breaking news
Broad daylight
-
తనను కాదని.. మనువాడిందని కత్తితో దాడి
అమీర్పేట: తనను కాదని వేరే వ్యక్తిని పెళ్లి చేసుకుందన్న కోపంతో మహిళపై కత్తితో దాడి చేశాడో వ్యక్తి. ఎస్ఆర్నగర్ పోలీస్స్టేషన్ పరిధిలోని ఎర్రగడ్డలో మంగళవారం ఈ ఘటన చోటుచేసుకుంది. ఇన్స్పెక్టర్ సైదులు చెప్పిన వివరాల ప్రకారం.. శ్రీకాకుళం జిల్లాకు చెందిన యువతి(35)కి ఇదే ప్రాంతానికి చెందిన వ్యక్తితో 2007లో వివాహమైంది. వీరు జీవనోపాధి కోసం నగరానికి వచ్చి ఎర్రగడ్డ బి.శంకర్లాల్నగర్లో ఉండేవారు. తొలి కాన్పులో ఆమెకు కుమారుడు, రెండోసారి కూతురు జన్మించారు. కూతురు పుట్టిందనే నెపంతో 2009లో ఆమెను భర్త వదిలేసి వెళ్లిపోయాడు. అప్పటి నుంచి శ్యామల కొడుకు, కూతురితో కలిసి నగరంలోనే ఉంటోంది. 2016లో సుల్తాన్నగర్లో ఉండే సైకిల్ మెకానిక్ సయ్యద్ ఖలీల్తో పరిచయం ఏర్పడింది. కొంతకాలం వీరు సహజీవనం చేశారు. ఈ నేపథ్యంలో 2017లో బి.శంకర్లాల్నగర్కు చెందిన చెఫ్ శ్రీశైల్ కోట్ను వివాహం చేసుకుంది. వీరికి ఓ కుమారుడు జన్మించాడు. ఈ విషయం ఖలీల్కు తెలియడంతో ఆమెపై ఖలీల్ కక్ష పెంచుకున్నాడు. ఆమెను ఎలాగైనా కడతేర్చాలనే నిర్ణయానికి వచ్చాడు. ఎర్రగడ్డ సంతలో మూడు కత్తులను కొనుగోలు చేసి గౌతంపురి కాలనీలో ఆమెపై కత్తితో దాడి చేశాడు. క్షతగాత్రురాలిని స్థానికులు గాంధీ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం బాధితురాలి ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. -
పట్టపగలు భారీ చోరీ
బొబ్బిలి: బొబ్బిలి పట్టణంలో దొంగలు మళ్లీ విరుచుకుపడ్డారు. రెండు వారాల క్రితం వరుసగా మూడు చోట్ల చోరీలు చేశారు. మళ్లీ గురువారం భారీ ఎత్తున నగదు, ఆభరణాలు అపహరించారు. పది రోజులుగా ఆ ఇంటికి తాళం వేసి ఉన్నా అటువైపు చూడని దొంగలు, ఇంట్లో భారీగా నగలు, డబ్బు ఉంచారన్న సంగతి తెలుసుకొని పట్టపగలు దోచుకున్నారు. నిత్యం రద్దీగా ఉండే ఫూల్బాగ్కాలనీలో ప్రధాన రహదారి పక్కన గురువారం మధ్యాహ్నం ఈ చోరీ జరిగింది. మండల విద్యాశాఖాధికారిగా పనిచేస్తున్న కేఎల్వీఆర్ ప్రసాద్ ఇంట్లో దొంగలు చొరబడి బంగారం, వెండి వస్తువులతో పాటు నగదును అపహరించుకుపోయారు. ఎంఈఓ ప్రసాద్ భార్య విజయ బొబ్బిలి ఇరిగేషన్ సర్కిల్ కార్యాలయంలోని భూసేకరణ విభాగంలో పనిచేస్తున్నారు. వీరి కుమార్తెకు గత నెల 24న వివాహం చేయడంతో అప్పటి వరకూ లాకర్లలో ఉండే నగలను బయటకు తీసుకువచ్చారు. వివాహం అనంతరం కూతురు, అల్లుడు, బంధువులతో కలిిసి పది రోజుల పాటు బెంగళూరులో ఉన్నారు. అక్కడ కొత్త దంపతుల నివాసానికి అవసరమైనవి ఏర్పాటు చేసి తిరిగి బుధవారం రాత్రి తొమ్మిదిన్నర గంటల ప్రాంతంలో ఇంటికి చేరుకున్నారు. బెంగళూరు నుంచి వచ్చినపుడు కుమార్తెకు చేయించిన 25 తులాల హారం, నక్లెస్, నాలుగు గాజులు, ఉంగరాలు వంటివి బొబ్బిలిలోని లాకర్లలో పెట్టడానికి తిరిగి తీసుకొచ్చేశారు. విజయ తనదగ్గరున్న పది తులాల నల్లపూసలు, గొలుసు, ఉంగరాలతో పాటు కుమార్తెకు చెందిన 25 తులాలను లాకర్లలో పెట్టాలనుకున్నారు. అయితే గత పది రోజులుగా సెలవులో ఉండడంతో గురువారం కార్యాలయానికి వెళ్లి, శుక్రవారం బ్యాంకు లాకర్లలో పెట్టాలని నిర్ణయించుకొని వాటిని ఇంట్లో బీరువాల్లో భద్రపరిచారు. ఈ విషయం గమనించిన దొంగలు చాకచక్యంగా తలుపు తాళం తొలగించి లోపలకు వెళ్లారు. ఒక బెడ్రూంలోని బీరువాను పూర్తిగా తీసేసి విలువైన వస్తువులను తీసుకెళ్లారు. రెండో బెడ్రూంలో అసలు బీరువా ఉంది. గతంలో మరుగుదొడ్లు ఉన్నస్థానంలో అక్కడ బీరువా ఉందన్న సంగతి ఎవరికి తెలియని విధంగా దానిని అమర్చారు. అయితే దానిని కూడా గుర్తించి బయటకు తీసుకువచ్చి మరీ పగలగొట్టారు. బంగారంతో పాటు బీరువాల్లో ఉన్న 200 తులాల వెండి వస్తువులు పట్టుకెళ్లిపోయారు. ఇక పెళ్లి కోసం చేసిన అప్పు తీర్చేందుకు డ్రెస్సింగ్ టేబుల్లో పెట్టిన లక్షా 75 వేల రూపాయలను కూడా అపహరించారు. ఇరిగేషన్ కార్యాలయం నుంచి సాయంత్రం ఇంటికి చేరుకున్న విజయ తలుపులు తీసి ఉండడం చూసి గాబరాపడుతూ లోపలకు వెళ్లగా మొత్తం బీరువాలు తెరిచి ఉండడం, వస్తువులన్నీ చిందర వందరగా పడి ఉండడంతో బోరున విలపిస్తూ భర్త ప్రసాద్కు సమాచారం అందించారు. ఎస్ఐ నాయుడు వచ్చి పరిశీలించారు. అనంతరం పోలీసులు పట్టణమంతా అప్రమత్తం చేశారు.