breaking news
DPR file
-
గోదావరి ప్రాజెక్టుల డీపీఆర్లు పంపండి
సాక్షి, హైదరాబాద్: గోదావరి నదీ బేసిన్లో చేపట్టిన కొత్త ప్రాజెక్టుల సమగ్ర నివేదిక (డీపీఆర్)లను తక్షణమే పంపాలని గోదావరి నదీ యాజమాన్య బోర్డు రెండు తెలుగు రాష్ట్రాలను ఆదేశించింది. గతంలో జరిగిన బోర్డు భేటీలు, అపెక్స్ సమావేశాల్లో తీసుకున్న నిర్ణయాలు, ఇచ్చిన హామీల మేరకు వ్యవహరించాలని.. త్వరగా డీపీఆర్లను అందించేలా సంబంధిత అధికారులను ఆదేశించా లని కోరింది. ఈ మేరకు తెలంగాణ, ఏపీ రాష్ట్రాల జల వనరుల శాఖ కార్యదర్శులకు బోర్డు సభ్యుడు పీఎస్ కుటియాల్ శుక్రవారం లేఖ రాశారు. గత ఏడాది జూన్లో జరిగిన బోర్డు భేటీ సందర్భంగా.. ప్రభుత్వ అనుమతి తీసుకొని డీపీఆర్లు సమర్పి స్తామని తెలంగాణ అధికారులు వెల్లడించారని, ఏపీ అధికారులు కూడా ఇంకా డీపీఆర్లు ఇవ్వని ప్రాజెక్టుల వివరాలు అందజేస్తామని పేర్కొన్నారని వివరించారు. జూన్ 10 నాటికల్లా డీపీఆర్లు సమర్పించాలని బోర్డు ఛైర్మన్ ఆదేశించిన విషయాన్ని గుర్తు చేశారు. గత ఏడాది అక్టోబర్ 6న జరిగిన రెండో అపెక్స్ కౌన్సిల్ సమావేశం సందర్భంగా కూడా.. కొత్త ప్రాజెక్టుల డీపీఆర్లను సమర్పించాలని కేంద్ర జల శక్తి మంత్రి సూచించారని.. దానికి ఇరు రాష్ట్రాల సీఎంలు అంగీకరించారని లేఖలో ప్రస్తావించారు. ప్రాజెక్టులపై ముందుకెళ్లొద్దన్నా.. రెండో అపెక్స్ భేటీ తర్వాత డీపీఆర్లు సమర్పించాలని బోర్డు నవంబర్లో ఇరు రాష్ట్రాలకు లేఖలు రాసిందని, అనుమతులు లేని ప్రాజెక్టుల విషయంలో ముందుకెళ్లరాదని ఆదేశించిందని పీఎస్ కుటియాల్ లేఖలో గుర్తు చేశారు. ఎన్నిసార్లు కోరినా తెలంగాణ డీపీఆర్లు ఇవ్వలేదన్నారు. ఏపీ పట్టిసీమ, పురుషోత్తమపట్నం డీపీఆర్లు ఇచ్చినా, పూర్తి వివరాలు లేవని.. వాటిని పొందుపరచాలని సూచించామని తెలిపారు. ఇప్పటికైనా రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు ఈ విషయంపై దృష్టిపెట్టాలని.. వెంటనే డీపీఆర్లు అందించేలా అధికారులను ఆదేశించాలని కోరారు. కాగా డీపీఆర్లు ఇవ్వాలని బోర్డు కోరిన ప్రాజెక్టుల్లో.. గోదావరి ఎత్తిపోతల పథకం ఫేజ్–3, సీతారామ, కంతనపల్లి, మిషన్ భగీరథ, లోయర్ పెన్గంగపై చేపట్టిన మూడు బ్యారేజీలు, రామప్ప–పాకాల నీటి తరలింపు, కాళేశ్వరంలోని మూడో టీఎంసీకి సంబంధించిన పనులు ఉన్నాయి. -
ఆల్మట్టిపై మళ్లీ కర్నాటకం
