మండ్రగబ్బ కాటుకు విద్యార్థి మృతి
గన్నవరం: విషపురుగు కాటుకు గురై పదవ తరగతి విద్యార్థి మృతి చెందడం ఉద్రిక్తతకు దారితీసింది. పోలీసుల సమాచారం ప్రకారం...గన్నవరానికి చెందిన కత్తి గోపి (15) వీరపనేనిగూడెంలోని కేర్ అండ్ షేర్ స్వచ్ఛంద సంస్థ (ఎన్జీవో)కు చెందిన ఆశ్రమంలో ఉంటూ పదవ తరగతి చదువుతున్నాడు. ఆదివారం ఉదయం స్నేహితులతో కలిసి క్రీడా ప్రాంగణంలో ఆడుకుంటూ ఉండగా మండ్రగబ్బ కరిచినా అతడు గుర్తించలేదు. కొద్దిసేపటికి కాలు నొప్పిగా ఉందంటూ సంస్థకు చెందిన మెడికల్ ఇన్ఛార్జ్ రాజేష్రాయ్ను సంప్రదించాడు. అప్పటికే గోపి పరిస్థితి విషమంగా మారడంతో చినఆవుటపల్లిలోని పిన్నమనేని సిద్ధార్థ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ గోపి సాయంత్రం మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. సంస్థ నిర్వాహకుల ఫిర్యాదు మేరకు సోమవారం కేసు నమోదు చేసి మృతదేహానికి స్థానిక ప్రభుత్వ ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు. గోపికి తల్లి లేదని తండ్రి దాసు చిత్తుకాగితాలు ఏరుకుంటూ జీవిస్తుంటాడని బంధువులు తెలిపారు.
పరిహారం కోసం బంధువుల పట్టు
గోపి కుటుంబాన్ని ఆదుకోవాలని, కనీసం మట్టి ఖర్చుల కోసమైనా కొంతమొత్తం కేర్ అండ్షేర్ సంస్థ చెల్లించాలని అదే సంస్థలో ఇంటర్మీడియట్ చదువుతున్న ఆతని సోదరి మరియతో పాటు బంధువులు పట్టుబట్టారు. మృతదేహాన్ని ప్రభుత్వ ఆస్పత్రి ప్రాంగణంలో ఉంచి ఆందోళనకు దిగారు. చివరికి సంస్థ నిర్వాహకులు రూ. 20 వేలు ఇచ్చేందుకు అంగీకరించడంతో మృతదేహాన్ని స్వగ్రామం కంకిపాడు మండలం ఉప్పులూరు తరలించారు.