breaking news
Minority Welfare Day
-
ప్రపంచంతో ముస్లింలు పోటీ పడాలి: సీఎం జగన్
సాక్షి ప్రతినిధి, గుంటూరు: ‘ప్రతి ముస్లిం ప్రపంచంతో పోటీ పడి చదవాలి.. గెలవాలి. వీళ్లు గెలవాలంటే కచ్చితంగా చదువు అనే అస్త్రం వీళ్ల చేతుల్లో ఉండాలి. అందుకే చదువుల మీద మన ప్రభుత్వం ప్రధానంగా దృష్టి సారించింది’ అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పష్టం చేశారు. గుంటూరు నగరంలోని శ్రీ వేంకటేశ్వర విజ్ఞాన మందిరంలో మైనారిటీ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం ఏర్పాటు చేసిన మైనారిటీ సంక్షేమ దినోత్సవం, భారతరత్న మౌలానా అబుల్ కలాం ఆజాద్ 135వ జయంతి వేడుకలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ.. ‘రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మైనారిటీ సోదరులు, అక్కచెల్లెమ్మలకు మీ సోదరుడు, స్నేహితుడు, మీ కుటుంబ సభ్యుడైన మీ జగన్ ప్రేమ పూర్వక అస్సలామ్ అలైకుమ్. భారతదేశ తొలి విద్యా శాఖ మంత్రిగా ఈ దేశంలో అనేక ప్రతిష్టాత్మక విద్యా సంస్థలు స్థాపించిన భారతరత్న మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతిని మనం జాతీయ విద్యా దినోత్సవం, మైనార్టీస్ వెల్ఫేర్ డే (అల్ప సంఖ్యాక వర్గాల సంక్షేమ దినోత్సవం)గా కూడా జరుపుకుంటున్నాం. మౌలానా అబుల్ కలాం ఆజాద్ స్వాతంత్య్ర సమరయోధుడు, గొప్ప రచయత, పాత్రికేయుడు. భారతదేశ తొలి విద్యాశాఖ మంత్రిగా 1947 నుంచి 1958 వరకు ఆయన విశేష సేవలు అందించారు. అబుల్ కలాం జయంతిని మైనార్టీస్ డే గా 2008లో అప్పటి ముఖ్యమంత్రి, దివంగత ప్రియతమ నేత రాజశేఖరరెడ్డి (నాన్నగారు) తొలిసారిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ప్రకటించారు’ అని చెప్పారు. మైనారిటీ సంక్షేమంలో గొప్ప మార్పు ► ముస్లింల్లో పేదలందరికీ దేశంలోనే తొలిసారిగా ఏపీలో రిజర్వేషన్లు వర్తించిన పరిస్థితులు వచ్చాయంటే అది దివంగత సీఎం వైఎస్సార్ వల్లే జరిగింది. ఆ విషయం చెప్పుకోవడానికి ఒక కొడుకుగా గర్వపడుతున్నాను. ► నాన్నగారు ముస్లిం సోదరుల పట్ల, ౖమైనారిటీల సంక్షేమం పట్ల ఒక అడుగు వేస్తే.. ఆయన కొడుకుగా మీ జగన్ రెండు అడుగులు ముందుకు వేస్తున్నాడు. పదవులు, వారికి సంక్షేమం అందించే విషయంలో రాష్ట్రంలో 2019 నుంచి గొప్ప మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ► గత ప్రభుత్వ హయాంలో మైనారిటీలకు మంత్రి పదవి ఇవ్వడానికి కూడా మనసు రాని పరిస్థితి. ఈ రోజు ఏకంగా ఉప ముఖ్యమంత్రి పదవిలో ఒక మైనారిటీ సోదరుడు ఉన్నారు. మార్పు మీరే గమనించండి. మన పార్టీ నుంచి నలుగురు మైనారిటీలను ఎమ్మెల్యేలుగా దేవుడి దయతో గెలిపించుకోగలిగాం. మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మరో నలుగురిని ఎమ్మెల్సీలుగా నియమించుకున్నాం. ► రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా నా అక్క ఇవాళ శాసన మండలి ఉపాధ్యక్ష పదవిలో ఉంది. మైనారిటీ సోదరుడు ఆర్టీఐ చీప్ కమిషనర్ పదవిలో ఉన్నాడు. ఇన్ని ఉదాహరణలు ఎందుకంటే.. మనసుతో మంచి చేస్తున్నాం అని చెప్పడానికే. గత ప్రభుత్వానికి, మన ప్రభుత్వానికి మధ్య తేడాను గమనించాలని కోరుతున్నా. 