breaking news
Future Activities
-
కాంగ్రెస్ జోరు పెంచనుందా..? సీడబ్ల్యూసీ కీలక నిర్ణయాలు
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ మళ్లీ పాత వైభవం కోసం ప్రణాళికలు మొదలు పెట్టినట్లు కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ శనివారం జరిగిన సీడబ్ల్యూసీ సమావేశంలో 23 మంది అసమ్మతి నేతలపై సీరియస్ అయ్యారు. సమావేశంలో సోనియా గాంధీ.. 'కాంగ్రెస్ పార్టీకి నేనే పూర్తి స్థాయి అధ్యక్షురాలిని. పార్టీ అంతర్గత విషయాలు మీడియా ద్వారా కాదు నేరుగా నాతో మాట్లాడండి. అన్ని అంశాలపై స్పష్టత తీసుకురావాల్సిన సమయం వచ్చింది. ఎలాంటి అంశాలైనా చర్చించేందుకు సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేసింది. అనంతరం సమావేశంలో రాహుల్ గాంధీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టాలని కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, పార్టీ సీనియర్ నేతలు డిమాండ్ చేయగా, అందుకు రాహుల్ సుముఖత వ్యక్తం చేసినట్లు సమాచారం. తాజాగా దేశంలోని రాజకీయ పరిస్థితులు, ద్రవ్యోల్బణం, రైతులపై జరుగుతున్న దాడులపై ఆమోదం తెలిపింది. త్వరలో కాంగ్రెస్ పార్టీలో నాయకుల దగ్గర నుంచి కింది స్థాయి కార్యకర్తల వరకు భారీగా శిక్షణా కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా పార్టీ సిద్ధాంతాలు, విధానాలు, కాంగ్రెస్ కార్యకర్తల నుంచి పార్టీ ఆశిస్తున్న అంచనాలు, ఎన్నికల నిర్వహణ, ప్రస్తుత ప్రభుత్వ వైఫల్యాలు, ప్రభుత్వ విధానాలను ఎండగడుతూ ప్రజల్లోకి తీసుకెళ్ళాల్సిన విధానం పై ఈ శిక్షణ ఉండనున్నట్లు పేర్కొన్నారు. పార్టీ సంస్థాగత ఎన్నికల నిర్వహణ పై వివరణాత్మకంగా చర్చించినట్లు తెలుస్తోంది. ధరల పెరుగుదల పై నవంబర్ 14 నుంచి 29 వరకు దేశవ్యాప్త ఆందోళన చేపట్టాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. సీడబ్ల్యూసీలో సమావేశంలోని ముఖ్యాంశాలు: ►2021 నవంబర్ 1 నుంచి 2022 మార్చి 31 వరకు దేశవ్యాప్తంగా సాగనున్న కాంగ్రెస్ సభ్యత్వ నమోదు కార్యక్రమం ► 2022 ఏప్రిల్ 1 నుంచి 15 మధ్య ఖరారు కానున్న డీసీసీ ఎన్నికలకు పోటీ పడే అభ్యర్థుల జాబితా ► ఏప్రిల్ 16 నుంచి మే 31 వరకు ప్రాధమిక కమిటీలు, బూత్ కమిటీలు ,బ్లాక్ కమిటీల అధ్యక్షుల ఎంపిక ►జులై 21 నుంచి 20 ఆగస్ట్ వరకు పీసీసీ, ఉపాధ్యక్షులు, కోశాధికారి, పిసిసి కార్యదర్శి వర్గం, ఏఐసిసి సభ్యులు ఎన్నిక ►2022 ఆగస్టు 21 నుంచి సెప్టెంబర్ 20 వరకు సాగనున్న ఏఐసిసి అధ్యక్ష ఎన్నిక ►సెప్టెంబర్ లేదా అక్టోబర్లో ప్లీనరీ సమావేశం సందర్భంగా సిడబ్ల్యుసి సభ్యులు, ఏఐసిసి కమిటీల అధ్యక్షుల ఎంపిక చదవండి: కాంగ్రెస్ పార్టీకి నేనే పూర్తి స్థాయి అధ్యక్షురాలిని: సోనియా గాంధీ -
