breaking news
JAC meetings
-
నియంతలా వ్యవహరిస్తే పతనమే..!
సాక్షి, హైదరాబాద్ : సీఎం కేసీఆర్ ప్రవర్తన నిజాంను తలపిస్తోందని మాజీ మంత్రి మోత్కుపల్లి అన్నారు. సుందరయ్య విజ్ఞాన భవన్లో ఆర్టీసీ కార్మికుల ఐకాస, విపక్షనేతల సమావేశం జరిగింది. కార్యక్రమం అనంతరం మాజీ మంత్రి మోత్కుపల్లి మాట్లాడుతూ.. తెలంగాణలో ఇంటికో ఉద్యోగం ఇస్తానని కేసీఆర్ రాష్ట్ర ప్రజలను ఇప్పటికే మోసం చేశాడని చెప్పారు. ఆర్టీసీ కార్మికులను సెల్ఫ్ డిస్మిస్ అనడానికి కేసీఆర్కు అర్హత లేదన్నారు. ఆర్టీసీ కార్మికులపట్ల కేసీఆర్ వ్యవహరిస్తున తీరు దుర్మార్గమరైనదన్నారు. ఆర్టీసీ ఆస్తులను అమ్మి సొంత ఆస్తులు పెంచుకొనే పనిలో కేసీఆర్ పడ్డాడని ఆరోపించారు. కేసీఆర్ ఓ నియంతలా వ్యవహరిస్తున్నారని, ఆయనను ఎదుర్కొనేందుకు రాజకీయపార్టీలనీ ఏకతాటిపైకి రావాల్సిన అవసరం ఉందన్నారు. ఈ సందర్భంగా ఆర్టీసీ సమ్మెపై స్పందించినందుకు గవర్నర్కు ధన్యవాదాలు తెలిపారు. టీజేఎస్ చీఫ్ కోదండరామ్ మాట్లాడుతూ.. హైకోర్టు తీర్పును సీఎం కేసీఆర్ గౌరవించి ఆర్టీసీ కార్మికులను వెంటనే చర్చలకు పిలవాలని అన్నారు. ఆర్టీసీ కార్మికులకు అండగా విపక్షాలు చేపట్టే నిరసన కార్యక్రమాల్లో అందరూ క్రియాశీలకంగా పాల్గొని, ఆర్టీసీని కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వం సానుకూలంగా స్పందించకపోతే రేపటి నుంచి సమ్మెను మరింత ఉదృతం చేస్తామని తెలిపారు. బీజేపీ నేత జితేందర్ రెడ్డి మాట్లాడుతూ.. ఆర్టీసీని రక్షించుకోవాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. కేసీఆర్ ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా ఆర్టీసీ కార్మికులకు జీతాలు ఇవ్వాలన్నారు. ఆర్టీసీ కార్మికుల సమ్మెకు, జేఏసీ తలపెట్టిన నిరసన కార్యక్రమాలకు భారతీయ జనతా పార్టీ సంపూర్ణ మద్దతుంటుందని తెలిపారు. తెలంగాణ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు రమణ మాట్లాడుతూ.. 65 నెలల కేసీఆర్ పాలనలో లక్షల కోట్లు అప్పులు తెచ్చుకున్నా.. ఆర్టీసీ అప్పులు మాత్రం చెల్లించలేక పోయారని విమర్శించారు. ఆర్టీసీ కార్మికుల ఆత్మహత్యలన్నీ ప్రభుత్వం చేసిన హత్యలేనని రమణ ఆరోపించారు. 65 నెలల కేసీఆర్ పాలనలో అప్పులపై శ్వేతపత్రం విడుదల చేయాలని టీడీపీ అధ్యక్షుడు రమణ డిమాండ్ చేశారు. కాంగ్రెస్నేత వీహెచ్ మాట్లాడుతూ.. ఆర్టీసీ కార్మికుల నిరసన కార్యక్రమాలకు కాంగ్రెస్ పార్టీ సంపూర్ణంగా మద్దతిస్తుందన్నారు. ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కారమయ్యే చివరి క్షణం వరకు కార్మికులకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. -
ప్రజా సమస్యలపై పోరాటం చేస్తాం
కలిసి వచ్చే శక్తులను కలుపుకొని వెళ్తాం: కోదండరాం ♦ ప్రభుత్వ పనితీరును గమనిస్తాం ♦ తెలంగాణ వచ్చాక జేఏసీ అక్కర్లేదనడం సరికాదు ♦ ఉద్యోగ జేఏసీ ఎందుకు బయటకు వెళ్లిందో తెలియదు ♦ వచ్చేవారం స్టీరింగ్ కమిటీ సమావేశం నిర్వహిస్తామని వెల్లడి సాక్షి, హైదరాబాద్: ‘‘తెలంగాణ ప్రజల కోసం, రాష్ట్రాభివృద్ధి కోసం ప్రజా సమస్యలపై టీజేఏసీ పోరాటం కొనసాగుతుంది. రాష్ట్రం కోసమే ఏర్పాటైన జేఏసీ.. ఇక రాష్ట్రం వచ్చిన తర్వాత ఎందుకంటున్నారు. ఇది సరైనది కాదు. ప్రత్యేక రాష్ట్రం రాగానే బాధ్యత తీరిపోదన్నది నా అభిప్రాయం. ప్రభుత్వ పనితీరును గమనిస్తూ.. ప్రజా సమస్యలపై అధ్యయనం చేయడం, పోరాడడం జేఏసీ బాధ్యత..’’ అని తెలంగాణ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం స్పష్టంచేశారు. టీజేఏసీ కార్యాలయంలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. అంతకుముందు అందుబాటులో ఉన్న జేఏసీ ముఖ్యులతో అత్యవసర సమావేశం నిర్వహించారు. ఆ తర్వాత ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. వచ్చేవారం జేఏసీ స్టీరింగ్ కమిటీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహిస్తామని, అందులో నిర్ణయాలు తీసుకుంటామని చెప్పారు. జేఏసీ నుంచి ఎంత మంది వెళ్లిపోయినా కొత్తగా కలిసి వచ్చే శక్తులతో కలిసి పనిచేస్తామని పేర్కొన్నారు. కరువు అధ్యయనం కోసం జిల్లాల పర్యటనలు చేస్తున్నామని, జిల్లాల వారీగా జేఏసీ సమావేశాలు నిర్వహిస్తామని చెప్పారు. ఎందుకు వెళ్లిపోయిందో తెలియదు జేఏసీ నుంచి ఉద్యోగ సంఘాల జేఏసీ ఎందుకు బయటకు వెళ్లిపోయిందో తనకు తెలియదని, వారిపై ఎలాంటి నిందలు వేయమని కోదండరాం అన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు కాబట్టి సర్వీసు రూల్స్ అడ్డు వస్తున్నాయోమోనని వ్యాఖ్యానించారు. టీజేఏసీ రాష్ట్ర సాధన ఉద్యమానికే పరిమితం కాదని, ఈ ప్రాంత అభివృద్ధికి కృషి చేస్తుందని ప్రజలకు మాటిచ్చినట్లు గుర్తుచేశారు. ‘‘ఉద్యమమే పరిష్కారం చూపుతుందని భావించాం. ఇప్పటికీ అదే విశ్వాసంతో ఉన్నాం. పౌరులుగా, పౌర వేదికగా స్పందించాల్సి ఉంటుంది. జేఏసీ మేనిఫెస్టోలో అనేక కార్యక్రమాలు, దృక్పథాలున్నాయి. వాటి అమలు కోసం కార్యాచరణ కొనసాగుతుంది’’ అని అన్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత జేఏసీకి బాధ్యత ఇంకా ఎక్కువగా ఉంటుందని ప్రొఫెసర్ జయశంకర్ సార్ ఎపుడూ చెబుతుండే వారని, ఆయన సూచన మేరకు పనిచే స్తామన్నారు. సమస్యలపై అధ్యయనం చేస్తాం, పరిష్కారాలు తెలుసుకుంటాం, ప్రభుత్వానికి సూచనలు చేస్తామని చెప్పారు. గతంలో నిర్ణయించుకున్న మేరకు బడ్జెట్పై చర్చిస్తామని, కరువు ప్రాంతాల్లో పర్యటనలు చేస్తామని పేర్కొన్నారు. తమది రాజకీయ పార్టీలతో ఉన్న సంఘం కాదని, ప్రజా సంఘంగానే ఉన్నామని వ్యాఖ్యానించారు. ఉద్యోగులకు వేతన బకాయిలు అందలేదని, హెల్త్ కార్డులు, ఉద్యోగుల విభజన వంటి సమస్యలు ఉన్నాయన్నారు. వారి పోరాటాల్లో కచ్చితంగా ఉద్యోగుల వెంట ఉంటామని ప్రకటించారు. సెక్షన్-8పై ఏపీ తీర్మానం హాస్యాస్పదం సెక్షన్-8పై ఏపీ అసెంబ్లీ తీర్మాణం చేయడం హాస్యాస్పదమని కోదండరాం అన్నారు. అసెంబ్లీ అంటే తమకు గౌరవం ఉందని, అయితే సుషుప్తావస్థలో ఉన్న అంశాన్ని తెరపైకి తెస్తున్నారని అన్నారు. శాంతి భద్రతలు, ప్రజల స్వేచ్ఛ, ఆస్తులకు భంగం కలిగినప్పుడే సెక్షన్-8 అవసరం అవుతుందన్నారు. అవగాహన లే కుండా తీర్మానం చేశారని చెప్పారు. ఒక రాష్ట్రంపై ఇంకో రాష్ట్రం ఆధిపత్యం కోరడం కరెక్టు కాదని, రాజ్యాంగానికి వ్యతిరేకమని, సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధమని పేర్కొన్నారు. విలేకరుల సమావేశంలో జేఏసీ నేతలు ప్రహల్లాద్, రఘు, వెంక ట్రెడ్డి, పిట్టల రవీందర్, ప్రకాశ్ తదితరులు పాల్గొన్నారు. జేఏసీ నుంచి మరో రెండు సంఘాలు బయటకు.. తెలంగాణ జేఏసీ నుంచి మరో రెండు సంఘాలు బయటకు వచ్చాయి. టీజేఏసీ నుంచి బయటకు వచ్చినట్లు తెలంగాణ అడ్వొకేట్స్ జేఏసీ, తెలంగాణ పారిశ్రామికవేత్తల సమాఖ్య (టీఐఎఫ్) శుక్రవారం ప్రకటించాయి. టీజేఏసీ ఏర్పాటు లక్ష్యమైన ప్రత్యేక రాష్ట్ర సాధన నెరవేరినందున తాము వైదొలుగుతున్నట్లు అడ్వొకేట్స్ జేఏసీ కన్వీనర్ రవీందర్రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఇకపై ప్రత్యేక హైకోర్టు సాధన కోసం పోరాడుతామన్నారు. రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధి కోసం ప్రభుత్వంతో కలిసి పని చేయాలని నిర్ణయించినట్లు టీఐఎఫ్ అధ్యక్షుడు సుధీర్రెడ్డి తెలిపారు.