breaking news
Athidhimeanan
-
నా భార్య తిరిగొస్తే ఏలుకుంటా: నటుడు
చెన్నై, పెరంబూరు: తన భార్య, నటి అతిథిమీనన్ మంచిగా మారి తిరిగొస్తే ఆమెను ఏలుకుంటానని నటుడు అభిశరవణన్ అన్నారు. భార్యభర్తల మధ్య ఆరోపణలు, ప్రతి ఆరోపణలు, కేసులు, కోర్టులు అంటూ వివాదం జరగుతున్న విషయం తెలిసిందే. ప్రేమించుకుని, పెళ్లి (రిజిస్టర్ మ్యారేజ్) చేసుకుని మూడేళ్లు కలిసి సంసారం చేసిన ఈ సంచలన జంట మూడు నెలల క్రితం విడిపోయారు. దీంతో తన భార్యను తనతో కలపాల్సిందిగా నటుడు అభిశరవణన్ మదురై కుటుంబ సంక్షేమ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఈయన్ని వదిలి వెళ్లిన నటి అతిథిమీనన్ సుజిత్ అనే వ్యాపారవేత్త కొడుకుతో కలిసి ఉంటోందట. ఇటీవల సుజిత్ తనతో మరో ఇద్దరు వ్యక్తులను తీసుకుని అర్ధరాత్రి అభిశరవణన్ ఇంటికి వచ్చి మాట్లాడదాం అని చెప్పి కారులో తీసుకుపోయారు. దీంతో అతన్ని కిడ్నాప్ చేశారనే ప్రచారం జరిగింది. ఈ సంఘటనపై అభిశరవణన్ సాలిగ్రామం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రెండు రోజుల క్రితం నటి అతిథిమీనన్ కూడా అభిశరవణన్పై చెన్నై, వెప్పేరిలోని పోలీస్ కమిషనర్ కార్యాలయంలో ఫిర్యాదు చేసింది. అందులో అభిశరవణన్ తనతో పెళ్లి అయినట్లు నకలీ ధ్రువపత్రాలను సృష్టించాడంటూ ఆరోపణలు చేసింది. దీంతో నటుడు అభిశరవణన్ బుధవారం మీడియా ముందుకు వచ్చాడు. ఈ సందర్భంగా అతిథిమీనన్కు తనకు చట్టబద్ధంగా పెళ్లి అయినట్లు రిజిస్టర్ చేసిన ధ్రువపత్రాలు తన వద్ద ఉన్నాయని, తాము 2016 జూన్ 9న రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నట్లు వెల్లడించాడు. అతిథిమీనన్ తాను కలిసి పట్టాదారి అనే చిత్రంలో నటించినప్పుడు పరిచయం జరిగిందని తెలిపాడు. ఆ తరువాత తను నడునల్వాడై చిత్రంలో నటిస్తుండగా ఆ చిత్ర దర్శకుడితో సమస్య ఎదురుకావడంతో ఆయనపై లైంగిక వేధింపులంటూ అతిథిమీనన్ పోలీసులకు ఫిర్యాదు చేసిందని అన్నాడు. నడునల్వాడు దర్శకుడితో గొడవ జరిగినప్పుడు భయపడి తనను రక్షణ కోరడంతో ఆమెను మదురైలోని తన ఇంటికి తీసుకెళ్లి రక్షణ కల్పించినట్లు చెప్పాడు. దీంతో అతిథిమీనన్ తనపై ప్రేమ పెంచుకుని ఆ విషయాన్ని తన తల్లిదండ్రులకు చెప్పి వారి అనుమతి తీసుకుందని చెప్పాడు. దీంతో తామిద్దరం పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నామని, అప్పుడు అతిథిమీనన్ తల్లిదండ్రులు విదేశాల్లో ఉండడంతో వీడియో ద్వారా వారి అనుమతి