ఐటీసీ కొనుగోళ్ల వేట
న్యూఢిల్లీ: ఐటీసీ లిమిటెడ్ భవిష్యత్తు వృద్ధి మార్గాలపై దృష్టి పెట్టింది. ఆకర్షణీయమైన అవకాశాలను సొంతం చేసుకోవడంతోపాటు.. ‘ఐటీసీ నెక్ట్స్’ వ్యూహంలో భాగంగా సామర్థ్య విస్తరణకు రెండు బిలియన్ డాలర్లు (సుమారు రూ.15వేల కోట్లు) ఇన్వెస్ట్ చేయనున్నట్టు ప్రకటించింది. వర్చువల్గా నిర్వహించిన మీడియా సమావేశంలో భాగంగా ఐటీసీ చైర్మన్ సంజీవ్ పురి ఈ వివరాలు వెల్లడించారు. విస్తరణ ప్రణాళికల్లో భాగంగా కొనుగోళ్లనూ పరిశీలిస్తామని చెప్పారు. కాకపోతే కొనుగోళ్లకు చేసే ఖర్చు ప్రతిపాదిత పెట్టుబడులకు అదనంగా ఉంటుందని స్పష్టం చేశారు. డిమాండ్ను చేరుకునేందుకు, పోటీతత్వంతో కొనసాగేందుకు, టెక్నాలజీ, నాణ్యతను పెంచుకునేందుకు అదనపు పెట్టుబడుల అవసరాన్ని ప్రస్తావించారు. వృద్ధికి మార్గాలను గుర్తించినట్టు చెప్పారు. కొత్త మార్గాలు..: ‘భవిష్యత్తు వినియోగ ధోరణులను గుర్తించాం. ఈ దిశగా ఏదైనా అవకాశం కనిపిస్తే.. అది మాకు విలువను తెచ్చిపెడుతుందని భావిస్తే ముందుకు వెళతాం (కొనుగోళ్లు). మధ్య కాలానికి దృష్టి సారిస్తూ.. అందులో భాగంగా 2 బిలియన్ డాలర్లు ఇన్వెస్ట్ చేయనున్నాం. ఒక విభాగంలో సామర్థ్య వినియోగం గరిష్ట స్థాయికి చేరినప్పుడు అదనపు సామర్థ్యాన్ని ఏర్పాటు చే స్తాం. ఎప్పటికప్పుడు నాణ్యతను పెంచుకోవ డ మూ అవసరమే. ఇందుకు సంబంధించి సాంకేతికతను కూడా మార్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. ప్లాస్టిక్కు ప్రత్యామ్నాయం (పేపర్), సూపర్ యాప్, ఐటీసీ మార్స్ (చిన్న రైతుల సామర్థ్య పెంపునకు సంబంధించి) అన్నవి కొత్త వృద్ధి విభా గాలు అవుతాయి’ అని సంజీవ్పురి ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్లో స్పైస్ ప్లాంట్ ఆంధ్రప్రదేశ్లో కొత్తగా మసాలా దినుసుల ప్లాంట్ను ఐటీసీ ఏర్పాటు చేయనుంది. దేశీయ, ఎగుమతి మార్కెట్ల అవసరాలను తీర్చేందుకు ఈ ప్లాంట్ను వినియోగించనున్నట్టు పురి ప్రకటించారు. ఐపీఎం సర్టిఫైడ్ ఆహార, మసాల ఉత్పత్తులను తయారు చేయనున్నట్టు తెలిపారు. ఇతర దేశాల కఠినమైన నిబంధనలను అందుకునేలా ఈ ఉత్పత్తులు ఉంటాయన్నారు. -
తొలి అడుగు.. కారాదు తప్పటడుగు
