breaking news
Indian republic day
-
Indian Republic Day 2023: చర్చలకు చక్కని వేదిక
న్యూఢిల్లీ: పెరుగుతున్న భూతాపం, పర్యావరణ మార్పు వంటి కీలక అంశాలపై చర్చకు, వాటి పరిష్కారానికి జీ20 సదస్సు సరైన వేదిక అని భారత రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము అభిప్రాయపడ్డారు. బుధవారం ఢిల్లీ నుంచి ఆమె భారత గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని తొలిసారిగా జాతినుద్దేశించి ప్రసంగించారు. ఆమె ఏమన్నారంటే... ► దశాబ్దాలుగా పలు పథకాల ద్వారా భారత దేశం సాధించిన సర్వతోముఖాభివృద్ధి, పౌరుల సృజనాత్మక ఆవిష్కరణల ఫలితంగా నేడు ప్రపంచం భారత్కు సమున్నత గౌరవం ఇస్తోంది. ► పలు దేశాల కూటములు, ప్రపంచ వేదికలపై మన జోక్యం తర్వాత దేశం పట్ల సానుకూలత పెరిగింది. ఫలితంగా దేశానికి అపార అవకాశాలు, నూతన బాధ్యతలు దక్కాయి. ► ఈ ఏడాదికి జీ20 కూటమికి అధ్యక్షత వహించడం ద్వారా మెరుగైన ప్రపంచం, భవ్య భవిష్యత్తుకు బాటలు పరిచేందుకు భారత్కు సువర్ణావకాశం దొరికింది. భారత నాయకత్వంలో ప్రపంచం మరింత సుస్థిరాభివృద్ధి సాధించగలదని గట్టిగా నమ్ముతున్నా. ► ప్రపంచ జనాభాలో మూడింట రెండు వంతులు జీ20 దేశాల్లోనే ఉంది. ప్రపంచ జీడీపీకి 85 శాతం ఈ దేశాలే సమకూరుస్తున్నాయి. భూతాపం, పర్యావరణ పెను మార్పులుసహా పుడమి ఎదుర్కొంటున్న కీలక సమస్యలపై చర్చలకు, పరిష్కారానికి జీ20 చక్కని వేదిక. ► దేశాలు ప్రత్యామ్నాయ ఇంధన వనరులపై ఎక్కువగా ఆధారపడాల్సిన తరుణమొచ్చింది. సౌర, ఎలక్ట్రిక్ విద్యుత్ సంబంధ విధాన నిర్ణయాలు అమలుచేస్తూ ఈ దిశగా వివిధ దేశాలకు భారత్ నాయకత్వ లక్షణాలను కనబరుస్తోంది. ఈ క్రమంలో సాంకేతికత బదిలీ, ఆర్థిక దన్నుతో సంపన్న దేశాలు ఆపన్న హస్తం అందించాలి. ► వివక్షాపూరిత పారిశ్రామికీకరణ విపత్తులను తెస్తుందని గాంధీజీ ఏనాడో చెప్పారు. సాంప్రదాయక జీవన విధానాల్లోని శాస్త్రీయతను అర్థంచేసుకుని పర్యావరణ అనుకూల అభివృద్దిని సాధించాలి. ► రాజ్యాంగ నిర్మాతలు చూపిన మార్గనిర్దేశక పథంలోని మనం బాధ్యతాయుతంగా నడవాలి. రాజ్యాంగ ముసాయిదా కమిటీకి నేతృత్వం వహించిన డాక్టర్ అంబేడ్కర్కు మనం సదా రుణపడి ఉండాలి. ఆ కమిటీలో 15 మంది మహిళలుసహా అన్ని మతాలు, వర్గాల వారికీ ప్రాధాన్యత దక్కడం విశేషం. ► దేశంలో నవతరం విడివిడిగా, ఐక్యంగానూ తమ పూర్తి శక్తిసామర్థ్యాలను సంతరించుకునే వాతావరణం ఉండాలి. దీనికి విద్యే అసలైన పునాది. 21వ శతాబ్ది సవాళ్లను సమర్థంగా ఎదుర్కొనేలా నూతన జాతీయ విద్యా విధానం(ఎన్ఈపీ) రూపొందించారు. విద్యా బోధనలో సాంకేతికతను లోతుగా, విస్తృతంగా వినియోగించాలని ఎన్ఈపీ స్పష్టంచేస్తోంది. -
