breaking news
Bonglur Outer Ring Road
-
సర్టిఫికెట్లకని వెళ్లి కానరానిలోకాలకు!
ఇబ్రహీంపట్నంరూరల్: ఇద్దరు భాబి ఇంజనీర్ల రోడ్డుప్రమాదంలో మృతిచెందారు. బీటెక్ పూర్తి చేసుకొని సర్టిఫికెట్లు తెచ్చుకోవడానికి వెళ్లి.. కానరాని లోకాలకు పోయారు. టిప్పర్ రూపంలో వచ్చిన మృత్యువు వారిని బలితీసుకుంది. రంగారెడ్డి జిల్లా ఆదిబట్ల పోలీస్స్టేషన్ పరిధిలో సోమవారం జరిగిన ఈ ప్రమాదం వివరాలు ఇలా ఉన్నాయి.. సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండలం మాలిపురం గ్రామానికి చెందిన శీల రామచందర్, ఎల్లమ్మ దంపతుల కుమారుడు మహేష్(22), రంగారెడ్డి జిల్లా బడంగ్పేట్ నగర పంచాయతీకి చెందిన గూడురూ రాంబాబు కుమారుడు లోకేష్ దుర్గా ప్రసాద్(22)లు ఇబ్రహీంపట్నం మండలం మంగళ్పల్లి సమీపంలోని భారత్ ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ (ఈఈఈ) పూర్తి చేశారు. శీల మహేష్, దుర్గాప్రసాద్ ఇద్దరు కలిసి సోమవారం సర్టిపికెట్లు తెచ్చుకోవడానికి కళాశాలకు వెళ్లారు. తిరుగు ప్రయాణంలో ఆదిబట్ల టీసీఎస్ రోడ్డు వైపు వస్తుండగా.. బొంగ్లూర్ ఔటర్ రింగ్ రోడ్డు నుంచి ఆదిబట్ల గ్రామం వైపు వెళ్తున్న టిప్పర్ వీరి బైక్ను ఢీకొట్టింది. దీంతో వీరు టిప్పర్ వెనక చక్రాల కింద పడిపోయారు. మహేష్, లోకేష్కుమార్లపై నుంచి టిప్పర్ వెళ్లడంతో అక్కడికక్కడే మృతిచెందారు. మృతదేహాలు చెల్లా చెదురుగా పడి ఉన్నాయి. విషయం తెలుసుకున్న ఆదిబట్ల పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాలను ఇబ్రహీంపట్నం మార్చురీకి తరలించారు. మహేష్ బ్యాగులో భారత్ ఇంజనీరింగ్ కళాశాల ఐడీ కార్డు లభించడంతో వీరు భారత్ ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులుగా గుర్తించారు. కళాశాలకు చెందిన రిజిస్ట్రార్, ఈఈఈ హెచ్ఓడీలు వచ్చి మార్చురీ వద్ద మృతదేహాలను పరిశీలించగా భారత్ కళాశాల పూర్వ విద్యార్థులగా నిర్ధారించారు. సర్టిఫికెట్ల కోసం వచ్చినట్లు తెలియజేశారు. ప్రస్తుతం వీరిద్దరు నగరంలోని దిల్సుఖ్నగర్లో విశ్వ కోచింగ్ సెంటర్లో గేట్ కోచింగ్ తీసుకున్నట్లు వారి వద్ద ఉన్న ఐడీ కార్డుల ఆధారంగా తెలిసింది. మహేష్ తండ్రి చిన్నప్పుడే మరణించడంతో తల్లి కష్టపడి చదివించినట్లు తెలిసింది. ప్రస్తుతం మృతుడు మహేష్ సోదరుడు కూడా భారత్ కళాశాలలోనే ఇంజనీరింగ్ మొదటి సంవత్సరం చదువుతున్నట్లు తెలిసింది. మృతదేహాలను ఇబ్రహీంపట్నం ఆస్పత్రి మార్చురీలో భద్రపరిచారు. టిప్పర్ డ్రైవర్ పోలీసుల అదుపులో ఉన్నట్లు తెలిసింది. ఘటనా స్థలాన్ని ఆదిబట్ల సీఐ గోవింద్రెడ్డి, ఎస్ఐ మోహన్రెడ్డి పరిశీలించారు. -
రూ.కోట్లు కొట్టుకుపోతున్నాయ్!
సాక్షి, రంగారెడ్డి జిల్లా : నాగార్జున సాగర్ రహదారి విస్తరణ పనుల్లో నాణ్యత గాల్లోదీపంగా మారింది. పదికాలాలపాటు మన్నికగా ఉండాల్సిన రహదారి నిర్మాణం.. చిన్న వానకే చెదిరిపోతోంది. బొంగ్లూర్ ఔటర్ రింగురోడ్డు నుంచి ఇబ్రహీంపట్నం వరకున్న నాగార్జునసాగర్ రహదారిని నాలుగు లైన్ల రోడ్డుగా నిర్మించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. రూ.29 కోట్లతో తలపెట్టిన ఈ ప్రాజెక్టు 7.6 కిలోమీటర్ల మేర నిర్మించాల్సి ఉంది. ఇందుకు సంబంధించి గతేడాది మార్చిలో పనులు మొదలయ్యాయి. ఇందులో కీలకమైన ఇబ్రహీంపట్నం చెరువుకట్ట, మంగల్పల్లి వంతెన పనులు ప్రస్తుతం సాగుతున్నాయి. అయితే ఈ పనుల్లో నాణ్యత మాయమవ్వడంతో భారీగా నిధులు వెచ్చించి చేపడుతున్న పనులు అస్తవ్యస్తమవుతున్నాయి. చెదిరి ‘చెరువు’లోకి.. ఇబ్రహీంపట్నం పెద్ద చెరువు కట్టను నాలుగు లైన్లుగా మార్చేందుకు కొంత భాగాన్ని కట్టకు సమానంగా చేస్తూ.. మరికొంత భాగం కట్ట కింద రోడ్డు వేస్తున్నారు. అయితే కట్టకు సమానంగా చేసే క్రమంలో దాదాపు 40 అడుగుల ఎత్తులో మట్టి వేసి చదును చేస్తున్నారు. ఈ ప్రక్రియ దాదాపు కొలిక్కి వచ్చింది. అయితే గతవారం చివర్లో కురిసిన వర్షానికి ఈ మట్టి కాస్త కిందికి కొట్టుకుపోతోంది. వాస్తవానికి అంత ఎత్తులో కేవలం మట్టితోనే రోడ్డు నిర్మిస్తే ఎక్కువ కాలం మన్నదని విశ్లేషకులు చెబుతున్నారు. సాధారణంగా రోడ్డు ఎత్తు పెంచే క్రమంలో ఇక్కడ కొంత భాగం మట్టితో.. ఆ తర్వాత మెటల్తో నింపి మరికొంత భాగాన్ని మట్టి వేసి నిర్మిస్తారు. కానీ ఇక్కడ మొత్తం మట్టినే నింపుతూ పనులు పూర్తిచేస్తున్నారు. దీంతో గత వారం ఒక్కసారిగా కురిసిన వానకు మట్టంతా చెదిరి చెరువులోకి చేరింది. ప్రస్తుతం నీరులే కపోవడంతో పనులు బాగానే కనిపిస్తున్నప్పటికీ.. చెరువులోకి నీరు చేరితే.. అలల తాకిడికి మట్టి కొట్టుకొచ్చే అవకాశం ఎక్కువ. ఇదిలాఉంటే రోడ్డు విస్తరణ పనుల్లో లోపాలు లేకుండా పక్కాగా నిర్మాణం పూర్తి చేస్తామని రహదారులు, భవనాల శాఖ సహాయ ఇంజినీరు వేణుగోపాల్రెడ్డి చెప్పారు.