breaking news
Make In India Week
-
రూ.15.2 లక్షల కోట్లు..!
♦ మేక్ ఇన్ ఇండియా వీక్లో పెట్టుబడి ప్రతిపాదనలు ఇవి... ♦ విజయవంతంగా ముగిసిన కార్యక్రమం ఇందులో అత్యధికంగా ♦ మహారాష్ట్రకు రూ. 8 లక్షల కోట్లు... ♦ డీఐపీపీ కార్యదర్శి అమితాబ్ కాంత్ వెల్లడి ముంబై: తయారీ రంగంలో భారత్ను ప్రపంచ హబ్గా తయారు చేయాలన్న సంకల్పంతో ప్రధాన మంత్రి మోదీ తలపెట్టిన మేక్ ఇన్ ఇండియా వీక్ దిగ్విజయంగా ముగిసింది. వారం రోజుల పాటు జరిగిన ఈ కార్యక్రమంలో దేశీయ, అంతర్జాతీయ ఇన్వెస్టర్ల నుంచి రూ.15.2 లక్షల కోట్ల విలువైన పెట్టుబడి ప్రతిపాదనలు వెల్లువెత్తాయని పారిశ్రామిక విధానం, ప్రోత్సాహక విభాగం(డీఐపీపీ) కార్యదర్శి అమితాబ్ కాంత్ గురువారం చెప్పారు. ‘వివిధ రంగాల కంపెనీలు పాల్గొన్న తొలి మేక్ ఇన్ ఇండియా వీక్ విజయవంతమైంది. ఈ సదస్సు ద్వారా భారత్లో పెట్టుబడులకు అత్యంత అనువైన వాతావరణం ఉందన్న నమ్మకాన్ని అంతర్జాతీయ ఇన్వెస్టర్లలో కలిగించాం. మొత్తం రూ.15.2 లక్షల కోట్ల విలువైన పెట్టుబడులకు హామీ లభించగా... ఇందులో ఆతిథ్య రాష్ట్రమైన మహారాష్ట్రకే రూ.8 లక్షల కోట్ల పెట్టుబడి ప్రతిపాదనలు వచ్చాయి. దీంతో భారత్కు మహారాష్ట్ర ఒక గేట్వేగా మారనుంది. ఇక మొత్తం పెట్టుబడి హామీల్లో 30 శాతం విదేశీ కంపెనీలకు చెందినవి. ఇప్పటికే దేశంలోని వివిధ పారిశ్రామిక, వ్యాపార రంగాల్లోకి విదేశీ పెట్టుబడులకు వీలుగా ద్వారాలు తెరిచాం. ఇప్పుడు తయారీ రంగాన్ని ఆయా రంగాలతో అనుసంధానం చేయడంపై దృషి ్టపెట్టాం. ఈ సదస్సు ఒక్క తయారీ రంగానికే పరిమితం కాదు. నవకల్పనలు, ఇన్వెస్టర్లను ఆకర్షించడం లక్ష్యంగా దీన్ని నిర్వహించాం’ అని కాంత్ వివరించారు. ప్రచారానికే రూ.100 కోట్లు! ఈ నెల 13న ప్రధాని మోదీ ప్రారంభించిన ఈ మేక్ ఇన్ ఇండియా వీక్ ప్రచారం, మార్కెటింగ్ కోసం ప్రభుత్వం దాదాపు రూ.100 కోట్ల భారీ మొత్తాన్ని వెచ్చించినట్లు అంచనా. ప్రస్తుతం స్థూల దేశీయోత్పత్తి(జీడీపీ)లో 16-17 శాతంగా ఉన్న తయారీ రంగం వాటాను రానున్న దశాబ్ద కాలంలో 25 శాతానికి చేర్చడమే లక్ష్యంగా మేక్ ఇన్ ఇండియాకు మోదీ శ్రీకారం చుట్టారు. తద్వారా లక్షల సంఖ్యలో ఉద్యోగాలను సృష్టించే అవకాశం ఉందని ప్రభుత్వం చెబుతోంది. జీడీపీలో 60 శాతం వాటా ఉన్న సేవల