breaking news
Hamid
-
బంగ్లా మాజీ అధ్యక్షుడు హమీద్ పరార్
ఢాకా: బంగ్లాదేశ్ మాజీ అధ్యక్షుడు మొహమ్మద్ అబ్దుల్ హమీద్(Mohammed Abdul Hamid)(81) ఎవరికీ చెప్పాపెట్టకుండా రహస్యంగా దేశం విడిచి వెళ్లిపోయారు. మంగళవారం తెల్లవారుజామున 3 గంటలకు అందరూ గాఢనిద్రలో ఉన్న సమయంలో ఢాకా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు నుంచి థాయ్ ఎయిర్వేస్ విమానంలో గుర్తుతెలియని ప్రాంతానికి చేరుకున్నారు. ఇంటి నుంచి చక్రాల కురీ్చలో వెళ్లే సమయంలో ఆయన ఒంటిపై లుంగీ మాత్రమే ఉండడం గమనార్హం. మాజీ అధ్యక్షుడు ప్రస్తుతం థాయ్లాండ్లో ఉన్నట్లు భావిస్తున్నారు.గత ఏడాది షేక్ హసీనాకు వ్యతిరేకంగా జరిగిన ఆందోళనలు, నిరసన కార్యక్రమాలను బలవంతంగా అణచివేసిన కేసులో మొహమ్మద్ అబ్దుల్ హమీద్పై దర్యాప్తు జరుగుతోంది. ఆయనపై హత్య కేసు సైతం నమోదైంది. ఈ నేపథ్యంలో దేశం విడిచి వెళ్లిపోవడం ప్రాధాన్యం సంచలనాత్మకంగా మారింది. మొహమ్మద్ అబ్దుల్ హమీద్ వ్యవహారం పట్ల బంగ్లాదేశ్లోని మధ్యంతర ప్రభుత్వం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆయన పారిపోకుండా అప్రమత్తంగా ఉండాల్సిన పోలీసు అధికారులు నిర్లక్ష్యం ప్రదర్శించడం పట్ల మండిపడింది. కొందరు అధికారులను విధుల నుంచి సస్పెండ్ చేసింది.మరికొందరికి బదిలీ వేటు వేసింది. మొహమ్మద్ అబ్దుల్ హమీద్ పరారీపై ఉన్నత స్థాయి దర్యాప్తు జరపాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు విద్యాశాఖ సలహాదారు సి.ఆర్.అబ్రార్ నేతృత్వంలో దర్యాప్తు కమిటీని ఏర్పాటు చేశారు. హమీద్ 2013 నుంచి 2023 మధ్యలో రెండుసార్లు బంగ్లాదేశ్ అధ్యక్షుడిగా పనిచేశారు. 2024లో షేక్ హసీనాతోపాటు ఆమె అనుచరులపై నమోదైన హత్య కేసులో ఆయన సహ నిందితుడిగా ఉన్నారు. ఈ ఏడాది జనవరి 14న కిశోర్గంజ్ సదర్ పోలీసు స్టేషన్లో ఆయనపై హత్య కేసు నమోదైంది. వైద్యం కోసమేనా? కేవలం వైద్యం కోసమే హమీద్ థాయ్లాండ్ వెళ్లారని కుటుంబ సభ్యులు చెప్పారు. ఆయనతోపాటు సోదరుడు, బావమరిది కూడా వెళ్లినట్లు తెలిపారు. అయితే, దర్యాప్తు నుంచి తప్పించుకోవడానికే దేశం నుంచి హమీద్ పరారైనట్లు రాజకీయ ప్రత్యర్థులు ఆరోపిస్తున్నారు. మాజీ ప్రధాని షేక్ హసీనాకు చెందిన అవామీ లీగ్ పారీ్టలో హమీద్ చురుగ్గా వ్యవహరించారు. పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నికయ్యారు. అవామీ లీగ్ విద్యార్థి విభాగమైన ఛాత్రా లీగ్ ద్వారా రాజకీయ జీవితం ప్రారంభించారు. ఛాత్రా లీగ్ను గత ఏడాది అక్టోబర్లో మధ్యంతర ప్రభుత్వం నిషేధించింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఆయన ఇంటిని ఇస్లామిక్ రాడికల్స్ కూల్చివేశారు. -
తల్లి
