breaking news
Real events
-
వాస్తవ సంఘటనలే సినిమాగా తెరకెక్కిస్తున్న దర్శకులు
కథలు ఊహల్లో నుంచే కాదు.. వాస్తవ జీవితాల్లో నుంచి కూడా వస్తుంటాయి. ఇలా రియల్గా జరిగిన కొన్ని ఘటనల ఆధారంగా కొందరు దర్శకులు రాసుకున్న కథలతో కొన్ని సినిమాలు సిద్ధం అవుతున్నాయి. రియల్ టు రీల్గా రానున్న ఆ చిత్రాల గురించి తెలుసుకుందాం. ► ‘డాన్ శీను (2010)’, ‘బలుపు (2013)’, ‘క్రాక్ (2021)’ చిత్రాల తర్వాత హీరో రవితేజ, దర్శకుడు గోపీచంద్ మలినేని కాంబినేషన్లో నాలుగో సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను కొన్ని వాస్తవ ఘటనల స్ఫూర్తితో తెరకెక్కించనున్నట్లుగా చిత్ర యూనిట్ ఇప్పటికే వెల్లడించింది. అయితే ఇది కంప్లీట్ పీరియాడికల్ ఫిల్మ్ అని, ఆంధ్రప్రదేశ్లో 1991లో జరిగిన ఓ సంచలన ఘటన ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తారనే టాక్ ఫిల్మ్నగర్ సర్కిల్స్లో వినిపిస్తోంది. తమిళ దర్శకుడు సెల్వరాఘవన్, ఇందూజ రవిచంద్రన్ కీలక పాత్రల్లో నటించనున్నారు. మైత్రీమూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ నిర్మించనున్న ఈ సినిమాకు తమన్ స్వరకర్త. మరోవైపు రవితేజ, గోపీచంద్ మలినేని కాంబినేషన్లో వచ్చిన ‘క్రాక్’ కూడా కొన్ని వాస్తవ ఘటనల ప్రేరణతో తెరకెక్కి, హిట్ చిత్రంగా నిలిచిన సంగతి తెలిసిందే. ► హీరో మహేశ్బాబు, దర్శకుడు రాజమౌళి కాంబినేషన్లోని సినిమాపై అంతర్జాతీయ స్థాయిలో అంచనాలు ఉన్నాయి. ఆఫ్రికన్ ఫారెస్ట్ అడ్వెంచరస్ యాక్షన్ డ్రామాగా ఈ సినిమా కథనం ఉంటుంది. అయితే ఈ సినిమా కథలోని కొంతభాగం వాస్తవ ఘటనల ఆధారంగా ఉంటుందని ఈ చిత్ర రచయిత కె.విజయేంద్ర ప్రసాద్ గత ఏడాది అక్టోబరులో ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ సినిమా స్క్రిప్ట్ వర్క్ జరుగుతోంది. కథను బట్టి ఈ సినిమాను రెండు భాగాలుగా విడుదల చేస్తే ఎలా ఉంటుందనే అంశాన్ని కూడా రాజమౌళి అండ్ కో ఆలోచిస్తున్నారని సమాచారం. ఈ సినిమా షూటింగ్ వచ్చే ఏడాది ద్వితీయార్ధంలో ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. భారీ బడ్జెట్తో కేఎల్ నారాయణ ఈ సినిమాను నిర్మించనున్నారు. ► శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలకు చెందిన దాదాపు 25 మంది మత్స్యకారులు బతుకుతెరువు కోసం గుజరాత్ తీర ప్రాంతంలోని వీరవల్ వద్ద చేపల వేట కొనసాగిస్తూ, 2018 నవంబరులో పోరపాటున పాకిస్తాన్ కోస్ట్గార్డ్ అధికారులకు బందీలుగా చిక్కారు. దాదాపు ఏడాదిన్నర పాటు జైలు జీవితం అనుభవించిన వారి జీవితాల్లోని వాస్తవ ఘటనల సమాహారంగా ‘తండేల్’ సినిమా తెరకెక్కనుంది. ‘ప్రేమమ్ (2016)’, ‘సవ్యసాచి (2018)’ చిత్రాల తర్వాత