-
ప్రధానుల కర్మభూమి ఫూల్పూర్
భారత తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ మూడు సార్లు ప్రాతినిధ్యం వహించిన యూపీలో ఫూల్పూర్ లోక్సభ స్థానంలో గెలుపుని ఇటు బీజేపీ, అటు ఎస్పీబీఎస్పీ కూటమి ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఒకసారి విజయాన్ని కైవసం చేసుకున్న బీజేపీ ఈ స్థానాన్ని తిరిగి రాబట్టుకోవాలనుకుంటోంది. బీజేపీని తిరిగి అడుగుపెట్టనివ్వరాదన్న దృఢసంకల్పంతో మహాకూటమి పనిచేస్తోంది. మే 12న పోలింగ్ జరిగే ఫూల్పూర్కి జవహర్ లాల్ నెహ్రూ, వీపీ సింగ్, విజయలక్ష్మి పండిత్ లాంటి ప్రముఖులు ప్రాతినిధ్యం వహించడం విశేషం. 1971లో వీపీ సింగ్ ఇక్కడి నుంచి కాంగ్రెస్ తరఫున విజయాన్ని కైవసం చేసుకున్నారు. సోషలిస్టు పార్టీ నుంచి రామ్ మనోహర్ లోహియా 1962లో నెహ్రూపై పోటీ చేసి ఇక్కడ ఓడిపోయారు. ప్రముఖులను గెలుపుతీరాలకు చేర్చిన స్థానం... 1952లో జరిగిన తొలి ఎన్నికలు మొదలుకొని 1957, 1962ల్లో మూడు సార్లు వరుసగా భారత తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ ఫూల్పూర్ నియోజకవర్గం నుంచే ప్రాతినిధ్యం వహించారు. జవహర్ లాల్ నెహ్రూ మరణించేవరకూ ఇదే స్థానానికి ప్రాతినిధ్యం వహించారు. ఆయన మరణానంతరం జరిగిన ఉప ఎన్నికల్లో నెహ్రూ చెల్లెలు విజయలక్ష్మీ పండిత్ ఇక్కడి నుంచి గెలుపుబావుటా ఎగురవేశారు. 2009లో బీఎస్పీ అభ్యర్థి కపిల్ మున్వీ కర్వారియా గెలుపొందారు. వచ్చినట్టే వచ్చి చేజారిన బీజేపీ సీటు... ఈ లోక్సభ స్థానానికి ఇప్పటివరకు 18 సార్లు జరిగిన ఎన్నికల్లో బీజేపీ ఒకే ఒక్కసారి ఈ సీటుని గెలుచుకోగలిగింది. 2014లో తొలిసారి బీజేపీ అభ్యర్థి కేశవ్ ప్రసాద్ మౌర్య ఈస్థానాన్ని కైవసం చేసుకున్నా, 2018 ఉప ఎన్నికల్లో ఎస్పీ బీఎస్పీ కలిసికట్టుగా పోటీ చేసి బీజేపీని ఓడించాయి. 2014లో బీజేపీ నుంచి గెలిచిన కేశవ్ ప్రసాద్ మౌర్య యూపీ ఉపముఖ్యమంత్రి అయ్యాక ఈ స్థానానికి రాజీనామా చేయడంతో ఉప ఎన్నిక జరిగింది. ఎస్పీ అభ్యర్థి నాగేంద్ర ప్రతాప్ సింగ్ పటేల్ కి 60 వేల ఓట్ల మెజారిటీ రావడంతో బీజేపీ కంగుతినాల్సి వచ్చింది. 2019 ఎవరికి కలిసొస్తుంది? 2019 లోక్సభ ఎన్నికల్లో బీజేపీ తరఫున కేసరి దేవి పటేల్ పోటీ చేస్తోంటే, ఎస్పీ పంధారీ యాదవ్ని బరిలోకి దింపింది. కాంగ్రెస్ తరఫున పంకజ్ నిరంజన్ పోటీ చేస్తున్నారు. అయితే ఈ సారి కూడా జాతీయవాదం, తీవ్రవాద వ్యతిరేక దాడులు బీజేపీ గెలుపునకు దోహదం చేస్తాయా? అన్నది ప్రశ్నార్ధకంగా మారింది. కులం ప్రధానమే... 