breaking news
Agastya International Foundation
-
ఆవిష్కరణలే లక్ష్యంగా స్కూళ్లలో ప్రత్యామ్నాయ బోధన
సాక్షి, హైదరాబాద్: పాఠశాల స్థాయిలో నిరంతరం మారుతున్న బోధన పద్ధతులతో పాఠ్యాంశాల్లో విద్యార్థులను విలీనం చేయడం ద్వారా సృజనాత్మకతకు మరింత పదును పెట్టే అవకాశం ఏర్పడుతుందని ఐటీ, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్ అన్నారు. కొత్త విద్యా విధానానికి అనుగుణంగా కామారెడ్డి జిల్లాలో నవమ్ ఫౌండేషన్ ఏర్పాటు చేయడానికి అగస్త్య ఇంటర్నేషనల్ ఫౌండేషన్ ముందుకు రావడంపై హర్షం వ్యక్తం చేశారు. నవమ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నడిచే ఇన్నోవేషన్ ల్యాబ్, సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (ఐఎల్సీఈ) ఏర్పాటుకు సంబంధించి తెలంగాణ స్టేట్ ఇన్నోవేషన్ సె ల్ (టీఎస్ఐసీ)తో మంగళవారం పరస్పర అవగాహన ఒప్పందం కుదిరిన సందర్భంగా జయేశ్ మాట్లాడారు. క్షేత్రస్థాయిలో విద్యార్థులు, ఉపాధ్యాయులను ఆవిష్కరణల దిశగా ప్రోత్సహించేందుకు ఈ ఒప్పందం దోహదం చేస్తుందని జయేశ్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఐఎల్సీఈ ఏర్పాటు కోసం టీఎస్ఐసీ, నవమ్ ఫౌండేషన్ భాగస్వామ్యం రాష్ట్రంలో ఆవిష్కరణల సంస్కృతి, ఎంట్రప్రెన్యూర్షిప్కు బాటలు వేస్తుందని టీఎస్ఐసీ సీనియర్ సలహాదారు వివేక్ వర్మ తెలిపారు. ప్రవాహ, టీఎస్ఐసీ భాగస్వామ్యంతో ఏర్పాటయ్యే ప్రాజెక్టు లో తాము భాగస్వాములు కావడం పట్ల అగస్త్య ఇంటర్నేషనల్ ఫౌండేషన్ చైర్పర్సన్ రామ్జీ రాఘవ న్ హర్షం వ్యక్తం చేశారు. సృజనాత్మక, ఆవిష్కరణల వాతావరణంలో క్షేత్రస్థాయి నుంచి అందరినీ భాగస్వాములను చేస్తూ తెలంగాణ సాధించే ఫలితాలు ఇతర రాష్ట్రాలకు స్ఫూర్తిగా నిలుస్తాయని ప్రవాహ ఫౌండేషన్ చైర్మన్ రవి కైలాస్ చెప్పారు. 15 ఎకరాల్లో ఐఎల్సీఈ ఏర్పాటు.. రాష్ట్రంలో వికేంద్రీకరణ ద్వారా ఆవిష్కరణల వాతావరణాన్ని ప్రోత్సహించే దిశగా టీఎస్ఐసీ ముందడుగు వేసింది. కామారెడ్డి జిల్లాలో 15 ఎకరాల్లో ఏర్పాటయ్యే ‘నవమ్ ప్రాంగణం’లో ఇన్నోవేషన్ ల్యాబ్, సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటు చేసేందుకు అగస్త్య ఇంటర్నేషనల్ ఫౌండేషన్తో మంగళవారం ఒప్పందం కుదుర్చుకుంది. అగస్త్య ఇంటర్నేషనల్ ఫౌండేషన్, ప్రవాహ ఫౌండేషన్ సంయుక్తంగా వచ్చే పదేళ్లలో రూ.3 వేల కోట్లు పెట్టుబడి పెట్టాలని నిర్ణయించాయి. నిజామాబాద్, కామారెడ్డి, మెదక్, సిరిసిల్ల జిల్లాల పరిధిలోని 11 నుంచి 18 ఏళ్ల వయసు లోపు విద్యార్థులు, 19 నుంచి 25 ఏళ్ల మధ్య వయసున్న యువతకు అవసరమైన శిక్షణ, ప్రోత్సాహం