నూతనాధ్యాయానికి నాంది
మోదీ, ఒబామాల మధ్య కెమిస్ట్రీ మంచి ఫలితాలనిస్తుంది పరస్పర ప్రయోజనకర కీలకాంశాలపై ఇరువురి నేతల మధ్య చర్చ పౌర అణు ఒప్పందం అమలుపై చర్చల్లో ముందంజ ఒబామా పర్యటనపై అమెరికా వ్యాఖ్య వాషింగ్టన్/న్యూఢిల్లీ: అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా భారత పర్యటనతో ఇరుదేశాల ద్వైపాక్షిక సంబంధాలు కొత్తగా ప్రారంభమవబోతున్నాయని అమెరికా ప్రకటించింది. ఒబామా, భారత ప్రధాని నరేంద్ర మోదీల సాన్నిహిత్యం, వ్యక్తిగత స్నేహం ద్వైపాక్షిక సంబంధాల్లో సానుకూల ఫలితాలనందిస్తుందని విశ్వసిస్తున్నామని అమెరికా జాతీయ ఉప భద్రతాసలహాదారు బెన్ రోడ్స్ పేర్కొన్నారు. గత సంవత్సరం అమెరికాలో ఒబామా, మోదీల భేటీ సందర్భంగా ఇరువురు నేతల మధ్య మంచి సాన్నిహిత్యం ఏర్పడిందని, అది ఇరుదేశాలకు ప్రయోజనకరమని వ్యాఖ్యానించారు. భారత్, అమెరికాల అనుబంధంలో దాగిన అసాధారణ శక్తిని వెలికితీసేందుకు ఇరుదేశాలు కట్టుబడి ఉన్నాయన్న విషయం ఒబామా పర్యటనద్వారా ప్రపంచానికి వెల్లడవుతుందన్నారు. భారత గణతంత్ర వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరు కావాలన్న మోదీ ఆహ్వానం వైట్హౌజ్ను ఆశ్చర్యానికి గురిచేసిందని రోడ్స్ వ్యాఖ్యానించారు. ఆ వేడుకలకు హాజరవుతున్న తొలి అమెరికా అధ్యక్షుడు ఒబామానే కావడం ఈ పర్యటనకు మరింత ప్రాధాన్యత కల్పించిందన్నారు. భారత్తో సంబంధాల్లో పర్యావరణ మార్పు, విద్యుత్ విధానం అంశాలకు తమ ఎజెండాలో అత్యధిక ప్రాధాన్యతనిస్తున్నామన్నారు. అలాగే, ఆర్థిక, రక్షణ రంగాలు, ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలు భారత్తో చర్చల్లో కీలకం కానున్నాయన్నారు. ఒబామాతో పాటు అమెరికా భద్రతాసలహాదారు సునాన్ రైస్, వాణిజ్య కార్యదర్శి పెన్నీ ప్రిజెకర్, పలువురు అమెరికా వ్యాపార ప్రతినిధులు భారత్కు వస్తున్నారు. కాగా, ఒబామా పర్యటన భారత్కు అత్యంత ప్రధాన దౌత్యపరమైన కార్యక్రమమని గురువారం విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి సయ్యద్ అక్బరుద్దీన్ పేర్కొన్నారు. రక్షణ, భద్రత, ఉగ్రవాదంపై పోరు, ప్రాంతీయ పరిస్థితులు.. తదితర అంశాలు ఒబామా, మోదీల మధ్య చర్చల్లో ప్రస్తావనకు వస్తాయని వెల్లడించారు. పౌర అణు ఒప్పందం అమల్లో ఎదురవుతున్న అడ్డంకులపై ఇరుదేశాల అధికారుల మధ్య లండన్లో జరుగుతున్న చర్చలు సానుకూల ఫలితం దిశగా సాగుతున్నాయన్నారు. అణుపరిహారం, అణు సరఫరా