కూడా తీసుకున్నామని తెలిపాడు. అలా పెళ్లి చేసుకుని చెన్నైకి వచ్చి ఇల్లు అద్దెకు తీసుకుని మూడేళ్లు కలిసి సంసారం చేశామని, ఆ సమయంలో కేరళలో ఉన్న అతిథిమీనన్ తల్లిదండ్రుల ఇంటికి పదిసార్లుకు పైగా వెళ్లి అక్కడ గడిపి వచ్చామని చెప్పాడు. అలాంటిది మూడు నెలల క్రితం తాను గజ తుపాన్ సంఘటనతో చలించి సామాజిక సేవకు సిద్ధం అయ్యానన్నాడు. ఆ సమయంలో ఇంటిలో లేని సమయం చూసి అతిథిమీనన్ ఇంటిలో ఉన్న డబ్బు, నగలు, విలువైన పత్రాలు తీసుకుని వెళ్లిపోయిందన్నాడు. ఆమె ప్రస్తుతం సుజిత్ అనే వ్యాపారవేత్త కుమారుడితో కలిసి ఉంటున్నట్లు తెలిసిందన్నాడు. ఆమెను కలిసి మాట్లాడాలని ప్రయత్నించినా పక్కనున్న సుజిత్ అతని అనుచరులు ఆ అవకాశం ఇవ్వలేదని చెప్పాడు. అతిథిమీనన్ కొచ్చిలో ఉండగానే ఒక యువకుడితో సహజీవనం చేసిందని, అదే విధంగా కేరళలో మరో వ్యక్తిని ప్రేమించి అతన్ని మోసం చేసి చెన్నైకి వచ్చేసిందని చెప్పాడు. ఆ వివరాలు తన వద్ద ఉన్నాయని తెలిపాడు. అలాంటిది తాను సామాజిక సేవ పేరుతో డబ్బులు వసూలు చేసి ఇల్లు, కార్లు కొనుక్కున్నానని ఆరోపణలు చేస్తోందని అన్నాడు. తాను సేవాకార్యక్రమాల కోసం సేకరించిన ప్రతి పైసాకు బ్యాంకు స్టేట్మెంట్తో సహా లెక్కలు ఉన్నాయని మీడియాకు ఆధారాలు చూపించాడు. అతిథిమీనన్ తనపై పెట్టిన కేసును చట్టపరంగానే ఎదుర్కొంటానని అన్నాడు. అదేవిధంగా తప్పులు ఎవరైనా చేస్తారని, గడిచిన కాలాన్ని మరచిపోయి తను మనసు మార్చుకుని తిరిగి వస్తే తాను ఆమెను ఏలుకుంటానని నటుడు అభిశరవణన్ పేర్కొన్నారు. -
అభిశరవణన్పై నటి అతిథిమీనన్ ఫిర్యాదు
పెరంబూరు: నకిలీ పెళ్లి రిజిస్టేషన్ పత్రాలతో అసత్యాలను ప్రచారం చేస్తున్నాడని నటుడు అభిశరవణన్పై నటి అతిథిమీనన్ సోమవారం స్థానిక వెప్పేరిలోని పోలీస్కమీషనర్ కార్యాలయంలో ఫిర్యాదు చేసింది. అందులో ఆమె పేర్కొంటూ తాను కేరళకు చెందిన నటినని పేర్కొంది. తన వయసు 26 అని, పట్టాదారి అనే తమిళ చిత్రంతో కోలీవుడ్లో పరిచయం అయినట్లు తెలిపింది. ప్రస్తుతం తను చెన్నైలోనే నివసిస్తున్నానని పేర్కొంది. పట్టాదారి చిత్రంలో మదురైకి చెందిన శరవణకుమార్ అనే వ్యక్తి అభిశరవణన్గా పేరు మార్చుకుని హీరోగా నటించాడని తెలిపింది. ఆ చిత్ర షూటింగ్ సమయంలో తామిద్దరం ప్రేమించుకున్నామని చెప్పింది. అలాంటి సమయంలో అభిశరవణన్ నకిలీ రిజిస్టర్ పెళ్లి పత్రాల్లో తన చేత సంతకం చేయించాడని చెప్పింది. ఆ తరువాత అభిశరవణన్ ప్రవర్తనలో