breaking news
Lenin Center
-
చిత్తు కాగితాలు ఏరే వారితో స్నేహం.. అనుకోకుండా వచ్చిన అవకాశంతో..
విజయవాడ లెనిన్ సెంటర్.. కాలువ ఒడ్డున వరుసకట్టిన పాత పుస్తకాల దుకాణాలు. అందులో 29వ నంబరు దుకాణం ‘ప్రాచీనాంధ్ర గ్రంథమాల’. ప్రాచీన సాహిత్యం, విజ్ఞానదాయక పుస్తకాలను గాలించేవాళ్లకు ఎడారిలో ఒయాసిస్సు ఆ దుకాణం. అరుదైన, అపురూపమైన పుస్తకాలకు చిరునామా అది. పుస్తక ప్రేమికులు కోరిన పుస్తకాన్ని గుర్తు పెట్టుకుని మరీ అప్పగించే నేస్తం ఆ దుకాణ యజమాని. దశాబ్దాలుగా పుస్తకంతో ముడిపడిన ఆయన జీవితంపై సాహిత్యాభిమానులు పనిగట్టుకుని పుస్తకం తీసుకొచ్చేందుకు పూనుకోవటం తాజా విశేషం. ఈ నేపథ్యంలో ఆయన జీవితంలో కొన్ని ఘట్టాలపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం. చదవండి: లెక్చరర్ పాడుబుద్ధి.. అధిక మార్కులు వచ్చేలా చూస్తానంటూ.. తెనాలి/గాంధీనగర్ (విజయవాడ): పుస్తకానికి సిసలైన నేస్తం ఆయన. పేరు నర్రా జగన్మోహనరావు. వయసు 69. ఉదయం 8.30 నుంచి రాత్రి 8.30 గంటల వరకు పుస్తక దుకాణంలోనే. పుస్తకాలపై పరచుకునే దుమ్మును దులుపుతూ, కొత్తగా వచ్చిన పాత పుస్తకాలను విభాగాలుగా సర్దుతూ, పాడైన వాటికి అట్టలు వేసి, పేర్లు రాస్తూ కనిపిస్తారాయన. ఏ పుస్తకం అడిగినా తీసివ్వడమే కాదు.. అందులో విశేషాలను ఏకరువు పెడతారు. మరేదైనా పుస్తకం లేదని చెప్పాల్సి వస్తే, ఆ బాధ ఆయన ముఖంలో కనిపిస్తుంది. అడిగిన అభిమాని ఫోన్ నంబరు తీసుకుని, ఆ పుస్తకం రాగానే పిలిచి మరీ అప్పగిస్తారు. కిరాణా దుకాణాల్లో పొట్లాలుగా, చెత్త యార్డుల్లో గుట్టల్లోనే అంతరించిపోయే పాత పుస్తకాలను పనిగట్టుకుని సేకరిస్తూ, వాటిని అపురూపంగా చూసుకునే వ్యక్తులకు అందిస్తున్నారు. ప్రచురణకర్తలకు అందజేసి పునర్ ముద్రణకూ దోహదపడుతున్నారు. అలవాటు ఇష్టమై.. ఆపై ప్రాణమై.. పాత పుస్తకాన్ని ఇంత ప్రాణంగా చూసుకునే జగన్మోహనరావుకు గల పఠనాసక్తి ఈ వ్యాపారానికి పురిగొల్పింది. స్వగ్రామం గన్నవరం దగ్గరి ఆత్కూరు. జీవనోపాధికని విజయవాడలో స్థిరపడ్డారు. సినిమాలు, నాటకాలంటే వల్లమాలిన ప్రేమతో చదువు ప్రాథమిక పాఠశాలతోనే ముగిసింది. సినిమా చూట్టమే కాదు.. ఈ సినిమా పాటల పుస్తకాన్ని కొని, అందులోని పాటల మాధుర్యాన్ని ఆస్వాదించటం చిన్ననాటి అలవాటు. ఓ స్నేహితుడిచ్చిన నవలను చదివాక, పుస్తకాలు చదవటం అలవాటైంది. రకరకాల పుస్తకాలను చదివేయటం, పాత పుస్తకాలను సేకరించటం వ్యసనమైంది. ఉపాధి కోసమని పెట్టిన హోటల్ వ్యాపారం దెబ్బతింది. అప్పటికి తన దగ్గర విలువైన పుస్తక సంపద పోగుపడింది. ఆర్థిక ఇబ్బందుల్లో ఆ పుస్తకాలను అమ్మేందుకని లెనిన్ సెంటరుకు వెళ్లిన జగన్మోహనరావుకు రెండు దశాబ్దాలకు పైగా అదే జీవితమైంది. చిత్తు కాగితాలు ఏరే వారితో స్నేహం.. 