండ్రూ జాక్ కరోనా వైరస్ బారిన పడి కన్నుమూశారు. రెండు రోజుల క్రితం కరోనా పాజిటివ్ రావటంతో సర్రేలోని ఆసుపత్రిలో చేరిన ఆయన చికిత్స పొందుతూ మంగళవారం మృత్యువాతపడ్డారు. ఈ విషయాన్ని ఆయన ప్రతినిధి జిల్ మెకలాగ్ బుధవారం అధికారికంగా ధ్రువీకరించారు. 76 ఏళ్ల జాక్ స్టార్ వార్స్ ఎపిసోడ్ 7,8లలో తన నటనతో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించారు. అంతేకాకుండా ప్రముఖ నటులు రాబర్ట్ డౌనీ జూనియర్, క్రిస్ హేమ్స్వర్త్లకు డయలెక్ట్ కోచ్( భాషకు సంబంధించిన మెలుకువలు నేర్పేవారు)గా కూడా వ్యవహరిస్తున్నారు. ఆస్ట్రేలియాలో ఉన్న జాక్ భార్య గేబ్రియల్ రోజర్స్ ఆయన మృతిపై స్పందిస్తూ.. ‘‘ రెండు రోజుల క్రితం జాక్కు కరోనా పాజిటివ్ వచ్చింది. మంగళవారం ఎటువంటి బాధలేకుండా ప్రశాంతంగా కన్నుమూశార’ని పేర్కొన్నారు. కాగా, ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు 9 లక్షల మంది కరోనా బారిన పడగా, 42వేల మంది మృతి చెందారు. ( మార్క్ బ్లమ్ ఇక లేరు ) -
స్టార్వార్స్ జస్ట్ ఓకే
హాలీవుడ్లో ‘స్టార్వార్స్’కు ఉన్న క్రేజ్ మరే ఇతర సిరీస్కు లేదన్నది ఒప్పుకోవాల్సిన సత్యం. మెయిన్ స్ట్రీమ్ కమర్షియల్ మూవీస్లో బాక్సాఫీస్ వద్ద ‘స్టార్ వార్స్’ సినిమాలు కొన్నేళ్లుగా సృష్టిస్తూ వచ్చిన అద్భుతాలు అన్నీ ఇన్నీ కావు. ఇక ఈ ఏడాది ‘స్టార్ వార్స్’ సీక్వెల్ ట్రయాలజీలో రెండో సినిమా అయిన ‘స్టార్ వార్స్ : ది లాస్ట్ జేడి’ వచ్చింది. భారీ అంచనాల మధ్య డిసెంబర్ 15న విడుదలైన ఈ సినిమా అనుకున్నంతగా బాక్సాఫీస్ వద్ద నిలబడడం లేదు. నిజానికి ఈ ఏడాది బిగ్గెస్ట్ గ్రాసర్స్లో టాప్లో ఈ సినిమా నిలుస్తుందనుకున్నా అంత సీన్ అయితే కనపడడంలేదు. ఇక క్రిస్మస్ వారానికి కూడా లెక్కలేనన్ని సినిమాలు వచ్చేయడంతో ‘స్టార్వార్స్’ కథ ఈసారికి ముగిసినట్టే అని చెప్పుకోవచ్చు. ఇప్పటివరకూ ఈ సినిమా 650 మిలియన్ డాలర్లు (4,161 కోట్ల రూపాయలు) వసూలు చేసింది. ఇది హాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద మంచి నంబరే కానీ, ‘స్టార్వార్స్’ రేంజ్ కాదన్నది ట్రేడ్ వర్గాల అభిప్రాయం. ఈ ఏడాది చివర్లో వచ్చినా టాప్లో నిలబడుతుందనుకున్న సినిమా మొత్తానికి అంతంత మాత్రమే అనిపించుకుంది. -
ఇంద్రసేన వర్సెస్ సమరసింహ
సినిమాలో డ్రామా ఉంటుంది... యాక్షన్ ఉంటుంది... ఎంటర్టైన్మెంట్ ఉంటుంది... ఫస్టాఫ్ ఉంటుంది... సెకండాఫ్ ఉంటుంది... క్లైమాక్సూ ఉంటుంది... హీరోయిన్లుంటారు... క్యారెక్టర్లుంటాయి... కామెడీ ఉంటుంది... అబ్బో! చాలానే ఉంటుంది. అవును... అసలు విషయం మర్చిపోయాం! సినిమా బయట కూడా డ్రామా ఉంటుంది. అభిమానులుంటారు. ఆడియన్స్ ఉంటారు. ప్రొడ్యూసర్లు.. డిస్ట్రిబ్యూటర్లు.. ఎగ్జిబిటర్లుంటారు. వాళ్ళంతా హ్యాపీయే!... టెన్షన్ అంతా అభిమానులది. కటౌట్లు పెట్టాల... దండలు వెయ్యాల... అభిషేకాలు చెయ్యాల... సమ్టైమ్స్... ప్రాణాల మీదకు తెచ్చుకోవాల... ఇవన్నీ హీరోలకు కల్ట్ ఇమేజ్ తెచ్చిపెట్టాయ్. గవర్నమెంట్ పందెంరాయుళ్ళపై ఆంక్షలు విధించవచ్చు. పందెంకోళ్ళను జైళ్ళలోనూ పెట్టవచ్చు. కానీ, ఈ అభిమాన పందెంపై కంట్రోలు ఏ ప్రభుత్వం మాత్రం పెట్టగలదు? దిస్ స్టోరీ ఈజ్ బిగ్గర్ దేన్ టూ మూవీస్టోరీస్! రెండు సినిమాల కన్నా గొప్ప డ్రామా ఉన్న స్టోరీ! చదవండి. ఇది వెండితెర మహా సంగ్రామం... సంక్రాంతి ... థియేటర్లలో జరుగుతున్న సినిమా కోడి పందెం... ఒకరు మెగా స్టార్... మరొకరు నందమూరి యుగా స్టార్... ఒకరిది (హీరోగా) 150వ సినిమా... ఇంకొకరిది 100వ సినిమా... ఒకరిది తమిళ సూపర్ హిట్ కథ... ఇంకొకరిది తెలుగు జాతి యోధుడి జీవితం... ఒకరేమో శక్తిపీఠాల్లో పూజలు, మరొకరు ఆలయాల్లో అభిషేకాలు... ఎవరూ తగ్గేది లేదు... ఎక్కడా తలొగ్గేది లేదు... అందుకే... తెలుగు సినీ జనంలో... ఇప్పుడు ఎక్కడ చూసినా ఒకటే హాట్ టాపిక్... ‘ఖైదీ నంబర్ 150’ వర్సెస్ ‘గౌతమిపుత్ర శాతకర్ణి’... చిరంజీవి సిన్మా వర్సెస్ బాలకృష్ణ సిన్మా.. సంక్రాంతి సీజన్లో... మరికొన్ని సినిమాలు బరిలోకి వస్తున్నా... ఈ ‘స్టార్ వార్స్’ పైనే అందరి దృష్టి. కథ కోసం కసరత్తులు బాస్ ఈజ్ బ్యాక్ కెరీర్లో మైలురాళ్ళ లాంటి ఈ సినిమాలు చేయడానికి సరైన కథల కోసం స్టార్ హీరోలు చిరంజీవి, బాలకృష్ణ చాలా కసరత్తులే చేశారు. కొన్నేళ్ళపాటు ఊరించి, పరుచూరి బ్రదర్స్‘ఉ య్యాలవాడ నరసింహారెడ్డి’ స్క్రిప్ట్ దగ్గర నుంచి పూరీ జగన్నాథ్ ‘ఆటో జానీ’ దాకా వందల కథలు విన్న చిరంజీవి చిట్టచివరికి తమిళంలో మురుగదాస్ దర్శకత్వంలో విజయ్ నటించిన హిట్ ‘కత్తి’ (2014) రీమేక్కు జెండా ఊపారు. అదీ కుమారుడు రామ్చరణ్ నిర్మాతగా తొలి యత్నం కావడం విశేషం. గతంలో ‘ఠాగూర్’(తమిళ ‘రమణ’కి రీమేక్)తో విజయం అందించిన వినాయక్కు దర్శకత్వ బాధ్యతలు అందించారు. తెలుగు వాడి పౌరుషం హీరోగా 100వ సినిమాకు బాలకృష్ణ చాలా స్క్రిప్ట్లు విన్నారు. సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో టైమ్మిషన్ కాన్సెప్ట్తో పాతికేళ్ళ క్రితం వచ్చిన ‘ఆదిత్య 369’కి సీక్వెల్గా‘ఆదిత్య 999’ స్క్రిప్ట్కు ఓకే చెప్పారు. కుమారుడు మోక్షజ్ఞనీ దాంతో తెరంగేట్రం చేయాలని ఊగారు. తర్వాత రైతుల కష్టాన్ని ప్రతిబింబించే ‘రైతు’ కథ నచ్చి, కృష్ణవంశీ దర్శకుడిగా దాదాపు ఖరారు చేశారు. అదే టైమ్లో దర్శకుడు క్రిష్ వచ్చి, తల్లి పేరును తన పేరు ముందుపెట్టుకొన్న చక్రవర్తి గౌతమీపుత్ర శాతకర్ణి కథ ఏకధాటిన 2 గంటలు చెప్పారు. విని 24 గంటలైనా గడవక ముందే ఇదే నూరో సినిమాకు కరెక్ట్ అని బాలయ్య అటు మొగ్గారు. ఇంతకీ... కథేంటి? మెగా రీమేక్ బేసిక్గా ఇది తమిళ ‘కత్తి’ చిత్రానికి రీమేక్. కాకపోతే, తెలుగు నేటివిటీ, చిరు ఇమేజ్కు తగ్గట్లుగా పరుచూరి బ్రదర్స్, సత్యానంద్ సహా పలువురు కలసి, స్క్రిప్ట్కు మార్పులు చేశారు. కార్పొరేట్ సంస్థల దురాక్రమణలతో ఉపాధి కోల్పోయి, దిక్కుతోచని రైతులు ఆత్మహత్యలకు పాల్పడడమనే అంశం చుట్టూ కథ తిరుగుతుంది. చూడడానికి ఒకేలా కనిపించే రైతుల కోసం పోరాడే ప్రగతిశీలవాది జీవానందంగా, అల్లరి చిల్లరిగా ఉండే ఖైదీ కదిరేశన్ అలియాస్ కత్తిగా రెండు పాత్రలూ తమిళ్లో విజయ్ చేశారు. జీవానందం గాయపడగా, అతని స్థానంలోకి కత్తి వెళ్ళి రైతుల పక్షాన పోరాడతాడు. హిస్టరీ రిపీట్స్ చిన్న చిన్న గణతంత్ర రాజ్యాలుగా ఉన్న భారతావనిని ఒకే ఏలుబడికి తెచ్చిన తొలి భారతీయ చక్రవర్తి, తెలుగు యోధుడి కథ ఇది. దర్శకుడు క్రిష్ లభిస్తున్న కొద్దిపాటి చరిత్ర ఆధారాల్నీ తీసుకొని, ఊహ జోడించి, స్క్రిప్ట్ చేసుకున్నారు. క్రీ.శ. 1వ శతాబ్దానికి చెందిన ఈ తెలుగు యోధుడి కథను 1900 ఏళ్ళ తరువాత ఇప్పుడు తెర మీదకు తెస్తున్నారు. శాతకర్ణి జీవితంలో తల్లి ఎంతటి కీలకపాత్ర వహించిందో, భార్యాబిడ్డల కన్నా దేశాన్ని ఒక్క తాటి మీదకు తేవాలన్న ఆకాంక్షకే అతనిచ్చిన ప్రాధాన్యం ఏమిటో ఈ కథ చెబుతుంది. అయితే, ఈ చిత్రం శాతకర్ణి విజయగాథలకే పరిమితం.