breaking news
Mianwali
-
పాక్ వైమానిక కేంద్రంపై ఉగ్రదాడి
ఇస్లామాబాద్: పంజాబ్ ప్రావిన్స్లోని మియాన్వలి వైమానిక శిక్షణ కేంద్రంపై ఉగ్రవాదుల దాడిని విజయవంతంగా తిప్పికొట్టినట్లు సైన్యం ప్రకటించింది. దాడికి యత్నించిన మొత్తం తొమ్మిదిమందినీ మట్టుబెట్టామని తెలిపింది. శుక్రవారం ఉగ్రవాదుల దాడుల్లో 17 మంది సైనికులు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. పాకిస్తాన్ వైమానిక దళానికి చెందిన మియాన్వలి వైమానిక శిక్షణ కేంద్రంపైకి శనివారం వేకువజామున భారీగా ఆయుధాలు ధరించిన ఉగ్రవాదులు దాడికి యత్నించారు. అప్రమత్తమైన బలగాలు ముగ్గురు ఉగ్రవాదులను కాల్చి చంపాయి. అనంతరం మిగతా వారిని చుట్టుముట్టి, హతమార్చాయి. శిక్షణ కేంద్రం ఆవరణలోని నిరుపయోగంగా ఉన్న మూడు విమానాలు, ఒక ఆయిల్ ట్యాంకర్ దెబ్బతిన్నట్లు ఆర్మీ తెలిపింది. దాడిలో పాల్గొన్న మొత్తం 9 మంది ఉగ్రవాదులను హతమార్చినట్లు స్పష్టం చేసింది. శిక్షణ కేంద్రంలో కార్యకలాపాలకు ఎటువంటి అంతరాయం ఏర్పడలేదని వివరించింది. సైన్యానికి జరిగిన నష్టంపై ఎటువంటి సమాచారం వెల్లడించలేదు. కాగా, ఈ ఘటనకు తామే కారణమంటూ తెహ్రీక్–ఇ–తాలిబన్ పాకిస్తాన్(టీటీపీ)కి అనుబంధంగా కొత్తగా ఏర్పాటైన ఉగ్ర సంస్థ తెహ్రీక్–ఇ–జిహార్ పాకిస్తాన్(టీజేపీ) మీడియా ప్రతినిధులకు పంపిన లేఖలో ప్రకటించుకుంది. అయితే, ఏకంగా సైనిక కేంద్రంపైనే ఉగ్రవాదులు దాడికి తెగబడటం ఇదే మొదటిసారని చెబుతున్నారు. కల్లోలిత బలోచిస్తాన్ ప్రావిన్స్, ఖైబర్ ఫంక్తున్వా ప్రావిన్స్ల్లో శుక్రవారం ఉగ్రవాదుల వేర్వేరు దాడుల్లో 17 మంది సైనికులు హతమయ్యారు. బలోచిస్తాన్లోని గ్వాదర్ జిల్లాలో పాస్ని నుంచి ఒర్మారా వైపు వెళ్తున్న ఆర్మీ సిబ్బందితో వెళ్తున్న రెండు వాహనాలపై జరిగిన ఉగ్రదాడిలో 14 మంది చనిపోయారు. ఈ ఏడాదిలో వేర్పాటు వాదులు, ఉగ్రవాదుల దాడుల్లో ఒకే ఘటనలో పెద్ద సంఖ్యలో భద్రతా సిబ్బంది ప్రాణాలు కోల్పోయిన ఘటన ఇదే. టీటీపీ, పాకిస్తాన్ ప్రభుత్వానికి మధ్య కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందం గడువు 2022 డిసెంబర్తో ముగిశాక దాడులు తీవ్రతరం కావడం గమనార్హం. గ్వాదర్ ఘటనకు ముందు ఖైబర్ ఫంక్తున్వా ప్రావిన్స్ డేరా ఇస్మాయిల్ ఖాన్ జిల్లాలో భద్రతా సిబ్బంది లక్ష్యంగా జరిగిన పేలుళ్లలో ఒక సైనికుడు చనిపోగా మరో అయిదుగురు గాయాలపాలయ్యారు. -
రెండు వేర్వేరు ప్రమాదాల్లో 23 మంది మృతి
ఇస్లామాబాద్: పాకిస్తాన్లో రెండు వేర్వేరు ప్రమాదాల్లో దాదాపు 23 మంది మృత్యువాత పడ్డారు. ఈ ప్రమాదాలు పంజాబ్ సరిహద్దు ప్రాంతమైన మియాన్వాలీ ప్రాంతం హర్లోని మౌర్, నీలం వ్యాలీలో బుధవారం చోటుచేసుకున్నాయి. అతివేగంగా వెళుతున్న ప్రయాణికుల బస్సు ఒకటి బోల్తా కొట్టింది. బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా 18 మంది అక్కడిక్కడే మృతిచెందగా 30 మంది తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన క్షతగాత్రుల పరిస్థితి విషమంగా ఉండటంతో వారిని చికిత్స నిమిత్తం మియాన్వాలీ ఆస్పత్రికి తరలించినట్టు పోలీసులు తెలిపారు. పాక్ ఆక్రమిత ప్రాంతమైన కాశ్మీర్ సరిహద్దు ప్రాంతం నీలం వ్యాలీలో ఫాల్కా బ్రిడ్జిపై వేగంగా వెళ్తున్న ఓ కారు అదుపు తప్పి నదిలో పడిపోయింది. ఈ కారులో ప్రయాణిస్తున్న ఐదుగురు మృతిచెందినట్టు పోలీసులు తెలిపారు. పాకిస్తాన్లో రోడ్డు ప్రమాదాలు జరగడం సాధారణ విషయమే కానీ, నిర్లక్ష్యంగా వాహనం నడపడం, రహదారులు సరైనవి లేకపోవడంతో తరుచూ రోడ్డుప్రమాదాలు జరుగుతున్నాయని పోలీసులు చెబుతున్నారు.