breaking news
fetal death
-
10 నెలల్లో 185 మంది శిశువులు గర్భంలోనే కన్నుమూత.. ఆ రెండు ఆస్పత్రుల్లోనే!
ఆడ పిల్ల పుడితే లక్ష్మీదేవి పుట్టిందన్న రోజుల నుంచి ఆడపిల్లలను గర్భంలోనే చిదిమేసిన రోజులకు మానవ సమాజం దిగజారింది. మానవ శాస్త్ర విజ్ఞాన అభివృద్ధి ఇందుకేనా.. అన్నట్టు తలదించుకునేలా చోటు చేసుకుంటున్న సంఘటనలు నివ్వెరపరుస్తున్నాయి. మరోవైపు వివాహేతర సంబంధాల నేపథ్యంలో గర్భంలోనే ఆడ.. మగ అనే తేడా లేకుండా జరుగుతున్న శిశు హత్యలు గుండెలను పిండేస్తున్నాయి. కన్నీరు పెట్టిస్తున్నాయి. ఇదేనా మన విజ్ఞానాభివృద్ధి అనేలా ప్రశ్నిస్తున్నాయి. సాక్షి, విజయనగరం ఫోర్ట్: వైద్య రంగం అభివృద్ధి చెందక ముందు పుట్టే బిడ్డ ఆడ.. మగ అని మాత్రమే చూసేవారు. ఒక్కో మహిళ పది మంది పిల్లలకు జన్మనిచ్చేది. ఏ బిడ్డయినా సమానంగానే పెంచేవారు. ఉమ్మడి కుటుంబ వ్యవస్థలో ఇలా సంతోషాలు వెల్లివిరిసేవి. వైద్య రంగంలో విప్లవాత్మకమైన మార్పులు చోటు చేసుకున్నాయి. పుట్టే బిడ్డ ఆడ.. మగ అనేది అమ్మ గర్భంలోనే స్కానింగ్ చేసి గుర్తిస్తున్నారు. అంగ వైకల్యాలను సైతం గర్భంలోనే పసిగట్టేస్తున్నారు. ఇంకేముంది ఆడ బిడ్డయితే గర్భంలోనే చిదిమేస్తున్న సంఘటనలు వైద్య రంగాన్ని సవాల్ చేస్తున్నాయి. వివాహేతర సంబంధాలు కూడా ఇటువంటి పరిస్థితులకు దారి తీస్తున్నాయి. వివాహేతర సంబంధాల విషయంలో అది ఆడ.. మగ.. అని చూడకుండా భ్రూణహత్యలకు దిగజారుతున్నారు. వైద్య రంగ విప్లవం మానవ అభివృద్ధికి దోహదపడేలా తప్ప ఇలా తల్లి గర్భంలోనే భ్రూణ హత్యలకు దారితీయడం దారుణం. నింగిలో సగం.. నేలపై సగం అంటూ మహిళలు అన్ని రంగాల్లో నేడు రాణిస్తున్నారు. అవకాశాలు దక్కితే తమ సత్తా చూపుతున్నారు. అయినా ఆడ పిల్లల పట్ల ఇంకా వివక్ష కొనసాగుతూనే ఉంది. ఆడ పిల్లను ఎంతగా చదివించినా... వారు ఎంతగా రాణించినా పెళ్లి సమయంలో వరకట్న దురాచారం ఇంకా పీడిస్తూనే ఉంది. దీని ఫలితం ఆడ పిల్లలను వద్దనుకునే వారు దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారు. అదే సమయంలో ఆడ పిల్లలను కోరుకునే వారు ఉన్నారు. చదవండి: చిన్న వయసులోనే గుండెపోటు ముప్పు.. తీసుకోవాల్సిన జాగ్రత్తలు పది నెలల్లోనే... 