breaking news
Nizansagar
-
90 టీఎంసీలు గోదావరి పాలు
18 రోజుల్లోనే.. వృథాగా పోయిన జలాలు నీటిని ఒడిసిపడితే జిల్లా సస్యశ్యామలమే! నిజాంసాగర్ : ఇటీవల కురిసిన భారీ వర్షాలతో జిల్లాలోని జలాశయాలు కొత్త కళను సంతరించుకున్నాయి. వాగులు ఉప్పొంగాయి. చెరువులు అలుగులు పారాయి. ప్రాజెక్టులు నిండుకుండల్లా మారడంతో గేట్లను ఎత్తి నీటిని దిగువకు వదిలారు. మంజీర నదిపై నిర్మించిన నిజాంసాగర్ ప్రాజెక్టుతో పాటు కౌలాస్నాలా, పోచారం, కల్యాణి ప్రాజెక్టులు, సింగితం రిజర్వాయర్ ద్వారా 18 రోజుల్లో 90 టీఎంసీల నీరు గోదావరి పాలైంది. ఇది నిజామాబాద్ జిల్లాలోని శ్రీరాంసాగర్ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటినిల్వ సామర్థ్యానికి సమానం.. ఈ నీటిని ఒడిసి పట్టే ప్రాజెక్టులు ఉండి ఉంటే జిల్లా పూర్తిస్థాయిలో సస్యశ్యామలం అయ్యేది. ఆయా ప్రధాన జలాశయాల ద్వారా సముద్రం పాలైన నీటిని నిల్వచేసుకుని ఉంటే సుమారు ఏడు లక్షల ఎకరాలకు సాగునీరు అందేది. పాలకులు ఆ దిశగా ఆలోచన చేస్తే.. సమీప భవిష్యత్లో కామారెడ్డి సస్యశ్యామలం అయ్యే అవకాశాలున్నాయి. ‘సాగర్’ నుంచి 76 టీఎంసీలు.. నిజాంసాగర్ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1,405 అడుగులతో 17.8 టీఎంసీలు. వర్షాకాలంలోనూ ఈ ప్రాజెక్టు ఎడారిని తలపించింది. అయితే గతనెలలో కురిసిన వర్షాలతో ఒక్కసారిగా నిండుకుండలా మారింది. దీంతో ప్రాజెక్టు గేట్లను ఎత్తి దిగువకు నీటిని వదిలారు. ఇలా 18 రోజుల వ్యవధిలో 76 టీఎంసీల నీటిని గోదావరిపాలు చేశారు. ఈ నీటితో సుమారు మరో ఐదు లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరందేది. కళ్యాణి, సింగితం ద్వారా 4 టీఎంసీలు.. నిజాంసాగర్ ప్రాజెక్టుకు అనుసంధానంగా కళ్యాణి ప్రాజెక్టుతో పాటు సింగితం రిజర్వాయర్ నిర్మించారు. వీటి ద్వారా సుమారు 4 టీఎంసీల నీరు సముద్రం పాలైంది. కళ్యాణి ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 409.5 మీటర్లు. ఈ ప్రాజెక్టు వరదగేట్ల ద్వారా 1.5 టీఎంసీల నీటిని దిగువకు వదిలారు. సింగితం రిజర్వాయర్ నీటిమట్టం 416.5 మీటర్లు. ఈ రిజర్వాయర్ ద్వారా 2.5 టీఎంసీల నీరు వృథాగా వెళ్లింది. ఈ నీటిని సద్వినియోగం చేసుకుంటే సుమారు మరో నలభై వేల ఎకరాలకు నీరందుతుంది. కౌలాస్ ద్వారా 5 టీఎంసీలు.. జుక్కల్, బిచ్కుంద మండలాల వరప్రదాయిని అయిన కౌలాస్నాలా ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 458 మీటర్లు(1.23 టీఎంసీలు). ఈ ప్రాజెక్టు ద్వారా ఇప్పటి వరకు 5 టీఎంసీల మేర నీరు వృథా అయ్యింది. ఈ నీటిని నిల్వ చేసుకునే ప్రాజెక్టులు ఉండిఉంటే సుమారు మరో 50 వేల ఎకరాలకు నీరందేది. పోచారం అలుగు ద్వారా 5 టీఎంసీలు.. నాగిరెడ్డిపేట, ఎల్లారెడ్డి మండలాల వరప్రదాయిని అయిన పోచారం ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 21 అడుగులు(1.82 టీఎంసీలు). ఈ సీజన్లో అలుగు ద్వారా 5 టీంఎసీల నీరు వృథా అయ్యింది. ఈ నీటిని నిల్వ చేసుకుని ఉంటే సుమారు 50 వేల ఎకరాలకు సాగునీరు అందిదే. -
ఎట్టకేలకు సింగూరు జలాలు విడుదల
నిజాంసాగర్, న్యూస్లైన్ : నిజాంసాగర్ ఆయకట్టు కింద సాగు చేస్తున్న పంటల అవసరాల కోసం ఎట్టకేలకు సింగూరు ప్రాజెక్టు నుంచి జలాలు విడుదలయ్యాయి. వాటా ప్రకారం నిజాంసాగర్ ప్రాజెక్టుకు ఏడు టీఎంసీల నీటిని వదలాలని ప్రతిపాదించగా రాష్ట్ర ప్రభుత్వం నాలుగు టీఎంసీల నీటి విడుదలకు అనుమతినిచ్చింది. ఈమేరకు సింగూరు జలాశయం టర్బయిన్ గేట్ల ద్వారా 3600 క్యూసెక్కుల నీటిని రెండు రోజులుగా విడుదల చేశారు. శుక్రవారం సాయంత్రం ప్రాజెక్టు ఒక వరదగేటు ద్వారా 9వేల క్యూసెక్యుల నీటిని దిగువకు వదులుతున్నారు. ప్రాజెక్టు నుంచి నీటిని వదులుతుండటంతో మంజీర వాగులో నీటి ప్రవాహం ఉరకలేస్తోంది. ప్రాజెక్టు దిగువ ఉన్న పరిసర ప్రాంతాలకు రైతులు, పశువుల కాపరులు వెళ్లవద్దని నీటిపారుదల శాఖ అధికారులు ఆదేశాలు జారీచేశారు. రేపటిలోగా సాగర్లోకి సింగూరు జలాలు సింగూరు జలాశయం నుంచి వదులుతున్న నీరు ఆదివారం సాయంత్రం వరకు నిజాంసాగర్ ప్రాజెక్టులోకి చేరే అవకాశాలున్నాయి. సింగూరు జలాశయం, నిజాంసాగర్ ప్రాజెక్టు మద్య 90 కిలోమీటర్ల దూరం ఉండటంతో మంజీర వాగు ద్వారా జలాలు రానున్నాయి. నిజాంసాగర్ ప్రాజెక్టుకు ఎగువన ఉన్న మంజీర వాగులో దిబ్బలు, నీటి మడుగులు అధికంగా ఉండటంతో పాటు తుమ్మచెట్లు ఏపుగా పెరగడంతో నీటి ప్రవాహం తక్కువగా ఉంటుంది. సింగూరు జలాశయం నుంచి నీటిని వదిలినా నిజాంసాగర్లోకి 2.8 టీఎంసీల నీరు మాత్రమే వచ్చి చేరే అవకాశముంది. ప్రస్తుతం నిజాంసాగర్ ప్రాజెక్టులో 1396.42 అడుగులతో 7.94 టీఎంసీల నీరు నిల్వ ఉంది.