breaking news
project management
-
ప్రాజెక్టుల నిర్వహణకు బడ్జెట్లో నిధులు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని అన్ని ఎత్తిపోతల పథకాల నిర్వహణ బాధ్యతను ఇకపై ప్రభుత్వమే చూడనుంది. ఎత్తిపోతల పథకాల ఆపరేషన్ అండ్ మెయింటనెన్స్ (ఓఅండ్ఎం)కు అయ్యే ఖర్చును పూర్తిగా ప్రభుత్వమే భరించనుంది. ఈ ఎత్తిపోతల పథకాల ఓఅండ్ఎంకు ఇక ఏటా రాష్ట్ర బడ్జెట్లో నిధులు సైతం కేటాయించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ఎత్తిపోతల పథకాల పరిధిలో పంప్హౌస్ల్లోని మోటార్లు, పంపులు, విద్యుత్ సరఫరా చేసే జనరేటర్లు, డ్యామ్ల పరిధిలో గేట్లు, వాటి నిర్వహణ, కాల్వలు, టన్నెళ్లు ఇవన్నీ ఓఅండ్ఎం కిందకే వస్తాయి. ఎత్తిపోతల పథకాల పనులు చేపట్టే ఏజెన్సీలు నిర్ణీత కాలం వరకే ఓఅండ్ఎం బాధ్యతలను చూస్తున్నాయి. ఆ తర్వాత ఈ బాధ్యతలను ప్రభుత్వమే చూడాలి. అయితే ప్రభుత్వం వద్ద అంత సిబ్బంది లేక టెండర్ల ద్వారా మళ్లీ ప్రై వేటు ఎజెన్సీలకే ఆ బాధ్యతలను కట్టబెడుతోంది. కాగా వరద ఉండే 6 నెలల కాలానికే ఈ నిర్వహణ బాధ్యతలకై టెండర్లు పిలుస్తుండటంతో ప్రైవేటు ఏజెన్సీలు ముందుకు రావడం లేదు. ఇప్పటివరకు ప్రాజెక్టుల నిర్వహణకు సంబంధించి ప్రత్యేకంగా ఎలాంటి నిధులు బడ్జెట్లో కేటాయించడం లేదు. అదీగాక రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన భారీ సాగునీటి ఎత్తిపోతల పథకాల నిర్వహణ మున్ముందు కత్తిమీద సాము కానుంది. ఎత్తిపోతల పథకాల ద్వారా నిర్ణీత ఆయకట్టుకు నీటిని మళ్లించాలంటే విద్యుత్, ఓఅండ్ఎంకే వేల కోట్ల రూపాయలు ఖర్చు చేయాల్సి రానుంది. 2020–21 నుంచి 2024–25 వరకు రానున్న ఐదేళ్ల కాలానికి విద్యుత్ అవసరాలకు, నిర్వహణ భారం కలిపి ఏకంగా రూ.40,170 కోట్లు ఉంటుందని నీటి పారుదల శాఖ అంచనా వేస్తోంది. ఇందులో విద్యుత్ అవసరాల ఖర్చే రూ.37,796 కోట్లు ఉండగా, ఓఅండ్ఎంకు అయ్యే వ్యయం రూ.2,374 కోట్లు ఉండనుంది. ఈ నేపథ్యంలో ప్రాజెక్టుల వారీగా ఉన్న పంపులు, మోటార్లు, గేట్లు, ట్రాన్స్ఫార్మర్లు, కాల్వలు, టన్నెళ్లు, వాటి పొడవు, రిజర్వాయర్లు, వాటి పరిధిలోని లిఫ్టులు తదితర వివరాలన్నీ ముందుగా తేల్చి, వాటి నిర్వహణకు అవసరమైన వ్యూహాన్ని, మ్యాన్యువల్ను ఖరారు చేయాలని సీఎం కేసీఆర్ ఇటీవల సాగునీటి శాఖపై జరిగిన సమీక్ష సందర్భంగా అధికారులను ఆదేశించారు. నీటి పారుదల శాఖ ముఖ్య అధికారులంతా రాబోయే కొద్ది రోజుల్లోనే రాష్ట్ర స్థాయి వర్క్ షాపు నిర్వహించుకుని, తెలంగాణ సమగ్ర నీటి పారుదల విధానాన్ని రూపొందించాలని చెప్పారు. -
ప్రా(ప్రొ)జెక్ట్ మేనేజ్మెంట్
