మట్టిలో కలిసిపోయారు!
సాక్షి, ముంబై: బావిని తవ్వే ప్రయత్నంలో ఏడుగురు కూలీలు విగత జీవులుగా మారారు. ఈ దుర్ఘటన షోలాపూర్ జిల్లా, సాంగోలా తాలూకా, వాడేగావ్ గ్రామంలో శుక్రవారం చోటుచేసుకుంది. నదీ పరీవాహక ప్రాంతంలో ఉన్న ఓ బావిని తవ్వుతుండగా పైనుంచి ఒక్కసారిగా ఇసుక, రాళ్లు లోపల ఉన్న కూలిలపై పడ్డాయి. దీంతో శిథిలాలకిందే ఇరుక్కుపోయిన ఏడుగురు కూలీలు విగతజీవులుగా మారారు. ఈ విషయంపై సాంగోలా పోలీస్ స్టేషన్ హెడ్కానిస్టేబుల్ బాబర్ ఘటనాస్థలం నుంచి ‘సాక్షి’కి ఫోన్లో అందించిన వివరాల మేరకు... మధ్యాహ్నం ఒంటి గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
సాంగోలాకు ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉన్న వాడేగావ్ గ్రామంలోని మాన్ నదీ పరీవాహక ప్రాంతంలో బావిని తవ్వే పనులను ఎటువంటి అనుమతులు లేకుండానే డాక్టర్ మధుకర్ దిఘే చేపట్టారు. ఈ పనులను ఏడుగురు కూలీలకు అప్పగించారు. పనులు ప్రారంభించిన కూలీలు సుమారు 40 అడుగుల లోతు బావిని తవ్వారు. అంతలోనే ఒక్కసారిగా పైనుంచి రాళ్లు, మట్టి పడడంతో పనులు చేస్తున్న ఏడుగురు కూలీలు మట్టిలో కూరుకుపోయారు. దీనిని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో వారు హూటహూటిన అక్కడికి చేరుకున్నారు. 10 జేసిబీల సహాయంతో వారిని రక్షించేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు.
రాత్రి ఎనిమిది గంటల సమయంలో ఓ వ్యక్తిని బయటికి తీసినా అప్పటికే అతను మృతిచెందాడు. మిగతావారిని కూడా బయటకు తీసే ప్రయత్నాలను కొనసాగించారు. అయితే మట్టిలో కూరుకుపోయిన కూలీలలో ఏ ఒక్కరూ బతికే అవకాశం లేదని పోలీసులు తెలిపారు. సంతోష్ రోడ్గే (27), అంకుష్ రోడ్గే(25), దాదా హగారే(20), /ా్ఞను హగారే(35), విలాస్ ఇంగోలే(32), దత్తా హగారే(20), నామ్దేవ్ డోయిఫోడే (25)లకు ఈ కూలీ పనులు అప్పగించినట్లు తెలిసిందన్నారు.