ఎంత పని జేస్తివే యాదన్నా..!
హైదరాబాద్: అసెంబ్లీ లాబీల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఇటీవలే ఆ పార్టీ నుంచి అధికారపక్షంలోకి మారిన చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య మధ్య ఆసక్తికరమైన చర్చ జరిగింది. పార్టీ ఫిరాయింపులపై చర్చకు కాంగ్రెస్ ఇచ్చిన వాయిదా తీర్మానం విషయంలో సోమవారం ఉదయమే సభ రెండుసార్లు వాయిదా పడింది. రెండోసారి వాయిదా తర్వాత కాంగ్రెస్ ఎమ్మెల్యేలంతా కలిసి సీఎల్పీ నేత జానారెడ్డి చాంబర్ నుంచి సభలోకి వెళుతుండగా, సరిగ్గా అదే సమయానికి కాలె యాదయ్య ఎదురయ్యారు.
దీంతో కాంగ్రెస్ ఎమ్మెల్యేలంతా ఒక్కసారిగా.. ‘అన్నా.. యాదన్నా ఎంతపని జేస్తివే..’ అని వ్యాఖ్యానించారు. డికె అరుణ, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, రాంరెడ్డి వెంకటరెడ్డి, మల్లు భట్టివిక్రమార్క తదితరులు యాదయ్యతో మాట్లాడుతూ కనిపించారు. ‘శనివారం కూడా చెప్పా కదన్నా..’ అని భ ట్టి అన్నారు. అయితే, అందరు మాట్లాడినా కూడా ఎమ్మెల్యే యాదయ్య మాత్రం చిరునవ్వులు చిందిస్తూ ఉన్నారే తప్ప.. నోరు తెరిచి ఒక్కమాటా మాట్లాడలేదు.