హీరో నాగచైతన్య, దర్శకుడు చందూ మొండేటి కాంబి నేషన్లో తెరకెక్కనున్న మూడో చిత్రం ఇది. ఇందులో సాయి పల్లవి హీరోయిన్గా నటించనున్నారు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ డిసెంబరులోప్రారంభం కానుంది. అల్లు అరవింద్ సమర్పణలో ‘బన్నీ’ వాసు ఈ సినిమాను నిర్మించనున్నారు. కాగా వివాహం జరిగిన కొద్ది కాలానికే, తాను తండ్రి కాబోతున్న సమయంలోనే పాకిస్తాన్లో ఖైదు కాబడిన శ్రీకాకుళం మత్స్యకారుడి పాత్రలో నాగచైతన్య నటిస్తున్నట్లుగా తెలిసింది. వచ్చే ఏడాది చివర్లో ‘తండేల్’ సినిమా విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ స్వరకర్త. ► ఇండియన్ ఎయిర్ఫోర్స్ ఆఫీసర్గా వరుణ్ తేజ్ నటించిన దేశభక్తి చిత్రం ‘ఆపరేషన్ వాలెంటైన్’. హిందీ, తెలుగు భాషల్లో రూపోందిన ఈ ద్విభాషా చిత్రంతో శక్తీ ప్రతాప్ సింగ్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ చిత్రంతో మానుషీ చిల్లర్ హీరోయిన్గా తెలుగు తెరకు పరిచయం అవుతుండగా, వరుణ్ తేజ్ హిందీకి పరిచయం అవుతున్నారు. ఇండియన్ ఎయిర్ఫోర్స్లో చోటు చేసుకున్న కొన్ని వైమానిక దాడుల వాస్తవ ఘటనల సమాహారంగా ఈ సినిమాను తెరకెక్కించినట్లు చిత్రయూనిట్ వెల్లడించింది. సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ్రపోడక్షన్స్, రినైసెన్స్ పిక్చర్స్ సందీప్ ముద్దా నిర్మించారు. తొలుత ఈ సినిమాను డిసెంబరు 8న విడుదల చేయాలనుకున్నారు. కానీ ఈ సినిమా రిలీజ్ వాయిదా పడిందని, వచ్చే ఏడాదిప్రారంభంలో విడుదల చేసే ఆలోచన ఉందని యూనిట్ వెల్లడించింది. ► సుధీర్బాబు హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘హరోం హర: ది రివోల్ట్’. జ్ఞానసాగర్ ద్వారక దర్శకత్వంలో సుమంత్ జి. నాయుడు నిర్మిస్తున్న ఈ సినిమాలో సునీల్ ఓ కీలక పాత్రధారి. కాస్త రివెంజ్ టచ్ ఉన్న ఈ సినిమా 1989లో చిత్తూరు జిల్లా కుప్పంలో జరిగిన కొన్ని వాస్తవ ఘటనల స్ఫూర్తితో ఉంటుందనే టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాను ఈ ఏడాది డిసెంబరు 22న విడుదల చేయాలనుకున్నారు. అయితే ఈ తేదీకి ప్రభాస్ ‘సలార్’ చిత్రం రిలీజ్ కానున్న నేపథ్యంలో ‘హరోం హర’ చిత్రం విడుదల వాయిదా పడినట్లు తెలుస్తోంది. ► శ్రీకాంత్ శ్రీరామ్ హీరోగా రూపోందిన హారర్ ఫిల్మ్ ‘పిండం’. ఖుషీ రవి, ఈశ్వరీరావు, అవసరాల శ్రీనివాస్, రవివర్మ ఇతర ప్రధాన పాత్రలుపోషించారు. ఓ నిజజీవిత ఘటన ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించామని, చిత్రీకరణ సమయంలో కొన్ని ఘటనలు జరగడంతో కాస్త భయంగానే ఈ సినిమాను తెరకెక్కించినట్లుగా ఈ చిత్రదర్శకుడు సాయికిరణ్ దైదా చెబుతున్నారు. యశ్వంత్ దగ్గుమాటి నిర్మించిన ఈ చిత్రం డిసెంబరు 15న విడుదల కానుంది. 1930, 1990.. ప్రస్తుతం.. ఇలా మూడు కాలాలతో ‘పిండం’ స్క్రీన్ ప్లే ఉంటుందని చిత్రయూనిట్ పేర్కొంది. ఇలా వాస్తవ ఘటనల ఆధారంగా రూపుదిద్దుకుని, ప్రేక్షకులను అలరించేందుకు మరికొన్ని సినిమాలు సిద్ధం అవుతున్నాయి. -
సెలబ్రిటీ కాదు కంప్లీట్ మ్యాన్
యాడ్స్.. ప్రొడక్ట్ క్వాలిటీని ఎంతవరకు ప్రొజెక్ట్ చేస్తున్నాయో తెలియదు కానీ మారిన తరంలోని మానవ సంబంధాలను మాత్రం కళ్లకు కడుతున్నాయి. ముఖ్యంగా మీసం మెలేసే మగాడు సున్నితంగా మారిన వైనానికి అద్దం పడుతున్నాయి!. ఓరియో బిస్కట్స్ నాన్న.. భారత్ మ్యాట్రిమోనీ భర్త.. క్యాడ్బరీ డెయిరీ మిల్క్ స్నేహితుడిని కలుపుకొని రేమండ్స్ ది కంప్లీట్ మ్యాన్ని ఆవిష్కరిస్తోంది! యాడ్స్లోనే కాదు ఇంట్లోనూ అలాగే ఉన్న ఈతరం పురుషుడి గురించి కథనం.. నిజమైన సంఘటనలే ఊపిరి సెలబ్రిటీలే కాదు కంప్లీట్ మ్యాన్కి అద్దంపట్టే సామాన్యూలూ ఉన్నారు. సికింద్రాబాద్కి చెందిన కోమల్రెడ్డి నేటి తరం పురుషుడికి ప్రతినిధి. ఆయన గురించి వాళ్లావిడ శిరీష ‘నాకు డిగ్రీ అవగానే పెళ్లయింది. పీజీ చేయాలని ఉండింది. కోమల్తో చెబితే ఓకే అన్నాడు. ఎంట్రెన్స్ రాస్తే సీట్ వచ్చింది. ఫస్టియర్ అయేటప్పటికి కన్సీవ్ అయ్యాను. సెకండియర్ ఎగ్జామ్స్ అప్పటికి చంటిబిడ్డ తల్లిని. రోజుల బిడ్డను పట్టుకొని ఎగ్జామ్స్ రాయడమా అని భయపడ్డాను. కోమల్ ధైర్యం చెప్పి పరీక్షలకు రెడీ చేశాడు. నేను ఎగ్జామ్నేషన్ హాల్లో.. తను బయట పాపను ఎత్తుకొని పచార్లు.. ఇలాంటి నేచర్ ఉన్న మగవాళ్లను ఇటు మా ఇంట్లోను, అటు వాళ్లింట్లోనూ చూడలేదు’ అంది. ‘శిరీష నా కోసం కొన్నింటిని శాక్రిఫైస్ చేసినప్పుడు ఆమె లైఫ్ యాంబిషన్ కోసం నేనెందుకు చూయకూడదని అనుకున్నాను. మా పాప అనన్య విషయంలో తల్లిగా తనకెంత బాధ్యత, ప్రేమ ఉన్నాయో, తండ్రిగా నాకూ అంతే బాధ్యత, ప్రేమ ఉన్నాయి’ అంటాడు కోమల్. యాడ్స్ ప్రభావం.. యాడ్స్కి రియల్ ఘటనలు ప్రేరణ ఇచ్చినట్టే యాడ్స్ ప్రభావమూ తన మీదుందంటాడు బాలశేఖర్. ‘సినిమాలు మగవాళ్లలోని సున్నితత్వాన్ని చంపేస్తుంటే ఇలాంటి యాడ్స్ మరింత సెన్సిటైజ్ చేస్తున్నాయి. నా పెళ్లయి తొమ్మిది నెలలైంది. నా భార్య శ్రావణి.. మంచి ఫ్రెండ్. ఏ విషయంలోనూ సొంత నిర్ణయం తీసుకోను. నేను మల్టీమీడియా చేశాను. తను బీటెక్. ఇద్దరం కలిసి బిజినెస్ స్టార్ట్చేశాం. ఆడవాళ్లు సెకండ్ జెండర్కాదు.. మగవాళ్లతో ఈక్వల్. ఈ భావన నాలో కలగడానికి నాకున్న రీడింగ్ హాబీ ఒక కారణమైతే.. రేమండ్స్లాంటి యాడ్సూ కారణమే’ అంటాడు బాలశేఖర్. ‘నిజమే.. శేఖర్ భర్తగా కన్నా ఓ ఫ్రెండ్లా ఉంటాడు. అన్నీ షేర్ చేసుకుంటాను’ అంటుంది బాలశేఖర్ భార్య శ్రావణి.