పూర్తి జీవితం చూపడం లేదు. ముసురుకున్న వివాదాలు కథ ఎవరిది?: తమిళ ‘కత్తి’ సినిమా ఒరిజినల్ కథ తనదేననీ, పేరు, డబ్బులు – ఏమీ ఇవ్వకుండా ఆ కథను అడ్డంగా వాడేసుకున్నారనీ దర్శక – రచయిత ఎన్. నరసింహారావు వీధికెక్కారు. ఆ కథ ఒరిజినల్గా నరసింహారావు రిజిస్టర్ చేసుకున్న స్క్రిప్ట్లోదేనని ‘రచయితల సంఘం’ కమిటీ కూడా తేల్చింది. తమిళ దర్శక, నిర్మాతల నుంచి డబ్బుల వ్యవహారం తేలే లోగానే, ‘కత్తి’ని చిరంజీవి రీమేక్ చేస్తున్నారనే వార్తతో కాపీరైట్ వివాదాన్ని మళ్ళీ ఫిల్మ్నగర్లో గుప్పుమనిపించారు. అలా ‘ఖైదీ నంబర్ 150’ షూటింగ్ కన్నా ముందే వార్తల్లో నిలిచింది. నో పర్మిషన్: ‘ఖైదీ నంబర్ 150’ ట్రైలర్ కమ్ ప్రీ–రిలీజ్ ఫంక్షన్కు విజయవాడలో అనుమతి ఇవ్వకుండా ఇబ్బందులు సృష్టిస్తున్నారంటూ మరో వివాదం రేగింది. నిజానికి, మొదట డిసెంబర్ ఆఖరులో విజయవాడలోని మునిసిపల్ స్టేడియమ్లో చిత్ర ఆడియో ఫంక్షన్ జరపాలనుకొని, ఏర్పాట్లు చేసుకున్న చిత్ర నిర్మాతలు ‘శాతకర్ణి’ ట్రైలర్ రిలీజ్ తర్వాత ఆ ఫంక్షన్నే రద్దు చేసుకొన్నారు. తీరా సినిమా రిలీజ్కు పట్టుమని వారం రోజులైనా లేక ముందు ట్రైలర్ రిలీజ్కు ముహూర్తం పెట్టుకొన్నారు. అయితే, ఆ ఫంక్షన్కు స్టేడియమ్లో అధికారపక్షం ఉద్దేశపూర్వకంగానే అనుమతి ఇవ్వడం లేదని చిరు అభిమాన వర్గం ఆరోపించింది. అధికారులు మాత్రం మునిసిపల్ స్టేడియమ్లను, బయటి ఫంక్షన్లకివ్వరాదంటూ ఉమ్మడి రాష్ట్ర కాలంలో వచ్చిన జీవో వల్లే అనుమతులు ఇవ్వడం లేదంటూ సన్నాయినొక్కులు నొక్కారు. చివరకు చిరు వర్గం తమ వేదికను బెజవాడ – గుంటూరు మధ్యకు మార్చి, కార్యక్రమం శనివారం చేసింది. ఎవరు లెజెండ్? డేట్ ముందుకు మార్చుకొని, జనవరి 11న రిలీజ్కు వచ్చిన ‘ఖైదీ...’ వర్గం ‘ఇద్దరు అగ్రహీరోల సినిమాలు ఒకే రోజు రావడం మంచిది కాదని నాన్న (చిరంజీవి) గారన్నారు’ అంటూ తెలివిగా ప్రకటించింది. అలా పోటీ సినిమా సేమ్ డే రిలీజ్కి రాకుండా, ముందరి కాళ్ళకి బంధం వేసింది. ఈ పరిస్థితుల్లో రకరకాల ఒత్తిళ్ళ మధ్య జనవరి 3వ తేదీ రాత్రి పొద్దుపోయాక, క్రిష్ సైతం పోటీ సినిమాకు స్నేహహస్తం చాపుతూ, ‘‘ఈ సంక్రాంతికి ఇద్దరు లెజెండ్స్ తమ మైలురాళ్ళ లాంటి సినిమాలతో వస్తున్నారు... స్వాగతిద్దాం’’ అని ట్వీట్ చేశారు. కానీ, ఇరు వర్గాల అభిమానులూ ఎవరికి వారు ‘మా హీరో తప్ప మరొకరు లెజెండ్ ఎలా అవుతారు’ అంటూ బుస కొట్టారు. సోషల్ మీడియాలో విషం కక్కారు. అంత మాటంటారా? ఖబడ్దార్! డిసెంబర్ 26న తిరుపతిలో ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ పాటల విడుదల కార్యక్రమంలో మాట్లాడుతూ, దర్శకుడు క్రిష్ మాటల ఉరవడిలో ‘సంక్రాంతికి వస్తున్నాం. ఖబడ్దార్’ అనే పదప్రయోగం చేయడం వివాదమైంది. అది చిరు వర్గాన్ని ఉద్దేశించి అన్న మాటలుగా సోషల్ మీడియాలో ప్రచారమైంది. దానికి తోడు ‘అన్నయ్య’ కోసం మెగా బ్రదర్ నుంచి వచ్చిన వరుస ఫోన్కాల్స్! ఒకరికి నలుగురు హీరోలు చేతిలో ఉన్న మెగా ఫ్యామిలీతో వ్యవహారం కావడంతో, ఈ ఉక్కిరిబిక్కిరి మధ్య, క్రిష్ మెగా ఫ్యామిలీతో తనకున్న అనుబంధం, అపార గౌరవం గురించి వివరణ ఇవ్వాల్సొచ్చింది. సోషల్ మీడియాలో వార్ ! బాలకృష్ణ సినిమా వస్తున్న రోజున అసలు బయటకే రావద్దంటూ ఎగతాళి వాట్సప్ మెసేజ్ సోషల్ మీడియాలో బాగా తిరిగింది. మరోపక్క, చిరంజీవి సిన్మాలో ‘అమ్మడు... కుమ్ముడు’ లాంటి మరీ మాస్ పాట ఏమిటని నెట్లో విమర్శలు వెల్లువెత్తాయి. ఇలాంటి ‘ట్రాలింగ్’లను పక్కన పెడితే, ‘మా టీజర్, ట్రైలర్ లుక్కు ఇన్ని లక్షల వ్యూస్ వచ్చాయి’ అని మొదట ఒక సిన్మా వారు ప్రకటించారు. మా పాటనీ అంతమంది చూశారంటూ మరొక సినిమావారు అంతకన్నా పెద్ద అంకెలతో, పోటీ ప్రకటన చేశారు. ఇలా ప్రకటనలతో పోటాపోటీలు పడుతున్నారు. మీడియాలో స్టార్ వార్ చూసి, హద్దు మీరినా, బ్యానర్లు చింపినాlచర్య తప్పదని ఏపీ రాష్ట్ర డీజీపీ ప్రకటించారు. హాళ్ళ వద్ద బందోబస్తు పెట్టారు. అందరూ సర్ప్రైజ్ అవుతారు! – ‘ఖైదీ...’ దర్శకుడు వినాయక్ ⇔ తొమ్మిదేళ్ళ తర్వాత చిరంజీవినెలా చూపిస్తున్నారు? వినాయక్: సినిమా రిలీజయ్యాక చూస్తే, అసలు ఆ తొమ్మిదేళ్ళ గ్యాపూ చెరిగిపోతుంది. అందరికీ అర్థమయ్యేలా చెప్పాలంటే, దాదాపు 20 ఏళ్ళ క్రితం ‘చూడాలని ఉంది’ (1998) టైమ్లో ఎలా ఉన్నారో, అలా అనిపిస్తారు చిరంజీవి. ఆయనను చూసి అందరూ సర్ప్రైజ్ అవుతారు. నో డౌట్. ఆయన డ్యాన్స్లు, ఫైట్లు చూసి అదిరిపోతారు. ⇔ ఇది తమిళ ‘కత్తి’కి రీమేక్ కదా! మరి తెలుగులో...? చాలా మార్పులు చేర్పులు చేశాం. అక్కడ యువ హీరో విజయ్ కోసం, అతని ఇమేజ్కి తగ్గట్లుగా చేసిన స్క్రిప్ట్ ఇది. దాన్ని మన తెలుగు నేటివిటీకీ, ‘అన్నయ్య’ బాడీ లాంగ్వేజ్కీ తగ్గట్లు మార్చడం కోసం సమష్టిగా కృషి చేశాం. ⇔ ‘ఠాగూర్’ లానే ‘ఖైదీ నంబర్ 150’లో కూడా సామాజిక సమస్యను ప్రస్తావించినట్లున్నారు! ఏ బాధ్యతా లేని ఒక వ్యక్తి – ఒక ఊరిలో ఒక రైతుకు జరిగిన అన్యాయం తెలుసుకొని కదిలిపోతాడు. ‘నేను వీళ్ళ కోసమే బతకాలి’ అని నిర్ణయించుకొని, ఆ దిశలో చేసే అలుపెరుగని పోరాటం చిత్ర కథ. రైతు సమస్య, నీటి సమస్య లాంటి అంశాలెన్నో వస్తాయి. ⇔ రైతు గురించి వచ్చే ‘నీరు నీరు నీరు...’ పాట ఇవాళ మీడియాలో హాట్టాపిక్ అయినట్లుంది! చాలా మంచి పాట అది. దేవిశ్రీ సంగీతం, రామజోగయ్యశాస్త్రి సాహిత్యం, శంకర్ మహదేవన్ గానం – అద్భుతం. సినిమాలో బ్యాక్గ్రౌండ్లో వస్తుందీ పాట. ⇔ చిరంజీవి కమ్బ్యాక్ ఫిల్మ్ వరమాల ఎందరినో దాటి మీ మెడలో పడినప్పుడు ఏమనిపించింది? చిరంజీవి గారు పిలిచి, ‘కత్తి’ సినిమా తెలుగులో చేద్దామన్నారు. వెంటనే ఆ దృష్టితో సినిమా చూశాను. చూస్తుండగా నా మనసులో తిరిగిన ఆలోచనలు, మార్పులు చేర్పులతో – నాదైన పద్ధతిలో ఆయనకు కథను నేరేట్ చేశాను. నా అప్రోచ్ నచ్చి, చేసేద్దామన్నారు. ∙మీకు ఈ సినిమా పెద్ద ఎఛివ్మెంట్. మరి, ప్రేక్షకులకు ఎలాంటి అనుభూతి అంటారు? ఒక్క మాటలో చెప్పాలంటే, ‘ఠాగూర్’లో ఉన్న నిజాయతీ, ‘రౌడీ అల్లుడు’లోని కామెడీ, ‘ఇంద్ర’లోని పాటలు – ఇవన్నీ కలిసే ఒకే సినిమాలో ఉంటే? అదే – ‘ఖైదీ నంబర్ 150’! ⇔ అంచనాలతో పాటు సినీ పోరాటమూ భారీగానే ఉంది! మరి, టార్గెట్... అంచనాలన్నీ అందుకుంటాం. ఇంకా చెప్పాలంటే, అధిగమిస్తాం. సినిమా సూపర్ హిట్. చరిత్రలో గౌతమీపుత్ర శాతకర్ణి -– ‘...శాతకర్ణి’ చిత్ర దర్శకుడు క్రిష్ చరిత్రలోకి వెళితే, శాతవాహనులు తెలుగు వారు. ఇప్పటి తెలంగాణ ప్రాంతంలోని కోరులింగాల (కోటి లింగాల) నుంచి తెలుగు ప్రాంతంతో పాటు భారత భూభాగాన్నే ఏలినవారు. ఆ వంశానికి వన్నె తెచ్చిన చక్రవర్తి – గౌతమీపుత్ర శాతకర్ణి. క్రీ.