రంగంపైనే దేశ ఆర్థిక వ్యవస్థ చాన్నాళ్లుగా ఆధారపడుతూ వస్తున్న సంగతి తెలిసిందే. కాగా, కార్పొరేట్ ఇండియాతో పాటు అంతర్జాతీయ కంపెనీలు దీన్లో పెద్ద సంఖ్యలో పాల్గొన్నప్పటికీ... నిర్వహణలో అక్కడక్కడా కొన్ని లోటుపాట్లు దొర్లాయని కాంత్ చెప్పారు. ముఖ్యంగా డీఐపీపీ, పీఐబీతో పాటు భారతీయ పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) మధ్య సరిగ్గా సమన్వయం కుదరలేదని పేర్కొన్నారు. అంతేకాకుండా ఈశాన్య రాష్ట్రాల ప్రాతినిధ్యం కూడా స్వల్పంగానే ఉందని కాంత్ వెల్లడించారు. 2,500 విదేశీ, 8,000 దేశీ కంపెనీలు... తొలి మేక్ ఇన్ ఇండియా వీక్లో 2,500కు పైగా విదేశీ, 8,000 దేశీయ కంపెనీలు పాల్గొన్నాయి. అంతేకాకుండా 68 దేశాలకు చెందిన ప్రభుత్వ ప్రతినిధి బృందాలు, 72 దేశాలకు చెందిన వ్యాపార బృందాలు హాజరయ్యాయి. ప్రధాని మోదీ పాల్గొన్న ప్రారంభోత్సవ కార్యక్రమంలో స్వీడన్, ఫిన్లాండ్ల ప్రధాన మంత్రులతో పాటు పోలండ్ డిప్యూటీ ప్రధాని, ఇతరత్రా విదేశాంగ మంత్రులు కూడా హాజరయ్యారు. మొత్తం 17 రాష్ట్రాలు(అత్యధికంగా బీజేపీ పాలిత రాష్ట్రాలే) పాలుపంచుకున్నాయి. వారం మొత్తంలో 50కి పైగా సెమినార్లు జరిగాయి. క్యూప్రైజ్ గెలుచుకున్న ‘ఆర్క్ రోబో’ క్వాల్క్వామ్ నుంచి రూ. 2 కోట్ల నిధులు ముంబై: మేక్ ఇన్ ఇండియా కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన పోటీలో వేర్హౌస్ ఆటోమేషన్ స్టార్టప్ సంస్థ ఆర్క్ రోబో... క్యూప్రైజ్ను గెలుచుకుంది. డీఐపీపీ, చిప్ తయారీ దిగ్గజం క్వాల్కామ్ ఇంక్లు సంయుక్తంగా ఆర్క్ రోబోను గురువారం విజేతగా ప్రకటించాయి. దీంతో క్వాల్కామ్ నుంచి 3,50,000 డాలర్ల(దాదాపు రూ.2 కోట్లు) ఈక్విటీ పెట్టుబడులను ఆర్క్రోబో అందుకోనుంది. గతేడాది ప్రధాని మోదీ సిలికాన్ వ్యాలీ పర్యటన సందర్భంగా తాము భారత్లో 15 కోట్ల డాలర్ల పెట్టుబడులకు హామీనిచ్చామని.. ఇందుభాగంగానే ఈ పోటీ విజేతకు నిధులను అందిస్తున్నట్లు క్వాల్కామ్ వెంచర్స్ వైస్ ప్రెసిడెంట్ కార్తీ మాదసామి పేర్కొన్నారు. ఇండియా ఫండ్ ద్వారా ఇప్పటికి తాము మూడు కంపెనీల్లో పెట్టుబడులు పెట్టామని.. ఆర్క్రోబో నాలుగోదని ఆయన వివరించారు. ఈ పోటీ రేసులో దాదాపు 500 స్టార్టప్స్ తలపడ్డాయి. -
రూ. 15 లక్షల కోట్ల పెట్టుబడులకు హామీ!
