breaking news
Janmabhoomi - Maa Vooru program
-
ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూపై కిర్లంపూడి పీఎస్లో దళితుల ఫిర్యాదు
-
ఎమ్మెల్యేపై దళితుల ఫిర్యాదు
సాక్షి, తూర్పు గోదావరి: టీడీపీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూపై కిర్లంపూడి పోలీస్ స్టేషన్లో రాజుపాలెం గ్రామ దళితులు ఫిర్యాదు చేశారు. గురువారం రాజుపాలెం గ్రామంలో జరిగిన జన్మభూమి సభలో ఎమ్మెల్యే తమను అవమానించారని, తమ మనోభావాలను కించపరిచేలా దూషించారని వారు ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. జన్మభూమి సభలో భాగంగా తమ గ్రామంలో జరిగిన అవినీతిపై విచారణ జరిపించాలని కోరినందుకు.. పోలీసులకు తమను సభ నుంచి గెంటేయాలని ఎమ్మెల్యే సూచించారని వారు మండిపడ్డారు. దళితులమనే చిన్న చూపుతోనే ఎమ్మెల్యే నెహ్రూ తన అగ్రకుల అహంకారం చూపించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేయాలని రాజుపాలెం దళితులు డిమాండ్ చేస్తున్నారు. ఇక రాష్ట్రవ్యాప్తంగా జన్మభూమి సభల్లో టీడీపీ ప్రభుత్వ తీరుపట్ల నిరసన గళాలు వినిపిస్తునే ఉన్నాయి. సమస్యలపై ప్రశ్నించిన వారిని అడుగడుగునా టీడీపీ నాయకులు ఇబ్బందులకు, అవమానాలకు గురిచేస్తున్న విషయం తెలిసిందే. -
సీఎం చేతుల మీదుగా ప్రారంభం..
సాక్షి ప్రతినిధి, ఏలూరు : అనంతపల్లి నుంచి నందమూరు వరకూ రూ. 143 కోట్లతో యర్రకాల్వ ఆధునీకరణ పనులకు, తాళ్లపూడి మండలానికి నీటిశుద్ది ప్లాంట్కు పైప్లైన్ నిర్మాణం కోసం, వేగేశ్వరపురం ఎత్తిపోతల పథకం పునరుద్ధరణ పనులకు సోమవారం మధ్యాహ్నం తాళ్లపూడిలో జరిగిన జన్మభూమి మా ఊరు కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రారంభోత్సవం చేశారు. ఆయన వెళ్లిన గంటకే అక్కడ ఏర్పాటు చేసిన శిలాఫలకాలను అధికారులు తొలగించడంతో శిలాఫలకాల కోసం ఏర్పాటు చేసిన దిమ్మ బోసిపోయినట్లయింది. విషయం ఏమిటంటే ఆ మూడు పథకాలు... మూడు చోట్ల ఉన్నాయి. ముఖ్యమంత్రి ఆ మూడు చోట్లకు వచ్చే అవకాశం లేకపోవడంతో జన్మభూమి ప్రాంగణంలోనే మూడు శిలాఫపకాలు ఏర్పాటు చేసి సీఎం చేత ప్రారంభోత్సవం చేయించారు. ఆ తర్వాత ఆ శిలాఫలకాలను ఆయా పథకాల వద్ద ఏర్పాటు చేసేందుకు తొలగించారు. విషయం తెలియని జనం దీనిపై చర్చించుకోవడం కనిపించింది. -
సర్కారీ స్కూళ్లకు ‘జన్మభూమి’ సంకెళ్లు
సాక్షి, అమరావతి: ఇంటర్మీడియెట్ విద్యార్ధులకు ఫిబ్రవరి ఒకటి నుంచి ప్రాక్టికల్స్, 28 నుంచి పబ్లిక్ పరీక్షలు.. జేఈఈ, ఎంసెట్తో సహా అనేక పోటీ పరీక్షలకు ప్రిపేరవ్వాల్సిన తరుణం.. పాఠశాలల్లోనూ సిలబస్లో అతి ముఖ్యమైన చాప్టర్లపై బోధన, పబ్లిక్ పరీక్షల కోసం సాధన జరిగే సమయం... ఇలాంటి కీలకమైన సమయంలో రాష్ట్ర ప్రభుత్వం పదిరోజులపాటు అటు ఉపాధ్యాయులను, విద్యార్థులను చదువుకు దూరం చేస్తుండడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జన్మభూమి – మావూరు కార్యక్రమంలో వీరిని బలవంతంగా భాగస్వాములను చేయడం, అనేక బరువు