అన్నప్రాసన చేసే సమయంలో బంగారపు వస్తువు.. పుస్తకం.. కలం.. వస్తువులు ముందుంచి తమ బుజ్జాయి ఏది పట్టుకుంటాడోనని తల్లిదండ్రులు పరీక్షించడం చూస్తుంటాం. ఆరు నెలల పసిబిడ్డ చేసే విన్యాసానికి కుటుంబ సభ్యులు ఒకింత ఊపిరి బిగబట్టి ఆత్రుతగా ఎదురుచూస్తుంటారు. బిడ్డ భవితకు ఎంతటి ప్రాధాన్యం ఇస్తారనేది ఈ తంతుని చూస్తే ఇట్టే అర్థమవుతుంది. చిన్నారి చిట్టిపొట్టి అడుగులు వేసేటప్పుడు కన్నవారు చూసి ఎంతగానో మురిసిపోతారు. కానీ పిల్లలు కళాశాలలో అడుగు పెడుతున్నారంటే తల్లిదండ్రుల్లో ఒకింత ఆందోళన వెంటాడుతోంది. ఎక్కడ పెడదోవ పట్టి భవిష్యత్ను నాశనం చేసుకుంటారోనని.. అథోగతి పాలై తమ పరువును బజారుకీడుస్తోడో అన్న భయం చాలామందిలో కనిపిస్తోంది. కళాశాలలో అడుగుపెట్టే విద్యార్థులు సెల్ఫోన్, మాదకద్రవ్యాలు, ప్రేమ, ఆకర్షణ వలలో చిక్కుకోకుండా కన్నవారికి మంచిపేరు తీసుకొచ్చేలా మంచి భవితకు పునాది వేసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. సాక్షి, చిత్తూరు కలెక్టరేట్ : పదో తరగతి వరకు ఇంట్లో ఉంటూ పాఠశాలకు వెళ్లేవారు ఎక్కువగా ఉంటా రు. పది పూర్తిచేసిన తరువాత 60 శాతానికి పైగా విద్యార్థులు వసతి గృహాల్లో ఉంటూ జూని యర్ కళాశాలల్లో ఇంటర్ చదువుతున్నారు. ఈ సమయంలో తప్పటడుగు వేయడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. సెల్ఫోన్కు సాధ్యమైనంతగా దూరంగా ఉండడం మంచిదని విద్యా నిపుణులు సూచిస్తున్నారు. ఇంట్లో ఉంటూనే కళాశాలకు వెళ్తు న్న విద్యార్థులు స్నేహితుల ప్రభావంతో దురలవాట్లకు లోనయ్యే పరిస్థితులు ఉన్నాయి. మద్యం, సిగరెట్ తాగడానికి అలవాటుపడుతున్నారు. సెల్ఫోన్లో అభ్యంతరకర చిత్రాలు చూసి ఉద్రేకానికి గురై నేరాలకు పాల్పడుతున్నారు. పోలీసు కేసుల్లో ఇరుక్కొని కటకటాల పాలవుతున్న వారు ఉన్నారు. భవిష్యత్ను అంధకారం చేసుకుంటున్నారు. తల్లిదండ్రుల ఆశలపై నీళ్లు చల్లుతున్నారు. దురలవాట్లకు లోనైన వారు ఏకాగ్రతతో చదవలేకపోతున్నారు. నగరాల్లో అయితే కొందరు మత్తు పదార్థాలు తీసుకుంటున్నారు. క్రికెట్ బెట్టింగులకు దిగి అప్పుల పాలవుతున్నారు. చదువు అటకెక్కి నష్టపోతున్నారు. ప రీక్షలు సరిగా రాయలేక మార్కులు బాగా తక్కువగా వస్తున్నాయి. ఉత్తీర్ణులు కాలేక అవమానంతో బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. కొన్ని సందర్భాల్లో కళాశాలకు అని చెప్పి నదులు, సముద్ర తీరాలకు వెళ్లి ప్రమాదాలకు గురవుతున్నారు. కన్నవారికి తీరని కడువుకోతను మిగుల్చుతున్నారు. దారి తప్పి ఇలా.. ఇంటర్లో 95 శాతానికి పైగా మార్కులు తెచ్చుకున్న సూర్యప్రకాశ్ ఎంసెట్లో మంచి ర్యాంకు