breaking news
Rangapur
-
బంగ్లాదేశ్: హిందూ కుటుంబం కేసులో షాకింగ్ విషయాలు
ఓ కుటుంబంలోని అందరి ఫోన్లు ఒక్కసారిగా స్విచ్ఛాఫ్ అయ్యాయి. ఇంటి తలుపులు లోపలికి మూసివేసి ఉన్నాయి. తలుపులు బద్ధలు కొట్టి ఇంట్లోకి వెళ్లిన బంధువులకు కనిపించిన దృశ్యం ఒళ్లు గగుర్పొడిచేలా ఉంది. బంగ్లాదేశ్లోని రంగ్పూర్లో ఓ హిందూ కుటుంబానికి చెందిన నలుగురు అనుమానాస్పద స్థితిలో మృతిచెందడం తీవ్ర కలకలం రేపింది. అయితే దర్యాప్తులో బయటపడుతున్న వివరాలు మరింత షాక్కు గురిచేస్తున్నాయి. బంగ్లాదేశ్ రంగ్పూర్లోని దాస్పారా ప్రాంతంలో నివసించే రిటైర్డ్ టీచర్ గణపతి చక్రవర్తి (65), ఆయన భార్య ప్రీతిలత (50), కుమార్తె అగామి చక్రవర్తి ప్రార్థి (23), కుమారుడు ప్రియమ్ (12) మృతదేహాలు ఇంట్లోనే చెల్లాచెదురుగా పడి ఉన్న ఘటన తీవ్ర చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. చనిపోయింది హిందూ కుటుంబం కావడంతో.. మత విద్వేష దాడా? అనే కోణంలోనూ తీవ్ర చర్చ జరిగింది. అయితే.. కారణం అది కాదని పోలీసులు తేల్చారు. అంతేకాదు హత్యల తర్వాత కూడా నిందితులు గంటల పాటు అదే ఇంట్లో ఉండటం, అక్కడే తినడం, స్నానం చేయడం వంటి విషయాలు వెలుగులోకి రావడం సంచలనంగా మారింది.అసలు ఏం జరిగింది?మొదట ఈ ఘటనను దోపిడీకి సంబంధించిన హత్య, మత విద్వేష దాడులా? అనే కోణంలో పోలీసులు అనుమానించారు. ఇంట్లో వస్తువులు చిందరవందరగా ఉండటం, దోపిడీ జరిగినట్లు కనిపించే పరిస్థితులు ఆ కోణంలో దర్యాప్తుకు దారితీశాయి. అయితే ఆధారాలు సేకరించే కొద్దీ అసలు కథ బయటపడింది.గణపతి చక్రవర్తి ఇంటి పైకప్పుపైకి పొరుగింటి మార్గం ద్వారా వచ్చిన ఇద్దరు వ్యక్తులు ‘యాబా’ అనే మత్తు పదార్థాన్ని తీసుకుంటున్నారు. ఆ శబ్దాలు విని పైకి వెళ్లిన గణపతి వారిని ప్రశ్నించడంతో.. తమను గుర్తిస్తాడనే భయంతో ఆయనను గొంతు నులిమి హత్య చేశారు. చక్రవర్తి ఎంతకీ కిందకు రాకపోవడంతో.. ఆ వెనకాలే వచ్చిన ఆయన భార్య, కుమార్తె, కుమారుడిని కూడా హత్య చేసినట్లు పోలీసులు చెబుతున్నారు.గణపతి చక్రవర్తి ఫ్యామిలీ (పాత ఫొటో)గురువారం ఈ ఘోరం జరగ్గా.. ఈ కేసులో ముఘ్దో, సిద్ధార్థ అనే ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విచారణలో వారు నేరాన్ని అంగీకరించినట్లు అధికారులు వెల్లడించారు.హత్యల తర్వాత కూడా ఇంట్లోనే..ఈ ఘటనలో అత్యంత షాకింగ్ అంశం.. హత్యలు చేసిన తర్వాత నిందితులు వెంటనే పారిపోలేదని దర్యాప్తులో తేలడం. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వారు ఆ ఇంట్లోనే ఆరు నుంచి ఏడు గంటల పాటు ఉన్నారు. ఇళ్లంతా కలియ దిరిగారు. ఖర్జూరాలు, దోసకాయలు తిన్నారని.. స్నానం చేశారని, ఆపైనా మత్తు పదార్థం తీసుకున్న ఆనవాళ్లు లభించాయని చెప్పారు.అంతేకాదు.. దోపిడీ జరిగినట్లు కనిపించేందుకు ఇంట్లో వస్తువులను చిందరవందర చేసినట్లు, ఆధారాలను చెరిపివేసేందుకు ప్రయత్నించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. మృతుల మొబైల్ ఫోన్లపై కూడా ఆధారాలు తొలగించే ప్రయత్నం జరిగినట్లు దర్యాప్తులో గుర్తించారు.హిందువుల భద్రతపై మళ్లీ చర్చఈ ఘటనతో బంగ్లాదేశ్లో మైనారిటీల భద్రతపై మరోసారి చర్చ మొదలైంది. గతంలోనూ అక్కడ హిందూ సమాజంపై దాడులు, దేవాలయాలపై దాడులు, ఆస్తుల ధ్వంసానికి సంబంధించిన ఘటనలపై భారత్ ఆందోళన వ్యక్తం చేసింది. భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ కూడా బంగ్లాదేశ్లో హిందువులు సహా మైనారిటీలపై జరిగిన హింసాత్మక ఘటనలను ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోందని గతంలో తెలిపారు. అయితే తాజా ఘటన గంజాయి బ్యాచ్ పనిగా పోలీసులు నిర్ధారించారు. మరోవైపు రంగ్పూర్ తాజా ఘటనపై భారత ప్రభుత్వం నుంచి ఇప్పటివరకు ప్రత్యేకంగా ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. ఇదీ చదవండి: హ గదీ భారత్ దెబ్బంటే.. -
అంటగట్టారు!
నల్లగొండ రూరల్/గుర్రంపోడు/ తిప్పర్తి/నిడమనూరు: రంగాపూర్ వెరైటీ బత్తాయి మొక్కలతో రైతులు నిండా మునిగారు. పూత, కాత బాగానే ఉన్నా, కాయ సైజు పెరగలేదు. పైగా నిమ్మకాయల సైజులో ఉండగానే పసుపు రంగులోకి మారి రాలిపోయాయి. తిరుపతిలోని ఉద్యాన యూనివర్సిటీ నుంచి బత్తాయిలో రంగాపూర్ రకం మొక్కలు తీసుకొచ్చి సాగు చేసిన సుమారు 200 మంది రైతులు రూ.60 కోట్ల మేర నష్టపోయారు. దీంతో కొందరు రైతులు ఓ సంఘంగా ఏర్పడి ఉద్యాన కమిషనర్కు ఫిర్యాదు చేశారు. విచారణ చేసిన అధికారులు నివేదికను ఆశాఖకు పంపించారు.శాస్త్రవేత్తల ప్రచారంతో..ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 2014 కంటే ముందు సాగుచేసిన జంబేరి మొక్కలు అతివృష్టి, అనావృష్టి, వాతావరణ పరిస్థితుల కారణంగా క్షీణిన్నాయి. అప్పట్లో జిల్లాలో పర్యటించిన ఉద్యాన శాస్త్రవేత్తలు పరిశో«ధనా కేంద్రాల్లో లభించే రంగాపూర్ వేరు మూలంపై అంటుగట్టిన సాత్గుడి రకం బత్తాయి మొక్కలు నాటుకోవాలని ప్రచారం చేశారు. దీంతో ఉమ్మడి రాష్ట్రంలో తిరుపతి, మహానంది, పెట్లూరు, రైల్వే కోడూరు, మల్లేపల్లి పరిశోధన కేంద్రాల్లోని అంటు మొక్కలకు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది.2014 నుంచి..