2018 ఉప ఎన్నికల మాదిరిగానే ఈ ఎన్నికల్లో సైతం ఎస్పీ, బీఎస్పీ వ్యూహాత్మక కుల సమీకరణలు ఈసారి కూడా పనిచేస్తాయా అన్నది వేచి చూడాల్సి ఉంది. ఫూల్పూర్ నియోజకవర్గంలోని రాంపూర్ గ్రామస్తుడు రామ్సింగ్ పటేల్ ‘‘ఇటీవల తీవ్రవాద స్థావరాలపై దాడులు తప్ప, నాకు ప్రధాని నరేంద్రమోదీ సాధించిన విజయాల గురించి ఏమీ తెలియదు. కానీ నేను బీజేపీకే ఓటు వేస్తున్నాను. ఎందుకంటే ఆ పార్టీ మా కులం నాయకుడిని పోటీకి దింపింది’’ అని వ్యాఖ్యానించడాన్ని బట్టి ఈ స్థానంలో కులం ప్రాధాన్యత అర్థం చేసుకోవచ్చు. కాంగ్రెస్ అభ్యర్థి పంకజ్ పటేల్ మామ కూర్మి నాయకుడు కావడం ఆయనకు కలిసొచ్చే అంశం. అలాగే పంకజ్ పటేల్ అత్తయ్య కృష్ణ పటేల్ గోండా నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఫూల్పూర్లో ఏ పార్టీ ముస్లింని బరిలోకి దింపకపోవడంతో ముస్లింల ఓట్లన్నీ ఎస్పీ అభ్యర్థికేనని కూడా స్థానిక ముస్లిం నేతలు స్పష్టం చేస్తున్నారు. ఫూల్పూర్లో 3 లక్షల మంది కుర్మీలు, ఒక లక్ష మంది జాటవ్ దళితులు, 1.5 లక్షల మంది జాటవేతరులు, దాదాపు 2 లక్షల మంది యాదవులు, 2 లక్షల మంది బ్రాహ్మణులు, మరో 2 లక్షల మంది ముస్లింలు ఉన్నారు. -
క్లీన్బౌల్డ్ అయ్యాక అంపైర్పై నిందలు
బస్తి, ప్రతాప్గఢ్ (యూపీ)/వాల్మీకినగర్ (బిహార్): క్లీన్బౌల్డ్ అయ్యాక అంపైర్ను నిందించే బ్యాట్స్మన్లా, పరీక్షల్లో ఫెయిలై కుంటిసాకులు చెప్పే విద్యార్థిలా విపక్షాలు వ్యవహరిస్తున్నాయని ప్రధాని మోదీ ఎద్దేవా చేశారు. అధికారం కోసం ఎస్పీ, బీఎస్పీ, కాంగ్రెస్లు విలువలకు తిలోదకాలిస్తున్నాయన్నారు. ఉత్తరప్రదేశ్లోని బస్తి, ప్రతాప్గఢ్, బిహార్లోని వాల్మీకినగర్లో శనివారం ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఎనిమిది సీట్లకు పోటీ చేస్తున్నవారు కూడా ప్రధానిగా ప్రమాణం చేసేందుకు సిద్ధమవుతున్నారని మోదీ వ్యంగ్యంగా అన్నారు. బీజేపీకి వ్యతిరేకంగా సమష్టి పోరాటం చేస్తున్న మహాకల్తీ కూటమి బంధం ఎంతోకాలం సాగదని మోదీ ఈ సందర్భంగా జోస్యం చెప్పారు. మహా కూటమి మహా అవినీతిని పెంచి పోషిస్తుందని అన్నారు. కాంగ్రెస్ ‘ఓటు కాట్వా’(ఓట్ల కోత) స్థాయికి దిగజారిపోయిందని, త్వరలోనే అది తన పతనాన్ని చూస్తుందని