కృష్ణా పుష్కరాలకు ట్రాఫిక్ మళ్లింపు
ఏలూరు (మెట్రో): కృష్ణా పుష్కరాల నేపథ్యంలో ఈనెల 12వ తేదీ నుంచి ట్రాఫిక్ మళ్లింపు చర్యలు తీసుకుంటున్నట్టు ఏలూరు రేంజ్ డీఐజీ పీవీ రామకృష్ణ తెలిపారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో శనివారం విలే కరుల సమావేశంలో డీఐజీ మాట్లాడారు. ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామన్నారు. చెన్నై నుంచి విశాఖ వెళ్లే వాహనాలు, విశాఖ నుంచి చెన్నై వెళ్లే వాహనాల దారి మళ్లించేందుకు వేరే మార్గాలను అన్వేషిస్తున్నామని చెప్పారు. త్వరలోనే ట్రయిల్ రన్ వేసి మార్గాలను ప్రకటిస్తామన్నారు. పుష్కరాల సమయంలో ట్రాఫిక్ మళ్లింపు విషయంలో ప్రజలు సహకరించాలని కోరారు. అదే విధంగా పుష్కరాలకు వచ్చే యాత్రికులు నిర్దేశించిన పార్కింగ్ స్థలాల వరకే వారి వాహనాలను అనుమతిస్తామన్నారు. ఘాట్లలోనూ ప్రత్యేకంగా లోపలికి, బయటకు వేర్వేరుగా మార్గాలను ఏర్పాట్లు చేసినట్టు చెప్పారు. ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ సహకరించాలని డీఐజీ రామకృష్ణ కోరారు.