బిరబిరా సాగే కృష్ణమ్మను నిర్బంధించి తెలుగు రాష్ట్రాల నోట్లో మట్టి కొట్టేందుకు రంగం సిద్ధమైంది! అప్పర్ కృష్ణా మూడో దశ పనులను చేపట్టేందుకు అనుమతి కోరుతూ గురువారం అర్ధరాత్రి సీడబ్ల్యూసీ వెబ్సైట్లో ఆ ప్రాజెక్టు డీపీఆర్ను కర్ణాటక సర్కారు అప్లోడ్ చేసింది. ఆల్మట్టి ఎత్తును 519.6 మీటర్ల నుంచి 524.256 మీటర్లకు పెంచడం వల్ల అదనంగా 130 టీఎంసీలను నిల్వ చేసుకోవడంతోపాటు మొత్తం 174 టీఎంసీలను వినియోగించుకోవడం ద్వారా బాగల్కోట్, బీజాపూర్, గదగ్, కొప్పళ, యాదగిరి, రాయచూర్ జిల్లాల్లో 14.70 లక్షల ఎకరాల (5.94 లక్షల హెక్టార్ల)కు నీళ్లందిస్తామని డీపీఆర్లో పేర్కొంది. ఈ పనులకు 2014–15 ధరల ప్రకారం రూ.51,148.94 కోట్లు వ్యయం అవుతుందని తెలిపింది. ఆలమట్టి డ్యామ్ ఎత్తు పెంచడం వల్ల 30,579.25 హెక్టార్ల భూమి ముంపునకు గురవుతుందని, దీంతోపాటు ప్రధాన కాలువలు, పిల్ల కాలువల పనులకు 26,003 హెక్టార్లను సేకరించాల్సి వస్తుందని పేర్కొంది. ఈ పనులు చేపట్టడానికి అనుమతి ఇవ్వాలని కోరింది. బ్రిజేష్కుమార్ ట్రిబ్యునల్(కేడబ్ల్యూడీటీ–2) తీర్పును ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలు సుప్రీంకోర్టులో సవాల్ చేశాయి. దీనిపై విచారణ కొనసాగుతుండటంతో ఆ తీర్పును సుప్రీం కోర్టు ఇప్పటిదాకా నోటిఫై చేయలేదు. అయితే సుప్రీం కోర్టు ఉత్తర్వులను తుంగలో తొక్కి ఆల్మట్టి ఎత్తు పెంచడంలో భాగంగా అప్పర్ కృష్ణా మూడో దశ పనులకు కర్ణాటక శ్రీకారం చుట్టడాన్ని నీటిపారుదలరంగ నిపుణులు తప్పుబడుతున్నారు. కృష్ణా పరీవాహక ప్రాంతంలో వర్షాభావంతో నీటి లభ్యత తగ్గిపోయి జూలై ఆఖరుకుగానీ తెలుగు రాష్ట్రాలకు జలాలు చేరడం లేదని, ఆల్మట్టి ఎత్తు పెంచితే సెప్టెంబరు మొదటి వారానికిగానీ కృష్ణా వరద దిగువకు వచ్చే అవకాశం ఉండదని స్పష్టం చేస్తున్నారు. కృష్ణాలో అక్టోబర్ వరకూ మాత్రమే వరద ఉంటుంది. ఈ లెక్కన చూస్తే తెలుగు రాష్ట్రాలకు కేటాయించిన నికర జలాలు 811 టీఎంసీలు కూడా దక్కే అవకాశం ఉండదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సుప్రీం కోర్టు ఉత్తర్వులు తుంగలోకి.. కృష్ణా నదిలో 75 శాతం నీటి లభ్యత ఆధారంగా 2,130 (70 టీఎంసీలు పునరుత్పత్తి) టీఎంసీలు ఉంటుందని అంచనా వేసిన బచావత్ ట్రిబ్యునల్ (కేడబ్ల్యూడీటీ–2) మహారాష్ట్రకు 585, కర్ణాటకకు 734, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు 811 టీఎంసీలు కేటాయిస్తూ 1976లో తీర్పు ఇచ్చింది. ఈ తీర్పు గడువు ముగియడంతో కృష్ణా జలాల పునఃపంపిణీకి బ్రిజేష్కుమార్ నేతృత్వంలో కేడబ్ల్యూడీటీ–2ను కేంద్రం ఏర్పాటు చేసింది. బచావత్ ట్రిబ్యునల్ చేసిన కేటాయింపులను కొనసాగించిన బ్రిజేష్కుమార్ ట్రిబ్యునల్.. నీటి లభ్యత 75 శాతానికి 65 శాతానికి మధ్య ఉన్న 448 టీఎంసీలను మూడు రాష్ట్రాలకు పునఃపంపిణీ చేసింది. ఇందులో కర్ణాటకకు 177, ఉమ్మడి ఏపీకి 190, మహారాష్ట్రకు 81 టీఎంసీలను అదనంగా కేటాయించింది. ఈ క్రమంలో ఆల్మట్టి ఎత్తును 519.6 నుంచి 524.256 మీటర్లకు పెంచుకోవడానికి కర్ణాటకకు అనుమతి ఇస్తూ 2013 నవంబర్ 29న బ్రిజేష్కుమార్ ట్రిబ్యునల్ తీర్పు ఇచ్చింది. ఈ తీర్పును ఉమ్మడి ఏపీ ప్రభుత్వం నిరసిస్తూ సుప్రీం కోర్టులో సవాల్ చేసి స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసింది. దీంతో ఈ తీర్పుపై సుప్రీం కోర్టు స్టే విధించింది. రాష్ట్ర విభజన తర్వాత ఏపీ సర్కార్ సుప్రీం కోర్టులో దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్లో తెలంగాణ సర్కార్ ఇంప్లీడ్ అయ్యింది. సుప్రీం కోర్టు స్టే విధించిన నేపథ్యంలో బ్రిజేష్కుమార్ ట్రిబ్యునల్ తీర్పును కేంద్రం నోటిఫై చేయలేదు. అయితే కర్ణాటక సర్కార్ సుప్రీం కోర్టు ఉత్తర్వులను తుంగలో తొక్కి ఆల్మట్టి ఎత్తు పెంచడానికి సిద్ధమవడం గమనార్హం. వ్యూహాత్మకంగా అడుగులు.. ఆల్మట్టి ఎత్తు పెంపుపై కర్ణాటక సర్కార్ ఆది నుంచి వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. గతేడాది జూలై 7న కర్ణాటక జలవనరుల శాఖ మంత్రి రమేష్ జార్ఖహోలి ముంబైలో మహారాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి జయంత్పాటిల్తో సమావేశమై బ్రిజేష్కుమార్ ట్రిబ్యునల్ తీర్పును నోటిఫై చేసేలా కేంద్రాన్ని కోరడం, ఆల్మట్టి ఎత్తు పెంచడంపై చర్చించారు. బ్రిజేష్కుమార్ ట్రిబ్యునల్ తీర్పును నోటిఫై చేస్తూ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేయాలని ఇద్దరు మంత్రులు కేంద్రానికి వి/æ్ఞప్తి చేశారు. ఈ మేరకు రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు కేంద్రానికి ప్రతిపాదనలు పంపాయి. ఆల్మట్టి ఎత్తు పెంచడం వల్ల ముంపునకు గురయ్యే మహారాష్ట్రలోని ప్రాంతాలపై ఆ రాష్ట్రంతో చర్చించిన కర్ణాటక ముంపు భూములను వేగంగా సేకరిస్తోంది. ఆల్మట్టి ఎత్తు పెంపుతో ముంపునకు గురయ్యే 30,579.25 హెక్టార్ల భూ సేకరణ, 23 ముంపు గ్రామాల ప్రజల పునరావాసానికి రూ.17 వేల కోట్లతో పనులను ప్రారంభించింది. కృష్ణా నదికి వరదలు ప్రారంభమయ్యేలోగా డ్యామ్ ఎత్తు పెంచే పనులను కాంట్రాక్టర్లకు అప్పగించి శరవేగంగా చేపట్టే దిశగా అడుగులు వేస్తోంది. సాగునీటికే కాదు.. తాగునీటికీ కటకటే.. ఆల్మట్టి ప్రస్తుత సామర్థ్యం 129.72 టీఎంసీలు కాగా ఎత్తు పెంచితే నిల్వ సామర్థ్యం 259.72 టీఎంసీలకు పెరుగుతుంది. ఆల్మట్టికి దిగువన ఉన్న నారాయణపూర్ నిల్వ సామర్థ్యం 37.65 టీఎంసీలు. ఈ రెండు జలాశయాలు నిండాలంటే 