వివాహితను వేధిస్తున్న పోకిరీలు | two youth arrested for harassing married woman | Sakshi
Sakshi News home page

వివాహితను వేధిస్తున్న పోకిరీలు

Sep 26 2015 3:01 PM | Updated on Sep 3 2017 10:01 AM

మూడు రోజులుగా వివాహితను వేధిస్తున్న యువకులకు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించిన సంఘటన నిజామాబాద్‌లోని నందిపేటలో శనివారం జరిగింది.

నిజామాబాద్ : మూడు రోజులుగా వివాహితను వేధిస్తున్న యువకులకు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించిన సంఘటన నిజామాబాద్‌లోని నందిపేటలో శనివారం జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. ఓ వివాహిత రోజూ నందిపేట నుంచి నవీపేట మండలంలోని ఓ ప్రైవేటు స్కూల్‌కు వెళ్లి వస్తున్న క్రమంలో ముగ్గురు యువకులు వేధింపులకు పాల్పడుతున్నారు. దీంతో ఈ విషయాన్ని ఆమె శుక్రవారం ఇంట్లో వాళ్లకు చెప్పింది. వారు ఆమెకు ధైర్యం చెప్పి... శనివారం ఉదయం ఆమెను అనుసరించారు. ఎప్పటి మాదిరిగా ఆ యువకులు దారిలో ఆమెను వేధించసాగారు. దీంతో ఆమె సంబధీకులు ముగ్గురు యువకులను పట్టుకుని దేహశుద్ధి చేశారు. ఈ ఘటనతో ఇరువైపుల వారి మధ్య వాగ్యుద్ధం మొదలైంది.

సుమారు 200 మందికిపైగా అక్కడ పోగయ్యారు. ఎస్‌ఐ జాన్‌రెడ్డి అక్కడకు చేరుకోగా ఇరు వర్గాల మధ్య తోపులాటలో ఆయన కింద పడిపోయారు. పోలీసులు వేధింపులకు పాల్పడిన ముగ్గురిలో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. మరో వ్యక్తి పరారయ్యాడు. గణేశ్ నిమజ్జనం సమయం కావడం, ఇరు మత వర్గాల మధ్య ఘర్షణ తలెత్తడంతో జిల్లా ఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డి, డీఎస్పీ ఆకుల రాంరెడ్డి నందిపేటకు చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ఇరువైపుల వారికి సర్దిచెప్పే ప్రయత్నం మొదలుపెట్టారు. మరోవైపు ఈ ఘటన తర్వాత ఓ వర్గం వారు స్థానికంగా బంద్‌కు పిలుపునిచ్చారు. 100 బైక్‌లపై ర్యాలీ చేస్తూ షాపులను మూసివేయించారు.

Advertisement
 
Advertisement
Advertisement