శ. 78 –102 (కొందరు 60 నుంచి 90 దాకా అంటారు) మధ్య పరిపాలన సాగించిన గౌతమీపుత్ర శాతకర్ణి నిజానికి శాతవాహన వంశంలో ఏ రాజూ సాధించనన్ని విజయాలు సాధించాడు. శత్రువులైన శకులు, పల్హవులు, యవనులను (గ్రీకులు) జయించి, జంబూద్వీపాన్ని (భారతభూభాగానికి పురాణనామం) పరాయి పాలన నుంచి విముక్తం చేసిన అరుదైన చక్రవర్తి. తాత, ముత్తాతలు కోల్పోయిన భూభాగాలనే కాక, కొత్త భూభాగాలను జయించి, సువిశాల సామ్రాజ్యంగా విస్తరించాడు. అలా మూడు సముద్రాల పర్యంతం తన ఆధిపత్యాన్ని స్థాపించి, ‘త్రిసముద్ర తోయ పీతవాహన’ (మూడు సముద్రాల నీళ్ళు తాగిన గుర్రాన్ని వాహనంగా కలవాడా) అనే బిరుదు పొందాడు. తన బొమ్మను ముద్రించిన వెండి నాణాలను విడుదల చేసిన మొదటి భారతీయ చక్రవర్తి అతనే! పేరుకు ముందు తల్లి (గౌతమీ బలసరి/బాలాశ్రీ) పేరు చేర్చుకొన్న తొలి భారతీయుడూ అతనే! కొత్త యుగానికి ఆదిగా ‘యుగాది’ (ఉగాది, మహారాష్ట్రలో ‘గుడీ పడవా’) ఆయన మొదలు పెట్టిందనే అంటారు. శాలివాహన శకమనే కొత్త శకాన్ని స్థాపించి, కాలాన్ని మలుపు తిప్పిందీ ఈయనే అని కొందరి భావన. చిన్నతనంలో మా తాతయ్య గారి ఊరికి వెళ్ళినప్పుడు అమరావతి చాలాసార్లు చూశా. అమరావతి రాజధానిగా పాలించిన గౌతమీపుత్ర శాతకర్ణి కథ లీలగా విన్నా. కొన్నేళ్ళుగా ఈ కథ నా మనసు తొలిచేస్తోంది. మన తెలుగు వాడి కథ మనకి కూడా తెలియకపోవడం కోపం వచ్చింది. 2013 నుంచి ముంబైలో ఉన్నప్పుడు ఆ చరిత్ర మరింత తెలిసింది. ఇది అందరికీ చెప్పాల్సిన కథ అనిపించింది. అందుకే, ఈ సినిమా తీశా. సినిమా తీస్తున్నంత సేపూ ఏదో అదృశ్యశక్తి నా వెంట ఉండి నడిపింది. ఇది నిజం. రిలీజ్ దోబూచులాట.. రచ్చ నిజానికి, ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ చిత్రం 2016 ఏప్రిల్ ప్రారంభమైనప్పుడే ఎట్టి పరిస్థితుల్లోనూ 2017 జనవరి 12న రిలీజ్ చేస్తామని దర్శక, నిర్మాతలు ప్రకటించారు. అయితే, చారిత్రక నేపథ్యం, యుద్ధ సన్నివేశాలున్న భారీ చిత్రం తీయడం కాబట్టి, అది జరిగేపని కాదని పరిశ్రమ వర్గీయులు, ప్రత్యర్థి చిత్రాలవాళ్ళు పెదవి విరిచారు. వాళ్ళ అంచనాల్ని తలకిందులు చేస్తూ, రికార్డు టైమ్లో చిత్ర యూనిట్ సినిమా పూర్తి చేసింది. ఇలా ఉండగా, ‘శాతకర్ణి’ ప్రారంభమైన రెండు నెలల తర్వాత 2016 జూన్ 23న చిరంజీవి ‘ఖైదీ నంబర్ 150’ షూటింగ్ మొదలైంది. దాన్ని కూడా సంక్రాంతికే జనవరి 13న రిలీజ్ చేస్తామంటూ నిర్మాతలు మొదట ప్రకటించారు. అయితే, తీరా రెండు సినిమాలూ షూటింగ్ పూర్తి చేసుకొని, రిలీజ్కు దగ్గర పడుతుండేసరికి రచ్చ మొదలైంది. కలిసొచ్చిన ‘నరసింహనాయుడు’ రిలీజ్ డేట్ జనవరి 11కే ఈ సినిమానూ రిలీజ్ చేయాలంటూ బాలకృష్ణ ఫ్యాన్స్ ఒత్తిడి చేస్తూ వచ్చారు. అందుకు, దర్శక, నిర్మాతలు కూడా సరేనంటూ, బాక్సాఫీస్ వద్ద ప్రత్యర్థుల వ్యూహాల్ని బట్టి, తుది రిలీజ్ డేట్ ప్రకటిద్దామని కూర్చున్నారు. ఆడియో రిలీజ్ వేదికపైనా డేట్ చెప్పనిది అందుకే! అయితే, ఇంతలో ‘ఖబడ్దార్’ పదప్రయోగంపై వివాదం క్రిష్ను చుట్టుముట్టింది. ఒక ఏరియా ‘శాతకర్ణి’ రిలీజ్లో భాగస్థుడూ, చేతిలో పలు థియేటర్లూ ఉన్న ఒక అగ్ర నిర్మాత మధ్యవర్తిగా రంగప్రవేశం చేశారు. ఆ నిర్మాత తమ్ముడితో నెక్స్›్ట సినిమా చేయడానికి సిద్ధమవుతున్న ‘శాతకర్ణి’ దర్శక, నిర్మాతలతో జనవరి 12న ‘శాతకర్ణి’ని రిలీజ్ చేయనున్నట్లు ప్రకటన కమిట్ చేయించారు. ఆ ప్రకటన వచ్చాక, పోటీ నివారించడానికి ఒక రోజు ముందే జనవరి 11న చిరు సినిమా రిలీజ్ చేస్తున్నామంటూ ఆ చిత్ర నిర్మాత – హీరో రామ్చరణ్ ప్రకటించారు. దాంతో, రిలీజ్ డేట్ విషయంలో అగ్ర నిర్మాతతో కుట్ర చేయించారని బాలకృష్ణ ఫ్యాన్స్ అగ్గి మీద గుగ్గిలమయ్యారు. పూజలు, అభిషేకాలు, జెండా పండగలకే తప్ప, సిన్మా రిలీజ్ డేట్ విషయంలో మాత్రం దర్శక – నిర్మాతలు తమ కన్నా, ప్రత్యర్థి చిత్ర వర్గీయుల మాటకే తలొగ్గారంటూ విమర్శించారు. జనవరి 5, గురువారం నాడు వంద మంది దాకా అభిమానులు సాక్షాత్తూ హైదరాబాద్లోని ‘శాతకర్ణి’ చిత్ర ఆఫీసుకు వెళ్ళి, జనవరి 11నే తమ హీరో సిన్మా రిలీజ్ చేయాలంటూ ఆందోళన చేయడం కొసమెరుపు. కానీ, చివరకు జనవరి 12నే ‘శాతకర్ణి’ రిలీజ్ చేయాలని దర్శక,నిర్మాతలు ఖరారు చేసేశారు. ఒక్క రోజు ముందొస్తే... 10 కోట్లు! ఒక రోజు ముందు రిలీజ్ కావడం వల్ల అత్యధిక థియేటర్లు అందుబాటులో ఉండి, రికార్డు కలెక్షన్లకు వీలు చిక్కుతుంది. తమ హీరో గొప్ప అంటే, తమ హీరో గొప్ప అనుకొనే ఫ్యాన్స్కూ, బాక్సాఫీస్ రికార్డులే ప్రమాణం అనుకొనే సినీజీవులకూ, నంబర్ వన్ స్థానంపై కన్నేసిన తారలూ రిలీజ్ డేట్పై పట్టుపట్టేది అందుకే! ‘మా సినిమా అన్ని వేల థియేటర్లలో రిలీజ్, ఇన్ని వేల థియేటర్లలో హంగామా’ అని కొందరు సినిమావాళ్ళు చెబుతుంటారు కానీ, వాస్తవాలు వేరు. ఉన్న థియేటర్లెన్ని? ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 1650 చిల్లర థియేటర్లే (మల్టీప్లెక్స్లలోని స్క్రీన్స్ కూడా కలిపి) ఉన్నాయి. ఇక, తమిళనాడు, కర్ణాటక, విదేశాల్లో క్రేజీ తెలుగు సినిమాలకు అందుబాటులో ఉండేవి కూడా కలుపుకొన్నా, మహా అయితే, 2 వేల స్క్రీన్స్కు మించవు. ఆర్భాటపు కబుర్లను పక్కనపెట్టి, అసలు లెక్కల్లోకి వెళితే – థియేటర్లపై పట్టున్న ‘దిల్’ రాజు ‘శతమానం భవతి’కి దాదాపు 250 థియేటర్లు, ఆర్. నారాయణమూర్తి ‘హెడ్కానిస్టేబుల్ వెంకట్రామయ్య’కు సుమారు 50కి పైగా థియేటర్లు ఈ సంక్రాంతికి అందుబాటులో ఉంటాయని అంచనా. ఇక, మిగిలిన 1700 స్క్రీన్స్నే చిరు, బాలయ్య సిన్మాలు పంచుకోవాలి. వీటిలో ‘గీతా ఆర్ట్స్’ పట్టు మూలంగా సుమారు 900 దాకా స్క్రీన్స్ చిరు సిన్మాకీ, 800 దాకా స్క్రీన్స్ బాలయ్య సిన్మాకొస్తాయని అంచనా. అయితే, ‘శాతకర్ణి’ కన్నా ఒక రోజు ముందే చిరు సిన్మా రిలీజ్ వల్ల ఆ ఒక్కరోజుకీ, ‘శాతకర్ణి’ సిన్మాకు దక్కాల్సిన స్క్రీన్స్లో అధిక భాగం కూడా లభించడం ‘ఖైదీ నం. 150’కి ఎడ్వాంటేజ్ అవుతుంది. అలా ప్రత్యర్థి సిన్మా కన్నా ముందు రావడం వల్ల థియేటర్లన్నీ చేతిలో ఉండి, ఆ ఒక్క రోజులో దాదాపు 7 నుంచి 10 కోట్ల మేర ఓపెనింగ్ కలెక్షన్స్ అదనంగా వస్తాయి. ఆ ఎడ్వాంటేజ్ కోసం ‘ఖైదీ నం. 150’ వ్యూహం వేస్తే, అది లేకుండా రెండు సిన్మాలూ ఒకే రోజు వచ్చి, బాక్సాఫీస్ బలపరీక్షకు నిలబడాలని ‘శాతకర్ణి’ అభిమానులు కోరుకున్నారు. అందుకే, జనవరి 11నే ‘శాతకర్ణి’నీ రిలీజ్ చేసెయ్యమంటూ బాలకృష్ణ ఫ్యాన్స్ ఒత్తిడి చేశారు. నైజామ్లో... ఎత్తులు పై ఎత్తులు సినీ వ్యాపారంలో మొదటి నుంచి నైజామ్ ఏరియాది ప్రధాన వాటా. ఒకప్పుడు అది చిరంజీవి సినిమాలకు కంచుకోట. తాజా పోటీ వాతావరణంలోనూ మంచి రెవెన్యూ తెచ్చే ఆ ఏరియాపై పట్టు కోసం రెండు వర్గాలూ వ్యూహ ప్రతివ్యూహాలు సాగిస్తున్నాయి. ‘ఖైదీ...’ చిత్ర నిర్మాతలు ఒక అడుగు ముందుకేసి, నైజామ్ ఏరియాలో సినిమాను అమ్మకుండా, అలాగని సొంతంగా కాకుండా, చాలా థియేటర్స్ చేతిలో ఉన్న ‘గ్లోబల్’ డిస్ట్రిబ్యూటర్స్ సునీల్ నారంగ్ ద్వారా డిస్ట్రిబ్యూషన్కిచ్చారు. నిజానికి, ‘గ్లోబల్’లో భాగస్వామి అయిన నిర్మాత ఎన్. సుధాకరరెడ్డే ‘శాతకర్ణి’ని ఆ ఏరియాకు కొన్నారు. కానీ, ఇప్పుడు ‘ఖైదీ...’ డిస్ట్రిబ్యూషన్కి గ్లోబల్ ఒప్పుకోవడంతో, రెండు సినిమాలకూ హాళ్ళను సర్దుబాటు చేయక తప్పదు. ఆ రకంగా ‘ఖైదీ...’ వ్యూహంతో నైజామ్లో ‘శాతకర్ణి’కి హాళ్ళ సంఖ్యలో గండి పడనుంది. ఊరికొక్క థియేటరైనా ఇవ్వండి బాబూ! ప్రముఖ పంపిణీదారు, థియేటర్ల లీజుదారు కావడంతో, ‘దిల్’ రాజు సినిమాకు మల్టీప్లెక్స్ల నుంచి మామూలు థియేటర్ల దాకా తగినన్ని స్క్రీన్స్ దొరుకుతాయి. అయితే, ఎటొచ్చీ ‘హెడ్కానిస్టేబుల్ వెంకట్రామయ్య’ లాంటి చిన్న సినిమాలకే పెద్ద తలనొప్పి. థియేటర్లన్నీ ఈ స్టార్ల వార్తో నిండిపోవడంతో, ‘పీపుల్స్ స్టార్’ ఆర్. నారాయణమూర్తికి థియేటర్లే లేని పరిస్థితి. ‘‘ఇలా అయితే చిన్న సినిమాలు ఎలా బతుకుతాయి? కనీసం ఊరికొక్క థియేటరైనా ఇవ్వండి బాబూ’’ అని నారాయణమూర్తి ఆవేదన వ్యక్తం చేశారు. బిజినెస్ అదుర్స్! చిరంజీవి హీరోగా, ఆయన కుమారుడే నిర్మాతగా వస్తున్న ‘ఖైదీ నంబర్ 150’ను 86 డేస్లో పూర్తి చేశారు. నిర్మాణ వ్యయం 40 కోట్ల పైమాటే కావచ్చని అంచనా. తొమ్మిదేళ్ళ తరువాత వస్తున్న చిరంజీవి సిన్మా కావడంతో, భారీ క్రేజ్ ఉంది. హక్కులు తీసుకున్నవారిలో ఎక్కువమంది కొత్తవాళ్ళు, రోజువారీ‡ సినీ వ్యాపారంతో సంబంధం లేనివాళ్ళేనని భోగట్టా. గుంటూరు, నెల్లూరు, తూర్పు గోదావరి ఏరియాలు సొంత మనుషులతో రిలీజ్ చేసుకుంటున్న నిర్మాతలు వైజాగ్, సీడెడ్ ప్రాంతాల హక్కుల్ని తమకు అత్యంత సన్నిహితులైన ఆ ప్రాంత రాజకీయ నేతలకూ (గంటా శ్రీనివాసరావు, సి. రామచంద్రయ్య), వారి బంధువులకూ ఇచ్చారట. ఇవి కాక, కర్ణాటక, శాటిలైట్ రైట్స్ (‘మా’టి.వికి రూ. 10.5 నుంచి 12 కోట్లకి) అమ్మారు. అన్నీ కలిపి రూ. 50 కోట్ల పైగా అయింది. ఇక రూ. 25 కోట్ల పైగా విలువైన కృష్ణా, నైజామ్, ఓవర్సీస్– నిర్మాతలే అట్టిపెట్టుకొని, సొంత రిలీజ్ చేస్తున్నారట. అన్నీ చేరి, రూ. 75 కోట్ల పైగా లావాదేవీలు జరిగినట్లు లెక్క. రికార్డు టైమ్లో 85 రోజుల్లో షూటింగ్ పూర్తి అయిన బాలకృష్ణ చారిత్రక కథా చిత్రం ‘గౌతమిపుత్ర శాతకర్ణి’కి దాదాపు రూ. 40 కోట్ల పైగా వ్యయమైనట్లు భోగట్టా. ఈ క్రేజీ ప్రాజెక్ట్ హక్కులు హాట్కేక్స్లా అమ్ముడవడంతో, సుమారు రూ. 60 కోట్లకు పైగా వ్యాపారమైంది. అలా ఏకంగా రూ. 20 కోట్ల టేబుల్ ప్రాఫిట్ రావడం ఇప్పుడు టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ. హీరోల సొంత సంస్థలు కాక, బయటి నిర్మాత సిన్మాకింత టేబుల్ ప్రాఫిట్ రావడం ఇటీవల లేదని సినీ వర్గాల మాట. శాటిలైట్ రైట్లే రూ.8.5 కోట్లు (‘మా’ టివి) పలికాయి. ఇంకా తమిళ, హిందీ చిత్రాల థియేటరికల్ రైట్స్తో అదనపు ఆదాయం వచ్చే ఛాన్సుంది. ష్... సెన్సార్ అవుతోంది! ఇంటిపేరుతో కొత్తగా పెట్టిన ‘కొణిదెల ప్రొడక్షన్స్’ పతాకంపై రామ్చరణ్ నిర్మించిన ‘ఖైదీ నంబర్ 150’ చిత్రం విడుదలకు చాలా ముందే, డిసెంబర్ 29నే సెన్సార్ పూర్తి చేసుకుంది. అత్యంత విశ్వసనీయ వర్గాల కథనం ప్రకారం – సినిమాలో ఫస్టాఫ్ ప్రధానంగా వినోదాత్మకం. ఆడవేషంలో అలీ, బ్రహ్మానందం మధ్య కామెడీ సీన్లు వస్తాయి. సెకండాఫ్లో కథలో అసలు ఘట్టం సాగుతుంది. ‘రైతు’పై వచ్చే పాట కన్నీరు పెట్టిస్తుంది. ఆరు పదులు దాటిన వయసులోనూ చిరు నవ యువకుడిలా తయారై చేసిన ఇంటర్వెల్ ఫైట్, 2 పాటలకు డ్యాన్సులు అదిరిపోయాయి. మొత్తం మీద 9 ఏళ్ళు గ్యాప్ తర్వాత, ‘యస్... బాస్ ఈజ్ బ్యాక్’ అని అభిమానులు కేరింతలు కొట్టేలా సినిమా ఉందని సెన్సార్ టాక్. ‘యు/ఏ’ సర్టిఫికెట్ వచ్చిన ఈ సినిమా తుది నిడివి 2 గంటల 27 నిమిషాలు. ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ జనవరి 5న సెన్సార్ జరుపుకొంది. సినిమా చూసిన సెన్సార్ సభ్యులు ‘సిన్మా బ్రహ్మాండం సార్! ఇంతలా ఉంటుందని ఊహించలేదు’ అన్నారట. అభిజ్ఞ వర్గాల కథనం ప్రకారం – హీరో పాత్రచిత్రణ, యుద్ధ సన్నివేశాలు, ముఖ్యంగా క్లైమాక్స్ ముందు వచ్చే ఎపిసోడ్ సూపర్. సినిమా ముగింపు సమయంలో హీరో చెప్పే డైలాగులు, ‘ఇది మన కథ... ప్రతి తెలుగువాడి కథ...’అంటూ నేపథ్యం నుంచి వచ్చే మాటలు సినిమా అయిపోయాక కూడా ప్రేక్షకుల్ని మంత్రముగ్ధంగా నిలబెట్టేస్తాయి. యుద్ధాలే కాక, కర్తవ్యానికీ, కుటుంబ బంధానికీ మధ్య నలిగిపోయే ఒక చక్రవర్తి కథగా ఎమోషన్ సీన్లూ పండాయి. బుర్రా సాయిమాధవ్ డైలాగ్లు, సీతారామశాస్త్రి పాటలు, బాలకృష్ణ డైలాగ్ డెలివరీ – అన్నీ కలిసి, ప్రేక్షకులు మీసం తిప్పేలా ఉందీ సినిమా అని సెన్సార్ టాక్. సెన్సారైన రోజు సాయంత్రానికే పరిశ్రమలో దీనిపై ఒకటే చర్చ. రెండు చోట్ల డైలాగుల్లో చిన్న చిన్న సవరణలతో ‘యు/ఏ’ సర్టిఫికెట్ వచ్చిన ఈ సినిమా తుది నిడివి 2 గంటల 14 నిమిషాలే! అప్పుడూ ఇలాగే... బాక్సాఫీస్ యుద్ధం సంక్రాంతి సీజన్లో థియేటర్ల బరిలో ఇలా చిరంజీవి, బాలకృష్ణ చిత్రాలు ఢీ అంటే ఢీ అనుకోవడం ఇదే మొదటిసారి కాదు. 1987లో తొలిసారిగా చిరు ‘దొంగమొగుడు’ (జనవరి 9), బాలయ్య ‘భార్గవరాముడు’ (జన. 14) సంక్రాంతి పందెం కోళ్ళయ్యాయి. అప్పటి నుంచి ఇప్పటి దాకా గత 30 ఏళ్ళలో – ఏడుసార్లు ఇలాంటి పోటీ జరిగింది. ‘ఖైదీ నంబర్ 150’ వర్సెస్ ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ ఎనిమిదోసారి జరుగుతున్న పోటాపోటీ. ఈ 30 ఏళ్ళలో ఇద్దరి సినిమాలూ ఒకే తేదీన రిలీజైంది ఒక్క 2001లోనే! అదీ సంక్రాంతికే! ఆ తరువాత మరెప్పుడూ ఒకే తేదీకి వాళ్ళ చిత్రాలు పోటీ పడలేదు. గడచిన 7 సార్లలో ఇప్పటి దాకా 3 సార్లు (‘సమరసింహారెడ్డి’, ‘నరసింహనాయుడు’, ‘లక్ష్మీనరసింహా’ – ఈ మూడూ కూడా 70కి పైగా కేంద్రాల్లో వంద రోజులాడాయి) బాలకృష్ణ పైచేయి సాధించారు. మరో రెండుసార్లు (‘అన్నయ్య’, ‘దొంగమొగుడు’) చిరంజీవిదే అగ్రస్థానం. మిగతా రెండుసార్లు (‘మంచిదొంగ’– ‘ఇన్స్పెక్టర్ ప్రతాప్’, ‘హిట్లర్’–‘పెద్దన్నయ్య’) ఇద్దరు హీరోలూ బాక్సాఫీస్ వద్ద సమానంగా నిలిచారు. ఎన్నెన్నో హైలైట్స్... ఎవరికీ అందని అంచనాలు! ‘నచ్చిందే చేస్తా’నంటున్న ఖైదీ నంబర్ 150 ⇔ ‘బాస్ ఈజ్ బ్యాక్’ అనే ట్యాగ్లైన్తో వస్తున్న చిరంజీవి చిత్రంలో అభిమానులకు కన్నులపండువ కోసం చాలా హంగామానే చేస్తున్నారు. ఈ సినిమా కోసం చిరంజీవి ఎన్ని కసరత్తులతో ఏం మాయ చేశారో కానీ, తెరపై కనీసం 20 ఏళ్ళు తగ్గినట్లు కనిపిస్తున్నారు. దీని కోసం దాదాపు ఏడాది పాటు శ్రమించినట్లు సాక్షాత్తూ చిరంజీవే ‘సాక్షి’కి చెప్పారు. ⇔ ఒకప్పుడు ఫైట్లు, డ్యాన్సులకు ఫేమస్ అయిన చిరు మళ్ళీ ఆ ఊపు తరహా మాస్ పాటలు, బీట్స్కు నర్తించినట్లు అభిజ్ఞ వర్గాల భోగట్టా. ⇔ రామ్చరణ్ నటించిన ‘మగధీర’, ‘బ్రూస్లీ’ చిత్రాల్లో తండ్రి చిరంజీవి గెస్ట్ అప్పీయరెన్స్ ఇస్తే, ఈసారి తండ్రి కమ్బ్యాక్ సినిమాను రామ్చరణ్ నిర్మించడమే కాక, ‘అమ్మడు’ పాటలో కొద్ది క్షణాలు కనిపించనున్నారు. ⇔ చిరంజీవి పెద్ద కూతురు సుస్మిత ‘ఖైదీ నంబర్ 150’లో తండ్రి కాస్ట్యూమ్స్ డిజైన్ చేసి, సై్టలిస్ట్గా వ్యవహరించారు. ⇔ రత్నవేలు సినిమాటోగ్రఫీ అందిస్తున్న ఈ సినిమా షూటింగ్ అంతా హైదరాబాద్ పరిసరాల్లో చేశారు. పాటల కోసం ప్రత్యేకంగా స్లొవేనియా, క్రొయేషియా దేశాలకు వెళ్ళి, చిత్రీకరణ జరిపారు. ∙ఫస్టాఫ్ సరదాగా ఉంటే, సెకండాఫ్లో దాదాపు 45 నిమిషాలు ఎమోషనల్గా పీక్కు చేరుస్తుందని చిత్ర యూనిట్ కథనం. నీటి కోసం కన్నీరు కార్చే రైతుల వెతల్ని చూపే రామజోగయ్య శాస్త్రి రచన ‘నీరు నీరు నీరు... రైతు కంట నీరు...’ పాట కదిలిస్తుందని అంచనా. ‘శరణమా... రణమా’ అంటున్న శాతకర్ణి ⇔ తెలుగు జాతి చరిత్ర చెప్పే చారిత్రక కథ కావడం, ఇలాంటి పాత్రలకు నప్పే హీరో బాలకృష్ణకు 100వ సినిమా కావడం ‘శాతకర్ణి’లో విశేషం. ⇔ తెలుగులో ఎన్టీఆర్ ‘పాండవ వనవాసం’– 1965, ‘శ్రీకృష్ణ విజయం’ –1971లో నటించిన హేమమాలిని 46 ఏళ్ళ తర్వాత మళ్ళీ తెలుగు తెరపైకి వచ్చారు. తండ్రి ఎన్టీఆర్తో నటించిన డ్రీమ్ గర్ల్ ఇప్పుడు కుమారుడు బాలకృష్ణకు తల్లిగా చేశారు. ⇔ చరిత్ర కాబట్టి, ‘బాహుబలి’లా ఊహాలోకపు విహారాల లాంటివి లేకపోయినా, సినిమాలో 3 యుద్ధ సన్నివేశాలు ఆకర్షణ. కబీర్ బేడీ లాంటి అంతర్జాతీయ నటులూ, టెక్నీషియన్లూ అదనపు ఆకర్షణ. ⇔ ఆకట్టుకొనే హీరో పాత్రచిత్రణతో పాటు, ‘సమయం లేదు మిత్రమా... శరణమా? రణమా?’, ‘దేశం మీసం తిప్పుదాం!’, ‘దొరికినవాణ్ణి తురుముదాం... దొరకనివాణ్ణి తరుముదాం’ లాంటి మోస్ట్ పాపులర్ డైలాగ్స్ బోలెడున్నాయి. ఈ సినిమాతో పాటు ‘ఖైదీ నంబర్ 150’కి కూడా కొన్ని పవర్ఫుల్ డైలాగులు రచయిత బుర్రా సాయిమాధవ్ రాయడం విశేషం. ⇔ మొరాకో, జార్జియాలతో పాటు మన దేశంలో మధ్యప్రదేశ్లో ఇండోర్ సమీపంలోని నర్మదా నదీ తీరంలోని మహేశ్వర్ లాంటి చోట్ల షూటింగ్ జరిపారు. చిలుకూరులో కోటి రూపాయల ఓడ సెట్ వేశారు. ఎన్టీఆర్ ఆశ తీర్చిన బాలకృష్ణ పెద్ద ఎన్టీయార్ గతంలో ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ చిత్రాన్ని స్వయంగా నటిస్తూ, నిర్మించాలనుకొన్నారు. 1993 ప్రాంతంలో రచయితలతో చర్చించి, స్క్రిప్ట్ కూడా సిద్ధం చేయించారు. ఈ సుప్రసిద్ధ తెలుగు శాతవాహన చక్రవర్తి జీవితం మొత్తాన్నీ సినిమాగా తెరపై చూపాలని ఆయన భావించారు. గౌతమీపుత్ర శాతకర్ణి కుమారుడైన నవ యువకుడు వాసిష్టీపుత్ర పులుమావి పాత్రను హీరో వెంకటేశ్తో వేయించాలని కూడా భావించారు. గెటప్, కాస్ట్యూమ్ స్కెచ్లూ వేయించారు. కానీ, అనివార్య కారణాల వల్ల అప్పట్లో అది తెరకెక్కలేదు. అప్పుడు తెరకెక్కని ఆ కథాంశం 23 ఏళ్ళ తర్వాత ఇప్పుడు క్రిష్ మనసులో ఆలోచనగా బాలకృష్ణతో రావడం యాదృచ్ఛికం. తప్పని తిప్పలు... మార్పులు! ⇔ ‘ఖైదీ నంబర్ 150’లో ఐటమ్ సాంగ్ కోసం ముందుగా క్యాథరిన్ థెరిసాను తీసుకున్నారు. అయితే, చిరు కుమార్తె సై్టలిస్ట్ అయిన సుష్మితతో ఈ చిత్రంలో కాస్ట్యూమ్స్ విషయంలో సెట్లో తలెత్తిన పేచీతో ఆ అమ్మాయిని పక్కకు తప్పించారు. రాయ్ లక్ష్మితో ఆ పాట చిత్రీకరించారు. ⇔ ‘ఖైదీ..’కీ, ‘శాతకర్ణి’కీ – రెంటికీ మొదట మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాదే! అయితే, తగినంత సమయం కేటాయించడం లేదనే కారణంతో, దేవిశ్రీ స్థానంలో చిరంతన్ భట్ను ప్రవేశపెట్టారు. ‘రుద్రమదేవి’కి నై..! ‘శాతకర్ణి’కి మాత్రం సై! తెలుగు జాతి చరిత్రకు సంబంధించిన కథాంశం కావడంతో, ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ చిత్రానికి అండగా నిలిచేందుకు రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలూ ముందుకొచ్చాయి. తెలంగాణ ప్రభుత్వం ఈ చిత్రానికి వినోదపు పన్ను నుంచి మినహాయించగా, ఏపీ ప్రభుత్వం ఆ బాటలోనే ఉంది. వినోదపు పన్ను కట్టనవసరం లేకపోవడంతో, సాధారణంగా అయితే ప్రేక్షకుడికి టికెట్ రేటు తగ్గాలి. అయితే, ఇలాంటి చారిత్రక చిత్రాలు నిర్మించేవారిని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో, టికెట్ రేట్ మామూలుగానే ఉంచేసి, పన్ను మినహాయింపు లాభాన్ని నిర్మాతలకు అందజేయాలని భావిస్తున్నారు. దాంతో, సినిమాకు వచ్చే వసూళ్ళలో ఆ మేరకు (దాదాపు 15 శాతం) నిర్మాతకు లాభిస్తుంది. వచ్చిన నికర వసూళ్ళు (షేర్) అదనంగా 7 నుంచి 8 శాతం దాకా పెరుగుతాయని వ్యాపార వర్గాల అంచనా. వరంగల్ నుంచి తెలుగు ప్రాంతాన్ని అంతటినీ పాలించిన కాకతీయ సామ్రాజ్ఞి ‘రుద్రమదేవి’ కథను అదే పేరుతో దర్శక – నిర్మాత గుణశేఖర్ ఆ మధ్య సినిమాగా తీశారు. అయితే, ఆ తెలుగు రాణి కథకు తెలంగాణ ప్రభుత్వమే తప్ప, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అండదండగా నిలబడ లేదు. దాదాపు 15 నెలల క్రితం వచ్చిన ఆ చిత్రానికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వినోదపు పన్ను మినహాయింపు నిచ్చారు. కానీ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ‘ఇదుగో.. అదుగో’ అని తిప్పించుకొని, ఆఖరికి మొండిచెయ్యి చూపించారు. ఈసారి తన బావమరిది – వియ్యంకుడైన బాలకృష్ణ నటించిన ‘శాతకర్ణి’ సినిమాకు రిలీజ్కు ముందే పన్ను మినహాయింపునకు సిద్ధమవుతున్నారు. అన్నట్లు అప్పట్లో ఈ పన్ను మినహాయింపు లాభమంతా ఎప్పటిలా ప్రేక్షకులకూ, ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లకూ కాకుండా చరిత్రను తెరకెక్కించిన నిర్మాతలకే దక్కేలా కేసీఆర్ జీవో జారీ చేశారు. కానీ, ‘రుద్రమదేవి’కి దక్కాల్సిన ఆ ప్రోత్సాహం తాలూకు సొమ్మంతా ఆ చిత్రాన్ని పంపిణీ చేసిన పేరున్న తెలంగాణ చిత్ర నిర్మాత – డిస్ట్రిబ్యూటర్ కమ్ ఎగ్జిబిటర్ దగ్గరే ఉండిపోవడం విచిత్రం. పరిశ్రమ వర్గీయులు మధ్యవర్తిత్వం చేసినా, ప్రభుత్వమిచ్చిన ఆ ప్రోత్సాహం అసలు నిర్మాతకు చేరకనేపోవడం విషాదం. పోటీపడుతున్న అభిమానం అతిథి పాత్రపోషణల్ని కలిపితే, సినిమాల సంఖ్య పెరిగినా, చిరంజీవి, బాలకృష్ణలు ఈ తాజా చిత్రాల్ని 150... 100... సినిమాలుగానే ప్రకటిస్తూ వచ్చారు. అలా ఇవి ‘మేజికల్ ఫిగర్’ సినిమాలు కావడంతో, చిరు, బాలయ్య అభిమానులు కూడా వీటిని ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. అందుకే, దేశమంతా పుణ్యక్షేత్రాల్లో పూజల దగ్గర నుంచి తమ హీరోల ప్రత్యేక పుస్తకాల విడుదల దాకా అనేకం చేస్తున్నారు. బాలకృష్ణ అభిమానులు తమ హీరో చిత్ర అఖండ విజయం కోసం గత నవంబర్ ఆఖరులో కార్తీక సోమవారానికి 1116 శివాలయాల్లో రుద్రాభిషేకం చేయించారు. 