తిరుపతిలోని ఉద్యాన యూనివర్సిటీ నుంచి నల్లగొండ జిల్లాకు చెందిన రైతులు రంగాపూర్ వెరైటీ బత్తాయి మొక్కలు తీసుకురావడం 2014లో మొదలైంది. సాధారణంగా ఐదునుంచి ఆరు సంవత్సరాలలోపు కాతకు వచ్చి దిగుబడి ఇస్తాయి. కానీ రంగాపూర్ వెరైటీ బత్తాయి మాత్రం కాపు వచ్చినా, కాయలు, రంగుమారి, రాలిపోవడంతో దిగుబడిపై ప్రభావం చూపింది. తాము నష్టపోవడానికి మొక్కల నాణ్యత లోపాలే కారణమని గుర్రంపోడు, నల్లగొండ, తిప్పర్తి, నిడమనూరు, కనగల్ మండలాల్లో సుమారు 400 ఎకరాల్లో ఈ రకం సాగు చేసిన సుమారు 70 మంది రైతులు నిర్ధారణకు వచ్చి ఈనెల 11న రాష్ట్ర ఉద్యాన కమిషనర్కు ఫిర్యాదు కూడా చేశారు.నాసిరకం మొక్కల విషయమై నాగాపూర్ శాస్త్రవేత్తలతో శాస్త్రీయ పరిశోధన చేయించాలని ఫిర్యాదు చేశారు. ఇదే విషయమై నల్లగొండ కలెక్టర్ ఉద్యాన అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ70 మంది రైతులు రూ.21కోట్ల మేర నష్టపోయారు. దీనిపై విచారణ చేసిన అధికారులు ఉద్యానశాఖకు నివేదిక సమర్పించారు. చాలామంది రైతులు ఇప్పటికే తోటలు తొలగించగా, బిల్లులు లేని కారణంగా ఫిర్యాదు చేయని వారి సంఖ్య ఎక్కువగానే ఉంది. ఎకరానికి రూ.6లక్షల చొప్పున నష్టపరిహారం చెల్లించాలని రైతులు కోరుతున్నారు.ఈ ఫొటోలో ఉన్న రైతు పేరు గుర్రం శ్రీనివాస్రెడ్డి. ఈయనది నల్లగొండ జిల్లా తిప్పర్తి మండలంలోని తిప్పలమ్మగూడెం. 2019లో తిరుపతి ఉద్యాన యూనివర్సిటీ నుంచి 700 రంగాపూర్ వెరైటీ బత్తాయి మొక్కలను తీసుకొచ్చి ఐదు ఎకరాల్లో నాటాడు. మొక్కలకు రూ.49వేలు, గుంతలు తీసి నాటినందుకు రూ.50వేలు ఖర్చు చేశాడు.మొక్కలు నాటినప్పటి నుంచి ఎకరానికి ఏడాదికి రూ.80వేల చొప్పున నిర్వహణ ఖర్చులయ్యాయి. అన్ని యాజమాన్య పద్ధతులు పాటించడంతోపాటు ఉద్యాన వన అధికారుల సలహాలు, సూచనలు తీసుకున్నాడు. దిగుబడి ఎకరానికి 8 నుంచి 10 టన్నుల వరకు దిగుబడి రావాల్సి ఉంది. కానీ రెండు నుంచి రెండున్నర టన్నుల వరకు దిగుబడి వస్తోంది. గతనెల 27న తిçరుపతి వర్సిటీ నుంచి వచ్చిన ఈ బత్తాయి తోటను పరిశీలించారు. అనంతరం శాంపిల్స్ సేకరించారు. కానీ ఇప్పటి వరకు ఆ రైతు ఎలాంటి సమాచారం ఇవ్వలేదు.ఇతడు నల్లగొండ జిల్లా తిప్పర్తి మండలం జొన్నలగడ్డగూడెం గ్రామానికి చెందిన రైతు చిర్ర భూపాల్రెడ్డి. రంగాపూర్ బత్తాయి వెరైటీ అధిక దిగుబడులు, చీడపీడలనుంచి తట్టుకుంటుందని ఎనిమిది ఎకరాల్లో సాగుచేశాడు. ఆరున్నర సంవత్సరాలు గడిచినా నేటికి దిగుబడి రావడం లేదు. దీంతో మూడు ఎకరాల తోటను తొలగించాడు. ఇప్పటి వరకు రూ.30లక్షల వరకు పెట్టుబడి పెట్టాడు. కాయలు కాస్తున్నా, సైజురాక పసుపురంగులోకి మారి రాలిపోతున్నాయి.మంచి సైజుకు రాకముందే రాలుతున్నాయితిరుపతి పరిశోధన కేంద్రం నుంచి 450 మొక్కలు తెచ్చి 2016లో నాలుగున్నర ఎకరాల్లో నాటాను. ఎనిమిదేళ్లయినా సరైన పూత, కాత రావడం లేదు. 45 నుంచి 50టన్నుల దిగుబడి రావాల్సి ఉండగా 20 టన్నులే వస్తోంది. కాయ సైజు లేకపోగా పక్వానికి రాకముందే రాలిపోతున్నాయి. – కేసాని అనంతరెడ్డి, పిట్టలగూడెం రైతుదిగుబడి బాగా వస్తుందని చెప్పిదిగుబడి బాగా వస్తుందని చెప్పి మొక్కలు అంటగట్టారు. నాకున్న మూడున్నర ఎకరాల్లో 380 మొక్కల వరకు నాటాను. మొక్కకు రూ.75 నుంచి రూ.100 వరకు వ్యయం చేసి ఏపీ నుంచి మొక్కలు తెచ్చాను. ఇప్పుడు నాలుగో కాత తెంపాల్సి ఉంది. మొక్కలకు కాయలు అంతంత మాత్రంగానే ఉండడం, కాయ బలంగా రాకపోవడం వల్ల దిగుబడి తగ్గి అనుకున్న విధంగా పెట్టుబడులు రాలేదు. – చిత్రం ప్రసాద్, మారుపాక రైతు -
ప్రేమ పేరుతో మోసం..
పెద్దపల్లిరూరల్: మరదలు వరసయ్యే యువతితో నాలుగైదేళ్లుగా ప్రేమాయణం సాగించి తీరా పెళ్లి సమయానికి మోసం చేసిన ప్రియుడి ఉదంతం వెలుగుచూసింది. పెద్దపల్లి మండలం రంగాపూర్ గ్రామానికి చెందిన గండు నరేశ్ ఇదే గ్రామానికి చెందిన దుబ్బాసి దివ్యను పెళ్లి చేసుకుంటానంటూ నమ్మించి చెట్టా పట్టాలేసుకొని తిరిగాడు. బీటెక్ పూర్తి చేసిన దివ్య హైదరాబాద్లో ఓ ప్రైవేటు కంపెనీలో పని చేస్తుండగా, నరేశ్ కూడా హైదరాబాద్లోనే ఉంటున్నాడు. పెళ్లి చేసుకోవాలని దివ్య కోరడంతో నరేశ్ ముఖం చాటేశాడు. చావే శరణ్యమంటూ ప్రియుడి ఇంటికి వెళ్లిన యువతిని గెంటివేయడంతో ఇటీవల రెండుసార్లు ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు గ్రామస్తుల ద్వారా తెలిసింది. అయినా నరేశ్ వివాహం చేసుకునేందుకు ససేమిరా నిరాకరించడంతో దివ్య, ఆమె తల్లిదండ్రులు ఈ విషయం బసంత్నగర్ పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. పోలీసులు నరేశ్ గురించి ఆరా తీస్తున్నట్టు గ్రహించిన కుటుంబీకులు ఓ నియోజకవర్గస్థాయి ప్రజాప్రతినిధి కుమారుడిని ఆశ్రయించారు. దీంతో ఆయన సూచనమేరకు బసంత్నగర్ ఎస్సై విజయేందర్ జాప్యం చేయడంతో గ్రామానికి చెందిన నాయకులు గంట రమేశ్, కలవేన రవీందర్తోపాటు ఇతర పెద్దలు ఎస్సైతో వాగ్వాదానికి దిగి దివ్యకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. -
పంటలు ఎండి.. అప్పులు తీరక...