2021 ఏప్రిల్ నుంచి ఈ ఏడాది జనవరి నెల వరకు 185 మంది గర్భంలోనే చనిపోయారు. వీరిలో 12 వారాల్లోపు చనిపోయిన వారు 135 మంది కాగా, 12 నుంచి 20 వారాల్లోపు చనిపోయిన వారు 50 మంది ఉన్నారు. ఈ మరణాల్లో గర్భంలో ఉన్నది ఆడపిల్ల అని తెలుసుకుని కొందరు తల్లిదండ్రులు అబార్షన్లు చేయిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. స్కానింగ్ సెంటర్లపై కొరవడిన పర్యవేక్షణ స్కానింగ్ సెంటర్లపై పర్యవేక్షణ కొరవడుతుందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వం భ్రూణ హత్యల నివారణకు ప్రత్యేక చట్టం తెచ్చి అమలు చేస్తున్నా... కొందరు నిర్వాహకులు అమ్యామ్యాలకు అలవాటుపడి లింగ నిర్ధారణ వెల్లడిస్తున్నారనే విమర్శలున్నాయి. కొన్నేళ్లుగా స్కానింగ్ కేంద్రాలపై ఒక్క కేసు కూడా నమోదు కాకపోవడం ఈ ఆరోపణలకు ఊతమిస్తుంది. ఆ రెండు ఆస్పత్రుల్లోనే... జిల్లా కేంద్రంలోని రెండు ప్రైవేటు ఆస్పత్రుల్లో అబార్షన్లు ఎక్కువగా జరుగుతున్నట్టు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కాసులకు కక్కుర్తి పడి అబార్షన్లు చేస్తున్నారనే అపవాదు మూటగట్టుకుంటున్నారు. ఈ విషయం సంబంధిత ఆస్పత్రులపై జిల్లా ఉన్నతాధికారుల దృష్టికి కూడా వెళ్లిందని తెలిసింది. ఇదే సమయంలో అబార్షన్ కోసం తీసుకువచ్చే ఆర్ఎంపీ, ఆశ వర్కర్లకు ఆయా ఆస్పత్రులు భారీగా ఆఫర్లు ఇస్తున్నట్టు తెలుస్తోంది. చదవండి: Health Tips: బరువు తగ్గాలని బ్రేక్ఫాస్ట్ మానేస్తే.. కష్టమే! తగ్గుతున్న ఆడ పిల్లల సంఖ్య జిల్లాలో ఆడ పిల్లల సంఖ్య నెలనెలా తగ్గిపోతుంది. వెయ్యి మంది బాలురుకు 940 మంది బాలికలే ఉన్నారు. 2021 డిసెంబరులో వెయ్యి మంది బాలురుకు 942 మంది బాలికలు ఉన్నారు. 2022 జనవరి నెల వచ్చేసరికి ఆ సంఖ్య 940కి తగ్గింది. స్కానింగ్ చేయాల్సిన పరిస్థితులు ► జన్యు సంబంధమైన జీవ కణాల్లో కలిగే అసాధ«రణ మార్పు గుర్తించినప్పుడు ► ఎర్ర రక్తకణాల్లో అసాధారణ స్థితి ఉన్నప్పుడు. ► లింగ సంబంధిత వ్యాధులు గుర్తించినప్పుడు. ► స్కానింగ్కు చట్టం ఆమోదించే పరిస్థితులు. ► గర్భదారణ జన్యు సంబంధమైన పిండానికి వ్యాధులు కనుగొనేందుకు అల్ట్రా సౌండ్ స్కానింగ్ చేస్తారు. ► గర్భిణికి రెండు, అంతకన్నా ఎక్కువ సార్లు గర్భస్రావం, పిండ నష్టం జరిగినప్పుడు. ► గర్భిణులు హానికారక మందులు, అణుధార్మిక శక్తి, రసాయనాల బారిన పడినప్పుడు, దాని ప్రభావం కలిగినప్పుడు స్కానింగ్ చేయవచ్చు. సమాచారమిస్తే చర్యలు జిల్లాలో ఏ స్కానింగ్ సెంటర్లోనైనా లింగ నిర్ధారణ చేస్తున్నట్టు సమాచారం ఇస్తే తనిఖీలు చేసి తీవ్రమైన చర్యలు చేపడతాం. అటువంటి స్కానింగ్ సెంటర్ను సీజ్ చేయడంతో పాటు క్రిమినల్ కేసు పెడతాం. లింగ నిర్ధారణ వెల్లడి చట్టరీత్యా నేరమనే విషయమై అవగాహన కల్పిస్తున్నాం. అదే సమయంలో వివాహం కాకుండా గర్భం దాలుస్తున్న వారు అబార్షన్లు చేయించుకుంటున్నట్టు మా దృష్టికి వచ్చింది. – డాక్టర్ ఎస్వీ రమణకుమారి, డీఎంహెచ్ఓ -
కడుపులోనే కరిగిపోతోంది!