297.37 టీఎంసీలు అవసరం. ఆల్మట్టి, నారాయణపూర్ డ్యామ్ల కాలువలు, అప్పర్ కృష్ణా ప్రాజెక్టు ఎత్తిపోతల మొదటి దశ, రెండో దశల ద్వారా రోజుకు సగటున 2.5 నుంచి మూడు టీఎంసీల వరకూ వినియోగించుకునే సామర్థ్యం తెలంగాణకు ఉంది. బేసిన్లో సాధారణ స్థాయిలో వర్షాలు కురిసినప్పుడు జూలై నాలుగో వారం లేదా ఆగస్టు మొదటి వారానికి జూరాల, శ్రీశైలానికి వరద ప్రవాహం చేరుతోంది. ఆల్మట్టి ఎత్తు పెంచితే సెప్టెంబరుకుగానీ వరద ప్రవాహం చేరే అవకాశం ఉండదని నీటిపారుదల నిపుణులు స్పష్టం చేస్తున్నారు. వర్షాభావ సమయాల్లో తెలుగు రాష్ట్రాలకు నికర జలాలు కాదు కదా ఎగువ నుంచి చుక్క నీరు కూడా చేరే అవకాశం ఉండదని హెచ్చరిస్తున్నారు. 2015–16లో శ్రీశైలానికి 55 టీఎంసీలు మాత్రమే రావడాన్ని వారు గుర్తు చేస్తున్నారు. ఈ పాపం చంద్రబాబుదే.. కర్ణాటక సర్కారు ఆల్మట్టి డ్యామ్ పనులను 1963లో ప్రారంభించగా మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ అభ్యంతరం వ్యక్తం చేయడం, న్యాయస్థానాల్లో వివాదాల వల్ల ప్రాజెక్టు పనులు నత్తనడకన సాగాయి. 1996 లోక్సభ ఎన్నికల్లో చంద్రబాబు ఛైర్మన్గా ఉన్న సంకీర్ణ కూటమి(యునైటెడ్ ఫ్రంట్) సర్కార్ కేంద్రంలో కొలువుతీరింది. అప్పటి కర్ణాటక సీఎం హెచ్డీ దేవేగౌడ యునైటెడ్ ఫ్రంట్ మద్దతుతో ప్రధానమంత్రి పదవిని చేపట్టి ప్రపంచ బ్యాంకు, ఏఐబీపీ(సత్వర సాగునీటి ప్రయోజన కల్పన పథకం) నిధులతో ఆల్మట్టి డ్యామ్ పనుల్లో వేగం పెంచారు. ఈ వ్యవహారంపై అప్పటి ఉమ్మడి రాష్ట్ర సీఎం చంద్రబాబు చూసీచూడనట్లు ఉదాశీనంగా వ్యవహరించడంతో ఆల్మట్టి డ్యామ్ ఎత్తును 519.6 మీటర్లకు కర్ణాటక పెంచేసింది. 2002 నుంచి ఆల్మట్టిలో 129.72 టీఎంసీలను నిల్వ చేస్తున్నారు. ఆల్మట్టి ఎత్తును 519.6 మీటర్ల నుంచి 524.256 మీటర్లకు పెంచేందుకు 2002లో కర్ణాటక సర్కార్ ప్రయత్నించినా చంద్రబాబు పట్టించుకోలేదు. చివరకు 2004లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సర్కార్ సుప్రీం కోర్టును ఆశ్రయించడంతో ఆల్మట్టి ఎత్తును 519.6 మీటర్లకే పరిమితం చేయాలని సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చింది. కేంద్ర రాజకీయాల్లో చక్రం తిప్పానని, దేవేగౌడను ప్రధానిగా చేశానని చెప్పుకునే చంద్రబాబు రాష్ట్ర ప్రయోజనాల పరిరక్షణకు చిత్తశుద్ధితో వ్యవహరించి ఉంటే ఈ రోజు ఆల్మట్టి డ్యామ్ ఎత్తు పెంచే అవకాశం కర్ణాటకు ఉండేది కాదని న్యాయ, నీటిపారుదలరంగ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. –రామగోపాలరెడ్డి ,సాక్షి ప్రతినిధి ఆలమూరు -
ఈ సారైనా..!?