3 ఏళ్ల 4 నెలల కాలంలో.. ► రాష్ట్రంలో మనందరి ప్రభుత్వం ఏర్పడ్డాక 2019 జూన్Œ నుంచి ఈ ఏడాది అక్టోబర్ వరకు అంటే 3 సంవత్సరాల 4 నెలల కాలంలో వివిధ పథకాల కింద కేవలం డీబీటీ విధానంలో బటన్ నొక్కి నేరుగా అక్కచెల్లెమ్మల ఖాతాల్లోకి లంచాలు, వివక్ష లేకుండా నగదు జమ చేస్తున్నాం. వ్యవస్థలో గొప్ప మార్పు చోటుచేసుకుంది. ► ఈ మూడేళ్ల 4 నెలల కాలంలోనే డీబీటీ ద్వారా 44,13,773 మైనారిటీ కుటుంబ సభ్యుల ఖాతాల్లోకి రూ.10,309 కోట్లు జమ చేశాం. నాన్ డీబీటీ ద్వారా మరో 16,41,622 మైనార్టీ కుటుంబీకులకు మరో రూ.10 వేల కోట్లు లబ్ధి చేకూర్చాం. 2,42,226 మంది అక్కచెల్లెమ్మలకు ఇళ్ల స్థలాలు కేటాయించాం. 1,36,888 మంది అక్కచెల్లెమ్మలకు ఇప్పటికే ఇళ్లు కూడా మంజూరు చేశాం. అవి నిర్మాణంలో ఉన్నాయి. మొత్తంగా ఒక్క ఇళ్లకు సంబంధించి మాత్రమే రూ.9,400 కోట్లు వీరి చేతిలో పెట్టగలిగాం. ► టీడీపీ హయాంలో 2014–19 వరకు ఐదేళ్లలో మైనారిటీల సంక్షేమం కోసం చేసిన ఖర్చు కేవలం రూ.2,665 కోట్లే. మన ప్రభుత్వంలో ఏకంగా రూ.20 వేల కోట్ల లబ్ధి. అప్పటికి, ఇప్పటికి ఎంత తేడా ఉందో పోల్చి చూడండి. వక్ఫ్ ఆస్తుల రక్షణకు పటిష్ట చర్యలు ► వక్ఫ్ బోర్డు ఆస్తులను సంరక్షించాలని ప్రతి అడుగు సిన్సియర్గా వేస్తున్నాం. రాష్ట్రం మొత్తం మీద 65,783 ఎకరాల వక్ఫ్ భూములుండగా.. పలుచోట్ల అవి అన్యాక్రాంతమైనట్లు కనిపిస్తున్నాయి. వీటిని ఒక పద్ధతి ప్రకారం తిరిగి వక్ఫ్కు స్వాధీనం చేసే కార్యక్రమం మొదలుపెట్టాం. ► ఇప్పటికే అన్యాక్రాంతమైన వాటిలో 580 ఎకరాల భూమిని మన ప్రభుత్వం వచ్చిన తర్వాత స్వాధీనం చేసుకుని వక్ఫ్కు తిరిగి ఇచ్చాం. వక్ఫ్ ఆస్తుల పరిరక్షణ కోసం అన్ని వివరాలను డిజిటలైజేషన్ చేస్తున్నాం. ఇప్పటివరకు 3,772 ఆస్తులకు సంబంధించి డిఫరెన్షియల్ గ్లోబల్ పొజిషనింగ్ సర్వే పూర్తి చేసి, వాటిని కంచె వేసి రక్షించే కార్యక్రమం చేస్తున్నాం. ఈ ప్రభుత్వం మీది అన్న సంగతి గుర్తుపెట్టుకోండి. గుంటూరు భూగర్భ డ్రైనేజీ కోసం రూ.287 కోట్లు గుంటూరు తూర్పు ఎమ్మెల్యే ముస్తఫా అడిగిన విధంగా గుంటూరు భూగర్భ డ్రైనేజీ కోసం రూ.287 కోట్లు ఇప్పటికే మంజూరు చేశాం. అరండల్పేట శంకర్ విలాస్ సెంటర్లో ఆర్వోబీ నిర్మాణం రూ.131 కోట్లతో త్వరలోనే ప్రారంభం అవుతుంది. గుంటూరు వెస్ట్లో ముస్లిం కౌన్సెలింగ్ హాల్ కమ్ లైబ్రరీ సెంటర్ కూడా మంజూరు చేస్తున్నా. ముస్లిం ప్రముఖులకు అవార్డుల ప్రదానం మౌలానా అబుల్ కలాం ఆజాద్ జాతీయ పురస్కారాన్ని అనంతపురానికి చెందిన ప్రొఫెసర్ కె ముజఫర్ ఆలీకి సీఎం వైఎస్ జగన్ అందజేశారు. కర్నూలుకు చెందిన సయ్యద్ అరిఫుల్లా బాషా కాద్రీకి డాక్టర్ అబ్దుల్ హక్ రాష్ట్రీయ పురస్కారం, రూ.