బృందంలో భారత్కు చోటు మొదలైన అంశాలపై సంప్రదింపుల బృందం చర్చిస్తోందన్నారు. అణు విద్యుత్ కేంద్రాల్లో ప్రమాదం జరిగినప్పుడు అణు సరఫరాదారులే బాధ్యత వహించాలన్న భారత చట్టాలను అమెరికా, ఫ్రాన్స్లు అంగీకరించడం లేదు. నిర్వహణదారులే బాధ్యత వహించాలనే అంతర్జాతీయ నిబంధనలను పాటించాలని ఆ దేశాలు కోరుతున్నాయి. ఈ విషయం భారత్, అమెరికాల అణు ఒప్పందం అమలులో పీటముడిగా మారింది. ఒబామా పర్యటన సందర్భంగా ఈ సమస్యను పరిష్కరించి అణు ఒప్పందం అమలుకు మార్గం సుగమం చేయాలని ఇరుదేశాలు కృషి చేస్తున్నాయి. గణతంత్ర వేడుకల్లో పాల్గొనడం, తాజ్ మహల్ సందర్శన మాత్రమే ఒబామా పర్యటన ఉద్దేశం అని వస్తున్న విమర్శలను అక్బరుద్దీన్ తోసిపుచ్చారు. రక్షణ, ఆర్థిక, ఇంధన, అంతర్జాతీయ, ప్రాంతీయ సంబంధాల్లో అమెరికా భారత్కు కీలక భాగస్వామి అని, ఆ సంబంధాల మెరుగుదలకు ఒబామా పర్యటన దోహదపడుతుందని స్పష్టం చేశారు. ఢిల్లీలో మోదీ, ఒబామా సంయుక్తంగా ఒక రేడియో కార్యక్రమంలో పాల్గొంటారన్నారు. కాగా, గతవారం ఒకసారి, గతనెల్లో ఒకసారి ఐదుగురు సభ్యుల అమెరికా భద్రతానిపుణుల బృందం ఢిల్లీలోని ఎయిమ్స్ను పరిశీలించింది. ముఖ్యంగా ట్రామా కేంద్రంలోని సౌకర్యాలను పరీక్షించింది. మరోవైపు, గణతంత్ర వేడుకల వద్ద అత్యాధునిక సౌకర్యాలతో 90 అంబులెన్స్లను సిద్ధంగా ఉంచనున్నారు. -
ప్రత్యామ్నాయ విధానాలే ప్రతిపక్షానికి ఊపిరి
త్రికాలమ్: ఈతరం పౌరులు ఉచితాలు ఆశించడం లేదు. అవినీతికి ఆస్కారం లేని బాధ్యతాయుతమైన పరిపాలన కోరుకుంటున్నారు. చట్టపాలన కావాలంటున్నారు. ఈతరం హృదయాన్ని మోదీ క్షుణ్ణంగా అర్థం చేసుకున్నట్టు కనిపిస్తున్నారు. కనుకనే మోదీ మార్కు రాజకీయాన్ని యువతీ యువకులు స్వాగతిస్తున్నారు. ‘ఒక మిత్రుడు వస్తున్నాడు.’ అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా రిపబ్లిక్ డే సందర్భంగా మన అతిథిగా ఢిల్లీకి రాబోతున్నాడని ప్రధాని నరేంద్రమోదీ ట్విట్టర్లో రాసుకుంటే ప్రపంచానికి తెలిసింది. అంతవరకూ అమెరికా దౌత్యాధికారులకు కానీ భారత ఉన్నతాధికారులకు కానీ తెలియదు. భారత గణతంత్ర దినోత్సవం సంద ర్భంగా విదేశీ ప్రముఖులు అతిథులుగా హాజరయ్యే ఆనవాయితీ జవహర్లాల్ నెహ్రూ కాలం నుంచీ ఉంది. అమెరికా అధ్యక్షుడు రావడం మాత్రం ఇదే ప్రథమం. దేశంలో మారుతున్న రాజకీయ సంస్కృతికీ, ప్రపంచంలో పెరుగుతున్న భారత దేశ పేరుప్రఖ్యాతులకీ ఈ ఉదంతం అద్దంపడుతోంది. ఒబామా వంటి అగ్రదేశా ధినేత ఢిల్లీకి రావడానికి అంగీకరిస్తే ఆ వార్త వెల్లడించడానికి పెద్ద హంగామా జరుగుతుంది. ఏ రకమైన ఆర్భాటం లేకుండా కేవలం ట్విట్టర్లో ప్రకటించడం ద్వారా ఇంత ప్రధానమైన వార్తను వెల్లడించడం మోదీ ప్రవేశపెట్టిన కొత్త సంస్కృతి. మోదీ ఆహ్వానాన్ని ఆమోదించడమే కాదు, చట్టబద్ధత లేకుండా అమెరికాలో నివసిస్తున్న నాలుగున్నర లక్షలమంది భారతీయుల ఉనికికి చట్టబద్ధత కల్పిస్తూ, వారికి ఉద్యోగాలు చేసుకునే అవకాశం ఇస్తూ ఉత్తర్వులు జారీ చేయడానికి ఒబామా చూపిన ప్రత్యేక శ్రద్ధ రెండు దేశాల మధ్య ప్రత్యేక బంధాన్ని బలోపేతం చేస్తుంది. ఇంటగెలిచిన మోదీ రచ్చ గెలవడం ప్రపంచ దేశాలలో భారత్కు ప్రత్యేకస్థాయిని సమకూర్చుతోంది. మోదీ ఇంటాబయటా సాధిస్తున్న విజయాల వెనుక దీర్ఘకాలిక ప్రణాళిక ఉంది. కొత్త పరిణామాల వెల్లువ మునుపెన్నడూ ఊహించని పరిణామాలు ఇప్పుడు దేశంలో, దేశం వెలుపలా జరుగుతున్నాయి. కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలలో భారతీయ జనతాపార్టీ ముఖ్యమైన పాత్రధారిగా అవతరించడం, అక్కడ అన్ని రాజకీయ పార్టీలూ భాజపాని ప్రధాన ప్రత్యర్థిగా పరిగణించి విమర్శనాస్త్రాలు సంధించడం కొత్త పరిణామం. ఇంతకాలం వింటే విడ్డూరంగా. అతిశయోక్తిగా అనిపించే వాదనలూ, ప్రతిపాదనలూ ఇప్పుడు వినిపిస్తున్నాయి. ఢిల్లీలో శుక్రవారం ప్రారంభమైన మూడురోజుల ప్రపంచ హిందూ మహాసభ (వరల్డ్ హిందూ కాంగ్రెస్)కు 50 దేశాల నుంచి విదేశీ భారతీయులు వచ్చారు. ప్రపంచానికి మార్గదర్శనం చేసే బృహత్తరమైన భూమికను భారతీయులు పోషించవలసిన సమయం ఆసన్నమైనదని దలైలామా, ఆర్ఎస్ఎస్ అధినేత మోహన్ భాగవత్, ఇతర వక్తలు ప్రకటించారు. ‘మనవాళ్లు ఈ విషయం రెండువేల సంవత్సరాల క్రితమే చెప్పారు’ అంటూ శ్రీలంక నుంచి వచ్చిన అతిథి అన్నప్పుడు చాలామంది సంతోషంగా చప్పట్లు కొట్టారు. కానీ ఆర్థికాంశాలపైనా, మీడియా పైనా, వ్యవస్థల నిర్మాణంపైనా, ఇతర అంశాలపైనా జరిగిన చర్చలలో ఛాందసం లేదు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకొని ఎట్లా ప్రగతిపథంలో దూసుకుపోవాలన్న ఆరాటం ఉంది. దాదాపు 15 వందల మంది సభ్యులలో కాషాయాంబరాలలో కనిపించినవారు పాతికమందికి మించి లేరు. సభికులందరూ తమతమ రంగాలలో విజయాలు సాధించిన లబ్దప్రతిష్టులు. ఈ సభలో చోదకశక్తి రుషీకేశ్ ఆశ్రమానికి చెందిన విజ్ఞానానందస్వామి. ఖరగ్పూర్ ఐఐటీలో పట్టభద్రు డైన తర్వాత పదేళ్లపాటు గురుముఖంగా సంస్కృతం అభ్యసించి, సన్యాసం స్వీకరిం చి రెండు పర్యాయాలు కశ్మీరు నుంచి కన్యాకుమారి వరకూ పాదయాత్ర చేసిన వ్యక్తి. వివేకానందుడు ఎక్కడ వదిలిపెట్టాడో విజ్ఞానానందుడు అక్కడ అందుకున్నాడు. ఆధ్యాత్మిక, ఆర్థిక, వాణిజ్య, వైజ్ఞానిక, శాస్త్ర, సాంకేతికరంగాలలో భారత బావుటా ఎగరవేయాలంటూ ప్రబోధించే ఆధునిక స్వామి. హరియాణాలో అరెస్టయిన రాం పాల్ వంటి దొంగస్వామి కాదు. ప్రపంచ హిందూ మహాసభ వెనుకా, మోదీ అమె రికా, ఆస్ట్రేలియా పర్యటనలలో దిగ్విజయంగా జరిగిన ఎన్ఆర్ఐ సభల వెనుకా ఎంతో ప్రయాస ఉంది. ఆర్ఎస్ఎస్ కార్యకర్తల కృషి ఉంది. లక్షలాదిమందితో వ్యక్తి గత సంబంధాలు పెట్టుకొని వాటిని రాపాడి కాపాడుకున్న నెట్వర్కింగ్ వ్యవస్థ ఉంది. హిందూ సమాజంలో, హిందువుల ఆలోచనా సరళిలో సంభవిస్తున్న పెను మార్పులకు సంకేతం. ఆధునిక భావజాలానికి ఆహ్వానం ఇటువంటి దశలో కొత్త, పాత ఆలోచనల మధ్య ఘర్షణ అనివార్యం. ఈ సంఘర్షణ ప్రభావం భాజపాలో సార్వత్రిక ఎన్నికల ముందు, ఆ తర్వాతా వచ్చిన పరిణా మాలలో చూడవచ్చు. పోటీకి తట్టుకోలేక పక్కకు తప్పుకున్న పెద్దతరం నాయ కులూ, కొత్త నాయకత్వాన్ని ఆమోదించి దారికొచ్చిన పాతకాపులూ ఉన్నారు. మొన్న టిదాకా హిందూమత సంరక్షకుడిగా తనను తాను భావించుకొని ప్రత్యర్థులపైన గర్జించి, లంఘించిన సింఘాల్ వంటి అద్వానీతరం నాయకులు మోదీ ఆధునిక పోక డలను అభినందిస్తున్నారు. పృథ్వీరాజ్ చౌహాన్ ఓడిపోయిన తర్వాత ఎనిమిది వం దల సంవత్సరాలకు దేశంలో సిసలైన హిందువులు ప్రభుత్వంలోకి వచ్చారని సింఘాల్ ప్రపంచ హిందూమహాసభలో అన్నాడు. వాజపేయి నాయకత్వంలోని మొదటి ఎన్డీఏ సర్కార్ సంకీర్ణ ప్రభుత్వం కనుక, మనుగడకోసం రాజీలు అనివా ర్యం కనుక దాన్ని హిందువుల పాలనగా లెక్కవేయలేదు. పృథ్వీరాజ్ తర్వాత మోదీనే. మోహన్ భాగవత్ సైతం ఆధునిక భావజాలానికీ, సృజనాత్మకతకూ పెద్ద పీట వేస్తున్నారు. సామాజిక సమరసతకూ, ఇంతకాలం నిర్లక్ష్యం చేసిన, అణచివేతకు గురైన దళితులనూ, ఆదివాసీలనూ ప్రధాన స్రవంతిలోకి తీసుకొని రావాలన్న సంక ల్పం ఉన్నది. వివేకానంద, గోల్వాల్కర్, అంబేద్కర్ల భావజాలాలను కలబోసి తర తరాలుగా లొంగని సామాజిక సమస్యలకు సామరస్యవంతమైన పరిష్కారం కను గొనాలన్న ప్రయత్నం చేస్తున్నారు. నవతరం ఆకాంక్షలు ఎలాంటివి? ఈ రోజున దేశ జనాభాలో 60 శాతానికి పైగా 35 సంవత్సరాలలోపు వయస్సు వారు. ఇందిర ఆత్యయిక పరిస్థితి తర్వాత పుట్టిన తరం. పీవీ నరసింహారావు ఆర్థిక సంస్కరణలు అమలు చేసిన తర్వాత కళ్లు తెరిచిన తరం. ఒకటి లేదా రెండు ఎన్నిక లలోనే ఓటు హక్కు వినియోగించుకున్న తరం. ఐటీ రంగంలో విప్లవ ఫలితాలను సంపూర్ణంగా వంటబట్టించుకున్న తరం. వీరు అన్ని కులాలలో, అన్ని ప్రాంతాలలో, అన్ని తరగతులలో ఉన్నారు. వీరికి ఆర్థికం అత్యంత ప్రధానం. సామాజికానికి ద్వితీ య