1998లో అనుకోకుండా వచ్చిన అవకాశంతో ఓ పాత పుస్తకాల దుకాణానికి యజమాని అయ్యారు. సొంత పుస్తకాలు ఎటూ ఉన్నాయి. మరిన్ని పుస్తకాల సేకరణకు ప్రణాళిక వేసుకున్నాడు. చిత్తుకాగితాలు ఏరేవారు, పాతపేపర్లు, పుస్తకాలు తూకానికి కొనేవారితోనే సాన్నిహిత్యం పెంచుకున్నాడు. వారు తెచ్చిన పాత పుస్తకాలకు తగిన ధరకు కొనేవాడు. సరిచేసి, చిరిగిపోతే బైండింగ్ చేసి అమ్మకానికి సిద్ధం చేయటం దినచర్యగా మారింది. పరిచయస్తుల్నుంచీ సేకరిస్తారు. ఆ విధంగా దుకాణంలో ఎప్పుడూ రూ.10 లక్షలకు పైగా విలువైన పుస్తకాలుంటాయి. అమ్మేవి అమ్ముతుంటే కొత్తగా పాత పుస్తకాలు వస్తుంటాయి. జీవితం.. అక్షరబద్ధం.. అరుదైన ముద్రణలను ఊరికే వదిలేయకుండా ప్రత్యేక భద్రతా ప్రమాణాలతో పదిలం చేయాలని కేంద్ర ప్రభుత్వానికో లేఖ రాశారు జగన్మోహనరావు. పుస్తకానికి ఆయన చేస్తున్న సేవకు గుర్తింపుగా 2010లో గ్రంథాలయ పితామహుడు అయ్యంకి వెంకటరమణయ్య, డాక్టర్ వెలగా వెంకటప్పయ్య పురస్కారంతో సత్కారం అందుకున్నారు. వీరి విశిష్ట కృషికి రికార్డు చేయాలనే భావనతో సాహితీ ప్రేమికుడు అనిల్ బత్తుల (హైదరాబాద్), జర్నలిస్ట్ అనిల్ డ్యానీ (విజయవాడ)లు జగన్మోహనరావుపై తీసుకొస్తున్న ఈ పుస్తకం త్వరలో విడుదల కానుంది సకలం లభ్యం.. ప్రాచీనాంధ్ర గ్రంథమాలలో పురాతన పుస్తకాలూ లభిస్తాయి. జాతక చింతామణి (1882), చంపూ భాగవతం (1874), మైత్రి సాత్వ, బ్రిటిష్ చరిత్ర, గోపాల్ మిత్తల్, మన తెలుగు భద్రాచల రామదాసు చరిత్రంబు (1879), తర్కశాస్త్రం (1883), మాఘమహాత్మ్యం (1889), సులక్షణసారము (1898), రఘువంశ మహాకావ్యమ్ వంటి పుస్తకాలు వీటిలో కొన్ని. విజయవాడకు వచ్చే సాహిత్యాభిమానుల్లో పలువురు ఈ దుకాణాన్ని తప్పక సందర్శిస్తారు. వీరిలో ఎన్నారైలూ ఉన్నారు. తమ రచనల కాపీలు అయిపోయిన రచయితలకు, వారి పుస్తకాన్ని ఇదే దుకాణంలో అందజేసిన సందర్భాలు ఉన్నాయి. ఎవరికైన పుస్తకాన్ని విక్రయిస్తే, వారి చిరునామా, ఫోను నంబరు, ఎలాంటి పుస్తకాలను వారు సేకరిస్తున్నారు.. ఎన్ని కొనుగోలు చేశారు.. అనే