సాధించి ఇంజినీరింగ్లో చేరాడు. సహచరులు పరిచయం కావడంతో తరగతులకు డుమ్మాకొట్టి సినిమాలు, షికార్లకు వెళ్లడం ప్రారంభించాడు. జల్సాలకు ఖర్చులు పెరిగిపోయి అప్పులు చేశాడు. అమ్మానాన్నకు తెలిసింది. పిల్ల వాడి అప్పులు తీర్చి దురలవాట్లు మాన్పించడానికి కౌన్సెలింగ్ ఇప్పించారు. నాలుగేళ్లలో పూర్తిచేయాల్సిన ఇంజినీరింగ్ ఆరేళ్లకు పూర్తయింది. అరకొర మార్కులే కావడంతో గుమస్తా ఉద్యోగంలో చేరాడు. మొదట్లో ఇలా.. వినోద్కుమార్కు పాఠశాలలో తన తోటి విద్యార్థి అయిన సురేష్ ఇంజినీరింగ్లో నాలు గేళ్లు కష్టపడి చదివాడు. చెడు స్నేహాలు, దురలవాట్లకు దూరంగా ఉన్నాడు. తరగతులు, ప్రయోగశాలకు క్రమం తప్పకుండా హాజరై సమయాన్ని సద్వినియోగం చేసుకుని ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంపై పట్టు సాధించాడు. ప్రాంగణ ఎంపికల్లో ప్రతిభ చూపి ఏడాదికి రూ.25 లక్షల వేతనంతో ప్రముఖ కంపెనీలో ఉద్యోగం సాధించాడు. స్వేచ్ఛ మరింత దుర్వినియోగం ఇంటర్మీడియట్ వరకైనా కొంత నియంత్రణ ఉంటుంది. ఇంటర్ పూర్తి చేసిన తరువాత ఇంజినీరింగ్, ఎంబీబీఎస్, పీజీ, బీఎస్సీ, ఫుడ్సైన్స్, ఫార్మసీ, డిగ్రీ కోర్సుల్లో చేరుతున్నారు. విద్యార్థులకు ఎక్కువగా స్వేచ్ఛ లభించే దశ ఇది. దీనిని సద్వినియోగం చేసుకునేవారు బాగా చదివి తల్లిదండ్రులు గర్వించేలా మంచి స్థానాలకు చేరుకుంటున్నారు. ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో ఆకర్షణీయమైన జీతంతో ఉద్యోగాలు సంపాదిస్తున్నారు. సొంతంగా వ్యాపారాలు ప్రారంభించి రాణించి జీవితంలో విజేతలుగా నిలుస్తున్నారు. ఇదంతా నాణేనికి ఒకవైపు అయితే రెండోవైపు స్వేచ్ఛను దుర్వినియోగం చేస్తూ తాత్కాలిక ఆనందాలకు ప్రాధాన్యమిస్తూ చదువుపై శ్రద్ధ చూపకుండా విద్యార్థులు దారితప్పుతున్నారు. ఆకర్షణను ప్రేమగా భావించి చదువును పాడుచేసుకుంటున్నారు. ప్రేమను తిరస్కరించారని దాడులు చేయడం, బలవన్మరణాలకు పాల్పడడం చేస్తున్నారు. సెల్ఫోన్ను విజ్ఞానం పెంచుకోవడానికన్నా వినోదానికి ఎక్కువగా వాడుతున్నారు. తెల్లవారుజాము వరకు సినిమాలు, వీడియోలు చూడడానికి ఎక్కువ సమయం గడిపేస్తున్నారు. రాత్రులు సరిగా నిద్రపోకుండా తరగతులకు వచ్చి ఏకాగ్రతతో అధ్యాపకులు చెప్పిన పాఠాలు వినలేకపోతున్నారు. మద్యం తాగుతూ షికార్లు తిరుగుతూ కళాశాలకు డుమ్మా కొడుతున్నారు. నిర్లక్ష్యంగా వాహనాలు నడుపుతూ విలువైన ప్రాణాలు పొగొట్టుకుంటున్నారు. వ్యసనాలకు బానిసలై ఆరోగ్యాన్ని పాడుచేసుకుంటున్నారు. అరకొర అయితే.. అంతే అరకొరగా చదివి బొటాబొటి మార్కులతో ఉత్తీర్ణులైన కోర్సు పూర్తి చేసిన వారికి తరువాత సరైన ఉద్యోగాలు లభించడం లేదు. తగిన నైపుణ్యాలు లేవని తిరస్కరణకు గురవుతున్నారు. హైదరాబాద్, చెన్నై, బెంగళూరు నగరాలకు వెళ్లి తల్లిదండ్రులు అప్పు చేసి ఇచ్చిన రూ.