breaking news
Madhurai Bench
-
లావణ్య సూసైడ్ కేసు.. స్టాలిన్ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ!
తమిళనాడును కుదిపేసిన విద్యార్థిని లావణ్య ఆత్మహత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. కేసును సీబీఐకు అప్పగించాలన్న మద్రాస్ హైకోర్టు అభిప్రాయంతో సుప్రీం కోర్టు ఏకీభవించింది. దీంతో రాష్ట్ర పోలీసులతోనే దర్యాప్తు చేయించాలన్న డీఎంకే ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలినట్లయ్యింది. సాక్షి, న్యూఢిల్లీ: తంజావూర్ విద్యార్థిని లావణ్య(17) బలవన్మరణ ఉదంతం తమిళనాడును, సోషల్ మీడియా ద్వారా దేశం మొత్తం కుదిపేసిన విషయం తెలిసిందే. ఈ కేసును సీబీ సీఐడీ లేదంటే సమానమైన దర్యాప్తు ఏజెన్సీకి అప్పగించాలంటూ లావణ్య తండ్రి మద్రాస్ హైకోర్టు మధురై బెంచ్లో ఒక పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్తో ఏకీభవించిన జస్టిస్ జీఎస్ స్వామినాథన్.. జనవరి 1న కేసును సీబీఐకి అప్పగించాలని తీర్పు వెలువరించారు. అయితే ఈ పరిణామం అనంతరం డీజీపీ ద్వారా తమిళనాడు ప్రభుత్వం ఫిబ్రవరి 3న సుప్రీం కోర్టులో ఒక పిటిషన్(స్పెషల్ లీవ్ పిటిషన్) దాఖలు చేయించింది. దీనిపై నేడు(సోమవారం) విచారణ జరిపిన సుప్రీం కోర్టు.. మధురై బెంచ్ తీర్పును సమర్థిస్తూ తమిళనాడు డీజీపీకి, ప్రభుత్వానికి నోటీసులు పంపింది. అంతేకాదు ఇదేం ప్రెస్టీజ్ ఇష్యూ( సీబీఐకు అప్పగించడం ద్వారా రాష్ట్ర పోలీసుల ప్రతిష్టకు భంగం కలిగించే విషయమేం కాదంటూ..) కాదంటూ స్టాలిన్ ప్రభుత్వాన్ని ఉద్దేశిస్తూ కామెంట్ చేసింది బెంచ్. అంతేకాదు దర్యాప్తు కూడా హైకోర్టు ఆదేశాల ప్రకారమే జరగాలని స్పష్టం చేసింది. ఈ మేరకు జస్టిస్ సంజీవ్ ఖన్నా, బెల ఎం త్రివేది న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. మధురై బెంచ్ ఏం చెప్పిందంటే.. తంజావూర్ మైకేల్పట్టీలో నివాసం ఉండేది లావణ్య కుటుంబం. ఆత్మహత్యకు పాల్పడ్డ లావణ్య.. పదిరోజుల తర్వాత కన్నుమూసింది. స్కూల్లో మతమార్పిడి ఒత్తిళ్లతోనే తాను ఆత్మహత్యకు పాల్పడినట్లు ఆ చిన్నారి మరణవాంగ్మూలం వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ కావడం తెలిసిందే. అయితే మరో వీడియోలో చిన్నారి వార్డెన్ వేధింపుల్ని భరించలేకపోయినట్లు, పినతల్లి వేధింపులు కూడా కారణమేనని చెప్పడం సైతం వైరల్ అయ్యింది. ఈ వ్యవహారంలో బీజేపీ, తమిళనాడు ప్రభుత్వాల మధ్య రాజకీయ వాగ్వాదం సైతం చోటు చేసుకుంది. ఈ పరిణామాల నడుమే.. స్కూల్లో వేధింపుల కోణంలో కాకుండా.. మతమార్పిడి వేధింపుల కోణంలోనే దర్యాప్తు చేయించాలంటూ లావణ్య తల్లిదండ్రులు మొదటి నుంచి డిమాండ్ చేస్తూ వస్తున్నారు. అయితే విద్యాశాఖ మంత్రి అన్బిల్ మహేష్ సైతం ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోవడంతో.. రాష్ట్ర పోలీసులతో దర్యాప్తు చేయించడం సమంజసం కాదనే ఉద్దేశాన్ని వ్యక్తపరిచింది మద్రాస్ మధురై బెంచ్. అదే టైంలో ఆ వీడియోలను రికార్డు చేసిన వ్యక్తుల పాత్రపైనా అనుమానం వ్యక్తం చేస్తూనే.. ఈ మేరకు సమర్థుడైన అధికారికి అప్పగించాలంటూ సీబీఐని ఆదేశించింది. -
బ్లూ వేల్ ను బ్లాక్ చేసిన తమిళనాడు
సాక్షి, మధురై : సూసైడ్ గేమ్ గా మారి యువత ప్రాణాలు తీస్తున్న బ్లూ వేల్ ఛాలెంజ్ ను తమిళనాడు ప్రభుత్వం బ్యాన్ చేసేసింది. ప్రమాదకరంగా మారిన ఈ ఆటను ఆన్ లైన్ బ్లాక్ చేసినట్లు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్, మద్రాస్ హైకోర్టులోని మధురై బెంచ్ కు ఈ విషయాన్ని తెలియజేశారు. కోర్టు ఆదేశాలతో బ్లూ వేల్ గేమ్ ను బ్లాక్ చేశామని.. సోషల్ మీడియాలో వీటి లింకులను షేర్ చేసే వారిపై కఠిన చర్యలు తప్పవని పోలీస్ శాఖ ప్రకటించిన విషయాన్ని ప్రభుత్వం తరపున వాదనలు వినిపించిన ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ గోవిందరాజన్ బెంచ్ కు తెలిపారు. ఇక నిఘా వర్గాలు కూడా ఈ విషయంలో సమర్థవంతంగా పని చేస్తున్నాయని వివరించారు. దీంతో తదుపరి వాదనను బెంచ్ సెప్టెంబర్ 8కి వాయిదా వేసింది. మధురైకి చెందిన విఘ్నేష్ అనే యువకుడు గత నెల 30న బ్లూ వేల్ ఆటతో ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు కాగా, గేమ్ కు బానిసలై టీనేజర్లు ప్రాణాలు తీసుకోవటంపై తక్షణమే స్పందించాలంటూ మద్రాస్ హైకోర్టు మధుర బెంచ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. 50 రోజులపాటు కొనసాగే బ్లూ వేల్ ఛాలెంజ్ గేమ్ లో ప్లేయర్ కి పలు టాస్క్ లను ఇస్తారు. తనని తాను గాయపరుచుకుని, ఆ ఫోటోలను అప్ లోడ్ చేయాల్సి ఉంటుంది. చివరి లెవల్ లో భాగంగా ఆత్మహత్య చేసుకోవాలంటూ సూచనలు రావటం.. అప్పటికే ఆటకు బానిస అయ్యే గేమర్ ఆ క్రమంలో ప్రాణాలు తీసేసుకుంటుంటాడు. రష్యా నుంచి మొదలైన బ్లూ వేల్ గేమ్ భూతం ప్రపంచ వ్యాప్తంగా ఇప్పుటివరకు వందల మంది ప్రాణాలను బలి తీసుకుంది.