breaking news
rebuild
-
సంబంధాల బలోపేతానికి భారత్–కెనడా రోడ్మ్యాప్ ఖరారు
న్యూఢిల్లీ: వాణిజ్యం, అరుదైన ఖనిజాలు, ఇంధన రంగాల్లో సహకారం బలోపేతానికి భారత్, కెనడాలు రోడ్ మ్యాప్ ఖరారు చేసుకున్నాయి. సోమవారం కెనడా విదేశాంగ మంత్రి అనితా ఆనంద్, భారత ప్రధాని నరేంద్ర మోదీ, విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్లతో చర్చలు జరిపారు. 2023లో సిక్కు ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యానంతరం రెండు దేశాల మధ్య దెబ్బతిన్న సంబంధాలను పునరుద్ధరించుకోవడమే లక్ష్యంగా ఆమె భారత్కు రావడం తెల్సిందే. రెండు దేశాల వ్యూహాత్మక ప్రాముఖ్యతలు, ప్రపంచ ఆర్థిక పరిణామాల ఆధారంగా వాణిజ్యం, పెట్టుబడుల రంగాల్లో సాధ్యమైనంత త్వరగా మంత్రుల స్థాయి చర్చలు ప్రారంభించాలని జై శంకర్, అనితా ఆనంద్ నిర్ణయించారు. ఈ సందర్భంగా కెనడా గడ్డపై ఖలిస్తానీ వేర్పాటు వాదులు సాగిస్తున్న కార్యకలాపాలపై జై శంకర్ ఆందోళన వ్యక్తం చేశారు. రెండు పక్షాలు పరస్పర ఆందోళనలు, సున్నితమైన అంశాలపై నిర్మాణాత్మక, సమతుల్య భాగస్వామ్యాన్ని కొనసాగించేందుకు ఇరువురు నేతలు అంగీకారానికి వచ్చారు. ఈ మేరకు వారు ఒక సంయుక్త ప్రకటన విడుదల చేశారు. ‘భారత్, కెనడా ప్రధాన మంత్రులు నాలుగు నెలల క్రితం రెండు దేశాల సంబంధాల్లో కొత్త ఊపును తెచ్చేందుకు ప్రాధాన్యతలను నిర్దేశించారు. వాటికి అనుగుణంగా, ఉమ్మడి ప్రజాస్వామ్య విలువలు, సార్వభౌమాధికారం, ప్రాదేశిక సమగ్రతను పరిరక్షించుకుంటూ పరస్పర గౌరవం ఆధారంగా కొత్త రోడ్మ్యాప్పై ఏకాభిప్రాయానికి చేరుకున్నాం’అని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. కెనడా యురేనియం సరఫరాదారులతో భారత అణు ఇంధన సంస్థ అధికారులు జరుపుతున్న చర్చలను ఇద్దరు నేతలు స్వాగతించారు. అంతకు ముందు, అనితా ఆనంద్ ప్రధాని మోదీతో భేటీ అయ్యారు. వాణిజ్యం, టెక్నాలజీ, ఇంధనం, వ్యవసాయం, ప్రజల మధ్య సహకారం పెంచుకునే అంశాలను మంత్రి అనితా ఆనంద్తో చర్చించినట్లు మోదీ ఎక్స్లో తెలిపారు. కెనడా ప్రధాని కార్నీతో చర్చలకు ఆసక్తితో ఎదురు చూస్తున్నానన్నారు. -
రష్యా చేసిన నష్టానికి రష్యా నిధులే వాడతారట.!
