-
అవినీతిలో మేటి ప్రత్తిపాటి
ఆయన అవినీతిలో ఘనాపాఠి. పదవిని అడ్డం పెట్టుకుని అక్రమాలకు తెరలేపారు.కుంభకోణాలకు కేంద్రబిందువుగా నిలిచారు. భూ ఆక్రమణల నుంచి గ్రావెల్ తవ్వకాల వరకు అంతా దోపిడీ పర్వమే. రాష్ట్ర స్థాయిలో సంచలనం సృష్టించిన సీసీఐ స్కామ్కు సూత్రధారుడు. అగ్రిగోల్డ్ భూముల అక్రమ కొనుగోళ్ల వ్యవహారాల్లో అడ్డంగా దోచేశాడు. బడుగుల భూముల్లో అక్రమంగా మట్టి తవ్వకాలు చేసిన ఘనుడు. ఇదీ టీడీపీ ప్రభుత్వంలో మంత్రిగా వ్యవహరించిన ప్రత్తిపాటి పుల్లారావు అవినీతి బాగోతం. చిలకలూరిపేట: గత టీడీపీ ప్రభుత్వం హయాంలో చిలకలూరిపేట నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన ప్రత్తిపాటి పుల్లారావు 2014–15 కాలంలో రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ మంత్రిగా వ్యవహరించారు. ఈ సమయంలో సీసీఐ కుంభకోణం జరిగింది. దాదాపు రూ.650 కోట్లు అక్రమాలు జరిగినట్లు సీబీఐ విచారణలో వెల్లడైంది. ఈ వ్యవహారంలో మంత్రి పాత్ర ఉన్నట్టు అప్పట్లో ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ కుంభకోణం అప్పటి ప్రభుత్వాన్ని కుదిపేసింది. దీంతో విజిలెన్స్ విచారణకు ఆదేశించిన అప్పటి ప్రభుత్వం అనంతరం 2016 నవంబర్లో చిలకలూరిపేట మార్కెట్ కమిటీ ఉన్నతశ్రేణి కార్యదర్శి కె.నాగవేణి సహా మొత్తం 26 మంది మార్కెటింగ్ శాఖ అధికారులు, సిబ్బందిని సస్పెండ్ చేసి చేతులు దులుపేసుకుంది. అగ్రిగోల్డ్ భూముల కొనుగోలు ప్రకాశం జిల్లా సంతమాగులూరు మండలం గురిజేపల్లిలో అగ్రిగోల్డ్ వెంచర్లలో 14.81 ఎకరాల భూమిని విడతలవారీగా ప్రత్తిపాటి పుల్లారావు తన సతీమణి ప్రత్తిపాటి తేనె వెంకాయమ్మ(ప్రత్తిపాటి వెంకట కుమారి) పేరుతో కారుచౌకగా కొన్నారు. అప్పటికే అగ్రిగోల్డ్ సంస్థ వివాదాల్లో ఇరుక్కోవడంతో ఆ సంస్థ భాగస్వాములను అధికారం అడ్డంపెట్టుకుని బెదిరించి ఈ భూములను చౌకగా కొట్టేశారనే ఆరోపణలు పుల్లారావుపై వెల్లువెత్తాయి. ఈ మొత్తం భూమిని ఆ తర్వాత గుంటూరుకు చెందిన కామేపల్లి వెంకటేశ్వరరావుకు, పెదకాకాని మండలం, ఉప్పలపాడుకు చెందిన చెరుకూరి నరసింహారావులకు దాదా పు 30 లక్షలు ఎక్కువకు విక్ర యించారు. ఈ భూమిని ఎకరా రూ. 20 లక్షలలోపు ధరకు కొన్న ప్రత్తిపాటి ఆ తర్వాత ఎకరా రూ.52 లక్షలకు విక్రయించినట్లు సమాచారం. గ్రావెల్, రేషన్ మాఫియా యడ్లపాడు మండలంలోని అసైన్డ్ భూముల్లో యథేచ్ఛగా గ్రావెల్ తవ్వి ప్రత్తిపాటి, ఆయన అనుచరులు రూ.కోట్లాది రూపాయలు గడించారు. చారిత్రాత్మక కొండవీడు కొండలనూ పిండి చేశారు. ప్రత్తిపాటిపై అప్పట్లో అదే పార్టీకి చెందిన మాజీ మంత్రి రావెల కిషోర్బాబు బహిరంగ విమర్శలు చేశారు. పౌరసరఫరాల శాఖ మంత్రిగా వ్యవహరించిన ప్రత్తిపాటి పుల్లారావు రేషన్ మాఫియాను ప్రోత్సహించి రూ.కోట్లు వెనుకేశారు. అప్పట్లో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారుల దాడుల్లో ఈయన అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. నీరు–చెట్టు పథకంలోనూ ప్రత్తిపాటి అనుచరులు రూ.కోట్లు కొల్లగొట్టారు. యడవల్లి దళిత భూములు కాజేసే కుట్ర చిలకలూరిపేట మండలం యడవల్లి గ్రామంలో 1975లో సర్వే నెంబర్ 381లో ఉన్న 416.5 ఎకరాల భూమిని 250 మంది ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు ఏకపట్టాగా అందజేశారు. 