అన్నారు. ఒకపక్క కాంగ్రెస్తో ఎస్పీ మెతగ్గా వ్యవహరిస్తుంటే మరోపక్క బీఎస్పీ అధినేత్రి మాయావతి కాంగ్రెస్పై దాడి చేయడం గమనార్హమన్నారు. రఫేల్ విషయంలో తనను అపఖ్యాతి పాలుచేసేందుకు రాహుల్ ప్రయత్నించారంటూ.. ఆయన తండ్రి, మాజీ ప్రధాని రాజీవ్గాంధీపై మోదీ విమర్శలు చేశారు. రాజీవ్ గాంధీ మిస్టర్ క్లీన్ ఇమేజ్ చివరకు అవినీతి నంబర్ వన్ గా ముగిసిందని ఆరోపించారు. ఎస్పీ, బీఎస్పీల అవినీతిపై మోదీ ధ్వజమెత్తారు. ఎన్ఆర్హెచ్ కుంభకోణం, ఇసుక అక్రమ తవ్వకాలు, ఎస్పీ అధినేత అఖిలేశ్ యాదవ్ ప్రభుత్వ బంగ్లా ఖాళీ చేసిన తర్వాత కొన్ని వస్తువులు మాయం కావడం వంటివి ఆయన ప్రస్తావించారు. మహా కల్తీ కూటమితో పోల్చుకుంటే ఎన్డీయే పనితీరు విభిన్నమైనదని పేర్కొన్నారు. గత ప్రభుత్వాలు పాక్ చర్యలపై గగ్గోలు పెడుతుండేవని, శత్రు దేశం కంటే తమ ఓటు బ్యాంకే ప్రధానంగా భావించేవని విమర్శించారు. కాంగ్రెస్ హయాంలో ఏర్పడిన తెలుగు రాష్ట్రాల్లో ఘర్షణ వాతావరణం కాంగ్రెస్, బీజేపీ ప్రభుత్వాల మధ్య వైరుధ్యాన్ని మోదీ ప్రస్తావిస్తూ.. వాజ్పేయి ప్రధానిగా ఉన్నప్పుడు ఏర్పడిన కొత్త రాష్ట్రాలు ఉత్తరాఖండ్, జార్ఖండ్, ఛత్తీస్గఢ్లు తమ మాతృ రాష్ట్రాలతో ఎంతోబాగా మంచి సంబంధాలు కొనసాగిస్తున్నాయని చెప్పారు. కాంగ్రెస్ హయాంలో ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ వేరుపడిందంటూ.. ఈ రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఘర్షణ పూరిత వాతావరణం నెలకొందని ఆయన చెప్పారు. -
సొంత సామాజికవర్గాన్ని ముంచిన పవన్
సాక్షి, అమరావతి: రాజకీయాల్లో మరెవరికో కొమ్ముకాయడానికి జనసేన పార్టీ అధినేత పవన్కల్యాణ్ తనను నమ్ముకున్న సామాజిక వర్గాన్ని నట్టేట ముంచేశారని బీజేపీ రాష్ట్ర ఎన్నికల కమిటీ చైర్మన్, ఎమ్మెల్సీ సోము వీర్రాజు ఆరోపించారు. శుక్రవారం ఆయన విజయవాడలో విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో పవన్ సామాజికవర్గం వారు కూడా సీఎం కావాలనే ఉద్దేశంతో బీజేపీ 2014 సెప్టెంబరులో జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్కల్యాణ్ను తమ పార్టీతో కలిసిపోవాలని కోరిందని వీర్రాజు చెప్పారు. అప్పుడే గనుక పవన్కల్యాణ్ బీజేపీ ప్రతిపాదనకు అంగీకరించి ఉంటే ఇప్పుడు ఆ సామాజిక వర్గం కూడా సీఎం పదవి రేసులో ఉండేదని చెప్పారు. రాజకీయాల్లో దార్శనికత గురించి చెప్పే పవన్కల్యాణ్ డబుల్ గేమ్ ఆడుతున్నారని ఆరోపించారు. 