
రాహుల్ ప్రధాని అభ్యర్థిత్వంపై వాడివేడి చర్చ!
కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రధాని అభ్యర్థిత్వంపై వాడివేడిగా చర్చ కొనసాగుతోంది.
ఢిల్లీ: కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రధాని అభ్యర్థిత్వంపై వాడివేడిగా చర్చ కొనసాగుతోంది. బీజేపీ తమ ప్రధాని అభ్యర్థిగా గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీని ప్రకటించి ముందంజలో ఉండగా , కాంగ్రెస్ పార్టీ ప్రధాని అభ్యర్థి విషయంలో మల్లగుల్లాలు పడుతోంది. రాహుల్ ను ప్రధానిగా ప్రకటించాలా?వద్దా?అనే అంశంపై సందిగ్ధత నెలకొంది. కాగా రాహుల్ మాత్రం ఏ బాధ్యతనైనా చేపట్టేందుకు సుముఖంగా ఉన్నట్లు ఇప్పటికే ప్రకటించారు. ఈ నేపథ్యంలో ప్రధాని మన్మోహన్ సింగ్ నివాసంలో బుధవారం కాంగ్రెస్ కోర్ కమిటీ మరోసారి సమావేశమైంది.
ఈ భేటీకి రాహుల్ తో పాటు, ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, సుశీల్ కుమార్ షిండే, ఏకే ఆంటోనీ, అహ్మద్ పటేల్ సమావేశమైయ్యారు. జనవరి 17వ తేదీ శుక్రవారం జరుగునున్నఏఐసీసీ భేటీలో కాంగ్రెస్ ప్రధాని అభ్యర్థిని ప్రకటిస్తారు. దీంతో ఈ రోజు జరిగే భేటీకీ ప్రాధాన్యత సంతరించుకుంది. కోర్ కమిటీ భేటీలో రాహుల్ కు అప్పగించే బాధ్యతలపై కాంగ్రెస్ పెద్దలు నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.