breaking news
Community Police
-
ట్రాఫిక్ నియంత్రణలో ‘కమ్యూనిటీ పోలీస్’
సాక్షి, ముంబై: నగరంలో ఉగ్రరూపం దాల్చిన ట్రాఫిక్ జాం సమస్యను కొంతమేర పరిష్కరించేందుకు ‘కమ్యూనిటీ పోలీసు’ పేరుతో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టనుంది. ఇందులో పాల్గొనే వారికి ట్రాఫిక్ శాఖ ప్రత్యేకంగా శిక్షణ ఇవ్వనుంది. వారంలో ఒక రోజు, ఏదో ఒక జంక్షన్ వద్ద ట్రాఫిక్ పోలీసులతో కలిసి పని చేసే అవకాశం కల్పించనున్నారు. ఇలాంటి కార్యక్రమం చేపట్టడం రాష్ట్ర పోలీసు శాఖలో ఇదే ప్రథమం. నిత్యం ట్రాఫిక్ జాంలు.. నగర రహదారులపై విపరీతంగా ట్రాఫిక్ పెరిగిపోయింది. రోజు దాదాపు 450కి పైగా కొత్త వాహనాలు ఆర్టీఓలో రిజిస్ట్రేషన్ చేసుకుని రోడ్లపైకి వస్తున్నాయి. ఇలా పెరిగిపోతున్న వాహనాల సంఖ్యతో పోలిస్తే నగర రహదారులు ఎటూ సరిపోవడం లేదు. ఎక్కడ చూసిన ట్రాఫిక్ జాం సమస్య కనిపిస్తోంది. దక్షిణ, మధ్య, ఉత్తర ముంబైలోని కొన్ని ప్రాంతాల్లో ఈ సమస్య అధికంగా ఉంది. వాహనదారులు ట్రాఫిక్ నియమాలు పాటించడం లేదు. పట్టుకుంటే ట్రాఫిక్ పోలీసులతో వాగ్వాదానికి దిగుతున్నారు. పోలీసులనే కొట్టి పారిపోయిన సంఘటనలూ ఉన్నాయి. ప్రత్యేక శిక్షణ ట్రాఫిక్ పోలీసులపై దాడులను తీవ్రంగా పరిగణించిన నగర ట్రాఫిక్ శాఖ ‘కమ్యూనిటీ పోలీసు’ పేరుతో పథకాన్ని చేపట్టాలని నిర్ణయించింది. స్థానికంగా ఉంటున్న ప్రజలు, రాజకీయ నాయకులు, సామాజిక సేవా సంస్థల సాయం తీసుకోవాలని యోచిస్తున్నట్లు అసిస్టెంట్ పోలీసు కమిషనర్ (ట్రాఫిక్) బి.కే.ఉపాధ్యాయ అన్నారు. ఇందులో పనిచేసే వారికి రోడ్డు ప్రమాదాలకు సంబంధించిన ఫొటోలు, వీడియో ఫుటేజ్లు చూపించి, రోడ్డు ప్రమాదాల గురించి అవగాహన కల్పించనున్నామన్నారు. వాహనాలను ఎలా అదుపు చేయాలి, ఎలా దారిమళ్లించాలి అనేక ట్రాఫిక్ నియమాలను కమ్యూనిటీ పోలీసులకు ప్రత్యేక శిక్షణ ఇస్తామని వివరిస్తారు. ఇలా చేయడం వల్ల నగరంలో రోడ్డు ప్రమాదాల సంఖ్య తగ్గుముఖం పట్టడమేకాకుండా ట్రాఫిక్ జాం సమస్య పరిష్కారం కానుందని ఉపాధ్యాయ్ అభిప్రాయపడ్డారు. -
చైతన్యం కోసమే ‘ప్రజా పోలీస్’
=కళాజాతాలతో అవగాహన =ప్రతి ఫిర్యాదుకు రశీదు =డీఐజీ కాంతారావు చేర్యాలటౌన్, న్యూస్లైన్: ప్రజా చైతన్యం కోసమే కమ్యూనిటీ పోలీస్ వ్యవస్థను ఏర్పాటు చేశామని డీఐజీ డాక్టర్ ఎం. కాంతారావు అన్నారు. సోమవారం చేర్యాల పోలీస్ స్టేషన్ను తనిఖీ చేసి రికార్డులు, రిజిస్టర్లను పరిశీలించారు. కేసుల వివరాలు, స్థానిక సమస్యలు, సిబ్బంది పనితీరును అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా డీఐజీ మాట్లాడుతూ చట్టాలను ఎవరు అతిక్రమించినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రతి పోలీస్ స్టేషన్లో సన్నిహిత కౌంటర్ను ఏర్పాటు చేస్లి, ప్రతి ఫిర్యాదుకు జవాబుదారితనంగా ఉండేందుకు రశీదు ఇస్తున్నట్లు తెలిపారు.. కమ్యూనిటీ పోలీస్ ఆధ్వర్యలో కళాజాతాలు నిర్వహిస్తున్నారని తెలిపారు. గ్రామాల్లో చైల్డ్ మ్యారేజ్లు, దురాచారాలపై అవగాహన సదస్సులను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. మహిళలపై లైంగిక దాడులకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవడమే కాకుండా రౌడీషీట్లు తెరిచి జైలుకు పంపుతామని హెచ్చరించారు. చేర్యాల చారిత్రిక నకాశీ చిత్రకళకు కేంద్రంగా ఉందని, ఆ కళను చేయూతనివ్వాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. గ్రామీణ టూరిజం క్రింద అభివృద్ధి పర్చాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా పోలీసుల పరేడ్ను స్వయంగా పరిశీలించారు. పోలీస్ కేస్ స్టడీని అడిగి తెలుసుకున్నారు. అడిషనల్ ఎస్పీ శ్రీకాంత్, జనగామ డీఎస్పీ సురేందర్, చేర్యాల సిఐ జితేందర్, చేర్యాల, బచ్చన్నపేట ఎస్ఐలు సూర్యప్రసాద్, షాదుల్లాబాబా, ట్రైనీ ఎస్సైలు పాల్గొన్నారు. మల్లన్న ఆలయంలో ప్రత్యేక పూజలు చేర్యాల: కొమురవెల్లి శ్రీమల్లికార్జునస్వామికి డీఐజీ కాంతారావు, ఏఎస్పీ శ్రీకాంత్, జనగామ డీఏస్పీ సురేందర్ ప్రత్యేక పూజలు చేశారు. సోమవారం చేర్యాల మండలంలోని కొమురవెల్లిలోని రాజగోపురం నుంచి ఆలయ అర్చకులు, సిబ్బంది ఘనంగా స్వాగతం పలికారు. అర్చకులు వారికి శాలువ కప్పి ఘనంగా సన్మానించారు. సీఐ జితేందర్, చేర్యాల, మద్దూరు, బచ్చన్నపేట ఎస్ఐలు సూర్యప్రసాద్, రామకృష్ణ, బాబులతో పాటు ఆలయ హోంగార్డులు డీ. బాబు, ఏ.వినోద్లు ఉన్నారు.