బాధ్యతలు మోపడంపై విస్మయం వ్యక్తమవుతోంది. ప్రజల సమస్యలను పరిష్కరించే పేరుతో నిర్వహిస్తున్న జన్మభూమి కార్యక్రమం వల్ల ఆ సమస్యలు పరిష్కారం కాకపోవడమే కాక విద్యార్థులకు, ఉపాధ్యాయులకు ఈ కార్యక్రమం పెద్ద సమస్యగా మారడంపై విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. అయితే రాష్ట్రప్రభుత్వం మాత్రం ప్రభుత్వ విద్యాసంస్థల్లోని విద్యార్ధుల చదువులు ఎలా పోయినా ఫర్వాలేదు, ప్రయివేటు కార్పొరేట్ సంస్థల విద్యార్ధులకు మాత్రం ఎలాంటి నష్టం వాటిల్లకూడదు అన్నట్లుగా వ్యవహరిస్తోంది. బోధనేతర కార్యక్రమాల్లో టీచర్లు, విద్యార్ధులను భాగస్వాములను చేయరాదని విద్యాహక్కు చట్టం స్పష్టంగా పేర్కొన్నా ప్రభుత్వం మాత్రం అందుకు భిన్నంగా ఏడాది పొడవునా పలు కార్యక్రమాలకు ప్రభుత్వ టీచర్లు, విద్యార్ధులను తరలిస్తోంది. మంగళవారం నుంచి ప్రారంభమైన జన్మభూమిలో టీచర్లు, విద్యార్ధులను భాగస్వాములను చేయాలని స్వయంగా ముఖ్యమంత్రి కార్యాలయమే ఆదేశాలు జారీచేయడం గమనార్హం. ప్రభుత్వ టీచర్లు, విద్యార్ధులకు ముఖ్యమంత్రి అప్పగించిన పనులివే... ⇔ ప్రతి గ్రామంలో, మున్సిపల్ వార్డులో నోడల్ ఆఫీసర్లుగా టీచర్లను నియమించాలి. గ్రామంలో ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు నోడల్ ఆఫీసరు అవుతారు. ⇔ నోడల్ ఆఫీసర్ మున్సిపల్, వార్డు అభివృద్ధి ప్లాన్ను అమలు చేయాలి. ⇔ గ్రామ, మున్సిపల్ వార్డు డెవలప్మెంటు ప్లాన్లో 2014–15 నుంచి 2017–18 వరకు పాఠశాల అభివృద్ధికి సంబంధించిన అంశాలను నమోదు చేయాలి. ⇔ 2017–18కి సంబంధించిన గ్రామ, వార్డు అభివృద్ధి ప్లాన్ను విడిగా తయారు చేసుకోవాలి. 2018–19, 2019–20 లకు విద్యాపరమైన లక్ష్యాలను తయారు చేసుకోవాలి. ⇔ గడచిన మూడేళ్లలో వివిధ ప్రభుత్వ పధకాల ద్వారా పాఠశాలకు అందించిన నిధులు, మౌలిక వసతుల ఏర్పాటుకు సంబంధించిన పూర్తి వివరాలతో నివేదికను రూపొందించాలి. ⇔ పాఠశాల అకడమిక్కు సంబంధించిన నివేదిక రూపొందించుకోవాలి. పాఠశాల అకడమిక్ మరియు అభివృద్ధి గురించి ఫ్లెక్సీలు వేయించి గ్రామంలో జన్మభూమి జరిగే ప్రదేశంలో, పాఠశాల వద్ద ప్రదర్శించాలి. ⇔ ప్రతి రోజు గ్రామంలో నోడల్ ఆఫీసరు తమ పాఠశాలలో ఆరోజు జన్మభూమికి సంబంధించిన అంశంపై విద్యార్ధులకు వ్యాస, మౌఖిక, ఉపన్యాస, చర్చ పోటీలు నిర్వహించాలి. అదేవిధంగా పి.ఇ.టి.సహాయంతో క్రీడలను నిర్వహించాలి. ⇔ ప్రతి రోజూ ఉపాధ్యాయులు, విద్యార్థులు జన్మభూమిలో ఆరోజుకు సంబంధించిన అంశంపై గ్రామస్తులకు అవగాహన కల్పించాలి. ⇔ ప్రతి రోజు గ్రామంలో చేపట్టిన కార్యక్రమాలపై డాక్యుమెంటేషన్, ఫోటోలను మధ్యాహ్నం 3 గంటలలోపు సంబంధిత మండల విద్యాశాఖాధికారి కార్యాలయానికి పంపాలి. ⇔ ఈనెల 5న జన్మభూమి కార్యక్రమంలో ప్రత్యేకించి విద్యాశాఖ కార్యక్రమాన్ని నిర్వహించాలి. ఉదయం ర్యాలీ నిర్వహించాలి. తరువాత 15 నిమిషాలు ముఖ్యమంత్రి ఉపన్యాసం ఉంటుంది. తదుపరి కూచిపూడి, భరత నాట్యం, జానపద నృత్యం వంటి జానపద కళలను