breaking news
Aravalli hills
-
పేరుకు అభివృద్ధి... 'చేసేది విధ్వంసం'
బొగ్గు గనులు ‘ఇంధన భద్రత’గా మారాయి. రేవులు ‘వ్యూహాత్మక మౌలిక వసతులు’ అయ్యాయి. సఫారీ పార్కులు ‘సంరక్షణ’ ముద్ర వేసుకుంటున్నాయి. వీటిని ఒకే తాటిపైకి తెస్తున్నది జాగ్రఫీ కాదు, వాటి రాజకీయ ఆర్థిక వ్యవస్థ. హరిత ఆవరణ వ్యవస్థ అడవులు,కొండలు, దీవులను అభివృద్ధి పేరిట పెట్టుబడి ఆస్తులుగా మార్చేస్తోంది. హరియాణాలో ఆరావళి పర్వత శ్రేణిలో 3,800 ఎకరాలకు పైగా ప్రాంతాన్ని మెగా సఫారీ పార్కుగా మార్చాలన్న ప్రతిపాదన అందుకు తిరుగులేని నిదర్శనం. ఎకో టూరిజం, జీవవైవిధ్య పెంపుదల పేరు చెప్పి అది టూరిస్టులకు కన్నుల పండువను, డెవలపర్లకు లాభాలను వాగ్దానం చేస్తోంది. కానీ, అది అడవుల ఆవరణకు, జల వనరులకు, గ్రామాల ఉమ్మడి ఆస్తులకు ముప్పుగా పరిణమిస్తోంది. ఇది ఆరావళికి మాత్రమే పరిమితమైంది కాదు. హసదేవ అరండ్లో బొగ్గు బ్లాకుల నుంచి దేహింగ్ పటకాయీలో చమురు, మైనింగ్; గ్రేట్ నికోబార్లో ట్రాన్స్– షిప్మెంట్ పోర్టు వరకు, భారతదేశపు అత్యంత బలహీనమైన జీవావరణ వ్యవస్థలు, అభివృద్ధికి పొలిమేరలుగా పునర్నిర్మాణం చెందుతున్నాయి. సఫారీ అనేది మినహాయింపు కాదు. అదొక నమూనా! జీవనాధార వ్యవస్థకు ముప్పుఆరావళి పర్వతాలు గుజరాత్లో మొదలై రాజస్థాన్, హరి యాణా గుండా సాగి ఢిల్లీ వరకు 670 కిలోమీటర్ల పొడవున ఉన్నాయి. ప్రపంచంలోనే అత్యంత ప్రాచీన పర్వత వ్యవస్థగా దీన్ని చెబుతారు. ఇది భౌగోళిక అవశేషం కాదు. జీవావరణ మౌలిక వ్యవస్థ. థార్ ఎడారి తూర్పు వైపు మరింత విస్తరించకుండా ఇవి దాన్ని కాస్త మందగింపజేస్తున్నాయి. అన్నింటికన్నా ముఖ్యంగా వాయవ్య భారతాన భూగర్భ జలాల రీఛార్జీకి ఇవి ఉపయోగ పడుతున్నాయి. గురుగ్రామ్, ఫరీదాబాద్, నుహ్ వంటి జిల్లాల్లో భూగర్భ జలాలు ఇప్పటికే అడుగంటాయి. ఆ జిల్లాలకు ఆరావళి పర్వతాలే జీవనాడి. అవి రుతుపవన వర్షాలను పీల్చుకుంటూ భారీ స్పాంజ్లుగా ఉపయోగపడుతున్నాయి. నీటికి ఎంతో కటకటలాడే ప్రాంతంలో జలవనరులు అంతో ఇంతో నిండటానికి తోడ్పడుతున్నాయి. పరిస్థితులు నానాటికీ తీసికట్టుగా ఉన్న ఈ నేపథ్యంలో, పులిమీద పుట్రలా సుప్రీం కోర్టు భౌగోళిక శాస్త్ర ప్రమాణాలను ఉటంకిస్తూ, ‘సైన్స్’ పేరుతో ఆరావళి పర్వతాల రూపురేఖలకు ఆ మధ్య కొత్త నిర్వచనం ఇచ్చింది. చుట్టుపక్కల భూమి కన్నా కనీసం 100 మీటర్లు, అంతకన్నా ఎక్కువ ఎత్తులో ఉంటేనే, మూడు డిగ్రీల ఏటవాలు కనబడితేనే ఆరావళిలో భాగంగా పరిగణించాలని పేర్కొంది. ఈ విషయంలో అది రెగ్యులేటరీ అస్పష్టతను తొలగించేందుకు కేంద్రం ఇచ్చిన నిర్వచనం పైనే ఆధారపడింది. కాగితాలపై ఇది సాంకేతిక సునిశితత్వంగా కనిపించవచ్చు. వాస్తవంలో, ఇది లీగల్ భూకంపం లాంటిది.ఆరావళులలో చాలా భాగాలు ముఖ్యంగా హరియాణా, రాజస్థాన్ లోనివి తక్కువ ఎత్తులోనే ఉంటాయి. అవి కోర్టు చెప్పిన ఎత్తును అందుకోలేకపోవచ్చు. కానీ, జీవావరణ పరంగా అత్యంత కీలకమైనవి. పర్వతాలను పునర్ నిర్వచించడం ద్వారా భారీ భూభాగాలను పరిరక్షణ నుంచి మినహాయిస్తే, అవి గనుల తవ్వ కాలు, రియల్ ఎస్టేట్, హైవేలు, సఫారీ లాంటి ప్రాజెక్టులకు ఆల వాలం అవుతాయి. (అయితే, సుప్రీంకోర్టు తాజాగా తన తీర్పును పునఃపరిశీలిస్తోంది.)చెప్పేదొకటి... చేసేదొకటి!వన్య ప్రాణులను సంరక్షిస్తామని సఫారీ ప్రాజెక్టు చెబుతోంది. కానీ, పెళుసుగా ఉన్న ప్రాంతంలో రోడ్లు, లాడ్జీలు, పార్కింగ్ లాట్లు, ఇతర ఎన్క్లోజర్లు నిర్మించడం ద్వారా చేసే పనులు సంరక్షణ కిందకు రావు. అడవులకు కంచె నిర్మిస్తారు. ప్రజలను వాటిని దాటి వెళ్ళ నివ్వరు. ఉన్నత వర్గాల సరదాలకు అనుగుణంగా ప్రకృతిని తాము ఎంచుకున్న పద్ధతిలో నిర్వహిస్తారు. గురుగ్రామ్, నుహ్లలోని స్థానిక ప్రజానీకం పశుగ్రాసం, కట్టెలు, నీరు, రుతువులను బట్టి లభించే ఉపాధి మార్గాలకు ఆరా వళులపైనే ఆధారపడుతోంది. ఇది ఉన్నవి లాగేసుకోవడం ద్వారా వేరే వారికి పోగేసిపెట్టడమే! దాన్ని ‘ఎకో–టూరిజం’గా రీప్యాకేజీ చేయడమే. మధ్యభారతంలోని విస్తారమైన అడవుల్లో ఛత్తీస్గఢ్లోని హసదేవ అరండ్ ఒకటి. టేకు చెట్లకు, ఇనుమద్ది, సాళువ, గుగ్గిలం చెట్లుగా పిలిచే రకం చెట్లకు ఇది ప్రసిద్ధి. ఇంధన భద్రత పేరుతో బొగ్గుకు ఈ ప్రాంతాన్ని త్యాగం చేశారు. అధికారుల ప్రోద్బలంతో మైనింగ్ బ్లాకులు తెరిచారు. ఆరావళికి ఎకో–టూరిజం మాదిరిగానే హసదేవకు బొగ్గు ఎసరు పెట్టింది. రెండు ఉదంతాల్లో పేర్లు మారినా వాటిల్లే హాని ఒక్కటే!