1976లో యడవల్లి వీకర్స్ సెక్షన్ ల్యాండ్ కమిటీ పేరుతో లబ్దిదారులైన ఎస్సీ, ఎస్టీలు ఓ సొసైటీగా ఏర్పడి సాగు చేసుకుంటూ వస్తున్నారు. ఈ భూముల్లో విలువైన బ్లాక్ పెరల్ గ్రానైట్ ఉన్నట్టు తెలుసుకున్న ప్రత్తిపాటి సొసైటీనే రద్దు చేయించారు. ప్రభుత్వ భూములుగా ప్రకటింపజేశారు. బినామీలతో అక్రమ మైనింగ్కు సిద్ధమవుతున్న తరుణంలో వైఎస్సార్ సీపీ, దళిత సంఘాల పోరాటానికి దిగాయి. దళితులు ఎస్సీ, ఎస్టీ కమిషన్కు వెళ్లారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం వచ్చాక యడవల్లి దళితులకు న్యాయం జరిగింది. జర్నలిస్టులపై కక్ష చిలకలూరిపేట పట్టణానికి చెందిన విలేకరి ఎంవీఎన్ శంకర్ 2014 నవంబర్ 25వ తేదీ విధులు ముగించుకుని రాత్రి వేళ ఇంటి బయట బైక్ పార్క్ చేస్తుండగా ఇద్దరు దాడి చేశారు. అతను గుంటూరు జీజీహెచ్లో చికిత్స పొందుతూ అదే రోజు అర్ధరాత్రి మృతి చెందాడు. ఈ కేసులో ప్రత్తిపాటి పాత్రపై తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తాయి. తనకు వ్యతిరేకంగా వార్తలు రాశారన్న అక్కసుతో యడ్లపాడుకు చెందిన మాజీ విలేకరి మానుకొండ సురేంద్రనాథ్కు సంబంధించిన భూమిలో మంత్రి అనుచరులు భారీగా గ్రావెల్ తవ్వకాలు జరిపి విక్రయించారు. అదే భూమిని గతంలో ఇతరులకు అమ్మేందుకు సురేంద్ర అడ్వాన్సులు తీసుకున్నాడు. ఆ భూమి వివాదంలోకి వెళ్లడంతో తీసుకున్న అడ్వాన్సులు ఇవ్వలేక సురేంద్ర 2017 డిసెంబర్ 18న పురుగుమందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పుల్లా రావు సతీమణి పెత్తనం పుల్లారావు తన అధికారాన్ని రాష్ట్ర స్థాయిలో విచ్చలవిడిగా దుర్వినియోగం చేస్తే ఆయన సతీమణి వెంకాయమ్మ నియోజకవర్గంలో ఇష్టారాజ్యంగా వ్యవహరించారు. ఇంటికి వచ్చి తనకు సలాం కొట్టలేదని ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కె.జ్యోతిర్మయితోపాటు ముగ్గురు వైద్యులు, ఓ హెడ్నర్సు, నలుగురు స్టాఫ్ నర్సులు, ఒక సీనియర్ అసిస్టెంట్ను బదిలీ చేయించారు. ఏ కార్యాలయంలోనైనా ఫైల్ కదలాలంటే ముందు మేడమ్కు కప్పం కట్టాల్సిందే అన్నంతగా అవినీతికి పాల్పడ్డారు. పుల్లారావుపై కేసులివే.. ♦ ఎమ్మెల్యే విడదల రజినిపై అసభ్యకరంగా పోస్టులు పెట్టిన టీడీపీ సోషల్ మీడియా కార్యకర్త పిల్లి కోటిని అరెస్టు చేసినప్పుడు పోలీసుల విధులకు ఆటంకం కలిగించినందుకు ప్రత్తిపాటి పుల్లారావుపై చిలకలూరిపేట టౌన్ పోలీస్ స్టేషన్లో క్రైమ్ నంబర్ 45/2020 యూ/ ఎస్ 341.18855/ కింద కేసు నమోదు చేశారు. ♦ మంచినీటి చెరువువద్ద ఎన్టీఆర్ సుజల వాటర్ ప్లాంట్ అనుమతులు లేకుండా ప్రారంభించేందుకు యత్నించి విధుల్లో ఉన్న మున్సిపల్ టౌన్ ప్లానింగ్ సూపర్వైజర్ కోడిరెక్క సునీతపై దాడి చేసినందుకు క్రైమ్ నంబర్ 136/2022 యూ/ఎస్ 353, 509, 506,323 ఆర్/డబ్ల్యూ, 34 ఐపీసీ – సెక్షన్ 3(1)(ఆర్)(ఎస్),3(2)(వీఏ) ఆఫ్ ఎస్సీ/ఎస్టీ పీఓఏ యాక్ట్ కింద ప్రత్తిపాటిపై కేసు నమోదైంది. ♦ చంద్రబాబు స్కిల్ స్కామ్లో అరెస్టయినప్పుడు చిలకలూరిపేట జాతీయ రహదారి దిగ్బంధనం చేసి పోలీసు విధులకు ఆటంకపరిచినందుకు క్రైమ్ నంబర్ 238/2023 యూ/ఎస్ 341, 353, 120(బి), 144, 148 ఆర్/డబ్ల్యూ 143 ఐపీసీ – సెక్షన్ 129–149, క్రైమ్ నంబర్ 240/2023 యూ/ఎస్ 435, 353, 120–బి ఆర్/డబ్ల్యూ 149 ఐపీసీ కింద, క్రైమ్ నంబర్ 125/2023 యూ/ఎస్ 353, 341, 147, 143, 120–బి. ఆర్/డబ్ల్యూ 149 కింద మూడు కేసులు నమోదయ్యాయి. ♦ చట్టప్రకారం జరుగుతున్న ఇసుక రవాణాను అడ్డు కుని పోలీసు విధులను అడ్డుకోవడంతో అమరా వతి పోలీస్ స్టేషన్లో క్రైమ్ నంబర్ 93/2023 యూ/ఎస్ 143, 341, 230 ఆర్/డబ్ల్యూ 149 ఐపీసీ కి ంద కేసు నమోదైంది. -
ఓం భూం స్వాహా!
‘నా పరిశీలనకు వచ్చిన, తెలియవచ్చిన విషయాల్ని ప్రత్యక్షంగా గానీ, పరోక్షంగా గానీ ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకు తెలియపరచనని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను’ అని చెబుతూ 2014లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. సీఎం కుర్చిలో కూర్చున్నాక.. కుట్రలు చేయడంలో, నమ్మిన ప్రజల్ని మోసగించడంలో సిద్ధ హస్తుడైనచంద్రబాబు ఆ ప్రమాణాన్ని నిస్సిగ్గుగా ఉల్లంఘించారు. అత్యంత కీలకమైన రాజధాని రహస్యాన్ని ఎల్లో గ్యాంగ్కు లీక్ చేసి సీఎం పదవికే కళంకం తెచ్చారు. అంతర్జాతీయ రాజధాని అంటూ ప్రధానితో పాటు ప్రముఖుల్ని పిలిచి హడావుడి చేసినప్పుడు.. బాబు కుట్రల్ని జనం పసిగట్టలేకపోయారు. ఇదంతా పేదల అసైన్డ్ భూముల స్వాహాకు, ఇన్సైడర్ ట్రేడింగ్ కోసం చంద్రబాబు వేసిన ఎత్తులు, జిత్తులని అప్పుడు వారికి తెలియలేదు. ‘రాజధాని ఫైల్స్’ డ్రామాలో పేద రైతుల అసైన్డ్ భూములను బెదిరించి బినామీల రూపంలోసొంతం చేసుకుని కథ నడిపించారు. ఎవరికీ చెందని ప్రభుత్వ అసైన్డ్ భూములు తమ వారివే అంటూ రికార్డులు సృష్టించి స్వాహా చేశారు. తన పని పూర్తయ్యాక.. గ్రాఫిక్స్ రాజధాని కట్టలేక చేత్తులేత్తేసి ఎన్నికల ముందు కొత్త డ్రామాలు అందుకున్నారు. ఈ డ్రామాలో బాబు బృందంలోనిమంత్రులు, ఎమ్మెల్యేలు...ఆయనకు ఆప్తులు అందరూ పాత్రధారులే.. ‘చేసేది నువ్వు.. చేయించేది నేను..’ రాజధాని ఫైల్స్లో చంద్రబాబు డైలాగ్ ఇదే. తెరముందు రాజధాని రూపశిల్పి.. తెరవెనుక రాజధాని లీక్స్ సూత్రధారి. అసలు సూత్రధారులు చంద్రబాబు, లోకేశ్ కాగా.. పాత్రధారులు నారాయణ, లింగమనేని రమేష్, ప్రత్తిపాటి పుల్లారావు, సుజనా చౌదరి, వేమూరి రవికుమార్, మాగంటి మురళీ మోహన్, కొమ్మాలపాటి శ్రీధర్, ధూళిపాళ్ల నరేంద్ర, పయ్యావుల కేశవ్, బాలకృష్ణ వియ్యంకుడు ఎంఎస్పీ రామారావు ఇలా 1,336 మంది బినామీలున్నారు. అసైన్డ్ భూముల దోపిడీ, ఇన్సైడర్ ట్రేడింగ్తో రూ.లక్షల కోట్ల భూ దందాకు తెగించారు. అసైన్డ్ దోపిడీ, ఇన్సైడర్ ట్రేడింగ్లో 1,336 మంది బినామీ ‘బాబు’ల బాగోతం సాక్షి, అమరావతి : అమరావతి భూదోపిడీకి కర్త, కర్మ, క్రియ చంద్రబాబే. అసైన్డ్ భూములు, ప్రైవేటు భూములు, క్విడ్ ప్రోకో భూములు, బంగ్లాలు.. ఇలా ఒకటేమిటి.. చంద్రబాబు అక్రమ సామ్రాజ్యంలో అన్నీ భాగమే. ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్లో అక్రమాలతో క్విడ్ ప్రోకో ద్వారా చంద్రబాబు కుటుంబానికి చెందిన హెరిటేజ్ ఫుడ్స్కు 14 ఎకరాలు దక్కాయి. కృష్ణానది కరకట్ట మీద ఉన్న లింగమనేని బంగ్లా ఆయన పరమైంది. ఎస్సీ, ఎస్టీ, రైతులను భయపెట్టి బినామీల పేరిట కొల్లగొట్టిన వందలాది ఎకరాలు చంద్రబాబు ఖాతాలోకే వెళ్లాయి. సింగపూర్ కంపెనీ పేరిట స్టార్టప్ ఏరియా ప్రాజెక్టులోని భూముల అసలు హక్కుదారూ చంద్రబాబు కుటుంబమే. ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్కు ఇరువైపులా, అమరావతి సీడ్ క్యాపిటల్ పరిధి దాటి బినామీల పేరిట కొనుగోలు చేసిన దాదాపు 5 వేల ఎకరాల అసలు యజమాని చంద్రబాబు కుటుంబమే. చినబాబుది పెద్ద వాటానే అమరావతి భూ కుంభకోణంలో లోకేశ్ది పెద్ద వాటానే. తన బినామీ, ఎన్నారై వ్యవహారాల సలహాదారుగా వ్యవహరించిన వేమూరి రవికుమార్తో పాటు మరికొందరు బినామీల పేరిట వేలాది ఎకరాలు దక్కించుకున్నారు. వేమూరి రవికుమార్తోపాటు ఆయన భార్య అనూరాధ గోష్పాది గ్రీన్ఫీల్డ్స్ పేరిట అమరావతిలోని కోర్ క్యాపిటల్ ప్రాంతంలోనే 500 ఎకరాలకుపైగా స్వాహా చేశారు. అవినీతి తిమింగలం లింగమనేని అమరావతిలో అవినీతి తిమింగలం లింగమనేని రమేశ్. చంద్రబాబు భూ దోపిడీలో ఇతనూ ఒక ప్రధాన పాత్రధారి. ఆయన కుటుంబానికి చెందిన 355 ఎకరాలను ఆనుకునే ఇన్నర్ రింగ్ రోడ్డు నిరి్మంచేలా అలైన్మెంట్ ఖరారు చేశారు. తన కుటుంబ సభ్యులు, బినామీల పేరిట కొనుగోలు చేసిన వందలాది ఎకరాలను భూ సమీకరణ ప్రక్రియ నుంచి తప్పించారు. అమరావతిలో దాదాపు వెయ్యికి పైగా ఎకరాలు లింగమనేని హస్తగతం చేసుకున్నారు. నారాయణ తంత్రం.. సుజనా, ప్రత్తిపాటి భూదందా చంద్రబాబు తరువాత అమరావతి భూ దోపిడీలో రెండో పెద్ద దోపిడీదారు నారాయణ. లింగమనేని కుటుంబంతో క్విడ్ ప్రో కో లో ప్రధాన పాత్రధారు. కృష్ణా నదికి ఇటువైపు.. అటువైపు, కృష్ణా జిల్లా పరిధిలో ఇన్నర్ రింగ్రోడ్ అలైన్మెంట్కు దగ్గరలో వేలాది ఎకరాలు కొనుగోలు చేశారు. అక్కడ నారాయణ విద్యా సంస్థల భూములు ఉన్నాయి. రామకృష్ణ హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా తన ఉద్యోగులను బినామీలుగా చేసి 162 ఎకరాల అసైన్డ్ భూములను హస్తగతం చేసుకున్నారు. అసైన్డ్, ప్రైవేటు భూములు కలిపి దాదాపు 3 వేల ఎకరాల వరకు బినామీల పేరిట గుప్పిట పట్టారు. నారాయణ బినామీ కంపెనీ రామకృష్ణ హౌసింగ్ లిమిటెడ్ది అమరావతి భూ కుంభకోణంలో కీలక పాత్ర. అసైన్డ్ భూముల దోపిడీలో ఆ కంపెనీ ఎండీ అంజనీకుమార్ కీలకంగా వ్యవహరించారు. అమరావతిలో దాదాపు 2 వేల ఎకరాలను బినామీలు, ఉద్యోగుల పేరిట రామకృష్ణ హౌసింగ్ లిమిటెడ్ కొల్లగొట్టింది. చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడు సుజనా చౌదరి అమరావతి భూ దోపిడీలో అతిపెద్ద వాటాదారు. ఆయన తన కుటుంబ సభ్యులు, బినామీల పేరిట ఏకంగా 700 ఎకరాల వరకు కొల్లగొట్టారు. అమరావతి భూదోపిడీలో బినామీల పేరిట అసైన్డ్ భూములతో సహా 196 ఎకరాలు దోచుకున్నారు. -
అమరావతిలో ‘ప్రత్తిపాటి’ దోపిడీ
సాక్షి, అమరావతి: టీడీపీ ప్రభుత్వ హయాంలో రాజధాని అమరావతిలో జరిగిన కుంభకోణాల్లో మరో భారీ అవినీతి బయటపడింది. చంద్రబాబు ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న ప్రత్తిపాటి పుల్లారావు కుటుంబం రాజధానిలో మౌలిక సదుపాయాల కాంట్రాక్టుల పేరిట రూ.66.03 కోట్ల ప్రజాధనాన్ని కొల్లగొట్టినట్లు వెల్లడైంది. ప్రత్తిపాటి కుటుంబానికి చెందిన అవెక్సా కార్పొరేషన్ ప్రైవేట్ లిమిటెడ్ కాంట్రాక్టులు, సబ్ కాంట్రాక్టుల పేరుతో బోగస్ ఇన్వాయిస్లు సమర్పించి నిధులు కొల్లగొట్టి.. షెల్కంపెనీల ద్వారా దారి మళ్లించినట్టు ఆధారాలతోసహా బట్టబయలైంది. కేంద్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ జీఎస్టీ ఇంటెలిజెన్స్ (డీజీజీఐ), రాష్ట్ర డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (ఏపీ డీఆర్ఐ) సోదాల్లో ఈ వ్యవహారం మొత్తం బయటకొచ్చింది. ఈ కంపెనీ కేంద్ర జీఎస్టీ విభాగాన్ని బురిడీ కొట్టించడంతోపాటు రాష్ట్ర ఖజానాకు గండి కొట్టి యథేచ్ఛగా అక్రమాలకు పాల్పడినట్లు తేటతెల్లమైంది. దీంతో డీఆర్ఐ ఫిర్యాదు మేరకు విజయవాడ పోలీసులు కేసు నమోదు చేసి అవెక్సా కార్పొరేషన్ డైరెక్టర్గా ఉన్న ప్రత్తిపాటి పుల్లారావు కుమారుడు శరత్ను గురువారం అరెస్టు చేశారు. ఆయనతోపాటు మరో ఆరుగురిపై ఐపీసీ సెక్షన్లు 420, 409, 467, 471, 477(ఎ), 120 (బి) రెడ్విత్ 34 కింద కేసు నమోదు చేశారు. ఆయన్ని న్యాయమూర్తి ముందు హాజరుపరిచారు. తీగ లాగితే కదిలిన డొంక ప్రత్తిపాటి పుల్లారావు కుటుంబానికి చెందిన అవెక్సా కార్పొరేషన్కు హైదరాబాద్లో ప్రధాన కార్యాలయం, నెల్లూరు, విజయనగరం జిల్లా మానాపురంలలో బ్రాంచి కార్యాలయాలున్నాయి. ప్రత్తిపాటి పుల్లారావు భార్య తేనే వెంకాయమ్మ డైరెక్టర్గా, ఆయన కుమారుడు ప్రత్తిపాటి శరత్ అదనపు డైరెక్టర్గా ఉన్నారు. ఆ కంపెనీకి టీడీపీ ప్రభుత్వం అడ్డగోలుగా కాంట్రాక్టులు కట్టబెట్టింది. వాటి పనులు చేయకపోయినప్పటికీ, చేసినట్లు గా బోగస్ ఇన్వాయిస్లు సమర్పించిన అవెక్సా కంపెనీ బిల్లులు డ్రా