వివరాలను రాయిస్తున్నారు. వీటన్నిటికీ కలిపి ‘పుస్తక ప్రియులు–సేకరణానుభూతి’ పేరిట ఓ పుస్తకాన్ని తీసుకొచ్చారాయన. ఎప్పటి పుస్తకమైనా దొరుకుతుంది.. నగరంలో ఎక్కడా దొరకని పుస్తకాలు కూడా ఇక్కడ లభ్యమవుతాయి. ‘సనాతన హైందవ ధర్మ జ్ఞానవాహిని’, కలియుగ దైవం కార్తికేయుడు’ ఈ రెండు పుస్తకాలను వారం రోజుల కిందటే అక్కడ కొనుగోలు చేశా. ఇక్కడ ఏ పుస్తకమైనా దొరుకుతుంది. ఒకవేళ పుస్తకం అందుబాటులో లేకపోయిన టైం తీసుకుని తెప్పించి ఇస్తారు. ఇక వాస్తుకు సంబంధించి 20, 30 ఏళ్ల కిందటి పుస్తకాలు కావాలంటే ఈ షాపునకు రావాల్సిందే. – సుధాస్వామి, కృష్ణలంక, విజయవాడ -
వైఎస్సార్ కృషితో ఆ సమస్య తీరిపోయింది
సాక్షి, కృష్ణా: విజయవాడ లెనిన్ సెంటర్ సమీపంలో నూతనంగా నిర్మించిన జిల్లా ఫైర్ స్టేషన్ను రాష్ట్ర హోంమంత్రి మేకతోటి సుచరిత శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. నగరంలో కొత్తగా ఫైర్ స్టేషన్ ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. రాష్ట్రంలో మొత్తం 184 ఫైర్ స్టేషన్లు ఉన్నాయని.. ఇంకా కొన్ని ప్రాంతాల్లో ఏర్పాటు చేయాలని డిమాండ్స్ వినిపిస్తున్నట్లు ఆమె తెలిపారు. ఒకప్పుడు తాటాకు ఇల్లు ఎక్కువగా ఉండటం వల్ల అగ్నిప్రమాదాలు ఎక్కువగా జరిగేవని.. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రతి పేదవాడికి గృహ నిర్మాణం చేపట్టడంతో ఈ సమస్య చాలా వరకు తగ్గిందని హోంమంత్రి అభిప్రాయపడ్డారు. ఓఎంజీసీ వంటి గ్యాస్ ప్రాజెక్టులు ఉన్న చోట కూడా కొత్త స్టేషన్లు ఏర్పాటు చేస్తామని సుచరిత తెలిపారు. ఏదైనా ఘటన జరిగినప్పుడు సహాయసహకారాలు అందించడానికి ఫైర్ సిబ్బంది ముందుంటారని అన్నారు. పెండింగ్లో ఉన్న ఫైర్ స్టేషన్లను త్వరలోనే పూర్తి చేస్తామని సుచరిత స్పష్టం చేశారు. అలాగే సిబ్బంది సమస్యలను కూడా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి, సమస్యను పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. సిబ్బంది కొరత ఉన్న నేపథ్యంలో వాటిని కూడా త్వరలోనే భర్తీ చేస్తామన్నారు. -
విజయవాడ లెనిన్ సెంటర్లో విద్యార్థి సంఘాల ధర్నా
-
మీడియాపై దాడులను నిరసిస్తూ ధర్నా