సీఎం పేషీలో తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకం డీపీఆర్ ఫైల్ రూ.493కోట్లతో మొదటి దశ అంచనా 55,600ఎకరాలకు సాగునీరందించడం లక్ష్యం తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకం డీపీఆర్ ఫైల్ మరోసారి సీఎం పేషీకి చేరింది. గతంలో పలుమార్లు వివిధ కారణాలతో వెనక్కి వచ్చిన ఈఫైల్కు ఈసారైనా మోక్షం లభిస్తుందో లేదోనని ఆర్డీఎస్ చివరి ఆయకట్టు రైతాం గం ఎంతో ఆశగా ఎదురుచూస్తోంది. అనుమతి లభిస్తే దశాబ్దాల కల సాకారమై తమ బతుకులు బాగుపడతాయని అభిప్రాయపడుతోంది. జూరాల : ఆర్డీఎస్ చివరి ఆయకట్టుకు శాశ్వతంగా సాగునీరందించాలనే లక్ష్యంతో నిర్మించ తలపెట్టిన తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకం డీపీఆర్ ఫైల్ ఎట్టకేలకు మరోసారి సీఎం చంద్రశేఖర్రావు వద్దకు చేరింది. రెండురోజుల క్రితం నీటిపారుదల శాఖ ఈఎన్సీ నుంచి తుమ్మిళ్ల ఫైల్ను పంపారు. తుమ్మిళ్లకు అనుమతి లభిస్తే ఆర్డీఎస్ పరిధిలో 30ఏళ్లకు పైగా సాగునీరందని దాదాపు 55,600ఎకరాలకు సాగు, తాగునీరు అందనుంది. వడ్డేపల్లి మండలం తుమ్మిళ్ల గ్రామం వద్ద తుంగభద్ర నదీతీరంలో ఈ పథకంను చేపట్టనున్నారు. రెండు పంపులతో నీటిని ఎత్తిపోసేందుకు రూ.493 కోట్ల అంచనాతో ప్రతిపాదనలు రూపొందించారు. ఆర్థికశాఖ ఈనెల ఒకటవ తేదిన క్లియరెన్స్ ఇవ్వడంతో అన్ని అ డ్డంకులు తొలగి, పరి పాలన అనుమతి కొరకు సీఎం వద్దక నివేదిక ఫైల్ వెళ్లింది. సెప్టెంబర్ మొదటివారంలో ఈ పథకం డీపీఆర్ను ఈ ఎన్సీకి పంపారు. డీపీఆర్లో సూచించిన మూడు రిజర్వాయర్లను రెండు దశలుగా విభజించి మొదటి దశ పనులకు శ్రీకారం చుట్టేలా తుదినివేదికను తయారుచేశారు. ఇదీ తుమ్మిళ్ల నేపథ్యం తుంగభద్ర నది నీటిని వాడుకునేలా నీటి మళ్లింపు పథకాలను చేపట్టేందుకు 1937లో అప్పటి నిజాం ప్రభుత్వం, మద్రాసు ప్రభుత్వాలు ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఆ మేరకు నిజాం ప్రభుత్వం ఆర్డీఎస్ను చేపట్టగా, మద్రాసు ప్రభుత్వం కర్నూలు, కడప కాలువను చేపట్టింది. 1951లో ఆర్డీఎస్ నుంచి సాగునీరందడం ప్రారంభమైంది. ఆర్డీఎస్ ద్వారా 15.84టీఎంసీల నీటిని అలంపూర్ నియోజకవర్గంలో 87,500 ఎకరాలకు బచావత్ ట్రిబ్యునల్ ప్రకారం వినియోగించుకునే హక్కు ఉంది. మూడు టీఎంసీలకు మించి సాగునీరందడం లేదు. దీంతో తుమ్మిళ్లను చేపడుతున్నారు. వడ్డేపల్లి మండలం తుమ్మిళ్ల గ్రామం వద్ద తుంగభద్ర నది ఒడ్డున ఎత్తిపోతలను చేపట్టనున్నారు. రెండు పంపులను ఏర్పాటు చేసి 800 క్యూసెక్కులను పంపింగ్ చేసేలా డిజైన్ చేశారు. రెండు పంపులకు 8మెగావాట్ల విద్యుత్ అవసరం ఉంటుంది. పంప్హౌస్ నుంచి మల్లమ్మకుంట రిజర్వాయర్కు నీటిని పంపింగ్ చేసి ఆర్డీఎస్ ప్రధాన కాలువ ద్వారా ఆయకట్టుకు నీళ్లివ్వాలన్నది లక్ష్యం. మల్లమ్మకుంటను 0.39టీఎంసీల సామర్థ్యంతో నిర్మిస్తారు. పంప్హౌస్ వద్ద నది పూర్తిస్థాయి నీటిమట్టం 292 అడుగులు కాగా 287అడుగుల వద్ద నుంచి నీటిని తోడేలా డిజైన్ చేశారు. 70రోజుల పాటు నదికి వరద ఉండే సమయంలో 3.63టీఎంసీల నీటిని పంపింగ్ చేయాలని ఎత్తిపోతల లక్ష్యం. ఆర్డీఎస్లో 12వ డిస్ట్రిబ్యూటరీ నుంచి చివరి 40వ డిస్ట్రిబ్యూటరీ వరకు ఈ పథకం ద్వారా సాగునీటిని అందిస్తారు. ఈ విషయమై జిల్లా ప్రాజెక్టుల చీఫ్ ఇంజనీర్ ఖగేందర్ను వివరణ కోరగా తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకం డీపీఆర్ ఫైల్ సీఎం వద్దకు వెళ్లిందని తెలిపారు. త్వరలోనే పరిపాలన అనుమతులు రావచ్చని చెప్పారు.