breaking news
Hariprasad Chaurasia
-
కళాకారుడిగా గర్వపడుతున్నా
పండిట్ హరిప్రసాద్ చౌరాసియా విజయవాడ (భవానీపురం): ముంబై నుంచి పిలిపించి అవార్డును ప్రదానం చేసినందుకు ఒక కళాకారుడిగా గర్వపడుతున్నానని వేణు, వీణాగాన విద్వాంసుడు, పద్మవిభూషణ్ పండి ట్ హరిప్రసాద్ చౌరాసియా అన్నారు. డాక్టర్ పిన్నమనేని-సీతాదేవి ఫౌండేషన్ 25వ వార్షిక అవార్డుల ప్రదానోత్సవం మొగల్రాజపురంలో సిద్ధార్థ ఆడిటోరియంలో బుధవారం జరిగింది. కార్యక్రమంలో పండిట్ హరిప్రసాద్ చౌరాసియా, జర్నలిస్ట్, ఎంటర్ప్రెన్యూర్ హిందోల్ సేన్గుప్తాలకు అవార్డులను ప్రదానం చేశారు. గ్రామీణ ప్రగతి పురస్కారాన్ని అనంతపురం జిల్లా నార్సింపల్లికి చెందిన ముట్లూరి నరసింహప్పకు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా హరిప్రసాద్ చౌరాసియా మాట్లాడుతూ క్లాసికల్ మ్యూజిక్లో ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో అవార్డులు, రివార్డులు అందుకున్నా, ఇటువంటి సంస్థల ద్వారా అందుకునే అవార్డులు మధురానుభూతుల్ని మిగులుస్తాయన్నారు. -
భాగ్యనగరినాకు రెండో ఇల్లు
ఏడు స్వరాలు ఆయన వేణువు నుంచి వెలువడితే చాలు, శ్రోతలకు ఏడేడు లోకాలలో సంచరించిన అనుభూతి సొంతమవుతుంది. పహిల్వాన్ల కుటుంబంలో పుట్టినా, కుస్తీ వైపు కాకుండా, సంగీతం వైపు ఆకర్షితుడై, అనతికాలంలోనే సంగీత రంగానికి తానే ఆకర్షణగా మారిన వేణుధర ధీరుడు హరిప్రసాద్ చౌరాసియా. సంగీతాభిమానులకు పరిచయం అక్కర్లేని పేరు ఆయనది. ఒక సంగీత కార్యక్రమంలో పాల్గొనేందుకు శుక్రవారం నగరానికి వచ్చిన చౌరాసియా, బిజీ షెడ్యూల్తో తలమునకలుగా ఉన్నా, ‘సిటీప్లస్’తో కొద్దిసేపు ప్రత్యేకంగా ముచ్చటించారు. సంగీతంలో తన ప్రస్థానాన్ని, హైదరాబాద్ నగరంతో తన అనుబంధాన్ని ఇలా పంచుకున్నారు. నగరం మారిపోయింది.. హైదరాబాద్ నాకు రెండో ఇల్లులాంటిది. తొలిసారిగా 1963లో ఇక్కడ అడుగుపెట్టా. అప్పట్లో ఈ నగరం చాలా చిన్నది. చిన్న హోటళ్లు మాత్రమే కనిపించేవి. ఇప్పుడు పూర్తిగా మారిపోయింది. ఫైవ్స్టార్ సిటీలా కనిపిస్తోంది. మీకు గుర్తుండే ఉంటుంది.. తెలుగులో ‘సిరివెన్నెల’ చిత్రానికి వేణుగానాన్ని వినిపించా. సంగీత ప్రధానమైన ఆ చిత్రంలో హీరో ఫ్లూటిస్ట్. ఆ హీరో పాత్రకు వేణుగానాన్ని అందించా. తెలుగువారు ఇప్పటికీ ఆ చిత్రాన్ని గుర్తుచేసుకుంటూ నా వద్ద ప్రస్తావిస్తుండటం నిజంగా ఆనందాన్నిస్తుంది. ఇందుకు నాకు అవకాశం కల్పించిన దర్శకుడు విశ్వనాథ్కు కృతజ్ఞతలు చెప్పుకోవాలి. తెలుగులో శంకరాభరణం, సిరివెన్నెల నాకు ఎంతో ఇష్టమైన చిత్రాలు. సంగీత ప్రధానమైన చిత్రాల్లో అవకాశం దొరికితే, ఇప్పుడు కూడా తెలుగు చిత్రాలకు పనిచేసేందుకు నేను సిద్ధంగానే ఉన్నా. కర్ణాటక విద్వాంసుల్లో ఎం.ఎస్.గోపాలకృష్ణన్, బాలమురళీకృష్ణ, టి.ఆర్.మహాలింగం, ఎన్.రమణి వంటి వారి సంగీతాన్ని చాలా ఇష్టపడతా. గానానికి, వేణునాదానికి ఏవీ సాటిరావు ఎన్నో సంగీత పరికరాలు ఇప్పుడు మార్కెట్లోకి వస్తున్నాయి. వాటి గొప్పతనం వాటికి ఉండొచ్చు. అయితే, గానానికి, వేణునాదానికి ఏవీ సాటిరావు. సంగీతం ఉన్నంత వరకు ఇవి ఎప్పటికీ నిలిచే ఉంటాయి. సంగీతమే నా ప్రపంచం. ఏ రాగం ఇష్టమంటే ఏం చెప్పను? అన్ని రాగాలూ ఇష్టమే. సంగీతాన్ని సిలబస్లో చేర్చాలి పిల్లలకు స్వతహాగా సంగీతంపై మక్కువ ఉంటుంది. వారిని సంగీతం వైపు ప్రోత్సహించాలి. సంగీతంపై వారి మమకారాన్ని ప్రోత్సహించేందుకు సంగీతాన్ని ఒక సబ్జెక్టుగా సిలబస్లో పెట్టాలి. పరీక్షలు కూడా పెట్టాలి. అప్పుడే మన సంగీతానికి మనుగడ ఉంటుంది. రియాలిటీ ‘షో’లు సరిపడవు సంప్రదాయ సంగీతానికి రియాలిటీ షోలు సరిపడవు. వాటి ద్వారా పిల్లలు నేర్చుకుంటారనే వాదనను నేను అంగీకరించను. గురు-శిష్య సంబంధంతోనే సంగీతం ఒకరి నుంచి మరొకరికి ప్రవహిస్తుంది. - ప్రవీణ్కుమార్ కాసం -
సత్వం: పండిత్
జూలై 1న వేణుగాన విద్వాంసుడు హరిప్రసాద్ చౌరాసియా జన్మదినం వేణుగానం చేయడమంటే శ్వాసను నియంత్రించడం. ఇంకోమాటలో యోగా చేయడం. ఒక పవిత్రమైన బాధ్యతతో, ఆధ్యాత్మిక మానసిక స్థితితో ఒక ధ్యానంలాగా యోగంలాగా నేను పాడతాను. హరిప్రసాద్ చౌరాసియా వేణుగానం చూస్తే- ఆ నాదం వాద్యంలోంచి మాత్రమే వచ్చినట్టు ఉండదు; మడిచిన పెదాలలోంచీ, ఆడే చేతివేళ్లలోంచీ మాత్రమే కాదు, వెన్నులోంచీ, జుట్టులోంచీ, మొత్తంగా ఆయన ఒంట్లోంచీ సంగీతం వెలువడినట్టుంటుంది. ‘కృష్ణభగవానుడితో నేరుగా అనుసంధానం కలిగిన వాద్యమిది. ఏ ఆడంబరం లేదు, ఏ తొడుగులు లేవు, ఏ తంత్రులు అక్కర్లేదు. వెదురు ముక్క చాలు. గాలిని నియంత్రించడానికి రంధ్రాలు! దేవుడు మాత్రమే ఇంత సరళమైన వాద్యాన్ని కనిపెట్టగలడు!’ అంటారు చౌరాసియా. ‘పైగా తీసుకెళ్లడం ఎంత సులభం’! ఒక వస్తాదు కొడుకుగా చౌరాసియా సంగీతంతో రహస్యంగా కుస్తీ పట్టాల్సివచ్చింది. కారణం, వాళ్ల నాన్నకు సంగీతమంటే వేశ్యలకు సంబంధించింది! తనలాగే కొడుకూ వస్తాదు కావాలని ఆయన కోరిక. నాలుగున్నరేళ్లప్పుడే అమ్మపోయింది కాబట్టి, నాన్నను ఒప్పించే మార్గం లేకపోయింది. గుడికి వెళ్తున్నానని చెప్పి స్నేహితుడింటికి వెళ్లేవారు. అక్కడ పాడటం సాధన చేసేవారు. పండిత్ రాజారామ్ ఆయనలో ప్రతిభ ఉందని గుర్తించి, బోధించడం మొదలుపెట్టారు. ‘పదిహేనేళ్ల వయసులో అలహాబాద్ రేడియోలో తొలిసారి వేణుగానం విన్నాను. స్వర్గానికి రవాణా అయినట్టుగా అనుభూతి చెందాను. అది నా జీవితంలో కీలకమలుపు,’ అంటారు చౌరాసియా. అంతే! అంత గొప్పగాలేని తన గాత్రానికి స్వస్తిచెప్పారు. ఆ వేణువూదిన పండిత్ భోలానాథ్ను వెతుక్కుంటూ వెళ్లి, గుమ్మంలో వాలిపోయారు. కూరగాయలు కోయడం, మసాలాలు నూరడానికైనా ఈ పిల్లాడు పనికొస్తాడని ఒప్పుకున్నారాయన. కానీ అదే భోలానాథ్ అచ్చెరువొందేలా, వేణువుకు సరికొత్త ఊపిరిలూదారు. వేణువు అర్హతగా ఒరిస్సా రేడియోలో ఉద్యోగం వచ్చినరోజున చౌరాసియా నాన్న ఆశ్చర్యపోయారు, దాచివుంచిన సంగతి గురించి! కానీ ఒప్పుకోక తప్పలేదు. అదే ఒరిస్సా రేడియో ఆయన్ని ‘బొంబాయి’ చేర్చింది. మదన్మోహన్, రోషన్ లాంటి సంగీతదర్శకులు ఆయన వేణుగానానికి సమ్మోహితులై సినిమాల్లోకి ఆహ్వానించారు. ఎస్ డి బర్మన్, ఆర్ డి బర్మన్తోనూ పనిచేశారు (తర్వాతి కాలంలో ‘సిరివెన్నెల’కు తన వేణువుతో ప్రాణం పోశారు). ‘బాలీవుడ్ అవకాశాలు నన్ను ఆర్థికంగా నిలదొక్కుకునేలా చేశాయి. భవంతి సమకూరింది, కారు ముంగిట ఆగింది, భౌతిక అవసరాలు తీరాయి; కానీ ఒక అసంతృప్తి మొదలైంది. నేను కళాకారుడిగా ఎదగడం లేదు. నాకు ఇంకేదో కావాలి, నా ఆత్మ సుఖించడం లేదు,’ అని అప్పటి మథనం గురించి చెబుతారాయన. దాంతో ‘సుర్బహార్’ విద్వాంసురాలు అన్నపూర్ణాదేవిని కలిశారు. అప్పటికే పండిత్ రవిశంకర్నుంచి విడిగా ఉంటున్నారామె. బహిరంగ ప్రదర్శనలు మానేశారు. ఆమె చౌరాసియాను ముందు శిష్యుడిగా అంగీకరించలేదు. బయటికి తోసినంత పనిచేశారు. కానీ మూడేళ్లుగా చూపిస్తున్న ఆయన తపనకు తలొగ్గక తప్పలేదు. ‘నేను పట్టుదలతో ఉన్నానని తెలియజేయడానికి నా చేతుల్ని మార్చుకున్నాను. అంతకుముందు కుడిచేత్తో వాయించేవాడిని. ఎడమచేతికి మారిపోయాను. వెనక్కి చూడకుండా వెనక్కి తిరిగి నడవడం లాంటిదది. హింస! కానీ సంతోషం! ఆమె నాకు గురువు మాత్రమే కాదు, దేవతకన్నా ఎక్కువ. నా ఆకలి, ఆరోగ్యం పట్టించుకున్నారు. నా సంగీతానికి పరమార్థం కల్పించారు,’ అని తబ్బిబ్బవుతారు చౌరాసియా. ‘ఒక్కో క్షణం అద్భుతంగా ఉంటుంది. ఆ క్షణంలో సంగీతం ప్రవహిస్తుంది. ఒక నీటిచుక్క నువ్వు దాహంగా ఉన్నప్పుడు ఆర్తి తీర్చుతుంది. అదే బిందువు నీటియంత్రంలోంచి పైకి ఎగిరినప్పుడు దాని అందంతో మురిపిస్తుంది. మళ్లీ అదే చుక్క మురికినీరులో కలిసి అసహ్యం పుట్టిస్తుంది. అదే నీటిబిందువు నదిలో కలిసి ఈదే ఉత్సాహం కలిగిస్తుంది. అదే చుక్క సముద్రంలో కలిసినప్పుడు తన శక్తితో ఆశ్చర్యగొలుపుతుంది. ఇదంతా కూడా సంగీతంతో పలికించొచ్చు’. ‘వేణుగానం చేయడమంటే శ్వాసను నియంత్రించడం. ఇంకోమాటలో యోగా చేయడం. ఒక పవిత్రమైన బాధ్యతతో, ఆధ్యాత్మిక మానసిక స్థితితో ఒక ధ్యానంలాగా యోగంలాగా నేను పాడతాను. అసలు నేను శ్రోతలకోసమే పాడతాను. కానీ అందులో ఎన్నో రకాలవాళ్లుంటారు. వారందరినీ తృప్తి పరచడం సాధ్యం కాదు. వాళ్ల మధ్యలో ఒక గొప్ప శక్తి ఏదో కనబడుతుంది. అది మాధవుడే కావొచ్చు. ఆ శక్తికోసం నేను వేణువు పలుకుతాను. నాలోనేను దైవాన్ని అనుభవిస్తాను,’ అంటారు తన వేణుగానం గురించి. ‘సంగీతమే నా ప్రార్థన. సంగీతమే నా మతం’ అనే చౌరాసియాకు ఎక్కడా రికార్డుగా లేని కృష్ణుడి గానం వినలేదన్న చింత ఉందట! కానీ మనకా బాధ లేదు.