భ్రూణ హత్యలు – రెండేళ్లలో 30 ఘటనలు వెలుగులోకి.. – యథేచ్ఛగా లింగనిర్ధారణ పరీక్షలు – అనుమతి లేని స్కానింగ్ సెంటర్లు – పట్టనట్లుగా వైద్య ఆరోగ్య శాఖ – నాలుగేళ్ల కాలంలో నాలుగే కేసులు – తనిఖీలు నామమాత్రం ఇంటికి వెలుగునిచ్చే బంగారుతల్లి భూమ్మీదకు రాకుండానే చీకట్లో కలిసిపోతోంది. అంతరిక్షంలోకి వెళ్లొస్తున్నా సమాజం ఇప్పటికీ ఆడ..పిల్లగానే పరిగణిస్తోంది. క్రీడా పతకాల్లో సాటి లేదని చాటుతున్నా.. చదువులో పోటీ పడుతున్నా.. రాణించని రంగం అంటూ లేదని నిరూపిస్తున్నా.. ఎదిగిన కొద్దీ ఆమె గుండెలపై కుంపటిగానే మిగిలిపోతోంది. పున్నామ నరకం తప్పిస్తాడనుకునే కుమారుడు.. నిర్దయగా వీధిన నిలబెడుతున్నా గారాల బిడ్డడే. అదే అమ్మానాన్నకు చిన్న కష్టమొచ్చినా కన్నీరు పెట్టుకునే కూతురు మాత్రం కడుపులోనే కరిగిపోతోంది. కర్నూలు(హాస్పిటల్): ఆడపిల్ల కడుపున పడిందని తెలిస్తే చాలు.. నిర్దాక్షిణ్యంగా కడతేరుస్తున్నారు. కొందరు వైద్యులు.. ఆర్ఎంపీలు.. ఆశా వర్కర్లు.. ఏఎన్ఎంలు ఈ ఘాతుకాన్ని ప్రోత్సహిస్తున్నారు. రెండు రోజుల క్రితం మంత్రాలయం మండలంలోని మాధవరంలో ఓ గర్భస్థ ఆడ శిశువు చెత్తకుప్ప పాలైన ఘటన ఇందుకు తాజా ఉదాహరణ. జిల్లాలో 190 పైగా అధికారింగా అనుమతి పొందిన స్కానింగ్ సెంటర్లు ఉండగా.. అనుమతి లేకుండా రెట్టింపు సంఖ్యలో వైద్యులు, ఆర్ఎంపీలు ఇలాంటి సెంటర్లను నిర్వహిస్తున్నారు. పాతబడిన స్కానింగ్ యంత్రాలను వైద్య ఆరోగ్యశాఖకు అప్పగించకుండా ఆర్ఎంపీలకు అమ్ముకుంటున్నారు. దీనికి తోడు కొత్త వాటికి రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే వైద్య ఆరోగ్యశాఖలో పెద్దతంతుగా భావించి.. అనుమతి లేకుండానే స్కానింగ్ చేసేస్తున్నారు. ఈ విషయం సంబంధిత శాఖాధికారులకు తెలిసినా మామూళ్లు తీసుకుని వదిలేస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. జిల్లాలో 400 దాకా స్కానింగ్ సెంటర్లు ఉన్నా అధికారులు నామమాత్రంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. తనిఖీలు చేసినా స్కానింగ్ నిర్వాహకులకు అనుకూలంగా నివేదికలు రాస్తున్నట్లు తెలుస్తోంది. నాలుగేళ్ల కాలంలో జిల్లాలో 4 కేసులు మాత్రమే నమోదయ్యాయి. ఇప్పటి వరకు ఏ ఒక్కరికీ శిక్ష పడలేదు. భ్రూణహత్యలు జరిగాయనే సమాచారం తెలియగానే అక్కడికి వెళ్లి విచారణ చేసి, నివేదికను జిల్లా కలెక్టర్కు పంపించాలి. కానీ ఈ తంతు తూతూమంత్రంగా సాగుతోంది. నామమాత్రంగా కమిటీల నిర్వహణ 2012 సంవత్సరానికి ముందు పీసీ పీఎన్డీటీ యాక్ట్ను అమలు చేసేందుకు జిల్లా కలెక్టర్ చైర్మన్గా కమిటీ ఉండేది. అందులో అధిక భాగం వైద్యులే ఉండేవారు. ఆ తర్వాత అప్రాప్రియేట్ కమిటీలు ఏర్పాటు చేశారు. జిల్లా, డివిజన్ స్థాయిల్లో ఈ కమిటీలు రూపుదిద్దుకున్నాయి. ఇందులో రెవెన్యూ, పోలీస్, న్యాయాధికారులు, వైద్యాధికారులతో పాటు ఎన్జీఓలు ఉంటారు. ఆరు నెలల క్రితం స్కానింగ్ సెంటర్లను తనిఖీ చేయాలని నోడల్ అధికారులకు ఆదేశించారు. వీరు నామమాత్రంగా తనిఖీలు నిర్వహించినట్లు ఆరోపణలు ఉన్నాయి. 