లక్ష నగదు బహుమతిని అందించారు. హజ్రత్ షా కమాల్ పురస్కారాన్ని కడపకు చెందిన అఫ్సర్ డెక్కానికి, అల్లమల యాసీర్ కుములిన్ పురస్కారాన్ని అన్నమయ్య జిల్లాకు చెందిన షేక్ మహమ్మద్ హషిమ్కు, సలామన్ అతార్ జావీద్ అవార్డును కర్నూలుకు చెందిన డాక్టర్ మహమ్మద్ సిద్దిఖీకి, దుర్వేష్ కాద్రీ జాకి పురస్కారాన్ని అన్నమయ్య జిల్లాకు చెందిన డాక్టర్ పి దావూద్ఖాన్కు, షాఫిల్ఫోర్ కాద్రీ అవార్డును కడపకు చెందిన డాక్టర్ సయ్యద్ అమ్జాద్ అలీకి, మిర్జాఫైక్ తుర్కామని అవార్డును గుంటూరుకు చెందిన డాక్టర్ సయ్యద్ మస్తాన్ వలీకి, యూసఫ్ సఫీ అవార్డును చిత్తూరుకు చెందిన డాక్టర్ పి అబ్దుల్ గఫార్కు అందజేశారు. వీరికి రూ.25 వేల నగదు కూడా అందజేశారు. 2019 నుంచి ముస్లింలకు సువర్ణ అధ్యాయం రాష్ట్రంలో 2019 నుంచి మైనార్టీలకు సువర్ణ అధ్యాయం. రాష్ట్రంలో ఇమామ్లు, మౌజమ్లకు ఇచ్చే గౌరవ భృతిని గత ప్రభుత్వం పక్కనపెడితే, జగన్ ప్రభుత్వం ఆ బకాయిలు చెల్లించడమే కాకుండా పెంచిన గౌరవ భృతిని చెల్లిస్తోంది. ఇది మైనారిటీ వర్గాలకు రాజకీయ సాధికారత కల్పించిన ప్రభుత్వం. రెండో అధికార భాషగా ఉర్దూ్దకు చట్టబద్ధ్దత కల్పించడంతో పాటు అమలుకు చర్యలు చేపట్టాం. దేశంలో ఎక్కడా లేని విధంగా ముస్లిం మైనారిటీల సబ్ప్లాన్కు చట్టబద్ధత కల్పించాం. – అంజాద్బాషా, ఉప ముఖ్యమంత్రి -
అన్ని విధాలా మైనార్టీలకు న్యాయం చేస్తున్నాం: సీఎం జగన్
-
‘పదవుల నుంచి పథకాల వరకు అన్ని విధాలా మైనార్టీలకు అండగా నిలిచాము’
సాక్షి, గుంటూరు: మైనార్టీ సంక్షేమ దినోత్సవం సందర్భంగా గుంటూరులో జరిగిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్ మాట్లాడుతూ.. ‘నేడు జాతీయ విద్యా దినోత్సవం, అలాగే మైనార్టీ సంక్షేమ దినోత్సం కూడా ఈరోజు. మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారి 135వ జయంతి. ఆజాద్ గురించి తెలియని వ్యక్తి ఎవరూ ఉండరు. ఆజాద్ సేవలు మరువలేనివి. ముస్లింలో పేదలందరికీ తొలిసారిగా రిజర్వేషన్లు కల్పించింది వైఎస్సార్. మైనార్టీల సంక్షేమానికి దివంగత నేత ఒకడుగు ముందుకేస్తే.. ఆయన తనయుడిగా నేను రెండడుగులు ముందుకేస్తాను. మహానేత తనయుడిగా గర్వపడుతున్నాను. పదవుల నుంచి సంక్షేమ పథకాల వరకు అన్ని విధాలా మైనార్టీలకు న్యాయం చేస్తున్నాము. ఒక మైనార్టీకి ఉప ముఖ్యమంత్రి పదవిని ఇచ్చాము. నలుగురికి ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చాము. శాసనమండలి డిప్యూటీ ఛైర్మన్ పదవిని మైనార్టీకి కేటాయించాము. మూడేళ్లలో మైనార్టీలకు డీబీటీ ద్వారా రూ.10,309 కోట్లు అందించాము. నాన్ డీబీటీ ద్వారా మరో రూ. 