నేడు, రేపు ‘జేఈఈ’ ఆన్లైన్ పరీక్ష
హాజరుకానున్న 25 వేల మంది విద్యార్థులు
సాక్షి, హైదరాబాద్: ఎన్ఐటీ, ట్రిపుల్ఐటీ, కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సహకారంతో కొనసాగే జాతీయ స్థాయి ప్రైవేటు సాంకేతిక విద్యా సంస్థల్లో ప్రవేశాల కోసం ఈ నెల 8, 9 తేదీల్లో ఆన్లైన్లో జేఈఈ మెయిన్ పరీక్షను నిర్వహించేందుకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) చర్యలు చేపట్టింది. తెలంగాణలోని హైదరాబాద్, ఖమ్మం, వరంగల్ కేంద్రాలతోపాటు ఏపీలోని గుంటూరు, విజయవాడ, విశాఖపట్టణం, తిరుపతి కేంద్రాల్లో నిర్వహించే ఈ పరీక్షలకు దాదాపు 25 వేల మంది విద్యార్థులు హాజరుకానున్నారు. రెండు రోజులపాటు రోజుకు రెండు విడతలుగా ఈ పరీక్షలను సీబీఎస్ఈ నిర్వహించనుంది.
ఉదయం 9:30 గంటలకు ప్రారంభం అయ్యే పరీక్ష మధ్యాహ్నం 12:30 గంటల వరకు కొనసాగనుంది. మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభం అయ్యే పరీక్ష సాయంత్రం 5 గంటల వరకు ఉంటుంది. ఉదయం నిర్వహించే పరీక్షకు ఉదయం 7 గంటల నుంచే పరీక్ష కేంద్రంలోకి అనుమతిస్తారు. నిర్ణీత పరీక్ష ప్రారంభం సమయం తర్వాత ఒక్క నిమిషం ఆలస్యమైనా అనుమతించబోరు. మధ్యాహ్నం పరీక్షకు విద్యార్థులను ఒంటిగంట నుంచి పరీక్ష కేంద్రంలోని అనుమతిస్తారు. ఈ పరీక్షల ఫలితాలను ఈ నెల 27న వెల్లడిస్తారు. కాగా, ఈ నెల 2న ఆఫ్లైన్లో జేఈఈ మెయిన్ పరీక్షను నిర్వహించిన విషయం తెలిసిందే.