breaking news
Heart test
-
గుండెపోటు భయాలు.. ఆ ఒక్క ఆస్పత్రికే వేలమంది క్యూ!
గుండె సమస్యలతో ఉన్నట్లుండి కుప్పకూలి చనిపోతున్న ఉదంతాలు నిత్యం చూస్తున్నాం. కర్ణాటక హసన్ జిల్లాలో 40 రోజుల వ్యవధిలో 23 మంది మరణించారు. ఈ కథనాలు జనాలను ఆందోళనకు గురి చేస్తున్నాయి. అందునా 25-40 మధ్యవయసున్న వాళ్లే ఎక్కువగా ఉండడం తీవ్ర చర్చనీయాంశమైంది.దేశంలో నిత్యం ఏదో ఒక మూల హఠాన్మరణం ఘటన చోటు చేసుకుంటోంది. అప్పటిదాకా సంతోషంగా ఉన్న వ్యక్తులు, ఎలాంటి అరోగ్య సమస్యలు లేని వ్యక్తులు.. ఒక్కసారిగా కుప్పకూలిపోయి ప్రాణం విడుస్తున్నారు. హార్ట్ ఎటాక్, కార్డియాక్ అరెస్టులతోనే వాళ్లు చనిపోతున్నారని డాక్టర్లు సైతం నిర్ధారిస్తున్నారు. దీంతో కొందరు ఎలాంటి లక్షణాలు లేకున్నా పోటు తప్పదని అంచనాకి వస్తున్నారు. ఈ క్రమంలో..ముందస్తుగా గుండె పరీక్షలు చేయించుకుంటున్నారు. కర్ణాటక మైసూర్లోని ప్రముఖ జయదేవ ఆస్పత్రికి గత మూడు నాలుగు రోజుల నుంచి వేలమంది జనం క్యూ కట్టారు. ఓపీ కోసం వేకువ జాము నుంచే ఆస్పత్రి వద్ద పడిగాపులు పడుతున్నారు. క్యూ లైన్లలో కిక్కిరిసిపోయి కనిపిస్తున్నారు. మైసూర్తో పాటు బెంగళూరు బ్రాంచ్ ముందు కూడా ఇదే పరిస్థితి. జయదేవ ఆస్పత్రి ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే అటానమస్ ఆస్పత్రి.ಮೈಸೂರು: ರಾಜ್ಯದಲ್ಲಿ ಹೃದಯಾಘಾತ ಹೆಚ್ಚಿದ ಹಿನ್ನಲೆ, ಜಯದೇವ ಆಸ್ಪತ್ರೆಯಲ್ಲಿ ಬೆಳಿಗ್ಗೆಯಿಂದಲೇ ಕ್ಯೂ.#mysore #jayadevahospital #newskarnataka pic.twitter.com/KJDtN2DwwV— News Karnataka (@Newskarnataka) July 8, 2025VIDEO Credits: News Karnatakaఅయితే మీడియా కథనాలతో, సోషల్ మీడియా ప్రచారాలతో ఆందోళన చెందవద్దని జయదేవ ఆస్పత్రి సూపరిండెంట్ డాక్టర్ కేఎస్ సదానంద ప్రజలకు సూచిస్తున్నారు. ‘‘జనాలు అంతా ఒక్కసారిగా ఇక్కడికి ఎగబడినంత మాత్రాన.. సమస్య పరిష్కారం కాదు. కేవలం పరీక్షలు చేసుకున్నంత మాత్రాన ఎలాంటి ప్రయోజనం ఉండదు. ఇలాంటి ఊహాగానాలకు అతిగా స్పందించొద్దు. మీరు ఆస్పత్రులకు ఎగబడడం వల్ల.. అత్యవసర పరిస్థితి ఉన్న రోగులకు చికిత్సలో అంతరాయం కలగవచ్చు. కేవలం వైద్య పరీక్షలు చేయించుకున్న మాత్రాన సమస్య పరిష్కారం కాదు. మంచి ఆహారం తీసుకుంటూ నిత్యం వ్యాయామాలు చేస్తూ ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవాలి’’ అని సూచించారాయన.హసన్ మరణాలపై ఆందోళన వ్యక్తం చేసిన కర్నాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య.. వీటిపై విచారణకుత్యేక కమిటీని ఏర్పాటు చేశారు. ఆ కమిటీ తాజాగా నివేదికను సమర్పించింది కూడా. అదే సమయం కోవిడ్ వ్యాక్సిన్ల పనితనం గురించి ఆయన అనుమానాలు వ్యక్తం చేయగా.. కేంద్ర ఆరోగ్య శాఖ పలు అధ్యయనాలను ప్రస్తావిస్తూ ఆ ఆరోపణలను కొట్టిపారేసింది. -
చికిత్స చేసేదెవరూ... బతుకు చిగురింపజేసేదెవరు?
మెడికల్ మెమరీస్ ప్రతిరోజులాగే ఆ రోజు కూడా ‘ఆత్మీయతతో గుండె వైద్యం’ అనే నా నినాదాన్ని నిజం చేసే ప్రయత్నం మొదలుపెట్టాను. మందులకన్నా మమతలు మిన్న అని గట్టిగా నమ్ముతాను నేను. ఆ రోజు సన్యాసిరావుగారనే ఒకాయన గుండె పరీక్షల కోసం వచ్చారు. ఆయనను క్లినిక్ లోపలే ఎకో, ట్రెడ్మిల్ టెస్ట్లకు పంపించాను. మరో ఇద్దరు, ముగ్గురు పేషెంట్లను చూసిన తర్వాత సుచిత్ర అనే పేషెంట్ వచ్చారు. ఆమె చాలా రోజుల నుంచి నా దగ్గరికి ఫాలోఅప్కు వస్తున్నారు. పేషెంట్లకు అభిమాన డాక్టర్లు ఉన్నట్లే డాక్టర్లకూ అభిమాన పేషెంట్లుంటారు. బలహీనంగా కనిపిస్తూ, మృదువుగా మాట్లాడే సుచిత్ర గుండె కూడా బలహీనమైనదే. అయితే ఆరోజు తన గుండెలో ఏదో బాధగా ఉందని సుచిత్ర వచ్చింది. సరిగ్గా ఆమె విషయం చెబుతుండగానే క్లినిక్ లోపలి నుంచి ఒక పెద్ద అరుపు వినిపించింది. ‘‘డాక్టర్....! మన పేషెంట్ సన్యాసిరావు కొలాప్స్ అయ్యారు’’ అంటూ మా టెక్నిషియన్ అరిచాడు. ట్రెడ్మిల్ చివరిదశలో ఉండగా విపరీతమైన ఛాతీనొప్పి వచ్చి ట్రెడ్మిల్ మీదే కుప్పకూలారు. క్లినిక్లో నిర్వహించిన అనేక వేల పరీక్షలలో మొదటిసారిగా ఈ కాంప్లికేషన్! నా ముందున్న సుచిత్రగారిని అలాగే వదిలేసి లోపలకు పరిగెత్తాను. తీవ్రమైన గుండెపోటుతో దాదాపు అపస్మారక స్థితిలో ఉన్న సన్యాసిరావుగారిని చూస్తూనే అనేక పనులకు మా అసిస్టెంట్లను పురమాయించాను. ఒకరు కారు రెడీగా ఉంచారు. మరొకరు నరానికి సూదిని అమర్చి, మందు ఎక్కించారు. ఇంకొకరు హాస్పిటల్కు ఫోన్ చేసి క్యాథ్లాబ్ రెడీ చేయమని చెప్పారు. హాస్పిటల్కు చేరాక మూడుగంటల పాటు మృత్యువుతో ఎడతెగని పోరాటం! వెంటిలేటర్, పేస్మేకర్, యాంజియోగ్రామ్, యాంజియోప్లాస్టీ, స్టెంటింగ్, లెక్కలేనన్ని ఇంజెక్షన్స్!! ఎంతో ఒత్తిడి. ఎంతో పరిశ్రమ. ఎన్నో నిద్రలేని రాత్రులు. ప్రశాంతత కరవైన రోజులు. ఇంట్లోని వారందరికీ శిక్ష. వారి సహనానికి పరీక్ష! మృత్యువు ఒడిలోంచి ఒక పేషెంట్ను బయటకు తీసుకువచ్చి, అతడి జీవితకాలాన్ని పొడిగించే ప్రయత్నంలో... ఒక డాక్టర్ తన జీవితకాలాన్ని చాలా తగ్గించుకోవాల్సి వస్తుందేమో! అయినా అది సంతోషమే. ఒత్తిడితో మేము త్యాగం చేసే క్షణాలన్నీ... ఏళ్లుగా మారి రోగి ఆయుష్షును పొడిగిస్తుంటే అంతకంటే ఓ డాక్టర్కి కావాల్సిందేముంది. మరో మూడురోజులు సన్యాసిరావు కొన ఊపిరితోనే ఉన్నారు. చివరికి ఆరో రోజున సన్షైన్ మాదాపూర్ విభాగం నుంచి డిశ్చార్జ్ చేశాను. ఆయన ఇంటికి వెళ్లే ముందు నా చేతులు పట్టుకుని ‘స్టెంట్ అంటూ వేయించుకుంటే మీ చేతే వేయించుకుందామనుకున్నాను డాక్టర్. మీరే నా ప్రాణదాత’ అన్నారు. అప్పుడే పుట్టిన నా బిడ్డను తొలిసారి చూసిన అనుభూతి కలిగింది నాకు. అది చాలు ఈ జన్మకి. ఆ తర్వాత మళ్లీ మామూలే. మళ్లీ క్లినిక్, హాస్పిటల్. ఆ రోజు ఎమర్జెన్సీ వల్ల చూడకుండా పంపించేసిన చాలామంది పేషెంట్లు ‘‘సర్... సన్యాసిరావుగారికి ఎలా ఉంది’’ అని అడిగారు. ‘‘బాగున్నారు’’ అని జవాబిచ్చా. ‘‘నేనే బతికించాను సుమా’’ అన్న కాస్త ధీషణతో కూడిన గర్వం బహుశా అంతర్లీనంగా ఆ జవాబులో ఉందేమో! మా రిసెప్షనిస్ట్ మణిబాబు ఘంటసాల వారి భగవద్గీతను రింగ్టోన్గా వాడతాడు. ‘‘కర్మణ్యేవాధి కారస్థే మా ఫలేషు కదాచనా’’ అని వినపడుతుంటే కొంచెం చిరాకుపడ్డాను మనసులో. ‘‘మీ హస్తవాసి మంచిది’’ అని సన్యాసిరావు అన్న మాట బహుశా నిజమేనేమో! భగవంతుడు రాసిన విధిరాతను కూడా కాస్త మార్చగలిగే రాత మన చేతిలో ఉందేమోనన్న అని విద్వదహంకారంతో కూడిన కించిత్ అనుమానహంకారం... నా మనసులోనే ఏ మూలనో. పదిహేను రోజుల తర్వాత నా ఫేవరెట్ పేషెంట్ సుచిత్రగారి అమ్మాయి వాళ్ల అత్తగారిని తీసుకొని నా క్లినిక్కి వచ్చింది. చూపించుకుని వెళ్లేముందు అడిగింది ‘‘ఆరోజు కొలాప్స్ అయిన సన్యాసిరావు ఎలా ఉన్నారు’’ అని. ‘‘చాలా బాగున్నారమ్మా. సేవ్ అయినట్లే’’ అన్నాను. ఇంతలో అకస్మాత్తుగా గుర్తొచ్చింది. ‘‘అవునూ... సుచిత్రగారేరీ?’’ అంటూ ఆ అమ్మాయిని అడిగా. తలదించుకొని మెల్లగా జవాబు చెప్పిందావిడ. ‘‘ఆరోజు మీ దగ్గరకు వచ్చినప్పుడు ఛాతీలో భారంగా ఉందన్నారు మా అమ్మ. మీరు చూస్తూ చూస్తూ మధ్యలో వెళ్లిపోయారు. ఆమె ఇంకే డాక్టర్కూ చూపించుకోదు. మొండితనం. మీరంటే అభిమానం. ఆ రోజు రాత్రే... ’’ అంటూ వాక్యం ముంగిచకుండానే బతుకు ముగించిన తీరును నాకు వివరించింది. ఆమె కళ్లనుంచి జారిపడ్డ నీటిబొట్టును చూస్తే నా చెంప చెళ్లుమన్నట్లయ్యింది. సుచిత్రగారు అదే రోజు మరణించారట. నిస్త్రాణతతో అలాగే కూర్చుండిపోయాను నేను. ‘‘కర్మణ్యేవాధి కారస్థే...’’ మా మణిబాబు ఫోన్ మోగుతూనే ఉంది. నిర్వహణ: యాసీన్