breaking news
diet cet counselling
-
డైట్ కౌన్సెలింగ్లో కేవీ విద్యార్థులకు అన్యాయం
సాక్షి, విశాఖపట్నం: డైట్పై ఎన్నో ఆశలు పెట్టుకున్న కేంద్రీయ విద్యాలయం విద్యార్థులకు నిరాశే మిగిలింది. ఎన్నడూ లేని విధంగా డైట్ కౌన్సెలింగ్లో పదో తరగతి లేదా ఇంటర్మీడియట్లలో తెలుగు సబ్జెక్ట్ ఉన్న వాళ్లే అర్హులని కొత్త నిబంధనలు విధించారు. దీంతో దీనిపైనే ఆశలు పెట్టుకున్న కేవీ విద్యార్థులకు అన్యాయం జరిగింది. మొదటిగా డైట్ నోటిఫికేషన్ను ఎవరు అర్హులు.. ఎవరు అనర్హులో పూర్తి సమాచారంతో విడుదల చేస్తారు. ఈ నోటిఫికేషన్లో తెలుగు సబ్జెక్టుగా లేకపోయిన ప్రవేశం ఉందని.. పరీక్షల్లో అర్హత సాధించిన వారికి ర్యాంక్ కార్డు కూడా పంపించి ఇప్పుడు కౌన్సెలింగ్లో కేవలం తెలుగు సబ్జెక్టుగా ఉన్న విద్యార్థులకు మాత్రమే అర్హత ఉందని నిబంధనలు విధించింది. ఆన్లైన్ కౌన్సెలింగ్ ప్రక్రియలో వారికి నచ్చిన కళాశాలల్లో సీట్ల అలాట్మెంట్ కూడా జరిగింది. చివరికి సర్టిఫికెట్ల పరశీలనకు హాజరైన కేవీ విద్యార్థులకు కొత్త నిబంధనలతో ఆంక్షలు విధించారు. మూడు నెలల కిందట విడుదలైన డైట్ నోటిఫికేషన్లో తెలుగు సబ్జెక్ట్ తప్పనిసరిగా ఉండాలనే నిబంధన లేదు. గతేడాది కూడా ఇటువంటివి లేవు. ఈ తరహా నిబంధనలతో అన్యాయానికి గురైన విద్యార్థులు విశాఖలోని ప్రతి కళాశాలలో ఐదుగురు చొప్పున ఉన్నారు. అప్పుడొకలా.. ఇప్పుడొకలా.. ఏపీ డైట్ నోటిఫికేషన్–2019 విడుదల చేసినప్పుడు ఇంగ్లిష్ మీడియం విద్యార్థుల అకడమిక్ కోర్సుల్లో తెలుగు తప్పనిసరిగా ఉండాలని, సీబీఎస్ఈలో చదివిన వారు అనర్హులని కూడా స్పష్టత ఇవ్వలేదు. ఈ నెల 17న సర్టిఫికెట్ల వెరిఫికేషన్కు హాజరవ్వాలని ఒక ప్రొసీడింగ్ ఆర్సీ నంబర్ 1/డీఈసెట్/2010–2 విద్యార్థులకు పంపించారు. అందులో సీబీఎస్ఈ విద్యార్థులకు అర్హత లేదని ఉంది. కేవలం సర్టిఫికెట్ల వెరిఫికేషన్కు మాత్రమే ఈ ప్రొసీడింగ్ విడుదల చేయడంతో విద్యార్థుల్లో ఆందోళన నెలకొంది. జిల్లాతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఈ నిబంధనలతో వేల మంది సీబీఎస్ఈ విద్యార్థులకు తీవ్ర నష్టం వాటిల్లింది. ఎంసెట్, ఐఐటీ వంటి ఇతర అవకాశాలను కూడా వదిలి ఈ కౌన్సెలింగ్నే నమ్ముకుని ఉన్న విద్యార్థుల ఆశలకు బ్రేకులు పడ్డాయి. జిల్లా విద్యాశాఖ అధికారి లింగేశ్వరరెడ్డి, భీమిలి డైట్ కళాశాల ప్రినిపాల్, డైట్ జిల్లా కౌన్సెలింగ్ ఇన్చార్జిని కలిసి తమకు జరిగిన సమస్యలను సీబీఎస్ఈ విద్యార్థులంతా విన్నవించుకున్నారు. తమకు న్యాయం జరుగుతుందని ఆశతో