మాస్టర్ హమీద్ ఢిల్లీలో బారహటోటేలోని ఒక పాఠశాలలో ఉపాధ్యాయుడు. అతడి అసలు నివాసస్థానం రషీదాబాదులోని పహాడి మొహల్లా. అతని తండ్రి రషీదాబాద్లో కంచరపని చేస్తూ ఉండేవాడు.హమీద్ బాల్యంలో తన పేటలోని మసీదులోనూ, తరువాత కొద్దిరోజులు ముల్లా సాహెబ్ బడిలోనూ, ఆ తరువాత తండ్రిగారి ఇష్టప్రకారం కొంతకాలం తాలూకా స్కూలులోనూ చదువుకున్నాడు.హమీద్ ఉర్దూ పాసయిన రోజుల్లో రషీదాబాద్లో ప్లేగువ్యాధి వ్యాపించి హమీద్ తండ్రిని బలిగొన్నది.ఆయన అంత్యకర్మలన్నీ పూర్తి చేసిన తరువాత హమీద్ తల్లి దగ్గర లెఖ్ఖ చూసుకుంటే డెబ్బై రూపాయలు మిగిలినవి. మిడిల్ ప్యాసయిన తరువాత హమీద్కు ఇంగ్లీష్ గూడా చదువుకొందామని అభిలాష కలిగినది. కాని ఎలాగా చదువుకోడం?వీరి పేటలో ఉండే ఒకాయన ఢిల్లీలో పోలీసుగా ఉండడంవల్ల హమీద్ రెండుమూడుసార్లు ఢిల్లీని గురించి విని ఉన్నాడు. అందువల్ల తల్లి దగ్గర పదిహేను రూపాయలు తీసుకొని మెల్లగా ఢిల్లీ చేరుకున్నాడు.పోలీసు కానిస్టేబుల్ నవరుల్లాఖాన్ ఇల్లు ఎలాగా తెలుసుకోవడం!చచ్చిచెడి అతని ఇల్లు తెలుసుకున్నాడు. నవరుల్లాఖాన్ హమీద్ తండ్రిని బాగా ఎరుగును. అందువల్ల అతను హమీద్ను ఆదరించి తన ఇంట్లో ఉండి చదువుకోడానికి అవకాశం కలుగజేశాడు. నవరుల్లాఖాన్ ఇంట్లోనే ఉంటూ హమీద్ మూడు సంవత్సరాల్లో పదో క్లాసుకు వచ్చాడు.లెక్కల్లో హమీద్ నిధి.ఒక సహాధ్యాయుడికి పాఠం చెప్పడం ప్రారంభించి నెలకు ఏడు రూపాయలు సంపాదించడం ఆరంభించాడు. ఏడు రూపాయలు తన భోజనానికి సరిపోతవి గనుక వేరుగా ఉంటానని తాను ఎంత బ్రతిమిలాడినా నవరుల్లాఖాన్ అంగీకరించనందున, హమీద్ విధిలేక అక్కడే ఉండిపోయాడు.ఆవిధంగా పదినెలల్లో హమీద్ డెబ్బయి రూపాయల రొక్కం సంపాదించాడు. తల్లి దగ్గరి నుండి తెచ్చినవి పది రూపాయలు మిగిలి ఉన్నవి. ఒకసారి తల్లి రెండు రూపాయాలు మనియార్డర్ పంపించింది. మొత్తం అతని దగ్గర ఎనభైరెండు రూపాయాలు పోగుపడినవి.స్కూలుకు వేసవి సెలవులు ఇచ్చారు.నవరుల్లాఖాన్ కూడా సెలవు పెట్టాడు.ఇద్దరూ కలిసి రషీదాబాద్ వచ్చారు.అప్పటికి హమీద్ తల్లి దగ్గర భర్త అంత్యక్రియలు చేయగా మిగిలిన డబ్బు పన్నెండు రూపాయలు మిగిలి ఉన్నాయి. ఇంటి ముందు ఉన్న పనసచెట్టు అమ్మడం వల్ల ప్రతి సంవత్సరం పాతికరూపాయల ఆదాయం వస్తూ ఉండేది.ఇంటికి పోయేటప్పటికి తల్లి హమీద్కు వివాహసంబంధం మాట్లాడి సిద్ధం చేసి పెట్టింది. ఆ డబ్బు హమీద్ దగ్గర ఉన్న డబ్బు అంతా ఖర్చు పెట్టి ఏదోవిధంగా హమీద్ఖాన్ వివాహం పూర్తి చేసింది. పెళ్లి అయిన ఏడో రోజున తిరిగి హమీద్ ఢిల్లీకి వెళ్లాడు. ఆ సంవత్సరం పరీక్షల్లో పాసయ్యాడు.ఇక ఉద్యోగం! ఒక ప్రైవేటు స్కూల్లో కోద్దిరోజులు నౌకరీ కుదిరింది. తరువాత ఇంకొక స్కూళ్లో, ఆ తరువాత ఇంకొంక స్కూల్లో, చివరకు ఒక స్కూల్లో అతని పనిచూసి సంతోషించి ఆ స్కూలు ప్రధానోపాధ్యాయుడు అతడి ఉద్యోగం ఖాయం చేశాడు.నెలకు ఇరవైరూపాయల జీతం. ఇక వేరే కాపురం పెడతానని హమీద్ నవరుల్లాఖాన్ను అడిగాడు.