విజయవాడ (గాంధీనగర్) : సమాచార, ప్రసార మాధ్యమాలపై మోదీ ప్రభుత్వం చేస్తున్న దాడులను నిరసిస్తూ సీపీఐ (ఎంఎల్ ) లిబరేషన్ ఆధ్వర్యంలో బుధవారం లెనిన్సెంటర్లో ధర్నా నిర్వహించారు. న్యూస్చానళ్లు, పత్రికలపై నిషేధం ఎత్తివేయాలని, వాక్ స్వాతంత్య్రంపై దాడులు ఆపాలని నినాదాలు చేశారు. పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు ఎన్.మూర్తి మాట్లాడుతూ కేంద్రంలో మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత హిందుత్వ మార్కు పాలన సాగిస్తున్నారని విమర్శించారు. ప్రశ్నించేవారిపై దాడులు జరుగుతున్నాయని, ప్రజలు అభద్రతభావంతో బతుకుతున్నారని పేర్కొన్నారు. దేశంలో అప్రకటిత ఎమర్జెన్సీ కొనసాగుతోందని చెప్పారు. ప్రభుత్వం సాగిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను ఎండగడుతున్న మీడియాపై, విలేకరులు, యాజమాన్యాలపై కేసులు బనాయిస్తున్నారన్నారు. రాష్ట్ర కార్యదర్శి బి.బంగార్రాజు, సభ్యులు హరినాథ్, గోడుగు సత్యనారాయణ, ఆర్.నాగమణి, ఎం.కుమారి, ప్రసాద్ పాల్గొన్నారు. -
ఎస్సీ వర్గీకరణ కోసం ఆందోళన
ఎస్సీ వర్గీకరణ వెంటనే చేపట్టాలని కోరుతూ ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో బుధవారం సాయంత్రం ఆందోళన చేపట్టారు. స్థానిక లెనిన్ సెంటర్లో మహాధర్నా చేపట్టిన శ్రే ణులు 4.15గంటల ప్రాంతంలో రాస్తారోకోకు దిగాయి. వర్గీకరణపై ముఖ్యమంత్రి వెంటనే ప్రకటన చేయాలని నినాదాలు చేశారు. ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు పేరుపోగు వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో ఈ నిరసన కార్యక్రమాలు జరిగాయి. -
నేడు ఉడా పాలకవర్గ సమావేశం
విజయవాడ : వీజీటీఎం ఉడా పాలకవర్గ సమావేశం శనివారం జరగనుంది. ఉడా రద్దవుతున్న నేపథ్యంలో జరుగుతుండటంతో దీనికి ప్రాధాన్యత ఏర్పడింది. నగరంలోని లెనిన్ సెంటర్లో ఉన్న ఉడా కార్యాలయంలో ఉదయం 11 గంటలకు జరగనున్న ఈ సమావేశంలో ప్రస్తుతం ఉడా నిర్వహిస్తున్న పలు అభివృద్ధి పనులు, విజయసిరి ఇతర ప్రాజెక్టులపై చర్చించనున్నారు. గతంలో ఉడా అధికారులు రూ.1,400 కోట్ల విలువైన పలు అభివృద్ధి పనులకు సంబంధించి ప్రతిపాదనలు సిద్ధం చేసి కేంద్రానికి పంపారు. కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా సానుకూలంగా స్పందన వ్యక్తమైనా ఉడా స్వరూపం మారిపోవటంతో అవి మరుగున పడిపోయాయి. ఉడా ఆదాయ వనరులు, ఆస్తులు, ఇతర విషయాలను ఈ నేపథ్యంలో చర్చించనున్నారు. సమావేశంలో ఉడా చైర్మన్ వణుకూరి శ్రీనివాసరెడ్డి, వైస్ చైర్మన్ పి.ఉషాకుమారి, ఇతర విభాగాల, నగరపాలక సంస్థ అధికారులు పాల్గొననున్నారు.