స్థానం. మోదీ స్వాతంత్య్రానంతరం పుట్టిన తొలి ప్రధాని. యువతరం ఆశలూ, ఆకాంక్షలూ, ప్రాథమ్యాలూ తెలిసిన తెలివైన రాజకీయ నాయకుడు. ఆర్ఎస్ఎస్ ప్రచారకుడిగా రాజకీయావతారం ప్రారంభించి భారత ప్రధాని వరకూ సాగించిన ప్రస్థానంలో తనను తాను మార్చుకోవడం, పరిస్థితులను తనకు అనుకూలంగా మలచుకోవడం, అసాధ్యంగా కనిపించే లక్ష్యాలను సాధించడానికి సాహసోపేతంగా ప్రణాళికలు రచించడం, శక్తివంచన లేకుండా అమలు చేయడం కనిపిస్తుంది. ఆయన ఎదిగిన క్రమంలో అవధులు మీరిన ఆత్మవిశ్వాసం నియంతను తలపించే సంద ర్భాలు లేకపోలేదు. సరికొత్త ధోరణులకు చొరవ చాలా సంవత్సరాల తర్వాత ఢిల్లీలో అవినీతి మకిలం అంటని ప్రభుత్వం ఉన్నదనే అభిప్రాయం సర్వత్రా వినిపిస్తోంది. ఒకరిద్దరు మంత్రులు తప్పుడు పనులు చేయడానికి ప్రయత్నిస్తే వెంటనే కనిపెట్టే కనికట్టు మోదీ దగ్గర ఉంది. కేంద్రమం త్రులకు స్వేచ్ఛ లేదనీ, ఐఏఎస్ అధికారులే చక్రం తిప్పుతున్నారనీ, ప్రధాని కార్యా లయంలో ప్రిన్సిపల్ సెక్రటరీ నృపేంద్ర మిశ్రా అదుపాజ్ఞలలో సమస్త యంత్రాంగం నడుస్తున్నదనే మాట ప్రభుత్వ వర్గాలలో బలంగా వినిపిస్తున్నది. మంత్రులనూ, అధికారులనూ కట్టడి చేసే పని మిశ్రాకి అప్పగించి మోదీ జాతీయ, అంతర్జాతీయ రంగాలలో కొత్త చొరవల గురించీ, సరికొత్త ధోరణుల గురించీ ఆలోచిస్తున్నారు. అధికారంలోకి వచ్చి ఆరు మాసాలు పూర్తి కాకుండానే అంతర్జాతీయంగా తనకూ, తన దేశానికీ ఒకస్థాయిని సంపాదించడంలో సఫలీకృతుడైనట్టు చెప్పవచ్చు. జాతీ య రంగంలో లెసైన్స్, పర్మిట్ రాజ్ నడ్డిని పీవీ-మన్మోహన్సింగ్ ద్వయం విరిచేసిన తర్వాత ‘మేక్ ఇన్ ఇండియా’ నినాదంతో ఉత్పాదకరంగానికి ప్రాధాన్యం ఇవ్వాలన్న పట్టుదల పెరిగింది మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాతనే. ఓటర్లకు వరాలు లేకుం డా, ఉచితాలు ఇవ్వచూపకుండా ఎన్నికలలో ఘనవిజయం సాధించవచ్చునని నిరూపించిన ఘనత కూడా మోదీదే. స్విస్ బ్యాంకుల్లో మూలుగుతున్న నల్లధనం తీసుకువచ్చి ప్రతి పౌరుడి ఖాతాలో 15 లక్షలు డిపాజిట్ చేస్తానంటూ ఎన్నికల ప్రచా రంలో మోదీ చేసిన వాగ్దానం అతిశయోక్తికి పరాకాష్ఠ అయినప్పటికీ అన్నీ ఉచితంగా ఇస్తానంటూ వాగ్దానం చేయకుండానే భాజపాకి చరిత్రలో మొదటిసారి లోక్సభలో 280 పైచిలుకు స్థానాలు సంపాదించారు. మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్లలో భాజపా సంక్షేమ వాగ్దానాలు లేకుండానే మూడో సారి గెలిచింది. వాగ్దానాల వెల్లువ ప్రవహిం పజేసిన కాంగ్రెస్ పార్టీ రాజస్థాన్, హరియాణాలలో మట్టికరిచింది. ఈ తరం పౌరులు ఉచితాలు