ఉన్నారు. మాకు న్యాయం జరగాలి కేంద్రీయ విశ్వవిద్యాలయంలో ఇంటర్ పూర్తిచేశాను. మొదటి నుంచి సీబీఎస్ఈ సిలబస్సే కావడంతో తెలుగు సబ్జెక్టు ఆప్సన్ లేదు. డైట్ పరీక్ష రాశాను. ఐఐటీలో అవకాశాన్ని కూడా వదులుకుని కౌన్సెలింగ్కి వస్తే అన్యాయం జరిగింది. ఆన్లైన్లో పెట్టుకుంటే మల్కాపురం డైట్ కళాశాల వచ్చింది. ఇప్పుడు కౌన్సెలింగ్లో కొత్త నిబంధనలతో కెరీర్ ప్రశ్నార్థకంగా మారింది. – కొండ కనకమహాలక్ష్మి, విద్యార్థిని, మల్కాపురం అవకాశం కల్పించండి కేవీలో ఇంటర్ చదివాను. డైట్ పరీక్ష రాశాను. మంచి ర్యాంకు వచ్చింది. ఆన్లైన్ కౌన్సెలింగ్లో కాలేజ్ ఆప్సన్ కూడా పెట్టుకున్నాను. సీబీఎస్ఈ విద్యార్థులకు తెలుగు సబ్జెక్టు ఉండకపోవడంతో డైట్ కౌన్సెలింగ్లో సర్టిఫికెట్ల పరిశీలనకు అనుమతించ లేదు. ఈ నెల 15, 16 తేదీల్లో డీఎడ్ ప్రవేశాలకు కౌన్సెలింగ్ ప్రక్రియ పూర్తయింది. ఈ విధానంతో రాష్ట్రంలో చాలామంది నష్టపోయారు. మాకు అవకాశం కల్పించాలి. – మహేన్ లోహి, విద్యార్థి పైఅధికారుల దృష్టికి తీసుకెళతాం డైట్ నోటిఫికేషన్లో ఎటువంటి సమాచారం లేదు. డైట్ కౌన్సెలింగ్లో భాగంగా సర్టిఫికెట్ల వెరిఫికేషన్లో పదిలో గానీ, ఇంటర్లో గానీ తెలుగు సబ్జెక్టు కలిగి ఉన్న వారికి మాత్రమే అర్హత ఉంటుందని నిబంధనలు వచ్చాయి. దాని ప్రకారమే తాము ఆచరించాం. దీనిని పైఅధికారుల దృష్టికి తీసుకెళతాం. – ఎం.జ్యోతికుమారి, భీమిలి డైట్ కళాశాల ప్రిన్సిపాల్, డైట్ కౌన్సెలింగ్ ఇన్చార్జి -
డైట్ తిప్పలు
డైట్ కౌన్సెలింగ్లో అభ్యర్థులు పడరాని పాట్లు పడుతున్నారు. రోజుల తరబడి సాగుతున్న ప్రక్రియతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గతంలో ఆన్లైన్లోనే ఉన్న డైట్ కౌన్సెలింగ్ ప్రక్రియను అధికారులు స్పాట్కు మార్చడంతో కౌన్సెలింగ్కు రిజిస్ట్రేషన్ చేసుకున్న 618 మంది జిల్లాలోని అభ్యర్థులంతా మెదక్కు రావాల్సిన పరిస్థితి తలెత్తింది. వ్యయప్రయాసలకోర్చి ఇక్కడికొచ్చిన వారికి గత రెండు రోజులుగా కొనసాగిస్తున్న కౌన్సెలింగ్ను మరో రోజుకు అధికారులు పొడిగించడంతో అభ్యర్థులు మండిపడుతున్నారు. చిన్నపిల్లలతో మహిళా అభ్యర్థుల బాధలు వర్ణనాతీతం. డీఈడీ చేస్తే ఉద్యోగ అవకాశాలు మెండుగా ఉండడంతో అభ్యర్థులు డైట్లో ప్రవేశానికి ఆసక్తి చూపుతున్నారు. దీంతో ఈ సీట్లకు డిమాండ్ భారీగా పెరిగింది. అభ్యర్థుల సంఖ్యకు అనుగుణంగా డైట్ అడ్మిషన్ కౌన్సెలింగ్ను సులభతరం చేసేందుకు 2012-13లో ప్రభుత్వం వెబ్ ఆప్షన్కు అవకాశం కల్పించింది. దీంతో ఎంట్రెన్స్ రాసిన అభ్యర్థులు ఎక్కడి నుంచైనా ఆన్ లైన్ ద్వారా వెబ్ కౌన్సెలింగ్లో పాల్గొనే అవకాశం లభించింది. 