breaking news
Lalita Babar
-
స్టీపుల్చేజ్ ఫైనల్లో లలిత
-
స్టీపుల్చేజ్ ఫైనల్లో లలిత
రియో డి జనీరో: జాతీయ రికార్డును బద్దలు కొట్టిన భారత మహిళా అథ్లెట్ లలితా శివాజీ బబర్ రియో ఒలింపిక్స్లో 3000 మీటర్ల స్టీపుల్చేజ్ విభాగంలో ఫైనల్లోకి ప్రవేశించింది. శనివారం జరిగిన క్వాలిఫయింగ్లో హీట్-2లో పాల్గొన్న లలిత 9 నిమిషాల 19.76 సెకన్లలో గమ్యానికి చేరి నాలుగో స్థానంలో నిలిచింది. 9 నిమిషాల 26.55 సెకన్లతో సుధా సింగ్ పేరిట ఉన్న జాతీయ రికార్డును లలిత తిరగరాసింది. హీట్-3లో బరిలోకి దిగిన భారత్కే చెందిన మరో అథ్లెట్ సుధా సింగ్ 9 నిమిషాల 43.29 సెకన్లలో లక్ష్యానికి చేరి తొమ్మిదో స్థానంలో నిలిచింది. ఓవరాల్గా లలిత ఏడో స్థానంలో, సుధా సింగ్ 30వ స్థానంలో నిలిచారు. మొత్తం 15 మంది పాల్గొనే ఫైనల్ రేసు సోమవారం (15న) జరుగుతుంది. తాజా ఫలితంతో లలిత బబర్ ఒలింపిక్స్ అథ్లెటిక్స్ చరిత్రలో భారత్ నుంచి ఫైనల్కు చేరిన ఎనిమిదో అథ్లెట్గా గుర్తింపు పొందింది. గతంలో మిల్కా సింగ్, గుర్బచన్ సింగ్ రణ్ధావ, శ్రీరామ్ సింగ్, పీటీ ఉష, అంజూ బాబీ జార్జ్ (లాంగ్జంప్), కృష్ణ పూనియా (డిస్కస్ త్రో), వికాస్ గౌడ (డిస్కస్ త్రో) మాత్రమే భారత్ నుంచి ఫైనల్ ఈవెంట్కు అర్హత సాధించారు. హీట్స్లో ద్యుతీ చంద్ అవుట్ మహిళల 100 మీటర్ల విభాగంలో ద్యుతీ చంద్ హీట్స్లోనే వెనుదిరిగింది. హీట్-5లో పాల్గొన్న ద్యుతీ 11.69 సెకన్లలో రేసును పూర్తి చేసి ఏడో స్థానంలో నిలిచింది. పురుషుల 400 మీటర్ల విభాగంలో అనస్ హీట్-7లో పాల్గొని 45.95 సెకన్లలో గమ్యానికి చేరుకొని ఆరో స్థానంతో సరిపెట్టుకున్నాడు. పురుషుల లాంగ్జంప్లో అంకిత్ శర్మ (7.67 మీటర్లు) 12వ స్థానంలో, మహిళల 400 మీటర్ల విభాగంలో నిర్మల 44వ స్థానంలో నిలిచింది. మహిళల హాకీ జట్టుకు నిరాశ 36 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఒలింపిక్స్కు అర్హత పొందిన భారత మహిళల హాకీ జట్టు క్వార్టర్ ఫైనల్కు చేరుకోవడంలో విఫలమైంది. అర్జెంటీనాతో జరిగిన గ్రూప్ ‘బి’ చివరి లీగ్ మ్యాచ్లో భారత్ 0-5 గోల్స్ తేడాతో ఓడిపోయింది. తమ గ్రూప్లో చివరిదైన ఆరో స్థానంతో సంతృప్తి పడింది. షూటర్లకు దురదృష్టం షూటింగ్ విభాగంలో భారత్కు మళ్లీ నిరాశే మిగిలింది. పురుషుల 25 మీటర్ల ర్యాపిడ్ ఫైర్ పిస్టల్ క్వాలిఫయింగ్లో గుర్ప్రీత్ సింగ్ 581 పాయింట్లు స్కోరు చేసి ఏడో స్థానంలో నిలిచాడు. టాప్-6లో నిలిచిన వారే ఫైనల్కు చేరుతారు. పురుషుల స్కీట్ విభాగంలో మేరాజ్ అహ్మద్ ఖాన్ ‘షూట్ ఆఫ్’లో విఫలమై సెమీఫైనల్కు