2014లో పవన్క ల్యాణ్ను తానే నరేంద్రమోదీ వద్దకు తీసుకెళ్లానని, అప్పటి ఎన్నికల్లో బీజేపీ– జనసేన కలిసి పోటీ చేద్దామని ప్రతిపాదిస్తే.. పవన్కల్యాణ్ టీడీపీతో కలిసి మూడు పార్టీలు పోటీ చేయాలని సూచించారన్నారు. ఏడాది క్రితం జనసేన అవిర్భావ సభలోనూ తనను అభిమానించే సామాజికవర్గం చంద్రబాబుకు పూర్తి వ్యతిరేకంగా ఉందని గ్రహించి టీడీపీపై పవన్కల్యాణ్ విమర్శలు చేశారని.. ఇప్పుడు జరుగుతున్న ఎన్నికల్లో టీడీపీకి లబ్ధి కలిగించేలా.. ఓట్లను చీల్చడానికే బీఎస్పీతో పొత్తు పెట్టుకున్నారని ఆరోపించారు. కేంద్రం ఏపీ అభివృద్ధికి రూ. 6 లక్షల కోట్లు ఇస్తే ఆ నిధులన్నీ మింగేశారని.. రాజధానిలో ఇప్పటి వరకు ఒక్క శాశ్వత భవనం నిర్మించలేదని విమర్శించారు. ప్రత్యేక హోదాకు బదులుగా రూ. 17,500 కోట్ల ప్యాకేజిగా చంద్రబాబే విలువ కట్టారని.. కేంద్రం ఆరు లక్షల కోట్లు ఇచ్చిన తరువాత ప్రత్యేకహోదా డిమాండ్లో అర్ధం ఏముందని ప్రశ్నించారు. చంద్రబాబును కేంద్రం లక్ష్యంగా చేసుకోవాలనుకుంటే ఓటుకు నోటు కేసునే ఉపయోగించుకునేదని విలేకరులు అడిగిన ఒక ప్రశ్నకు బదులిచ్చారు. -
లోక్సభ ఎన్నికలకు అజిత్ జోగి దూరం!
సాక్షి, రాయ్పూర్: లోక్సభ ఎన్నికల్లో ఛత్తీస్గఢ్ నుంచి కింగ్ మేకర్గా భావిస్తున్న ఛత్తీస్గఢ్ జనతా కాంగ్రెస్ అధినేత, మాజీ సీఎం అజిత్ జోగి సంచలన నిర్ణయం తీసుకున్నారు. వచ్చే ఎంపీ ఎన్నికల్లో తమ పార్టీ పోటీ చేయబోదని.. ఆయా స్థానాలను బీఎస్పీకి వదిలేస్తున్నట్టు అజిత్ జోగి మీడియాకు తెలిపారు. సరైన వనరులు, సంసిద్ధత లేనందున తన పార్టీ ఈ లోక్సభ ఎన్నికల బరిలో పాల్గొనడం లేదని అజిత్ జోగి పేర్కొన్నారు. ‘నన్ను పోటీ చేయమని చాలా మంది చెప్తున్నారు. కానీ దీని గురించి నేను ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. నా పార్టీని బలమైన ప్రాంతీయ శక్తిగా మార్చడంపైనే పూర్తి దృష్టి కేంద్రీకరించాలని అనుకుంటున్నాను. బీఎస్పీ తరఫున రాబోయే ఎన్నికల్లో ప్రచారం చేసే విషయంపై కూడా ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేద’ని జోగి వివరించారు. 