కాగితాలపై పచ్చదనం... ఆచరణలో అరాచకం అస్సాంలోని దేహింగ్ పటకాయీని ‘అమెజాన్ ఆఫ్ ది ఈస్ట్’గా అభివర్ణిస్తారు. జీవ వైవిధ్యానికి పేరెన్నికగన్న ఈ ప్రాంతంలో చమురు నిక్షేపాల అన్వేషణకు, బొగ్గు గనుల తవ్వకానికి అనుమ తించారు. రెగ్యులేటరీ మినహాయింపులనిచ్చారు. అనుమతులకు ముందే పనులు చకచకా సాగిపోయాయి. మొదట తవ్వి తీయడం, తరువాతే పరిశీలనలు. టెక్నోక్రాటిక్ పరిభాషతో ఆ ప్రాజెక్టులను సమర్థిస్తున్నారు. ప్రభావం మదింపు, నిపుణుల కమిటీలు, నష్టాన్ని తగ్గించే ప్రణాళికలు అంటారు. కానీ, ఈ మంత్రాంగాలు సంరక్షణ చర్యలగా కన్నా, ముందే నిర్ణయించిన ఫలితాలను చట్టబద్ధం చేసే సాధనాలుగానే ఎక్కువ ఉపయోగపడతాయి. జాతీయ భద్రత, వ్యూహాత్మక మౌలిక వసతుల పేరుతో గ్రేట్ నికోబార్లో మెగా ట్రాన్స్–షిప్మెంట్ పోర్టును, విమానాశ్రయాన్ని, టౌన్ షిప్ను నిర్మిస్తున్నారు. ఈ ప్రాజెక్టు వర్షారణ్యాలకు, కోరల్ ఎకోసిస్టవ్ులకు, స్థానిక శోంపెన్ జనజాతి మనుగడకు ముప్పుగా పరిణమించింది. ఇక్కడ గ్రీన్ ఎన్క్లోజర్ భౌగోళిక రాజ కీయాల ముసుగు వేసుకుంటుంది. పెట్టుబడిదారీ వ్యవస్థకు జీవా వరణం సలాం చేయవలసిందే. ఈ ఉదంతాలన్నింటిలోనూ చట్టం లోపించలేదు. దాన్ని జాగ్రత్తగా వాడుకున్నారు. ఆరావళి, హసదేవ, ఇతర దుర్బల మండ లాలను కాపాడేందుకు సుప్రీం కోర్టు, నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ అడపాదడపా జోక్యం చేసుకుంటూనే ఉన్నాయి. 1900 నాటి పంజాబ్ భూసంరక్షణ చట్టం వంటివి భూ వినియోగ మార్పుపై కొన్ని పరిమితులను విధించగలిగాయి. అయినా, కమిటీలు, పునర్ వర్గీకరణలు, నీరుగార్చిన మదింపులు, ఇప్పుడు ఏకంగా మారిన నిర్వచనాలను కవచాలుగా ధరించి మెగా ప్రాజెక్టులు ముందుకు సాగుతున్నాయి.దేవాశీస్ చక్రవర్తివ్యాసకర్త అంతర్జాతీయ మీడియా స్కాలర్,సామాజిక శాస్త్రవేత్త (‘యూరేసియా రివ్యూ’ సౌజన్యంతో) -
ఆరావళి ‘ఎత్తు’ వివాదంలో కీలక మలుపు
న్యూఢిల్లీ/జైపూర్: ఆరావళి శ్రేణిలో వంద మీటర్ల కంటే ఎక్కువ ఎత్తున్న కొండలనే పర్వతాలుగా పరిగణిస్తూ కొత్త నిర్వచనం ఇవ్వడంపై విమర్శలు వెల్లువెత్తడంతో సర్వోన్నత న్యాయస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. నవంబర్ 20వ తేదీన తాము ఇచ్చిన తీర్పును పక్కనబెడు తున్నట్లు సోమవారం సుప్రీంకోర్టు ప్రకటించింది. వంద మీటర్ల కంటే ఎత్తున్న ఆరావళి పర్వతాలకే పర్యావరణ పరిరక్షణ లభిస్తుండటంతో ఎత్తు తక్కువ ఉన్నవి గనుల తవ్వకంతో కనుమరుగయ్యే ప్రమాదముందని పర్యావ రణవేత్తలు మొదలు నేతలు, సామాన్య ప్రజానీకం నుంచి విమర్శలు వెల్లువెత్తడంతో ఈ అంశాన్ని సర్వోన్నత న్యాయ స్థానం సూమోటోగా స్వీకరించింది. సోమవారం ఈ కేసును సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, జస్టిస్ జేకే మహేశ్వరి, జస్టిస్ అగస్టీన్ జార్జ్ మాసిహ్ల వెకేషన్ బెంచ్ విచారించి పలు వ్యాఖ్యలుచేసింది. ‘‘ఫలానా ఎత్తు ఉన్న కొండలనే ఆరావళి పర్వతాలుగా పరిగణించాలనే నిర్వచనం ఇవ్వడంలో సహేతుకత లోపించినట్లు స్పష్టమవుతోంది. సంబంధిత కమిటీ నివేదికలో, తీర్పులో ఇలాంటి పలు సంక్లిష్టమైన, కీలక అంశాలపై దృష్టిపెట్టలేదు. అందుకే ఈ అంశంలో మరింత లోతైన అధ్యయనం, దర్యాప్తు, విచారణ అవసరం. అప్పటిదాకా మేం గతంలో ఇచ్చిన తీర్పును పక్కనబెడుతున్నాం. 2010 ఆగస్ట్ 25వ తేదీన ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా(ఎఫ్ఎస్ఐ) ఇచ్చిన నిర్వచనం మేరకు 2024 మే 9న మేం ఇచ్చిన తీర్పు ప్రకారం ఆరావళి పర్వతాల్లో ఇకపై ఎలాంటి మైనింగ్ అనుమతులు ఇవ్వకూడదు. నవంబర్ 20న మేం ఇచ్చిన తీర్పు, అందులో పర్వతం నిర్వచనాన్ని తప్పుగా ఆపాదించే పెను ప్రమాదముందని అర్థమవుతోంది. కొత్త నిర్వచనాన్ని మైనింగ్ సంస్థలు తప్పుగా అన్వయించి తమను అనువుగా అమలుచేసే ప్రమాదం పొంచి ఉంది. గతంలో కోర్టు ఇచ్చిన మార్గదర్శకాలు, నియమ నిబంధనల్లో స్పష్టత కరువవడంతో ఇదంతా జరిగింది. ఆరావళి పర్వతాల పర్యావరణ పరిరక్షణ, సమగ్రత కాపాడేలా నిబంధనల్లో లోటుపాట్లను సమగ్ర స్థాయిలో పూడ్చాల్సి ఉంది. 100 మీటర్లు, అంతకంటే ఎక్కువ ఎత్తున్న కొండలను మాత్రమే ఆరావళి పర్వత శ్రేణిగా పేర్కొనడంలో తర్కం లోపించింది. 500 మీటర్ల దూరం ఎడంగా ఉన్న కొండలనే ఆరావళి పర్వత శ్రేణిలో భాగంగా పరిగణించాలన్న నిబంధనలోనూ లోపాలున్నాయి. ఇలాంటి పలు నిబంధనలకు ఎలాంటి శాస్త్రీయ ఆధారాలులేవని అర్థమవుతోంది. పలు కీలక అంశాల్లో సంక్లిష్టత నెలకొంది. రాజస్థాన్లోని ఆరావళి పర్వతాల్లో 12,081కిగాను కేవలం 1,048 పర్వతాలు మాత్రమే 100 మీటర్ల కంటే ఎక్కువ ఎత్తు ఉన్నాయి. దీంతో మిగతా కొండలకు మైనింగ్ ముప్పు పొంచి ఉంది. ఇలా చిన్న కొండలు పర్యావరణ పరిరక్షణ ఛత్రం ఆవల ఉండిపోవడం మేం ఏమాత్రం ఒప్పుకోం. మళ్లీ సమగ్ర స్థాయిలో శాస్త్రీయ, భౌగోళిక దర్యాప్తు జరగాల్సిందే. ఈ మేరకు స్థానిక నిపుణులతో అత్యున్నత కమిటీ ఏర్పాటును ప్రతిపాదిస్తున్నాం. ఈ విషయంలో మీ స్పందన తెలియజేయండి’’ అంటూ కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులిచ్చింది. ఆరావళి పర్వతాల పరిధిలోకి వచ్చే ఢిల్లీ, రాజస్థాన్, హరియాణా, గుజరాత్లకూ నోటీసులు పంపించింది. జనవరి 21వ తేదీలోగా స్పందన తెలపాలని సుప్రీంకోర్టు గడువు విధించింది.