చేసుకోవడంతోపాటు జీఎస్టీ విభాగం నుంచి అడ్డగోలుగా ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ (ఐటీసీ)ని కూడా పొందింది. దేశవ్యాప్తంగా అక్రమంగా ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ పొందిన కంపెనీలపై డీజీజీఐ విచారణ చేయడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. అవెక్సా కంపెనీ అక్రమంగా ఐటీసీ పొందిందని వెల్లడి కావడంతో ఆ కంపెనీకి డీజీజీఐ రూ.16 కోట్ల జరిమానా విధిస్తూ షోకాజ్ కమ్ డిమాండ్ నోటీసు జారీ చేయాలని ప్రతిపాదించింది. అసలు అవెక్సా కార్పొరేషన్ వ్యవహారాలు, కాంట్రాక్టులు, బిల్లుల చెల్లింపులపై డీజీజీఐ, ఏపీ డీఆర్ఐ దృష్టిసారించాయి. ఆ కంపెనీ కార్యాలయాల్లో విస్తృతంగా సోదాలు నిర్వహించడంతో మొత్తం బాగోతం బట్టబయలైంది. షెల్ కంపెనీలను సబ్ కాంట్రాక్టర్లుగా చూపించి రూ.21.93 కోట్లు అవెక్సా కార్పొరేషన్ ముసుగులో ప్రత్తిపాటి పుల్లారావు కుటుంబం ప్రజాధనాన్ని ఎలా కొల్లగొట్టిందీ అధికారుల విచారణలో వెలుగులోకి వచ్చింది. 2017 నుంచి అవెక్సా కార్పొరేషన్ పేరుతో ప్రత్తిపాటి కుటుంబం అమరావతిలో కాంట్రాక్డు సంస్థలను బెదిరించి సబ్ కాంట్రాక్టులు తీసుకుంది. పనులు చేయకుండానే అక్రమంగా నిధులు కొల్లగొట్టింది. జాక్సన్ ఎమినెన్స్ (ప్రస్తుత పేరు జైశ్నవి ఎమినెన్స్) అనే కంపెనీ అమరావతిలో మౌలిక సదుపాయాల కాంట్రాక్టును పొందింది. ఆ కంపెనీ నుంచి రూ.37.39 కోట్ల విలువైన పనులను అవెక్సా కార్పొరేషన్ సబ్ కాంట్రాక్టుకు తీసుకుంది. సీఆర్డీయే పరిధిలో రోడ్లు, వరదనీటి కాలువలు, కల్వర్టులు, సివరేజ్ పనులు, వాకింగ్ ట్రాక్లు, పచ్చదనం తదితర పనులు అవెక్సా కార్పొరేషన్ చేయాల్సి ఉంది. అయితే, ఈ సంస్థ తానిషా ఇన్ఫ్రా, రాలాన్ ప్రోజెక్ట్స్, అనయి ఇన్ఫ్రా అల్వేజ్ టౌన్ ప్లానర్స్ అనే నాలుగు కంపెనీలకు రూ.21.93 కోట్లకు సబ్ కాంట్రాక్టుకు ఇచ్చినట్టు చూపించింది. ఆ సబ్ కాంట్రాక్టుల ముసుగులోనే అవెక్సా కంపెనీ ప్రజాధనాన్ని కొల్లగొట్టినట్లు డీఆర్ఐ సోదాల్లో వెల్లడైంది. సబ్ కాంట్రాక్టుకు ఇచ్చామని చెప్పిన నాలుగు కంపెనీల నుంచి బోగస్ ఇన్వాయిస్లు, బిల్లులు పొంది ఆ మేరకు పనులు చేసినట్టుగా కనికట్టు చేసింది. ప్రభుత్వ ఖజానా నుంచి బిల్లుల సొమ్ము పొందింది. కేంద్ర జీఎస్టీ నుంచి అక్రమంగా ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ను కూడా తీసుకుంది. వాస్తవానికి సబ్ కాంట్రాక్టు సంస్థల నుంచి అవెక్సా కంపెనీ ఎలాంటి సేవలూ పొందలేదు. అవి ఏ పనులూ చేయలేదు. ఆ నాలుగు కంపెనీలూ షెల్ కంపెనీలే. వాటి పేరుతో మొత్తం రూ.21,93,08,317 నిధులను ప్రత్తిపాటి పుల్లారావు కుటుంబం అక్రమంగా తరలించింది. రహదారి కాంట్రాక్టుల ముసుగులో రూ.26.25 కోట్లు దోపిడీ అంతటితో అవెక్సా కంపెనీ అక్రమాలు ఆగలేదు. అమరావతిలోని ఉద్దండరాయపురం నుంచి నిడమర్రు వరకు ఎన్ 9 రోడ్డు నిర్మాణ కాంట్రాక్టును బీఎస్ఆర్ ఇన్ఫ్రా ఇండియా లిమిటెడ్ కంపెనీ నుంచి సబ్ కాంట్రాక్టుకు తీసుకుంది. కానీ ఎలాంటి రోడ్డు పనులు చేయకుండానే అక్రమంగా బిల్లులు సమర్పించి ప్రజాధనాన్ని సొంత ఖాతాలోకి మళ్లించుకుంది. రహదారి నిర్మాణం కోసం మెటీరియల్ కొనుగోలు చేసినట్టు, వివిధ వృత్తి నిపుణుల సేవలు పొందినట్టు బీఎస్ఆర్ కంపెనీ పేరిట బోగస్ బిల్లులు సమర్పించి కనికట్టు చేసింది. అందుకోసం క్వాహిష్ మార్కెటింగ్ లిమిటెడ్, నోయిడా ఎస్పాత్ లిమిటెడ్, ప్రశాంత్ ఇండస్ట్రీస్, గోల్డ్ ఫినెక్స్ ఐరన్ – స్టీల్ కంపెనీల నుంచి మెటీరియల్ కొనుగోలు చేసినట్టు బోగస్ బిల్లులు సమర్పించింది. ఆ విధంగా ఏ పనీ చేయకుండానే వివిధ దశల్లో రూ.26,25,19,393 దోపిడీ చేసింది. గృహ నిర్మాణ ప్రాజెక్టుల పేరిట అక్రమంగా రూ.17.85 కోట్ల ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ పేదల గృహ నిర్మాణ ప్రాజెక్టులోనూ అవెక్సా కంపెనీ అడ్డగోలుగా నిధులు కొల్లగొట్టింది. ఏపీ టిడ్కో కింద జి+3 గృహ నిర్మాణ ప్రాజెక్టు, విశాఖపట్నంలో హుద్హుద్ తుపాను బాధితులకు 800 గృహాల నిర్మాణ ప్రాజెక్టు, మిడ్ పెన్నార్ ప్రాజెక్టు ఆధునీకరణ సబ్ కాంట్రాక్టులు పొందింది. ఆ ప్రాజెక్టుల బిల్లుల కింద బోగస్ ఇన్వాయిస్లు సమర్పించి ప్రభుత్వ ఖజానా నుంచి సొమ్ము పొందింది. ఈమేరకు ఆధ్యా ఎంటర్ప్రైజస్, మెస్సెర్స్ సంజయ్ కుమార్ భాటియా, తనిష్క్ స్టీల్ లిమిటెడ్, మౌంట్ బిజినెస్ బిల్డ్ లిమిటెడ్ కంపెనీల నుంచి మెటీరియల్ కొన్నట్లు బోగస్ ఇన్వాయిస్లు, బిల్లులు సమర్పించింది. ఆ పేరుతో ఏకంగా రూ.17,85,61,864 ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ను పొందింది. ఈ విధంగా అవెక్సా కార్పొరేషన్ కంపెనీ ద్వారా ప్రత్తిపాటి పుల్లారావు కుటుంబం మొత్తం రూ.66,03,89,574 ప్రజాధనాన్ని కొల్లగొట్టింది. అవును ...భోగస్ బిల్లులతో నిధులు కొల్లగొట్టాం – అవెక్సా కంపెనీ డైరెక్టర్ కుర్ర జగదీశ్వరరావు ఈ వ్యవహారంపై డీజీజీఐ, ఏపీ డీఆర్ఐ విచారణలో మొత్తం లోగుట్టు బట్టబయలైంది. అవెక్సా కంపెనీ డైరెక్టర్గా ఉన్న కుర్ర జగదీశ్ తాము బోగస్ ఇన్వాయిస్లు సమర్పించి అక్రమంగా బిల్లులు డ్రా చేసుకున్నామని అంగీకరించారు. ఈ కుంభకోణానికి ఎలా పాల్పడిందీ ఆయన సవివరంగా వెల్లడించారు. దాంతో అవెక్సా కంపెనీ ముసుగులో ప్రత్తిపాటి కుటుంబం అవినీతి బాగోతం ఆధారాలతోసహా బట్టబయలైంది. తనయుడి కోసం తండ్రి పుల్లారావు చక్కర్లు విజయవాడ స్పోర్ట్స్/గుణదల (విజయవాడ తూర్పు): అమరావతి పనుల కుంభకోణంలో దొరికిపోయిన ప్రత్తిపాటి శరత్ కోసం అతని తండ్రి, టీడీపీ నాయకుడు, మాజీ మంత్రి పత్త్రిపాటి పుల్లారావు విజయవాడలో చక్కర్లు కొట్టారు. డీఆర్ఐ ఫిర్యాదుపై శరత్ను విజయవాడ పోలీసులు అరెస్టు చేశారు. టాస్క్ఫోర్స్, సీసీఎస్ పోలీసులు అత్యంత గోప్యంగా విచారణ చేపట్టారు. దీంతో శరత్ జాడ కోసం అతని తండ్రి పుల్లారావు టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభి, ఎమ్మెల్యే గద్దె రామ్మోహనరావు, ఇతర టీడీపీ నాయకులను వెంటేసుకుని పోలీస్ స్టేషన్ల చుట్టూ ప్రదక్షణలు చేశారు. ముందుగా గురునానక్ కాలనీలోని ఏసీపీ కార్యాలయానికి, అక్కడ లేకపోవడంతో మాచవరం పోలీస్ స్టేషన్కు, ఆ తర్వాత టాస్్కఫోర్స్ కార్యాలయానికి వెళ్లారు. సాయంత్రం తన అనుచరులను నగరం నలుదిక్కులకు పంపారు. ఆ తరువాత సూర్యారావుపేట పోలీస్ స్టేషన్లో విచారణ జరుగుతోందని తెలుసుకుని అక్కడకు చేరుకున్నారు. అక్కడా లేకపోవడంతో టీడీపీ కార్యాలయానికి వచ్చారు. రాత్రి 8.30 గంటల సమయంలో పుల్లారావు, పట్టాభి, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ తదితరులతో కలిసి పోలీసు కమిషనరేట్కు చేరుకొని తన కొడుకును చూపించాలంటూ ఆందోళనకు దిగారు. కొద్ది సేపటి తరువాత రూరల్ డీసీపీ కె.శ్రీనివాసరావు వచ్చి ఓ గంటలో న్యాయమూర్తి వద్ద నిందితుడు శరత్ను ప్రవేశపెడతామని చెప్పడంతో ఆందోళన విరమించి మాచవరంలోని జడ్జి క్వార్టర్స్కు వెళ్లారు. -
సీనియర్ల మౌనం.. సందేహం!