30 మంది శిశువులు చెత్తకుప్పల పాలు జిల్లాలో రెండేళ్ల కాలంలో 30 మందికి పైగా గర్భస్త శిశువులు చెత్తకుప్పల పాలైనట్లు సమాచారం. 2015 అక్టోబర్ 12న మద్దికెరలో, జులై 18న కర్నూలులోని హంద్రీబ్రిడ్జి వద్ద, జూన్ 26న అశోక్నగర్లోని రైల్వేబ్రిడ్జి వద్ద, అదే నెల 19న కేసీ కెనాల్లో, 9న జొహరాపురం రోడ్డులో, మే 30న ఆదోనిలోని ఆర్అండ్ బి గెస్ట్ హౌస్ వద్ద, ఫిబ్రవరి 21న కర్నూలులోని మద్దూర్నగర్ వద్ద ఒకటి, నంద్యాలలో జనవరి 17న రెండు, అదేరోజు కలెక్టరేట్ సమీపంలో ఒకటి శిశువుల మతదేహాలు లభించాయి. 2016లో జనవరి 23న కోడుమూరులో ఒకటి, ఫిబ్రవరి 10న కర్నూలులోని కల్లూరు బ్రిడ్జి వద్ద నాలుగు మతదేహాలను గుర్తించారు. ఇంకా వెలుగులోకి రాని ఎన్నో గర్భశిశువులు కుక్కలు, పందుల పాలయ్యాయి. గర్భవతికి స్కానింగ్ చేసే పరిస్థితులు జన్యు జనితమైన జీవకణాల్లో కలిగే అసాధారణ మార్పు గుర్తింపు, చికిత్స అసాధారణ జన్యు పరిస్థితి గుర్తింపు, చికిత్స ఎర్రకణాల్లో అసాధారణ స్థితి గుర్తింపు, చికిత్స లింగ సంబంధిత వ్యాధుల గుర్తింపు, చికిత్స స్కానింగ్కు చట్టం ఆమోదించే పరిస్థితులు గర్భధారణ జన్యు సంబంధమైన పిండానికి వ్యాధులు కనుగొనేందుకు అల్ట్రాసౌండ్ స్కానింగ్ చేస్తారు. గర్భిణిల వయస్సు 35 సంవత్సరాలు మించరాదు. ఆమెకు రెండు, అంతకన్నా ఎక్కువసార్లు గర్భస్రావం, పిండ నష్టం జరిగినప్పుడు. గర్భిణిలు హానికారక మందులు, అణుధార్మికశక్తి, రసాయనాల భారిన పడినప్పుడు, దాని ప్రభావం కలిగినప్పుడు. గర్భిణి, ఆమె భర్త, ఇతర కుటుంబ సభ్యుల్లో ఎవరికైనా మానసిక బుద్ధిమాంధ్యం, శారీరక వైకల్యాలు, జన్యుసంబంధిత వ్యాధులు ఉన్నప్పుడు. లింగ నిర్ధారణ చేస్తే జైలుకే.. భ్రూణహత్యల నివారణకు కేంద్ర ప్రభుత్వం 1994లో పీసీ పీఎన్డీటీ యాక్ట్ను తీసుకొచ్చింది. దీని ప్రకారం లింగనిర్ధారణ చేసినా, గర్భస్రావాలు చేయించినా ఇరువర్గాలను శిక్షించే వీలుంది. మొదటిసారి తప్పు చేస్తే మూడేళ్ల జైలుశిక్ష, రూ.10వేల జరిమానా, రెండోసారి తప్పు చేస్తే ఐదేళ్ల జైలు శిక్ష, రూ.50వేల జరిమానా విధిస్తారు. స్కానింగ్, అబార్షన్ చేసిన సదరు వైద్యుల పేరును భారత వైద్యవిధాన మండలి నుంచి తాత్కాలికంగా, కొన్నిసార్లు శాశ్వతంగా తొలగిస్తారు. భ్రూణ హత్యలు చేస్తే కఠిన చర్యలు లింగ నిర్ధారణ కోసం స్కానింగ్ చేయడం, లింగనిర్ధారణలో కడుపులో ఉన్నది ఆడపిల్ల అని తేలితే భ్రూణ హత్యలు చేయడం నేరం. పీసీ పీఎన్డీటీ యాక్ట్తో పాటు ఐపీసీ సెక్షన్ ప్రకారం కూడా ఇది నేరం. ఇలాంటి దారుణాలకు పాల్పడే వారిపై రెండు కేసులనూ నమోదు చేస్తాం. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ సహకారం కోరితే భ్రూణ హత్యలు చేసే ఆస్పత్రులపై దాడులు చేసేందుకు ఏ క్షణంలోనైనా సిద్ధం. – ఆకె రవికృష్ణ, జిల్లా ఎస్పీ