ఒంటరి కాదు. భార్యను కూడా తీసుకొని రమ్మని నవరుల్లాఖాన్ మూడురూపాయల అద్దెకు ఒక చిన్న ఇల్లు కుదిరించి పెట్టాడు. హమీద్ఖాన్ రషీదాబాద్ వెళ్లి భార్యను తీసుకొచ్చి ఆ ఇంట్లో కాపురం పెట్టాడు.రషీదాబాద్లో తల్లి ఒంటరిగా ఉండిపోయింది. హమీద్ భార్యను ఢిల్లీ తీసుకొనివచ్చి ఏడు సంవత్సరాలు గడిచింది. అతనికి ముగ్గురు మొగపిల్లలూ, ఒక ఆడపిల్లా పుట్టారు. వారిలో ఒక మగపిల్లవాడూ, ఆడపిల్లా చనిపోయారు. హమీద్ భార్యకు కూడా చాలా జబ్బు చేసింది. ఒకసారి హమీద్కు ఎండదెబ్బ తగిలి పదిహేనురోజులు మంచంలోనే ఉండిపోయాడు. అటు స్కూల్లో పని పెరిగిపోయింది. ఇటు జీతం మప్పైరూపాయలయింది. పది రూపాయలు ప్రైవేటు చెప్పి సంపాదించేవాడు. కాని ఢిల్లీలో ఆ డబ్బు అతనికి ఏమాత్రం సరిపోయేది కాదు. తల్లి రషీదాబాద్ రమ్మని ఉత్తరాల మీద ఉత్తరాలు రాసేది. కాని డబ్బు లేక తల్లిని చూడాలని ఎంత కుతూహలమున్నా హమీద్ రిషీదాబాదుకు పోలేకపోయాడు.రోజు ఉదయమే లేచి మసీదుకు పోయి నమాజు చేసుకోవడం, ఇంటికి తిరిగి వచ్చిన తరువాత ఖురాన్లో నుండి ఒక అధ్యాయం పారాయణం చేయడం అతని అలవాటు. మసీదు నుంచి ఇంటికి వస్తూ ఉన్నప్పుడు రోజూ ముసలిచాకలి జానకి నడుము వంగిపోయి కర్రపోటు వేసుకుంటూ చాకిరేవుకు పోతూ కనబడేది, కాని ఎందువల్లనో అయిదు రోజుల నుంచి జానకి కనబడడం లేదు. హమీద్కు ఆశ్చర్యం వేసింది. జానకి కనబడని రోజే లేదు. ఎందువల్ల కనపడడం లేదో తెలుసుకుంటానని జానకి ఇంటికి వెళ్లాడు. జానకి ఏమైందని అక్కడి వాళ్లను ప్రశ్నిస్తే నిన్నరాత్రి చనిపోయిందని వాళ్లు జవాబు చెప్పారు.జానకి చనిపోయిందని వినగానే హమీద్ గుండె గుభీలుమన్నది. జానకికి హమీద్కు ఏమి సంబంధం ఉన్నదో భగవంతునికి తెలియాలి! స్కూలుకు పోయాడు. అక్కడ అతనికి ఏమీ తోచలేదు. ఏదోవిధంగా కాలక్షేపం చేసి స్కూలు వదిలిపెట్టగానే ఇంటికి చేరాడు.‘‘ఒంట్లో బాగలేదా?’’ అని అడిగింది భార్య.ఏమీ వినిపించుకోలేదు, తెల్లవార్లూ అతనికి నిద్రపట్టలేదు. మర్నాడు బక్రీదు. స్కూలుకు సెలవ, స్టేషన్కు పోయి రషీదబాద్కు టికెట్ కొన్నాడు. రైల్లో పడ్డాడు. బక్రీదురోజు పగలల్లా రైల్లోనే గడిచింది. నమాజు లేదు. ఖుర్బానీ లేదు. ముసలితల్లి ధ్యాసే. కళ్ల ముందు ముసలితల్లి కనిపించడం ఆరంభించింది. తెల్లబడిపోయిన వెంట్రుకలు, ముడతలు పడిపోయిన శరీరం, వంగిపోయిన నడుము, భార్య, పిల్లల మీద మక్కువ వల్ల హమీద్ ముసలితల్లిని మరిచిపోలేదు. నాలుగైదు సార్లు ఏడెనిమిది రూపాయలు తల్లికి మనియార్డర్ కూడా పంపించాడు. ఆ డబ్ము పంపినప్పుడల్లా, తనూ, తన పిల్లలు చాలా ఇబ్బంది పడేవాళ్లు, తన తల్లికి ఉత్తరాలు రాసినప్పుడు పిల్లల చేత కూడా ఆ ఉత్తరాల మీద ఏవో గీతలు గీయించేవాడు. ఆ పిచ్చిగీతలు చూసి తన తల్లి సంతోషించవలెనని తన అభిప్రాయం. అతని భార్య కూడా