ప్రదర్శించాలి. పిల్లలు తయారు చేసిన బొమ్మలు, సైన్సు ప్రయోగాలు ప్రదర్శించాలి. ⇔ జన్మభూమి రోజుల్లో విద్యార్ధులు గ్రామాల్లో మరుగుదొడ్ల నిర్మాణంపై సర్వే చేయాలి. ⇔ మండల, పంచాయతీ స్థాయిలో 5కె రన్ను నిర్వహించాలి. విద్యార్థులంతా పాల్గొనేలా చర్యలు తీసుకోవాలి. ప్రయివేటు కార్పొరేట్ సంస్థలకు మినహాయింపు.. ప్రభుత్వ విద్యాసంస్థల టీచర్లు, విద్యార్ధులను జన్మభూమిలో తప్పనిసరిగా భాగస్వాములను చేయాలని ఆదేశాలు ఇచ్చిన రాష్ట్రప్రభుత్వం అదే సమయంలో ప్రయివేటు కార్పొరేట్ సంస్థలను పూర్తిగా మినహాయించింది. ఆయా విద్యాసంస్థల్లో బోధనాభ్యసన కార్యక్రమాలకు ఎలాంటి ఇబ్బంది ఉండకూడదన్నట్లు వ్యవహరిస్తోంది. జేఈఈ, ఎంసెట్తో సహా అనేక పోటీ పరీక్షలకు ప్రిపేరయ్యే సమయంలో ఇంటర్మీడియెట్ విద్యార్థులను సైతం ఈ జన్మభూమికి తరలించేలా ఇంటర్మీడియెట్ బోర్డు ద్వారా ఆదేశాలు జారీ చేయించింది. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రభుత్వ పాఠశాలల టీచర్లు, విద్యార్ధులను అనేక బోధనేతర కార్యక్రమాల్లో వినియోగిస్తోంది. దోమలపై దండయాత్ర, పుష్కరాల్లో సేవలు, మరుగుదొడ్ల నిర్మాణం పర్యవేక్షణ ఇలా ప్రతి కార్యక్రమానికి విద్యార్ధులను, టీచర్లను తరలిస్తోంది. ఇక ఆయా ప్రాంతాలకు సీఎంతో సహ ముఖ్యులు ఎవరు వచ్చినా వారికి స్వాగతం కోసం విద్యార్ధులను తరలిస్తున్నారు. పాఠశాలలా మీ ప్రచారవేదికలా? జన్మభూమి నోడల్ ఆఫీసర్లుగా, గ్రామ కోఆర్డినేటర్లుగా టీచర్లను నియమించడం సరైనది కాదు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇటీవలి కాలంలో ప్రభుత్వంలోని వారికి పాఠశాలలను తమ ప్రచార వేదికలుగా మార్చేయడం అలవాటుగా మారింది. దోమల దండయాత్ర నుంచి గ్రామాల్లో మరుగొదొడ్లు కడిగే దాకా అన్ని పనులకూ విద్యార్ధులు, టీచర్లను వీధుల్లో తిప్పుతున్నారు. గ్రామాల్లో అనేక శాఖల ఉద్యోగులు ఉండగా టీచర్లను నియమించడం ఏమిటి? ప్రతిరోజూ ర్యాలీల పేరుతో విద్యార్ధులను బయటి తిప్పితే వారి చదువులు ఏం కావాలి? –యూటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.బాబుల్రెడ్డి నెలకు పదిరోజులు వీధుల్లోనే విద్యార్థులు జన్మభూమిలో టీచర్లు, విద్యార్ధులను భాగస్వామ్య చేయడం సరికాదు. రోజూ ఏదో ఒక కార్యక్రమం చేయాలని చెబుతున్నారు. పిల్లలను ర్యాలీగా ఆయా గ్రామసభలకు తీసుకురావాలంటున్నారు. వారికి చదువు లేకుండా చేస్తున్నారు. నెలరోజులుగా టాయిలెట్లు పరిశీలన అని విద్యార్థులను గ్రామాల్లో ఇంటింటికీ తిప్పారు. ప్రతి నెలలో పది రోజులు ఈ బోధనేతర పనులతోనే సరిపోతోంది. ఇక పిల్లలకు చదువులెప్పుడు? –పాండురంగవరప్రసాద్ ఏపీటీఎఫ్ ప్రధాన కార్యదర్శి టీచర్లకు బోధనేతర బాధ్యతలు టీచర్లను స్కూళ్లు వదిలి గ్రామసభల్లో ఉండాలంటున్నారు. గ్రామ పంచాయతీ బాధ్యతలు అప్పగించారు. మండలం స్థాయిలో ఏర్పాటయ్యే అధికారుల బృందాలకు సహాయకులుగా టీచర్లను నియమిస్తున్నారు. జన్మభూమి నిర్వహణ బాధ్యతలు పెడుతున్నారు. పది రోజులు