breaking news
open cast mines
-
శ్రీరాంపూర్ ఓసీకి ‘మట్టి’ కొట్టారు
శ్రీరాంపూర్: శ్రీరాంపూర్ ఓపెన్ కాస్టు గని తీవ్ర సంక్షోభంతో కొట్టుమిట్టాడుతోంది. ఓబీ(మట్టి) పనులు చేసే రెండు కాంట్రాక్ట్ సంస్థలు ఒక దాని తర్వాత ఒకటి చేతులెత్తేశాయి. దీంతో మట్టి వెలికితీత పనులు నిలిచిపోయాయి. ఈ ప్రభావంతో బొగ్గు ఉత్పత్తి ఆగిపోయింది. గని ఏర్పడిన నాటినుంచి ఇలాంటి పరిస్థితి ఎన్నడూ రాలేదని అధికారులు పేర్కొంటున్నారు. రెండు సంస్థలకు ఓబీ పనులు శ్రీరాంపూర్ ఓసీలో ఓబీ వెలికితీత టెండర్ను సీఆర్ఆర్, జీవీఆర్ సంస్థలు దక్కించుకున్నాయి. నాలుగేళ్లు నిర్దేశిత ఓబీ వెలికి తీసేలా ఒప్పందం చేసుకున్నాయి. 2022 డిసెంబర్ 1 నుంచి సీఆర్ఆర్ సంస్థ పనులు చేపట్టింది. 2023 అక్టోబర్ 1 నుంచి జీవీఆర్ సంస్థ పనులు ప్రారంభించింది. సీఆర్ఆర్ సంస్థ 720 లక్షల క్యూబిక్ మీటర్ల మట్టి తీయాల్సి ఉండగా, అక్టోబర్ 1 వరకు కేవలం 360 లక్షల క్యూబిక్ మీటర్లు మాత్రమే వెలికితీసింది. జీవీఆర్ సంస్థ 495 లక్షల క్యూబిక్ మీటర్ల మట్టి తీయాల్సి ఉండగా, 220 లక్షల క్యూబిక్ మీటర్లు మాత్రమే తీసింది. లాస్ వస్తుందని.... ఈ రెండు సంస్థలు తమకు నష్టం వస్తుందని అర్ధంతరంగా పనులు నిలిపివేశాయి. సీఆర్ఆర్ సంస్థ ఆగస్టు 27 నుంచి, జీవీఆర్ సంస్థ అక్టోబర్ 1 నుంచి పనులు చేయడం లేదు. టెండర్ ప్రకారం నాలుగేళ్ల కాలానికి నిర్దేశించిన ఓబీ తీయాల్సి ఉండగా, తమతో ఇక కాదని చేతులెత్తేశాయి. జీవీఆర్ సంస్థ ముందుగా నోటీసులు ఇచ్చి పనులు నిలిపివేయగా, సీఆర్ఆర్ సంస్థ చెప్పా పెట్టకుండానే పనులు నిలిపివేసింది. ఈ సంస్థకు సింగరేణి యాజమాన్యం పలుమార్లు నోటీసులు ఇచి్చంది. ఇస్తే ఇదిగో వస్తాం.. చేస్తాం.. అంటూ తప్పించుకున్నారు. చేసేది లేక యాజమాన్యం సీఆర్ఆర్ను టెర్మినేట్ చేసేలా నోటీసులు ఇచ్చింది. కంపెనీలపై ఫెనాల్టీల భారం రెండు సంస్థలకు సింగరేణి యాజమాన్యం రూ. 84 కోట్ల జరిమానా విధించింది. ఇందులో సీఆర్ఆర్ సంస్థకు రూ.57 కోట్లు, జీవీఆర్ సంస్థకు రూ. 27 కోట్ల ఫెనాల్టీ వేసింది. పనులు నిలిపివేయడానికి జరిమానా కూడా కారణమని తెలుస్తోంది. రోజుకు 12 వేల టన్నుల ఉత్పత్తికి ఆటంకం నష్టం ఓబీ సంస్థల నిర్వాహకంతో శ్రీరాంపూర్ ఓసీలో రోజుకు 12 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తికి ఆటంకం ఏర్పడింది. ఈ కారణంగా సంస్థ రోజుకు రూ.కోటి వరకు నష్టపోతోంది. టెండర్ సమయంలో అధికారులు ఓబీ సంస్థల సామర్థ్యాన్ని అంచనా వేయకపోవడమే ఇందుకు కారణమని తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఓబీ సంస్థలు చేతులు ఎత్తేయడంతో సింగరేణి సొంతంగా ఓబీ పనులు చేపడుతోంది. సంస్థ ఉద్యోగులతో 3 షావల్స్తో ఓబీ వెలికి తీస్తున్నా.. రోజుకు కనీసం 5 వేల క్యూబిక్ మీటర్ల కూడా తీయలేకపోతోంది. మరోవైపు కాంట్రాక్టర్తో ఓబీ తీస్తే క్యూబిక్ మీటర్కు రూ.135 ఖర్చు అయితే నేడు కంపెనీ ఇందుకు రూ.400 ఖర్చు చేయాల్సి వస్తోంది. ఓసీలో ఏప్రిల్ 1 నుంచి అక్టోబర్ 1 వరకు 16.09 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి చేయాల్సి ఉండగా, 14.58 లక్షల టన్నులు మాత్రమే వెలికితీశారు. 83 శాతం లక్ష్యాన్నే సాధించారు. సమస్య పరిష్కరించి ఓబీ, బొగ్గు ఉత్పత్తి పెంచకుంటే సంస్థ తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉంది. నిత్యం ఆందోళనలు.... ఇదిలా ఉంటే సీఆర్ఆర్ కాంట్రాక్టు సంస్థ నాలుగు నెలలుగా వేతనాలు చెల్లించకపోవడంతో కారి్మకులు నిత్యం ఆందోళనలు చేస్తున్నారు. కార్మికులకు రూ.4 కోట్ల బకాయిలు చెల్లించాల్సి ఉంది. దీంతో వారు వాహనాల నిలిపివేత, ఆత్మహత్యాయత్నాలు, అధికారులు ఘెరావ్లతో గని ఉద్రిక్తంగా మారింది. వేతనాలు చెల్లించకుంటే గనిని పూర్తిగా మూసేస్తామని హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం పోలీసుల పహారాలో ఓసీ నడుస్తోంది. వేతనాలు చెల్లించకుంటే మరో రెండు రోజుల్లో అధికారుల కార్యాలయాలకు తాళం వేస్తామని కార్మికులు అల్టిమేటం ఇచ్చారు. కొత్త టెండర్లు పిలిచాం.... జీవీఆర్ సంస్థ స్థానంలో మరో సంస్థ కోసం కొత్త టెండర్ పిలిచాం. రెండు మూడు నెలల్లో పనులు మొదలవుతాయి. ఇక సీఆర్ఆర్ ఇష్యూ కూడా సెటిల్ చేసి, దానికి కూడా టెండర్ పిలుస్తాం. ఈ విషయమై ఉన్నతాధికారులతో చర్చిస్తున్నాం. రెండు టెండర్లు పూర్తయితే పనులు పంజుకుంటాయి. అప్పటి వరకు కంపెనీ ఆధ్వర్యంలో ఓబీ వెలికితీస్తూ వీలైనంత బొగ్గు ఉత్పత్తి చేస్తాం. – చిప్ప వెంకటేశ్వర్లు, ప్రాజెక్టు అధికారి, ఓసీపీ పీఓ -
రామప్పపై ఏఎస్ఐ మంట!