ఆశించడం లేదు. అవినీతికి ఆస్కారం లేని బాధ్యతాయుతమైన పరిపాలన కోరుకుంటున్నారు. చట్టపాలన కావాలంటున్నారు. ఈతరం హృద యాన్ని మోదీ క్షుణ్ణంగా అర్థం చేసుకున్నట్టు కనిపిస్తున్నారు కనుకనే మోదీ మార్కు రాజకీయాన్ని యువతీ యువకులు స్వాగతిస్తున్నారు. వాస్తవాల జోలికెళ్లని కాంగ్రెస్ తన విజయాన్ని మోదీ సరిగానే అర్థం చేసుకున్నట్టు కనిపిస్తోంది. కాంగ్రెస్ పార్టీ పరాజయాన్ని అర్థం చేసుకోవడంలో కూడా విఫలమైనట్టున్నది. సార్వత్రిక ఎన్నిక లలో ఘోరపరాజయం తర్వాత ఆ పార్టీ ఇప్పుడిప్పుడే తేరుకుంటోంది. కశ్మీర్లో భాజపా పూర్తి స్థాయిలో యుద్ధం చేస్తుంటే కాంగ్రెస్ పార్టీ నామమాత్రంగా ప్రచారం చేస్తోంది. శుక్రవారంనాడు సోనియాగాంధీ కశ్మీర్ సందర్శించారు. ఆ పార్టీకి ఈ ఎన్నికలలో గెలవాలనే కోరిక కూడా ఉన్నట్టు కనిపించదు. నిజానికి ఆ పార్టీ నాయ కత్వం ఆత్మపరిశీలన చేసుకుంటున్నది. దాదాపు రెండు మాసాలుగా రాహుల్ ఆధ్వ ర్యంలోనే సమీక్షా సమావేశాలు నిత్యం జరుగుతున్నాయి. రాబోయే ఏఐసీసీ సమా వేశంలో రాహుల్గాంధీని పూర్తిస్థాయి పార్టీ అధ్యక్షుడుగా నియమించాలని సోనియా సంకల్పించారు. ప్రియాంకకు సహాయక పాత్రే కానీ ప్రధాన పాత్ర ఉండదు. సంక్షేమ పథకాలను రద్దు చేయడం ద్వారా పేదలకు మోదీ దూరం అవుతారనీ, హిందూత్వ విధానాలకు ప్రాధాన్యం ఇచ్చి ముస్లింల ఆగ్రహానికి గురవుతారనీ, కార్మిక చట్టాలను సరళతరం చేయడం ద్వారా కార్మికులకు కోపం తెప్పిస్తారనీ కాంగ్రెస్ నాయకులు అంచనా వేస్తున్నారు. ఈ కారణంగా పేదలూ, ముస్లింలూ, దళితులూ తిరిగి తమ పార్టీ పరిష్వంగంలోకి వస్తారని ఆశిస్తున్నారు. అంతేకానీ సంపద సృష్టించడం ఎట్లానో, కొత్త తరం కోరుకుంటున్న సుపరిపాలన అందించడం ఎట్లానో, అవినీతి మరక లేని వారికి పార్టీలో స్థానం కల్పించడం ఎట్లానో ఆలోచించడం లేదు. అన్ని రాష్ట్రాలలో అవినీతిపరులుగా, అసమర్థులుగా పేరుమోసిన నాయకులే పార్టీని నడిపిస్తున్నారు. నలభై ఏళ్లలోపు యువకులు పార్టీలో కనిపించరు. వామపక్షాలలో కూడా అంతర్వీక్షణం మొదలైంది. హైదరాబాద్లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో పది వామపక్షాల నాయకులూ కూర్చొని వామపక్ష సానుభూతిపరుల, మేధావుల అభిప్రాయాలు అడిగి తెలుసుకున్నారు. భాజపాను ఓడించి అధికారంలోకి రావా లంటే కాంగ్రెస్ కానీ వామపక్షాలు కానీ ప్రత్యామ్నాయ రాజకీయాలనూ, సరికొత్త అభివృద్ధి వ్యూహాలనూ ప్రతిపాదించాలి. ఆ పని చేయకుండా పాతపాటే పాడుతూ కూర్చుంటే నవతరానికి అర్థం కాకుండా వ్యర్థమై బుట్టదాఖలైపోతారు. - కె. రామచంద్రమూర్తి