లక్షల ఫీజులు చెల్లించి ప్రత్యేక కోర్సుల్లో శిక్షణ తీసుకోవాల్సి వస్తోంది. మూడు, నాలుగేళ్ల తరువాత చిన్న ఉద్యోగాలతో సరిపెట్టుకుంటున్నారు. సమయాన్ని వృథా చేయకుండా, తాత్కాలిక ఆకర్షణలకు గురి కాకుండా కోర్సుల్లో చేరిన మొదటి నుంచే కష్టపడి చదవుతూ నైపుణ్యాలు, పెంచుకుని పూర్తి చేసిన వారికి ఉద్యోగ అవకాశాలు బాగా లభిస్తున్నాయి. తమ ప్రతిభతో పోటీ పరీక్షల్లో సత్తా చాటి జాతీయస్థాయిలో ఉత్తమ ర్యాంకులు సాధించి ప్రముఖ విద్యాసంస్థల్లో ఉన్నత చదువులు చదువుతున్నారు. అనంతరం ప్రముఖ సంస్థల్లో ఉద్యోగాలు సంపాదించి కన్నవారికి గర్వంగా నిలుస్తున్నారు. పక్కదారి పడితే భవిష్యత్ అంధకారమే యుక్త వయసులో హోర్మోన్ల ప్రభావం ఎక్కువగా ఉండి విద్యార్థులు దారి తప్పే అవకాశముంటుంది. కుటుంబ సభ్యులు పిల్లల నడవడిక గమనిస్తూ తప్పుడు మార్గంలో వెళ్లకుండా చూడాలి. కొంచెం ఎక్కువ సమయమే కేటాయించి వారి వ్యవహారశైలిని పర్యవేక్షించాలి. నాలుగు నుంచి ఆరేళ్లు కష్టపడి చదివితే బంగారు భవిష్యత్ లభిస్తుందన్న విషయాన్ని వివరించి చెప్పాలి. – డా.పాండురంగస్వామి, జిల్లా విద్యాశాఖాధికారి. గారాబం పనికిరాదు పిల్లలను అతిగారాబం పనికిరాదు. ఇదే వారు పాడైపోవడానికి కారణమవుతోంది. పాఠశాల దశ నుంచే పిల్లల్లో సేవాభావం, నాయకత్వ లక్షణాలు, నైతిక విలువలు పెంపొందించాలి. పిల్లలకు భారతదేశ సంస్కృతి, సంప్రదాయాలను, గొప్పదనాన్ని తెలియజేయాలి. పెద్దలను గౌరవించడం నేర్పాలి. మంచి స్నేహితుల అవసరాన్ని తెలుసుకునే విధంగా చూడాలి. – గోపినాయక్, అసిస్టెంట్ ప్రొఫెసర్, పలమనేరు ప్రభుత్వ డిగ్రీ కళాశాల సెల్ఫోన్లకు దూరంగా ఉంచాలి విద్యార్థులు ఎక్కువగా సెల్ఫోన్లకు బానిసలవుతున్నారు. దీనిని చాలా తక్కువగా వాడితే మంచిది. పిల్లలను కళాశాలల్లో చేర్పించి ఇక తమ బాధ్యత ముగిసిందని తల్లిదండ్రులు భావించకూడదు. నెలలో కనీసం రెండుసార్లు అయినా కళాశాలకు వెళ్లి అధ్యాపకులతో మాట్లాడి విద్యార్థి గురించి తెలుసుకోవాలి. అవసరాలకు మించి డబ్బు ఇవ్వకూడదు. స్ఫూర్తిదాయకమైన, విజయవంతమైన వ్యక్తుల గురించి పిల్లలకు వివరిస్తూ ఉండాలి. – కోటేశ్వరరావు, అసిస్టెంట్ స్టేట్ ఆర్గనైజర్ కమిషనర్, స్కౌట్స్ అండ్ గైడ్స్ -
ఏం చేద్దాం!