ఆరావళి పర్వతాల ప్రత్యేకత ఏంటి?ప్రపంచంలోనే అత్యంత పురాతన ముడత పర్వతాలుగా ఆరావళి పర్వతాలకు పేరుంది. ఢిల్లీ నుంచి మొదలై హరియాణా, రాజస్థాన్, గుజరాత్లదాకా ఆరావళి పర్వతాలు విస్తరించి ఉన్నాయి. ఆయా రాష్ట్రాల్లో మొత్తంగా 37 జిల్లాల్లో ఈ పర్వతాలున్నాయి. రాజస్థాన్లోని థార్ ఎడారి నుంచి ఇసుక మేఘాలు ఢిల్లీసహా ఉత్తరభారతాన్ని కమ్మేయకుండా ఈ ఆరావళి పర్వతాలే అడ్డుకుంటున్నాయి. ఆరావళి కారణంగానే థార్ ఎడారి ఉత్తరదిశగా విస్తరించకుండా ఆగిపోయింది. అలా ఉత్తరభారతంలో జీవవైవిధ్యానికి, భూగర్భ జలాలకు ఆరావళి పర్వతాలు రక్షాకవచాలుగా నిలుస్తున్నాయి. ఆరావళి కొండల్లోని వర్షపు నీరు నేలలోకి ఇంకి ఆయా ప్రాంతాల భూగర్భజలాలను ఎప్పటికప్పుడు రీచార్జ్ చేస్తున్నాయి. దీంతో భూసారం పరిరక్షించబడుతోంది. పరోక్షంగా జీవజాతుల మనుగడ సాధ్యమవుతోంది. ఆరావళిలోని కొన్ని ప్రాంతాలు ఇప్పటికే పులుల అభయారణ్యాలుగా, జాతీయ వనాలుగా, పక్షుల సంరక్షణ కేంద్రాలుగా, పర్యావరణంపరంగా అత్యంత సున్నిత ప్రదేశాలుగా కొనసాగుతున్నాయి.స్వాగతించిన పర్యావరణ నిపుణులుగత తీర్పుపై స్టే విధిస్తూ సుప్రీంకోర్టు వెలు వర్చిన తాజా నిర్ణయంపై పర్యావరణవేత్తలు ఆనందం వ్యక్తంచేశారు. అత్యున్నత కమిటీ అనేది కేవలం ప్రభుత్వ ఉన్నతాధికారుల కూటమిగా మిగిలిపోకుండా జీవావరణ, పర్యావరణవేత్తలకూ స్థానం కల్పించాలని పర్యావరణవేత్త భావరీన్ కంధారీ డిమాండ్చేశారు. ‘‘ఇది తాత్కాలిక గెలుపు. ఇప్పటి దాకా జరిగిన పర్యావరణ విధ్వంసాన్ని వెల్లడి స్తూనే ఇకమీదట మైనింగ్ను పూర్తిగా ఆపేలా తుది తీర్పు రావాలి’’ అని ‘పీపుల్స్ ఫర్ ఆరావళి’ వ్యవస్థాపక సభ్యురాలు నీలం అహ్లూవాలియా ఆశాభావం వ్యక్తంచేశారు. పర్యావరణవేత్త విమలేందు ఝా, జీవావర ణవేత్త విజయ్ ధాస్మాన తదితరులూ తాజా ఉత్తర్వును స్వాగతించారు. ‘‘ ఉత్తర్వును మేం కూడా స్వాగతిస్తున్నాం. ఆరావళి పరిరక్షణకు, పునరుద్ధరణకు మోదీ సర్కార్ కట్టుబడి ఉంది’’ అని కేంద్ర పర్యావరణ మంత్రి భూపేందర్ యాదవ్ చెప్పారు. ‘‘ కొత్త నిర్వచనం సరిగా లేదని ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా, సుప్రీంకోర్టు కేంద్ర సాధికారత కమిటీ, కోర్టు అమికస్ క్యూరీ సైతం గతంలోనే చెప్పారు. అయినాసరే కొత్త నిర్వచనం సరైందేనంటూ మంత్రి యాదవ్ గతంలో చేసిన వాదనలన్నీ తప్పు అని నేడు తేలింది. ఆయన వెంటనే రాజీనామా చేయాలి’’ అని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. -
ఆరావళికి ఊపిరి
చరిత్రకు పూర్వమే కొన్ని నదులకు చిరునామాగా, వైవిధ్యభరిత ప్రకృతికి ఆలవాలంగా, రకరకాల జీవరాశులకు ఆలంబనగా నిలిచిన ఆరావళి ప్రస్తుతానికి ఊపిరి పీల్చుకున్నట్టే. ఆ పర్వత శ్రేణిపై గత నెల 20న తామిచ్చిన ఉత్తర్వులను తాత్కాలికంగా నిలుపుదల చేయాలని సుప్రీకోర్టు సోమవారం తీసుకున్న నిర్ణయం పర్యావరణ ఉద్యమకారులకూ, ఆ ప్రాంత ప్రజానీకానికీ ఉపశమనం కలిగించింది. 250 కోట్ల సంవత్సరాల క్రితం ఆవిర్భవించి వాయవ్య భారత్ను 670 కిలోమీటర్ల పొడవునా కంటికి రెప్పలా చూసుకుంటున్న ఆరావళికి కష్టం వచ్చిందంటే జనం తల్లడిల్లారు. టేపు తీసుకుని కొలతలు కొలిచి, ఎన్ని డిగ్రీల కోణంలో వాలాయో గమనించి ఆ కొండల్ని కత్తిరించాలని చూసినవారి ఎత్తు గడలకు విస్తుపోయారు. అందుకే పర్యావరణ ఉద్యమకారుల నాయకత్వంలో పార్టీల కతీతంగా గొంతెత్తారు. చివరకు జనానిదే పైచేయి అయింది. ఈ అంశంలో మరిన్ని వివరణలు, భిన్న కోణాల్లో పరిశీలనలూ అవసరమవుతాయని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జేకే మహేశ్వరి, జస్టిస్ అగస్టిన్ జార్జి మాసీలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం అభిప్రాయపడి ఉన్నతస్థాయి నిపుణుల కమిటీ మరింత సమగ్రంగా,మరింత సంపూర్ణంగా దీన్ని పరిశీలించాల్సి ఉంటుందని భావించింది. ఎన్నో పురుటినొప్పులు పడి, ఎన్నెన్నో ఉత్పాతాలు చవిచూసి, ఎన్నో విధాల భౌగోళిక మార్పులు జరిగి ప్రకృతి సంపద ఈ రూపంలో మన కళ్లముందుంది. అధికారం ఉండొచ్చు, కుబేరుణ్ణి తలదన్నేంత ఐశ్వర్యం ఉండొచ్చు – కానీ ఈ సంపదను అవసరా లకు పొదుపుగా వినియోగించుకుంటూ సురక్షితంగా భవిష్యత్తరాలకు అప్పగించటం మనిషి జన్మెత్తినవారి బాధ్యత. ప్రపంచవ్యాప్తంగా పాలకులుగా ఉన్నవారూ, పారిశ్రామిక వేత్తలూ దీన్నెక్కడా గమనించుకుంటున్నట్టు లేరు. అందుకే అడవులు మటుమాయమవు తున్నాయి. కొండలు కరిగిపోతున్నాయి. నదులు ఇంకిపోతున్నాయి. జీవ వైవిధ్యం గతి తప్పుతోంది. కొన్ని రకాల జంతువులు, పక్షులు ఇప్పటికే అంతరించిపోయాయి. నదుల గమనాలు మారాయి. రుతువులు తీరు మార్చుకుంటున్నాయి. రకరకాల కాలుష్యం కాటేస్తోంది.