మార్పు రావడంతో తాను అతని నుంచి దూరం అయ్యానని తెలిపింది. దీంతో తమను ఒకటిగా చేర్చాలని కోరుతూ అభిశరవణన్ మదురై కుటుంబ సంక్షేమ కోర్టులో పిటిషన్ దాఖలు చేశాడని చెప్పింది. నిజానికి తాను ఏ రిజిస్టర్ కార్యాలయానికి వెళ్లి పెళ్లి ధ్రువీకరణ పత్రాలపై సంతకాలు చేయలేదని తెలిపింది. అలాంటిది అభిశరవణన్ నకిలీ పెళ్లి ధ్రువపత్రాలను, తాను అతనితో దిగిన ఫొటోలను వాట్సాప్లో పోస్ట్ చేసి దుష్ప్రచారం చేస్తున్నాడని తెలిపింది. ఈ వ్యవహారంలో అతను, అతని అనుచరులపై తగిన చర్యలు తీసుకోవలసిందిగా కోరింది. అభిశరవణన్ సామాజిక సేవ పేరుతో పలువురి వద్ద డబ్బు పొంది మోసానికి పాల్పడడం వల్లే తాను అతనిని వదిలి వచ్చేశానని అతిథిమీనన్ అందులో పేర్కొంది. ఆమె ఫిర్యాదును నమోదు చేసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఇటీవల నటుడు అభిశరవణన్ను నలుగురు వ్యక్తులు కిడ్నాప్ చేసిన సంఘటన గురించి తెలిసిందే. అందులో నటి అతిథిమీనన్ హస్తం ఉందనే ప్రచారం జరిగిందన్నది గమనార్హం. -
అతిథిమీనన్కు లక్కీచాన్స్
తమిళసినిమా: మైనా చిత్రంతో అమలాపాల్కు, కుంకీ చిత్రంతో లక్ష్మీమీనన్కు కోలీవుడ్లో లైఫ్ ఇచ్చిన దర్శకుడు ప్రభుసాల్మన్. అంతే కాదు కయల్ చిత్రంతో నటి ఆనందిని పరిచయం చేసిన దర్శకుడు ఈయనే. ప్రభుసాల్మన్ దృష్టిలో పడితే ఆ నటికి బంగారు జీవితమే అంటారు. అందుకే ఈ దర్శకుడి చిత్రాల్లో నటించడానికి చాలా మంది హీరోయిన్లు ఆశ పడుతుంటారు. అయితే ప్రభుసాల్మన్ హీరోహీరోయిన్లను బట్టి కాకుండా పాత్రలకు తగ్గట్టుగా నటీనటులను ఎంపిక చేసుకుంటారు. తొడరి చిత్రం తరువాత ప్రభుసాల్మన్ కుంకీ చిత్రానికి పార్టు–2 తెరకెక్కించడానికి సన్నాహాలు చేస్తున్న విషయం తెలిసిందే. కుంకీ చిత్రంలో నటించిన విక్రమ్ప్రభు, లక్ష్మీమీనన్లను దాని సీక్వెల్లోనూ ఎంపిక చేసుకుంటారని చాలా మంది భావించారు. అయితే ప్రభుసాల్మన్ కొత్తవారికి అవకాశం కల్పించాలని నిర్ణయించుకున్నారు. అందులో భాగంగా కథానాయకిగా నటించే లక్కీచాన్స్ను నటి అతిథిమీనన్ దక్కించుకుందన్నది తాజా సమాచారం. ఈ చిత్రాన్ని దర్శకుడు ఉత్తరాది రాష్ట్రాల్లో చిత్రీకరించడానికి ప్రణాళికను సిద్ధం చేసుకున్నారట. ఇది పూర్తిగా ప్రేమకథా చిత్రంగా ఉన్నా, ఏనుగు పాత్ర కీలకంగా ఉంటుందట. ఇక ఇందులో హీరోగా నటించే అవకాశం పొందే ఆ అదృష్టవంతుడెవరన్నది తెలియాల్సి ఉంది. త్వరలోనే షూటింగ్కు ప్రభుసాల్మన్ సన్నాహాలు చేస్తున్నారు.