సాక్షి, హైదరాబాద్: భూపాలపల్లి జిల్లా వెంకటాపూర్ సమీపంలో సింగరేణి సంస్థ ప్రతిపాదించిన ‘పీవీ నరసింహారావు భూఉపరితల గనుల (ఓపెన్ కాస్ట్ మైన్)’ అంశం వివాదానికి కారణమైంది. ఇప్పటికే ప్రతిపాదిత గనులతో అక్కడికి కేవలం ఐదు కిలోమీటర్ల దూరంలోనే ఉన్న ప్రఖ్యాత రామప్ప దేవాలయానికి ముప్పు వస్తుందన్న అభ్యంతరాలు ఉన్నాయి. అలాంటిది బొగ్గు గనుల ఏర్పాటు కోసం నిరభ్యంతర పత్రం (ఎన్ఓసీ) జారీపై కేంద్ర పురావస్తుశాఖ సానుకూల నిర్ణయం తీసుకోవడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. యునెస్కో గుర్తింపు పొందిన కట్టడం రామప్ప దేవాలయం ఇటీవలే యునెస్కో నుంచి ప్రపంచ వారసత్వ సంపద హోదా గుర్తింపు దక్కించుకున్న విషయం తెలిసిందే. తెలుగు రాష్ట్రాల్లో ఆ ఘనత సాధించిన తొలి కట్టడంగా రామప్ప ఆలయం రికార్డు సృష్టించింది. దీనికి సమీపంలోనే సింగరేణి బొగ్గు గనుల తవ్వకాలకు ప్రతిపాదనలు వచ్చాయి. దీనికి సంబంధించి బెంగళూరులోని ఆర్కియాలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ఏఎస్ఐ) ప్రాంతీయ కార్యాలయం ఎన్ఓసీ జారీకి సానుకూలత వ్యక్తం చేసింది. నేషనల్ ఎన్విరాన్మెంట్ ఇంజనీరింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, ది నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కర్ణాటక, డిపార్ట్మెంట్ ఆఫ్ మైనింగ్ ఇంజనీరింగ్లను సంప్రదించి.. సింగరేణి హామీల ఆధారంగా ఈ అభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్టు పేర్కొంది. కానీ దీనిపై రామప్ప ఆలయ ప్రాంతాన్ని పర్యవేక్షిస్తున్న ‘ది పాలంపేట ఏరియా డెవలప్మెంట్ అథారిటీ’ విస్మయం వ్యక్తం చేసింది. ప్రతిష్టాత్మకమైన యునెస్కో గుర్తింపు సాధించిన తరుణంలో, దానికి విఘాతం కలిగించే ఏ చిన్న చర్యను కూడా ఉపేక్షించకుండా అభ్యంతరం చెప్పాల్సిన ఏఎస్ఐ.. అందుకు విరుద్ధంగా వ్యవహరించడం ఏమిటని మండిపడింది. ఈ అథారిటీలో కీలక సభ్యత్వమున్న కాకతీయ హెరిటేజ్ ట్రస్ట్ ఈ అంశంలో కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేసింది. మరోవైపు బొగ్గు గనులు ప్రారంభమైతే రామప్ప ఆలయానికి జరిగే నష్టం ఏమిటో తేల్చాలని నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (ఎస్జీఆర్ఐ), జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (జీఎస్ఐ)లను పాలంపేట డెవలప్మెంట్ అథారిటీ కోరింది. దీనితోపాటు బొగ్గు గనులతో జీవావరణం, సామాజిక, ఆర్థిక ప్రభావంపై అధ్యయనం చేయాలని సెంటర్ ఫర్ ఎకనమిక్ అండ్ సోషల్ స్టడీస్ను కోరాలని నిర్ణయించింది. ఈ సంస్థలు తేల్చే అంశాల ఆధారంగా బొగ్గు గనుల తవ్వకం ఆధారపడి