ఆరావళి మాత్రమే కాదు... దేశంలో చిన్నా పెద్దా కొండలు, గుట్టలు దీనంగా వేడుకుంటున్నాయి. మానవాళికి ఎన్నో విధాలుగా ఉపయోగపడుతున్న తమ ఉసురు తీయ డానికి సిద్ధపడుతున్న వైనం చూసి దుఃఖిస్తున్నాయి. అయినా ఆగిందేమీ లేదు. బంగారం మొదలుకొని డోలమైట్, గ్రాఫైట్, మాంగనీస్, బొగ్గు, రాగి, బాక్సైట్ వంటి రకరకాల ఖనిజాలు వాటిల్లో నిక్షిప్తమై ఉండటమే అందుకు కారణం. అభివృద్ధికి అవసరమనుకుంటే పరిమిత స్థాయిలో వాటిని వినియోగించటాన్ని ఎవరూ తప్పుపట్టరు. కానీ ప్రకృతి విపత్తులకు దారితీసే స్థాయికి అది చేరుకోవటం వల్ల అసలు అభివృద్ధి పరమార్థమే దెబ్బతింటోంది. ఆ ప్రాంతాల్లో నివసించే ఆదివాసుల జీవిక ధ్వంసమవుతోంది.ఇన్ని దశాబ్దాలుగా మౌనంగా వీక్షించిన వాయవ్య భారతం ఇప్పుడైనా గొంతెత్తగలిగింది గనుకే ప్రస్తుతానికిది ఆగింది. ఆరావళి పర్వత పంక్తులు చంబల్, సబర్మతి, లూని వంటి నదులకు జీవం పోస్తున్నాయి. అక్కడ అడవులున్నాయి, గడ్డిభూములు న్నాయి. సారవంతమైన నేలలు సరేసరి. అపురూపమైన జంతు, వృక్షజాలాలున్నాయి. దేశ రాజధాని నగరం ఈ మాత్రమైనా ఊపిరి పీల్చుకోగలుగుతున్నదంటే అది ఆరావళి చలవే. అంతేకాదు... భూగర్భ జలాలు సమృద్ధిగా లభించేలా చేస్తున్నాయి. ఇప్పటికే కొన సాగుతున్న మైనింగ్ను నిలిపేయటంతోపాటు కొత్తగా మైనింగ్ లైసెన్సులు జారీ చేయకుండా చర్యలు తీసుకుంటేనే ఈ మాత్రమైనా మిగులుతాయి. ఆ దిశగా తీసుకోవా ల్సిన చర్యల్లో సుప్రీంకోర్టు తాజా ఉత్తర్వులు తొలి అడుగు కావాలి. ఆరావళిలో కోల్పో యింది కోల్పోగా ప్రస్తుతం మిగిలినదాన్నయినా ఎలా రక్షించుకోవాలన్న ఆర్తి ఉంటే తప్ప ఇదంతా సాధ్యపడదు. వాయవ్య భారతమే కాదు... దేశంలోని అన్ని ప్రాంతాలూ తమ గొంతు బలంగా వినిపించినప్పుడే కొనసాగుతున్న విధ్వంసానికి తెరపడుతుందని తాజా పరిణామాలు చెబుతున్నాయి. భూ ఆకృతి సంబంధిత అంశంగా చూసి కొలతలతో, కోణాలతో యాంత్రికంగా చూడక, మనిషి ఇరుసుగా ప్రకృతిని వీక్షించగలిగితే తరతరాల పాటు ఈ అపురూప సంపద మానవాళికి ఆసరా అందిస్తుంది. -
ఆరావళి పాత తీర్పుపై.. సుప్రీం స్టే..
-
‘అరావళి’పై ‘సుప్రీం’ స్టే: పాత ఉత్తర్వుల నిలిపివేత
న్యూఢిల్లీ: అరావళి పర్వత శ్రేణుల నిర్వచనాన్ని పరిమితం చేస్తూ, గతంలో ఇచ్చిన ఉత్తర్వులపై సోమవారం సుప్రీంకోర్టు స్టే విధించింది. సముద్ర మట్టం నుండి కనీసం 100 మీటర్ల ఎత్తులో ఉన్న భూభాగాలను మాత్రమే అరావళి పర్వతాలుగా పరిగణించాలంటూ, ఇచ్చిన తీర్పును పునఃసమీక్షించేందుకు కోర్టు మొగ్గు చూపింది. ఈ మేరకు సుప్రీంకోర్టు ఈ వ్యవహారాన్ని సుమోటోగా స్వీకరించి, తన ఉత్తర్వుల అమలును నిలిపివేస్తూ, కీలక నిర్ణయం తీసుకుంది.గత నవంబర్ 20న సుప్రీంకోర్టు.. కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ సూచించిన నిర్వచనాన్ని ఆమోదించింది. దీని ప్రకారం స్థానిక భూతలానికి 100 మీటర్లు లేదా అంతకంటే ఎక్కువ ఎత్తులో ఉన్న ప్రాంతాలనే అరావళి శ్రేణిగా గుర్తించాలని పేర్కొంది. అయితే ఈ నిర్ణయంపై పర్యావరణ వేత్తలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. కేవలం ఎత్తును ప్రాతిపదికగా తీసుకుంటే, దాదాపు 90 శాతం అరావళి ప్రాంతం రక్షణ కోల్పోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇది మైనింగ్, రియల్ ఎస్టేట్ వ్యాపారులకు వరంగా మారుతుందని వారు పేర్కొన్నారు.ఈ వివాదాస్పద నిర్వచనంపై పలు విమర్శలు వచ్చిన దరిమిలా సుప్రీంకోర్టు ఈ అంశాన్ని తిరిగి విచారించాలని నిర్ణయించింది. థార్ ఎడారి తూర్పు దిశగా విస్తరించకుండా అరావళి పర్వతాలు ఒక రక్షణ కవచం మాదిరిగా ఉపకరిస్తున్నాయని, దేశంలోని అత్యంత పురాతన పర్వత శ్రేణులైన వీటిని కాపాడుకోవాల్సిన బాధ్యత ఉందని కోర్టు పేర్కొంది. కాగా గతంలో సర్వే ఆఫ్ ఇండియా సహాయంతో మ్యాపింగ్ ప్రక్రియను ప్రారంభించాలని కేంద్రం రాష్ట్రాలకు సూచించింది. అయితే తాజా స్టే ఆర్డర్ నేపథ్యంలో ఈ ప్రక్రియ నిలిచిపోనుంది. సోమవారం జస్టిస్ బి.ఆర్. గవాయ్ నేతృత్వంలోని ముగ్గురు న్యాయమూర్తుల ధర్మాసనం ‘ఆరావళి’పై విచారణ జరిపింది.ఇది కూడా చదవండి: Indonesia: అగ్నిప్రమాదం.. 16 మంది వృద్ధులు సజీవ దహనం -
28న ఆరావళిపై సుప్రీం విచారణ
