breaking news
fifth death anniversary
-
అమెరికాలో రక్తదాన శిబిరం
అమెరికాలోని ఫిలడెల్ఫియాలో డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ఐదో వర్ధంతి సందర్భంగా శనివారం రక్తదాన శిబిరం నిర్వహిస్తున్నారు. డాక్టర్ వై ఎస్ రాజశేఖర రెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించే ఈ కార్యక్రమానికి అతిథులుగా మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి, గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ ముస్తఫా, చిత్తూరు మాజీ ఎంపీ జ్ఞానేంద్ర రెడ్డి హాజరు కానున్నారు. రక్తదాన శిబిరం ఫిలడెల్ఫియా సమీపంలోని కింగ్ అఫ్ పర్షియాలో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు వాలీ ఫోర్జ్ రాడిస్సన్ హోటల్ లో ఉంటుందని, ఈ అవకాశాన్ని వైఎస్ఆర్ అభిమానులంతా సద్వినియోగం చేసుకోవాలని ఫౌండేషన్ ప్రతినిధులు కోరారు. అందరూ కుటుంబ సమేతంగా మహానేత వర్ధంతి కార్యక్రమానికి తరలివచ్చి దాన్ని విజయవంతం చేయాలని కోరారు. మరిన్ని వివరాలకు ysr_usa@yahoo.comకు ఇ-మెయిల్ పంపాలని లేదా డాక్టర్ రాఘవరెడ్డి (267-261-9436), ఆళ్ల రామిరెడ్డి (973-386-8980) లను సంప్రదించాలని తెలిపారు. -
వైఎస్ వర్ధంతి రోజున సేవా కార్యక్రమాలు చేపట్టండి
తెలుగు ప్రజలకు, పార్టీ శ్రేణులకు వైఎస్సార్సీపీ పిలుపు రేపు వైఎస్ ఐదవ వర్ధంతి సాక్షి, హైదరాబాద్: ప్రజా సంక్షేమ పథకాల అమలులో దేశానికే మార్గదర్శకంగా నిలిచిన దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఐదవ వర్ధంతి (సెప్టెంబర్ 2)ని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని తెలుగు ప్రజలు, పార్టీ శ్రేణులు భారీగా సేవా కార్యక్రమాలు చేపట్టాలని వైఎస్సార్ కాంగ్రెస్ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు ఎంవీ మైసూరారెడ్డి పిలుపునిచ్చారు. ఆయన ఆదివారం పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. వైఎస్ ముఖ్యమంత్రిగా రూపకల్పన చేసి అమలు చేసిన 108, ఆరోగ్యశ్రీ, సామాజిక, మహిళా పెన్షన్లు, విద్యార్థులకు ఫీజులు చెల్లింపు వంటివి విప్లవాత్మకమైనవని గుర్తుచేశారు. రెండోసారి ఎన్నికై సీఎంగా పగ్గాలు చేపట్టాక వైఎస్ దురదృష్టవశాత్తూ మరణించారని, ఆయన జీవించి ఉంటే రాష్ట్రానికీ గతి పట్టి ఉండేది కాదని, తెలుగు ప్రజలు విడిపోయి ఉండేవారు కాదని మైసూరా ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్ వర్ధంతి రోజైన సెప్టెంబర్ 2న ఆయన విగ్రహాలకు రెండు రాష్ట్రాల్లోనూ నివాళులర్పించడంతోపాటుగా ఆయనకు అత్యంత ప్రీతిపాత్రమైన రక్తదాన శిబిరాలు, పేదలకు సాయం చేయడం, ఇతర సేవా కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు.