breaking news
hanmanthareddy
-
ఘోరం.. అంత్యక్రియలకు అడ్డుపడ్డ ఆ నలుగురు!
యాదాద్రి భువనగిరి జిల్లా: రూపాయి.. రూపాయి.. నువ్వేం చేస్తావు? అంటే… రూపాయి రూపాయి నువ్వు ఏం! చేస్తావు? అని అడిగితే! హరిశ్చంద్రుని చేత అబద్ధం ఆడిస్తాను, భార్య-భర్తల మధ్యన చిచ్చు పెడతాను, తండ్రి బిడ్డలను విడదీస్తాను. అన్నదమ్ముల మధ్య వైరం పెంచుతాను. ఆఖరుకు.. ప్రాణ స్నేహితులను కూడా విడగొడ్తాను అందట. యాదాద్రి భువనగిరి జిల్లాలో తాజాగా జరిగిన ఘటన అది నిజమేనని నిరూపించింది. అయినవాళ్లే వేధిస్తుండడంతో తట్టుకోలేక ఆ వ్యక్తి ఆత్మహత్య చేసుకుంటే.. అతనికి అంత్యక్రియలు నిర్వహించకుండా ఆ అయినవాళ్లే అడ్డుకోవడంతో మూడు రోజులుగా ఆ మృతదేహం మార్చురీలోనే మగ్గుతోంది. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం పంతంగికి చెందిన చీరిక హనుమంతరెడ్డి(48) హైదరాబాద్లో ప్రైవేటు బస్సు డ్రైవర్గా పనిచేస్తూ... అక్కడే అద్దె ఇంట్లో ఉండేవారు. హనుమంతరెడ్డి తండ్రి నర్సిరెడ్డి పేరిట 7.24 ఎకరాల భూమి ఉంది. పోస్ట్మాస్టర్గా ఉద్యోగ విరమణ చేసిన నర్సిరెడ్డి... మూడేళ్ల క్రితం వ్యక్తిగత కారణాలతో ఆత్మహత్య చేసుకున్నారు.ఈలోపు తండ్రి ఆస్తిలో తమకూ వాటా కావాలని హనుమంతరెడ్డి తోబుట్టువులు కోర్టును ఆశ్రయించారు. తమ్ముడు కరుణాకర్రెడ్డితోనూ హనుమంతరెడ్డికి ఆస్తి తగాదాలున్నాయి. ఈ నేపథ్యంలో కొద్దిరోజులుగా మానసిక వేదనతో ఉన్న హనుమంతరెడ్డి శనివారం రాత్రి పంతంగిలోని ఇంటికి వచ్చి ఉరి వేసుకున్నారు. ఆదివారం తెల్లవారుజామున పక్కింట్లో ఉన్న వారు చూసి పోలీసులకు సమాచారమివ్వడంతో విషయం వెలుగు చూసింది. పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అయితే, తన భర్త మృతికి ఆడపడుచులు, మరిదే కారణమని హనుమంతరెడ్డి భార్య స్వప్న పోలీసులకు ఫిర్యాదు చేయగా.. ముగ్గురిపై కేసు నమోదైంది. దీంతో భయపడ్డ ఇద్దరు చెల్లెళ్లు, తమ్ముడు... ఆ కేసును ఉపసంహరించుకోవాలని గ్రామ పెద్దలు, బంధువుల ద్వారా హనుమంతరెడ్డి భార్యపై ఒత్తిడి తెచ్చారు. ఆస్తి విషయమై కోర్టులో ఉన్న కేసును ఉపసంహరించుకుంటేనే అంత్యక్రియలు నిర్వహిస్తామని హనుమంతరెడ్డి భార్య స్వప్న, బంధువులు భీష్మించారు. ఆది, సోమ వారాల్లో అతడి సోదరుడు, చెల్లెళ్లతో బంధువులు చర్చించారు. కేసు ఉపసంహరణకు వారు ఒప్పుకొన్నా.. సోమవారం కోర్టు సమయం మించిపోవడంతో వీలు కాలేదు. మంగళవారం కేసు ఉపసంహరించుకున్న తర్వాత అంత్యక్రియలు నిర్వహించేందుకు బంధువులు ఏర్పాట్లు చేస్తున్నారు. -
వెంకన్న దర్శనానికి వెళుతూ..
నలుగురు హైదరాబాదీల దుర్మరణం చిత్తూరు జిల్లాలో రోడ్డు ప్రమాదం హైదరాబాద్: అప్పు తీసుకుని తప్పించుకు తిరుగుతున్న వ్యక్తిని పట్టుకుని... అటునుంచి వెంకన్న దర్శనం చేసుకుందామని తిరుపతికి బయలుదేరిన నలుగురు నగరవాసులు తిరిగిరాని లోకాలకు వెళ్లారు. చిత్తూరు జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మృత్యువాత పడ్డారు. హైదరాబాద్ మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్కు చెందిన స్నేహితులు హన్మంతరెడ్డి(40), శ్రీనివాస్రెడ్డి (35), కిషన్రెడ్డి (38) వివిధ జిల్లాల నుంచి వచ్చి నగరంలో స్థిరపడ్డారు. వీరంతా వేర్వేరు పరిశ్రమల్లో పనిచేస్తూ చిన్నపాటి ఫైనాన్స్ వ్యాపారం నిర్వహిస్తున్నారు. ఇదే ప్రాంతానికి చెందిన స్నేహితులు తిరుపాల్రెడ్డి(38), ప్రేమ్సుందర్రెడ్డి(42) ఎల్అండ్టీలో పనిచేస్తున్నారు. మరొకరి పరిస్థితి విషమం... కాగా, బుధవారం రాత్రి స్థానికంగా ఓ నిశ్చితార్థ కార్యక్రమానికి హాజరైన వీరు... 7.30 ప్రాంతంలో తిరుపతికి బయలుదేరారు. వీరి వద్ద రూ.10 లక్షల అప్పుతీసుకున్న తిరుపతికి చెందిన వ్యక్తి తప్పించుకు తిరుగుతున్నాడు. ఆచూకీ లభించడంతో అతడి నుంచి బాకీ వసూలు చేసుకుని, అనంతరం తిరుమల వెంకన్న దర్శనం కూడా చేసుకుందామని తిరుపతికి కారులో పయనమయ్యారు. కాగా, గురువారం ఉదయం తిరుపతి–శ్రీకాళహస్తి ప్రధాన రహదారిలో రేణిగుంట మండలం వెదుళ్లచెరువు వద్ద వేగంగా వచ్చిన ఓ లారీ వీరి కారును ఢీకొట్టింది. కారు నుజ్జునుజ్జయింది. ఐదుగురిలో శ్రీనివాస్రెడ్డి, కిషన్రెడ్డి, ప్రేమ్సుందర్రెడ్డి అక్కడికక్కడే మృతిచెందారు. తిరుపాల్రెడ్డి చికిత్స పొందుతూ మరణించాడు. హన్మంతరెడ్డి తిరుపతి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అతడి పరిస్థితి విషమంగా ఉంది. దీంతో స్థానికంగా విషాద ఛాయలు అలముకున్నాయి. కాగా పాకాల మండలంలోని పెరుమాళ్లగుడి పల్లి వద్ద గురువారం ఉదయం ట్యాంకరు ట్రాలీ బోల్తా పడిన మరో ప్రమాదంలో ఇద్దరు చనిపోయారు. వీరు కుక్కలపల్లి హరిజనవాడకు చెందిన సుబ్బరాయలు(54), మధుసూధన్(34).