రాయడం నేర్చుకుంది. అత్తగారికి సలాములు తెలియపరుస్తూ ఉండేది. వచ్చే సంవత్సరం పంటరోజుల్లో తప్పక వస్తానని రాసేవాడు. కుటుంబంతో పోవాలి. పళ్ళు ఫలాలు తీసుకొని పోవాలి. అందుకు డబ్బు కావాలి. వచ్చే జీతంతో తిండి గడపడమే కష్టంగా ఉండేది. అందువల్ల ఎప్పటికప్పుడు ప్రయాణాన్ని ఆపుకునేవాడు. కాని జానకి మరణవార్త విని గుండె పగిలినట్లయి ఆగలేక ఒంటరిగా బయలుదేరాడు.బక్రీదునాడు సూర్యస్తమయం సమయానికి హమీద్ రషీదబాదు చేరాడు. పై నుండి భోరున వర్షం కురవడం ఆరింభించింది. అతనికి స్మృతి వచ్చినట్లయింది, గొడుగు మాత్రం చేతిలో ఉన్నది. అయ్యో! బట్టలన్నా తెచ్చుకోలేదు అనుకున్నాడు. గొడుగు వేసుకొని బయలుదేరాడు. జనం నివసించే చోట నీళ్లు నిలవకూడదనే ఆరోగ్యసూత్రం గ్రామస్తులకు అర్థమయ్యేది కాదు, అర్థమైనా వాళ్లు పట్టించుకునే వాళ్లు కారు. మోకాళ్లలోతు నీళ్లలో పడుతూ, లేస్తూ మెల్లగా ఇంటికి చేరుకున్నాడు. తలుపు లోపల వేసి ఉన్నది. తలుపు తట్టాడు. ‘‘అమ్మా! అమ్మా!’’ అని పెద్దగా పిలిచాడు.లోపల నుంచి ఒక లావుపాటివాడు వచ్చి తలుపు తెరిచాడు. బక్రీదు పిండివంటలన్నీ తిని అరగడానికి నిద్రబోయి అప్పుడే లేచినట్లు కనపడ్డాడు, హమీద్ను గుర్తుపట్టి మూడుసంవత్సరాల క్రితం ఆ ఇల్లును కొన్నట్లున్నూ, హమీద్ తల్లి దర్జీ ఆమె ఇంట్లో ఉన్నదని చెప్పాడు. తలుపు వేసుకొని లోపలికి వెళ్లిపోయాడు.హమీద్కు అడుగు ముందుకు పడలేదు. ఇల్లు కూడా అమ్మవలసినంత కష్టంలో తల్లి పడిపోయింది కాబోలు అనుకున్నాడు. పనసచెట్టు ఆదాయంతో కాలక్షేపం చేస్తున్నదనుకొని చాలా పొరపాటు చేశాననుకున్నాడు.ఆ తల్లికి ముఖం చూపించడం ఎలా?ఎంత స్వార్థం తనలో బలిసిపోయింది. తన పిల్లలు మంచినీ, తన మంచినీ తను చూసుకున్నాడేగాని ముసలితల్లి గురించి ఆలోచించనైనా లేదుగదా అని పశ్చాత్తాపపడ్డాడు. మెల్లగా దర్జీ ఆమె ఇంటిదగ్గరకు కాళ్లీడ్చుకుంటూ చేరాడు. తలుపు తట్టబోయినాడు. చెయ్యి లేవలేదు.దర్జీ సోతీ వచ్చి తలుపు తీసింది. హమీద్ను గుర్తుపట్టింది.‘‘హమీద్ వచ్చాడు. హమీద్ వచ్చాడు’’ అంటూ లోపలకు పరుగెత్తింది. హమీద్ తల్లి ఈమధ్య అశక్తత వల్ల ఇంట్లో అటూ ఇటూ మనలడం కూడా మానుకున్నది. ఆమె కళ్లు కూడా ఏమీ కనిపించేవికావు. కాని హమీద్ వచ్చాడనడంతోనే ఆ సంతోషంలో ఎక్కడి నుండి శక్తి వచ్చిందో గభీమని లేచి వాకిట్లోకి దూకి హమీద్ను ఆలింగనం చేసుకొన్నది. వెక్కి వెక్కి ఏడ్చింది.ఆమె శరీరంలో ఎముకలు తప్పా ఏమీలేవు.తల మీద వెంట్రుకలు తెల్లబడిపోయినవి. నడుము వంగిపోయింది. మెడ శిరస్సు భారాన్ని కూడా సహించలేకుండా ఉన్నది. ప్రేమ వల్లనో, ముసలితనం వల్లనో ఆమె శరీరం వణకనారంభించింది.చాలాసేపూ ఇద్దరూ మాట్లాడలేకపోయారు. చివరికి తల్లి మెల్లగా కంఠం పెకిలించుకొన్నది.