సాక్షి, అమరావతి: తెలుగుదేశం పార్టీ సీనియర్ నేతలు కొందరు ఎన్నికల సమయంలో స్తబ్దుగా ఉండడం చర్చనీయాంశంగా మారింది. కీలకంగా పని చేయాల్సిన తరుణంలో ముఖం చాటేయడం, పార్టీ కార్యక్రమాల్లోనూ పాల్గొనకపోవడంతో టీడీపీ క్యాడర్ ఆందోళన చెందుతోంది. ప్రత్తిపాటి పుల్లారావు, యరపతినేని శ్రీనివాసరావు, అయ్యన్నపాత్రుడు తదితరులు అధిష్టానం తీరుతో తీవ్ర అసంతృప్తిలో ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. ఇదే పరిస్థితి కొనసాగితే వారు పార్టీ వీడే ఆస్కారమూ ఉందనే వాదన ఆ పార్టీ వర్గాల్లో వ్యక్తమవుతోంది. పూర్తి దూరంగా పుల్లారావు టీడీపీ హయాంలో మంత్రిగా పనిచేసిన ఆ పార్టీ ముఖ్యనేత ప్రత్తిపాటి పుల్లారావు కొద్దికాలంగా పార్టీపై అసంతృప్తితో బయటకు రావడంలేదు. ఆయన ఇన్చార్జిగా ఉన్న చిలకలూరిపేట సీటును వేరే వారికి ఇచ్చేందుకు యత్నించడంతో ఆయన అడ్డుకున్నారు. ఆ తర్వాత అడపాదడపా పార్టీ సమావేశాల్లో పాల్గొన్నారు. కొద్దిరోజులుగా పూర్తిగా సైలెంట్ అయ్యారు. టీడీపీ రాష్ట్ర కార్యాలయానికీ రావడంలేదని చెబుతున్నారు. వచ్చే ఎన్నికల్లో ఆయన పోటీపైనా స్పష్టత లేదు. గతంలో ఆయన చంద్రబాబుకు అత్యంత సన్నిహితంగా ఉండేవారు. పరపతి తగ్గిన యరపతినేని! పల్నాడుకు చెందిన మరో కీలక నేత యరపతినేని శ్రీనివాసరావుకు పార్టీలో పరపతి పూర్తిగా తగ్గిందని సమాచారం. ఫలితంగా పార్టీతో అంటీముట్టనట్లు ఉంటున్నారని తెలుస్తోంది. చాలాకాలంగా పార్టీ కార్యక్రమాలు నిర్వహించడంలేదు. తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. గురజాల నుంచి పోటీ చేస్తారో లేదో అనే సందిగ్ధం నెలకొంది. అయ్యో.. ‘చింత’కాయల ఉత్తరాంధ్రకు చెందిన మరో కీలక నేత చింతకాయల అయ్యన్నపాత్రుడు అప్పుడప్పుడు మీడియాలో మాట్లాడుతున్నా పార్టీ వ్యవహారాల్లో గతంలో ఉన్నంత చురుగ్గా లేరని చర్చ జరుగుతోంది. ఆయన కుమారుడు విజయ్ కూడా ఇప్పుడు అంత క్రియాశీలకంగా లేరని సమాచారం. గతంలో టీడీపీ సోషల్ మీడియా వింగ్కు ఇన్చార్జిగా ఉన్న విజయ్ను తప్పించి ఆ బాధ్యతలను పయ్యావుల కేశవ్కు అప్పగించారు. అప్పటి నుంచి టీడీపీకి, అయ్యన్న కుటుంబానికి దూరం పెరిగినట్లు తెలుస్తోంది. గంటా శ్రీనివాసరావుకు ప్రాధాన్యం ఇవ్వడం కూడా వారికి నచ్చడంలేదని చెబుతున్నారు. లోకేశ్ తీరే కారణమా..? ఇలా సీనియర్లంతా పార్టీపై అసంతృప్తితో మౌనంగా ఉండడానికి చినబాబు లోకేశ్ తీరే కారణంగా తెలుస్తోంది. ఆయన సీనియర్లను దూరం పెట్టడంతోపాటు వారికి వ్యతిరేకంగా జూనియర్లను ఎగదోయడం అసంతృప్తి జ్వాలలను పెంచిందని సమాచారం. ఈ నేపథ్యంలో ప్రత్తిపాటి, యరపతినేని తదితర సీనియర్ నేతలు పార్టీని వీడే ఆస్కారం ఉందనే ప్రచారం జోరుగా సాగుతోంది. లోలోన రగులుతున్న మరింత మంది మరింత మంది సీనియర్లు లోకేశ్ తీరు కారణంగా లోలోన రగిలిపోతున్నట్టు సమాచారం. ఎన్టీఆర్ జిల్లాకు చెందిన దేవినేని ఉమామహేశ్వరరావు అప్పుడప్పుడూ మీడియాలో ఘీంకరించడం తప్ప నియోజకవర్గంలో క్రియాశీలకంగా ఉండడం లేదు. ఆయన్ను పార్టీ క్యాడర్ పట్టించుకోవడంలేదు. అసమ్మతి పెరిగిపోవడంతో ఈసారి ఆయనకు సీటు లేదని లోకేశ్ తేల్చి చెప్పినట్లు సమాచారం. దీంతో ఆయన మిన్నకుండిపోయారు. ఏలూరు జిల్లాలో కీలక నేత చింతమనేని ప్రభాకర్, ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో నిమ్మకాయల చినరాజప్ప, ఉమ్మడి కర్నూలు జిల్లాలో కేఈ ప్రభాకర్ వంటి నేతలూ చురుగ్గా ఉండడంలేదని పార్టీలో చర్చ జరుగుతోంది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న కింజరపు అచ్చెన్నాయుడూ మొక్కుబడిగానే వ్యవహరిస్తున్నట్టు సమాచారం. లోకేష్ కోసం ఆయన ప్రాధాన్యాన్ని తగ్గించడమే కాకుండా తరచూ మీడియా సమావేశాలు కూడా నిర్వహించనీయడం లేదని తెలుస్తోంది. అందుకే ఆయన పత్రికా ప్రకటనలతో అచ్చెన్న సరిపెట్టుకుంటున్నారు. పేరుకు అధ్యక్షుడైనా లోకేష్ ఆయన్ను అసలు పరిగణనలోకి తీసుకోవడం లేదని లోలోపల ఆవేదన చెందుతున్నారని సమాచారం. ఇంకా చాలామంది సీనియర్లు ఇలాగే స్తబ్దుగా ఉండడంతో పార్టీ క్యాడర్ ఆందోళన చెందుతోంది. క్షేత్రస్థాయిలో పార్టీ పుంజుకోకపోవడం, లోకేశ్ వ్యవహార శైలితో పార్టీ పరిస్థితి మరింత దిగజారిందనే వాదన సర్వత్రా వ్యక్తమవుతోంది. -
పైకి మాత్రం నవ్వుల పువ్వులు.. కడపులో కత్తులు పెట్టుకొని మరీ..