యుద్ధంతో అతలాకుతలమైన ఉక్రెయిన్ ఆదుకునేందుకు G7 దేశాలు కొత్త వ్యూహం అనుసరిస్తున్నాయి. వేర్వేరు దేశాల్లో స్తంభింపజేసిన రష్యా నిధులను ఉక్రెయిన్కు కేటాయించాలని ఏకాభిప్రాయానికి వచ్చాయి. ఈ ఏడాది చివరి నాటికి 50 బిలియన్ డాలర్లు సాయం చేయాలని నిర్ణయించాయి. ఉక్రెయిన్పై రష్యా దాడి ప్రారంభించిన తర్వాత.. 300 బిలియన్ యూరోల రష్యన్ సెంట్రల్ బ్యాంక్ ఆస్తులను G7 దేశాలు స్తంభింపజేశాయి. దీనిపై వచ్చిన వడ్డీలో 50 బిలియన్ డాలర్లను రుణం కింద అందించాలని ఈయూ ప్రతిపాదించింది.యుద్ధంలో ధ్వంసమైన ఉక్రెయిన్ను పునర్ నిర్మించాలంటే 486 బిలియన్ డాలర్ల కంటే ఎక్కువ ఖర్చు అవుతుందని ప్రపంచ బ్యాంక్ అంచనా వేసింది. రష్యన్ సెంట్రల్ బ్యాంక్ ఆస్తులనే కాకుండా.. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సన్నిహితులైన ఒలిగార్చ్ ఆస్తులను కూడా EU, G7 దేశాలు స్తంభింపజేశాయి. పడవలు, రియల్ ఎస్టేట్ వెంచర్లు, ఇతర ఆస్తులను స్వాధీనం చేసుకున్నాయి. ఈ ఆస్తుల మొత్తం విలువ 397 బిలియన్ డాలర్లుగా యుక్రేనియన్ థింక్ ట్యాంక్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ లెజిస్లేటివ్ ఐడియాస్ అంచనా వేసింది.ఇక రష్యాకు చెందిన మెజార్టీ ఆస్తులను ఈయూ దేశాలు స్తంభింపచేశాయి. దాదాపు 185 బిలియన్ యూరోలు బెల్జియంలోని అంతర్జాతీయ డిపాజిట్ సంస్థ అయిన యూరోక్లియర్ జప్తు చేయగా.. మిగతా ఆస్తులను బ్రిటన్, ఆస్ట్రియా, జపాన్, స్విట్జర్లాండ్, యూఎస్ దేశాలు సీజ్ చేశాయి. ఇప్పుడు వీటిని ఎలా ఉపయోగించాలనే విషయంలో ఈయూ దేశాలు కీలక పాత్ర పోషించనున్నాయి. నిజానికి.. రష్యన్ సెంట్రల్ బ్యాంక్ డబ్బును పశ్చిమ దేశాలు జప్తు చేయకుండా అంతర్జాతీయ చట్టం నిషేధిం విధించింది. ఇప్పుడు దీని నుంచి తప్పించుకునేందుకు సీజ్ చేసిన రష్యా ఆస్తుల నుంచి వచ్చే వడ్డీని ఉక్రెయిన్కు రుణం కింద అందించాలని భావిస్తున్నాయి.ఉక్రెయిన్కు రుణం అందించే విషయంలో పలు ఇబ్బందులు ఎదురుకానున్నాయి. ఇంతకుముందు యూఎస్ రుణాలు అందిస్తుందని భావించగా.. ఇప్పుడు G7 దేశాలు కూడా ఇందులో భాగస్వామ్యమయ్యాయి. ఈ దేశాల నుంచి ఎవరు రుణాన్ని అందిస్తారనే విషయంపై క్లారిటీ లేకుండా పోయింది. రుణం మంజూరు చేయాలంటే ఈయూ సభ్య దేశాలన్నింటి నుంచి అనుమతి పొందాల్సి ఉంటుంది. ఒకవేళ యుద్ధం నుంచి రష్యా విరమించుకొని ఆస్తులను తిరిగి ఇవ్వాల్సి వస్తే ఏం జరుగుతుందనే దానిపై కూడా ఆయా దేశాల మధ్య స్పష్టత లేన్నట్లు తెలుస్తోంది. చైనా వంటి దేశాలు పశ్చిమ దేశాల్లో పెట్టుబడులు పెట్టాలంటే ఆలోచించుకోవాల్సిన పరిస్థితి వస్తుందని హెచ్చరిస్తున్నారు నిపుణులు. -
USA: ‘బాల్టిమోర్’ బ్రిడ్జి పునఃనిర్మాణానికి 480 కోట్లు
వాషింగ్టన్: ఇటీవల నౌక ఢీకొని కుప్పకూలిన అమెరికాలోని బాల్టిమోర్ వంతెన నిర్మాణం కోసం ఫెడరల్ ప్రభుత్వం ప్రాథమికంగా 60 మిలియన్ డాలర్ల(రూ.480 కోట్లు) అత్యవసర నిధులను కేటాయించింది. ఈ మేరకు మేరీ లాండ్ గవర్నర్ వెస్మూర్ కోరిన వెంటనే ఈ నిధులను దేశ రవాణా, హైవే మంత్రిత్వ శాఖ రాష్ట్రానికి మంజూరు చేసింది. ఈ నిధులతో వంతెన శిథిలాలను నదిలో నుంచి తొలగించడంతో పాటు కూలిన భాగాన్ని మళ్లీ నిర్మించనున్నారు. కీలకమైన బాల్టిమోర్ వంతెనను వీలైనంత త్వరగా మళ్లీ నిర్మించేందుకు అవసరమైతే భూమిని ఆకాశాన్ని ఒకటి చేయాల్సిందిగా అధికారులకు ఆదేశాలిచ్చినట్లు అధ్యక్షుడు జో బైడెన్ ఇప్పటికే మీడియాకు తెలిపారు. కాగా, మంగళవారం(మార్చ్ 29)న అర్ధరాత్రి ఒంటిగంటకు పటాప్కో నదిపై ఉన్న ఫ్రాన్సిన్ స్కాట్కీ బ్రిడ్జి భారీ కంటెయినర్ నౌక ఢీకొని కుప్పుకూలిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో బ్రిడ్జిపై పనిచేస్తున్న ఆరుగురు కార్మికులు నదిలో పడిపోగా వారిలో ఇద్దరి మృతదేహాలు దొరికాయి. మరో నలుగురు ఆజూకీ ఇంకా తెలియలేదు. వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఇదీ చదవండి.. ఘోర బస్సు ప్రమాదంలో 45 మంది దుర్మరణం -
కాషాయం నుంచి నీలంలోకి..
సాక్షి, లక్నో : యూపీలోని బదౌన్లో దుండగులు కూలగొట్టిన రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహాన్ని పునఃప్రతిష్టించారు. అయితే ఈ విగ్రహంలో అంబేడ్కర్ తరచూ కనిపించే సూట్లో కాకుండా కాషాయ రంగులో ఉన్న ప్రిన్స్ సూట్లో కనిపిస్తుండటం గమనార్హం. అంబేడ్కర్ విగ్రహానికి కాషాయం పులమడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన బీఎస్పీ నేత హిమేంద్ర గౌతం కాషాయం రంగు మార్చి నీలం రంగు వేయించారు. వివరాల్లోకి వెళితే.. బదౌన్ ప్రాంతంలోని దగ్రాయ గ్రామంలో ఈనెల ఏడున కొందరు దుండగులు అంబేడ్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేశారు. ఈ ఘటనతో బదౌన్ ప్రాంతం ఆందోళనలతో హోరెత్తగా స్పందించిన అధికార యంత్రాంగం ఆగ్రా నుంచి ఆఘమేఘాలపై మరో విగ్రహాన్ని తెప్పించి అదే ప్రాంతంలో ప్రతిష్టించింది. అయితే కాషాయ రంగులో విగ్రహం రూపొందించడం పట్ల అధికారులను ప్రశ్నించగా వారి నుంచి ఎలాంటి స్పందనా రాలేదు. మరోవైపు ఈ వ్యవహారంలో తమ పార్టీ ప్రమేయం లేదని బీజేపీ మాజీ ఎమ్మెల్యే ప్రేమ్ స్వరూప్ పట్నాయక్ అన్నారు. ‘ఈ వ్యవహారాన్ని రాజకీయం చేస్తున్నారు. విగ్రహంతో బీజేపీకి ఎలాంటి సంబంధం లేదు..కాషాయ వర్ణమైతే భారత సంస్కృతికి ప్రతీక’ అని ఆయన వ్యాఖ్యానించారు. ఇక మార్చిలో సిద్ధార్ధనగర్, అలహాబాద్లో 24 గంటల వ్యవధిలోనే రెండు అంబేడ్కర్ విగ్రహాలను దుండగులు కూల్చివేశారు. ఏమైనా కొద్ది గంటల్లోనే అంబేడ్కర్ విగ్రహం నీలం నుంచి కాషాయం..కాషాయంలోంచి నీలంలోకి మారింది. -
నేపాల్ పునరుద్ధరణకోసం..
భూకంపంతో నేలమట్టమైన నేపాల్ ను పునరుద్ధరించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ ఆధ్వర్యంలోని కేబినెట్ అప్పాయింట్ మెంట్ కమిటీ (ఏసీసీ) తాజాగా నేషనల్ రీ కనస్ట్రక్షన్ అథారిటీ ప్యానెల్ లో సీనియర్ అడ్వైజర్ గా గుజరాత్ కేడర్ కు చెందిన ఐఏఎస్ ఆఫీసర్ వి. తిరుప్పుగహ్ ను నియమించింది. గతేడాది నేపాల్ లో సంభవించిన భూకంపం అక్కడి ప్రజల్ని భారీ వినాశనంలోకి నెట్టివేసిన సంగతి తెలిసిందే. ఆ ప్రకృతి విలయం తొమ్మిది వేలకు పైగా ప్రాణాలుకూడా బలిగొంది. గుజరాత్ కేడర్ కు చెందిన ఐఏఎస్ ఆఫీసర్ తిరురుప్పుగహ్ 1991 బ్యాచ్ కు చెందినవాడు. ప్రస్తుతం నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీలో పనిచేస్తున్న ఆయన్ను.. నేషనల్ రీ కనస్ట్రక్షన్ అథారిటీ (ఎన్ ఆర్ ఏ) లో మొదటి ఆర్నెల్లకు సీనియర్ అడ్వైజర్ గా నియమిస్తూ ప్రభుత్వ పర్సనల్ అండ్ ట్రైనింగ్ డిపార్ట్ మెంట్ ఆదేశాలు జారీ చేసింది. గతేడాది ఏప్రిల్ 25న భూకంపం సుమారు 9 వేలమందిని పొట్టన పెట్టుకొని, 22,302 మందిని గాయాల పాలు చేసి, కోట్టాది రూపాయల నష్టాన్ని చేకూర్చిన అనంతరం.. నేపాల్ పునరుద్ధరణకోసం ఎన్ ఆర్ ఏ ను ఏర్పాటు చేశారు. ఆరు నెల్లపాటు తిరుప్పగహ్న ఆ బాధ్యతల్లో కొనసాగుతారు. అలాగే మరో ఐఏఎస్ ఆఫీసర్ ప్రశాంత్ ఎస్ లోకాండే ను బీజింగ్ లోని ఇండియన్ ఎంబసీలో కౌన్సిలర్ గా నియమిస్తూ ఏసీసీ ఆదేశాలు జారీ చేసింది. 2001 బ్యాచ్ యూనియన్ టెర్రిటరీస్ కు చెందిన ఐఏఎస్ ఆఫీసర్ లోకాండేను మొదట్లో మూడేళ్ళకోసం నియమించినట్లు ఏసీసీ తెలిపింది. ప్రస్తుతం లోకాండే పెట్రోలియం అండ్ నేచురల్ గ్యాస్ మంత్రిత్వ శాఖలో పనిచేస్తున్నారు.