3 వ్యాన్లలో తిరుగుతూ, సుమారు 9 రాష్ట్రాల్లో 39 రోజుల పాటు, 95 పుణ్యక్షేత్రాల్లో పూజలు చేసి, ‘భారతదేశ శతపుణ్యక్షేత్ర జైత్రయాత్ర’ చేశారు. చిరు అభిమానులు తామేం తక్కువంటూ అన్నయ్య రీఎంట్రీ సిన్మా విజయం కోసం... పుణ్యక్షేత్రాల సందర్శనకు దిగారు. కాశీ విశ్వనాథుడికీ, విశాలాక్షికీ, కొల్హాపూర్లో మహాలక్ష్మి అమ్మవారికీ పూజలు చేశారు. బాలకృష్ణ ఫ్యాన్స్ ఏమో వంద సినిమాల లోగోలు, స్టిల్స్తో ‘ఎన్.బి.కె. 100 – నెవర్ బిఫోర్’ అంటూ ప్రత్యేక పుస్తకం, క్యాలెండర్లు, డైరీలు ప్రింట్ చేసి, ఆడియో రిలీజ్ వేదికపై విడుదల చేశారు. ఇక, చిరు వర్గం అండతో, ఆయన సినిమా జీవితంపైనా కొన్ని పుస్తకాలు రిలీజ్కు ముందే విడుదలకు సిద్ధమవుతున్నాయి. బాలకృష్ణ అభిమానులు ప్రొద్దుటూరులోని ఒక థియేటర్లో ఆయన నటించిన 100 సినిమాల్నీ రోజుకొకటి చొప్పున ప్రదర్శిస్తూ, శతచిత్రోత్సవం చేస్తున్నారు. చరిత్రలో శాతకర్ణి ప్రవేశపెట్టిన ‘గుడీపడవా’ (గుడిసెపై జెండా) పండుగకు గుర్తుగా 100 థియేటర్లపై శాతకర్ణి జెండా ఎగరేసేందుకు సిద్ధమయ్యారు. మరోపక్క ‘అన్నయ్య’ రీ–ఎంట్రీకి తగ్గట్లు కర్ణాటకలోని చిరు వీరాభిమాని ఒకరు ప్రత్యేకంగా పాట రాయించుకొని, ప్రముఖ గాయకుడు దీపూతో పాడించి, ‘వచ్చాడు వచ్చాడు చిరంజీవి వచ్చాడు...’ అంటూ దాన్ని ఆల్బమ్గా రిలీజ్ చేశారు. ఇక, సిన్మా రిలీజ్ రోజు హంగామాకైతే ఇరు వర్గాల లక్షలాది అభిమానులూ సర్వసన్నద్ధమవుతున్నారు. బరిలో... మిగతా పందెం కోళ్ళు! గత ఏడాది సంక్రాంతికి ఏకంగా 4 తెలుగు సినిమాలు వచ్చాయి. ఈ సారీ నాలుగు వస్తున్నాయి. చిరు, బాలయ్య సినిమాల్ని పక్కనపెడితే, శర్వానంద్, అనుపమా పరమేశ్వరన్లతో ‘దిల్’ రాజు నిర్మిస్తున్న ‘శతమానం భవతి’ సరిగ్గా సంక్రాంతి రోజున జనవరి 14న రిలీజ్ కానుంది. అలాగే, ఆర్. నారాయణమూర్తి చాలా కాలం తర్వాత బయటి నిర్మాతలకు పనిచేసిన ‘హెడ్కానిస్టేబుల్ వెంకట్రామయ్య’ కూడా జనవరి 14నే వస్తోంది. ‘శతమానం భవతి’ పూర్తిగా కుటుంబకథా చిత్రం ఫీల్తో సంక్రాంతి పండుగ ఫీల్ తెస్తుంటే, నల్లధనంపై పోరాటమనే లేటెస్ట్ బర్నింగ్ టాపిక్ మీద వస్తున్న ‘హెడ్కానిస్టేబుల్ వెంకట్రామయ్య’ ఆలోచింపజేస్తోంది. వరుసగా వచ్చే సెలవులు, ఇంటిల్లపాదీ సినిమాలు, షికార్లతో ఆనందించాలనుకునే పండుగ వాతావరణం ఒకటికి, నాలుగు సినిమాల్ని బాక్సాఫీస్ దగ్గర సునాయాసంగా గెలుపునిస్తుంది. అదే ఇప్పుడీ పోటాపోటీ రిలీజ్లకు పెద్ద ఊపిరి. సామాన్య ప్రేక్షక జనం కూడా ఇప్పుడు చెబుతున్నది ఒకే మాట .. ‘మాకు నచ్చిందే చూస్తాం... నచ్చితేనే చూస్తాం...’ మరి, ఈసారి సినిమా బరిలో సంక్రాంతి మొనగాడెవరో? జస్ట్ మరొక్క మూడు రోజులు... లెటజ్ వెయిట్ అండ్ సీ! సంక్రాంతికే.. శతమానం భవతి, హెడ్కానిస్టేబుల్ వెంకట్రామయ్య – డాక్టర్ రెంటాల జయదేవ -
చనిపోయిన నటి చివరి వింత కోరిక!
స్టార్ వార్స్ సినిమాలో నటించిన ప్రఖ్యాత హాలీవుడ్ నటి క్యారీ ఫిషర్ మంగళవారం ఉదయం గుండెపోటుతో తనువు చాలించింది. స్టార్వార్స్ ప్రిన్సెస్ లీయా ఆర్గానాగా నటించిన ఆమెకు 60 ఏళ్లు. ఆమెకు హారిసన్ ఫోర్డ్తోపాటు ఇతర స్టార్ వార్స్ సిరీస్ నటులు నివాళులర్పిస్తుండగా.. తాజాగా ఆమె చివరి వింత కోరిక ఒకటి వెలుగుచూసింది. 'వెన్నెల వెలుగులో మునిగి.. సొంత బ్రా వల్ల ఊపిరి ఆడక చనిపోయింది' అని తన గురించి శ్రద్ధాంజలిలో రాయాలని కోరుకుంటున్నట్టు ఆమె పేర్కొంది. ఈ విషయాన్ని 2008లో తాను ప్రచురించిన ఆత్మకథ 'విష్ఫుల్ థింకింగ్'లో పేర్కొంది. 1997నాటి స్టార్వార్ సినిమాలో పిన్సెస్ లీయా పాత్ర అంతరిక్షంలో తెల్లని దుస్తులు ధరిస్తుంది. ఈ దుస్తులు ఎంతో ప్రసిద్ధి పొందాయి. అయితే, సినిమా దర్శకుడు జార్జ్ లుకాస్ ఈ దుస్తుల గురించి తనతో చర్చిస్తూ.. వీటిని వేసుకునేటప్పుడు లోదుస్తులు వేసుకోవద్దని, ఎందుకంటే అంతరిక్షంలో వాటిని వేసుకోబోరని చెప్పాడని తెలిపింది. 'ఈ డ్రెస్ వేసుకొనేటప్పుడు బ్రా ధరించవద్దని అతను చెప్పాడు. నిజమే అంతరిక్షంలోకి వెళ్లినప్పుడు మీ శరీర బరువు తేలికైపోతుంది. అప్పుడు మీ శరీరం ఉబ్బిపోవొచ్చు. కానీ బ్రా అలా పెరిగిపోదు. అందుకే నేను ఎలా చనిపోయినా పర్వాలేదు కానీ, బ్రా వల్ల ఊపిరి ఆడక చనిపోయిందని శ్రద్ధాంజలిలో రాయమని నా స్నేహితులకు చెప్పాను' అంటూ తన పుస్తకంలో సరదాగా వివరించింది ఫిషర్. -
ఇదేంటి బాసూ! సూపర్ స్టార్ ప్రచారంపై దుమారం!
మలయాళం సూపర్ స్టార్ మోహన్ లాల్ ఎన్నికల ప్రచారంలో కనిపించడం కేరళను రాజకీయంగా కుదిపేస్తోంది. ఓ వామపక్ష పార్టీ అభ్యర్థి తరఫున మోహన్ లాల్ ఎన్నికల సభలో పాల్గొనడం కోలీవుడ్లో దుమారం రేపుతోంది. ఆయన తీరును ప్రశ్నిస్తూ కోలీవుడ్ మువీ ఆర్టిస్ట్ అసోసియేషన్ నుంచి ఒకరు వైదొలుగగా.. ప్రముఖ మలయాళీ దర్శకుడు కూడా ఈ వివాదంలో తలదూర్చాడు. కొల్లాంలోని పథానపురం నియోజక వర్గం నుంచి సినీ పరిశ్రమకు చెందిన ముగ్గురు వ్యక్తులు బరిలోకి దిగారు. వామపక్ష ఎల్డీఎఫ్ నుంచి నటుడు కేవీ గణేష్ కుమార్, కాంగ్రెస్ నుంచి హాస్య నటుడు జగదీశ్, బీజేపీ నుంచి ప్రముఖ విలన్ క్యారెక్టర్ ఆర్టిస్టు భీమన్ రఘు పోటీ పడుతున్నారు. గురువారం మోహన్లాల్ గణేశ్కుమార్ తరఫున ఎన్నికల ర్యాలీలో పాల్గొన్నారు. ఆయన రాజకీయాలేవీ మాట్లాడలేదు. గణేష్ కుమార్కు ఓటు వేయమనీ అడుగలేదు. కేవలం పథానపురం నియోజకవర్గంతో తనకున్న అనుబంధాన్ని మాత్రమే ఈ ర్యాలీలో ప్రస్తావించారు. ప్రముఖ దర్శకుడు ప్రియదర్శన్ కూడా గణేశ్ కుమార్ తరఫున ఎన్నికల ర్యాలీలో పాల్గొన్నారు. తన స్నేహితుడైన గణేష్కుమార్ తరఫున మోహన్లాల్ ప్రచారం చేయడం పెద్ద దుమారమే రేపుతున్నది. మోహన్ లాల్ మలయాళం మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ నిబంధనల్ని ఉల్లంఘించారని, సినీ కళాకారులు ఎవరూ ఎన్నికల ప్రచారంలో పాల్గొనరాదని అసోసియేషన్ నోటిఫికేషన్ ఇచ్చిందని గణేష్కుమార్ ప్రత్యర్థి, కమెడియన్ జగదీశ్ మండిపడుతున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి అయిన ఆయన శుక్రవారం టీవీ ముందుకువచ్చి కంటతడి పెడుతూ.. గణేష్ కుమార్ బ్లాక్మెయిల్ చేసి మోహన్ లాల్ను తన ప్రచారానికి రప్పించుకున్నారని, ఇది సరికాదని ఆరోపించారు. కాగా, జగదీశ్కు మద్దతుగా మరో కమెడియన్ సలీంకుమార్ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ నుంచి తప్పుకున్నారు. మరోవైపు మోహన్ లాల్పై జగదీశ్ చేసిన ఆరోపణల్ని దర్శకుడు ఉన్నికృష్ణన్ కొట్టిపారేశారు. ఆయనను ఎవరూ బ్లాక్ మెయిల్ చేయలేదని, జగదీశ్ చెత్త ఆరోపల్ని మానుకోవాలని చెప్పారు. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కూడా నటులు ఎన్నికల ప్రచారంలో పాల్గొనకుండా నిషేధిస్తూ ఎలాంటి మార్గదర్శకాలు ఇవ్వలేదని స్పష్టం చేసింది. -
'స్టార్వార్స్' రోబో క్రియేటర్ విషాదాంతం!
'స్టార్వార్స్' సినిమా కోసం ఆర్2-డీ2 రోబోలను రూపొందించిన స్పెషల్ ఎఫెక్ట్స్ నిపుణుడు టోనీ డైసన్ విషాదకర పరిస్థితుల్లో మృతిచెందారు. గోజోకు చెందిన మాల్టా దీవిలోని తన నివాసంలో ఆయన విగతజీవిగా పోలీసులకు కనిపించారు. బ్రిటన్కు చెందిన 68 ఏళ్ల టోనీ డైసన్ సహజ కారణాలతోనే కొన్ని రోజుల కిందట చనిపోయినట్టు భావిస్తున్నారు. గత కొన్ని రోజులుగా స్నేహితులకు ఆయన కనిపించకపోవడం, ఆయన ఆచూకీ లేకపోవడంతో వారు పోలీసులకు సమాచారమిచ్చారు. ఇంటికి వెళ్లి చూడగా.. ఆయన ఒక్కడే నిర్జీవంగా పడి ఉన్నాడు. ఆయన మృతి వెనుక ప్రాథమికంగా ఎలాంటి అనుమానాలు కలుగడం లేదని పోలీసులు తెలిపినట్టు స్థానిక మీడియా తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా అభిమానులను అలరించిన 'స్టార్వార్స్' సినిమాకు స్పెషల్ ఎఫ్టెక్స్ అందించడమే కాదు.. ఆ సిరీస్ సినిమాల కోసం ఎనిమిది ఆర్2-డీ2 రోబోలను రూపొందించారు. ఈ రోబోలు ఎంతగానో ఆయనకు పేరుప్రఖ్యాతలు తీసుకొచ్చాయి. ఎన్నో ఇతర సంస్థలకు కూడా ఆయన రోబోలను రూపొందించి ఇచ్చారు. ఆయన రోబోలు ఎంతగా ఫేమస్ అయ్యాయంటే ఈ రోబోల పేరిట ఆయన క్లబ్ కూడా ఏర్పాటుచేశారు. -
'స్టార్ వార్స్: ది ఫోర్స్ అవేకెన్స్'
-
జుకర్బర్గ్ ఇంట్లో 'స్టార్వార్స్' దండు!
త్వరలోనే విడుదలకానున్న 'స్టార్ వార్స్' సిరీస్లోని ఏడో ఛాప్టర్ కోసం ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఫేస్బుక్ స్థాపకుడు జుకర్బర్గ్ కూడా 'స్టార్ వార్స్' అభిమానే. అందుకే తన అభిమానాన్ని వినూత్నరీతిలో ఆవిష్కరిస్తూ ఆయన తన ఇంట్లోనే 'సార్వార్స్' దళాన్ని ఆవిష్కరించారు. తన ముద్దుల కూతురు 'మాక్స్'ను 'స్టార్వార్స్' యోధురాలి దుస్తుల్లో అలంకరించారు జుక్. ఆ చిన్నారి వద్ద ఓ చిన్ని గ్రీన్లైట్ ఖడ్గాన్ని, స్టార్వార్స్ చిహ్నాలైన డార్త్ వాడర్ మాస్క్, చ్యుబాకా మస్క్ ఉంచారు. దీంతో చిన్నపాటి యుద్ధయోధురాలిగా తయారైన 'మాక్స్'.. తండ్రి ఫొటోలు తీస్తుండగా గంభీరంగా పోజు ఇచ్చింది. 'మాక్స్' యే కాదు తన బుజ్జికుక్క 'బీస్ట్'ను కూడా స్టార్వార్స్ యోధుడిగా మార్చారు ఆయన. దానికి ఓ రెడ్లైట్ ఖడ్గాన్ని ఇచ్చారు. దీంతో 'బీస్ట్' కూడా ఓ సూపర్ పోజు ఇచ్చింది. అన్నట్టు 'బీస్ట్'కు రెండు చికెన్ లెగ్పీసులు విందుగా ఇస్తేనే ఇందుకు ఒప్పుకున్నదట. మొత్తానికి జుకర్బర్గ్ ఇంట్లో రెడీ అయిన ఈ 'స్టార్వార్స్' దండు ఫేస్బుక్ వాసులను విపరీతంగా ఆకట్టుకుంటుంది. -
ఈ వారం you tube హిట్స్
స్టార్ వార్స్ : ది ఫోర్స్ అవేకెన్స్ ట్రైలర్ నిడివి : 2 ని. 35 సె. హిట్స్ : 4,53,89,879 స్టార్ వార్స్ ఫిల్మ్ సిరీస్లో ఇది ఏడవది. ట్రైలర్ గతవారమే విడుదలైంది. ఈ అమెరికన్ ఎపిక్ స్పేస్ అపేరా చిత్రానికి జె.ఎ.అబ్రామ్స్ దర్శకత్వం వహిస్తున్నారు. డిసెంబర్ 14న రిలీజ్కు రంగం సిద్ధమైంది. 23 ఏళ్ల ఇంగ్లండ్ నటి డైసీ రిడ్లే ఇందులో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఎడారి గ్రహం జక్కులో ఈమె మొదట స్కావెంజర్. తర్వాత సాహస వనితగా అవతరిస్తారు. 1983లో వచ్చిన స్టార్ వార్స్ సిక్స్ ‘రిటర్స్ ఆఫ్ ది జెడీ’ తర్వాత దాదాపు 30 ఏళ్లకు వస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. స్టార్వార్స్ సీరీస్లో తొలిచిత్రం 1977లో విడుదలైంది. మార్వెల్స్ జెస్సికా జోన్స్ : ట్రైలర్ నిడివి : 2 ని. 28 సె. హిట్స్ : 26,47,608 నవంబర్ 20 నుంచి ‘నెట్ఫ్లిక్స్’ నెట్ వర్క్ ద్వారా ప్రపంచమంతటా ప్రసారం కాబోతున్న అమెరికన్ వెబ్ టెలివిజన్ సిరీస్.. మార్వెల్వ్ జెస్సికా జోన్స్. మార్వెల్స్ కామిక్స్ ఆధారంగా ఈ ఎపిసోడ్స్ తయారయ్యాయి. కథానాయిక జోన్స్ పాత్రను క్రిస్టెన్ రిటెన్ నటిస్తున్నారు. కథలో ఆమె ఒక సూపర్ హీరో. ఆ తర్వాత ఒక డిటెక్టివ్ ఏజెన్సీని నడుపుతుంది. సూపర్హీరోగా ఆమె కెరీర్ అర్ధంతరంగా అంతం కావడం వెనుక ఒక విషాదం ఉంటుంది. ఆ విషాదం నుండి తేరుకుని జెస్సికా తనని తను మలుచుకుంటుంది. తనేమిటో ప్రపంచానికి నిరూపిస్తుంది. దివానీ మస్తానీ : వీడియో సాంగ్ నిడివి : 2 ని. 44 సె. హిట్స్ : 33,20,290 రాజమందిరపు నృత్యగీతాన్ని వీక్షించదలచినవారు గతవారమే విడుదలైన ‘దివానీ మస్తానే’ అనే ఈ వీడియో సాంగ్ని ఎంపిక చేసుకోవచ్చు. దీపికా పడుకొనే, రణవీర్ సింగ్, ప్రియాంక నటించిన ‘బాజీరావ్ మస్తానీ’లోని ఈ పాటను ఎంతో రిచ్గా దృశ్యీకరించారు. సిద్ధార్థ్ గరిమ రాసిన ఈ పాటకు సంజయ్లీలా బన్సాలీ సంగీతం అందించారు. శ్రేయా గోషల్, గణేశ్ చందన్శివ గాత్రమిచ్చారు. మరాఠా యోధుడు మొదటి పీష్వా బాజీరావ్, ఆయన రెండవ భార్య మస్తానీల ప్రణయగాథ ఆధారంగా తీసిన ఈ చిత్రం డిసెంబర్ 18 న విడుదలౌతోంది. జస్టిన్ బీబర్ - సారీ (డాన్స్ వీడియో) నిడివి : 3 ని. 25 సె. హిట్స్ : 1,65,46,107 కెనడియన్ సింగర్ జస్టిన్ బీబర్ భగ్న ప్రేమగీతం ‘సారీ’. బీబర్ రెండవ సింగిల్ సాంగ్ అయిన ‘సారీ’ విడుదలైన మూడు రోజులకే కోటికి పైగా హిట్లు వచ్చాయి. గత ఆగస్టులో రిలీజ్ అయిన బీబర్ మొదటి సింగిల్ డెబ్యూ ‘వాట్ డు యు మీన్?’ కూడా ఇదేస్థాయి ఆదరణ పొంది, బిల్బోర్డ్ హాట్ 100 చార్ట్లో నిలిచింది. ఫాస్ట్ బీట్తో నడిచే తాజా డాన్స్ పాప్ సాంగ్ ‘సారీ’ యువతరాన్ని అలరిస్తోంది. జూలియా మైఖేల్స్, జస్టిన్ ట్రాంటర్, జస్టిన్ బీబర్ కలిసి రాసిన ఈ గీతంలో ‘నిన్నెంతో బాధపెట్టాను. ఇప్పుడు సారీ చెప్పడం ఆలస్యమేమో కదా’ అని ప్రీ కోరస్ వినిపిస్తూ ఉంటుంది. 20 ఇయర్స్ ఆఫ్ డి.డి.ఎల్.జె. నిడివి : 2 ని. 49 సె. హిట్స్ : 25,42,644 దిల్వాలే దుల్హనియా లే జాయేంగే (డి.డి.ఎల్.జే) విడుదలై ఈ అక్టోబర్ 20కి ఇరవై ఏళ్లు. ఆదిత్య చోప్రా దర్శకత్వం వహించిన ఈ రొమాంటిక్ ఫిల్మ్ ఇప్పటికీ ఒక సంచలనమే. షారుఖ్ ఖాన్, కాజోల్ ఈ చిత్రంతోనే మేడ్ ఫర్ ఈచ్ అదర్ హీరో హీరోయిన్లుగా బాలీవుడ్లో ప్రసిద్ధి చెందారు. ఎన్నారై అమ్మాయి, అబ్బాయి మధ్య నడిచే ప్రేమకథ ఇది. విషయం ఏమిటంటే డి.డి.ఎల్.జే. విడుదలై రెండు దశాబ్దాలు అయిన సందర్భంగా బాలీవుడ్ డెరైక్టర్ రోహిత్శెట్టి, దిల్వాలే టీమ్ కలిసి ఈ జ్ఞాపకాల వేడుకల వీడియోను రూపొందించారు. తప్పక చూడండి. హ్యూమన్స్ ఇన్ 1000 ఇయర్స్ నిడివి : 4 ని. 06 సె. హిట్స్ : 13,16,655 వచ్చే వెయ్యేళ్లలో మానవ జీవితం ఎలా ఉండబోతోందో, వివిధ రంగాలలో క్షణక్షణానికీ అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీ ప్రభావం వల్ల మానవుల రూపురేఖల్లో, మానవ జీవితంలో ఎలాంటి మార్పులు రాబోతున్నాయో అంచనా వేస్తూ ‘అసాప్సైన్స్’ అనే యూట్యూబ్ చానెల్ ఈ వీడియోను రూపొందించింది! అసాప్సైన్స్ చెబుతున్న దానిని బట్టి మనిషి కళ్లు ఎర్రగా అవుతాయట. మనుషులు బక్కగా, చక్కగా, ఎత్తుగా, అందంగా మారిపోతారట. వాతావరణ మార్పులు, కృత్రిమ మేధస్సు కలిసి ఈ భూగోళం స్వరూపాన్నే మార్చేస్తాయట. ఇంకా చాలా విశేషాలున్నాయి. వీడియో చూడండి. -
‘జురాసిక్ వరల్డ్’ దర్శకుడికి స్టార్వార్స్ చాన్స్?
స్టార్ వార్స్ సిరీస్ అంటే ఫ్యాన్స్కు పండగే. ఈ సిరీస్లో తాజాగా రూపొందుతున్న చిత్రం ‘ఫోర్స్ ఎవే కెన్స్’. ఇప్పటికే విడుదలైన ఈ ఎపిసోడ్ 7 ప్రచార చిత్రం ఆక ట్టుకుంటోంది. మరోపక్క ఎపిసోడ్-8 కూడా సెట్స్పైనే ఉంది. అలా రెండు భాగాలు సెట్స్ మీద ఉండగానే, ఎపిసోడ్ 9కు కూడా సన్నాహాలు చేసుకుంటున్నారు నిర్మాతలు. ఇటీవల విడుదలైన ‘జురాసిక్ వరల్డ్’ దర్శకుడు కాలిన్ ట్రెవరో ఆ ఎపి సోడ్కు న్యాయం చేకూరుస్తారని వారు భావిస్తున్నారు. ఆయనతో చర్చలు జరుపుతున్నారని సమాచారం. -
ఎదురుచూపులన్నీ... ఈ అయిదింటి మీదే!
డైనోసార్ విధ్వంసాలు (‘జురాసిక్ పార్క్’)... ఒళ్లు గగుర్పొడిచే సాహసాలు (‘మిషన్ ఇంపాజిబుల్’ సినిమాలో ఈథెన్ హంట్ గుర్తున్నాడుగా)... జేమ్స్ బాండ్ సినిమాల్లోని యాక్షన్ ఘట్టాలు.... రోబోల మధ్య యుద్ధం (‘టెర్మినేటర్’)... గగన వీధుల్లో మంచికి, చెడుకు మధ్య జరిగే పోరాటాలు.... హాలీవుడ్ సినిమాను తలుచుకోగానే సగటు ప్రేక్షకుల మనోఫలకాల్లో కదలాడే సన్నివేశాలు ఇవన్నీ. ఇలాంటి సినిమాలు ఎన్ని వచ్చినా ప్రపంచవ్యాప్తంగా సినీ అభిమానులు మళ్లీ మళ్లీ ఎదురుచూస్తూ ఉంటారు. అలాంటి సినిమాలు కొన్ని హాలీవుడ్లో ఈ ఏడాది వస్తున్నాయి. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా అందరి కళ్ళూ ఆ సినిమాల మీదే. ఈ చిత్రాల మీద ఎన్నెన్నో ఆశలు, అంచనాలు ఉన్నాయి. వాటి గురించి ఓ సారి...! రానున్న కొద్ది నెలల్లో రానున్న అలాంటి అయిదు సినిమాల గురించి...! జురాసిక్ వరల్డ్ ‘జురాసిక్ పార్క్’... హాలీవుడ్ సినీ చరిత్రలో ఓ సంచలనం. స్టీవెన్ స్పీల్బర్గ్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం తర్వాత మరో రెండు భాగాలు వచ్చాయి. వీటికి ఇప్పటికీ క్రేజ్ తగ్గలేదు. ఇప్పుడు స్పీల్బర్గ్ నిర్మాణ సారథ్యంలో ‘జురాసిక్ వరల్డ్’ సినిమా రానుంది. చిత్ర కథ ప్రకారం... 22 ఏళ్ల తర్వాత జురాసిక్ వరల్డ్ థీమ్ పార్క్ ఓపెన్ చేస్తారు. శాస్త్రవేత్తల సృష్టితో తయారైన ఓ డైనోసార్ ఆ పార్క్లో ఎలాంటి విధ్వంసం సృష్టించిందన్న దానికి తెరరూపం ఇచ్చారు. ఈ చిత్రం ‘జురాసిక్ పార్క్’కు సీక్వెల్ అని దర్శకుడు కొలిన్ ట్రెవెర్రో చెప్పారు. ఇందులో మరో విశేషం ఏంటంటే మన హిందీ సినీ నటుడు ఇర్ఫాన్ ఖాన్ జురాసిక్ పార్క్ సీఈవోగా కీలక పాత్రను పోషిస్తున్నారు. మిషన్ ఇంపాజిబుల్-రోగ్ నేషన్ టామ్ క్రూజ్ హీరోగా నటించిన ఈ సిరీస్లో ఇప్పటిదాకా వచ్చిన నాలుగు భాగాలు బాక్సాఫీస్ను షేక్ చేశాయి. ముఖ్యంగా నాలుగో భాగం ‘ఘోస్ట్ ప్రొటోకాల్’ కనకవర్షం కురిపించింది. త్వరలో ఐదో భాగం రాబోతోంది. ‘రోగ్ నేషన్’ టైటిల్తో రాబోతున్న ఈ చిత్రాన్ని టామ్క్రూజ్, జె.జె. అబ్రమ్స్, బ్రియాన్ బర్క్ కలిసి నిర్మిస్తున్నారు. క్రిస్టొఫర్ మెక్క్వారీ దర్శకుడు. రెబెకా ఫెర్గూసన్ కథానాయికగా నటిస్తున్నారు. ఎప్పటి లాగే ఈ చిత్రం కోసం ఒళ్లు గగుర్పొడిచే యాక్షన్ సన్నివేశాల్లో టామ్ క్రూజ్ నటించారు. విమానం మీద చేసిన యాక్షన్ సీక్వెన్స్ ఇప్పటికే హాట్ టాపిక్గా మారాయి. ఈ చిత్రం రానున్న జూలై 31న విడుదల కానుంది. స్పెక్టర్ ‘‘మై నేమ్ ఈజ్ బాండ్... జేమ్స్ బాండ్’’...అనగానే ప్రతినాయకులతో బాండ్ చేసే పోరాటాలు, గాళ్స్తో రొమాన్స్ గుర్తొస్తాయి. బాండ్ ఎవరైనా ఈ బ్రాండ్ డైలాగ్, ఆ సినిమాలకున్న బ్రాండ్ ఎప్పటికీ మారదు. అంత కొత్తగా తీస్తారు. ఇప్పటిదాకా 23 బాండ్ సినిమాలు ప్రేక్షకులను అలరించాయి. తాజాగా 24వ సినిమా ‘స్పెక్టర్’ రానుంది. డేనియల్ క్రెగ్ కథానాయకునిగా నటిస్తున్న ఈ చిత్రంలో మోనికా బెలూసీ, లీ సీడక్స్ బాండ్ గాళ్స్గా నటిస్తున్నారు. శామ్ మెండెస్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ఈ ఏడాది నవంబర్ 6న విడుదల కానుంది. టెర్మినేటర్ జెనిసిస్ హాలీవుడ్ ప్రముఖ దర్శకుడు జేమ్స్ కామెరూన్ నుంచి వచ్చిన అద్భుతమైన చిత్రాలలో టెర్మినేటర్ ఒకటి. ఆర్నాల్డ్ ష్వార్జ్నెగర్ హీరోగా నటించిన ఈ చిత్రం ఇప్పటిదాకా వచ్చిన రోబో చిత్రాలకు మార్గదర్శి. ఇప్పటిదాకా నాలుగు భాగాలు విడుదలయ్యాయి. వాటిలో మూడు భాగాలకు జేమ్స్ కామెరూన్ దర్శకత్వం వహించారు. ఈ ఐదో భాగానికి ‘థోర్’ చిత్ర ఫేమ్ అలెన్ టేలర్ దర్శకుడు. ఎమీలియా క్లార్క్, జై కోర్టినీ, క్రిస్టియన్ బేల్ కీలక పాత్రలు పోషించిన ఈ చిత్రం జూలై 1న విడుదల కానుంది. స్టార్ వార్స్- ద ఫోర్స్ ఎవేకెన్స్ దర్శక, రచయిత జార్జ్ లూకాస్ 1977లో అనుకుని ఉండరేమో... తన ఊహాసృష్టి ‘స్టార్ వార్స్’ పెను మార్పుకు దారితీస్తుందని! ఆయన దర్శకత్వం వహించిన ‘స్టార్ వార్స్’ ఫస్ట్పార్ట్ అప్పట్లో పెను సంచలనం. అది ఓ ఫ్రాంచైజ్గా మారిపోయింది. తర్వాత వరుసగా ఏడు వచ్చాయి. ఇప్పుడు ఎనిమిదో సినిమా కూడా రానుంది. హ్యారిసన్ ఫోర్డ్ ప్రధాన పాత్ర పోషిస్తున్న ఈ చిత్రానికి జె.జె. అబ్రమ్స్ దర్శకుడు. రానున్న డిసెంబర్ 18న ఈ చిత్రం రిలీజవుతోంది. -
24 గంటలు...88 లక్షలు!
1977లో ప్రపంచవ్యాప్తంగా కనకవర్షం కురిపించిన చిత్రం ‘స్టార్ వార్స్’. ఇప్పటివరకూ ‘స్టార్ వార్స్’ ఆరు భాగాలుగా విడుదలైన విషయం తెలిసిందే. ఈ ఏడాది డిసెంబర్లో ఏడో భాగం విడుదల కానుంది. ‘స్టార్ వార్స్: ది ఫోర్స్ అవేకెన్స్’ పేరుతో రూపొందిన ఈ ఏడో భాగం ప్రచార చిత్రాలకు భారీ ఎత్తున స్పందన లభిస్తోంది. ఇటీవల విడుదల చేసిన రెండో ప్రచార చిత్రాన్ని 24 గంటల్లో 88 లక్షల మంది వీక్షించడం విశేషం. గత ఏడాది నవంబర్లో విడుదలైన ‘ఫ్యూరియస్ 7’ ప్రచార చిత్రాన్ని 24 గంటల్లో 62 లక్షల మంది చూశారు. ఆ రికార్డ్ను ‘స్టార్ వార్స్ 7’ అధిగమించింది. -
జెట్లకే జేజమ్మ
సునామీ కన్నా వేగం.. కళ్లు మిరిమిట్లుగొలిపే రూపం.. అంచనాలకు అందని ప్రత్యేకతలు ఈ హైపర్సోనిక్ విమానం సొంతం. స్టార్ వార్స్ అనే డిజైనర్ సంస్థకు చెందిన స్టీఫెన్ చాంగ్ ఈ విమానం డిజైన్ రూపొందించాడు. 250 నుంచి 300 మంది ప్రయాణికులు ప్రయాణించే వీలుండే దీనికి పైలట్ ఉండడట.. కింది నుంచే దిశానిర్దేశం చేస్తారట.. అంతేకాదు గాలి వేగం, అక్కడి ఉష్ణోగ్రతలను ఇట్టే పసిగట్టి ప్రమాదాల బారిన పడకుండా ముందే హెచ్చరించే వ్యవస్థ కూడా ఇందులో ఉంటుందట..