11 లోక్సభ స్థానాలున్న ఛత్తీస్గఢ్లో మూడు దశల్లో పోలింగ్ జరగనుంది. మొదటి దశ పోలింగ్ ఏప్రిల్ 8న, రెండో దశ ఏప్రిల్ 18న, మూడో విడత పోలింగ్ 23న జరుగనుంది. జోగి బరిలో లేని తొలి ఎన్నికలు అజిత్ జోగి 1986లో ఐపీఎస్గా ఉన్నప్పుడు అప్పటి ప్రధాని రాజీవ్ గాంధీ కోరిక మేరకు కాంగ్రెస్లో చేరారు. ఆయన చేరికతో ఛత్తీస్గఢ్ జనాభాలో 54 శాతంగా ఉన్న బీసీలకు కాంగ్రెస్ మరింత దగ్గరైంది. తుపాకీ ఒప్పందంలో అవినీతి జరిగిందంటూ వీపీ సింగ్ ప్రభుత్వంపై రాజ్యసభలో దుమారం రేగినప్పుడు అజిత్ జోగి ప్రతిపక్షాలను ఎదుర్కోవడంలో చాలా తెగువ చూపారు. అజిత్ రాజకీయ చరిత్ర చూస్తే ఆయన 2015లో కాంగ్రెస్ను వీడి సొంత పార్టీని స్థాపించారు. 2000లో ఛత్తీస్గఢ్ రాష్ట్రం ఏర్పడ్డాక జరిగిన అన్ని ఎన్నికల్లోనూ అజిత్ జోగి పోటీలో చేశారు. రాష్ట్ర ఏర్పాటు తర్వాత ఆయన బరిలో నిలవని తొలి ఎన్నికలుగా ఈ లోక్సభ ఎన్నికలను చెప్పొచ్చు. అజిత్ జోగి అనూహ్య నిర్ణయంతో ఛత్తీస్గఢ్లో ప్రధాన పోటీ బీజేపీ, కాంగ్రెస్.. ఆయన మద్దతిస్తున్న బీఎస్పీ మధ్య జరగనుంది. జోగి కుటుంబానికి లోక్సభ ఎన్నికలు పెద్దగా కలిసిరాలేదనే చెప్పొచ్చు. 2009లో అజిత్ జోగి భార్య రేణు జోగి బిలాస్పూర్ నుంచి కాంగ్రెస్ తరఫున పోటీచేసి, 2 లక్షల ఓట్ల తేడాతో ఓడిపోయారు. స్వయంగా ఆయన పోటీపడ్డ 2014 ఎన్నికల్లో కూడా సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి చందూ లాల్ సాహూ చేతిలో 1,217 ఓట్ల స్వల్ప తేడాతో పరాజయం పాలయ్యారు. 2018 ఛత్తీస్గఢ్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీజేపీ, కాంగ్రెస్లకు తాను ప్రత్యామ్నాయమని చెప్పుకున్న జోగి, మాయావతి ఆధ్వర్యంలోని బీఎస్పీతో పొత్తుపెట్టుకున్నారు. ఆ ఎన్నికల్లో బీఎస్పీ-సీజేసీ కూటమి 15 సీట్లు గెలుస్తుందని ఆయన అంచనా వేశారు. కానీ ఆ అంచనా తప్పి కూటమి 5 సీట్లకే పరిమితమవగా, ప్రత్యర్థి కాంగ్రెస్ మూడింట రెండు వంతుల మెజార్టీతో మొత్తం 90 సీట్లలో 68 చోట్ల గెలుపు ఢంకా మోగించింది. మరో ప్రధాన పార్టీ బీజేపీ 15 స్థానాలను గెలవగలిగింది. బీఎస్పీ-సీజేసీ కూటమి నెగ్గిన ఐదు స్థానాల్లో మార్వాయి నియోజకవర్గంలో అజిత్ జోగి విజయం సాధించగా, కోట నుంచి ఆయన భార్య రేణు జోగి గెలుపు రుచి చూశారు. ఆ ఎన్నికల్లో ప్రాంతీయవాదాన్ని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లడం, బీజేపీని బయటివాళ్ల పార్టీగా ప్రచారం చేయడంలో సక్సెస్ అయిన కాంగ్రెస్ ఘనవిజయాన్ని నమోదు చేసింది. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు మాయావతి-జోగి కూటమి దక్కించుకోవడంలో విఫలమైంది. ప్రజలు తన కన్నా భూపేశ్ భగేల్ను ఎక్కువగా నమ్మారని ఆ ఎన్నికల ఫలితాల తర్వాత జోగి విచారం వ్యక్తం చేశారు. రాయ్పూర్కు చెందిన ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు అశోక్ తోమర్ విశ్లేషణ ప్రకారం 2018 అసెంబ్లీ ఎన్నికలతో అజిత్ జోగి ప్రభ తగ్గింది. ఆయన సీఎంగా ఉన్న మూడు సంవత్సరాల కాలంలో పాలన గాడి తప్పడాన్ని ప్రజలింకా మరచిపోలేదు. కానీ రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే కాబట్టి జోగి మళ్లీ పుంజుకునే అవకాశాలను కొట్టిపారేయలేం. -
దళిత ఓట్లకు ప్రియాంక గాలం
లక్నో: లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో పొత్తుపెట్టుకోబోమని బహుజన్ సమాజ్ పార్టీ(బీఎస్పీ) అధినేత్రి మాయావతి ప్రకటించిన నేపథ్యంలో ఎస్పీ–బీఎస్పీ కూటమికి చెక్ పెట్టేందుకు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ చురుగ్గా పావులు కదుపుతున్నారు. ఇందులో భాగంగా ప్రియాంకా గాంధీ బుధవారం మీరట్లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న భీమ్ ఆర్మీ చీఫ్ చంద్రశేఖర్ ఆజాద్ను పరామర్శించారు. దీంతో బీఎస్పీకి పట్టుకొమ్మలుగా ఉన్న దళితుల ఓట్లను ఆకర్షించేందుకే ప్రియాంక ఆజాద్ను కలుసుకున్నారని రాజకీయవర్గాల్లో చర్చ మొదలైంది. ఈ భేటీ అనంతరం ప్రియాంక మీడియాతో మాట్లాడుతూ..‘ఆజాద్ ఓ లక్ష్యం కోసం పోరాడుతున్నారు. ఆయన పోరాటాన్ని నేను గౌరవిస్తున్నా. ఈ పరామర్శ వెనుక ఎలాంటి రాజకీయ ఉద్దేశాలు లేవు. ఆజాద్ తమ సమస్యలను వినాల్సిందిగా గొంతెత్తి అరుస్తున్నారు. కానీ కేంద్ర ప్రభుత్వం మాత్రం అహంకారంతో యువత గొంతు నొక్కేస్తోంది. ఈ ప్రభుత్వం ఉద్యోగాలను కల్పించడం లేదు. వాళ్లు యువత సమస్యలను వినాలనుకోవడం లేదు’ అని తెలిపారు. మరోవైపు ఈ విషయమై ఆజాద్ స్పందిస్తూ..‘ప్రియాంక ఆసుపత్రికి వచ్చినట్లు మీడియా ద్వారానే నాకు తెలిసింది. నా ఆరోగ్యం గురించి వాకబు చేసేందుకు ఆమె ఆసుపత్రికి వచ్చారు. మామధ్య రాజకీయాలకు సంబంధించి ఎలాంటి చర్చ జరగలేదు’ అని స్పష్టం చేశారు. ప్రతిపక్షాలన్నీ కలిస్తే బీజేపీని ఓడించవచ్చని అభిప్రాయపడ్డారు. కాగా, ఈ సందర్భంగా ‘ఆజాద్ కాంగ్రెస్ తరఫున పోటీ చేస్తారా?’ అన్న ప్రశ్నకు ప్రియాంక జవాబును దాటవేశారు. నిబంధనలకు విరుద్ధంగా భారీ సంఖ్యలో వాహనాలతో ర్యాలీ నిర్వహించడంతో ఆజాద్ను మంగళవారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన అస్వస్థతకు లోనుకావడంతో మీరట్లోని ఓ ఆసుపత్రిలో చేర్పించారు. యూపీలోని 80 లోక్సభ స్థానాలకు గానూ ఎస్పీ 37, బీఎస్పీ 38, ఆర్ఎల్డీ 3 స్థానాల్లో పోటీచేయాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. రాయ్బరేలి(సోనియాగాంధీ) అమేథీ(రాహుల్ గాంధీ) స్థానాల్లో మాత్రం పోటీచేయకూడదని నిర్ణయించాయి. ప్రియాంక పోటీలో లేనట్టే! సాక్షి ప్రతినిధి, న్యూఢిల్లీ: కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా ఇటీవల నియమితులైన ప్రియాంక గాంధీ ఈ లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయదని పార్టీ వర్గాలు చెప్పాయి. గుజరాత్లో బుధవారం ఆమె చేసిన తన తొలి ప్రసంగానికి మంచి మార్కులు పడ్డాయి. ఆ ప్రసంగం తర్వాత పార్టీ శ్రేణులు మరింత ఉత్సాహంగా, సంతోషంగా ఉన్నాయి. ఈ ఏడాది జవనరిలో ప్రియాంక క్రియాశీల రాజకీయాల్లోకి వచ్చాక ఆమె లోక్సభకు పోటీ చేస్తారని భారీ ఎత్తున వార్తలు వచ్చాయి. అయితే ప్రస్తుత ఎన్నికల్లో ప్రియాంక పోటీ చేయరనీ, ప్రచారానికి మాత్రమే వస్తారని కాంగ్రెస్ వర్గాలు అంటున్నాయి. ప్రియాంక ఇప్పటికే పలుమార్లు పార్టీ కార్యకర్తలతో సమావేశమయ్యారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఆర్మీ ఉద్యోగికి జైలుశిక్ష
హిందూ, ముస్లింలను వేరు చేస్తున్న బీజేపీ
మూగ జీవాలను రక్షించుకోవాలి..
‘గుమ్మనూరు’ను అనర్హుడిగా ప్రకటించాలి
Lok Sabha Election 2024: పేలేది మళ్లీ షాట్ గన్నే!
శ్రీకాంత్ కథలో నటించడం గౌరవంగా ఉంది: జ్యోతిక
సజావుగా పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్
స్ట్రాంగ్ రూమ్ల వద్ద పటిష్ట బందోబస్తు
హత్యలు టు నాటుసారా వయా పేకాట
ఎన్నికల విధులకు వెళ్తూ గుండెపోటుతో మృతి
తప్పక చదవండి
- ఓటమి భయంతో బరితెగిస్తున్న పచ్చమూకలు
- పారిస్ ఒలింపిక్స్కు భారత రిలే జట్లు అర్హత
- వింటున్నావా ఈసీ.. బాబు కారుకూతలు
- సెన్సెక్స్ ప్లస్, నిఫ్టీ మైనస్
- భారత్ సేవల రంగం నెమ్మది
- Lok Sabha Election 2024: మల్లికార్జున ఖర్గే ‘ఇంట’ గెలిచేనా..?’
- నీకే దిక్కు లేదు.. నా కూతురికి సీటు ఇస్తావా?
- అందరివాడు జగన్ను ఆశీర్వదించండి
- పేదల అక్షరంపై కక్ష
- సూర్య విధ్వంసకర సెంచరీ.. ఎస్ఆర్హెచ్పై ముంబై విజయం
Advertisement