ఎన్నో నిర్మాణాలు.. మరెన్నో ఉత్పత్తులు.. అత్యంత ఆధునిక సాంకేతిక పరిజ్ఞాన వినియోగం.. అయినప్పటికీ సకాలంలో ఆశించిన లక్ష్యాలు చేరుకోని సందర్భాలు అనేకం. మౌలిక సదుపాయాల కల్పన, ఇతర ఉత్పాదక లక్ష్యాల పరంగా ఎన్నో కార్యకలాపాలు చోటు చేసుకుంటున్న భారత్లో.. ప్రభుత్వ, ప్రైవేటు రంగాలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఇదే. ఈ సమస్యకు పరిష్కారంగా ఆవిష్కృతమైన విభాగం ప్రాజెక్ట్ మేనేజ్మెంట్. ఒక నిర్దిష్ట లక్ష్యం చేరుకునే క్రమంలో.. ప్రతిపాదన దశ నుంచి ఆచరణలోకి తీసుకువచ్చే వరకు ఎంతో ముఖ్యమైన భూమిక పోషించే విభాగం ఇది. దేశం ప్రగతి పథంలో దూసుకెళ్లడంలో కీలక పాత్ర పోషిస్తూ.. యువతకు కెరీర్ అవకాశాలు కల్పిస్తున్న ప్రాజెక్ట్ మేనేజ్మెంట్పై విశ్లేషణ.. ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ స్వరూపం వ్యాపారం, విధులు, విభిన్న అవసరాలు.. వీటన్నిటికీ ఒక లక్ష్యం ఉంటుంది. నిర్దిష్ట లక్ష్యాలను చేరుకునే దిశగా ప్రణాళిక, నిర్వహణ, సంరక్షణ, నేతృత్వం, వనరుల సమర్థ వినియోగం వంటి విధులు నిర్వర్తించడమే ప్రాజెక్ట్ మేనేజ్మెంట్. ఆయా నిపుణులు తమ నైపుణ్యాలను, సాంకేతిక పరిజ్ఞానాన్ని వాస్తవ రూపంలో అనువర్తించే విభాగం ఇదే. ఇటీవల కాలంలో దేశంలో చేపడుతున్న పలు ప్రాజెక్ట్ల దృష్ట్యా ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ విభాగంలో ప్రత్యేక నైపుణ్యాలు కలిగిన మానవ వనరుల అవసరం రోజురోజుకూ పెరుగుతోంది. మరోవైపు ప్రాజెక్ట్ నిర్వహణ, కార్యాచరణకు సంబంధించిన లోపాలతో పలు ప్రాజెక్ట్లు మధ్యలోనే ఆగిపోతున్న పరిస్థితి ఉంది. కొన్నిసార్లు ప్రాజెక్టు పూర్తయ్యేందుకు ఆలస్యమై వ్యయ అంచనాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. వీటన్నిటికీ సమాధానం నిపుణులైన ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ ప్రొఫెషనల్స్. అన్ని విభాగాల్లోనూ అవసరం ప్రాజెక్ట్ మేనేజ్మెంట్.. కేవలం నిర్మాణ రంగం లేదా మౌలిక సదుపాయాల కల్పన వంటి విభాగాలకే పరిమితం కాదు. కార్పొరేట్ హౌస్లలో, బహుళ అంతస్తుల భవనాల్లో కార్యకలాపాలు సాగించే ఐటీ సంస్థల నుంచి ఆర్కిటెక్చర్ వరకు అన్ని రంగాల్లోనూ ఆయా సంస్థలు నిర్దేశించుకున్న లక్ష్యాలు చేరుకునేందుకు ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ నిపుణులు కావాలి. ఉదాహరణకు ఐటీని దృష్టిలో పెట్టుకుంటే.. ఒక ఐటీ కంపెనీ క్లయింట్ అవసరాల మేరకు కొత్త సాఫ్ట్వేర్ను రూపొందించే ప్రక్రియ చేపడుతుంది. ఈ క్రమంలో క్లయింట్ వాస్తవ అవసరాలు, వ్యయ అంచనాలను పరిగణనలోకి తీసుకుంటూ.. సదరు ప్రొడక్ట్ను రూపొందించేందుకు ఒక బృందం విధులు నిర్వర్తిస్తుంది. అలాంటి సందర్భాల్లో ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ నిపుణుల అవసరం ఎంతో ఉంటుంది. ప్రాజెక్టును నిపుణులు సమర్థంగా అమలు చేయడం ద్వారానే క్లయింట్ తో జరిగిన అవగాహన మేరకు నిర్ణీత కాల వ్యవధిలో, నిర్దేశించిన వ్యయంలో ప్రొడక్ట్ను రూపొందించడం సాధ్యమవుతుంది. ఇదే విధంగా టెలికం, ఆటోమొబైల్, ఫైనాన్స్ తదితర రంగాల్లో కూడా ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ నిపుణుల అవసరం ఏర్పడింది. 