ఉమ్మడి గుంటూరు జిల్లాలో తెలుగుదేశం నేతల మధ్య ఆధిపత్యపోరు పరాకాష్టకు చేరింది. ఒకరి మీద ఒకరు దుమ్మెత్తిపోసుకునే పరిస్థితి కొనసాగుతోంది. పైకి మాత్రం అందరూ నవ్వుల పువ్వులు పూయిస్తున్నారు. కడుపులో కత్తులు పెట్టుకుని బయటకు మాత్రం నవ్వుతూ పలకరించుకుంటున్నారు. జిల్లాలో ప్రధానంగా మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు, పార్టీ సీనియర్ నేత జీవీ ఆంజనేయులు మధ్య ఇప్పుడు వార్ నడుస్తోంది. ఉమ్మడి జిల్లాకు మూడుసార్లు ప్రత్తిపాటి పుల్లారావు టీడీపీ అధ్యక్షుడిగా చేశారు. గత ప్రభుత్వంలో చంద్రబాబు మంత్రి పదవి అప్పగించాక.. పుల్లారావు స్థానంలో పార్టీ అధ్యక్ష పదవిని అధిష్టానం జీవీ ఆంజనేయులకు కట్టబెట్టింది. జీవీ కూడా రెండుసార్లు జిల్లా అధ్యక్షుడిగా పనిచేశారు. ప్రస్తుతం పల్నాడు జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా జీవీ వ్యవహరిస్తున్నారు. సొంతింటి నుంచే వెన్నుపోటు ప్రత్తిపాటి పుల్లారావు మంత్రిగా ఉన్న సమయంలో కొంతమంది ఎంపిక చేసిన జర్నలిస్టులకు ప్రత్యేక లబ్ది చేకూర్చారు. తద్వారా గుంటూరు జిల్లా మీడియాలో ఆయన మనుషులు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. మీడియా ప్రతినిధులు చేతిలో ఉన్నందువల్లే పుల్లారావుకు ఎవరిమీద అయినా కోపం ఉంటే పథకం ప్రకారం వారిపై నెగిటివ్ కథనాలు రాయించి డామేజ్ చేస్తుంటారని పార్టీలోనే ఆయన ప్రత్యర్థులు చెబుతారు. కొన్నాళ్లుగా మాజీ మంత్రి పుల్లారావు, జీవీ ఆంజనేయులుకు మధ్య గొడవలు మొదలయ్యాయి. దీంతో పుల్లారావు తన పలుకుబడిని ఉపయోగించి జీవీపై మీడియాలో నెగిటివ్ కథనాలు రాయిస్తూ.. వీటిని పార్టీ కార్యాలయానికి కూడా పంపుతున్నారు. ఈ నెగిటివ్ కథనాల వెనుక ఎవరున్నారనేది కొన్నాళ్లపాటు జీవీకి అర్దంకాలేదు. తర్వాత అసలు విషయం తెలుసుకుని జీవీకి మైండ్ బ్లాకయ్యిందట. తనకు టికెట్ రాకుండా చెయ్యడానికి పుల్లారావు కుట్ర పన్నారని జీవీ ఆంజనేయులు అందరి వద్ద చెప్పుకుంటున్నారట. అప్పటినుంచి పుల్లారావును జీవీ టార్గెట్ చేశారు. చదవండి: (Pawan-Chandrababu Meet: రెచ్చిపోయిన చంద్రబాబు) రాజకీయం కాదు రియల్ బిజినెస్ గత ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత ప్రత్తిపాటి పుల్లారావు పూర్తిగా హైదరాబాద్కే పరిమితమయ్యారు. అక్కడే రియల్ వ్యాపారం చేసుకుంటున్నారు. ఏపీలో జరిగే పార్టీ కార్యక్రమాల్లో సైతం పాల్గొనడం లేదు. కనీసం కార్యకర్తలకు కూడా అందుబాటులో ఉండడంలేదు. వీటన్నింటినీ పరిశీలించిన జీవీ.. పుల్లారావు ఎక్కడెక్కడ, ఏం చేస్తున్నాడో వివరిస్తూ పార్టీ నాయకత్వానికి పెద్ద లిస్ట్ పంపించారట. ఐదేళ్లు మంత్రి పదవిలో ఉండి అడ్డ దిడ్డంగా సంపాదించి కష్టకాలంలో పార్టీని, కార్యకర్తలను గాలికొదిలేశారంటూ ఒక రిపోర్ట్ ను కూడా అధిష్టానానికి పంపారట. ఇలా అవకాశం వచ్చినప్పుడల్లా పుల్లారావుకు పొగపెడుతూనే ఉన్నారు. పుల్లారావు కూడా మీడియాను అడ్డం పెట్టుకుని జీవిపై కథనాలు రాయించడం కొనసాగిస్తూనే ఉన్నారట. జీవీ మార్కు రాజకీయం కొంతకాలంగా పుల్లారావు అప్పుడప్పుడు నియోజకవర్గంలో కనిపిస్తున్నారంటే అందుకు కారణం జీవీ ఆంజనేయులేనని పార్టీలో ప్రచారం సాగుతోంది. పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనకపోతే పుల్లారావుపై అధిష్టానానికి ఎప్పటికప్పుడు ఫిర్యాదు చేస్తూ..ఆయనకు చెక్ పెట్టడానికి ప్రయత్నిస్తున్నారట. అంతేకాదు చిలకలూరిపేటలో పుల్లారావు వ్యతిరేకులందరినీ కలుపుకుని వారితో జట్టుకడుతున్నారట ఆంజనేయులు. ప్రత్తిపాటి కూడా వినుకొండలో జీవీ వ్యతిరేకవర్గాన్ని కూడగట్టి జీవీకి చెక్ పెట్టే ప్రయత్నాలు మొదలుపెట్టారట. ఇలా ఇద్దరు నేతలు ఒకరిపై మరొకరు పై చేయి సాధించేందుకు చేస్తున్న ప్రయత్నాలు పార్టీలో పెద్ద చర్చకు దారితీసింది. - పొలిటికల్ ఎడిటర్, సాక్షి డిజిటల్ feedback@sakshi.com
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
చెలరేగిన ఆర్సీబీ బౌలర్లు.. 147 పరుగులకు గుజరాత్ ఆలౌట్
కాలేజీ ఫెస్ట్లో ఉర్రూతలూగించిన సింగర్ కార్తీక్ (ఫోటోలు)
ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
ఆయన 27 ఏళ్లు పెద్ద.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవరీ నటి?
పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
శుబ్మన్ గిల్కు ఏమైంది.. ఇలా అయితే కష్టమే! వీడియో వైరల్
ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
యూనీసెఫ్ ఇండియా నేషనల్ అంబాసిడర్గా 'కరీనా కపూర్'
‘ఆప్’ స్టార్ క్యాంపెయినర్ల లిస్టులో కేజ్రీవాల్ పేరు
టీ20 వరల్డ్కప్ వస్తోంది.. బుమ్రాకు విశ్రాంతి ఇవ్వండి: జాఫర్
తప్పక చదవండి
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement