breaking news
B Nagi Reddy
-
'పాతాళభైరవి, మాయాబజార్ లాంటి ఆణిముత్యాలు అందించిన ఘనత ఆయనదే'
భారతీయ చలన చిత్రసీమలో బొమ్మిరెడ్డి నాగిరెడ్డి (బి. నాగిరెడ్డి)ది చెరిగిపోని చరిత్ర. ‘పాతాళభైరవి, మిస్సమ్మ, మాయాబజార్’ వంటి అద్భుత చిత్రాలను నిర్మించిన ఘనత నాగిరెడ్డిది. కళాసేవే కాదు ఆయన ఎందరికో విద్య, వైద్య సేవలు ఉచితంగా అందించారు. సాధారణ రైతు కుటుంబంలో పుట్టి, వ్యాపారవేత్తగా రాణించి, ప్రముఖ నిర్మాతగా, స్టూడియో ఆధిపతిగా అసాధారణ సేవలు అందించిన మానవతావాది. ‘చందమామ’ పత్రికను అసంఖ్యాక భాషల్లో ముద్రించి అటు బాలలకు ఇటు పెద్దలకు కూడా నీతి బోధలు చేసిన ముందు చూపుగల మహా మనిషి. వినోద విజ్ఞానాల కృషీవలుడు, విజయాదిత్యుడు,చందమామ పత్రిక, అద్భుత దృశ్యకావ్యం, మాయాబజార్ల సృష్టికర్త బి.నాగిరెడ్డి వర్థంతి(ఫిబ్రవరి 25) సందర్భంగా ఒకసారి గుర్తుకు తెచ్చుకుందాం. ► నాగిరెడ్డి కడప జిల్లా పులివెందుల నియోజకవర్గం, సింహాద్రిపురం మండలం, ఎద్దులయ్యగారి కొత్తపల్లె (వై.కొత్తపల్లె) గ్రామంలో 1912, డిసెంబర్ 2న రైతు కుటుంబంలో బొమ్మిరెడ్డి నరసింహారెడ్డి, ఎరుకలమ్మ అనే దంపతులకు జన్మించారు. నాగిరెడ్డికి ప్రముఖ దర్శకుడు, పద్మభూషణ్ బీఎన్ రెడ్డి స్వయానా అన్న. ► ఎద్దులయ్యగారి కొత్తపల్లె గ్రామంలోని వీధిబడిలో రామాయణ మహాభారతాలు, భాగవతం లాంటి పురాణగ్రంథాలను మాత్రమే బోధించేవారు. ధర్మబద్ధమైన జీవితం ఎలా గడపాలో ఉపాధ్యాయుడు పిల్లలకు రోజూ చెప్పేవాడు. ప్రాచీన గ్రంథాల్లోని సూక్తులను, సుభాషితాలను పిల్లలచేత కంఠస్థం చేయించేవాడు. ఆ ఉపాధ్యాయుడి వద్ద చదువుకున్న నాగిరెడ్డి పన్నేండేళ్లు వచ్చేసరికే పురాణేతిహాసాలను ఔపోసన పట్టేశారు. అవన్నీ ఆయన ఆలోచనావిధానాన్ని ఎంతగానో ప్రభావితం చేశాయి. ►నిజంగానే తెలుగువారికి తమ సినిమాలతో పున్నమి చంద్రుని వెన్నెల చల్లదనం అందించిన ఘనులు నాగిరెడ్డి- చక్రపాణి. వారిద్దరు వ్యక్తులైనా ఏకప్రాణంగా సాగారు. వారి సినిమాలు కూడా తెలుగువారితో విడదీయరాని బంధం ఉంది. తొలి చిత్రం 'షావుకారు' నుంచి చివరి చిత్రం 'శ్రీరాజేశ్వరి విలాస్ కాఫీక్లబ్' దాకా విలువలకు పెద్ద పీట వేస్తూ సాగారు నాగిరెడ్డి- చక్రపాణి. చక్కన్నది ఆలోచనయితే, నాగిరెడ్డిది ఆచరణగా ఉండేది.. అందుకే విజయావారి చిత్రాల్లో వారిద్దరి అభిరుచి తొణికిసలాడేది. ► 1947లో భారతీయ పత్రికా ప్రపంచంలోనే సంచలనం సృష్టించిన పిల్లల మాసపత్రిక చందమామ ప్రారంభించారు. చందమామను చదవని తెలుగువారుండరు. తెలుగులోనే కాకుండా భారతదేశంలో మరో 12 భాషలకు చందమామ విస్తరించింది. నాగిరెడ్డి గారిని చందమామ రెడ్డి అని పిలిచేవారు. మహిళల కోసం ‘వనిత’ మాసపత్రికను, సినిమాల కోసం ‘విజయచిత్ర’ పత్రికను నడిపారు. ఆసియాలోనే అతి పెద్ద స్టూడియో: 1949-50 ప్రాంతంలో మద్రాసులోని వాహినీ స్డూడియోను కొని విజయా-వాహినీ స్టూడియోగా పేరు మార్చి అత్యంత సుందరంగా తీర్చిదిద్దారు. ఆసియాలోనే అతి పెద్ద స్టూడియో 1970 ప్రాంతంలో స్టూడియోను మూసివేసి విజయా మెడికల్ అండ్ ఎడ్యుకేషన్ ట్రస్టు ఏర్పాటు చేసి తద్వారా విజయా ఆసుపత్రి, విజయా హెల్త్కేర్ సెంటర్, విజయా హెల్త్ ఫౌండేషన్ ఏర్పాటు చేశారు. 1950లో విజయా ప్రొడక్షన్స్ పేరుతో చిత్ర నిర్మాణ సంస్థను ప్రారంభించారు. అర్జునుడి రథం మీద రెపరెపలాడే పతాకమే విజయా సంస్థ చిహ్నం. నాగిరెడ్డి పెద్దకూతురి పేరు జయలక్ష్మి. తనంటే ఇంట్లో అందరికీ ప్రాణం.తను పుట్టాకే ఇంట్లో బావిలో తియ్యటి నీళ్లు పడ్డాయి. అప్పటినుంచీ జయ అంటే ఓ సెంటిమెంటు. ఆమె పేరు కలిసొచ్చేలా ‘విజయా ప్రొడక్షన్స్’ అని పెట్టారు. ఈ సంస్థ ద్వారా తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో దాదాపు 50 సినిమాలు నిర్మించారు. వీరి తొలిచిత్రం ‘షావుకారు’ తెలుగు సినీ చరిత్రలో ఆణిముత్యాల్లాంటి చలనచిత్రాలను నిర్మించారు. పాతాళభైరవి, మాయాబజార్, మిస్సమ్మ, జగదేకవీరుని కథ, గుండమ్మ కథ లాంటి బాక్సాఫీస్ హిట్ చిత్రాలను నిర్మించారు. ఎన్టీఆర్ను, ఎస్వీ రంగారావును, సూర్యకాంతాన్ని, సావిత్రిని, ఓ పద్మనాభాన్ని తెలుగు సినీ రంగానికి అందించింది నాగిరెడ్డి. 1951లో నిర్మించిన పాతాళభైరవి సినిమా జానపద చిత్రాలకు ఓ నిఘంటువు. ‘సాహసం చేయరా డింభకా’ అంటూ నటనలో, నడకలో, వాచకంలో ఎస్వీ రంగారావు కొత్త ఒరవడిని సృష్టించారు. ‘మోసం గురూ’ అంటూ డింగరీ పాత్రలో పద్మనాభం కనిపిస్తాడు. తెలుగుజాతి మరచిపోలేని ‘మాయాబజార్’ 1957లో నిర్మించబడిన మాయాబజార్ సినిమా తెలుగుజాతి మరచిపోలేని మధురమైన అద్భుత దృశ్యకావ్యం. సినిమా పరిశ్రమకు పెద్ద బాలశిక్ష. మాయాబజార్' స్థాయికి - సాంకేతిక నైపుణ్యంలో గానీ, నటనలోగానీ - ఏదీ సరితూగలేదన్నది జగద్విదితం. అందుకు ప్రధాన కారకులు - దర్శకులు కేవీ రెడ్డి, రచయిత పింగళి నాగేంద్రరావు. 'మాయాబజార్' విడుదలై ఇప్పటికీ 60 సంవత్సరాలు దాటుతున్నా అంతే ఆదరణ పొందుతున్న చిత్రం ఇదే. పలు పదవులు చేపట్టిన నాగిరెడ్డి 1980 నుంచి 1983 వరకు తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్గా ఉన్నారు. వీరి హయాంలోనే తిరుమలలో వైకుంఠం క్యూ కాంప్లెక్స్ నిర్మించబడింది. ఆలిండియా ఫిల్మ్ సమ్మేళన్కు రెండు సార్లు అధ్యక్షులు. సౌత్ ఇండియన్ ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్కు నాలుగు సార్లు అధ్యక్షులు. సాధించిన అవార్డులు: 1987లో నాగిరెడ్డి ప్రతిష్టాత్మకమైన దాదా సాహెబ్ ఫాల్కే అవార్డును పొందారు. హిందీ చలనచిత్ర సీమలో, అక్కాచెల్లెళ్లు అయిన లతా మంగేష్కర్, ఆశాబౌంస్లే ఈ అవార్డును పొందగా.. తెలుగు సినిమా రంగంలో అన్నదమ్ములైన బీఎన్ రెడ్డి, బి నాగిరెడ్డి ఈ అవార్డును పొందడం గమనార్హం. 1957లో మాయాబజార్, 1962లో గుండమ్మ కథకు ఫిల్మ్ ఫేర్ అవార్డులు పొందారు. 1987లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రఘుపతి వెంకయ్య అవార్డు ప్రదానం చేసింది. శ్రీకృష్ణదేవరాయ, శ్రీవెంకటేశ్వర విశ్వవిద్యాలయాలు గౌరవ డాక్టరేట్లు ప్రదానం చేశాయి. తమిళనాడులో ‘తలైమామణి’ బిరుదుతో సత్కరించారు. 1965లో కన్నడలో తీసిన ‘మదువెమదినోడు’ సినిమాకు జాతీయ ఫీచర్ ఫిల్మ్ అవార్డు వచ్చింది. పలు భాషల్లో చిత్రాలు: విజయా సంస్థ తమిళంలో పాతాళభైరవి, కళ్యాణం పన్ని పార్ (పెళ్లి చేసి చూడు), చంద్రహారం, మిస్సియమ్మ (మిస్సమ్మ), మాయాబజార్, గుండమ్మ కథ, ఎంగవీట్టు పిళ్లై (రాముడు-భీముడు), హిందీలో పాతాళభైరవి, మిస్ మేరీ (మిస్సమ్మ), రాం ఔర్ శ్యాం (రాముడు-భీముడు), జూలీ; కన్నడ, సింహళీ భాషల్లో కూడా కొన్ని సినిమాలు తీశారు. నాగిరెడ్డి తమిళంలో గుండమ్మ కథ, ఎంగ వీట్టు పిళ్లై సినిమాలకు దర్శకత్వం వహించాడు. ఎంజీఆర్తో ప్రత్యేక అనుబంధం: ఎంజీరామచంద్రన్తో నాగిరెడ్డికి ఉన్న ప్రత్యేక అనుబంధం గొప్పది. ఒకసారి నాగిరెడ్డికి జబ్బుచేసి ఆసుపత్రిలో వుంటే ఎంజీఆర్ (అప్పుడు ముఖ్యమంత్రిగా వున్నారు) స్వయంగా వచ్చి పరామర్శించడమే కాకుండా ఫారిన్ మందులు తెప్పిస్తానని చెప్పారు. ఎంజీఆర్ సూచన మేరకే నాగిరెడ్డి విజయా ఆసుపత్రి నిర్మించి దాని పరిపాలనా బాధ్యతల కోసం ఒక ట్రస్టు స్థాపించి దానికి అప్పగించారు. ఫిలిం ఫెడరేషన్ అధ్యక్షునిగా నాగిరెడ్డి నాలుగు సార్లు బాధ్యతలను నిర్వహించారు. ఇందిరా గాంధీ, లాల్ బహదూర్ శాస్త్రి, మొరార్జీ దేశాయి, రాజాజీ, కామరాజ నాడార్, నీలం సంజీవరెడ్డి మొదలైన ప్రజానాయకులతో సన్నిహిత సంబంధాలను నెరిపారు. నాగిరెడ్డి అనారోగ్యంతో తన 92వ ఏట 25 ఫిబ్రవరి 2004న మద్రాసులో మరణించారు. -
జనవరి 2లోగా ఏర్పాట్లు పూర్తి చేయండి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల నిర్వహణకు జనవరి 2వ తేదీలోగా అన్ని ఏర్పాట్లు పూర్తికానున్నాయి. ఆ తర్వాత ఎప్పుడైనా పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ జారీ కానుంది. రెండు లేదా మూడు విడతల్లో ఎన్నికలు నిర్వహించే అంశంపై రాష్ట్ర ఎన్నికల సంఘం(ఎస్ఈసీ) పరిశీలిస్తోంది. హైకోర్టు విధించిన గడువు జనవరి 10లోపే ఎన్నికలు నిర్వహించేందుకు శరవేగంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. మంగళవారం జిల్లా కలెక్టర్లు, జిల్లా పంచాయతీ అధికారుల(డీపీవో)తో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ బి.నాగిరెడ్డి, కార్యదర్శి అశోక్కుమార్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి ఏర్పాట్లను సమీక్షించారు. పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను జనవరి 2లోగా పూర్తి చేయాలని అధికారులను నాగిరెడ్డి ఆదేశించారు. ఇటీవల ముగిసిన శాసనసభ ఎన్నికల నేపథ్యంలో స్థానచలనం పొందిన పంచాయతీ ఎన్నికల రిటర్నింగ్ అధికారులు, సిబ్బందిని తిరిగి పాత స్థానాలకు బదిలీ చేయాలని ఆదేశించారు. ఈ నెల 20లోగా రిటర్నింగ్ అధికారులు, 27లోగా పోలింగ్ సిబ్బందికి శిక్షణ కార్యక్రమాన్ని పూర్తి చేయాలని పేర్కొన్నారు. శాసనసభ ఎన్నికల సందర్భంగా నియోజకవర్గాల వారీగా ప్రచురించిన జాబితాలోని కొత్త ఓటర్లకు సైతం పంచాయతీ ఎన్నికల్లో ఓటు హక్కు కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇందుకు కేంద్ర ఎన్నికల సంఘం ప్రచురించిన అసెంబ్లీ నియోజకవర్గాల కొత్త ఓటర్ల జాబితాను గ్రామ పంచాయతీలు, వార్డుల వారీగా విభజించి పంచాయతీ ఎన్నికలకు వినియోగించాలని కోరారు. కొత్త ఓటర్ల జాబితా రూపకల్పన నేపథ్యంలో పెరగనున్న ఓటర్ల సంఖ్యకు అనుగుణంగా అదనపు బ్యాలెట్ పేపర్లను ముద్రించాలని కోరారు. ఏదేమైనా వచ్చే నెల 2 నాటికి ఎన్నికల నిర్వహణకు సిద్ధంగా ఉండాలని అన్నారు. -
సినిమా సాహెబ్లు
భారతీయ చలన చిత్రసీమలో బొమ్మిరెడ్డి నాగిరెడ్డి (బి. నాగిరెడ్డి), అక్కినేని లక్ష్మీ వరప్రసాద రావు (ఎల్వీ ప్రసాద్)లది చెరిగిపోని చరిత్ర. ‘పాతాళభైరవి, మిస్సమ్మ, మాయాబజార్’ వంటి అద్భుత చిత్రాలను నిర్మించిన ఘనత నాగిరెడ్డిది. చక్రపాణితో కలసి నాగిరెడ్డి తీసిన ‘షావుకారు, మిస్సమ్మ, అప్పు చేసి పప్పు కూడు’ వంటి పలు చిత్రాలతో పాటు ఇతర బేనర్లలో పలు విజయవంతమైన చిత్రాలు తెరకెక్కించిన ఘనత ఎల్వీ ప్రసాద్ది. ‘రామ్ ఔర్ శ్యామ్, ప్రేమ్నగర్, స్వర్గ్ నరక్’ వంటి పలు హిందీ చిత్రాలకు బి. నాగిరెడ్డి సమర్పకుడు. ‘శారద, షాదీ కే బాద్, బిదాయి’ వంటి పలు హిందీ చిత్రాలకు దర్శకత్వం వహించడంతో పాటు ‘ససురాల్, ఏక్ దూజే కేలియే’ వంటి చిత్రాలను నిర్మించారు ఎల్వీ ప్రసాద్. సమాజానికి ఉపయోగపడే చిత్రాలు అందించిన ఇద్దరూ వైద్య రంగంలోనూ సక్సెస్ఫుల్. నాగిరెడ్డి ‘విజయా హాస్పిటల్స్’ ద్వారా మెరుగైన వైద్యం అందేలా చేస్తే, ‘ఎల్వీ ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్’ ద్వారా నాణ్యమైన వైద్యం అందించడానికి కృషి చేశారు ఎల్వీ ప్రసాద్. తొలి ఇండియన్ టాకీ ‘ఆలమ్ ఆరా’, తొలి తెలుగు టాకీ ‘భక్త ప్రహ్లాద’ తదితర చిత్రాల్లో నటుడిగానూ చేశారు ఎల్వీ ప్రసాద్. చెప్పుకుంటూ పోతే ఇద్దరి గురించి చాలా ఉంది. రెండు కుటుంబాల మధ్య మంచి అనుబంధం ఉంది. ప్రస్తుత తరానికి ఇద్దరి జీవితం ఆదర్శం. నేడు ‘ఫాదర్స్ డే’ సందర్భంగా బి. నాగిరెడ్డి కుమారుడు విశ్వనాథరెడ్డి, ఎల్వీ ప్రసాద్ కుమారుడు రమేశ్ ప్రసాద్ పలు విశేషాలు పంచుకున్నారు. ఆ లక్షణాలు నాన్నగారి ఎదుగుదలకు కారణం – రమేశ్ ప్రసాద్ (తండ్రి ఎల్వీ ప్రసాద్, తనయుడు సాయిప్రసాద్తో రమేశ్ ప్రసాద్ ) మా నాన్నగారు గొప్ప పేరు, ప్రఖ్యాతులు సంపాదించడానికి కారణం నాలుగు విషయాలు. ప్యాషన్ (అభిరుచి), పేషెన్స్ (సహనం), పెర్సివరెన్స్ (పట్టుదల), ప్యూరిటీ ఇన్ థాట్స్ (ఆలోచనల్లో నిజాయితీ). జీవితంలో ఈ నాలుగూ పాటించారాయన. నాన్నగారి లక్షణాలు మాకూ వచ్చాయి. ఆయన వెరీ సింపుల్ మేన్. విలువలకు ప్రాధాన్యం ఇచ్చిన వ్యక్తి. ఆయనెప్పుడూ స్కూల్కి వెళ్లలేదు. నాన్నగారు పుట్టింది ఏలూరులోని సోమవరప్పాడులో. పెదవేగి వెళ్లి డ్రామాలు వేస్తుండేవారు. యాక్టింగ్ అంటే ఆయనకు ఇష్టం. మా తాతగారు పెద్ద భూస్వామి. సుమారు 100 ఎకరాల భూమి కలిగిన వ్యక్తి. ఆయనకెంతో పలుకుబడి ఉండేది. అప్పట్లో సిల్క్ వ్యాపారం చేద్దాం అనుకున్నారు. ఆంధ్రా వాతావరణం సిల్క్ వ్యాపారానికి అంతగా సహకరించలేదు. విపరీతమైన లాస్ వచ్చింది. దాంట్లో నుంచి బయటపడటానికి వేరు శెనగ వేశారు. అప్పట్లో ఎవరైనా ఏదైనా పంట వేస్తున్నారంటే అందరూ అదే వేసేసేవాళ్లు. దాంతో శెనగ రేట్ పడిపోయింది. బస్తా 25పైసలు కూడా పలకలేదు. అప్పులు తిరిగి కట్టలేని పరిస్థితి. అది నాన్నగారికి అవమానంగా అని పించింది. మెంటల్గా డిస్ట్రబ్ అయ్యారు. దాంతో ఎవ్వరికీ చెప్పకుండా డిసెంబర్ 31 రాత్రి ఇల్లు వదిలి వెళ్లిపోయారు. అప్పులు తిరిగి కట్టలేకపోయామనే అవమానంతో నాన్నగారు ఆత్మహత్య చేసుకుని ఉంటారని అందరూ అనుకున్నారట. అప్పటికే నాన్నగారికి పెళ్లయింది. ఒక పాప కూడా. నేనింకా పుట్టలేదు. 16 నెలల తర్వాత ‘నేను క్షేమం. సినిమా కోసం బొంబాయి వచ్చాను. తిరిగొచ్చి మిమ్మల్ని తీసుకెళ్తాను’ అని అమ్మకు ఉత్తరం రాశారట. టైలర్ షాప్ క్లీనర్గా... బొంబాయిలో నడియాడ్వాలా స్టూడియోస్, ఇంకా వేరే స్టూడియోస్ బయట తిరిగేవారట. సెక్యూరిటీ వాళ్లు ఆయన్ను లోపలికి పోనివ్వలేదు. అయితే బయట ఉన్న జింక్ షీట్స్ దగ్గర నిలబడి, లోపల జరిగేదంతా గమనించేవారు. ఉదయం నుంచి రాత్రి వరకూ అలా చూస్తూ, రాత్రి అక్కడే ఫుట్పాత్ మీద నిద్రపోయేవారు. అక్కడి టైలర్షాప్ ఓనర్ నాన్నని గమనించి, ‘ఎందుకు రోజంతా ఇక్కడే ఉంటున్నావు’? అని అడిగారు. అతనితో మాట్లాడాలంటే నాన్నగారికి హిందీ, ఇంగ్లీష్ రావు. సైగలతోనే విషయం చెప్పారు. టైలర్షాప్ ఓనర్ జాలిపడి నాన్నగారిని తన షాప్లో పనికి కుదుర్చుకున్నారు. ఉదయం ఓనర్ వచ్చేసరికి ఆ షాప్ క్లీన్ చేసి, హుక్కా అరేంజ్ చేసిపెట్టాలి. ఉండటానికి చోటే లేని సమయంలో వచ్చిన అవకాశాన్ని వదులుకోలేదు. నాన్నలో ఉన్న గొప్ప లక్షణం అది. ‘డిగ్నిటీ ఆఫ్ లేబర్’ని నమ్ముతారు. ‘మా నాన్న 100 ఎకరాల భూస్వామి, నేను చీపురు పట్టుకోవడం ఏంటీ’ అనుకోలేదు. ఆ పనిని చాలా శ్రద్ధగా చేశారు. ఆ టైలర్ షాప్లో కొంతమంది యాక్టర్లు బట్టలు కుట్టించుకునేవారు. ఆ ఓనర్ ఒక ప్రొడ్యూసర్ దగ్గర ఆఫీస్ బాయ్గా నాన్నని చేర్పించారు. అక్కడి నుంచి నాన్నగారు సెల్ఫ్ టీచింగ్ (అన్నీ స్వయంగా నేర్చుకోవడం మొదలుపెట్టారు). అలా ఆఫీస్బాయ్ నుంచి అసిస్టెంట్ డైరెక్టర్గా, డైరెక్టర్గా ఎదిగారు. సరిగ్గా గాలి కూడా లేని ఇంట్లో... అన్నయ్య, నేను బొంబాయిలోనే పుట్టాం. అన్నయ్య పుట్టినప్పుడు ఉన్న ఇంట్లో గాలి, వెలుతురు సరిగ్గా ఉండేవి కావట. దాంతో బాగా ఏడ్చేవాడట. అప్పుడు నాన్నగారు అన్నయ్యని ఎత్తుకొని హ్యాంగింగ్ గార్డెన్స్కు తీసుకెళ్లి నిద్రపుచ్చేవారట. రాజ్కపూర్ (హిందీ నటుడు, దర్శక–నిర్మాత)గారి కుటుంబంతో, నాన్నగారికి మంచి అనుబంధం ఉండేది. వాళ్ల ఇంట్లో ఉన్న పాత ఊయల అన్నయ్య కోసం పంపారట. ఆ స్థాయిలో ఉన్నప్పుడు రాజ్కపూర్ కుటుంబంతో ఏర్పడిన పరిచయం నాన్నగారు గొప్ప స్థాయికి ఎదిగే వరకూ అలానే ఉంది. నాన్నని ఎంతగానో గౌరవించేవారు. ఇక్కడ తీసిన ‘ఇలవేల్పు’ సినిమాను ‘శారదా’ పేరుతో రాజ్ కపూర్, మీనాకుమారీలతో హిందీలో తీశారు. గేట్ కీపర్గా చేసిన థియేటర్లో శతదినోత్సవం బొంబాయిలో డ్రీమ్ల్యాండ్ థియేటర్కి కొన్ని రోజులు గేట్ కీపర్గా పని చేశారు నాన్నగారు. డైరెక్టర్గా ఆయన తీసిన ‘కిలోనా’ సినిమా వందరోజుల ఫంక్షన్ డ్రీమ్ల్యాండ్ థియేటర్లోనే జరిగింది. ఏ థియేటర్లో అయితే గేట్ కీపర్గా చేశారో ఆ థియేటర్లో దర్శకుడిగా ఆయన పేరు పడటం, ఆ సినిమా వంద రోజులాడటం.. అది చాలు ఆయన అచీవ్మెంట్కి. ఆయన కెరీర్ గ్రాఫ్ గమనిస్తే గేట్ కీపర్ టు దాదా సాహెబ్ ఫాల్కేగా ఎదిగారు. ఆ రోజు నాన్న చెంప ఛెళ్లుమనిపించారు నాన్నగారు రోజుకు 20గంటలు పనిచేసేవారు. మేం నిద్రలేచే సరికి షూటింగ్కు వెళ్లిపోయేవారు. మేం నిద్రపోయాక ఇంటికొచ్చేవారు. ఫ్యామిలీ కోసం టైమ్ కేటాయించలేని ఫీల్డ్ కాబట్టి నాకు సినిమాలవైపు ఇంట్రెస్ట్ కలగలేదు. అయితే ‘సంసారం’ సినిమాలో నాతో ఒక క్యారెక్టర్ చేయించాలని నాన్నగారు అనుకున్నారు. కానీ నాకు ఇష్టం లేదు. ఒకసారి ఆదివారం కూడా షూటింగ్ చేశారు. కరెక్ట్గా ఆ రోజు మ్యాచ్ ఉంది. నాన్నగారి దగ్గరికెళ్లి కాసేపటికోసారి ‘వెళ్లొచ్చా?’ అని అడిగాను. ‘కాంబినేషన్ సీన్స్ ఉన్నాయి. వెళ్లిపోతే నిర్మాతకు నష్టం వస్తుంది’ అని అన్నారు. ఇంకోసారి అడిగితే చెంప ఛెళ్లుమనిపించారు. ఆ తర్వాత నాన్నగారు యాక్ట్ చేయమని మా ఇంట్లో ఎవ్వర్నీ ఫోర్స్ చేయలేదు. ఇప్పటికీ ‘సంసారం’ చూస్తే ఎన్టీఆర్గారు, ఏయన్నార్గారు ఉన్న ఫ్రేమ్లో నేనొక్కడినే మిస్ఫిట్లాగా అనిపిస్తుంది. కెమెరా, మైక్ అంటే నాకు చాలా ఇబ్బంది. మాట మీద నిలబడ్డ వ్యక్తి గొప్ప దర్శకుడు అనే పేరుతో పాటు నాన్నగారు ‘మాట మీద నిలబడే మనిషి’ అనే పేరూ సంపాదించుకున్నారు. నాన్నగారు తమిళంలో దర్శకత్వం వహించిన పలు సినిమాలకు కరుణానిధి (తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి)గారు డైలాగ్స్ రాశారు. ఓ సినిమా విషయంలో ‘పదివేలు ఇస్తేనే రాస్తా’ అన్నారట. ‘సినిమా బాగా ఆడితే ఇస్తా’ అన్నారట. సినిమా సూపర్ హిట్ అయింది. అన్న ప్రకారం పది వేలు ఇచ్చారట ‘‘ప్రసాద్ గొప్ప వ్యక్తి. చెప్పిన మాట మీద నిలబడే కొద్దిమందిలో ప్రసాద్ ఒకరు’’ అని కరుణానిధిగారు అన్నారు. అలాగే ఇల్లు కట్టుకోవాలనుకున్నప్పుడు డబ్బులు అవసరం ఉండి నిర్మాత గోగినేనిని అడిగారు. కొన్ని రోజులకు ఆ డబ్బు ఇచ్చేశారు. ‘ఇండస్ట్రీలో తీసుకున్న డబ్బు తిరిగిచ్చింది నువ్వే’ అన్నారట గోగినేనిగారు. అందుకే ‘ఎల్వీ ప్రసాద్ ఐ’ హాస్పిటల్ ప్రేక్షకులు తన సినిమాలు ‘చూడడం’ వల్లే గొప్ప స్థాయికి ఎదిగానని నాన్నగారు అనేవారు. మరి.. చూపు లేనివాళ్ల పరిస్థితి ఏంటి? అనుకున్నారు. ఆ ఆలోచన వచ్చాక ‘ఎల్వీ ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్’ ఏర్పాటు చేశారు. ఇలాంటి ట్రస్ట్ నడపాలంటే ఎవరు కరెక్ట్ అనుకుంటున్న సమయంలో నా ఫ్రెండ్, డాక్టర్ గుళ్లపల్లి నాగేశ్వరరావు గుర్తొచ్చారు. అమెరికాలో బాగా సంపాదించి, స్వదేశం కోసం ఏదోటి చేయాలనే ఆలోచనలో ఉన్నారు. ‘ఐ’ ఇన్స్టిట్యూట్ కోసం కోటి రూపాయలతో ట్రస్ట్ స్టార్ట్ చేశాం. హాస్పిటల్ నిర్వహణ కోసం నాగేశ్వరరావుగారు అమెరికా నుంచి ఇక్కడికి వచ్చేశారు. ‘వైట్ కార్డ్’ ఉన్నవారికి ఇక్కడ ఉచితంగా చికిత్స చేస్తాం. మా అమ్మగారు గ్రేట్ లేడీ పుట్టినప్పటి నుంచి నేనైతే కష్టాలు ఎప్పుడూ చూడలేదు. అప్పటికి నాన్నగారు మంచి పొజిషన్లోనే ఉన్నారు. పిల్లల్ని బాగా చదివించారు. నేను అమెరికాలో ఇంజనీరింగ్ చేశాను. నాన్నగారు కష్టాల్లో ఉన్నప్పుడు కూడా కుటుంబం ఆనందంగా ఉందంటే దానికి కారణం మా అమ్మగారే. కేవలం మమ్మల్ని చూసుకోవడమే కాదు. మా పనివాళ్లని, డ్రైవర్స్ని కూడా బాగా చూసుకున్నారు. చాలా మంది పెళ్లిళ్లు కూడా అమ్మగారే దగ్గరుండి చేశారు. మా నాన్నగారి ఊరిలో తాగునీటి సమస్య ఉండేది. దాంతో ఊరు మొత్తం తాగు నీటిని ఏర్పాటు చేశారు. అలాంటివి చాలా చేశాం. నాన్నగారి ముందు మేం తక్కువే నాన్నగారి చివరి రోజుల వరకూ కూడా సినిమానే శ్వాసగా బతికారు. ఆదివారాలు కూడా పనిచేశారు. ఇండస్ట్రీలో నాన్నగారు సంపాదించిన గుడ్ విల్ వెలకట్టలేనిది. మేం ఎంత సంపాదించినా ఆయన తెచ్చుకున్న పేరు ముందు చాలా తక్కువే. 100 రూపాయలతో ప్రయాణం స్టార్ట్ చేసిన ఎల్వీ ప్రసాద్ అనే వ్యక్తి ఆలోచనల్ని, ఆశయాల్ని ఇప్పుడు సుమారు 1500 మంది ఉద్యోగులంతా కలసి ముందుకు తీసుకువెళ్తున్నారు. ఆయన లైఫే మా అందరికీ ఇన్స్పిరేషన్. నాన్నగారు ఎప్పుడూ మాతోనే ఉంటారు – విశ్వనాథరెడ్డి (తండ్రి నాగిరెడ్డితో విశ్వనాథరెడ్డి) అందరికీ తెలిసిన మా నాన్నగారి గురించి ఏం చెప్పను? నిజానికి చెప్పాలంటే చాలా ఉంది. ఆయన్నుంచి నేర్చుకున్నవి, చిన్ననాటి జ్ఞాపకాలు ఇలా ఒక కొడుకుగా జీవితాంతం ఆయన గురించి ఎంతైనా చెప్పుకుంటూ పోవచ్చు. అందుకే ఈ ‘నాన్నతో నేను’ ఇంటర్వ్యూలో చాలా విషయాలు చెప్పదలిచాను. ‘పుట్టాం–పెరిగాం–జీవించాం’ అనికాక ‘ఇతరుల కోసం జీవించేదే జీవితం’ అని నిరూపించిన సాధకుడాయన. స్వాతంత్య్రోద్యమంలో... పొట్టిపాడు అనే చిన్న గ్రామంలో, వ్యవసాయ కుటుంబంలో పుట్టారు నాన్నగారు. మా తాతగారు ‘ఎక్స్పోర్ట్’ బిజినెస్ చేసేవారు. ఉల్లిపాయల వ్యాపారం. నాన్నగారిని ఆయన 14వ ఏట మదరాసు తీసుకెళ్లారు. అక్కడ స్కూల్లో చేర్చితే చదువు మీద ఆసక్తి లేని కారణంగా నాన్నగారు చదువుకోలేదు. స్వాతంత్య్రోద్యమాల్లో పాల్గొన్నారు. ఇలా అయితే లాభం లేదనుకుని నాన్నగారిని సొంతూరికి పంపించేశారు. అక్కడ ‘ఖాదీ మూమెంట్’లో పాల్గొన్నారు. కొన్ని పరిస్థితుల వల్ల నాన్నగారిని మళ్లీ మదరాసు తీసుకెళ్లారు. చదువు మీద శ్రద్ధ పెట్టకపోవడంతో ఎక్స్పోర్ట్ బిజినెస్ నిమిత్తం నాన్నగారిని తాతగారు రంగూన్ పంపారు. అప్పుడు మదరాసులో ‘బీఎన్కే’ ప్రింటింగ్ ప్రెస్ ఏర్పాటు చేశారు. అప్పటికి మా పెదనాన్న (బొమ్మిరెడ్డి నరసింహారెడ్డి – బీఎన్ రెడ్డి) మూడు నాలుగు సినిమాలకు దర్శకత్వం వహించారు. ఆయన ‘స్వర్గసీమ’ సినిమాకి డైరెక్ట్ చేస్తున్నప్పుడు ఆ చిత్రనిర్మాత చక్రపాణిగారితో నాన్నగారికి పరిచయం ఏర్పడింది. ఇద్దరూ కలసి ఎన్నో హిట్ సినిమాలు నిర్మించారు. వాహినీ.. విజయా వాహినీ అయింది అప్పట్లో ‘వాహినీ స్టూడియోస్’కి ఏదో ప్రాబ్లమ్ వచ్చింది. మూల నారాయణస్వామి మేజర్ పార్టనర్. స్టూడియోస్కి ఇన్కమ్ ట్యాక్స్ ప్రాబ్లమ్ వస్తే.. ‘సేవ్’ చేయడం కోసం నాన్నగారు స్టెప్ ఇన్ అయ్యారు. మా అక్క పేరు జయ. ఆ పేరు, ఆంజనేయుడు, అర్జునుడు పేర్లు కలిసొచ్చేట్లుగా ‘విజయా వాహిని’ పెట్టారు. ‘పాతాళ భైరవి, మిస్సమ్మ, మాయా బజార్’ వంటి క్లాసిక్స్ని ఆ స్టూడియో బేనర్ మీద తీశారు. వ్యాపారం, పత్రిక, చిత్రరంగం, వైద్యరంగాల్లో నాన్నగారు పేరుప్రఖ్యాతులు సంపాదించారు. దాదా సాహెబ్ ఫాల్కే అందుకున్నారు. చెన్నై వదిలేది లేదన్నారు సినిమాల్లోకి రాకముందు నాన్నగారు ‘చందమామ’ పత్రిక నడిపేవారు. అప్పట్లో కేంద్ర ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న మొరార్జీ దేశాయ్గారు ‘చందమామ’ పత్రికకు అభిమాని. ఆయన నాన్నగారితో ‘చందమామ పబ్లికేషన్స్’ను ఢిల్లీకి మార్చమని అక్కడ తగిన స్థలం కేటాయిస్తానని చెప్పారు. అప్పుడు నాన్నగారు ‘‘చెన్నై నా సొంత ఇల్లు. దాన్ని వదిలి నేనెక్కడా ఉండలేను’’ అన్నారు. ఉమ్మడి కుటుంబాన్ని ఇష్టపడేవారు మేం ఉమ్మడి కుటుంబంగా ఉండడాన్నే మా నాన్నగారు ఇష్టపడేవారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా మర్రి చెన్నారెడ్డిగారున్న రోజుల్లో ఆయన హిందీ, ఇంగ్లిష్, తెలుగు, ఇతర ఉత్తరాది భాషల్లో వస్తున్న ‘చందమామ’ను హైదరాబాద్ నుంచే తీసుకురావచ్చునని అభిప్రాయపడ్డారు. అందుకు తగిన స్థలాన్ని హైదరాబాద్లో ఇస్తానని కూడా చెప్పారు. మేం కూడా వెళ్ళి ఆ స్థలాన్ని చూసి వచ్చాం. ఇది విన్న నాన్నగారు బాధపడ్డారు. పత్రికా సంస్థలో ఒక భాగం హైదరాబాద్ నుంచి పని చేస్తే, అన్నదమ్ముల్లో ఎవరో ఒకరు అక్కడికి వెళ్ళవలసి వస్తుంది. వృత్తిరీత్యా కూడా మా అన్నదమ్ములు విడిగా ఉండటం ఆయనకు ఇష్టంలేదు. అందువల్ల ఆ విషయాన్ని అంతటితో వదిలేశాం. వాస్తవంగా చెన్నై, వడపళని ప్రాంతాన్ని ఎట్టి పరిస్థితులలోనూ వదిలి వెళ్లడానికి ఆయన ఇష్టపడలేదు. గెలుపు–ఓటములు గురువులాంటివి ఏ పనిచేసినా సంపూర్ణ భక్తి శ్రద్ధలతో, నిబద్ధతతో చేయాలనేది ఆయన సంకల్పం. ‘సుఖదుఃఖాలకు మనసులో సమస్థితి కల్పించండి’ అనేవారు. ‘గెలుపు–ఓటములు రెండూ గురువు లాంటివి’ అని, జీవితంలో ఆ రెంటినీ సమంగా స్వీకరించారు. ‘సింహానికి సకల వసతులూ కల్పించినా, అది వేటాడి ఆహారాన్ని సంపాదించుకోవాలి. కఠినంగా శ్రమిస్తేనే ఫలితం లభిస్తుంది’ అనేవారాయన. గతాన్ని ఎప్పుడూ మరచిపోలేదు వృత్తిలో ఎంత పోటీ ఉన్నా కొందరితో చేతులు కలపడం ఆయనకు ఇష్టం ఉండేది కాదు. నీతీ నిజాయితీగా ఉండేవాళ్లతోనే చేతులు కలిపేవారు. అవి లేనివాళ్లతో చేతులు కలిపితే మనసులో ప్రశాంతత కొరవడుతుంది అనేవారాయన. ‘నీకు నెలకు వెయ్యి రూపాయలు జీతం వస్తున్నప్పుడు నెలకు పదివేలు సంపాదించే వారితో పోల్చుకుంటే నీకు మనశ్శాంతి ఉండదు. ఐదొందలు సంపాదించేవారితో పోల్చుకుంటే ప్రశాంతత లభిస్తుంది’ అంటుండేవారు.ఆయన గతాన్నెప్పుడూ మరిచిపోయేవారు కాదు. చిన్న వయసులో చదివిన, నేర్చుకున్న పురాణాలు, ఇతిహాసాలలోని మంచిని ఆయన తరచూ గుర్తుంచుకునేవారు. నాన్నగారు గుప్తదానాలు చేసినా బయటకు చెప్పుకోలేదు. ఆయన వద్ద సాయం పొందినవారు చెబితే ఆయన దానగుణం తెలిసేది. నా జీవితంలో ఎన్నో పదవులు నిర్వహించాను. వాటికి మూలకారణం – ‘నాగిరెడ్డిగారి కుమారుడు’ అవడం. రెండవ కారణం– తల్లిదండ్రులను గురువులుగా భావించి వారినుంచి గ్రహించిన అనుభవపాఠాలు. నాన్నగారు భౌతికంగా లేకపోవచ్చు. మానసికంగా ఎప్పుడూ మాతోనే ఉంటారు. నా గురువు, మార్గదర్శి ఆయనే. వీల్ ఛైర్లో కూర్చుని... మా నాన్నగారు 1997లో జబ్బుపడటంతో ఇక ఎప్పటిలా అన్ని పనులూ నిర్వహించలేనని గ్రహించారు. అయితే ఆ విషయం బహిర్గతం కాకుండా – ఆస్పత్రుల నిర్వహణకు ఓ కమిటీని ఏర్పరచారు. ఆస్పత్రులకు సంబంధించిన చిన్న పనైనా, పెద్ద పనైనా – ఆ కమిటీ చర్చించి ఓ నిర్ణయం తీసుకోవాలి. వెంటనే ఆ నిర్ణయాన్ని నాన్నగారికి తెలియచేసి, ఆయన అంగీకారంతోనే దాన్ని ఆచరణలో పెట్టాలి. నాన్నగారు వీల్ఛైర్లో కూర్చుని ఆస్పత్రి పనులను పర్యవేక్షిస్తున్న కాలంలో– ఆయన్ను కలుసుకోవడానికి చాలామంది వస్తుండేవారు. వాళ్లల్లో చిత్రసీమకు చెందినవాళ్లతో మాట్లాడినప్పుడు నాన్నగారికి మళ్లీ సినిమాలు తీయాలనే ఆలోచన తలెత్తేది. నాన్నగారి చివరి కథ ధనమా? గుణమా? సినిమాలు తీయాలని నాన్నగారు తయారు చేసుకున్న కథల్లో ‘ధనమా గుణమా?’ ఒకటి. అయితే ఆరోగ్యం సహకరించదు కదా. ఆ పరిస్థితుల్లో... అప్పట్లో 2000 సంవత్సరానికి మిలీనియం కార్నివాల్ను నిర్వహించాం. ఆ కార్యక్రమాల నిర్వహణలో మీడియా పార్టనర్గా జయా టీవీవారు మాకెంతగానో సహకరించారు. దాంతో ‘ధనమా? గుణమా?’ కథను ‘ఎంగవీట్టు పెణ్’ పేరుతో నేను టెలీ సీరియల్గా నిర్మించి – జయా టీవీలో టెలికాస్ట్ చేయిస్తానంటే నాన్నగారు అంగీకరించారు. ఆ సీరియల్ కోసం వెయిట్ చేసేవారు నాన్నగారు చివరిగా ఓ కథారచయితగా పాల్గొన్న ఆ టెలీ సీరియల్ 2001, సెప్టెంబర్ 10న ప్రారంభమైంది. 45 వారాల పాటు ప్రతి సోమవారం రాత్రి 8.30 గుంటలకు ప్రసారమయ్యేది. ఎపిసోడ్ ప్రసారమయ్యే ముందు రోజు టెలికాస్ట్ అయ్యే ఎపిసోడ్ వివరాలు అడిగేవారు. సోమవారం రాత్రి 8.30 గుంటలకు టీవీ దగ్గర కూర్చునేవారు. చూసిన ఎపిసోడ్కు సంబంధించిన పాత్రధారుల వస్త్రధారణ, మేకప్ వంటివి.. ఇంకా ఎంత బాగా ఉండొచ్చో చెప్పేవారు. 90 యేళ్ల వయసులోనూ ఆయనకు ఆ రంగం పట్ల ఉన్న ఆసక్తి, ఉత్సాహం ఇప్పుడు తలచుకున్నా ఆశ్చర్యంగా ఉంటుంది. అనారోగ్యంతో మంచంపట్టిన మా నాన్నగారికి సేవచేసే భాగ్యాన్ని నాకు కరుణించిన ఆ భగవంతునికి నేను ఋణపడి ఉన్నాను. ఇది నా పూర్వ జన్మసుకృతంగా భావిస్తాను. ఎన్ని జన్మలెత్తినా నాగిరెడ్డిగారు, శేషమ్మ దంపతులకు కుమారుడుగానే జన్మించాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. ‘‘ఒకరు చేసిన మంచిని మరవడం తప్పు. అలాగే ఒకరు చేసిన అపకారాన్ని అప్పటికప్పుడు మరవకపోవడం కూడా తప్పు’’ అనే సూక్తి ఇక్కడ ప్రస్తావించడం అవసరం అనుకుంటాను. నాగిరెడ్డిగారంటే నాన్నకు చాలా గౌరవం నాగిరెడ్డి–చక్రపాణిగార్లంటే నాన్నగారికి చాలా గౌరవం. నాగిరెడ్డి గారితో మంచి అనుబంధం ఉండేది. విజయా సంస్థలో సినిమాలు చేసినప్పుడు నాన్నగారికి నెల జీతం ఇచ్చేవారు. అప్పట్లో అంతే. నాగిరెడ్డిగారి భార్య చాలా మంచివారు. మేం పిల్లలం వాళ్లింటికి వెళ్లేవాళ్లం. వాళ్ల పిల్లలు విశ్వనాథరెడ్డి వాళ్లు మా ఇంటికి వచ్చేవారు. నేను చాలాసార్లు వాళ్ల ఇంట్లో భోజనం చేశాను. అందుకే ప్రసాద్ ల్యాబ్స్ స్టార్ట్ చేశాం ఎన్టీఆర్తో తీసిన ‘తల్లా? పెళ్లామా?’ సినిమా నాకు బాగా నచ్చింది. దాన్ని హిందీలో తీయాలనిపించింది. నాన్నగారి ద్వారా ఎన్టీఆర్గారి దగ్గర రైట్స్ తీసుకుని హిందీలో తీశాం. ఆ సమయంలో ఫిల్మ్ నెగటివ్స్కి గీతలు పడ్డాయి. వెళ్ళి ప్రింట్ చేసేవాళ్లను అడిగాను. రెండు మూడు సార్లు అడిగినా వాళ్లేం మాట్లాడలేదు. నచ్చకపోతే తీసుకెళ్ళిపోండి అన్నట్టు మాట్లాడారు. ఆ రోజే నిర్ణయించుకున్నా.. ఒకవేళ ఈ సినిమా సక్సెస్ అయితే ల్యాబ్ పెట్టాలని. అనుకున్నట్టుగానే సినిమా సూపర్ హిట్. అప్పుడు ప్రసాద్ ల్యాబ్స్ మొదలుపెట్టాం. సంపాదించినదాన్ని మళ్లీ సినిమాల్లోనే పెట్టాలనేవారు నాన్నగారు. ఓ సందర్భంలో ఉంటున్న ఫ్లాట్ చిన్నగా ఉంది.. వేరే ఫ్లాట్ తీసుకుందాం అని మేం అనుకుంటుంటే.. ‘వద్దు. ఏదో కెమెరా అమ్మకానికి వచ్చింది. అది తీసుకుందాం’ అన్నారు. ఇప్పుడు మాకున్న ఇంత ఎక్విప్మెంట్కి కారణం నాన్నగారే. సినిమాను క్రియేటివ్గానే చూశారు తప్పితే వ్యాపార కోణంలో చూడలేదు. నాన్నగారు క్రియేటివ్ సైడ్ ఉంటే నేను టెక్నికల్ సైడ్. ఓసారి వాషింగ్టన్ డీసీ స్మిత్సోనియన్ మ్యూజియమ్లో ‘టు ఫ్లై’ ఐమాక్స్ సినిమా చూసి థ్రిల్ అయ్యాను. ఎలా అయినా ఐమాక్స్ని ఇండియా తీసుకురావాలనుకున్నాను. సాధించగలిగాను. నాన్నగారి తర్వాత రెండు సినిమాలు ప్రొడ్యూస్ చేశాం. అవి అనుకున్న స్థాయిలో ఆడలేదు. దాంతో ప్రొడక్షన్కి దూరంగా ఉన్నాం. మంచి సబ్జెక్ట్ కోసం ఎదురు చూస్తున్నాం. ఓ సారి ఆస్కార్ అవార్డ్ ఫంక్షన్కు వెళ్లాను. ఎప్పటికైనా ఆస్కార్ తీసుకు వచ్చే సినిమా చేయాలని ఆశ. మరి నెరవేరుతుందో? లేదో చూడాలి. ఎల్వీ ప్రసాద్గారు మంచి వ్యక్తి ఎల్వీ ప్రసాద్గారితో నాన్నగారికి మంచి అనుబంధం ఉంది. ప్రసాద్గారు చాలా మంచి వ్యక్తి. ఆయన ఫుడ్ లవర్. మేం వడపళనిలో ఉండేవాళ్లం. ఆయన కుటుంబం అడయార్లో ఉండేది. వడపళని నుంచి నన్ను అడయార్ తీసుకెళ్లేవారు. వెళ్లే దారిలో కొబ్బరినీళ్లు ఇప్పించేవారు. ఎల్వీ ప్రసాద్గారి కూతురు గృహలక్ష్మీ నాకన్నా పెద్ద. ఆమె నన్ను రైటింగ్, పెయింటింగ్ సైడ్ బాగా ఎంకరేజ్ చేశారు. మేమంతా ఒక కుటుంబంలా ఉండేవాళ్లం. నేను చేసుకున్న పుణ్యం అది మేం బడిలో చదివే రోజుల్లో మా తల్లిదండ్రులతో కుట్రాలం వెళ్ళాం. రోజూ ఉదయం అక్కడ నాన్నగారితో వాకింగ్ వెళ్ళేవాళ్లం. ఆ సమయంలో ఆయన నాకు వివేకానందుడు, బాపూజీ వంటి మహనీయుల గురించి, ఆత్మవిశ్వాసం, సహనం, కృషి, సాహసం లాంటి విషయాల గురించీ చెబుతుండేవారు. మనుషులు పొరబాట్లు చేయడం సహజం. అయితే వాటిని అంగీకరించే పరిపక్వత, ధైర్యం కావాలి. సరళత, దోషాలు అంగీకరించడం, పెద్దలను గౌరవించడం లాంటివి నేర్చుకోవడం గురించి చెప్పేవారు. నేను ఇప్పుడు కొద్దో గొప్పో ఉన్నత స్థానంలో ఉన్నానంటే నాకు ఆయన నూరిపోసిన విషయాలే కారణం. ఆయన పుత్రుడిగా జన్మించడం నేను చేసుకున్న పుణ్యం. చందమామ లోగో వెనక స్టోరీ అదే 80వ ఏట నాన్నగారు అనారోగ్యంపాలై, కంటిచూపు మందగించినప్పుడు నాతో ఎక్కువ సమయం గడిపేవారు. ఆయన నాతో ‘నువ్వు ఆగర్భశ్రీమంతుడివి కావు. కష్టపడితేనే ఉన్నత శిఖరాలకు వెళ్లొచ్చు’ అన్నారు. అలా మాట్లాడుతున్నప్పుడు ఒకనాడాయన ‘చందమామ’ లోగో ఎలా వచ్చిందో చెప్పారు. ‘బౌద్ధ జాతక కథలలో వచ్చే ఒక సంఘటనే ‘చందమామ’ లోగోగా ఎంపిక చేశాం. చంద్రునికి ఆహారంగా తనను తాను అగ్నికి ఆహుతి చేసుకున్న కుందేలు త్యాగమే ఆ సంకేతం. ఇతరులకు సాయపడటానికి తమను తాము త్యాగం చేసుకోవడానికి సంసిద్ధులం కావాలి, సంకోచపడకూడదు’ అనేవారాయన. ‘కృతజ్ఞతను మరవని మనసు కావాలి. అదే నా మూలధనం’ అంటుండేవారు నాన్నగారు. -
ఆయన సేవలు అజరామరం
భారతీయ సినిమాకు ఆధ్యుడు, సినీ ప్రేమికుడు బి.నాగిరెడ్డి 105వ వర్ధ్దంతిని ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా నాగిరెడ్డి పేరుతో తపాలా బిళ్లను ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, గవర్నర్ బన్వరిలాల్ చెన్నైలో ఆవిష్కరించారు. తమిళసినిమా: నాగిరెడ్డి సేవలు అజరామరం అని, ఆయన్ను ఆదర్శంగా తీసుకుని సమాజానికి మేలు చేసే చిత్రాలు రూపొందించాలని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. భారతీయ సినీ పితామహుడు, దివంగత ప్రఖ్యాత సినీ దర్శక, నిర్మాత, వాహినీ స్టూడియో అధినేత బి.నాగిరెడ్డి పేరుతో తపాలాబిళ్లను శుక్రవారం చెన్నైలో ఆవిష్కరించారు. భారతీయ సినిమాకు ఆధ్యుడు, సినీ ప్రేమికుడు బి.నాగిరెడ్డి విజయా ప్రొడక్షన్స్ పతాకంపై తెలుగు, తమిళం, హిందీ అంటూ పలు భాషల్లో ఎన్నో అద్భుత కళాఖండాలను నిర్మించారు. పాతాళభైరవి, మిస్సమ్మ, మాయాబజార్ వంటి ఆ పాత మధుర చిత్రాలతో పాటు నమ్నాడు, ఎంగవీట్టు పిళ్లైవంటి పలు జనరంజక తమిళ చిత్రాల నిర్మించారు. అదేవిధంగా భారతదేశంలోనే ప్రసిద్ధి గాంచిన వాహినీ స్టూడియో నిర్మాణ కర్త బి.