‘‘నాయనా! చాలా దూరం నుండి వచ్చావు. బట్లలన్నీ తడిసిపోయాయి. బట్టలు మార్చుకో. టీ తీసుకొని వస్తాను. పిల్లలంతా కులాసాగా ఉన్నారా!’’ అని ప్రశ్నించింది.‘‘అమ్మా! ఇల్లు అమ్మివేశావా? నాకు చెప్పలేదేమిటి?’’ అని అడిగాడు.‘‘నాయనా! నీకు తెలిస్తే మాత్రం నువ్వేమీ చేస్తావు. నీకు మాత్రం కష్టాలు తక్కువ ఉన్నవి గనుకనా! ఈ దర్జీ సోతి నాకు చాలా సహాయం చేస్తున్నది. నీ కష్టాలు నీకు గాక నా బాధ కూడా నీకెందుకు నాయనా? ఈ జన్మలో నిన్ను చూడలేమో అనుకున్నాను. నువ్వు వచ్చావు’’ అన్నది.హమీద్ కళ్ల వెంట బొటా బొటా నీళ్లు కార్చాడు. ఇల్లు నలువైపులా కలయజుశాడు. ఎదుట మంచం మీద దర్జీ ఆమె ఇద్దరు పిల్లలూ నిద్రబోతున్నారు. ఒక పిల్లవాడు కింద ఆడుకుంటున్నాడు.దర్జీ సోతి పొయ్యి రాజేస్తున్నది. ఆమె కొనుక్కున్న రవిక వీపు మీద చిరిగిపోయి ఉన్నది. బట్టలు మాత్రం తెల్లగా ఉన్నవి. బక్రీదు పండుగ కదూ!‘‘అమ్మా! రోజూ నువ్వు ఇక్కడనే నిద్రపోతుంటావా?’’‘‘కాదు నాయనా! ఆమె ఈ గదిలో పిల్లలతో పడుకుంటుంది. నేను అవతలి గదిలో పడుకుంటాను’’ అన్నది తల్లి.‘‘అమ్మా! నీవు ఇంకా పనిచేస్తూనే ఉన్నావా? చేతులు పనిచేయనిస్తున్నాయా’’‘‘చేతులు బాగానే ఉన్నవిగాని కళ్లు మాత్రం నెలరోజుల నుండి కనబడడం లేదు నాయనా’’‘‘కళ్లు కనబడడం లేదా?’’ అన్నాడు ఆతురతతో హమీద్.తల్లి హమీద్ తలను చేతితో నిమిరింది. చేయి బుగ్గలదాకా పోనిచ్చింది. అతని తలను తన హృదయానికి హత్తుకుంది. చిరునవ్వు నవ్వింది.‘‘కళ్లు కనబడడం లేదా అంటున్నావా నాయానా! నీవు కనబడుతూనే ఉన్నావు. రోజూ సూర్యుడు కనబడతాడు. అంతే, మిగిలిన వస్తువులు ఏమీ కనబడవు. చిన్నపిల్లవాడు కులాసాగా ఉన్నాడ? వాడి వయస్సెంత?’’ అని అడిగింది. ‘‘సంవత్సరంన్నర’’‘‘అయితే చొక్కా, టోపీ వాడికి సరిపోతవి’’ అంటూ ఒక పాత బట్టల మూట విప్పి అందులో నుండి ఒక చొక్కాను, బుటేదారీ పనిచేసియున్న ఒక టోపీని బయటకు తీసింది.‘‘మజీద్ కోసం ఇవి తయారుచేశావా?’’ అని హమీద్ కన్నీళ్లు కార్చాడు.‘‘కాదు నాయానా! సలమా కోసం కుట్టి తయారుచేశాను. పంపుదామంటే నీవు రానేలేదు. తరువాత సలామా చచ్చిపోయిందని ఉత్తరం రాశావు’’ అని చొక్కా వంక చూసి కన్నీళ్లు పెట్టుకొన్నది. లేచి లోపలికి వెళ్లిపోయింది. టీ తెచ్చి ఇచ్చింది. తాగాడు. తల్లి మంచం మీద కూర్చొని ఉండిపోయినాడు.ఏమిటేమిటో ఆలోచనలు!హమీద్ తనను తాను మరచిపోయినాడు.అలా రెండు గంటలు గడిచింది.పక్క ఇంటి నసీబన్ కూడా వచ్చింది.నసీబన్, హమీద్ తల్లి, సోతి వంట ఇంట్లో ఏమిటేమిటో చేస్తూ ఉండిపోయినారు.సుమారు ఎనిమిది గంటలకు హమీద్ తల్లి బయటికి వచ్చి–‘‘నాయానా! భోజనానికి లేవమ’’న్నది.అప్పటికి హమీద్కు కొద్దిగా నిద్రపట్టింది. ఉలిక్కిపడి లేచాడు.బీదస్థితిలో ఉన్నది గనుక తల్లి జొన్నరొట్టె తయారుచేసి ఉంటుందనుకున్నాడు. కాని వడ్డించిన పదార్థలను చూసి ఆశ్చర్యపడ్డాడు.