4 లక్షల మంది కావాలి ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ నిపుణులకు మార్కెట్లో ఎంత డిమాండ్ ఉందో ఎర్నెస్ట్ యంగ్ ఇండియా విడుదల చేసిన నివేదిక తెలుపుతోంది. దీని ప్రకారం.. 2020 వరకు ప్రతి ఏటా ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ స్పెషలైజ్డ్ ప్రొఫెషనల్స్ అవసరం 4 లక్షల మేర ఉండనుంది. ఔత్సాహికులు ఈ రంగంలో అవకాశాన్ని అందిపుచ్చుకోవాలనేది ఈ రంగంలో నిపుణుల సూచన. అవకాశాలకు వేదికలివే కెరీర్ పరంగానూ ఢోకాలేని విభాగం.. ప్రాజెక్ట్ మేనేజ్మెంట్. పలు సంస్థలు ఆయా రంగాల్లోని ఆర్థిక ఒడిదుడుకుల కారణంగా ఖర్చులు నియంత్రించుకుంటున్న సందర్భాల్లోనూ కొత్తగా ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ నిపుణులను నియమించుకోవడమే.. కెరీర్ పరంగా ఈ విభాగంలో లభించే భరోసాకు నిదర్శనం. ప్రాజెక్ట్ మేనేజ్మెంట్లో శిక్షణ పొందిన అభ్యర్థులకు ఐటీ, కన్స్ట్రక్షన్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఆటోమేషన్, ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్, అర్బన్ డెవలప్మెంట్, రిస్క్ మేనేజ్మెంట్, న్యూ ప్రొడక్ట్ డెవలప్మెంట్, ఫైనాన్షియల్ సర్వీసెస్ వంటి పలు రంగాల్లో అవకాశాలు లభిస్తాయి. ఎంట్రీ లెవల్లో ప్రాజెక్ట్ అసిస్టెంట్ హోదాతో ఉద్యోగం లభిస్తుంది. తర్వాత అనుభవం, పనితీరు ఆధారంగా ప్రాజెక్ట్ కో-ఆర్డినేటర్, ప్రాజెక్ట్ షెడ్యూలర్, అసిస్టెంట్ ప్రాజెక్ట్ మేనేజర్, ప్రాజెక్ట్ మేనేజర్, సీనియర్ ప్రాజెక్ట్ మేనేజర్ వంటి కీలక హోదాలు లభిస్తాయి. అంతేకాకుండా ప్రారంభంలో కనీసం నెలకు రూ. 20 వేల జీతం గ్యారంటీ. అవసరమైన లక్షణాలు ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ రంగంలో రాణించాలనుకునే అభ్యర్థులకు లీడర్షిప్ స్కిల్స్, కమ్యూనికేషన్, ప్లానింగ్, టీం బిల్డింగ్ స్కిల్స్ వంటి నైపుణ్యాలు అవసరం. కోర్సులూ అందుబాటులోకి ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ విభాగంలో కెరీర్ కోరుకునే వారికి ఇప్పుడు అకడమిక్గా ఎన్నో కోర్సులు అందుబాటులోకి వస్తున్నాయి. పలు ఇన్స్టిట్యూట్లు ఎంబీఏ స్థాయిలో ప్రాజెక్ట్ మేనేజ్మెంట్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మేనేజ్మెంట్ స్పెషలైజేషన్స్ను అందుబాటులోకి తీసుకొస్తున్నాయి. ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ ఇన్స్టిట్యూట్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్లో అకడమిక్ నైపుణ్యాలు అందించడంలో దేశంలోనే ప్రత్యేకత పొందిన సంస్థ.. ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ ఇన్స్టిట్యూట్. ఈ ఇన్స్టిట్యూట్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్కు సంబంధించి అంతర్జాతీయ గుర్తింపు ఉన్న పలు సర్టిఫికేషన్ ప్రోగ్రామ్లను అందిస్తోంది. కోర్సుల వివరాలు పైన చిత్రంలో చూడొచ్చు. సర్టిఫైడ్ అసోసియేట్ ఇన్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్కు సంబంధించి ప్రాథమిక నైపుణ్యాలపై శిక్షణనందించే ఈ కోర్సుకు ఇంటర్మీడియెట్ లేదా తత్సమాన కోర్సు ఉత్తీర్ణులు అర్హులు. దీంతోపాటు 1500 గంటల ప్రాజెక్ట్ ఎక్స్పీరియన్స్ అవసరం. ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ ప్రొఫెషనల్ ఇంటర్మీడియెట్ అర్హతతోపాటు ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ విభాగంలో అయిదేళ్ల అనుభవం ఉన్న అభ్యర్థులు లేదా నాలుగేళ్ల బ్యాచిలర్స డిగ్రీ ఉత్తీర్ణతతోపాటు మూడేళ్ల అనుభవం ఉన్న అభ్యర్థులు ఈ ప్రోగ్రామ్కు దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రోగ్రామ్ మేనేజ్మెంట్ ప్రొఫెషనల్ ఇంటర్మీడియెట్ అర్హతతోపాటు ప్రాజెక్ట్ మేనేజ్మెంట్లో నాలుగేళ్లు, ప్రోగ్రామ్ మేనేజ్మెంట్ విభాగంలో ఏడేళ్ల అనుభవం గడించిన అభ్యర్థులు లేదా నాలుగేళ్ల బ్యాచిలర్స్ డిగ్రీ ఉత్తీర్ణతతోపాటు ప్రాజెక్ట్ మేనేజ్మెంట్, ప్రోగ్రామ్ మేనేజ్మెంట్ విభాగాల్లో నాలుగేళ్లు చొప్పున అనుభవం ఉన్న అభ్యర్థులు అర్హులు. పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ ప్రొఫెషనల్ ఇంటర్మీడియెట్ అర్హతతోపాటు పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్లో ఏడేళ్ల పని అనుభవం లేదా నాలుగేళ్ల బ్యాచిలర్స్ డిగ్రీతోపాటు పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్లో నాలుగేళ్ల పని అనుభవం ఉంటే ఈ ప్రోగ్రామ్కు దరఖాస్తు చేసుకోవచ్చు. పీఎంఐ ఏజిల్ సర్టిఫైడ్ ప్రాక్టీషనర్ ఇప్పటికే ఈ రంగంలో అనుభవం గడించిన వారికి మరింత నైపుణ్యాలు అందించే లక్ష్యంగా రూపొందించిన ప్రోగ్రామ్ ఇది. పీఎంఐ ప్రొఫెషనల్ ఇన్ బిజినెస్ అనాలిసిస్ ఇంటర్మీడియెట్ ఉత్తీర్ణత, బిజినెస్ అనాలిస్ విభాగంలో అయిదేళ్ల అనుభవం లేదా నాలుగేళ్ల వ్యవధిలోని బ్యాచిలర్స్ డిగ్రీతోపాటు మూడేళ్ల అనుభవం ఉన్న అభ్యర్థులు ఈ కోర్సుకు అర్హులు. అద్భుతమైన భవంతిని నిర్దిష్ట గడువులోగా నిర్మించాలి.. ఒక రహదారి నిర్మాణాన్ని నిర్ణీత వ్యయ పరిమితితో పూర్తి చేయాలి.. ఓ కొత్త ఉత్పత్తిని తక్షణమే మార్కెట్లోకి తేవాలి.. అంటే.. ముందుగానే నిర్ణయించిన వ్యయ అంచనాలు- కాల