న్యూఢిల్లీ: దేశంలోని ఆరావళి పర్వత శ్రేణుల నిర్వహణకు సంబంధించిన వివాదంపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. వివాదాస్పదంగా మారిన ఆరావళి పర్వతాల నిర్వచనం, దాని అనుబంధ అంశాలపై సుప్రీంకోర్టు డిసెంబర్ 28న విచారణ చేపట్టనుంది. ఈ వ్యవహారాన్ని సర్వోన్నత న్యాయస్థానం సుమోటోగా (స్వచ్ఛందంగా) స్వీకరించడం గమనార్హం.చీఫ్ జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జె.కె. మహేశ్వరి, జస్టిస్ ఎ.జి. మసీహ్లతో కూడిన ముగ్గురు సభ్యుల ధర్మాసనం ఈ కేసును విచారించనుంది. కోర్టు జాబితాలో ఈ అంశాన్ని ‘ఆరావళి కొండలు-పర్వత శ్రేణుల నిర్వచనం, సంబంధిత అంశాలు’గా పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇటీవల నోటిఫై చేసిన ఆరావళి పర్వత శ్రేణుల కొత్త నిర్వచనం చుట్టూ వివాదం నెలకొంది. ఈ కొత్త నిబంధనల కారణంగా ఈ పర్వత పర్యావరణ వ్యవస్థలో భారీగా మైనింగ్కు అవకాశం ఏర్పడుతుందని పర్యావరణవేత్తలు, శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా హర్యానా, రాజస్థాన్, గుజరాత్ రాష్ట్రాల్లోని విస్తారమైన ఆరావళి ప్రాంతాలు ప్రమాదంలో పడే అవకాశం ఉందని వారు హెచ్చరిస్తున్నారు.ఎటువంటి శాస్త్రీయ అంచనా లేకుండా, ప్రజాభిప్రాయాన్ని సేకరించకుండానే కేంద్రం ఈ నిర్ణయం తీసుకుందని శాస్త్రవేత్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాగా ప్రస్తుతానికైతే మైనింగ్ కోసం సమగ్ర నిర్వహణ ప్రణాళిక సిద్ధమయ్యే వరకు, ఆరావళి ప్రాంతంలో కొత్త మైనింగ్ లీజులను సుప్రీంకోర్టు నిలిపివేసింది. కోర్టు ఆదేశాల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కూడా ఆరావళి ప్రాంతంలో కొత్త లీజులను పూర్తిగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. పర్యావరణం, భూగర్భ శాస్త్రం, ప్రకృతి పరిరక్షణ ఆధారంగా మైనింగ్ నిషేధించాల్సిన అదనపు ప్రాంతాలను గుర్తించాలని కేంద్ర ప్రభుత్వం ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ ఫారెస్ట్ రీసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్ (ఐసీఎఫ్ఆర్ఈ)ని ఆదేశించింది. కేంద్రం ఇప్పటికే నిషేధించిన ప్రాంతాలకు అదనంగా ఈ జోన్లను గుర్తించాల్సి ఉంటుంది. సోమవారం సుప్రీం కోర్టులో జరగబోయే విచారణలో ఆరావళి భవిష్యత్తుపై ఎటువంటి ఆదేశాలు వెలువడుతాయనే ఆసక్తి నెలకొంది.ఇది కూడా చదవండి: ‘షార్ట్లతో తిరగొద్దు’.. హుకుం జారీ! -
'ఆరావళి'ని ఎందుకు కాపాడాలంటే..?
భారతదేశ చరిత్రకు ఆరావళి పర్వత శ్రేణి ఒక మౌన సాక్షి. కోట్లాది సంవత్సరాలుగా ఏర్పడిన ఈ పురాతన పర్వత వ్యవస్థ ఉత్తర భారతదేశానికి సహజ రక్షణ కవచంగా నిలిచింది. కానీ నేడు అభివృద్ధి ముసుగులో మైనింగ్ దోపిడీకి బలవుతోంది. ఇది కేవలం పర్యా వరణ సమస్య కాదు; ప్రజల జీవన హక్కులపై దాడి.ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఆరావళి పర్వతాలను (Aravalli Range) ప్రధానంగా ఎత్తు (100 మీటర్లు) ఆధారంగా నిర్వచించింది. ఇది కీలక ప్రాంతాలను రక్షణ పరిధి నుంచి తొలగించే ప్రమాదాన్ని తెచ్చింది. ఈ నిర్ణయం చట్టపరంగా సాంకేతికంగా ఉన్నా, దాని ప్రభావాలు దేశ భవిష్యత్తును ప్రభావితం చేయనున్నాయి.ఆరావళి ఒక పర్వత శ్రేణి కాదు, ఒక జీవవ్యవస్థ. అవి కేవలం రాళ్ల సమూహం కాదు, భూగర్భ జలాలకు సహజ భండారం; ఎడారీకరణను అడ్డుకునే చివరి గోడ; అడవులు, వన్యప్రాణులకు నివాస స్థలం; ఢిల్లీ – ఎన్సీఆర్కు సహజ గాలి శుద్ధి యంత్రం. భౌగోళిక నిర్మాణం, అడవుల విస్తరణ, శిలా స్వభావం, నీటి ప్రవాహం వంటివన్నీ కలిసి ఆరావళిని జీవవ్యవస్థగా నిలబెట్టాయి. ఎత్తు ఆధారంగా ఈ వ్యవస్థను విభజించడం అంటే శాస్త్రానికే అవమానం. ఆరావళిలో మైనింగ్ నష్టాలు తాత్కాలికం కావు. పర్వతాలను పేల్చడం ద్వారా శిలా నిర్మాణాలు శాశ్వతంగా ధ్వంసమవుతాయి. భూగర్భ జలాల సహజ ప్రవాహం తెగిపోతుంది. అడవులు తిరిగి పునరుద్ధరించలేని విధంగా నశిస్తాయి. ‘సస్టెయిబుల్ మైనింగ్’ భావన ఒక మిథ్య.హరియాణా, రాజస్థాన్, ఢిల్లీ ప్రాంతాల్లో నీటి కొరత ఇప్పటికే తీవ్రమ వుతోంది. మైనింగ్ వల్ల సహజ వ్యవస్థ దెబ్బతింటే, కోట్లాది ప్రజలు తాగునీటి సంక్షోభాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆరావళి పర్వత శ్రేణుల అడవులు... ధూళిని, ఇసుక గాలులను అడ్డుకుంటూ సహజ రక్షణ గోడలా పనిచేస్తాయి. ఆ గోడను కూల్చేసి, కాలుష్యంపై ఆందోళన వ్యక్తం చేయడం ప్రభుత్వ ద్వైదీ భావానికి ప్రతీక. ఆరావళి పర్వతాలు పశ్చిమ రాజస్థాన్ ఎడారి నుంచి వచ్చే వేడి గాలులను అడ్డుకునే చివరి అవరోధం. ఈ అవరోధం బలహీనపడితే, ఎడారీకరణ హరియాణా, ఢిల్లీ, పశ్చిమ ఉత్తరప్రదేశ్ వైపు విస్తరించే ప్రమాదం ఉంది. ఇది భవిష్యత్ తరాలపై విధించే శిక్షతో సమానం.చదవండి: విభేదాలు ప్రమాదకరం కాదు! ప్రకృతి వనరులు కొద్దిమంది కార్పొరేట్ లాభాల కోసం త్యాగం చేయ బడితే, అది ప్రజాస్వామ్యానికి విరుద్ధం. అభివృద్ధి అంటే నీటి భద్రత, ప్రజారోగ్యం, పర్యావరణ సమతుల్యత, భవిష్యత్ తరాల భద్రతకు హామీ ఇచ్చేదిగా ఉండాలి. ఆరావళిని కాపాడటం అంటే ఒక పర్వత శ్రేణిని కాపాడటం కాదు, దేశపు జీవనాధారాలను కాపాడటం. నిజమైన అభివృద్ధి ఎప్పుడూ పర్యావరణాన్ని కాపాడుతూ ముందుకు సాగుతుంది.- కె. నారాయణ చైర్మన్, కంట్రోల్ కమిషన్; కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా -
ఆరావళి ఆరాటం
ఆరావళి పర్వతశ్రేణి పరిరక్షణ కోసం అసాధారణ రీతిలో పలు రాష్ట్రాల ప్రజానీకం రోడ్డెక్కడంతో కేంద్ర ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు మొదలెట్టింది. ఢిల్లీ, గుజరాత్, హరియాణా, రాజస్థాన్లలో ఆరావళి పర్వతాలకు సంబంధించి కొత్తగా మైనింగ్ లీజులు ఇవ్వొద్దని బుధవారం ఆదేశాలు జారీచేసింది. ఇది పర్యావరణ పరిరక్షణ కోసమేనంటున్నది కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ. మంచిదే! కానీ ఈ విజ్ఞత ముందేవుంటే సమస్య ఇంత దూరం వచ్చేది కాదు. గత ఆదివారం ఆరావళి గురించి కేంద్ర పర్యావరణ మంత్రి భూపేందర్ యాదవ్ చెప్పిన కొత్త నిర్వచనమైనా, చుట్టుపక్కల భూమి కన్నా కనీసం వంద మీటర్లు, అంతకన్నా ఎక్కువ ఎత్తులో ఉంటేనే, మూడు డిగ్రీల ఏటవాలు కనబడితేనే ఆరావళిలో భాగంగా పరిగణించాలన్న ఆ మంత్రిత్వశాఖ సిఫార్సును ఆమోదిస్తూ గత నెల 20న సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలైనా పర్యావరణ కార్యకర్తలను విస్మయానికి గురిచేశాయి. ఇప్పుడైనా కొత్త మైనింగ్ లీజులు ఇవ్వొద్దన్న ఆదేశాలు తప్ప, ఈ పర్వతాలను అమాంతం కబళించే ప్రమాదమున్న కొత్త నిర్వచనానికి స్వస్తి పలుకు తున్నామన్న భరోసా లేదు. ఈ నేలపై సమస్త జీవరాశి కన్నా కోట్లాది సంవత్సరాల ముందే ఆవిర్భవించిన పర్వతశ్రేణి ఆరావళి. వాటి వయసు 250 కోట్ల సంవత్సరాలంటారు. వాయవ్య భారత్లో 670 కిలోమీటర్ల పొడవునా, లక్షా 44వేల చదరపు కిలోమీటర్ల ప్రాంతంలో విస్తరించి, నాలుగు రాష్ట్రాల్లోని 34 జిల్లాలను తాకుతూపోయే ఈ ఆరావళిని దశాబ్దాలుగా అధికార, అనధికార మైనింగ్ కార్యకలాపాలు తీవ్రంగా దెబ్బతీస్తున్నాయి. ఆ పర్వతశ్రేణి పర్యావరణపరమైన ప్రయోజనాలను విస్మరించి, అవి మాయమైతే వచ్చే ఉత్పాతాలను బేఖాతరు చేసి కాసుల కక్కుర్తితో కొంచెం కొంచెంగా చిదిమేస్తున్నారు. ఒక్కో రాష్ట్రంలో ఒక్కో నిర్వచనం చెప్పుకుంటూ ఇప్పటికే చాలా భాగాన్ని స్వాహా చేసిన వైనం కనబడుతూనే ఉంది. ఆ పర్వతశ్రేణిలో కేవలం 0.19 శాతంలో మాత్రమే మైనింగ్ లీజులు నడుస్తున్నాయని కేంద్రమంత్రి అంటున్నారు. అంటే 99 శాతానికిపైగా విస్తీర్ణం సురక్షితంగా ఉన్నట్టు లెక్క. కనుక మైనింగ్ ప్రాంతం తక్కువనిపిస్తుంది. కానీ అంకెల్లో చూస్తే అసలు సంగతి బోధపడుతుంది. అది ఏకంగా 68,000 ఎకరాలు! మైనింగ్ సంస్థలు గోరంత లీజుకు కొండంత తవ్వుకుపోవటం మన దేశంలో వింతేమీ కాదు. కనుక వాస్తవంలో ఇది మరింత ఉండొచ్చు. అసలు పర్యావరణ శాఖ కమిటీ సుప్రీంకోర్టుకు అందించిన నివేదిక గమనిస్తే అది ఆరావళిని రక్షించదల్చుకున్నదా... భక్షించే వారికి వంత పాడదల్చుకున్నదా అనే సందేహం తలెత్తుతుంది. ‘ఆరావళిలో ప్రతి భాగమూ పర్వతం కాదు, అలాగే ప్రతి పర్వతమూ ఆరావళిలో భాగం కాదు’ అని అనడంతోపాటు ‘కేవలం ఏటవాలే హద్దుల నిర్ణయానికి గీటురాౖయెతే చేర్పులకు సంబంధించి తప్పులు దొర్లే ప్రమాదం ఉంటుంద’ని చెప్పడంలో పర్యావరణహితం ఆవగింజంతైనా కనబడుతోందా? దశాబ్దాల తరబడి అక్కడి అక్రమ, ‘సక్రమ’ మైనింగ్ కార్యకలాపాల వల్ల పర్వతరహిత ప్రాంతాలుంటే ఉండొచ్చు. కానీ పర్యావరణ శాఖ కమిటీగా ‘చేర్చాలన్న’ ఆత్రుత కన్నా మినహాయింపుల వైపే మొగ్గటం సరైందేనా?మనిషి తాను ప్రకృతిలో భాగమన్న సంగతి మరిచి చాన్నాళ్లయింది. దాన్నుంచి వేరు చేసుకుంటే ఏం జరుగుతుందో ఆరావళి ఆవలున్న థార్ ఎడారి చూపుతోంది. అక్కడి ఇసుక తుపాన్లు మన వైపు రాకుండా అడ్డుపడుతున్నవీ, స్థానికంగా భూగర్భజలాలను పెంచుతున్నవీ, జనం జీవనోపాధికి అండగా నిలుస్తున్నవీ ఈ పర్వతాలే! ఇంతకూ ఆరా వళి ప్రాంతాన్ని మైనింగ్కు ఇవ్వబోమన్న హామీ వినబడుతోంది గానీ... జాతీయ రాజ ధాని ప్రాంతం(ఎన్సీఆర్)లో రియల్ ఎస్టేట్ దందాను సాగనివ్వబోమన్న వాగ్దాన మైతే ఇంతవరకూ లేదు. నిజానికి వందమీటర్ల గీటురాయి ఆ ప్రాంతాన్ని ఉద్దేశించి రూపొందించినట్టే కనబడుతోంది. ఎందుకంటే ఆరావళికి ఇటువైపున్న చిట్టచివరి ప్రాంతం ఎన్సీఆర్. అక్కడ కొండలు దాదాపు కనుమరుగయ్యాయి. కానీ ఇంకా చిన్న గుట్టలు, పొదలూ విస్తారంగా ఉన్నాయి. వీటిని సైతం కాపాడుకోవాల్సిందే! యునెస్కో అరుదైన ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించిన ఆరావళిలో అంగుళం కూడా నష్టపోకూడదు. -
ఆరావళి: కొండల్ని తవ్వితే వాళ్లకు చేటు కాదా?
ప్రపంచంలోనే పురాతనమైన ఆరావళి పర్వత శ్రేణులపై వివాదం రాజుకుంది. గడిచిన కొన్ని దశాబ్దాలుగా సాగుతున్న విచ్చలవిడి మైనింగ్ , ఇటీవల కేంద్ర ప్రభుత్వం తీసుకున్న వివాదాస్పద నిర్ణయాలు ఇప్పుడు ఈ పర్వతాల మనుగడను ప్రశ్నార్థకం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే సోషల్ మీడియాలో ‘సేవ్ ఆరావళి’ అనే నినాదం మార్మోగుతోంది. ఇంతకీ ఏం జరిగిందంటే..ఆరావళి పర్వత శ్రేణులకు దాదాపు 200 కోట్ల సంవత్సరాల చరిత్ర ఉంది. ఇవి వాయవ్య భారతదేశంలోని గుజరాత్, రాజస్థాన్, హర్యానా, ఢిల్లీలో దాదాపు 700 కిలోమీటర్ల పొడవునా విస్తరించి ఉన్నాయి. ఈ పర్వత శ్రేణుల్లోని అత్యధిక ఎత్తు 1,722 మీటర్లు. ఇవి ముడత పర్వతాలు. భూమి లోపల ఉండే టెక్టోనిక్ ప్లేట్లు ఒకదానికొకటి ఎదురెదురుగా బలంగా ఢీకొన్నప్పుడు, వాటి మధ్య ఉన్న భూభాగంపై ఒత్తిడి పెరుగుతుంది. ఈ ఒత్తిడి వల్ల ఆ భూభాగం పైకి లేచి ముడతలు పడుతుంది. ఆరావళి పర్వత శ్రేణులు ఇలాగే ఏర్పడ్డాయి.రాజస్థాన్లోని మౌంట్ అబూ సమీపంలో 5,650 అడుగుల ఎత్తులో ఉండే గురుశిఖర్ ఆరావళి పర్వత శ్రేణులలోనిదే. రాజస్థాన్ రాష్ట్రంలో వాతావరణ పరిస్థితులు నియంత్రణలో ఉండేందుకు, జల భద్రతకు ఈ పర్వతాలు అత్యంత కీలకమైనవి. ఇవి రాజస్థాన్లోని థార్ ఎడారి వేగంగా వ్యాప్తి చెందకుండా నిలువరిస్తున్నాయి. ఈ రాష్ట్రంలోని నేలలో భూగర్భ జలాలను రీఛార్జ్ చేస్తున్నాయి. ఢిల్లీలో వాయు కాలుష్యం కనీసం అప్పుడప్పుడు అయినా తగ్గుతోందంటే అందుకు కారణం ఆరావళి పర్వతాలే. ఈ శ్రేణులు, కేవలం రాళ్లతో నిండిన గుట్టలు మాత్రమే కావు. అవి ఉత్తర భారత దేశపు పర్యావరణ వ్యవస్థకు ఊపిరితిత్తుల వంటివి. ఇవి లేకపోతే ఉత్తర భారతదేశంలోని సారవంతమైన భూములు ఎడారిగా మారే ప్రమాదం ఉంది. అయితే, గడచిన కొన్ని దశాబ్దాలుగా సాగుతున్న విచ్చలవిడి మైనింగ్ , ఇటీవల కేంద్ర ప్రభుత్వం తీసుకున్న వివాదాస్పద నిర్ణయాలు ఇప్పుడు ఈ పర్వతాల మనుగడను ప్రశ్నార్థకం చేస్తున్నాయి. ఇన్ని ఉపయోగాలు ఉన్నప్పటికీ, ఈ పర్వత శ్రేణులలో దాగి ఉన్న విలువైన ఖనిజ సంపద ఇప్పుడు వాటి పాలిట శాపంగా మారింది. ఈ నేపథ్యంలోనే సోషల్ మీడియాలో ‘సేవ్ ఆరావళి’ అనే నినాదం మార్మోగుతోంది.अरावली सिर्फ़ पहाड़ नहीं, राजस्थान की सांस है। हज़ारों सालों से ये पर्वतमाला हमारी ज़मीन, पानी और जीवन की रक्षा करती आ रही है। इसे बचाना मतलब आने वाली पीढ़ियों को बचाना। #SaveAravalli pic.twitter.com/Yf0RAdPzW5— Tribal Army (@TribalArmy) December 19, 2025సుప్రీంకోర్టు ఏం చెప్పింది?ఆరావళి పర్వత శ్రేణుల పరిరక్షణ, మైనింగ్ కార్యకలాపాలపై సుప్రీంకోర్టు ఈ ఏడాది నవంబరు 20న కీలక తీర్పు ఇచ్చింది. ఆరావళి పర్వతాలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన కొత్త నిర్వచనాన్ని దేశ సర్వోన్నత న్యాయస్థానం ఆమోదించింది. దీని ప్రకారం, ఆరావళి పర్వత శ్రేణులు విస్తరించి ఉన్న ప్రాంతాల్లో స్థానిక భూమట్టం నుంచి 100 మీటర్లు (328 అడుగులు) లేదా అంతకంటే ఎక్కువ ఎత్తు ఉన్న ప్రాంతాలను మాత్రమే ఆరావళి పర్వతాలుగా పరిగణిస్తారు. 100 మీటర్లు లేదా అంతకంటే ఎక్కువ ఎత్తు కలిగిన ఒకటికిపైగా ఆరావళి పర్వతాలు, పక్కపక్కనే సగటున 500 మీటర్ల దూరంలో ఉంటే వాటి మధ్యనున్న భూమిని కూడా ఆరావళి పర్వతశ్రేణిగానే పరిగణిస్తారు. ఈ పర్వతశ్రేణుల పరిధిలో పర్యావరణపరంగా అత్యంత సున్నితమైన ప్రాంతాల్లో మైనింగ్ను సుప్రీం కోర్టు పూర్తిగా నిషేధించింది. సుస్థిర మైనింగ్ నిర్వహణ ప్రణాళిక (ఎంపీఎస్ఎం) సిద్ధమయ్యే వరకు ఆరావళి ప్రాంతంలో కొత్త మైనింగ్ లీజులను మంజూరు చేయొద్దని కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. భారతీయ అటవీ పరిశోధన, విద్యా మండలి (ఐసీఎఫ్ఆర్ఈ) ద్వారా మొత్తం ఆరావళి శ్రేణికి సంబంధించి ఒక సమగ్ర సుస్థిర మైనింగ్ ప్రణాళికను రూపొందించాలని కేంద్ర పర్యావరణ శాఖకు ఆర్డర్ ఇచ్చింది. ఆరావళి శ్రేణులు థార్ ఎడారి విస్తరించకుండా అడ్డుకునే సహజ రక్షణ కవచమని, భూగర్భ జలాల రీఛార్జ్, వాతావరణ సమతుల్యతకు ఇవి అత్యంత అవసరమని కోర్టు నొక్కి చెప్పింది.కేంద్ర ప్రభుత్వం చెబుతున్నదేంటి? ఆరావళి పర్వత శ్రేణుల భౌగోళిక స్వరూపంపై స్పష్టత కోసమే, వాటికి ఒక నిర్దిష్ట నిర్వచనాన్ని ఇచ్చాం. ఆ పర్వతాల్లో అక్రమ మైనింగ్ జరగకుండా నిలువరించడానికే ఈ చర్యను చేపట్టాం. ఆరావళి పర్వతాలను రక్షించడానికి మా ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఆ పర్వత శ్రేణుల్లో క్షీణించిన ప్రాంతాలను పునరుద్ధరించడానికి మేం ఇప్పటికే 'గ్రీన్ ఆరావళి వాల్' ప్రాజెక్టును మొదలుపెట్టాం. సుప్రీంకోర్టు ఇటీవలే ఆమోదించిన నిర్వచనం ప్రకారం ముందుకు సాగుతాం. 