– రంగాపూర్లో రైతు ఆత్మహత్య – మిన్నంటిన కుటుంబసభ్యుల రోదనలు అచ్చంపేట రూరల్ : ఆ కుటుంబానికి వ్యవసాయమే జీవనాధారం.. ఆ రైతు తమకున్న పొలంలో పంటలు వేసినా వర్షాభావంతో ఎండిపోయాయి.. దీంతో వాటికోసం చేసిన అప్పులు తీర్చలేక అతను ఆత్మహత్యకు పాల్పడటంతో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి.. వివరాలిలా ఉన్నాయి. అచ్చంపేట మండలంలోని రంగాపూర్కు చెందిన కేతావత్ టీక్యా (35) కు శివారులో రెండున్నర ఎకరాల పొలం ఉంది. అందులో ఈసారి ఖరీఫ్ సీజన్లో పత్తి, మిరప వేశాడు. వీటికోసం సుమారు మూడు లక్షలను ప్రైవేట్ వ్యక్తుల నుంచి తెచ్చాడు. వర్షాలు సరిగ్గా కురియకపోవడంతో పంటలు ఎండిపోతుండటం, చేసిన అప్పులు తీర్చడం ఎలాగని మనోవేదనకు గురైన అతను శనివారం మధ్యాహ్నం పొలంలోనే పురుగుమందు తాగాడు. కొద్దిసేపటికి చుట్టుపక్కల రైతులు గమనించి వెంటనే కుటుంబ సభ్యులకు సమాచారమిచ్చారు. వారు అక్కడికి చేరుకుని హుటాహుటిన అచ్చంపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అనంతరం పరిస్థితి విషమించడంతో జిల్లా ప్రధాన ఆస్పత్రికి తీసుకెళ్లగా చికిత్స పొందుతూ ఆదివారం మధ్యాహ్నం మతి చెందాడు. ఈయనకు భార్య బుజ్జితోపాటు కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఈ సంఘటనతో వారు బోరుమన్నారు. ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఏఎస్ఐ ఖాద్రీ కేసు దర్యాప్తు జరుపుతున్నారు. బాధిత కుటుంబ సభ్యులను ప్రభుత్వమే ఆదుకోవాలని గ్రామస్తులు కోరారు. -
చంపేసి.. ఆపై కాల్చేసి
పరిగి: ఓ రైతు దారుణ హత్యకు గురయ్యాడు. గుర్తుతెలియని వ్యక్తులు ఆయనను చంపేసి మృతదేహాన్ని కాల్చేశారు. ఈ సంఘటన మండల పరిధిలోని రంగాపూర్లో బుధవారం వెలుగుచూసింది. హతుడి కుటుంబీకులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పూడూరు మండల పరిధిలోని సిరిగాయపల్లికి చెందిన సుర్క వెంకటయ్య(42) వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఆయన మంగళవారం పరిగి బ్యాంకులో పని ఉందని కుటుంబీకులకు చెప్పి ఇంట్లోంచి వె ళ్లాడు. రాత్రి ఆయన తిరిగి ఇంటికి రాకపోవడంతో కుటుంబీకులు గాలించసాగారు. కాగా సిరిగాయపల్లి సమీపంలోని రంగాపూర్ వ్యవసాయ పొలాలకు వెళ్లే పానాదిలో ఓ వ్యక్తి మృతదేహంగా పడి ఉన్నాడు. మృతదేహం కాలిపోయి ఉంది. బుధవారం ఉదయం రంగాపూర్ రైతులు విషయం గమనించారు. పరిగి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో సీఐ ప్రసాద్, ఎస్ఐ కృష్ణలు సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. హతుడి వివరాల గురించి స్థానికులను ప్రశ్నించినా ఫలితం లేకుండా పోయింది. అదే సమయంలో తన తండ్రి కనిపించకపోవటంతో వెంకటయ్య కుమారుడు సుర్క విఠల్(23) అక్కడికి చేరుకున్నాడు. హతుడి దుస్తులు, ఇతర ఆనవాళ్ల ఆధారంగా తన తండ్రేనని అతడు గుర్తించాడు. తమ గ్రామానికి చెందిన కొందరితో తమకు గొడవలు ఉన్నాయని, వారే తన తండ్రిని హత్య చేసి ఉండొచ్చని విఠల్ పోలీసులకు చెప్పాడు. కొందరిపై అనుమానం వ్యక్తం చేస్తూ ఫిర్యాదు చేశాడు. పోస్టుమార్టం అనంతరం పోలీసులు వెంకటయ్య మృతదేహాన్ని కుటుంబీకులకు అప్పగించారు. హతుడికి భార్య, ఇద్దరు కొడుకులు ఉన్నారు. పాత కక్షల నేపథ్యంలో హత్య జరిగి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈమేరకు కేసును అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.