పరిమితులు సిద్ధం. వీటిని తూచా తప్పకుండా పాటిస్తూ ఆయా ప్రమాణాల పరిధిలోనే లక్ష్యాలు పూర్తిచేయాలి. అందుకోసం అనుసరించాల్సిన, అమలు చేయాల్సిన వ్యూహాలకు సంబంధించిన విభాగమే.. ప్రాజెక్ట్ మేనేజ్మెంట్!! దరఖాస్తు విధానం ఔత్సాహిక అభ్యర్థులు తమకు సరిపడేకోర్సును గుర్తించాలి. తర్వాత ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ ఇన్స్టిట్యూట్లో మెంబర్గా నమోదు చేసుకోవడం ద్వారా సదరు ప్రోగ్రామ్కు దరఖాస్తు చేసుకోవాలి. ఆ తర్వాత ఇన్స్టిట్యూట్ ఆయా ప్రోగ్రామ్లకు నిర్దేశించిన వ్యవధి పూర్తయ్యాక నిర్వహించే పరీక్షల్లో ఉత్తీర్ణత సాధిస్తే సర్టిఫికేషన్ లభిస్తుంది. దేశవ్యాప్తంగా నాలుగు చాప్టర్ల ద్వారా శిక్షణ సదుపాయాలు కల్పిస్తోంది. పలు సంస్థలతో ఒప్పందాలు ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ ఇన్స్టిట్యూట్- ఇండియా.. ఆయా సర్టిఫికేషన్లు, బోధనపరంగా దేశవ్యాప్తంగా పలు సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకుని అభ్యర్థులకు శిక్షణ సదుపాయం కల్పిస్తోంది. అంతేకాకుండా అకడమిక్ స్థాయిలోనే ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ నైపుణ్యాలు అందించే విధంగా ఆయా కోర్సుల కరిక్యులంలో మార్పులు చేయాలని భావిస్తోంది. అందుకోసం బీటెక్, ఎంబీఏ కోర్సుల్లో ప్రవేశపెట్టదగిన ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ శిక్షణ అంశాలను రూపొందించింది. పీఎంఐ రిస్క్ మేనేజ్మెంట్ ప్రొఫెషనల్ ఇంటర్మీడియెట్ ఉత్తీర్ణత, ప్రాజెక్ట్ రిస్క్ మేనేజ్మెంట్లో 4,500 గంటల పని అనుభవం లేదా నాలుగేళ్ల బ్యాచిలర్స్ డిగ్రీ ఉత్తీర్ణతతోపాటు 300 గంటల పని అనుభవం ఉన్న అభ్యర్థులు అర్హులు. పీఎంఐ షెడ్యూలింగ్ ప్రొఫెషనల్ ఇంటర్మీడియెట్ ఉత్తీర్ణతతోపాటు ప్రాజెక్ట్ షెడ్యూలింగ్లో అయిదు వేల గంటల పని అనుభవం లేదా బ్యాచిలర్స్ డిగ్రీతోపాటు 3,500 గంటల పని అనుభవం ఉండాలి. పూర్తి వివరాలకు వెబ్సైట్: www.pmi.org.in దేశంలో ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ కోర్సులను అందిస్తున్న ఇన్స్టిట్యూట్లు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బిజినెస్ మేనేజ్మెంట్ అండ్ స్టడీస్-ముంబై; కోర్సు- ప్రొఫెషనల్స్ ఇన్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ భారతీయ విద్యాపీఠ్ డీమ్డ్ యూనివర్సిటీ డిపార్ట్మెంట్ ఆఫ్ ఐటీ - పుణె; కోర్సు- పీజీ డిప్లొమా ఇన్ ప్రాజెక్ట్ అండ్ బిజినెస్ మేనేజ్మెంట్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కన్స్ట్రక్షన్ మేనేజ్మెంట్ అండ్ రీసెర్చ్ - ముంబై; కోర్సు- పీజీ ప్రోగ్రామ్ ఇన్ ప్రాజెక్ట్ ఇంజనీరింగ్ అండ్ మేనేజ్మెంట్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కన్స్ట్రక్షన్ మేనేజ్మెంట్ అండ్ రీసెర్చ్ - హైదరాబాద్; కోర్సు - పీజీ ప్రోగ్రామ్ ఇన్ ప్రాజెక్ట్ ఇంజనీరింగ్ అండ్ మేనేజ్మెంట్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ ఇన్స్టిట్యూట్ - నోయిడా; కోర్సు - ప్రాజెక్ట్ మేనేజ్మెంట్, ప్లానింగ్ అండ్ మానిటరింగ్ సింబయాసిస్ సెంటర్ ఫర్ మేనేజ్మెంట్ అండ్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ - పుణె; కోర్సు- ఎంబీఏ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మేనేజ్మెంట్. అత్యంత ఆవశ్యకం ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ ప్రస్తుత పరిస్థితుల్లో అత్యంత ఆవశ్యకమైన అంశంగా మారింది. అన్ని రంగాల్లోనూ ఈ విభాగంలో స్పెషలైజ్డ్ ప్రొఫెషనల్స్ అవసరం ఏర్పడింది. ఉత్పత్తి పరంగా, వ్యాపారపరంగా ఏదైనా ఒక లక్ష్యం నెరవేరాలంటే సరైన ప్రణాళిక ఉండాలి. దానికి సంబంధించి శిక్షణ ఇచ్చే కోర్సు ప్రాజెక్ట్ మేనేజ్మెంట్. అందుకే అకడమిక్ స్థాయి నుంచే దీన్ని ఒక కోర్సుగా బోధించాలి. ఈ విషయంలో ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ ఇన్స్టిట్యూట్- ఇండియా కూడా చొరవ తీసుకుంటోంది. ప్రతి కోర్సులో కనీసం ఒక ఎలక్టివ్గానైనా తప్పనిసరి చేయాలని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లింది. పీఎంఐ - హైదరాబాద్ చాప్టర్ గతేడాది నుంచి నిట్-వరంగల్లో ఒక ఎలక్టివ్గా ప్రాజెక్ట్ మేనేజ్మెంట్కు శ్రీకారం చుట్టింది. కెరీర్ పరంగానూ అవకాశాలు అనేకం ఉన్నాయి. కాబట్టి ఔత్సాహిక విద్యార్థులు అకడమిక్స్లో లేకున్నప్పటికీ.. పీఎంఐలో పేరు నమోదు చేసుకోవడం ద్వారా ప్రాజెక్ట్ మేనేజ్మెంట్లో కోర్ సర్టిఫికేషన్స్కు మార్గం ఏర్పరచుకోవచ్చు. లీడర్షిప్ స్కిల్స్, టీం కల్చర్ ఉంటే కెరీర్లో మరింత మెరుగ్గా రాణించేందుకు వీలవుతుంది. - కె.శ్రీనివాస్, ప్రెసిడెంట్, పీఎంఐ-పెర్ల్ సిటీ హైదరాబాద్ చాప్టర్ అకడమిక్ నైపుణ్యంతో.. అద్భుత భవిష్యత్తు ప్రాజెక్ట్ మేనేజ్మెంట్లో డొమైన్ నాలెడ్జ్ ఉంటే అద్భుత భవిష్యత్తు సొంతం చేసుకోవచ్చు. ప్రస్తుతం కొన్ని ఇన్స్టిట్యూట్లు ఈ విభాగాన్ని ఒక సబ్జెక్ట్గా బోధిస్తున్నప్పటికీ.. వాస్తవ అవసరాలకు అనుగుణంగా పూర్తి స్థాయి నైపుణ్యాలు పొందే అవకాశం తక్కువగా ఉంది. కారణం.. విద్యార్థులు తమ కోర్ సబ్జెక్ట్లపై ప్రధానంగా దృష్టి సారించడం. ఈ విభాగంలో పూర్తి స్థాయి కోర్సుల ఆవశ్యకత నెలకొంది. ఇది ఔత్సాహిక విద్యార్థులకు చక్కటి మార్గం కూడా. అందుకే ఈ నైపుణ్యాలు అందించే విధంగా పీఎంఐ-ఇండియాతో ఒప్పందం ద్వారా ఇన్ఫ్రాస్ట్రక్చర్ మేనేజ్మెంట్లో ఎంబీఏ కోర్సును అందిస్తున్నాం. -ప్రొఫెసర్ ప్రకాశ్ వాక్నిస్,హెడ్, డిపార్ట్మెంట్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మేనేజ్మెంట్, సింబయాసిస్ సెంటర్ ఫర్ మేనేజ్మెంట్ అండ్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ -
ఇందూరుపై నిధుల వరద
మొదటిసారిగా రూ.157 కోట్లు విడుదల గుత్ప ఎత్తిపోతలకు రూ.55.78 కోట్లు... అలీసాగర్ మెయింటెనెన్స్కు రూ.76.58 కోట్లు సీఆర్ఎఫ్ కింద బాన్సువాడకు రూ.25 కోట్లు సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : టీఆర్ఎస్ ప్రభుత్వం ఇందూరుపై నిధుల వరద కురిపించింది. తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు తర్వాత మొదటిసారిగా జిల్లా కు రూ.157.36 కోట్లు విడుదల చేసింది. మధ్యతరహా, భారీ నీటిపారుదల ప్రాజెక్టులు, రహదారులపై దృష్టి సారించిన ప్రభుత్వం జిల్లాకు భారీగా నిధులు విడుదల చేస్తూ ఉత్తర్వులుజారీ చేయడంపై ప్రజాప్రతినిధుల నుంచి హర్షం వ్యక్తమవుతోంది. గుత్ప ఎత్తిపోతలకు రూ.55.78 కోట్లు.. జిల్లాలో భారీ నీటి పారుదలశాఖ కిందకు వచ్చే అర్గుల రాజారాం గుత్ప ఎత్తిపోతల పథకానికిగత ఆరు నెలలుగా విడుదలైన నిధులు అంతంతమాత్ర మే. ఈ పథకం నిర్వహణ కోసం ఆగస్టు 1, 2013 నుంచి 2014 జులై 31 వరకు రూ.28,34,57,200 అవసరం ఉంది. పలుమార్లు ప్రతిపాదనలు పం పినా.. గత ప్రభుత్వం ఈ ప్రాజెక్టు నిర్వహణ కోసం నిధులు కేటాయించిన పాపాన పోలేదు.అయితే నీటి ప్రాజెక్టుల నిర్వహణకు ప్రాధాన్యత ఇస్తామన్న కొత్త ప్రభుత్వం ఈ మేరకు రూ. 55,78,00,350లు కేటాయిస్తూ శనివారం రాత్రి పొద్దుబోయిన తర్వాత ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిధులతో అర్గుల రాజారాం గుత్ప ఎత్తిపోతల పథకం నిర్వహణ చేపట్టాలని ప్రభుత్వ ప్రిన్సిపల్ కార్యదర్శి బి.అరవిందరెడ్డి ఆ ఉత్తర్వులో పేర్కొన్నారు. జిల్లాలో మరో ప్రధానమైన ఎత్తిపోతల పథకం అలీసాగర్ నిర్వహణ కోసం ప్రభుత్వం రూ.76,58,26,532లు విడుదల చేసింది. ఈ ఎత్తిపోతల పథకం పరిధిలోని మూడు పంపింగ్ కేంద్రాల నిర్వహణకు 2015 జులై 31 వరకు నిధులు వినియోగించాలని పేర్కొంది. అలీసాగర్ ఎత్తిపోతల పథకం నిర్వహణకు కూడ నిధుల కావాలని పలుమార్లు సంబంధిత ఇంజినీర్లు ప్రతిపాదనలు పం పనా.. గత ప్రభుత్వం పట్టించుకోలేదని అధికారులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం రూ.76.58 కోట్లు విడుదల చేస్తూ అధికారులకు ఉత్తర్వులు జారీ చేయడం పట్ల హర్షం వ్యక్తమవుతోంది. కాగా రహదారులు, భవనాల శాఖ ద్వారా సెంట్రల్ రోడ్ ఫండ్ (సీఆర్ఎఫ్) కింద ప్రభుత్వం రూ.25 కోట్లు మంజూరు చేసింది.రాష్ర్టంలో 8 జిల్లాలకు 27 పనుల కోసం రూ.309.25 కోట్లు కేటాయించిన ప్రభుత్వం.. జిల్లాలోని బాన్సువాడ-ఉప్పల్వాయి రోడ్డు కోసం రూ.25 కోట్లు విడుదల చేసింది.