స్వదేశంలో ఉత్పాదక రంగాన్ని ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన 'ద మేక్ ఇన్ ఇండియా వీక్' వారోత్సవాలతో దాదాపు రూ. 15 లక్షల కోట్ల పెట్టుబడులకు హామీలు వచ్చాయి. ఈ విషయాన్ని కేంద్రం తెలిపింది. మొత్తం రూ. 15,20,000 కోట్ల పెట్టుబడులకు హామీలు ఇ్చారని కేంద్ర పారిశ్రామిక విధానం, ప్రమోషన్ శాఖ తెలిపింది. వివిధ సమావేశాలకు మొత్తం 8.90 లక్షల మంది సందర్శకులు వచ్చారని, ఇక మహారాష్ట్ర దేశానికే గేట్వేగా మారుతుందని తెలిపారు. పెట్టుబడులలో దాదాపు సగానికి పైగా మహారాష్ట్ర నుంచి వచ్చినవేనని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ అన్నారు. ఈ వారోత్సవాల్లో తమ ప్రభుత్వం దాదాపు రూ. 8 లక్షల కోట్ల పెట్టుబడులకు సంబంధించి వివిధ కంపెనీలతో ఎంఓయూలు చేసుకుందని తెలిపారు. మొత్తం పెట్టుబడుల్లో 30 శాతం విదేశాల నుంచి వచ్చినవి. 2016, 2017 సంవత్సరాల్లో భారత జీడీపీ వృద్ధిరేటు దాదాపు 7.5 శాతం వద్ద స్థిరంగా ఉండొచ్చని అమెరికా ఏజెన్సీ మూడీస్ తెలిపింది. -
మేక్ ఇన్ ఇండియా వీక్లో భారీ అగ్నిప్రమాదం
- సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతుండగా వేదికకు మంటలు - సురక్షితంగా బయటపడిన వీఐపీలు, సినీతారలు, ప్రజలు - షార్ట్సర్క్యూటే ప్రమాదానికి కారణమని ప్రాథమిక నిర్ధారణ ముంబై: ముంబైలో నిర్వహిస్తున్న ‘మేక్ ఇన్ ఇండియా’ సాంస్కృతిక కార్యక్రమంలో ఆదివారం రాత్రి భారీ అగ్నిప్రమాదం జరిగింది. గిర్గాం చౌపాటి బీచ్లో సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ ప్రదర్శన పూర్తయిన కొద్దిసేపటికి మహారాష్ట్ర లావణీ జానపద నృత్యం జరుగుతుండగా వేదిక కింద మంటలు రేగాయి. రాత్రి 8.15 గంటల ప్రాంతంలో వేదిక అంటుకోగా... గాలి తీవ్రత వల్ల అవి వేగంగా వ్యాపించడంతో పూర్తిగా ఆహుతైంది. సంఘటన స్థలానికి అగ్నిమాపక శకటాలు చేరుకునేసరికి బుగ్గైంది. ఈ ప్రమాదంలో ఎవరూ గాయపడలేదని బృహన్ముంబై కార్పొరేషన్ (బీఎంసీ) విపత్తు నిరోధక అధికారులు తెలిపారు. ప్రమాద సమయంలో అక్కడే ఉన్న మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవిస్, గవర్నర్ విద్యాసాగర్ రావు, శివసేన చీఫ్ ఉద్ధవ్ఠాక్రే, అమితాబ్ బచ్చన్, ఆమిర్ఖాన్, హేమమాలిని, కత్రినా కైఫ్, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలను సురక్షితంగా బయటకు తీసుకెళ్లారు. కార్యక్రమానికి హాజరైన దాదాపు 50 వేల మంది ప్రజలు క్షేమంగా బయటపడ్డారు. తప్పించుకునేందుకు సరైన మార్గాలు ఉండడంతో ఎలాంటి తొక్కిసలాట చోటుచేసుకోలేదు. ‘ మరో గంటలో నా ప్రదర్శన ఉంది. నేను మేకప్ వ్యాన్లో ఉండగా... నా సిబ్బంది అగ్నిప్రమాదం విషయాన్ని చెప్పారు. వెళ్లిచూడగా స్టేజంతా మంటల్లో చిక్కుకుంది’ అని ఆమిర్ ఖాన్ తన ప్రత్యక్ష అనుభవాన్ని వెల్లడించారు. ప్రమాద సమయంలో పెద్ద సంఖ్యలో వ్యాపార ప్రతినిధులు, పెట్టుబడిదారులు అక్కడే ఉన్నారు. బాణ సంచా వల్ల ప్రమాదం జరిగిందని భావించినా, స్టేజ్ కింద షార్ట్ సర్క్యూట్ వల్లే సంభవించిందని పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. 16 అగ్నిమాపక శకటాలు, ఆరు వాటర్ ట్యాంకర్లు శ్రమించి మంటల్ని అదుపులోకి తెచ్చాయి. ప్రమాదంపై మహారాష్ట్ర సీఎం విచారణకు ఆదేశించారు. ఈ సంఘటన చాలా దురదృష్టకరమని, దీనివల్ల మేక్ ఇన్ ఇండియా పోగ్రాంకు ఎలాంటి ఇబ్బంది కలగదని చెప్పారు. శనివారం ప్రధాని నరేంద్రమోదీ ‘మేక్ ఇన్ ఇండియా వీక్’ కార్యక్రమాన్ని ముంబైలో ప్రారంభించిన విషయం తెలిసిందే. వందల కోట్ల డాలర్ల పెట్టుబడులు ఆకర్షించే క్రమంలో ఈ కార్యక్రమం చేపట్టారు. దాదాపు 2,500 అంతర్జాతీయ, 8 వేల దేశీయ కంపెనీలు వారం పాటు జరిగే ఈ ఎగ్జిబిషన్లో పాల్గొంటున్నాయి.