10వేల కోట్లు అందించాము. చంద్రబాబు ప్రభుత్వం ఐదేళ్లలో మైనార్టీలకు రూ.2,665 కోట్లు ఇస్తే.. మూడేళ్లలోనే మేము రూ.20 వేల కోట్లుకు పైగా ఇచ్చాము. ప్రతీ ముస్లిం విద్యావంతుడు కావాలి. ప్రతీ ముస్లిం ప్రపంచంతో పోటీ పడాలి. విద్యావ్యవస్థలో మార్పులు చేస్తున్నాము. వక్ఫ్ ఆస్తులు కాపాడేందుకు చర్యలు తీసుకుంటున్నాము. ఇప్పటికే అన్యాక్రంతమైన 580 ఎకరాలను స్వాధీనం చేసుకున్నాము. ఈ ప్రభుత్వం మీది అని మర్చిపోవద్దు’ అని స్పష్టం చేశారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
Minority Welfare Day: ముస్లింల ప్రాతినిధ్యం పెరగాలి
స్వాతంత్య్రం సిద్ధించి ఏడున్నర దశాబ్దాలైనా దేశంలో అనేక వర్గాలకు అభివృద్ధి ఫలాలు అందని ద్రాక్షలుగానే ఉన్నాయి. అందులో ముస్లింలు ముందు వరుసలో ఉన్నారు. అందుకే జస్టిస్ సచార్ నివేదిక వారిలో చాలా ఆశలు రేపింది. మిగతా వర్గాలతో పోలిస్తే ముస్లిం మైనారిటీల జీవన స్థితిగతులు ఏమాత్రం మెరుగ్గా లేవని నివేదిక తేల్చింది. అనేక వర్గాలు సామాజికంగా, రాజకీయంగా దూసుకుపోతుంటే ముస్లింలు మాత్రం ఈ పరుగు పందెంలో బాగా వెనుకబడ్డారు. పైగా అభద్రతా భావం పెరిగింది. ముస్లిం సమాజంలో పేదరికం కూడా ఎక్కువే. పల్లెటూళ్లలో సెంటు భూమికూడా లేనివారిలో ఎక్కువ మంది ముస్లింలే. దీంతో వారు రోజువారీ కూలీలుగా బతుకుతున్నారు. ఊళ్ళలో ఉపాధి అవకాశాలు తగ్గడంతో చాలా మంది దగ్గరలోని నగరాలు, పట్టణాలవైపు వలస బాట పట్టారు. రోడ్ల పక్కన కాయలు, పండ్లు అమ్ముకోవటం, రిపేరింగ్ లాంటి పనులతో సరిపెట్టుకుంటున్నారు. దేశ జనాభాలో ముస్లింల శాతం 14.9 అయినా ప్రభుత్వ ఉద్యోగాల్లో వాళ్ల శాతం 4.9కి మించిలేదు. కేంద్ర సర్వీసుల్లో మరీ తక్కువ (3.2 శాతం). సచార్ కమిటీ నివేదిక తర్వాత ఏర్పడిన అనేక కమిటీలు కూడా దేశంలోని ముస్లింల స్థితిగతులపై పెదవి విరిచాయి. ముస్లిం సమాజం ఇప్పటికీ గుర్తింపు సమస్య లోనే కొట్టుమిట్టాడుతోంది. ముస్లిం సమాజంపై ఇప్పటికీ మిగతా సామాజిక వర్గాల్లో కొన్ని అపోహలు ఉన్నాయి. మతోన్మాద శక్తుల ప్రాబల్యం పెరగడంతో నిజాలపై అపోహల ఆధిపత్యం ఎక్కువైంది. దీంతో ముస్లింల సమ స్యలు ఇనుమడిస్తున్నాయి. ఎస్సీ, ఎస్టీలకు అత్యాచార నిరోధక చట్టం ఉన్నట్లుగానే, ముస్లిముల కోసం కూడా అత్యాచార నిరోధక చట్టం తీసుకురావాలి. సబ్ప్లాన్ అమలు చేయాలి. మైనారిటీ తెలంగాణలో ఉర్దూను రెండవ అధికార భాషగా అమలు చేస్తామన్న వాగ్దానాన్ని కాగితాలకే పరిమితం చెయ్యకుండా ఆచరణలో పెట్టాలి. దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి కల్పించిన 4 శాతం రిజర్వేషన్లు 12 శాతానికి పెంచుతానన్న హామీని గురించి కేసీఆర్ను నిలదీయాలి. ముస్లిం సముదాయం కూడా ఎవరో వచ్చి ఏదో చేస్తారని ఎదురుచూడకుండా రాజ్యాంగ ప్రసాదితమైన హక్కుల సాధనకు రాజ్యాంగ బద్ధంగానే పోరాడాలి. పాలక పక్షాలు చురుగ్గా స్పందించేలా దేశంలోని ప్రజాస్వామ్య ప్రియులు, హక్కుల నేతలు, లౌకిక వాదులు, వామపక్షీయులు, బహుజన శక్తులతో కలిసి మైనారిటీలను పట్టించుకోని ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకు రావాలి. మతపరమైన అంశాలను పక్కన పెట్టి అభివృద్ధి దిశగా ముస్లిం సమాజాన్ని నడిపించే బలమైన నాయకత్వం నేటి అవసరం. (క్లిక్ చేయండి: ఆలోచనాపరుల జాగరూకతే దేశానికి రక్ష) - ఎమ్డీ ఉస్మాన్ ఖాన్ సీనియర్ జర్నలిస్ట్ (నవంబర్ 11న జాతీయ మైనారిటీ సంక్షేమ దినోత్సవం) -
‘మైనారిటీ సంక్షేమ దినోత్సవంగా నిర్వహిస్తాం’
సాక్షి, విజయవాడ: జనాబ్అబుల్ కలాం ఆజాద్ 132వ జయంతి ఏర్పాట్లను శనివారం డిప్యూటీ సీఎం అంజాద్ బాషా పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. జనాబ్అబుల్ కలాం ఆజాద్ జయంతిరోజు విద్యాదినోత్సవాన్ని, మైనారిటీ సంక్షేమ దినోత్సవంగా నిర్వహించాలని ప్రభుత్వం సంకల్పించిందని తెలిపారు. డాక్టర్ అబ్దుల్ కలాం లైఫ్ టైం అచీవ్మెంట్ పురస్కారానికి జాబితా సిద్ధమైనట్టు వెల్లడించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి హాజరు కానున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమ ఏర్పాట్లపై జేసీ మాధవీలతకు అంజాద్ బాషా పలు సూచనలు ఇచ్చారు. -
మైనారిటీలకు సీఎం శుభాకాంక్షలు
సాక్షి, హైదరాబాద్: మైనారిటీ సంక్షేమ దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు తెలంగాణలోని మైనారిటీలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతిని పురస్కరించుకుని నవంబర్ 11న మైనారిటీ సంక్షేమ దినోత్సవం నిర్వహిస్తున్నారు. దేశ లౌకిక స్ఫూర్తిని ప్రపంచ నలుదిశలా చాటేలా అబుల్ కలాం కృషి చేశారని సీఎం అభిప్రాయపడ్డారు. విభిన్న మతాలున్నప్పటికీ దేశంలోని పౌరులందరూ సమాన స్వేచ్ఛ, స్వాతంత్య్రం అనుభవించాలనే రాజ్యాంగ స్ఫూర్తిని అందరూ గుర్తించాలని కేసీఆర్ కోరారు. ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను వినియోగించుకుని మైనారిటీలు సామాజికంగా, ఆర్థికంగా వృద్ధి చెందాలని సీఎం ఆకాంక్షించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా మైనారిటీలకు తెలంగాణ రాష్ట్రం గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేస్తోందని, దీంతో భావితరం బాగుపడుతుందనే ఆశ ఉందని అన్నారు. రాష్ట్రంలో మైనారిటీలకు తగిన గుర్తింపు, గౌరవం, ప్రోత్సాహం ఉంటుందని ఆయన వెల్లడించారు.