breaking news
sriramireddy
-
కొల్లగొట్టేందుకు కొత్త వ్యూహం!
–‘శ్రీరామరెడ్డి’ పథకం కాంట్రాక్టరును తొలగించి ఉద్యోగాల పేరుతో దోపిడీకి కుట్ర – 700 మంది పొట్ట కొట్టే యోచనలో ఓ నేత కుమారుడు – రూ.8 కోట్ల పెండింగ్ బిల్లులు చెల్లిస్తే తప్పుకుంటానన్న కాంట్రాక్టర్ అనంతపురం సిటీ : శ్రీరామరెడ్డి పథకం ద్వారా ఆరేళ్లుగా తాగునీరు సరఫరా చేస్తున్న ఓ కాంట్రాక్టరు కోట్లు సంపాదిస్తున్నాడన్న భావనతో అధికార పార్టీకి చెందిన ఓ ఎమ్మెల్యే కుమారుడు దురాశకు పోతున్నారు. తనకు ఎలాగైనా ఆ కాంట్రాక్టు కావాలని తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. తండ్రి సహకారంతో మరో నలుగురు ఎమ్మెల్యేలను చేరదీసుకుని ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. ప్రస్తుతమున్న కాంట్రాక్టరు తప్పుకుంటే సిబ్బందిని విధుల్లోంచి తొలగించి ఆ పోస్టులను అమ్ముకోవాలని భావిస్తున్నట్లు సమాచారం. ఈ క్రమలో సుమారు 700 మందిని తొలగించేందుకు ఎత్తులు వేస్తున్నారు. ఒక్కో పోస్టుకు రూ.50 వేల దాకా వసూలు చేయాలని ఇప్పటికే వ్యూహం పన్నినట్లు తెలిసింది. ఈ వ్యవహారంతో విసుగు చెందిన కాంట్రాక్టరు మాత్రం జిల్లా పరిషత్ సీఈఓ రామచంద్రను కలసి తనకు రావాల్సిన బకాయిలు ఇప్పించాలని, తర్వాత తనకు ఈ కాంట్రాక్టు అవసరమే లేదని రాత పూర్వకంగా తెలిపినట్లు సమాచారం. సరఫరా ఇలా.. శ్రీరామరెడ్డి తాగునీటి పథకం కింద 170 కిలోమీటర్ల పైపులైన్ ఉంది. దానికి అనుబంధంగా 1,800 కిలోమీటర్ల సబ్లైన్ వెళుతుంది. ఈ పథకం ద్వారా హిందూపురం, రాయదుర్గం, మడకశిర, కళ్యాణదుర్గం మునిసిపాలిటీలతో పాటు పలు గ్రామాలకు నీరు సరఫరా అవుతోంది. ఈ పథకం నిర్వహణ కోసం కాంట్రాక్టరుకు నెలకు రూ.90 లక్షల ఖర్చు అవుతోంది. ఇదులో రూ.60 లక్షలు వేతనాలకు, రూ.30 లక్షలు నిర్వహణకు వెచ్చించాల్సి వస్తోంది. ఆరేళ్లుగా నిర్వహణ బిల్లులు సక్రమంగా చెల్లించడం లేదని, ప్రతినెలా రూ.90 లక్షలు సమకూర్చుకోవడానికి అవస్థ పడుతున్నానని కాంట్రాక్టు చెబుతున్నారు. ప్రభుత్వం ఏడు నెలలకోసారి బిల్లులు ఇస్తున్నట్లు తెలిపారు. ఇదిలావుండగా, కాంట్రాక్టర్ను తొలగించి తాము ఆ వర్కును చేజిక్కించుకోవాలని చూస్తున్న నాయకుడు సోమవారం జెడ్పీలో పంచాయితీ కూడా పెట్టించారు. ఈ క్రమంలోనే మనస్తాపానికి గురైన కాంట్రాక్టర్ తన సంపాదన దేవుడెరుగు...పెట్టుబడి గిట్టుబాటు కాక ఇబ్బంది పడుతున్న విషయాన్ని జెడ్పీ సీఈఓ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిసింది. కాంట్రాక్టును రద్దు చేసి ఈ ఏడాది మార్చి నుంచి తనకు రావాల్సిన బకాయిలు రూ.8 కోట్లు ఇప్పించాలని 45 రోజుల క్రితమే సీఈఓను కోరినట్లు సమాచారం. ఈ విషయంపై వివరణ కోరేందుకు ప్రయత్నించగా.. జెడ్పీ సీఈఓ రామచంద్ర ఫోన్లో అందుబాటులోకి రాలేదు. -
‘శ్రీరామిరెడ్డి’కీ గడ్డుకాలం
– పేరుకుపోయిన యుటిలైజేషన్ చార్జీల బకాయిలు – రూ.10.69 కోట్లు చెల్లించడంలో మున్సిపాలిటీల నిర్లక్ష్యంæ – నోటీసులు జారీ చేసినా ఫలితం సున్నా – కార్మికుల వేతనాలు, విద్యుత్ బకాయిలు చెల్లించలేకపోతున్న ఆర్డబ్ల్యూఎస్ శాఖ జిల్లాలో శ్రీరామిరెడ్డి తాగునీటి పథకంకూ గడ్డకాలం సమీపించింది. పథకం నిర్వహణకు సంబంధించి యుటిలైజేషన్ చార్జీలను చెల్లించడంలో మున్సిపాలిటీలు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో నిర్వహణ భారం పెరిగిపోయింది. రూ.10.69 కోట్ల మేర బకాయిలు వసూలు కాకపోవడంతో కార్మికులకు వేతనాలు, విద్యుత్ బకాయిలు చెల్లించలేక గ్రామీణ నీటి సరఫరా విభాగం (ఆర్డబ్ల్యూఎస్) చేతులెత్తేస్తోంది. జిల్లాలోని హిందూపురం మున్సిపాలిటీ, పారిశ్రామిక వాడ, మడకశిర, కళ్యాణదుర్గం మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీల్లోని ప్రజల దాహార్తిని తీర్చేందుకు ఏర్పాటు చేసిన శ్రీరామిరెడ్డి తాగునీటి పథకం నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది. తాగునీరు సరఫరా అవుతున్న ఈ మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీలు యుటిలైజేషన్ చార్జీలను ఆర్డబ్ల్యూఎస్ శాఖకు విధిగా చెల్లించాల్సి ఉంటుంది. ప్రతి ఏటా వీరు చెల్లించే సొమ్ముతోనే ఈ పథకం నిర్వహణ సాధ్యమవుతుంది. ఈ సొమ్ముతోనే విద్యుత్ బిల్లులు, కార్మికుల వేతనాలను ఆర్డబ్ల్యూఎస్ శాఖ చెల్లిస్తోంది. పేరుకుపోయిన రూ. కోట్ల బకాయిలు ఈ పథకం ద్వారా లబ్ధిపొందుతున్న మున్సిపాలిటీలు యుటిలైజేషన్ చార్జిలను సక్రమంగా చెల్లించడం లేదని ఆర్డబ్ల్యూఎస్ అధికారులు పేర్కొంటున్నారు. ప్రధానంగా హిందూపురం మున్సిపాలిటీ రూ. 10 కోట్లు, ఇదే ప్రాంతానికి చెందిన పారిశ్రామిక వాడ రూ. 9 లక్షలు, మడకశిర మున్సిపాలిటీ రూ. 27 లక్షలు, కళ్యాణదుర్గం మున్సిపాలిటీ రూ. 33 లక్షలు మేర యుటిలైజేషన్ చార్జీలు బకాయిలు ఉన్నట్లు అధికారిక సమాచారం. దీంతో బకాయిలను వెంటనే చెల్లించాలని లేకుంటా పథకం నిర్వహణ భారమవుతుందంటూ ఆయా మున్సిపాలిటీల అధికారులకు ఆర్డబ్ల్యూఎస్ అధికారులు నోటీసులు జారీ చేశారు. అయినా మున్సిపల్ అధికారులు స్పందించకపోవడంతో అయా ప్రాంతాల్లోని ప్రజలకు తాగునీటి ఇక్కట్లు మొదలు కానున్నాయి. గతంలో తాగునీటి సరఫరా నిలిపివేత గతంలో కూడా ఈ మున్సిపాలిటీలు యుటిలైజేషన్ చార్జీలను చెల్లించకపోవడంతో తాగునీటి సరఫరాను నిలిపివేశారు. దాదాపు నెల రోజులపాటు తాగునీరు అందకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ముఖ్యంగా వేసవిలో తాగునీటి సరఫరా నిలిపివేయడంతో ప్రజలు పడిన ఇబ్బందులు వర్ణనాతీతం. ఆ సమయంలో కలెక్టర్ కోన శశిధర్ జోక్యం చేసుకుని నీటి సరఫరాను పురుద్ధరించాలని ఆదేశించారు. ఈ ఆదేశాలకు ఆర్డబ్ల్యూఎస్ అధికారులు గౌరవించారు. అయినా మున్సిపాలిటీ అధికారుల్లో మార్పు రాలేదు. తాగునీటి వినియోగానికి సంబంధించి మున్సిపాలిటీ పరిధిలోని ప్రజల నుంచి పన్ను రూపేణ సొమ్ము వసూలు చేస్తున్న అధికారులు వాటిని తాగునీటి పథకం నిర్వహణకు వినియోగించకపోవడం విమర్శలకు దారితీస్తోంది. బకాయిలు పేరుకుపోవడంతో ఏ క్షణంలోనైనా తాగునీటి సరఫరాను నిలిపివేసే అవకాశం లేకపోలేదు. బకాయిలను వెంటనే చెల్లించాలి శ్రీరామిరెడ్డి తాగునీటి పథకం యుటిలైజేషన్ చార్జీలను మున్సిపాలిటీలు వెంటనే చెల్లించాలి. లేకపోతే తాగునీటి సరఫరాను నిలిపివేస్తాం. గతంలో కలెక్టర్ ఆదేశాల మేరకు తాగునీటి సరఫరాను పునరుద్ధరించాం. అయినా మున్సిపాలిటీలు బకాయిలను చెల్లించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడం తగదు. ని«ధులున్నా బకాయిలను చెల్లించడం లేదు. దీంతో ఈ పథకం నిర్వహణ కష్టమవుతోంది. వెంటనే రూ.10.69కోట్ల బకాయిలను ఆయా మున్సిపాలిటీలు చెల్లించి సహకరించాలి. – లోక్నాథ్, ఆర్డబ్ల్యూఎస్ ఏఈ