ఐఎల్సీఈ ద్వారా అందుతుంది. ఈ క్యాంపస్ పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చిన తర్వాత మినీ సైన్స్ సెంటర్లు, డోర్ టు డోర్ సైన్స్ ల్యాబ్లు, ఉపాధ్యాయులకు శిక్షణ వంటి వనరులను అందుబాటులోకి తెస్తుంది. క్షేత్రస్థాయిలో ఎంట్రప్రెన్యూర్లుగా మారాలనుకునే యువతకు ఫెలోషిప్ ప్రోగ్రామ్లను కూడా అందజేస్తుంది. వచ్చే మూడు నుంచి ఐదేళ్లలో పూర్తి స్థాయిలో అందుబాటులోకి రానుంది. -
నేడు సీఎం చంద్రబాబు రాక
చిత్తూరు (జిల్లాపరిషత్): రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబునాయుడు సోమవారం జిల్లాకు రానున్నట్టు జిల్లా కలెక్టర్ రాంగోపాల్ ఒక ప్రకటనలో తెలిపారు. చంద్రబాబు నాయుడు ఉదయం 7.30 గంటలకు హైదరాబాద్లోని తన నివాసం నుంచి బయలుదేరి 8.10 గంటలకు శంషాబాద్ విమానాశ్రయం చేరుకుంటారు. అక్కడి నుంచి 9.40 గంటలకు బెంగళూరు విమానాశ్రయానికి చేరుకుంటారు. 9.50 గంటలకు హెలికాప్టర్ ద్వారా బయలుదేరి 10.15 గంటలకు రామకుప్పంలోని కల్కి ఆశ్రమానికి చేరుకోనున్నారు. 10.30 గం టలకు రామకుప్పం జూనియర్ కళాశాల భవనాన్ని ప్రారంభించనున్నారు. 10.35 గంటలకు ఆదర్శ పాఠశాల భవనానికి శంకుస్థాపన చేసిన అనంతరం 10.45 గంటలకు రామకుప్పం పోలీస్స్టేషన్ వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. 11.30 గంటలకు రామకుప్పం నుంచి బయలుదేరి కంచనబల్లకు చేరుకుని మాజీ సర్పంచ్ నారాయణ ఇంటికి వెళ్లనున్నారు. 11.50 గంటలకు కంచనబల్ల నుంచి బయలుదేరి 12.30 గంటలకు శాంతిపురం చేరుకుని అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. అనంతరం శాంతిపురం ఎంపీడీవో కార్యాలయానికి చేరుకుంటారు. 2.05 గంటలకు అగస్త్య ఇంటర్నేషనల్ ఫౌండేషన్ వారి బస్సును ప్రారంభించనున్నారు. అనంతరం శాంతిపురం, కుప్పంలో జిల్లా ఫౌరసరఫరాల సంస్థచే నిర్మించిన అదనపు గోడౌన్లను ప్రారంభించనున్నారు. 2.20 గంటలకు పీఎంజీఎస్వై నిధులతో చేపట్టనున్న రోడ్డుకు శంకుస్థాపన చేస్తారు. 3 గంటలకు గుడుపల్లెకు చేరుకుని బహిరంగ సభలో పాల్గొంటారు. 4.30 గంటలకు కుప్పం చేరుకుని ఎన్టీఆర్ కూడలి వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగిస్తారు. సాయంత్రం 6 గంటలకు కుప్పం ఎంపీడీవో కార్యాలయంలో జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. రాత్రి 7 గంటలకు అక్కడి నుంచి బయలుదేరి పీఈఎస్ మెడికల్ కళాశాలలో జరగనున్న హౌస్హోల్డ్ అబ్జర్వర్స్ మీటింగ్లో పాల్గొంటారు. అనంతరం 9 గంటలకు ఆర్అండ్బీ అతిథి గృహానికి చేరుకుని రాత్రికి అక్కడే బస చేయనున్నారని కలెక్టర్ రాంగోపాల్ తెలిపారు.