ఉంది. మూడు కీలక అంశాలతో.. పాలంపేట డెవలప్మెంట్ అథారిటీ భేటీలో కాకతీయ హెరిటేజ్ ట్రస్టు పక్షాన ప్రొఫెసర్ పాండురంగారావు ప్రధానంగా మూడు అభ్యంతరాలను వ్యక్తం చేశారు. బొగ్గు గనుల తవ్వకం వల్ల రామప్ప ఆలయానికి ప్రమాదం పొంచి ఉందని స్పష్టం చేశారు. శాండ్ బాక్స్ పునాదుల్లోంచి ఇసుక జారిపోయే ప్రమాదం రామప్ప దేవాలయాన్ని నాటి కాకతీయ నిపుణులు శాండ్ బాక్స్ టెక్నాలజీతో నిర్మించారు. భూకంపాలు వంటి కుదుపులు ఏర్పడ్డా.. నిర్మాణానికి ఇబ్బంది రాకుండా పునాదుల్లో ఇసుకను నింపారు. ఆలయ ప్రదక్షిణ పథం నుంచి దిగువకు దాదాపు 18 అడుగుల మందంతో ఇసుక ఉంది. ఈ ఇసుక పదిలంగా ఉంటేనే నిర్మాణం స్థిరంగా ఉంటుంది. రామప్ప ఆలయానికి 5 కిలోమీటర్ల దూరంలో 300 మీటర్ల లోతు వరకు బొగ్గు గనులను తవి్వతే.. భూమి పొరల్లో నీటి ప్రవాహ దిశను మార్చే కదలికలు (హైడ్రాలిక్ గ్రేడియంట్స్) ఏర్పడుతాయి. రామప్ప ఆలయం ఎగువన దాదాపు 3 టీఎంసీల సామర్ధ్యమున్న రామప్ప చెరువు ఉంది. హైడ్రాలిక్ గ్రేడియంట్స్ వల్ల చెరువు నీళ్లతో ఆలయ పునాదుల్లోని ఇసుకను కోత గురై.. క్రమంగా ఆలయ పునాదులు అస్థిరమయ్యే ప్రమాదం ఉంది. గని ఉన్నంత కాలం కంపనాల ప్రభావం బొగ్గు గనుల్లో నిరంతరం పేలుళ్లు జరుపుతూ ఉంటారు. 300 మీటర్ల లోతు వరకు తవ్వే క్రమంలో జరిపే పేలుళ్లు భూమి పొరల్లో కంపనాలు సృష్టిస్తాయి. రామప్ప ఆలయ నిర్మాణం నాజూకుగా ఉంటుంది. పేలుళ్ల కంపనాల వల్ల రాళ్లలో కదలికలు ఏర్పడి కట్టడం ధ్వంసమయ్యే ప్రమాదం ఉంటుంది. బొగ్గు తరలింపు ధూళితో ఆలయ నిర్మాణానికి ప్రమాదం ప్రపంచ వింతల్లో ఒకటైన తాజ్మహల్.. సమీపంలోని నూనె శుద్ధి కర్మాగారాల కాలుష్యం వల్ల దెబ్బతింటున్నట్టు ఇప్పటికే తేలింది. ఇప్పుడు రామప్పకు గనుల తవ్వకం, లారీల్లో బొగ్గు తరలింపుతో.. ధూళి కణాలు రామప్ప ఆలయం మీద పడుతూ.. రసాయనిక చర్యకు కారణమవుతాయి. ఇది నిర్మాణానికి ప్రమాదం తెచ్చి పెడుతుంది. -
ఆదిలాబాద్ జిల్లాలో భారీ వర్షం
ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లాలో ఎడతెరపి లేకుండా పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. దాంతో అసిఫాబాద్ నియోజకవర్గంలోని వాంకిడి, కెరామేరీ, ఎద్దెన, సిరియాని గ్రామాలు తడిసి ముద్దయ్యాయి. అలాగే వాంకిడి మండలంలోని చిక్కిలి వాగు ఉప్పొంగి ప్రవహిస్తుంది. దాంతో 15 గ్రామాల మధ్య రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. అయితే భారీ వర్షం కారణంగా శ్రీరాంపూర్, రామకృష్ణాపూర్ ఓపెన్ కాస్ట్ బొగ్గు గనుల్లోకి భారీగా నీరు వచ్చి చేరింది. దీంతో బొగ్గు ఉత్పత్తికి తీవ్ర అంతరాయం ఏర్పడింది.


