-
నైన్వేద్యాలు
మంచి పెంచు స్వామీ.సంపద ఇవ్వు స్వామీ.సంతోషం పంచు స్వామీ.సోదరభావం నేర్పించు స్వామీ.దానాన్ని బోధించు స్వామీ.సంస్కారం అలవర్చు స్వామీ.దయను కలిగించు స్వామీ.స్వస్థత చేకూర్చు స్వామీ.శాంతిని ప్రసాదించు స్వామీ.తొమ్మిది నైవేద్యాలు స్వీకరించి నవ జీవనాన్ని దయ చేయి తండ్రీ. పాల తాలికలు కావలసినవి: పాలు – ఒక లీటరు; బెల్లం పొడి – పావు కేజీ; ఏలకుల పొడి – ఒక టీ స్పూను; సగ్గు బియ్యం – 50 గ్రా.; బియ్యం – పావు కేజీ; జీడి పప్పు – 50 గ్రా.; నెయ్యి – 6 టీ స్పూన్లు; ఉప్పు – చిటికెడు తయారీ ∙ముందురోజు బియ్యాన్ని తగినన్ని నీళ్లలో నానబెట్టాలి ∙మరుసటి రోజు ఉదయం నీళ్లు శుభ్రంగా ఒంపేసి, పొడి వస్త్రం మీద బియ్యం ఆరబోసి, బియ్యంలోని తడి పోయిన తరవాత, మిక్సీలో వేసి మెత్తగా పిండిలా చేసి ఒక పాత్రలోకి తీసుకోవాలి ∙ఈ పిండికి బెల్లం పొడి, వేడి పాలు జత చేసి చపాతీ పిండిలా కలపాలి ∙ కొద్దికొద్దిగా పిండిని చేతిలోకి తీసుకుని సన్నగా పొడవుగా తాలికలుగా ఒత్తి పక్కన ఉంచాలి ∙ఒక మందపాటి గిన్నెలో లీటరు పాలకు కప్పుడు నీళ్లు జత చేసి, సగ్గుబియ్యం కూడా వేసి స్టౌ మీద ఉంచి, సగ్గు బియ్యం ఉడికేవరకు మరిగించాక, తయారుచేసి ఉంచుకున్న తాలికలను పాలలో వేసి జాగ్రత్తగా కలపాలి ∙ చివరగా బెల్లం, నెయ్యి, ఏలకుల పొడి జత చేసి రెండు నిమిషాలు ఉడకనిచ్చి దింపేయాలి ∙చల్లగా అందించాలి. పప్పు ఉండ్రాళ్లు కావలసినవి: బియ్యప్పిండి – ఒక కప్పు; నీళ్లు – ఒకటిన్నర కప్పులు; పెసర పప్పు – ఒక కప్పు (నానబెట్టి, నీరు ఒంపేయాలి); బెల్లం పొడి – ఒక కప్పు; ఏలకుల పొడి – కొద్దిగా తయారీ: ∙ముందుగా స్టౌ మీద బాణలి ఉంచి వేడయ్యాక, నీళ్లు పోసి మరిగించాలి ∙నీళ్లు బాగా మరిగాక బియ్యప్పిండి వేసి కలుపుతుండాలి ∙పిండి గట్టిపడ్డాక బాణలి దింపేసి, పిండి కొద్దిగా చల్లారాక చిన్న చిన్న ఉండలు చేసి పక్కన ఉంచాలి ∙వేరొక బాణలిని స్టౌ మీద ఉంచి వేడయ్యాక నెయ్యి వేసి కరిగించాలి ∙నానబెట్టి ఉంచుకున్న పెసర పప్పును వేసి కలపాలి ∙బెల్లం పొడి జత చేసి మరోమారు కలిపి, తగినన్ని నీళ్లు జత చేయాలి ∙పెసర పప్పు బాగా ఉడికిన తరవాత ఏలకుల పొడి వేసి కలియబెట్టాలి ∙ముందుగా తయారుచేసి ఉంచుకున్న చిన్ని చిన్ని ఉండ్రాళ్లను ఇందులో వేసి కలిపి దింపేయాలి ∙అంతే పప్పు ఉండ్రాళ్లు సిద్ధమైనట్లే. ఉండ్రాళ్లు కావలసినవి: బియ్యపు రవ్వ – ఒక కప్పు; నీళ్లు – ఒకటిన్నర కప్పులు; సెనగ పప్పు/పెసర పప్పు – పావు కప్పు; జీలకర్ర – ఒక టీ స్పూను; కరివేపాకు – రెండు రెమ్మలు; నెయ్యి – రెండు టేబుల్ స్పూన్లు; ఉప్పు – కొద్దిగా. తయారీ: ∙స్టౌ మీద మందపాటి ఇత్తడి గిన్నె కాని బాణలి కాని ఉంచి వేడి చేయాలి ∙వేడెక్కిన తరవాత టేబుల్ స్పూను నెయ్యి వేసి కరిగించాలి ∙జీలకర్ర వేసి వేయించాలి ∙శుభ్రంగా కడిగిన కరివేపాకు వేసి బాగా వేయించాలి ∙ఒకటిన్నర కప్పుల నీళ్లు పోసి బాగా కలపాలి ∙సెనగపప్పు, ఉప్పు జత చేసి కలియబెట్టాలి ∙నీళ్లు బాగా మరిగాక బియ్యపు రవ్వ వేసి ఆపకుండా కలుపుతుండాలి ∙మంట బాగా తగ్గించి, మూత పెట్టాలి ∙ మధ్యమధ్యలో కలుపుతుండాలి ∙బాగా ఉడుకుపడుతుండగా టేబుల్ స్పూను నెయ్యి వేసి కలపాలి ∙ పూర్తిగా ఉడికిన తరవాత గిన్నె/బాణలి దింపేసి ఉడికిన రవ్వను ఒక ప్లేట్లోకి తీసుకోవాలి.చల్లారాక కొద్దికొద్దిగా చేతిలోకి తీసుకుని గుండ్రంగా ఉండ్రాళ్లు తయారుచేసుకోవాలి ∙వినాయకుడికి నివేదన చేసి ప్రసాదంగా స్వీకరించాలి. ఫ్రైడ్ మోదక్ కావలసినవి: గోధుమ పిండి – 2 కప్పులు; ఉప్పు – అర టీ స్పూను; గోరు వెచ్చని నూనె – 2 టీ స్పూన్లు; నీళ్లు – తగినన్ని ఫిల్లింగ్ కోసం: బెల్లం తరుగు – ఒకటిన్నర కప్పులు; పచ్చి కొబ్బరి తురుము – ఒకటిన్నర కప్పులు; వేయించిన నువ్వులు – 2 టేబుల్ స్పూన్లు; ఏలకుల పొడి – అర టీ స్పూను; నీళ్లు – ముప్పావు కప్పు. పైభాగం తయారీ: ∙ఒక పాత్రలో గోధుమ పిండి, గోరు వెచ్చని నూనె, ఉప్పు, నీళ్లు వేసి చపాతీ పిండిలా కలిపి, సుమారు అరగంట సేపు పక్కన ఉంచాలి. ఫిల్లింగ్ తయారీ: ∙ఫిల్లింగ్ కోసం చెప్పిన పదార్థాలను ఒక మందపాటి పాత్రలో వేసి బాగా కలిపి, స్టౌ మీద ఉంచి ఉడికించి, దింపి పక్కన ఉంచాలి. మోదకాల తయారీ: ∙గోధుమపిండి మి్రÔ¶ మాన్ని కొద్దిగా తీసుకుని చపాతీ కర్రతో చపాతీలా ఒత్తి చేతిలోకి తీసుకోవాలి ∙ఫిల్లింగ్ మిశ్రమాన్ని కొద్దిగా తీసుకుని, ఒత్తిన చపాతీ మధ్యలో ఉంచి, అన్నిపక్కలా కొద్దికొద్దిగా దగ్గరకు తీసుకుంటూ (బొమ్మలో చూపిన విధంగా) మూసేయాలి ∙ఈ విధంగా అన్నీ తయారుచేసి పక్కన ఉంచుకోవాలి ∙ బాణలిలో నూనె పోసి స్టౌ మీద ఉంచి, కాగిన తరవాత, తయారుచేసి ఉంచుకున్న మోదకాలను అందులో వేసి బంగారు రంగులోకి వచ్చేవరకు వేయించి పేపర్ నాప్కిన్ మీదకు తీసుకోవాలి. చాకొలేట్ మోదక్ కావలసినవి: పచ్చి కోవా – ఒక కప్పు (సన్నగా తురమాలి); చాకొలేట్ చిప్స్ – అర కప్పు; పంచదార పొడి – 2 టేబుల్ స్పూన్లు; ఏలకుల పొడి – పావు టీ స్పూను; నెయ్యి – కొద్దిగా గార్నిషింగ్ కోసం: పిస్తా పప్పుల తరుగు – రెండు టీ స్పూన్లు; గులాబీ రేకలు – కొద్దిగా. తయారీ: ∙స్టౌ మీద బాణలి ఉంచి వేడి చేసి, మంట బాగా తగ్గించి పచ్చి కోవా తురుము వేసి, ఆపకుండా కలుపుతుండాలి ∙కోవా కరగడం మొదలైన తరవాత, పంచదార పొడి వేసి బాగా కలిపాక, చాకొలేట్ చిప్స్ వేసి వెంటనే కలిపేయాలి ∙చాకొలేట్ చిప్స్ కరిగి, మిశ్రమం చిక్కబడుతుండగా ఏలకుల పొడి వేసి మరోమారు కలపాలి ∙మిశ్రమం బాగా ఉడికేవరకు మధ్యమధ్యలో కలుపుతుండాలి ∙మిశ్రమం మరీ గట్టిపడకుండా చూసుకోవాలి ∙ఉడుకుతున్న మిశ్రమం అంచులను విడవగానే, ఒక పాత్రలోకి తీసుకుని, చల్లారనివ్వాలి ∙బాగా చల్లారాక చిన్న చిన్న ఉండలుగా చేసి పక్కన ఉంచాలి ∙మోదక్ మౌల్డ్స్ తీసుకుని ఒక్కో ఉండను అందులో ఉంచి జాగ్రత్తగా మూత తీసి మోదకాలను, నెయ్యి పూసిన ప్లేట్లో ఉంచాలి ∙గులాబీ రేకలు, పిస్తా తరుగు తో అందంగా అలంకరించి, వినాయకుడికి నైవేద్యం పెట్టి ప్రసాదంగా సేవించాలి (ఇష్టపడేవారు ఫ్రిజ్లో ఉంచి, చల్లగా కూడా తినొచ్చు. వీటిని త్వరగా తినేయాలి, లేదంటే చాకొలేట్ కరిగిపోయే అవకాశం ఉంటుంది) డ్రైఫ్రూట్స్ మోదక్ కావలసినవి: బియ్యప్పిండి – ఒక కప్పు; నీళ్లు – ఒకటిన్నర కప్పులు; ఉప్పు – పావు టీ స్పూను మోదక్ ఫిల్లింగ్ కోసం: నెయ్యి – 2 టేబుల్ స్పూన్లు; పచ్చి కోవా – 100 గ్రా.; గసగసాలు – ఒక టీ స్పూను; బాదం పప్పులు – పావు కప్పు; జీడి పప్పు పలుకులు – 2 టేబుల్ స్పూన్లు; పిస్తా తరుగు – ఒకటిన్నర టేబుల్ స్పూన్లు; చిరోంజీ – ఒక టేబుల్ స్పూను; ఖర్జూరాల తరుగు – ఒక టేబుల్ స్పూను; కిస్మిస్ – ఒక టేబుల్ స్పూను; పచ్చి కొబ్బరి తురుము – పావు కప్పు; పంచదార – పావు కప్పు. తయారీ: ∙ఒక పాత్రను స్టౌ మీద ఉంచి వేడయ్యాక నీళ్లు పోసి మరిగించాలి ∙పావు టీ స్పూను ఉప్పు వేసి కలియబెట్టాలి ∙నీళ్లు బాగా మరుగుతుండగా మంట తగ్గించి, బియ్యప్పిండి వేస్తూ కలపాలి ∙కొద్దిగా ఉడికించి వెంటనే దింపేయాలి ∙ఉడికిన పిండిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ∙పిండి బాగా చల్లారాక చేతితో బాగా కలిపి మూత పెట్టి పావు గంట సేపు పక్కన ఉంచాలి. డ్రై ఫ్రూట్స్ స్టఫింగ్ తయారీ: డ్రై ఫ్రూట్స్ను చిన్న చిన్న ముక్కలుగా చేసి పక్కన ఉంచాలి. స్టౌ మీద బాణలి ఉంచి వేడయ్యాక ఒక టేబుల్ స్పూను నెయ్యి వేసి కరిగించాలి ∙తరిగి ఉంచుకున్న బాదం పప్పులు, జీడి పప్పు పలుకులు, పిస్తా, ఖర్జూరం, చిరోంజీ, కిస్మిస్లను వేసి రెండు నిమిషాల పాటు వేయించి తీసి పక్కన ఉంచాలి ∙చిన్న బాణలిని స్టౌ మీద ఉంచి వేడయ్యాక, నెయ్యి వేసి కరిగించాలి ∙గసగసాలు వేసి చిటపటలాడేవరకు వేయించి డ్రైఫ్రూట్స్తో పాటు పక్కన ఉంచాలి ∙అదే బాణలిలో కోవా వేసి బాగా కలపాలి ∙కోవా కరుగుతున్న సమయంలో పావు కప్పు పంచదార వేసి మరోమారు కలపాలి ∙మిశ్రమం ఉడుకుపట్టగానే, పచ్చి కొబ్బరి తురుము జత చేసి మరోమారు కలపాలి ∙చివరగా వేయించి ఉంచుకున్న డ్రై ఫ్రూట్స్, గసగసాలు వేసి కలిపి దింపేసి, మిశ్రమాన్ని మరో పాత్రలోకి తీసుకోవాలి. మోదకాల తయారీ: ∙ఉడికించిన బియ్యప్పిండిని కొద్దిగా చేతిలోకి తీసుకుని ఒత్తాలి ∙డ్రైఫ్రూట్స్ మిశ్రమం కొద్దిగా తీసుకుని అందులో ఉంచి, అన్నివైపులా మూసేయాలి (మౌల్డ్స్లో చేసుకుంటే చూడటానికి బాగుంటాయి) ∙అన్నీ తయారుచేసుకున్నాక ఇడ్లీ స్టాండులో ఉంచి, స్టౌ మీద పెట్టి ఆవిరి మీద ఉడికించి దింపేయాలి. కొబ్బరి ఉండ్రాళ్ల పాయసం కావలసినవి: బియ్యప్పిండి – ఒక కప్పు; నీళ్లు – 2 కప్పులు; ఉప్పు – రుచికి తగినంత; నూనె – ఒక టీ స్పూను; పంచదార – 3 టేబుల్ స్పూన్లు; పాలు – 3 కప్పులు; కొబ్బరి తురుము – 2 టేబుల్ స్పూన్లు; జీడి పప్పులు – తగినన్ని; ఏలకులు – 2 (పొడి చేయాలి); కిస్మిస్ – కొద్దిగా తయారీ: ∙స్టౌ మీద మందపాటి పాత్ర పెట్టి వేడి చేయాలి ∙నీళ్లు పోసి మరిగించాక, ఉప్పు జత చే సి బాగా కలపాలి ∙కొద్దిగా నూనె వేసి మరోమారు కలపాలి ∙నీళ్లు మరిగాక బియ్యప్పిండి వేసి మంట తగ్గించి, పిండి ఉండలు కట్టకుండా కలుపుతుండాలి ∙పిండి ఉడికి బాగా గట్టిపడ్డాక దింపి, చల్లారనివ్వాలి ∙పిండిని చిన్న చిన్న ఉండలుగా చేసి పక్కన ఉంచాలి ∙స్టౌ మీద మరో బాణలి పెట్టి, వేడయ్యాక పాలు పోసి మరిగించాలి ∙పంచదార, ఏలకుల పొడి జత చేసి మరోమారు కలపాలి ∙తయారుచేసి ఉంచుకున్న చిన్న ఉండ్రాళ్లను పాలలో వేసి కొద్దిసేపు ఉడకనివ్వాలి ∙కొద్దిగా పాలలో టేబుల్ స్పూను బియ్యప్పిండి వేసి కలిపి, ఉడుకుతున్న పాలలో వేయాలి ∙జీడి పప్పులు వేసి మరోమారు కలియబెట్టాలి ∙కొద్దిగా ఉడుకుçపట్టాక కొబ్బరి తురుము వేసి ఐదు నిమిషాల పాటు ఉడికించి దింపేయాలి. ఉండ్రాళ్ల పాయసం కావలసినవి: బియ్యప్పిండి – ఒక కప్పు; పాలు – అర లీటరు; పంచదార – ఒక కప్పు; నెయ్యి – 2 టేబుల్ స్పూన్లు; ఏలకుల పొడి – ఒక టీస్పూను; జీడి పప్పు – కొద్దిగా; సార పలుకులు – కొద్దిగా తయారీ: ∙ముందుగా స్టౌ మీద బాణలి ఉంచి వేడయ్యాక రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి కరిగాక జీడి పప్పులు, సార పలుకులు వేసి వేయించి తీసి పక్కన ఉంచాలి ∙అదే బాణలిలో నీళ్లు పోసి మరిగించాలి ∙నీళ్లు మరిగిన వెంటనే టీ స్పూను పంచదార వేసి కలపాలి ∙బియ్యప్పిండి (కొద్దిగా పిండి పక్కన ఉంచుకోవాలి) వేసి కలపాలి ∙పిండి ఉడికేవరకు మధ్యమధ్యలో కలుపుతూ, పిండి గట్టి పడ్డాక స్టౌ మీద నుంచి దింపేయాలి ∙కొద్దిగా చల్లారాక పిండిని చిన్న చిన్న ఉండలుగా చేసి పక్కన ఉంచాలి ∙వేరే బాణలిలో పాలు పోసి మరిగించాలి ∙ఒక కప్పు పంచదార వేసి కరిగించాలి ∙కొద్దిగా ఏలకుల పొడి కూడా వేసి బాగా కలపాలి ∙ఏలకుల వలన సువాసన వస్తుంది ∙పాలు మరిగి చిక్కబడేవరకు కలపాలి ∙తయారుచేసి ఉంచుకున్న చిన్నచిన్న ఉండ్రాళ్లను మరుగుతున్న పాలలో వేయాలి ∙పక్కన ఉంచుకున్న బియ్యప్పిండిని కొద్దిగా చన్నీళ్లలో వేసి కలిపి, ఉడుకుతున్న పాలలో వేసి మరోమారు కలియబెట్టాలి ∙చివరగా... వేయించి ఉంచుకున్న జీడి పప్పులు, సార పలుకులను వేసి బాగా కలిపి దింపేయాలి ∙వినాయకుడికి నివేదన చేసి సేవించాలి. పూర్ణం కుడుములు కావలసినవి: సెనగ పప్పు – ఒక కప్పు; నీళ్లు – 3 కప్పులు; బియ్యప్పిండి – ఒక కప్పు; నీళ్లు – ఒకటిన్నర కప్పులు; బెల్లం పొడి – ఒక కప్పు; ఏలకుల పొడి – కొద్దిగా తయారీ: ∙సెనగ పప్పును శుభ్రంగా కడిగి తగినన్ని నీళ్లు జత చేసి ఉడికించి, దింపేయాలి ∙చల్లారాక మిక్సీలో వేసి మెత్తగా పొడిలా చేయాలి ∙బాణలిలో బెల్లం, కొద్దిగా నీరు పోసి స్టౌ మీద ఉంచి బెల్లం కరిగించాలి ∙పాకం బాగా చిక్కబడ్డాక ఏలకుల పొడి వేసి మరోమారు కలియబెట్టాలి ∙పొడి చేసి ఉంచుకున్న సెనగపప్పును వేసి కలియబెట్టాలి ∙పచ్చి కొబ్బరి తురుము జత చేసి మరోమారు కలపాలి ∙మిశ్రమం దగ్గరపడేవరకు ఆపకుండా కలిపి దింపేయాలి ∙చిన్నచిన్న ఉండలు చేసి పక్కన ఉంచాలి.వేరొక పాత్రలో నీళ్లు పోసి స్టౌ మీద ఉంచి మరిగించాలి ∙కొద్దిగా నెయ్యి జత చేసి కలపాలి ∙నీళ్లు బాగా మరిగాక బియ్యప్పిండి వేసి బాగా కలిపి ఉడికించాలి ∙ఉడికిన పిండిని ఒక పళ్లెంలోకి తీసి, చేతితో మెదుపుతూ ఉండలా చేయాలి ∙చేతికి కొద్దిగా నెయ్యి పూసుకోవాలి ∙ఉడికించిన బియ్యప్పిండిని కొద్దిగా తీసుకుని చేతితో ఒత్తాలి ∙సెనగ పప్పు + బెల్లం ఉండను మధ్యలో ఉంచి బియ్యప్పిండితో మూసేసి నున్నగా చేసి పక్కన ఉంచాలి ∙ఇలా అన్నీ తయారుచేసుకోవాలి ∙వీటిని ఇడ్లీ స్టాండ్లో ఉంచి మూత పెట్టి, స్టౌ మీద ఉంచాలి ∙ఉడికిన తరవాత దింపేసి, బయటకు తీసి, చల్లారాక తినాలి. -
గృహస్థు అతిథి పూజలో తరించాలి
మీ ఇంట పెళ్ళి జరగబోతున్నది. శుభలేఖ వేస్తారు. అందులో ‘మంగళం మహత్ శ్రీశ్రీశ్రీశ్రీశ్రీ’ అని రాస్తారు. అయ్యా! మంగళములను అపేక్షించి మిమ్మల్ని పిలుస్తున్నాం. మీవంటి పెద్దల పాద స్పర్శచేత మా మంటపం పునీతమవుతుందన్న భావనతో ‘మదర్పిత చందనతాంబూలాది సత్కారాలు గ్రహించి మమ్మానందింప చేయ ప్రార్థన’ అని కూడా రాస్తారు. చందనతాంబూలాది... అన్న తరువాత మళ్ళీ విందు అనీ, ఇంకోటి అని రాయడం ఎందుకు? చందనం అంటే... దేవతార్చన, పిదప భోజనం... తరువాత లేచి వెళ్ళబోయేముందు చందనం రాసుకుని లేస్తారు. కాబట్టి పెద్దలయిన అతిథులొచ్చారంటే గౌరవసూచకంగా ఓ తాంబూలం చేతిలో పెడతారు. తాంబూలమంటే మళ్ళీ రు.1116/–లా ? రు.116/–లా అని అడక్కండి. తమలపాకులు, రెండు అరటిపళ్ళు, రెండు వక్కలు చాలు. తాంబూలమిచ్చారంటే గౌరవమిచ్చారని గుర్తు. విరాటపర్వంలో–బృహన్నలరూపంలో అర్జునుడు వస్తే ఆయన తేజస్సును చూసి విరాట్రాజు–‘చూస్తే బృహన్నల. కానీ గొప్ప క్షత్రియుడిలా ఉన్నాడు. ఈయన సామాన్యుడు కాడు.’ అని ఉత్తరని పిలిచి తాంబూలం ఇవ్వమంటాడు. అది గౌరవ చిహ్నం. ఇక పెళ్ళిమంటపంలో వధూవరులిద్దరూ ఒకళ్ల కళ్ళల్లోకి ఒకళ్ళు చూసుకుంటారు. అలా చూసుకున్న ఘడియే సుముహూర్తం. ‘‘అయ్యా! మీరందరూ ఇది శుభముహూర్తం’’ అనండి అని అడుగుతారు. అప్పుడు అతిథులందరూ లేచి ‘ఇది శుభముహూర్తమే’ అని ముందుకొస్తారు. నడుం విరగని బియ్యానికి పసుపురాసి మీ చేతిలో పెడితే మీరు అతిథి దేవుళ్ళు కనుక మీరు చేసిన భగవదారాధన వలన మీరు స్మరించి మీ శక్తితో ఆ అక్షతలను వధూవరుల మూర్ధన్య స్థానమందువేస్తే వారికి అభ్యున్నతి కలిగి దీర్ఘాయుష్మంతులవుతారు. ‘మీరలా చేయడంవల్ల మా వంశం నిలబడుతుంది. అందుకని మీరు చేసిన ఉపకారానికి నేను ప్రత్యుపకారం చేయాలి కనుక చందనం ఇస్తాను. అంటే భోజనం పెట్టి తాంబూలం ఇస్తాను. కనుక మీరు దయతో రావలసింది’ అని ప్రేమతో పిలిచారని అర్థం. తీరా వారు వచ్చిన తరువాత పెళ్ళికి పిలిచిన పెద్దలు అతిథులను వారి మానాన వారిని వదిలేసి వీడియో బృందం సేవల్లో మైమరిచిపోతుంటే, వధూవరులు ఒకళ్ళ కళ్ళల్లోకి ఒకరు చూసుకోకుండా మెడతెగిన కోడిపెట్టల్లా వీడియో కెమెరాలకేసి చూస్తుంటే, కర్ణుడు కవచకుండలాలను వదలకుండా వెంటేసుకుని తిరిగినట్లు.. వచ్చిన అతిథులు కూడా పాదరక్షలతోపాటూ మంటపం ఎక్కి క్యూలైన్లలో తరించి పోతుంటారు. చుట్టూ కమ్ముకున్న వీడియోగ్రాఫర్ల మధ్యనుంచి పెళ్ళితంతు చూడలేక, భోజనాల దగ్గర కూడా చేతిలో పళ్ళెం పట్టుకుని నిలబడలేక, కూర్చోలేక, తినలేక, తినకుండా ఉండలేక, గొంతుపట్టుకుంటే నీళ్ళు తాగలేక ఇటూ అటూ తిరిగే అతిథులది దిక్కుమాలిన స్థితి. అది ఈ జాతి సంస్కారం కానే కాదు. ఈ జాతి లక్షణం కూడా కాదు. ఎక్కడినుంచో ఎవడో దిగుమతి చేసేశాడు. అంటువ్యాధిలా వ్యాపించిపోయింది. ప్రేమగా అతిథులను పలకరిస్తూ కూర్చోబెట్టి వడ్డించి పెట్టడం ఈ జాతి ధర్మం. అంతే తప్ప పెళ్ళికి పిలిచి, ఆశీర్వచనానికి పిలిచి చందనతాంబూలాలిస్తాం రమ్మనమని పిలిచి– అతిథిని పట్టించుకోకపోతే ఎలా? అన్నం ఎక్కడా దొరకదని అతిథి అక్కడికి రాలేదు కదా! నువ్వే పిలిచావు. అతిథిని పిలిచి నిర్లక్ష్యం చేయకూడదు. అలా చూసుకోలేనప్పుడు పిలవకూడదు. కనుక గృహస్థు అనేవాడు ఇంట్లో అయినా, శుభకార్యంలో అయినా సాక్షాత్తూ పరమేశ్వర స్వరూపం అయిన అతిథి పూజలో తరించాలి. - బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు -
వివాహం... సంస్కారం
ఆత్మీయం మన ప్రాచీన ఋషులు వివాహ సంస్కారాన్ని పరమపవిత్రంగా, ఉత్కృష్టమైనదిగా మలచి, దానిని మహోన్నతమైన ఆశయాలతో నింపి దాంపత్య జీవితం ఆవశ్యకతను ఉద్బోధించారు. వివాహ సంస్కారం దంపతుల శరీరాలనేగాక ఆత్మ, మనస్సు, ప్రాణం... అన్నింటినీ ఏకం చేస్తుంది. ఇదే వివాహ సంస్కారంలోని విశేషం, ఉద్దేశం. ఆదర్శమైన గృహస్థ«ధర్మంతో మోక్షాన్ని పొందడమే వివాహంలోని అంతిమలక్ష్యం. సత్సంతానాన్ని కని, పితృరుణ విముక్తుడు కావడం కూడా వివాహ ఆదర్శాలలో ఒకటి. వివాహ సంస్కారం వధూవరులను విచ్చలవిడితనం నుంచి వేరుచేస్తుంది. ధర్మార్థకామాలను సన్మార్గంలో అనుసరించేలా ప్రేరేపిస్తుంది. ఆలుమగలలో పరస్పర ప్రేమను కలిగించి, గృహస్థ జీవితాన్ని ఆనందమయం చేస్తూ, సంతానాన్ని కలిగించి ఆధ్యాత్మికోన్నతికి కారణమౌతుంది. పెళ్లితో స్త్రీపురుషుల అనుబంధానికి బలం ఏర్పడుతుంది. గుర్తింపు, గౌరవమర్యాదలు లభిస్తాయి. అందువల్ల సహజీవన సంస్కృతికన్నా వివాహ సంప్రదాయానికే పెద్దలు ప్రాధాన్యత ఇచ్చారు. దీనిని గౌరవించడం మన సంస్కారం. -
ఒక కొమ్మకు పుట్టిన ప్రేమ
లీగల్ స్టోరీస్ ప్రేమ ఒక బంధమే. కానీ అది కూడా ఒక విపరీత బంధానికి దారితీయవచ్చు. ఒక కొమ్మకు పుట్టిన పిల్లలు వరసలు తెలియక ప్రేమలో పడితే?! సంప్రదాయం వద్దంటోంది. సంస్కారం కాదంటోంది. మరి చట్టం ఏమంటుంది? ‘‘ఆనందా... గుడ్ న్యూస్ డియర్’’ శ్రీరామ్ వాయిస్లో ఆనందం.‘‘మీవాళ్లు ఒప్పుకున్నారా?’’ ఇవతల ఆనంద గొంతులో ఆత్రుత.‘‘ఊ.... ఒప్పుకున్నారు..’’ ఆ స్వరంలో ధీమా.‘‘హూ..’’ ఓ భరోసాతో నిట్టూర్చింది ఆనంద.‘‘నిన్ను ఎల్లుండి కలుస్తామన్నారు అమ్మానాన్న..’’ చెప్పాడు. ‘‘అవునా... అయితే తాతయ్యతో చెప్పేస్తాను ఈ రోజే’’. ‘‘చెప్పేయ్.. కాని హడావిడి పడకు.. పెద్దాయన్ని హడావిడి పెట్టకు. జస్ట్ నిన్ను చూసి పెద్దాయనతో మాట్లాడి వెళతారు అంతే.. ఓకేనా?’’ అన్నాడు శ్రీరామ్.‘‘ఒకే బాస్..’’ ఆనందలో సంతోషం.‘బై మరి..’ అంటున్న శ్రీరామ్కి ‘బై’ అంటూ ఆన్సర్ చేసింది. ఇద్దరి ఫోన్లు డిస్కనెక్ట్ అయ్యాయి.ఆనందకి ఆనందం మామూలుగా లేదు. ఎక్కడా కాలు నిలవడం లేదు. శ్రీరామ్ పేరెంట్స్ ఒప్పుకున్నారు. అంటే త్వరలోనే శ్రీరామ్కి భార్య కాబోతుంది. ఆ ఊహ ఆమె కళ్లల్లో ఓ మెరుపుని తెచ్చింది. మదిలో జ్ఞాపకాలను తట్టిలేపింది. ‘ప్రొఫైల్స్’.. కలిపాయి ఇద్దరినీ ఆనంద కృష్ణ... ఫేస్బుక్లో ఓ మ్యూచువల్ ఫ్రెండ్ పోస్ట్కి కామెంట్ పెట్టింది. ఆమె సోషల్ కాన్షస్కి ముగ్ధుడయ్యాడు శ్రీరామ్. ఆ పేరును క్లిక్ చేసి ఆమె పేజీని ఓపెన్ చేశాడు. ప్రతి పోస్ట్లో కనిపించిన ఆమె ఆలోచన, అభిరుచి, అవగాహన ఆయనను ఆనందకు కట్టిపడేశాయి. ఆమె ప్రొఫైల్ పిక్ ఆయనను ఫిదా చేసింది.బ్యూటీ విత్ బ్రెయిన్! మురిసిపోయాడు. ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపాడు. నాలుగు రోజులకు గానీ రెస్పాన్స్ రాలేదు ఆనంద నుంచి... యాక్సెప్ట్ చేస్తూ! ముందు హలో.. హాయ్ అంటూ పలకరింపు పర్వం. అతి కొద్ది రోజుల్లోనే వీళ్ల ప్రేమతో ఇన్బాక్స్ సిగ్గు పడడం మొదలెట్టింది. శ్రీరాం ఓ యాడ్ ఏజెన్సీలో క్రియేటివ్ హెడ్. ఆనంద ఓ మల్టీనేషనల్ కంపెనీలో హెచ్ఆర్ మేనేజర్. మంచి క్లాసికల్ డాన్సర్. ఆయన సోషల్ సర్వీస్లో మేటి. ఆయన స్లమ్స్లో సర్వీస్ ఇచ్చే చోట ఆ పిల్లలకు స్వచ్ఛందంగా డాన్స్ నేర్పించడం స్టార్ట్ చేసింది. దాంతో శ్రీరామ్కి ఆనంద మీద మరింత ప్రేమ పెరిగింది. గౌరవమూ ఇనుమడించింది. తను జీవిత భాగస్వామిగా వస్తే బాగుంటుందని ఆశపడ్డాడు. ఆ ఆశను ఆమె ముందు ఎక్స్ప్రెస్ చేశాడు. శ్రీరామ్ తనకన్నా మూడేళ్లు చిన్నవాడు. ఆ సంశయాన్నే వెలిబుచ్చింది ఆనంద. అదసలు మ్యాటరే కాదన్నాడు. రెండు రోజులు ఆలోచించుకునే టైమ్ అడిగింది. మూడో రోజు ‘ఎస్’ అని చెప్పింది. పెళ్లిచూపులకు ఏర్పాట్లు శ్రీరామ్ ఆనందానికి అవధుల్లేవ్ ఆరోజు. ఆనందను తలచుకొని గర్వంగా ఫీలయ్యాడు. ఇద్దరి ఆలోచనలూ ఒకటే. ఆలోచనలు సరే... అలవాట్లూ ఒకటే! ఆ విషయంలో చాలాసార్లు ఆశ్చర్యపోయేవాడు శ్రీరామ్. మొత్తానికి తనతో పెళ్లికి ఆనంద ఒప్పేసుకుంది. ఆనందకు అమ్మానాన్న లేరు. తాతే ఆమెను పెంచాడు. ఆయన ఆమెకు ఓ స్నేహితుడు. అన్నీ షేర్ చేసుకుంటుంది. శ్రీరామ్ విషయమూ చెప్పింది. చూస్తాను అన్నాడు. ఇంటికి తీసుకెళ్లింది. పిల్లాడు నచ్చాడు పెద్దాయనకు. ఆయన తల్లిదండ్రులకు విషయం చెప్పి వారిని ఇంటికి తీసుకురమ్మన్నాడు. శ్రీరామ్ ఉండేది ముంబైలో. తల్లిదండ్రులు హైదరాబాద్లో ఉంటారు. కిందటి వారం హైదరాబాద్ వెళ్లినప్పడు చెప్పాడు. వివరాలు అన్నీ విని.. ‘వీలు చూసుకొని వస్తాం’ అన్నారు. తర్వాత అతడి పేరెంట్స్ దగ్గర్నుంచి ఫోన్ వచ్చింది వస్తున్నట్టుగా. వెంటనే ఆనందకు చెప్పాడు.జ్ఞాపకాల్లోంచి వాస్తవంలోకి వచ్చింది ఆనంద. శ్రీరామ్ చెప్పిన శుభవార్తను తాతయ్యకు అందించింది. శ్రీరామ్ కుటుంబాన్ని రిసీవ్ చేసుకునే ఏర్పాట్లలో పడిపోయారు తాతా మనవరాలు ఆ క్షణం నుంచే...! ఊహించని పరిణామం శ్రీరామ్ చెప్పిన ఎల్లుండి రానేవచ్చింది. ఇల్లంతా నీట్గా సర్దింది. సర్దినవాటిని వందసార్లు సరిచూసుకుంది. మనవరాలి ఆరాటం చూసి తాతయ్య ముసిముసిగా నవ్వుకుంటున్నాడు. ఈలోపు కాలింగ్ బెల్ మోగనే మోగింది. ఆత్రంగా వెళ్లి తలుపు తీసింది ఆనంద. ఎదురుగా చిలిపిగా నవ్వుతూ శ్రీరామ్... అతని వెనకాలే మొహాల మీద చిరునవ్వులతో ఆయన తల్లిదండ్రులు ‘రండి రండి...’ అంటూ అంతే ఆత్రంగా లోనికి ఆహ్వానించింది. హాల్లో సోఫా చూపిస్తూ కూర్చోండి అంది. ఆనంద తాతయ్య వచ్చి త్రీ సీటర్ సోఫాకు ఎదురుగా ఉన్న సింగిల్ సీటర్లో కూర్చున్నాడు. అక్కడే నిలబడ్డ ఆనందను చూస్తూ వాళ్లకు కాస్త మంచినీళ్లు తెచ్చివ్వమ్మా అంటూ మనవరాలిని పురమాయించాడు. వచ్చిన వాళ్లను పరిచయం చేసుకుందామని ఇటు తిరిగాడు. శ్రీరామ్ తల్లిని చూడగానే ఒక్కక్షణం ఆగిపోయాడు ఎందుకో ఆ పెద్దాయన! ఆయనను చూసిన శ్రీరామ్ తల్లిలో కూడా ఇంచుమించు అదే భావం. అమ్మా... నువ్వు శోభ కదూ... అన్నాడు అనుమానం నివృత్తి చేసుకుందామని. అర్థమైపోయింది... శోభకు విషయం మొత్తం అర్థమైపోయింది. మామయ్యా... మీరు... ఆనంద... అంటూ ఆగిపోయింది. కాళ్లు చేతులు చల్లబడ్డాయి. మెదడు మొద్దు బారిపోయింది. అడుగు ముందుకు పడడం లేదు. పాలిపోయిన మొహంతో కొడుకును, భర్తను చూసింది. శ్రీరామ్ తల్లి వైపు, తండ్రి వైపు అయోమయంగా చూశాడు. భార్య స్థితి అర్థమైన శ్రీరామ్ తండ్రి... కొడుకును బయటకు తీసుకెళ్లాడు. నాటి కూతురే.. నేటి కోడలు! ‘‘శ్రీరామ్... నాతో పెళ్లికి ముందే మీ అమ్మకు పెళ్లయింది. ఓ కూతురు కూడా. ట్రైన్ యాక్సిడెంట్లో అతను చనిపోయాడు. అప్పటికి వాళ్లకు యేడాదిన్నర బిడ్డ. ఆ షాక్తో మీ అమ్మ సైకలాజికల్గా ఎఫెక్ట్ అయింది. దాదాపు ఆర్నెల్లు పిచ్చిదానిలాగే ఉంది. ఇక్కడ ఉంచితే లాభంలేదు ఎప్పటికీ కోలుకోదని వాళ్ల మేనమామ అమెరికా తీసుకెళ్లాడు. ఆ బిడ్డను శోభ వాళ్ల అత్తగారు, మామగారే ఉంచేసుకున్నారు. మీ అమ్మమ్మ వాళ్లు అడిగినా ఇవ్వలేదు. కొడుకు జ్ఞాపకంగా ఉంటుందని తమ దగ్గరే పెట్టుకున్నారు. శోభ యూఎస్లోనే ఉండిపోయింది. నయం అయ్యాక కూతురి కోసం చాలానే తాపత్రయ పడింది. కాని పెద్దవాళ్లు సర్ది చెప్పి అక్కడే యూఎస్లో వాళ్ల మేనమామ ద్వారా ఉద్యోగం ఇప్పించారు. ఆ కంపెనీలోనే నేనూ జాబ్ చేసేవాడిని. అలా ఇద్దరం లవ్ లో పడ్డాం. పెళ్లి ప్రస్తావన తెచ్చాను. అప్పుడు చెప్పింది మీ అమ్మ.. తనకు అంతకు ముందే పెళ్లయిన విషయం, ఓ కూతురూ ఉన్న సంగతి. అయినా నాకేం అభ్యంతరం లేదన్నాను. పెళ్లి చేసుకున్నాను. తర్వాత నేను, మీ అమ్మ ఇద్దరం కలిసి ఆ అమ్మాయిని తెచ్చేసుకోవాలని చాలా ప్రయత్నించాం. ఆ పాప నానమ్మ, తాతయ్యను కలిశాం. వాళ్లు ససేమీరా అన్నారు. చేసేదేం లేక అమెరికా తిరిగి వెళ్లిపోయాం. యేడాదికి నువ్వు పుట్టావ్. లైఫ్ బిజీలో పడిపోయాం. అదిరా వివరం. అందుకే ఈ పెళ్లి కుదరదు’’ అని చెప్పాడు శ్రీరాం తండ్రి. హతాశుడయ్యాడు శ్రీరాం. ఉన్న చోటనే కూలబడిపోయాడు. చట్టం ఏం చెబుతోందంటే... హిందూవివాహ చట్టం 1955, సెక్షన్ 5 పెళ్లికి కొన్ని షరతులు విధిస్తోంది. పెళ్లి సమయానికి వధూవరుల్లో ఎవరికైనా అంతకుముందే పెళ్లయి ఉండి, ఆ భాగస్వామి బతికున్నా, విడాకులు ఇవ్వకపోయినా ఆ పెళ్లి చెల్లదు. ఆచార వ్యవహారాలు అనుమతించినప్పడు తప్ప నిషేధించిన బంధుత్వం ఉండకూడదు, సపిండులు కాకూడదు. పై షరతులకు విరుద్ధంగా ఎవరైనా పెళ్లి చేసుకుంటే ఆ పెళ్లి చెల్లదు. వీటినే వాయిడ్ మ్యారేజెస్ అంటారు. సెక్షన్ 11 ప్రకారం ఇలాంటి పెళ్లిళ్లను రద్దు చేయొచ్చు. వేరువేరు తండ్రుల ద్వారా ఒకే తల్లికి పుట్టిన పిల్లల సంబంధాన్ని ఏకోదర రక్తసంబంధం అంటారు. పైన కేస్లోని శ్రీరామ్, ఆనందల బంధం దీని కిందికే వస్తుంది. కాబట్టి ఆ పెళ్లి చెల్లదు. సంపూర్ణ రక్త సంబంధం అంటే... ఒకే తల్లిదండ్రులకు పుట్టిన పిల్లల మధ్య, అసంపూర్ణ రక్త సంబంధం... అంటే ఒకే భర్తకు వేరువేరు మహిళల ద్వారా పుట్టిన పిల్లల మధ్య, ఏకోదర రక్తసంబంధం ఉన్న పిల్లల మధ్య వివాహాలు నిషిద్ధం. – ఇ. పార్వతి,అడ్వకేట్, ఫ్యామిలీ కౌన్సిలర్ parvathiadvocate2015@ gmail.com – సరస్వతి రమ -
ప్లీజ్ స్టాప్
నలుగురిలో పీకుడు.. గీకుడు.. గోకుడు ఇంగ్లిష్లో ‘ఎటికెట్’ అంటారు. తెలుగులో ‘సంస్కారంతో కూడిన పద్ధతి కలిగిన మర్యాద’ అని అర్థం కావచ్చు. మాట్లాడేటప్పుడు ముఖం చూస్తూ మాట్లాడాలి. ముఖం మీద పడి కాదు.దురద పుడితే మనం ఇబ్బంది పడాలి. అదేపనిగా గోక్కుంటూ ఉంటే ఎదుటివారు కాదు. మర్యాదస్తులం అని మనల్ని మనం అనుకోవచ్చు. కాని ఇతరులు మనల్ని మర్యాదస్తులని అనుకోవాలి. ఇది చదివి నవ్వితే నవ్వారు. మీ తుంపర్లతో పేపర్ను తడపకండి. మిగిలిన వాళ్లు చదివి నవ్వుకుంటారు. దశకంఠనాదం మానండి రాత్రి పూట మీరు టీ షర్ట్ పైజామా వేసుకుని పడుకుంటారని మీకు మాత్రం తెలిస్తే చాలు. తెల్లారి లేచాక వాటి మీదే కారిడార్లలో తిరక్కండి. ముఖ్యంగా జుట్టు దువ్వకుండా బ్రష్ చేసుకోకుండా నిద్ర ముఖంతోటే పిల్లలను స్కూల్బస్ ఎక్కించడానికి ప్రయత్నించకండి. ఇది మీకు ఇంపుగా ఉన్నా చాలామందికి కంపుగా ఉంటుంది. మరికొందరు బాత్రూమ్లో బ్రష్ చేశాక గొంతు శుభ్రం చేసుకోడానికి పెద్దగా క్యాకరించడం మొదలుపెడతారు. మన క్యాకరింపు మనకు మాత్రమే వినపడితే చాలు. బెజవాడలో మీరు క్యాకరిస్తున్న విషయం కర్నూలు వాళ్లకు తెలియాల్సిన పని లేదు. ఎల్లో పెయింట్ మానండి మీకు చట్నీ ఇష్టం అన్న విషయం మీకు మాత్రమే తెలియనివ్వండి. స్నేహితులతో, పరిచయస్తులతో బ్రేక్ఫాస్ట్కు కూచున్నప్పుడు రెండు మూడు గరిటెల చట్నీ కుమ్మరించుకుని అది చాలదన్నట్టు వేళ్లన్నిటికీ పెయింట్లా పూసుకోకండి. స్పూన్ వాడటం మంచిదే. కాదంటే ఇడ్లీ తుంచడానికైనా పూరీ తుంచడానికైనా మునివేళ్లు చాలు. పిసికి పిసికి మీ గుప్పిటబలం చూపకండి. మరొకటి- తిన్నది తృప్తి కలిగించిందని మీకు తెలిస్తే చాలు. బ్రేవ్మని బస్సు హారన్ని కంగారు పెట్టకండి. అలాంటి సౌండ్స్ ప్రొడ్యూస్ చేయాలనిపిస్తే కాస్త పక్కకువెళ్లి చేయండి. మీ పెర్ఫ్యూమ్ మీకే ముద్దు ప్రతి శరీరానికి ఒక పరిమళం ఉంటుంది. అది మీకు మాత్రమే పరిమళం కావచ్చు. ఆ సెంట్ను మీరే ఉంచుకోండి. కాని నలుగురిలోకి వచ్చేటప్పుడు మీ బట్టల నుంచి, శరీరం నుంచి మంచి వాసన రాకపోయినా అసలు ఏ వాసనా రాకుండా చూసుకోండి. కాలుష్యం పెరిగిపోయిన ఈ రోజుల్లో ఒక రోజు వేసుకున్న బట్టలు ఒకరోజుకే అని గ్రహించండి. వ్యక్తిగత శుభ్రత, బాహు మూలాలు శుభ్రంగా ఉంచుకోవడం కూడా మీకు తెలియని శుభ్ర సంస్కారం ఇస్తుంది. పాటించండి. భూమ్యాకాశాలు వద్దు వాన కురిసేటప్పుడు ఆకాశం వైపు చూడండి. రోడ్డు బాగలేనప్పుడు కింద చూస్తూ నడవండి. అంతే తప్ప ఎదుటివారితో మాట్లాడేటప్పుడు ఆకాశం వైపో నేలవైపో చూడకండి. ముఖం వైపు చూస్తూ మాట్లాడండి. ఎవరితో మాట్లాడుతున్నారో వారితోనే మాట్లాడండి. మీరు సురేష్తో మాట్లాడుతుంటే గీత, అనిత, రాధిక, కాస్త దూరంగా ఉన్న మల్లేశ్, ప్రభాకర్... ఇంతమందికి వినపడాల్సిన పని లేదు. ఇంకో విషయం ఏమిటంటే ఎదుటివారు చెప్పేది కూడా వినండి. నోరు ఒక్కటే. చెవులు రెండు. గమనించండి. అలాగే మీద పడిపోతూ మాట్లాకండి. దూరంగా నిలబడీ మాట్లాడకండి. ఎంతదూరంలో ఉంటే మర్యాదో అంతదూరంలో ఉండి మాట్లాడండి. మరొకటి- ఎదుటివాళ్లు స్నానం చేసే ఉంటారు. మీ నోటి తుంపర్లతో తిరిగి స్నానం చేయించకండి. పిన్ నంబర్ అడక్కండి పాతరోజుల్లో అంటే