100 మీటర్లు లేదా అంతకంటే ఎక్కువ ఎత్తు కలిగిన ఆరావళి పర్వత శ్రేణులను రక్షిస్తాం. ఆరావళి పర్వత ప్రాంతాల్లో 0.19 శాతం మాత్రమే మైనింగ్కు అనుమతి ఉంటుంది. వాటిలో కొత్త గనులకు మేం అనుమతులు ఇవ్వలేదు. దాదాపు 90 శాతం ఆరావళి పర్వత శ్రేణులకు రక్షణ కొనసాగుతోంది. ఈవిషయంలో ఎలాంటి సడలింపును మేం ఇవ్వలేదు. దీనిపై కొందరు తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నారు'' అని కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ స్పష్టత ఇచ్చారు. जब अरावली बचेगी ..तभी जल, जंगल और जीवन बचेगा !!⛰️#SaveAravalli pic.twitter.com/BYG2bM0IdP— Ronak Choudhary (@Ronak_choudhry) December 19, 2025పర్యావరణవేత్తల ఆందోళన.. ఆరావళి పర్వత శ్రేణుల కొత్త నిర్వచనంలోని 100 మీటర్ల ఎత్తు నిబంధనపై పలువురు పర్యావరణవేత్తలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఆరావళి శ్రేణులలోని దాదాపు 91 శాతం పర్వతాలు 100 మీటర్ల కంటే తక్కువ ఎత్తులోనే ఉన్నాయని చెబుతున్నారు. ఈ కొత్త నిబంధన వల్ల దాదాపు 91 శాతం ఆరావళి పర్వత శ్రేణులు చట్టపరమైన రక్షణను కోల్పోయే ముప్పు ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కేవలం ఎత్తులు, కొలతల ప్రాతిపదికన పర్వత శ్రేణుల లాంటి భారీ పర్యావరణ వ్యవస్థలను నిర్వచించలేమని పర్యావరణవేత్తలు అంటున్నారు. కొండలు, అడవులు, పరీవాహక ప్రాంతాలు అనేవి ఒకదానితో ఒకటి పరస్పరం అనుసంధానితమై ఉంటాయని, వాటిని వేరుచేసి చూడలేమని గుర్తు చేస్తున్నారు. అన్ని ఎత్తుల ఆరావళి పర్వతశ్రేణులతో పాటు వాటి పరిసర ప్రాంతాలను రక్షిత జోన్లుగా పరిగణించాలని పర్యావరణ ప్రేమికులు డిమాండ్ చేస్తున్నారు. 100 మీటర్ల ఎత్తు నిబంధన మైనింగ్, రియల్ ఎస్టేట్, మౌలిక సదుపాయాల నిర్మాణ కంపెనీలకు వెసులుబాటును కల్పించేలా ఉందని ఆరోపిస్తున్నారు. పలు రాష్ట్రాల్లో గత కొన్ని దశాబ్దాలుగా జరుగుతున్న అక్రమ మైనింగ్ వల్ల ఇప్పటికే ఆరావళి పర్వత శ్రేణులు దెబ్బతిన్నాయని అంటున్నారు.గుజరాత్లో నిరసనలుప్రధాని మోదీ సొంత రాష్ట్రం గుజరాత్లోని సబర్కాంత జిల్లాలోనూ ఆరావళి పర్వత శ్రేణులు ఉన్నాయి. 100 మీటర్ల ఎత్తు నిబంధనపై ఈ జిల్లాలోని విజయనగర్లో ఉన్న దద్వావ్ ఏరియా ప్రజలు మండిపడ్డారు. పెద్దసంఖ్యలో స్థానికులు వీధుల్లోకి వచ్చి నిరసన తెలిపారు. తమ ప్రాణాలను త్యాగం చేసైనా ఆరావళిని కాపాడుకుంటామని వారు ప్రకటించారు. తమ సామాజిక, ఆర్థిక, ఆధ్యాత్మిక వారసత్వంలో కీలక భాగమైన ఆరావళి పర్వత శ్రేణులను పరిరక్షించుకుంటామని తేల్చి చెప్పారు. సబర్కాంత జిల్లాలోని మారుమూల ప్రాంతాల ప్రజలు కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. భావి తరాలు ఆరావళి శ్రేణులను పోస్టర్లలో చూసుకోవాల్సిన పరిస్థితిని తేకూడదని సూచిస్తున్నారు. ఈ నిర్ణయాన్ని పునఃపరిశీలించాలని కేంద్ర సర్కారుకు విన్నవిస్తున్నారు.అధ్యయనాలు ఇలా.. ఇక, తాజా విశ్లేషణ ప్రకారం గత ఎనిమిది సంవత్సరాలలో ఆరావళిలో పచ్చదనం క్రమంగా కోతకు గురైంది. వృక్షసంపద దాదాపు మూడింట ఒక వంతు తగ్గింది. దశాబ్దం కంటే తక్కువ కాలంలోనే దాదాపు 11,392 చదరపు కిలోమీటర్ల నుండి 7,521 చదరపు కిలోమీటర్లకు అటవీ ప్రాంతం తగ్గిపోయింది. మరోవైపు.. రాజస్థాన్ సెంట్రల్ యూనివర్సిటీ (CURaj) పరిశోధకులు 1975, 2019 మధ్య ఉపగ్రహ చిత్రాలు అధ్యయనం చేసి అంచనాలను రూపొందించారు. వారు విశ్లేషించిన డేటా ప్రకారం 44 సంవత్సరాల కాలంలో 5772.7 చదరపు కిలోమీటర్లు లేదా ఆరావళి శ్రేణులు దాదాపు 8 శాతం చదును చేయబడ్డాయని పేర్కొంది.సోషల్ మీడియాలో ట్రెండింగ్ #సేవ్ఆరావళిఆరావళి పర్వతశ్రేణుల భద్రతపై భారత ప్రజల ఆందోళన సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. ఎంతోమంది పర్యావరణ వేత్తలు, పర్యావరణ ప్రేమికులు, స్వచ్ఛంద సంస్థల కార్యకర్తలు, న్యాయవాదులు, పర్యావరణ సంస్థలు #సేవ్ఆరావళి హ్యాష్ట్యాగ్తో 'ఎక్స్' వేదికగా ట్వీట్లు చేస్తున్నాయి. శ్రేణుల భద్రతను బలహీనపర్చొద్దని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాయి. ఆరావళికి ఏదైనా జరిగితే తిరిగి పొందలేమని, ఇప్పుడే ఆ పర్వతశ్రేణుల భద్రతకు తగిన చర్యలు తీసుకోవాలని నెటిజన్లు కోరుతున్నారు.ఆరావళికి గండం వస్తే నష్టాలివే.. ఆరావళి పర్వతశ్రేణుల భద్రతకు భంగం కలిగితే, వాటిలోని జీవరాశులు, గిరిజన, ఆదివాసీ జాతుల ఉనికి ప్రశ్నార్థకంగా మారుతుంది. ప్రత్యేకించి ఢిల్లీ, జాతీయ రాజధాని ప్రాంతాలలో గాలి నాణ్యత మరింత తగ్గుతుంది. గుజరాత్, రాజస్థాన్, హర్యానా, ఢిల్లీలలో భూగర్భ జలాలు అడుగంటి నీటి ఎద్దడి ఏర్పడుతుంది. రాజస్థాన్లోని థార్ ఎడారి వేగంగా విస్తరిస్తుంది.All eyes on Aravali …Reminder - Nature belong to everyone #SaveAravalli pic.twitter.com/g5LcSdfQSH— Tsering Gaphel ༅༎ཚིི་ཪིང་དགའ་འཕེལ།། (@Tsering_gaphel) December 24, 2025