కబాబు, మేక గుండెకాయ కూర, పరాఠాలు, మినప్పప్పు పప్పు, మామిడికాయ పచ్చడి, ఒక కప్పులో మీగడ, ఒక ప్లేటులో పండిన మామిడి పండు ముక్కలు ఘుమఘుమలాడుతున్నవి. ఇంత బీదతనంలో ఉన్న తల్లి ఈ సామానంత ఎలా సేకరించిందా అని ఆలోచించాడు. భోజనం చేశాడు.భోజనం చేస్తున్నంతసేపూ తల్లి దగ్గర కూర్చొని లోకాభిరామాయణం చెప్పింది. కొసరి కొసరి వస్తువులు వడ్డించింది. తృప్తిగా భోజనం చేశాడు. లేచి చేతులు కడుక్కొని మంచం మీదకు చేరాడు.దర్జీ ఆమె, నసీబన్ ఇద్దరూ బయటకు వెళ్లి కొంత సేపట్లో తిరిగివచ్చారు.తల్లి హమీద్ దగ్గరకు వచ్చింది.‘‘నాయనా! ఒక్కమాట చెపుతాను. వింటావా?’’ అని అడిగింది.హమీద్ ముఖం వెలవెలబోయింది. గుండె దడదడలాడింది.బహుశా తల్లి తనతో కూడా ఢిల్లీ వస్తానంటుందనుకున్నాడు. లోలోపల అనేక ఆలోచనలు! తనకు వచ్చే జీతం చాలా కొద్ది, ఢిల్లీలో ఆ కొద్ది జీతం మీద అంతమందీ బతకడం ఎలాగా? భార్య, పిల్లలూ, తల్లీ ఇంత మందిని తను పోషించగలడా! తల్లివంక అలాగే చూస్తూ ఉండి పోయినాడు. ‘‘నాయనా నీవు పట్టణంలో ఉండేవాడివి. నౌకరీదారుడివి. నేను పరాయివాళ్ల పంచల్లో తలదాచుకొంటున్నాను. నీకు ఎలా మర్యాద చేయగలను? నసీబన్ను పంపించి ఖాన్సాహెబ్గారి ఇంట్లో ఒక గది బాగు చేయించాను. మంచం, పక్కా వేయించాను. కాని నీవు నాతోబాటే ఉంటే బాగా ఉంటుందని నా మనస్సు కోరుతున్నది. ఈ ముసలిముండతో కూర్చోమంటే నీకు మనస్సుకు ఏమి కష్టం కలుగుతుందోనని చూస్తున్నాను. భయపడుతున్నాను. నాయనా! నా కోరిక పూర్తి చేస్తావా?’’ అని భయపడుతూ అడిగింది.‘‘అదుగో, మంచం కూడా తెప్పించాను’’ అని ఎదుట పరిచి ఉన్న మంచం చూపించింది.తల్లి మాటలకు హమీద్ గుండె కరిగిపోయింది.నోట నుండి మాట రాలేదు.‘‘అమ్మా! నీ దగ్గర ఉండకపోతే నేను ఇంకెక్కడకు పోతాను?’’ అన్నాడు.తల్లి ఆనందభరితురాలయింది.హమీద్ శిరస్సును ఆఘ్రాణించింది. నసీబన్ను పిలిచి మంచం తన గదిలో వేయించింది. ఒక మూట విప్పి తెల్లటి దుప్పటి బయటకు తీసింది. ఆ దుప్పటి మీద రకరకాల లతలు కుట్టి ఉన్నవి. ఆ మూటలో నుంచి రెండు దిండ్లు బయటకుతీసింది. తెల్లటి గలీబులు కుట్టి ఉన్నవి.చిన్న సీసాలో నుంచి తీసి గలీబులకు అత్తరు రాసింది.మంచం కింద ఒక పీక్దాసును పెట్టించింది. ఢిల్లీపూల నల్ల చెప్పుల జోడు–కొత్తది–మంచం కాళ్ల వైపున పెట్టి ‘‘నాయనా! అలిసిపోయినావు. ఈ మంచం మీద పడుకొని నిద్రబొమ్మన్న’’ది.హమీద్ ఈ తమాషా అంతా చూస్తున్నాడు.యా అల్లాహ్! ఈ సామానంతా ఎలా వచ్చింది? చివరకు తల్లిని అడిగాడు. రషీదాబాద్ కూడా చిన్న బస్తీలాంటి గ్రామమే. అన్నీ ఈ ఉళ్లోనే దొరికినవని జవాబు చెప్పింది.‘‘అమ్మా! భోజనం సంగతి సరే. ఈ చెప్పులు, ఈ పీక్దాసు, ఈ దుప్పటి ఇవన్నీ ఎలా కొన్నావు?’’తల్లి వేడి వేడి కన్నీళ్లు కార్చింది.మాతృదేవతా వాత్సల్యం అనుపమానం!‘‘ఏడు సంవత్సరాలు ఎదురు చూశాను. ఇల్లు అమ్మాను. పొట్ట బిగించుకొని నీ కోసం, నీ పిల్లల కోసం ఈ వస్తువులన్ని సేకరించాను. నీ కోసం ఎదురు చూసి చూసి కళ్లు కాయలు గాచినవి. నాయానా! ఈ వస్తువుల్ని సేకరించడానికి ఏడు సంవత్సరాలు పట్టింది. సలమాను చూడనే లేదు’’ అంటూ వెక్కి వెక్కి ఏడ్చింది.తల్లి మాటను విని శాంతిదేవత ఆ చిన్నగది నిండా తన రెక్కలను విప్పింది. ఇక ఎవరూ మాట్లాడలేదు.తెల్లవారింది. హమీద్ తల్లి ఇక కళ్లు తెరవలేదు. -
చెన్నైలో భారీగా హవాలా నగదు పట్టివేత
సాక్షి, చెన్నై: చెన్నైలోని అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీగా హవాలా నగదు పట్టుబడింది. సింగపూర్కు తరలిస్తున్న దాదాపు రూ. 1.9 కోట్ల విలువచేసే నగదును అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మీనంబాక్కం విమానాశ్రయం నుంచి సింగపూర్కు అమెరికన్ డాలర్స్, యూరో కరెన్సీ తరలుతున్నట్టు లభించిన పకడ్బందీ సమాచారంతో అధికారులు అప్రమత్తమయ్యారు. బుధవారం అర్ధరాత్రి 12.30 గంటల సమయంలో సింగపూర్ ఎయిర్లైన్స్ విమానంలో వెళ్లే ప్రయాణికులను తనిఖీ చేశారు. పర్యాటక వీసాతో అనుమానాస్పదంగా కనిపించిన పెరంబూరుకు చెందిన హమీద్ను అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అతడి వద్ద ఓ బ్యాగులో రూ.17 లక్షల విలువగల అమెరికన్ డాలర్లు, యూరో కరెన్సీ బయటపడింది. దీంతో అతడిని విచారించగా, ఓ వ్యక్తి ఇలాంటి బ్యాగులను తనతోపాటు పలువురికి ఇచ్చినట్టు చెప్పాడు. ఈ సమాచారంతో సింగపూర్కు వెళ్లే అన్ని విమానాలను అధికారులు తనిఖీ చేశారు. ఎయిర్ ఇండియా విమానంలో సింగపూర్కు వెళ్లేందుకు సిద్ధమైన ఇస్మాయిల్, తాజుద్దీన్, మహ్మద్లను అదుపులోకి తీసుకుని, వారి వద్ద ఉన్న బ్యాగ్లను తనిఖీ చేశారు. అందులో రూ.1.73 కోట్ల విలువగల అమెరికన్ డాలర్లు బయటపడ్డాయి. దీంతో ఆ నలుగురిని అరెస్టు చేసి, బ్యాగ్లను ఇచ్చిన వ్యక్తి కోసం గాలిస్తున్నారు. -
రైల్వే వెబ్ సైట్ హ్యాకర్ దొరికాడు
న్యూఢిల్లీ: తరచూ రైల్వే వెబ్ సైట్ ను హ్యాక్ చేస్తూ ప్రజల డబ్బును దండుకున్న నిందితుడిని ఎట్టకేలకు సీబీఐ అధికారులు వల పన్ని పట్టుకున్నారు. వెబ్ సైట్ ను హ్యాక్ చేసి రైల్వే ఫేక్ టికెట్లు జనరేట్ అయ్యేవిధంగా చేసిన హమీద్ ను గురువారం సీబీఐ, రైల్వే విజిలెన్స్ అధికారలు ఉత్తరప్రదేశ్ లోని బస్తీ టౌన్ లో అరెస్టు చేశారు. నకిలీ టికెట్లను తయారుచేసే సాఫ్ట్ వేర్ ను హమీద్ తయారు చేసినట్లు గుర్తించామని ఇందుకోసం, అతడిని పట్టుకునేందుకు మూడు రోజుల పాటు పట్టణంలోనే గడిపినట్లు కేసును డీల్ చేసిన అధికారి రోహిత్ మిశ్రా తెలిపారు. దేశవ్యాప్తంగా ఫేక్ టికెట్లను తయారు చేసే ముఠాలతో హమీద్ కు సన్నిహిత సంబంధాలు ఉన్నాయని, అతని నుంచి 10 ల్యాప్ టాప్ లు, 16 ఏటీఏం కార్డులు, రెండు పాన్ కార్డులు, 50 లక్షల నగదును సీజ్ చేసినట్లు పోలీసులు తెలిపారు. ప్రస్తుతం సీబీఐ, రైల్వే విచారణా బృందాలు అతన్ని విచారిస్తున్నట్లు మరో అధికారి తెలిపారు. -