మనవాళ్లు చనువు భరించేవారు. ఇప్పుడు విసుక్కుంటున్నారు. కనుక ఎదుటివారిని మరీ కబళించుకుని తినేయకండి. మీ ఆయన బాగ చూసుకుంటున్నాడా, మీ ఆవిడతో ప్రాబ్లమ్స్ ఉన్నాయా, ఇంకా పిల్లలు పుట్టలేదా, అయ్యో... ఒక్కడితోనే ఆపేశారా, అంత లావైపోయారు ఎందుకు, ఇంత సన్నగా ఉన్నారు ఏంటి... మీ అమ్మాయి పుట్టింటి నుంచి వచ్చేసిందట నిజమేనా... మీ డెబిట్ కార్డ్ పిన్ నంబర్ ఎంత... ఇవన్నీ కూపీ లాక్కండి. ఎదుటివారు భరిస్తున్నారు కదా అని పీక్కుని తినకండి. అప్పుడు సమాధానం చెప్పినా ఆ తర్వాత మీరు ఈ వీధిలో వస్తుంటే వారు ఆ వీధిలో నుంచి తప్పుకుంటారు. బందిపోటు ముఠా అనుకోనివ్వకండి మనం ఎవరి ఇంటికైనా వెళుతూ ఉంటే వారు మనల్ని బందిపోటు ముఠా అనుకునే విధంగా ఉండకండి. మీ పిల్లలు ఆ ఇంటికి వెళ్లగానే కప్బోర్డులు లాగేసి, ఫ్లవర్వాజులు పగులగొట్టి, బిస్కెట్ ప్యాకెట్లు చింపి రేపర్లు నేలన పడేసి, సోఫాలు తొక్కి, టీవి మీద బంతి విసిరి... ఇన్ని ట్విన్టవర్ దాడులు చేసే విధంగా ఉండకుండా తర్ఫీదు ఇవ్వండి. మీరు కూడా సోఫాలో పద్ధతిగా కూచోండి. కాళ్లెత్తి టీపాయ్ మీద పెట్టకండి. కాస్త విశ్రాంతి తీసుకుంటానని వారి బెడ్రూముల్లోని మంచాల మీద నడుం వాల్చకండి. పూలు తుంచేయడం, కాయలు తెంచేయడం వంటి చేష్టలు వద్దు. భోజనం బాగలేకపోయినా బాగుందనే చెప్పండి. భాగుంటే మరిన్ని పోలికలు తెచ్చి చిన్నబుచ్చకండి. జాలిమ్ దుష్మన్ కాకండి దురదను అదుపు చేసుకోండి. ఎదుటివారి ముందు ఒళ్లు గీరుకుంటూ ఉండటం మర్యాద కాదని గ్రహించండి. తల గీరుకోవడం, నడుము గీరుకోవడం, ముక్కు గీరుకోవడం పోస్ట్పోన్ చేసి ఏకాంతంలో చేయండి. ఎదుటివారి ముందు పళ్లు కుట్టుకోకండి. ముక్కులో వేలు పెట్టి రుద్దుకోకండి. పళ్లలో చిక్కుకున్న పదార్థాల వేటకు చూపుడు వేలు బొటనవేలుతో బయలుదేరకండి. ముఖ్యంగా ఈ పనులన్నీ చేసి ఏదైనా ఆఫర్ చేయడమో, షేక్ హ్యాండ్కు చేయి సాచడమో అస్సలు చేయకండి. ఎదుటివారి ముందు తల దువ్వుకోవడం కూడా అంత మర్యాదకాదు. దువ్వి మనకు చుండ్రు ఉందన్న సంగతి వారికి చాటింపు చేయకండి. ఎడమ చేత్తో ఏదీ ఇవ్వకండి. ఎడమ చేత్తో ఏదీ తీసుకోకండి. సతీ సెన్సిబుల్గా ఉండండి ఎదుటివారు నాస్తికులు కావచ్చు. ఎందుకు అని అడక్కండి. ఆస్తికులు కావచ్చు. మరీ ఇంతగానా అని అభ్యంతర పెట్టకండి. మాంగల్యాలను మట్ట్టెలను వెతకడం, ఇష్టంలేకపోయినా బొట్టు పెట్టడం, పాపిటలో సిందూరం రుద్దడం చేయకండి. ప్రసాదాలు తినమని బలవంత పెట్టకండి. ఫలానా విధంగా లేకపోతే అరిష్టం అని భయపెట్టకండి. అలాగే ఎదుటివారి నమ్మకాలని మూఢవిశ్వాసాలుగా గేలి చేయకండి. గమనించండి. కొందరిని చూస్తే మనకు స్నేహం చేయబుద్ధవుతుంది. అంటే వారు తగిన మర్యాదలు పాటిస్తూ మనల్ని సౌకర్యంగా ఉంచుతున్నారని అర్థం. మనం కూడా ఎదుటివారి దృష్టిలో అలాగే ఉండాలని గ్రహించండి. ఎంతో మర్యాదగా ఇదంతా చదివినందుకు కృతజ్ఞతలు చెప్పనివ్వండి. థ్యాంక్యూ. - శశి వెన్నిరాడై
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
వారి వల్లే మా ఎంగేజ్మెంట్ జరిగింది: అదితిరావు హైదరీ
పెళ్లి చేసుకున్న తెలుగు సీరియల్ నటి (ఫోటోలు)
రాణించిన హెడ్, కమ్మిన్స్.. ముంబై టార్గెట్ ఎంతంటే?
'దీదీ గిరి' అంగీకరించను: పశ్చిమ బెంగాల్ గవర్నర్
బాబే కాదు ప్రధాని మోదీ కూడా యూటర్న్ తీసుకున్నారు: అమర్నాథ్
త్వరలోనే బిడ్డకు జన్మనివ్వనున్న టాలీవుడ్ హీరోయిన్.. భర్తపై అలాంటి పోస్ట్!
తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్.. ఖాతాల్లోకి నగదు
T20 WC 2024: టీమిండియా టీ20 వరల్డ్ కప్ జెర్సీ ఇదే.. ఫోటోలు వైరల్
కాంగ్రెస్కు పాకిస్తాన్ మద్దతు ఉంది: అనురాగ్ ఠాకూర్
టాలీవుడ్ హీరో డ్రీమ్ ప్రాజెక్ట్.. రెబల్ స్టార్ ఎంట్రీ!
తప్పక చదవండి
- సోనాక్షితో ఇంటిమేట్ సీన్స్.. ఆమె తల్లి ఏమన్నారంటే: నటుడు
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- హీట్వేవ్ నుంచి ఉపశమనం.. త్వరలో వర్షాలు: వాతావరణ శాఖ
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement