breaking news
rani nagar
-
జీవితాంతం హాస్యాన్ని పంచుతా
అనంతపురం కల్చరల్, న్యూస్లైన్ : మీ అందరి అభిమానం ఉంటే జీవితాంతం హాస్యాన్ని పంచాలనుందని ప్రముఖ సినీ హాస్య నటుడు బ్రహ్మానందం పేర్కొన్నారు. వీలైతే మరొకసారి అనంతపురానికి వచ్చి వీరబ్రహ్మేంద్రుల ఆశీస్సులందుకుంటానని అన్నారు. గురువారం సాయంత్రం అనంతపురంలోని రాణినగర్లో విశ్వబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన సత్కార కార్యక్రమంలో అభిమానులు దూసుకురావడంతో ఆయన పైన పేర్కొన్న రెండే రెండు మాటలు మాట్లాడి వేదిక దిగి వెళ్లిపోయారు. బ్రహ్మానందాన్ని చూడడానికి అభిమానులు భారీగా తరలిరావడంతో సభా ప్రాంగణంలో ఒక్కసారిగా గందరగోళం నెలకొంది. దీనికి తోడు నిత్యం రద్దీగా ఉండే రాణినగర్ రోడ్డుపై సత్కార కార్యక్రమం ఏర్పాటు చేయడంతో రసాభాసగా మారింది. ఆయనకు పలు సంస్థలు చేయాల్సిన సత్కారాలు అర్ధంతరంగా ఆగిపోయాయి. పోలీసుల వలయంలో అతి కష్టం మీద స్టేజి వద్దకు చేరుకున్న బ్రహ్మానందం ముక్తసరిగా రెండే రెండు మాటలు మాట్లాడి ఊహించని విధంగా స్టేజీ దిగి వెళ్లిపోవడంతో అభిమానులతో పాటు నిర్వాహకులు కూడా ఆశ్చర్యపోయారు. సరైన ఏర్పాట్లు చేయకపోవడంపై ఆయన నిర్వాహకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బ్రహ్మానందం వెళ్లిపోవడంతో ఆగ్రవేశాలతో ఉన్న అభిమానులు కుర్చీలు విరగ్గొట్టి అసంతృప్తి వ్యక్తం చేశారు. మధ్యాహ్నమే నగరానికి చేరుకున్న బ్రహ్మానందం స్థానిక ఆర్డీటీ గెస్ట్హౌస్లో విశ్రాంతి తీసుకుని సాయంత్రం కార్యక్రమానికి హాజరయారు. -
మూడో తరగతి విద్యార్థినిపై లైంగిక దాడి
అనంతపురం : కామంతో కళ్లు మూసుకుపోయిన ఇద్దరు మృగాళ్లు అభం శుభం తెలియని చిన్నారిపై లైంగిక దాడికి పాల్పడ్డారు. మూడో తరగతి విద్యార్థినిపై వారు ఈ ఘాతుకానికి ఒడిగట్టారు. అనంతపురం జిల్లా రాణినగర్లో ఈ దారుణం చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించి 20 ఏళ్ల యువకుడితోపాటు 70 ఏళ్ల వృద్ధుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
ముగ్గురు చిన్నారుల మృతి
అనంతపురం క్రైం, న్యూస్లైన్: ‘ఆడి పాడి అలసిపోయి అమ్మ ఒడిలో సేద తీరాల్సిన ముగ్గురు చిన్నారులు అగ్ని కీలలకు ఆహుతయ్యారు. కుటుంబానికి ఆసరాగా ఉంటుందని చేపట్టిన చిరు వ్యాపారం వారి పాలిట మృత్యువుగా మారింది. ప్రమాదవశాత్తు చోటు చేసుకున్న ఈ సంఘటన ఇద్దరు తల్లులకు, ఓ కుటుంబానికి తీరని శోకాన్ని మిగిల్చింది. వివరాలిలా ఉన్నాయి. అనంతపురం పాతూరులోని రాణినగర్లో నివసించే వడ్డె బ్రహ్మయ్య, గంగమ్మ దంపతులకు ముత్యాలమ్మ, వెంకటలక్ష్మి, సరస్వతి సంతానం. వీరిలో పెద్ద వారిద్దరికీ వివాహాలయ్యాయి. పెద్ద అల్లుడు ఉపాధి నిమిత్తం వివిధ గ్రామాలకు పనులకు వెళుతుండడంతో అతని భార్య ముత్యాలమ్మ పిల్లలతో సహా పుట్టింట్లోనే ఉంటోంది. చిత్తూరు జిల్లాలో నివాసముంటున్న రెండో కూతురు వెంకటలక్ష్మి ఒడి బియ్యం వేసుకోవడానికి పుట్టింటికి వచ్చింది. కుటుంబ ఖర్చుల నిమిత్తం ఆ కుటుంబ సభ్యులు లూజుగా పెట్రోలు విక్రయించేవారు. ఇందులో భాగంగా మంగళవారం రాత్రి పది లీటర్ల పెట్రోలును కొనుగోలు చేసి ఇంట్లో నిల్వ చేశారు. బుధవారం ఉదయం ముత్యాలమ్మ కట్టెల పొయ్యిపై వంట చేస్తుండగా, ఆమె కూతుళ్లు జ్యోతి (8), శ్యామ (5), పదకొండు నెలల మగ శిశువు, వెంకటలక్ష్మి కొడుకు నందకిశోర్(1) ఇంట్లో ఆడుకుంటుండగా, వెంకటలక్ష్మి, సరస్వతి ఇంట్లోనే ఉన్నారు. ఈ క్రమంలో ఆడుకుంటున్న పిల్లలు అరుగుపై ఉంచిన పెట్రోలు క్యాన్ను తగలడంతో, అది మండుతున్న పొయ్యిపై పడింది. దీంతో ఒక్కసారిగా మంటలు ఎగిసి ఇంటిని ఆవరించాయి. దీంతో వారు చేసిన ఆర్తనాదాలు విన్న స్థానికులు వారిని రక్షించేందుకు అక్కడికి చేరుకున్నారు. కొందరు యువకులు నీళ్లతో మంటలు ఆర్పి వేశారు. గాయపడిన ముగ్గురు మహిళలు, నలుగురు పిల్లలను హుటాహుటిన ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వీరిలో 11 నెలల శిశువును స్థానిక పోలీసులు చొరవ తీసుకుని మెరుగైన చికిత్స నిమిత్తం స్థానిక హృదయ ఆసుపత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం కర్నూలుకు తరలిస్తుండగా నందకిశోర్, జ్యోతి, శ్యామ మృతి చెందారు. కర్నూలులో చికిత్స పొందుతున్న ముత్యాలమ్మ, వెంకటలక్ష్మి.. అనంతపురంలోని ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న 11 నెలల చిన్నారి పరిస్థితి విషమంగా ఉంది. ఐదుగురికి తప్పిన ప్రమాదం బ్రహ్మయ్య కుటుంబంతోపాటు ఆయన సోదరుడి కుటుంబం కూడా అక్కడే నివాసముంటోంది. అందరూ కూలీలే కావడంతో ఎవరి పనుల కొద్దీ వారు ఉదయమే బయటకు వెళ్లడంతో బ్రహ్మయ్య, గంగమ్మ, అతని సోదరుడు రమణ కుటుంబ సభ్యులు మంజుల, సత్యమ్మ ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. ఆర్తనాదాలతో దద్దరిల్లిన ఆస్పత్రి అగ్ని ప్రమాదం సమాచారం తెలుసుకున్న రాణినగర్ వాసులు పెద్ద ఎత్తున ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకున్నారు. కాలిన గాయాలతో బాధపడుతున్న చిన్నారులను చూసి హృదయ విదారకంగా రోదించారు. నేతలు, పోలీసు అధికారుల పరామర్శ విషయం తెలిసిన వెంటనే వైఎస్సార్సీపీ అనంతపురం ఎమ్మెల్యే గురునాథరెడ్డి, జిల్లా కన్వీనర్ శంకరనారాయణ, నేతలు తోపుదుర్తి ప్రకాశ్రెడ్డి, బోయ సుశీలమ్మ, లీగల్సెల్ కన్వీనర్ నారాయణరెడ్డి, డీఎస్పీ దయానందరెడ్డి తదితరులు వెంటనే ప్రభుత్వాస్పత్రికి చేరుకుని క్షతగాత్రులను పరామర్శించారు. మెరుగైన వైద్య చికిత్సలకు వెంటనే చర్యలు తీసుకోవాలని ఆస్పత్రి సిబ్బందికి సూచనలు చేశారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన డీఎస్ఓ డీఎస్ఓ శాంతకుమారి, సివిల్ సప్లై విభాగం డిప్యూటీ తహశీల్దార్ వెంకటేశ్వర్లు, ఇతర అధికారులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. ప్రమాదానికి దారితీసిన కారణాలపై ఆరా తీశారు. ప్రమాదం చోటుచేసుకున్న ఇంట్లో మరో పది లీటర్ల పెట్రోలు క్యాను లభించడంతో దానిని స్వాధీనం చేసుకున్నారు. -
అనంతలో అగ్ని ప్రమాదం: ఐదుగురికి తీవ్ర గాయాలు
అనంతపురం నగరంలోని రాణి నగర్లో ఓ ఇంట్లో బుధవారం ఉదయం అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఇంట్లో ఉన్న పెట్రోల్ టీన్కు ప్రమాదవశాత్తు నిప్పు అంటుకుంది. దాంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఆ ఘటనలో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే స్పందించి పోలీసులకు సమాచారం అందించారు. దాంతో పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే వారి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. క్షతగాత్రుల్లో ముగ్గురు చిన్నారులు, ఇద్దరు మహిళలు ఉన్నారని పోలీసులు తెలిపారు. పోలీసు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.