* పార్టీ బలోపేతంపై కాంగ్రెస్ ఆత్మావలోకనం * నేడు గాంధీభవన్లో బృంద సమీక్షలు * సీనియర్ల అభిప్రాయాలతో భవిష్యత్తు కార్యాచరణ సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: ఓటమి భారంతో కుంగిపోయిన పార్టీ శ్రేణుల్లో జవసత్వాలు నింపేందుకు కాంగ్రెస్ అధిష్టానం నడుంబిగించింది. సార్వత్రిక ఎన్నికల గుణపాఠంతో తేరుకున్న నాయకత్వం.. భవిష్యత్తు వ్యూహంపై మేధోమథనం సాగిస్తోంది. క్షేత్రస్థాయిలో పార్టీ పటిష్టత, ప్రజల అభిమానాన్ని చూరగొనే దిశగా ఆలోచన చేస్తోంది. ఈ క్రమంలోనే శుక్రవారం గాంధీభవన్లో జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) పార్టీ బలోపేతంపై సీనియర్లతో బృంద సమీక్షలు జరుపుతోంది. టీపీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య సమక్షంలో జరిగే ఈ సమావేశంలో ముఖ్యనేతలు పార్టీ వ్యూహాన్ని ఖరారు చేయనున్నారు. పరాజయానికి దారితీసిన కారణాలను విశ్లేషిస్తునే.. భవిష్యత్తు కార్యాచరణ ప్రణాళికపై ఈ భేటీలో చర్చించనున్నారు. 39 మంది సీనియర్లు, ముఖ్యనాయకులు ఈ గ్రూపుల చర్చల్లో పాలుపంచుకోనున్నారు. మాజీ మంత్రులు సర్వే సత్యనారాయణ, ప్రసాద్కుమార్, మాజీ ఎమ్మెల్యేలు కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి, దేవిరెడ్డి సుధీర్రెడ్డి, పార్టీ నేతలు కార్తీక్రెడ్డి, బండారి లక్ష్మారెడ్డి ఈ బృందాలకు నేతృత్వం వహించనున్నారు. అధికార పార్టీ దూకుడుకు కళ్లెం వేయడంలో పార్టీ హైకమాండ్ విఫలమైందనే అభిప్రాయాలు వినిపిస్తుండడం, ఎన్నికల అనంతరం కొందరు పార్టీని వీడినా పట్టించుకోలేదనే విమర్శల నేపథ్యంలో అధిష్టానం ఈ సమీక్ష లు నిర్వహిస్తోంది. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటలవరకు జరిగే ఈ భేటీల్లో వర్కింగ్ ప్రెసిడెంట్ ఉత్తమ్కుమార్రెడ్డి కూడా పాల్గొంటారని డీసీసీ అధ్యక్షుడు క్యామ మల్లేశ్ ఒక ప్రకటనలో తెలిపారు.