breaking news
CM decision
-
ఎంపీటీసీ, జెడ్పీటీసీలకు మంగళం!
* పంచాయతీరాజ్ చట్ట సవరణకు సీఎం నిర్ణయం * విధివిధానాలు రూపొందించాలని సీఎస్కు ఆదేశాలు * మూడంచెల విధానాన్ని అనుసరించేలా చర్యలు * చట్టపరంగా చేపట్టాల్సిన అంశాలను పరిశీలించాలని సూచన సాక్షి, హైదరాబాద్: ప్రస్తుతం పంచాయతీరాజ్ వ్యవస్థలో ఉన్న ఎంపీటీసీ, జెడ్పీటీసీ పదవులకు మంగళం పాడాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. మూడంచెల పంచాయతీరాజ్ వ్యవస్థను కొనసాగించాలని, అదనపు సమాం తర పదవులు మండల ప్రాదేశిక నియోజకవర్గాలు, జిల్లా పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గాలను రద్దు చేయనుంది. ఈ మేరకు సీఎం కె.చంద్రశేఖర్రావు సీఎస్ రాజీవ్శర్మకు ఆదేశాలు జారీ చేశారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ పదవులను రద్దు చేసేందుకు చట్టప్రకారం అనుసరించాల్సిన చర్యలు పరిశీలించాలని, సంబంధించిన విధి విధానాలను రూపొందించాలని సూచించారు. సమాంతర పదవులు.. స్థానిక సంస్థల పాలనలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ సభ్యులకు పెద్దగా ప్రాధాన్యం లేదు. వారికి నిర్దిష్ట అధికారాలు కూడా లేవు. మండల స్థాయిలో ఎంపీపీలు, జెడ్పీటీసీ సభ్యులు సమాంతర స్థాయిలో ఉండగా.. గ్రామాల్లో ఎంపీటీసీలు, సర్పంచులు దాదాపు సమాన స్థాయిలో ఉన్నారు. దీంతో ఎన్నో సమస్యలు వస్తున్నాయి. కేంద్రం రాష్ట్రాలకు ఇచ్చే పన్నుల వాటాను 42 శాతానికి పెంచినా.. అందులో చాలా వరకు నిధులను నేరుగా గ్రామాలకు కేటాయిస్తోంది. దీంతో ఎంపీటీసీ, జెడ్పీటీసీ సభ్యులకు ఆర్థిక అంశాల్లో ప్రమేయం లేకుండా పోయింది. వారు కేవలం ఎంపీపీ, జెడ్పీ చైర్మన్ ఎన్నికలకే పరిమితమవుతున్నారనే అభిప్రాయం ఉంది. ఈ నేపథ్యంలోనే ఎంపీటీసీ, జెడ్పీటీసీలను తొలగించి జిల్లా, మండలం, గ్రామం యూనిట్లుగా మూడంచెల విధానాన్ని కొనసాగించాలని సీఎం భావిస్తున్నారు. కొత్త జిల్లాల ఏర్పాటులో భాగంగా పంచాయతీరాజ్ చట్టానికి అవసరమైన సవరణలు చేయాలని అధికారులకు సూచించారు. అనవసర రాజకీయ జోక్యం తగ్గేలా, పంచాయతీరాజ్ వ్యవస్థను మరింత సమర్థవంతంగా తీర్చిదిద్దేలా ప్రణాళిక రూపొందించాలని ఆదేశించారు. అలంకారప్రాయంగా పదవులు.. 1987కు ముందున్న పంచాయతీ సమితులను అప్పటి ఎన్టీఆర్ ప్రభుత్వం రద్దు చేసింది. వాటి స్థానంలో మండల ప్రజా పరిషత్లను ఏర్పాటు చేసింది. ఉమ్మడి రాష్ట్రంలో 1994 పంచాయతీరాజ్ చట్టం అమల్లోకి వచ్చాక ఈ వ్యవస్థలో కొత్త మార్పులు చోటు చేసుకున్నాయి. గ్రామం, మండలం, జిల్లా యూనిట్లుగా మూడంచెల వ్యవస్థతో పాటు మండల ప్రాదేశిక, జిల్లా పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గాలు కొత్తగా వచ్చాయి. 1995లో తొలిసారిగా ఎంపీటీసీలు, జెడ్పీటీసీ సభ్యులకు ఎన్నికలు జరిగాయి. కానీ స్థానిక పాలనలో ఈ పదవులు అలంకార ప్రాయంగా మారడంతో దీనపై ప్రభుత్వం పునరాలోచనలో పడింది. కానీ 73వ రాజ్యాంగ సవరణతో ముడిపడి ఉన్న అంశం కావటంతో... ఈ వ్యవస్థలో మార్పులు చేయటం సాధ్యమా, కాదా అనేదానిపై భిన్నాభిప్రాయాలున్నాయి. అయితే స్థానిక సంస్థలు రాష్ట్ర పరిధిలోని అంశం కావటంతో.. ప్రస్తుత చట్టానికి మార్పులు చేసి ఎంపీటీసీ, జెడ్పీటీసీలను తొలగించే అవకాశముందని అధికార వర్గాలు వెల్లడించాయి. -
విద్యుత్తు చార్జీల్లో రాయితీ
పరిశ్రమలను సంక్షోభం నుంచి గట్టెక్కించేందుకు సీఎం నిర్ణయం సాక్షి, హైదరాబాద్: సంక్షోభంలో ఉన్న పరిశ్రమలను గట్టెక్కించేందుకు విద్యుత్ చార్జీల్లో కొంతమేరకు రాయితీ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రంలోని వస్త్ర, ఉక్కు పరిశ్రమల యాజమాన్యాలకు, పని చేస్తున్న కార్మికులకు ఊరటనిచ్చేలా సీఎం కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నారు. స్పిన్నింగ్ మిల్లులు ప్రస్తుతం చెల్లించే యూనిట్ విద్యుత్ చార్జీలను రూ.2, ఫెర్రో అల్లాయిస్ పరిశ్రమలకు యూనిట్ విద్యుత్ ధరను రూ.1.50 తగ్గిస్తూ ఆదేశాలు జారీ చేశారు. సోమవారం క్యాంపు కార్యాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్శర్మ, అదనపు కార్యదర్శి శాంతికుమారితో సీఎం ఈ మేరకు చర్చలు జరిపారు. రాష్ట్రంలోని వివిధ స్పిన్నింగ్ మిల్లులలో దాదాపు 40 వేల మంది, ఫెర్రో అల్లాయిస్ పరిశ్రమల్లో దాదాపు 5వేల మంది కార్మికులు పని చేస్తున్నారు. వీరి సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని సంక్షోభంలో చిక్కుకున్న పరిశ్రమలను గట్టెక్కించేందుకు చార్జీలు తగ్గించాలని నిర్ణయం తీసుకున్నారు. సవరించిన చార్జీలు ఏడాది పాటు అమలులో ఉంటాయి. సంవత్సరం తరువాత చార్జీలను పునః సమీక్షిస్తారు. ప్రభుత్వం తాజా నిర్ణయంతో ప్రస్తుతం స్పిన్నింగ్ మిల్లులకు యూనిట్కు రూ.6.40 ఉన్న చార్జీ రూ.4.40కు తగ్గుతుంది. ఫెర్రో అల్లాయిస్ పరిశ్రమలకు యూనిట్కు రూ.5.30 ఉన్న టారిఫ్ రూ.3.80కి చేరుతుంది.