నాగిరెడ్డినే. విజయా వైద్య, విద్యా సంస్థల వ్యవస్థాపకుడు అయిన నాగిరెడ్డికి ఈ నెల 25న 105వ వర్ధంతి రోజు. ఈ రోజును పురçస్కరించుకుని ఆయన పేరుతో తపాలాబిళ్లను విడుదల చేయడం విశేషం. ఈ కార్యక్రమానికి ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, రాష్ట్ర గవర్నర్ బన్వరిలాల్ పురోíహిత్ హాజరయ్యారు. బి.నాగిరెడ్డి రూ.5 తపాలాబిళ్లను వెంకయ్యనాయుడు ఆవిష్కరించగా తమిళనాడు గవర్నర్ బన్వరిలాల్ పురోహిత్ బి.నాగిరెడ్డి ది లెజెండ్ పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు మాట్లాడుతూ బి.నాగిరెడ్డి అన్నా, ఆయన చిత్రాలన్నా తనకు చాలా ఇష్టం అని పేర్కొన్నారు. సమాజానికి ఉపయోగపడే చిత్రాలనే నాగిరెడ్డి రూపొందించారని కీర్తించారు. ఆయన చిత్రాల్లో భాషకు, యాసకు ప్రాముఖ్యత ఉండేదన్నారు. శృంగారం లాంటి అసభ్య దృశ్యాలు లేకుండానే నాగిరెడ్డి ఎన్నో గొప్పగొప్ప ప్రేక్షకాదరణ పొందిన మంచి సందేశాత్మక కథా చిత్రాలను నిర్మించారని, ఇప్పుడు శృంగారం పేరుతో అపహాస్యం చేస్తున్నారని అన్నారు. నిజానికి ఇప్పటి చిత్రాల్లో శృంగారం కంటే, అంగారమే కనిపిస్తుందని అన్నారు. అలా కాకుండా సమాజానికి మంచి చేసే కథా చిత్రాలతో భావితరానికి మంచి సందేశాన్ని అందించే బాధ్యత నేటి దర్శక నిర్మాతలపై ఉందన్నారు. నైతిక విలువలతో కూడిన భారతీయ సంస్కృంతి, సంప్రదాయాలను పెంపొందించే చిత్రాలను రూపొందించాల్సిన అవసరం ఉందన్నారు. భాష ఏదైనా మనందరం భారతీయులమని వ్యాఖ్యానించారు. మాతృభాష తల్లిపాలు లాంటిదని, ఇతర భాషలు అద్దం లాంటివని పేర్కొన్నారు. అలాంటి తెలుగు భాషను మనమే చెడగొట్టుకుంటున్నామని అన్నారు. ఎన్ని గూగుల్స్ వచ్చినా మన గూగుల్ (ఉపాధ్యాయులు)లను మరవరాదని అన్నారు. నాగిరెడ్డి సినిమాలతోనే కాకుండా రియల్ లెజెండ్ అని వ్యాఖ్యానించారు, ఆయన సేవలు అజరామరం అని, సినీమారంగానికే కాకుండా వైద్య, విద్యారంగాల్లోనూ ఉత్తమ సేవలను అందించిన గొప్ప మానవతావాది ఆయన అని అన్నారు. ఒక సాధారణ కుటుంబంలో పుట్టిన నాగిరెడ్డి ఎంతో సాధించారని పేర్కొన్నారు. అందుకే ఆయన దాదా సాహెబ్ పాల్కే అవార్డులాంటి ఎన్నో గొప్పగొప్ప అవార్డులతో సత్కరింపబడ్డారని గుర్తు చేశారు.నాగిరెడ్డిని ఆదర్శంగా తీసుకుని ఈ తరం దర్శక నిర్మాతలు చిత్రాలు చేయాలని హితవు పలికారు. నాగిరెడ్డి పేరుతో తపాలాబిళ్లను విడుదల చేసిన తపాలా శాఖకు, కేంద్రప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నానన్నారు. ఈ తపాలాబిళ్లను తన చేతులమీదగా ఆవిష్కరించడం అదృష్టంగా భావిస్తున్నానని వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. నాగిరెడ్డి గొప్ప మానవతావాది అని తమిళనాడు గవర్నర్ బన్వరిలాల్ పురోహిత్ పేర్కొన్నారు. స్వశక్తితో ఎదిగి ఎంతో సాధించిన గొప్ప వ్యక్తి నాగిరెడ్డి అని శ్లాఘించారు. చందమామ హిందీ పత్రికను తాను చిన్నతనంలోనే చదివాననని, అయితే ఆ పత్రిక సంపాదకుడు బి.నాగిరెడ్డి అన్న విషయం ఇప్పుడే తెలిసిందని అన్నారు. ఈ కార్యక్రమంలో నాగిరెడ్డి తనయుడు బి.వెంకటరామిరెడ్డి, ఆయన సతీమణి బి.భారతీదేవి, రాష్ట్ర మంత్రి అన్భళగన్, ప్రముఖ చిత్ర నిర్మాత ఏవీఎం.శరవణన్ వేదికనలంకరించారు. పలువురు సినీ ప్రముఖులు పాల్గొన్నారు.నాగిరెడ్డి మనువడు వినయరెడ్డి వందన సమర్పణ చేశారు. నాగిరెడ్డి ది లెజెండ్ పుస్తకాన్ని ఆవిష్కరిస్తున్న వెంకయ్యనాయుడు -
పురస్కార ప్రదానం
-
ఉత్తమ నిర్మాతకు బి.నాగిరెడ్డి పురస్కారం
దక్షిణాది సినిమాపై ‘విజయా’ నాగిరెడ్డి సంతకం ఎప్పటికీ చెరిగిపోనిది. జానపదం, సాంఘికం, పౌరాణికం, ఇలా ఏ తరహా సినిమా చేసినా ప్రేక్షకుల్ని వినోదపరచడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. ఆయన స్మారకంగా ప్రతి ఏటా ఉత్తమ వినోదాత్మక కుటుంబ కథా చిత్రానికి బి.నాగిరెడ్డి పురస్కారం అందజేస్తున్నారు ఆయన తనయుడు బి.వెంకట్రామిరెడ్డి. 2013కు సంబంధించి ఈ నెల 20న హైదరాబాద్లో పురస్కారం ప్రదానం చేయనున్నారు. ఈ సందర్భంగా వెంకట్రామిరెడ్డి మాట్లాడుతూ -‘‘ఇంటిల్లిపాదికీ స్వచ్ఛమైన వినోదాన్ని అందించడమే లక్ష్యంగా నెలకొన్న సంస్థ ‘విజయా ప్రొడక్షన్స్’. ఇన్నేళ్లయినా ప్రజల గుండెల్లో విజయా సంస్థ నిలిచిపోయిందంటే కారణం అదే. ఎన్నో కళాఖండాలను ఆ సంస్థ ద్వారా ప్రేక్షకులకు అందించిన ఘనత నాగిరెడ్డి-చక్రపాణిలది. మంచి చిత్రాలను నిర్మిస్తున్న నిర్మాతల్ని పోత్సహించాలనే సత్సంకల్పంతో ఈ అవార్డును స్థాపించాం. పురస్కారం కింద జ్ఞాపికతో పాటు లక్షన్నర రూపాయల నగదు అందిస్తాం. ఈ నెల 15 లోపు నిర్మాతలు తమ నామినేషన్ను పంపించాలి’’ అని తెలిపారు.