స్కూళ్లను వదిలి గ్రామ సభల్లో పాల్గొనాలి. ఆ గ్రామ సభల ఇన్ఛార్జి బాధ్యతలను పెట్టడం అన్యాయం. జన్మభూమి పేరిట ప్రభుత్వానికి నివేదికలు, ఇతర సన్నాహాల కోసం రాత్రి పది వరకు టీచర్లు నానా యాతనలు పడుతున్నారు. ––శ్రీనివాసరాజు, పీఆర్టీయూ ప్రధాన కార్యదర్శి పరీక్షల సమయంలో ఇదేం తీరు? ఇంటర్మీడియెట్తో సహ ప్రభుత్వ విద్యాసంస్థల్లో చదువుతున్న విద్యార్ధులను జన్మభూమి కార్యక్రమంలో భాగస్వాముల్ని చేయడం సరికాదు. ఇంటర్మీడియెట్ విద్యార్ధులకు ఫిబ్రవరి ఒకటి నుంచి ప్రాక్టికల్స్, 28 నుంచి పరీక్షలు జరగనున్నాయి. పరీక్షలు దగ్గర పడుతున్న సమయంలో విద్యార్ధులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. ప్రయివేటు కార్పొరేట్ కాలేజీల్లోని విద్యార్ధులను జన్మభూమిలో ఎందుకు భాగస్వామ్యం చేయడం లేదు? ––రవిచంద్ర, పీడీఎస్యూ రాష్ట్ర అధ్యక్షుడు -
కాలువల నగరంగా అమరావతి
* బీచ్-కొండల నగరంగా విశాఖ.. సరస్సుల నగరంగా తిరుపతి * మహా నగరాలుగా మూడు నగరాలు * తిరుపతి ‘జన్మభూమి-మా ఊరు’లో సీఎం చంద్రబాబు వెల్లడి సాక్షి, చిత్తూరు: అమరావతి, విశాఖపట్నం, తిరుపతి నగరాలను మహా నగరాలుగా తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. చిత్తూరు జిల్లా తిరుపతిలోని నెహ్రూ మున్సిపల్ ఉన్నత పాఠశాల మైదానంలో గురువారం ‘జన్మభూమి-మా ఊరు’ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... రాజధాని అమరావతిని కాలువల నగరంగా, విశాఖపట్నాన్ని బీచ్-కొండల నగరంగా, తిరుపతిని సరస్సుల నగరంగా తీర్చిదిద్దుతామని చెప్పారు. ఈ మూడు నగరాలను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామన్నారు. గోదావరి నీటితో ఏపీని కరువు రహిత రాష్ట్రంగా మారుస్తామని ప్రకటించారు. గాలేరు-నగరికి శ్రీశైలం నుంచి నీళ్లు తెచ్చేందుకు త్వరలోనే కోడూరు టన్నెల్ పనులు పూర్తి చేస్తామని పేర్కొన్నారు. సోమశిల-స్వర్ణముఖి పనులను సైతం త్వరలో పూర్తి చేస్తామన్నారు. ప్రజా రాజధానిగా అమరావతి.. క్రిస్మస్, రంజాన్, సంక్రాంతి పండగకు ఉచితంగా సరుకులు ఇచ్చి అందరిచేత నెయ్యి అన్నం తినిపిస్తున్నామని చంద్రబాబు తెలిపారు. విశాఖ-చెన్నై, బెంగళూరు- చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటు కానున్నట్లు తెలిపారు. జన్మభూమి కార్యక్రమాన్ని అడ్డుకొనే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. 2022 నాటికి దేశంలో అభివృద్ధి చెందిన మూడు రాష్ట్రాల్లో ఒకటిగా ఆంధ్రప్రదేశ్ ఉంటుందని, 2029 నాటికి దేశంలోనే నంబర్వన్రాష్ట్రంగా మారుతుందని, 2050 నాటికి ప్రపంచంలోనే అతిపెద్ద రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఉంటుందని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. అమరావతిని ప్రజా రాజధానిగా నిర్మిస్తున్నామని, అందుకే స్వచ్ఛందంగా విరాళాలు ఇవ్వాలని కోరామన్నారు. కొందరు కోర్టుకెళ్లి తాము తప్పుడు పనుల చేస్తున్నట్లు ప్రచారం చేస్తున్నారని దుయ్యబట్టారు.