చేరుకోలేకపోయాడు. రోయర్ దత్తూకు 15వ స్థానం రోయింగ్లో దత్తూ బబన్ భోకనాల్ ఓవరాల్గా 15వ స్థానంలో నిలిచాడు. సింగిల్ స్కల్స్ ర్యాంకింగ్ రేసులో దత్తూ 6 నిమిషాల 54.96 సెకన్లలో గమ్యానికి చేరి అగ్రస్థానంలో నిలిచాడు. ఓటమితో ముగించిన జ్వాల జంట మహిళల బ్యాడ్మింటన్ డబుల్స్లో గుత్తా జ్వాల-అశ్విని పొన్నప్న జంట చివరిదైన మూడో మ్యాచ్లో 17-21, 15-21 తో పుట్టిటా-సప్సిరి (థాయ్లాండ్) జోడీ చేతిలో ఓడింది. -
ఫైనల్లో లలితా బాబర్
రియో ఒలింపిక్స్ అథ్లెటిక్స్ లో భారత మహిళా అథ్లెట్ లలితా బాబర్ మెరిసింది. రియోలో శనివారం సాయంత్రం జరిగిన మహిళల 3000మీటర్ల స్టీపుల్ ఛేజ్ హీట్స్ లో రాణించి ఫైనల్ కు అర్హత సాధించింది. ఈ ఈవెంట్లో నాలుగో స్థానంలో నిలిచి ఫైనల్ బెర్త్ ఖరారు చేసుకోవడం గమనార్హం. అయితే మరో భారత అథ్లెట్ సుధాసింగ్ మాత్రం ఫైనల్ చేరడంతో విఫలమైంది. ఫైనల్లోనూ లలితా బాబర్ రాణిస్తే భారత్ కు పతకం దక్కుతుంది. -
రియో ఒలింపిక్స్కు సుధా సింగ్ అర్హత
న్యూఢిల్లీ: భారత అగ్రశ్రేణి అథ్లెట్ సుధా సింగ్ రియో ఒలింపిక్స్కు అర్హత సాధించింది. ఫెడరేషన్ కప్ అథ్లెటిక్స్ మీట్లో ఉత్తరప్రదేశ్కు చెందిన సుధా 3000 మీటర్ల స్టీపుల్చేజ్ ఈవెంట్లో 9ని:31.86 సెకన్లలో గమ్యానికి చేరి రజత పతకం సాధించింది. ఈ క్రమంలో ఆమె ‘రియో’ అర్హత ప్రమాణాన్ని (9ని:45.00 సెకన్లు) అందుకుంది. ఈ మీట్లో సుధా రియోకు అర్హత పొందగా... 9ని:27.09 సెకన్లతో స్వర్ణం నెగ్గిన లలితా బాబర్ (మహారాష్ర్ట) గతంలోనే రియో బెర్త్ను దక్కించుకుంది. -
'వరల్డ్ అథ్లెటిక్స్' ఫైనల్స్లోకి లలితా బాబర్
చైనా రాజధాని బీజింగ్లో జరుగుతున్న 15వ వరల్డ్ అథ్లెటిక్స్ చాంపియన్షిప్స్లో భారత అథ్లెట్లు ఉత్తమ ప్రతిభను కనబరుస్తున్నారు. సోమవారం ఉదయం జరిగిన 3 వేల మీటర్ల స్టీఫెల్చేజ్ ఈవెంట్లో స్టార్ అథ్లెట్ లలితా బాబర్ జాతీయ రికార్డును బద్దలుకొట్టి ఫైనల్స్లోకి ప్రవేశించారు. ఈ పోటీలో నాలుగో స్థానంలో నిలిచిన లిలత.. 9:27:86 నిమిషాల్లో లూప్స్ను పూర్తిచేశారు. ఈరోజు సాయంత్రం 6:45 (భారత కాలమానం ప్రకారం) గంటలకు ఫైనల్స్ పోటీలు ప్రారంభమవుతాయి. ఆదివారం జరిగిన షాట్పుట్ త్రో ఫైనల్స్లో మన అథ్లెట్ ఇందర్జీత్ సింగ్ నిరాశపర్చినప్పటికీ, పాల్గొన్న మొదటి వరల్డ్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్ లోనే ఫైనల్స్కు చేరుకున్న మొట్టమొదటి భారత షాట్ పుటర్ గా ఆయన చరిత్ర సృష్టించారు. 20 కిలోమీటర్ల రేస్ వాక్ ఈవెంట్ లో భారత అథ్లెట్ బల్జీందర్ సింగ్ 12 వస్థానంలో నిలవడం కూడా విశేషమే.