breaking news
Burning of Effigies
-
లాఠీఛార్జిపై రైతుల ఆగ్రహం
చండీగఢ్: కర్నాల్లో రైతులపై పోలీస్ లాఠీచార్జికి నిరసనగా పంజాబ్ రైతులు రోడ్లను దిగ్బంధించి, హరియాణాలోని బీజేపీ ప్రభుత్వ దిష్టిబొమ్మలను దహనం చేశారు. ఆదివారం మధ్యాహ్నం 2 గంటలపాటు సాగిన ఆందోళనలతో ప్రధాన హైవేలపై వాహనదారులు ఇక్కట్లు పడ్డారు. శనివారం కర్నాల్లో బీజేపీ సమావేశానికి వ్యతిరేకంగా హైవేపైకి భారీగా తరలివచ్చిన రైతులను చెదరగొట్టేందుకు పోలీసులు జరిపిన లాఠీచార్జిలో 10 మంది రైతులు గాయపడిన విషయం తెలిసిందే. కర్నాల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రైతులను భారతీయ కిసాన్ యూనియన్ నేత రాకేశ్ తికాయత్ ఆదివారం పరామర్శించారు. అనంతరం మాట్లాడుతూ.. రైతుల తలలు పగలగొట్టాలంటూ పోలీసులకు ఆదేశాలిచ్చిన సబ్ డివిజినల్ మేజిస్ట్రేట్(ఎస్డీఎం) ఆయుష్ సిన్హాను ఆయన సర్కారీ తాలిబన్గా పేర్కొన్నారు. ‘మీరు మమ్మల్ని ఖలిస్తానీ అంటే, మేం మిమ్మల్ని సర్కారీ తాలిబన్లని అంటాం. ఇలాంటి వారిని మావోయిస్టు ప్రాంతాలకు పంపించాలి’ అని వ్యాఖ్యానించారు. కాగా, తదుపరి కార్యాచరణపై చర్చించేందుకు సోమవారం కర్నాల్లో సమావేశం కానున్నట్లు హరియాణా బీకేయూ చీఫ్ గుర్నామ్ సింగ్ చెప్పారు. ఇలా ఉండగా, రైతులపై పోలీస్ లాఠీచార్జిని హరియాణా ముఖ్యమంత్రి ఖట్టర్ సమర్ధించుకున్నారు. ప్రశాంతంగా నిరసన తెలుపు తామని మాటిచ్చిన రైతులు.. ఆ తర్వాత హైవేను దిగ్బంధించి, పోలీసులపైకి రాళ్లు రువ్వారన్నారు. రైతుల తలలు పగలగొట్టాలంటూ పోలీసులను ప్రేరేపించిన అధికారిపై చర్యలు తీసుకుంటామని హరియాణా డిప్యూటీ సీఎం దుష్యంత్ చౌతాలా హామీ ఇచ్చారు. -
సోనియా, బాబు, కిరణ్, కేసీఆర్ దిష్టిబొమ్మల దగ్ధం
-
సోనియా, బాబు, కిరణ్, కేసీఆర్ దిష్టిబొమ్మల దగ్ధం
హైదరాబాద్: నరక చతుర్థి సందర్భంగా వాడవాడల నరకాసుర దహనాలను నిర్వహించారు. అయితే పురాణకాలం నాటి నరకుడికి బదులుగా ఈసారి సోనియాగాంధీ, చంద్రబాబు, కిరణ్, కేసీఆర్ల దిష్టిబొమ్మలను దహనం చేశారు. సీమాంధ్రలోని 13 జిల్లాల్లో పండగ రోజు కూడా సమైక్య నినాదానే ప్రతిధ్వనించింది. నరక చతుర్థి రోజున నరాకసుర దహనానికి బదులుగా రాష్ట్ర విభజనకు కారకులైన వారి దిష్టిబొమ్మలకు నరకాసుర దహనం నిర్వహించారు. రాష్ట్ర విభజనకు పూనుకున్న సోనియాగాంధీ, అందుకు సహకరిస్తున్న చంద్రబాబు నాయుడు, సీఎం కిరణ్, విభజనకు కారకుడైన కేసీఆర్ల దిష్టిబొమ్మలను దహనం చేశారు. నెల్లూరులో వైఎస్సార్ కాంగ్రెస్ రూరల్ నియోజకవర్గ సమన్వయకర్త కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి నేతృత్వంలో కిరణ్, సోనియా, చంద్రబాబు, దిగ్విజయ్, కేసీఆర్ల దిష్టిబొమ్మను దహనం చేశారు. రాష్ట్ర ప్రజల భవిష్యత్తును గాలికొదిలి నరకాసురుల్లా విభజించ చూస్తున్నారని వారి దిష్టిబొమ్మలను దహనం చేశారు. నరకచతుర్దశి సందర్భంగా సత్తెనపల్లిలో వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో నరకాసురవధ నిర్వహించారు. నరకాసురిని బొమ్మతో పాటు రాష్ట్ర విభజనకు కారకులైన సోనియా, కిరణ్, చంద్రబాబు, కేసీఆర్ బొమ్మలను దహనం చేశారు. సమైక్యాంధ్ర కోసం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఎంతవరకైనా పోరాడతామని వైఎస్సార్ సీపీ నేతలు స్పష్టం చేశారు. సమైక్యాంధ్ర కోరుతూ పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో విద్యార్థులు, ఉద్యోగులు భారీ ర్యాలీ నిర్వహించారు. రాష్ట్రాన్ని విడదీసేందుకు కుట్రపన్నుతున్న సోనియా గాంధీ కేంద్ర మంత్రుల దిష్టిబొమ్మలతో నరకాసురవధ నిర్వహించారు. అనంతరం మానవహారంగా ఏర్పడి సమైక్య నినాదాలతో హోరెత్తించారు.