ఎముకల నుంచి నూనె, డాల్డా తయారీ
రాజేంద్రనగర్, న్యూస్లైన్: ఆకలి వేస్తోంది కదా అని కనిపించిన ప్రతీ హోటల్లో ఏది బడితే అది తినకండి. అలా తిన్నారా.. చేజేతులా మీ ఆరోగ్యాన్ని మీరే నాశనం చేసుకున్నవారవుతారు. కాసులకు కక్కుర్తిపడి కొందరు ఎముకల నుంచి నూనె, డాల్డా తయారు చేస్తున్నారు. కొన్ని హోటళ్లలో వీటితో ఆహారాన్ని వండి ప్రజల ఆరోగ్యానికి హానికలిగిస్తున్నారు. పశువుల ఎముకల నుంచి అక్రమంగా నూనె, డాల్డా తయారు చేస్తున్న ఓ పరిశ్రమ గుట్టును గగన్పహాడ్ గ్రామస్తులు బుధవారం రట్టు చేశారు. స్థానికుల కథనం ప్రకారం... గగన్పహాడ్ గ్రామ పరిధిలో దాదాపు ఒక ఎకరం స్థలంలో నగరానికి చెందిన హమీద్ అనే వ్యక్తి వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడికి డీసీఎంలో ఎముకలను తీసుకొస్తున్నాడు. పెద్ద పెద్ద కళాయిల్లో ఎముకలను వేసి మరిగించి వాటితో నూనె, డాల్డా తయారు చేయిస్తున్నాడు. అస్సాం, ఒరిస్సా రాష్ట్రాలకు చెందిన కార్మికులను ఈ పనికి ఉపయోగిస్తున్నాడు. ఎవరికీ అనుమానం రాకుండా రాత్రి సమయంలో మాత్రమే ఈ పని చేస్తున్నారు. లారీల కొద్దీ ఎముకలు ఈ ప్రాంతం మీదుగా వెళ్తుండటంతో స్థానిక యువకులకు బుధవారం ఉదయం అనుమానం వచ్చింది. వారు డీసీఎంను అనుసరించగా విషయం బయటపడింది. యువకులు ఈ విషయాన్ని గ్రామస్తులకు చెప్పడంతో పెద్దసంఖ్యలో ఆ పరిశ్రమ వద్దకు వెళ్లి తరలివచ్చి దాడి చేశారు. అక్కడి పని చేస్తున్న కార్మికులపై చేసుకున్నారు. వారు ఉంటున్న మూడు గదులను, ఎముకల లోడ్తో వచ్చిన డీసీఎం వాహనం అద్దాలను ధ్వంసం చేశారు. దాడితో భయకంపితులైన 12 మంది కార్మికులు మూటాముల్లె సర్దుకొని పారిపోయారు. ఇంత జరిగినా శంషాబాద్ పోలీసులు సంఘటనా స్థలానికి రాకపోవడం గమనార్హం. పోలీసులు, జీహెచ్ఎంసీ అధికారులు అన్ని విధాలా సహకరిస్తుండటంతోనే నిర్వాహకుడి ఈ అక్రమ దందా కొనసాగిస్తున్నాడని గ్రామస్తులు ఆరోపించారు. నగరంలోని హోటళ్లకు.... నగరంలోని హోటళ్లకు ఇక్కడి నుండి నూనె, డాల్డాను సరఫరా చేస్తున్నట్లు ఇక్కడ పని చేస్తున్న సిబ్బంది చెప్పారు. హోటళ్ల నిర్వాహకులు ప్రతీ రోజు ఇక్కడికి వచ్చి.. తాము తయారు చేసిన నూనె, డాల్డా తీసుకెళ్తున్నట్టు వారు తెలిపారు. ఘటనా స్థలంలో 50 డ్రమ్ములలో తయారైన డాల్డా, నూనె నిల్వచేసి ఉంది. గతంలో రెండుసార్లు ఇదే స్థలంలో గతంలో రెండుసార్లు ఎముకల నుంచి నూనె, డాల్డాను తయారు చేస్తుండగా శంషాబాద్ పోలీసులకు పట్టించామని గ్రామస్తులు తెలిపారు. ఆ సమయంలో కేవలం కార్మికులను సామగ్రిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారని, అసలు నిందితున్ని అదుపులోకి తీసుకోలేదని వారు ఆరోపించారు.