2013-14 విద్యా సంవత్సరానికి సంబంధించి మొదటి, రెండో విడత కౌన్సెలింగ్లను ఆన్లైన్ ద్వారానే నిర్వహించారు. మూడో విడతకు వచ్చేసరికి జిల్లాలోని ప్రభుత్వ డైట్ కళాశాలలోనే స్పాట్ కౌన్సెలింగ్ నిర్వహించాలని నిర్ణయించారు. ముందుకు సాగని కౌన్సెలింగ్.. జిల్లాలో మొత్తం 24 ప్రైవేట్, ప్రభుత్వ డైట్ కళాశాలలు ఉన్నాయి. ఇందులో 240 సీట్లు మేనేజ్మెంట్ కోటా కింద, మిగిలిన 1,060 సీట్లు కన్వీనర్ కోటాలో కౌన్సెలింగ్ ద్వారా భర్తీ చేస్తారు. ప్రస్తుతం మూడో విడతకు వచ్చేసరికి 52 తెలుగు మీడియం, 11 ఉర్దూ మీడియం సీట్లు ఖాళీగా ఉన్నాయి. ఇందుకోసం జిల్లాల వారీగా ప్రభుత్వ డైట్ కళాశాలల్లో ఈనెల 6న కౌన్సెలింగ్ ప్రారంభించారు. ఇందుకోసం 618 మంది రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. రెండు రోజుల్లో కౌన్సెలింగ్ పూర్తి చేయాల్సి ఉంది. అయితే అభ్యర్థుల సంఖ్య అధికంగా ఉండడంతోపాటు, 200 నుంచి 300 కళాశాలలకు ఆప్షన్లు ఇస్తుండడంతో ఒక్కో అభ్యర్థికి సుమారు 45 నిమిషాల సమయం పడుతుంది. ఈ దశలో రెండు రోజుల గడువు చాలకపోవడంతో మరో రోజు పెంచారు. 6,7 తేదీల్లో సుమారు 350 మందికి కౌన్సెలింగ్ పూర్తి చేశారు. మిగతా 268 మంది ఎదురు చూస్తున్నారు. బుధవారం ఎంత ఆలస్యమైనా కౌన్సెలింగ్ పూర్తి చేస్తామని అధికారులు చెబుతున్నారు. రెండు రోజులుగా.. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన అభ్యర్థులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. మొదటి రోజు అవకాశం దక్కని అభ్యర్థులు రెండో రోజు కూడా వచ్చారు. రెండో రోజూ అవకాశం దొరకని వారు మూడో రోజు కూడా రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో బస్సు చార్జీలతోపాటు రాకపోకలు సాగించ డం, వసతుల కోసం ఇబ్బందులు పడాల్సి వచ్చింది. చంటి పిల్లల తల్లులు సైతం రెండు రోజులుగా అవస్థలు పడ్డారు. అమ్మాయిలు తమ తల్లిదండ్రులను తోడుగా తెచ్చుకుంటున్నారు. కౌన్సెలింగ్ వేగంగా జరగకపోవడం తో తమ నంబర్ వచ్చే వరకు ఇలా వీరంతా డైట్లో పడిగాపులు కాస్తున్నారు. స్లైడింగ్ లేక సమస్య.. గతంలో మొదటి విడతలో సీట్లు పొందిన అభ్యర్థులు రెండో, మూడో విడతల్లో తమ ర్యాంకుకు అనుగుణంగా దగ్గరి కళాశాలల్లోకి అడ్మిషన్ బదిలీ చేయించుకునే(స్లైడింగ్) అవకాశం ఉండేది. కానీ ఈసారి ఆ అవకాశాన్ని తొలగించడంతో అభ్యర్థులు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.